Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

స్వేచ్ఛాగీతం

[మోహిత కౌండిన్య గారు వ్రాసిన ‘స్వేచ్ఛాగీతం’ అనే పెద్ద కథని అందిస్తున్నాము. వీర సావర్కర్ అండమాన్ జైల్లో గడిపిన కాలంలో, ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసిన కథ ఇది.]

1. నరకపు ద్వారం

1911, జూలై 4.

మబ్బులు కమ్ముకున్న ఆకాశం. సముద్రం ఉగ్రరూపం దాల్చినట్లుగా విరుచుకుపడుతున్నది. నాలుగు రోజుల క్రితం మద్రాసులో లంగరెత్తిన ఎస్సెస్ మహారాజ నౌక అండమాన్ దీవుల దక్షిణపు ఒడ్డుని చుడుతూ పోర్ట్ బ్లెయిర్ తీరం వైపు పయనిస్తున్నది.

నౌక క్రిందిభాగంలో జంతువులను మందలుగా కట్టేసినట్టు ఒక ఇనుప పంజరంలో అపరాధులని కుక్కేశారు. దాదాపు అందరూ నిద్రలో జోగుతున్నారు. గుండుసంకెళ్లకు కాళ్లప్పగించి, ఎదుట అనంతంగా విస్తరించిన సముద్రానికి కళ్లప్పగించి వినాయక్ ఒంటరిగా నిలబడి ఉన్నాడు. అతడి మనసు వేదనలో మునిగిపోయింది. ఆ స్టీమర్లోకి ఎక్కితే సజీవంగా ఉన్న మనిషిని శవపేటికలో పెట్టినట్లే. ఇంతవరకూ వేలాదిమంది అండమాన్ దీవులకు తరలించబడ్డారు, కాని వారిలో ఒకటోవంతు మంది కూడా తిరిగి భారత భూభాగాన్ని చూడలేదు! పద్దెనిమిదేళ్ల యువకులు ఆ నౌకపై అడుగు పెట్టిన వెంటనే వృద్ధులుగా మారిపోతారు. వారి ముఖాల్లో మరణఛాయలు ప్రత్యక్షమవుతాయి. ఒక మృతదేహానికి జరిగే అవసాన క్రియలను చూస్తున్నట్టు బాధ, శూన్యత, స్తబ్ధతతో వినాయక్‌ని స్టీమర్లోకి ఎక్కిస్తున్నప్పుడు జనసముదాయం అలాగే నిర్జీవంగా, నిశ్చేష్టంగా చూసింది. ఇక తాను మరణశయ్యపై పడుకున్నట్టే. తేడా ఒక్కటే – శవానికి ఏమీ తెలియదు, తనకు మాత్రం అన్నీ విస్పష్టంగా తెలుస్తున్నాయి. మెడలో ‘ఖైదీ సంఖ్య 32778, ఖైదు కాలం 50 సం||, ఆంగ్ల అక్షరం ‘డి’’ అని రాసి ఉన్న ఇనుపబిళ్ల ఉంది. అర్ధశతాబ్దం పాటు తాను పవిత్ర దేశమాతను చూడకుండా ఎలా ఉండగలడు?!

“సముద్రుడా..!
నన్ను నా మాతృభూమికి తిరిగి తీసుకువెళ్లు ఓ సముద్రుడా,
నా ప్రాణం గిజగిజలాడుతున్నది..!”

భారంగా ఊపిరి పీల్చుకున్నాడు. స్వదేశం దూరమైంది కాని అతడి హృదయం మాత్రం భారతమాత సన్నిధిలోనే ఉంది. తనకేవో దేశ రహస్యాలను చెప్పబోతున్న ఈదురుగాలికి ముఖం కలిపి ముక్తకంఠంతో పాడసాగాడు.

“గతి తప్పక ఆ తల్లి పాదాలను అహరహం కడిగే నువ్వు..
నన్నెందుకీ తీరానికి చేర్చావు?
నీ నదులని నీలోనే దాచుకుంటావు..
మరి, నా భూమినుంచి నన్నెందుకు వేరు చేశావు?
నా ప్రాణం గిజగిజలాడుతున్నది..!
దేశమే నా ఆలయం, స్వాతంత్ర్యమే నా దీక్ష,
ఆ స్వేచ్ఛను నన్ను చేరనివ్వు, ఓ సాగరా..!”

సముద్రపు ఉక్కపోతగల గాలి, ఆకాశమంత నలుపుగా అండాకారంలో అండమాన్ ద్వీపం. ఉధృతమైన అలలు చిన్న పడవను ముందుకు సాగనివ్వకుండా చెళ్లుచెళ్లున ఎగిసిపడుతున్నాయి. ఒడ్డుకి చేరేందుకు ఖైదీలను పడవలోకి తరలించారు. వారిలో ఒకడు వినాయక్ దామోదర్ సావర్కర్ – భారతీయుడు, బారిష్టరు, పెన్నుతో, గన్నుతో విజృంభించి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన మరాఠీ విప్లవకవి.

***

భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక శకం ముగిసి మరొకటి ప్రారంభమైంది. వినాయక్‌ను కాలాపానీ అనే నరకానికి తెచ్చారు.

‘సిల్వర్ జైలు’ అని స్థానీయంగా పిలువబడే భయంకరమైన సెల్యులర్ జైలు గేట్లు కర్రుమంటూ నెమ్మదిగా తెరుచుకున్నాయి. ముంగిట్లో వానచినుకులు నేలపై ముద్రవేశాయి. ‘ఈ మట్టిలో స్వేచ్ఛాబీజాలు మొలిచే రోజు వస్తుంది!’ అని వినాయక్ హృదయం దృఢంగా పలికింది.

దుర్భేద్యమైన గోడలను కలిపే ద్వారం ఎదుట కొత్తగా వచ్చిన పడవలోని ఖైదీలు గుమిగూడారు. బరువైన కాలిబండలు – భుజాలకు తగిలించే ఇనుప పట్టీలు – తుపాకులు – బాయ్ నెట్లు – కొక్కేల గొలుసులు – చేతులకు వేసే బేడీలు – కర్కశ హింసాగారానికి తగిన ఇంకా అనేక రకాల హింసా సాధనాలు వరుసలుగా ఆ గోడకు వేలాడుతూ భీకరంగా కనిపిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా విప్లవోద్యమాల చరిత్రను ప్రతిబింబించే అనేక గ్రంథాలు, స్వాతంత్ర్య సంగ్రామ వీరుల ఆత్మకథలు వినాయక్ చదివినపుడు ఆ గ్రంథాలలోని వర్ణనల వలన అక్కడి జైళ్లు ఎంత హృదయవిదారకంగా ఉంటాయో ఊహించుకునేవాడు. ఈ క్షణంలో తన ఎదుట ఉన్న ఈ దృశ్యం వాటిని నిజమైన రూపంలో ప్రతిబింబిస్తున్నది. ఖైదీల గుండెల్ని బేజారెత్తించడానికి తొట్టతొలి సాధనం ఈ గోడ.

“వీడీ సావర్కర్!” జైలు అధికారుల గర్జన. గంభీరంగానే కాని శాంతంగా చూపు ఎత్తాడు వినాయక్. కాళ్లకున్న గుండుసంకెళ్లతో కదలలేక; రజాయి, సత్తుచెంబు, పళ్లెం ఉన్న మూటని నెత్తిమీద చేతులతో పట్టుకుని స్థిరంగా నిలవలేక తూగిపోతున్న సావర్కర్‌ని ఇద్దరు సిపాయిలు ఊతమిచ్చి గుంపు నుండి వేరుగా నిలబెట్టారు.

జైలర్ డేవిడ్ బ్యారీ కఱకు కంఠం స్వాగతం పలికింది – “బారిష్టరీ చదివావుట. బంగారు భవిష్యత్తుకు కలలు కంటున్న యువకుడివి. ఇప్పుడు నిష్క్రమణ లేని నరకంలో బంధించబడ్డావు. ఇక నువ్వు బ్రిటిష్ సామ్రాజ్యానికి చీకటిచరిత్రవే!”

సిల్వర్ జైల్లో డేవిడ్ బ్యారీ జైలర్‌గా ఉన్న కాలం స్వాతంత్ర్య  ఉద్యమాన్ని అణచివేయడానికి తెల్ల ప్రభుత్వం ఉపయోగించిన దమనచర్యలకు ఉదాహరణగా నిలుస్తుంది. దేశంలోని అనేక కారాగారాల్లో బ్యారీవంటి జైలర్ల తీరు స్వాతంత్ర్య సమరయోధులు ఎదుర్కొన్న కష్టాలను స్పష్టంగా గుర్తు చేస్తుంది.

సావర్కర్ నవ్వుతూ బ్యారీ వంక నిశ్చలంగా చూశాడు. “నా శరీరాన్ని బంధించగలరు కాని నా ఆత్మను కాదు. చూస్తూ ఉండండి, చీకటిలో కూరుకుపోయేది నా పేరో బ్రిటిష్ తలపొగరో!” అన్నాడు.

బ్యారీ తన కళ్లను అరమూసి తీవ్రంగా అన్నాడు “నిన్ను హెచ్చరిస్తున్నాను సావర్కర్ – ఇక్కడి నుండి పారిపోవాలని ప్రయత్నిస్తే, భయంకరమైన ప్రమాదంలో పడతావు. ఈ జైలును చుట్టుముట్టి కీకారణ్యాలు, ప్రవేశించ వీలులేని దట్టమైన అటవీ ప్రాంతం విస్తరించి ఉన్నాయి. ఆ అడవుల్లో అత్యంత క్రూరులైన అడవిమనుషులు ఉంటారు. వాళ్లు నరమాంస భక్షకులు. వారి చేతికి చిక్కావా, ఇక నీ పని అంతే. చిటికెలో చంపేసి, నీ మృదువైన యువకాయాన్ని మనం దోసకాయలు తిన్నంత తేలికగా తినేస్తారు. వారిని తప్పించుకొని జైలుకి తిరిగివచ్చావో, నాలోని రాక్షసుణ్ణి చూస్తావు. ఎటూ కాదని నీ దారిన నువ్వు దేశానికి పోదామనుకుంటే నువ్వు ఈదగలిగిన సముద్రం కాదు ఇది! ఈ నరకం నుంచి వచ్చినట్టే తిరిగి వెళ్లినవాళ్లెవ్వరూ లేరు! ఏమి జమాదార్, నేను చెప్పింది సత్యమేనా.”

“చిత్తం. అయ్యగారు చెప్పినదాంట్లో ప్రతి మాట సత్యమేనండీ” జమాదారు వంత పాడాడు.

“మీరు చెబుతున్నవన్నీ నేను బాగా ఎరుగుదును. ఎందుకంటే నన్ను అండమాన్‌కు పంపించబోతున్నారని తెలిసిన మరుక్షణం నేను తెప్పించుకుని చదివిన మొదటి పుస్తకం, ఈ దీవులపై ప్రభుత్వ నివేదిక. పోర్ట్ బ్లెయిర్ మార్సెయి కాదని నాకు పూర్తిగా తెలుసు” గర్వంగా బదులిచ్చాడు సావర్కర్.

బ్యారీ బాబాకు ఎదురు మాట్లాడినందుకు తొమ్మిది తోకల కొరడా వీపుని తొమ్మిదిచోట్ల సర్రున చీల్చింది. వానచుక్కల్లో కలిసి నెత్తుటి చుక్కలు కారిపోయాయి. ‘డి’ తరగతి ఖైదీగా గుంపునుండి వేరు చేశారు. అంటే, సాధారణ ఖైదీ కాదు, రాజఖైదీ కాదు – డేంజరస్ – ప్రమాదకారి ఖైదీ! భారత స్వాతంత్ర్య సమరంలో సమిధలైన మిగతా ఖైదీలు అతడినే చూస్తున్నారు.

“సావర్కర్ గారూ!” ఒక మధ్యవయస్కుడు కళ్లలో నీళ్లతో బేలగా పలకరించాడు.

“మీరు కూడానా?” మరో యువకుడు ఆవేదనతో అడిగాడు.

సావర్కర్ తన చుట్టూ పరిశీలించి, రవంత ఆగి, గర్జించాడు, “ఈ సంకెళ్లు మనను బంధించవచ్చునేమో కాని మన సంకల్పాన్ని ఛేదించలేవు! స్వేచ్ఛ కోసం చేసే మన పోరాటం ఎప్పటికీ నిశ్శబ్దమవదు!”

ఆ మాటతో, సావర్కర్ రాకతో, ఖైదీల హృదయాల్లో ఓ భరోసా నిండింది. కాని సంకుచితమైన జైలుగోడలు అన్నివైపుల నుండి మరింత దగ్గరయ్యాయి. మూడవ అంతస్తులో కుడివైపున చివరి గదిలో ఆరు నెలల ఏకాంత నిర్బంధం. సాక్షాత్తు నరకం – సెల్యులర్ జైలు!

‘నా దేశాన్ని తెల్లదొరల బారి నుండి విముక్తం చేయడానికి నేను ఇక్కడి నుండి తిరిగి వెళ్లగలను.. లేదా.. నా ఆత్మ నా పోరాటాన్ని కొనసాగిస్తుంది!’ అని తనలో తానే భీషణప్రతిజ్ఞ చేసుకున్నాడు వినాయక్.

***

1883, మే 28న మహారాష్ట్రలోని భగూర్ గ్రామంలో, వినాయక్ (తాత్యారావు) జన్మించాడు. తండ్రి దామోదర్ పంత్, తల్లి రాధాబాయి. సావర్కర్‌కు ఒక అన్న గణేశ్ (బాబారావు), ఒక తమ్ముడు నారాయణ్, ఒక చెల్లెలు మైనా ఉన్నారు. చిన్నతనం నుండే అన్నదమ్ములందరిలో దేశభక్తి పట్ల ఆసక్తి పెరిగింది. 1897లో, పద్నాలుగేళ్ల వయసులో, సావర్కర్ తన గ్రామంలో జరిగిన హిందూ-ముస్లిం ఘర్షణల సమయంలో, హిందూ సమాజాన్ని రక్షించేందుకు ముందుకు వచ్చాడు. 1904లో వినాయక్ అతని అన్న బాబారావులు కలిసి ‘మిత్ర మేళా’ అనే గుప్తసంఘాన్ని స్థాపించారు. ఇది తరువాత ‘అభినవ భారత్ సొసైటీ’గా మారింది.

2. విసిరివేయబడ్డ సోదరులు

సెల్యులర్ జైలు – కాలాపానీ! శిక్షితుల కోసమే కట్టిన నివాస స్థలం! ఇరుకు గదుల బందిఖానా! స్వేచ్ఛ కోసం పోరాడిన యోధుల కోట ఇది. ఇరవై నాలుగు అడుగుల ఎత్తయిన గోడలు, మధ్యలో కాపలా బురుజు. దాని చుట్టూరా నేలబారు సూర్యకిరణాల్లా ఏడు పొడవాటి కట్టడాలు. మూడంతస్తుల ఆ భవనాల్లో ఒక్కో ఖైదీకి ఒక్కో గది. ఏ ఒక్క గదీ మిగతా దేనికీ ఎదురు బొదురు ఉండదు. ఆరువందల తొంభై ఎనిమిది మందిని ఒకేసారి ఖైదు చేయగలిగిన స్థూల కారాగారం. అంతస్తుకో ఏకాంత కారావాసం. గేటు తాళం తీసి లోపలికి లాగినప్పుడల్లా, ఒక కొత్త ఖైదీని మింగేందుకు సిద్ధంగా ఉన్న యమపాశంలా అది భయంకరమైన శబ్దం చేసేది!

1896లో నిర్మాణం మొదలై మూడేళ్లలో పూర్తికావలసిన జైలు సెల్యులర్ రూపంలోకి పూర్తిగా రావడానికి పదేళ్లు పట్టింది. కట్టకమునుపే కొన్ని వేలమంది నిందితులను, పోరాటవీరులను బలికొంది ఈ సుదూర కారాగారం. కాలనీ విస్తరించేకొద్దీ, భయంకరమైన నేరస్థులను అఖండ భారతదేశం-బర్మాల నుండి ఇక్కడకు తరలించారు. క్రూరమైన జమాదార్లు, పర్యవేక్షకుల అదుపులో కఠోరశ్రమకు గురైన ఖైదీలే ఇక్కడి మౌలిక వసతులను నిర్మించారు. అధికారుల కోసం భారీ బంగ్లాలు, సైనికుల కోసం బారక్కులు, బందీలకు జైలు, మార్పు చెందనివారిని ఉరితీయడానికి ఒక భీతావహమైన బలివేదిక – ఇవన్నీ రాస్, వైపర్ ద్వీపాలపై ఏర్పాటు చేశారు. ఛాతమ్ ద్వీపంలో చెక్కమిల్లు భవననిర్మాణానికి అవసరమైన మ్రానును అందించగా, అక్కడే ఖైదీలు బట్టీలలో ఇటుకలని, సున్నాన్ని తయారు చేసేవారు. కటకటాలు, సంకెళ్లు, చెరసాల గొలుసులు, శిక్షా స్తంభాలు, నూనె గానుగలు – ఇవన్నీ నేరుగా ఇంగ్లాండ్ నుండి వచ్చి చేరాయి.

అన్నిటికంటె పైఅంతస్తులో ఉన్న తన గది ఊచల్లోంచి దూరంగా కనబడే రావిచెట్టుతో హిందుత్వం గురించిన ఎన్నో గంభీరమైన చర్చలు చేసేవాడు సావర్కర్. చూపు మరల్చితే కనబడే ఉరికొయ్యలకు వ్రేలాడే నల్లటి ముసుగుల రక్తసిక్త నగ్న శరీరాలను చూసినప్పుడల్లా గుండె గొంతుకలో కొట్టుకులాడేది.

***

ఒకే చోట – ఒకే జైలు – కాని రెండు వేర్వేరు విభాగాలు.

ఒక విభాగంలో వినాయక్ సావర్కర్, మరో బ్లాకులో అతని అన్న బాబారావు సావర్కర్. జైలుకి చేరుకున్న ఎన్నో నెలల తరువాత ఈ విషయం తెలిసి అనురాగం ఉవ్వెత్తున ఎగసిపడింది. తన అన్నను కలుసుకోవాలని తాత్యా చేసిన ఎన్నో వేడికోళ్ల అనంతరం, కారాగార సిబ్బంది మొత్తానికి ఒక అవకాశం ఇచ్చారు.

ప్రతిరోజూ పనిగంటలు ముగిశాక ఖైదీలను జైలుమధ్యలో ఉండే గడియార స్తంభం వద్ద గుంపులుగా నిలబెడతారు. ఆ దినానికి వారికి అప్పగించిన పనిని సరిగా చేశారో లేదోనని అంచనా వేస్తారు. ఒక బృందం ఇంకా అక్కడ ఉన్నప్పుడే, రెండో బృందం వెనుకగా నిలబడి తమ వంతు కోసం ఎదురు చూసేది. దీన్ని ఆసరాగా తీసుకుని తాత్యారావు ఒక శుభసాయంకాలాన తన అన్నను కలవగలిగాడు. చివరిసారిగా 1906లో ముంబయి ఓడరేవులో వీరిద్దరూ కలుసుకున్నారు. అప్పుడు వినాయక్ బారిస్టరుగా మారేందుకు ఇంగ్లాండ్ వెళుతున్నాడు. ఇప్పుడు, 1911లో – పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో – అన్నదమ్ములు ఎదురయ్యారు.

“తాత్యా!” ఖైదీ దుస్తుల్లో తమ్ముడిని చూసి దుఃఖంతో బాబారావు స్వరం.

“అన్నా!” మనసు మెత్తబడిపోయిన తాత్యారావు స్వరం.

“ఇదేనా మన గమ్యం?” బాబా నిట్టూర్పు.

“ఇది గమ్యం కాదు, అన్నా. ఇది తొలి అడుగు!” తాత్యా ఊరడింపు.

“మన ఆశయాలు బ్రిటిష్ గోడల మధ్య నలిగిపోతాయా?” బాబా సందేహం.

“వర్తమానం నలిగినా, భవిష్యత్తు చెక్కు చెదరదు!” తాత్యా భరోసా.

బాబారావు కన్నీటి గుటక వేస్తూ అన్నాడు, “మన మాటలు చరిత్రగా మారతాయి!”

వినాయక్ స్పందించక ముందే, వార్డెన్ ఇద్దరినీ వేరుచేశాడు. కాపలాబురుజు తలుపులు మెల్లగా మూసుకుపోయాయి. కాని ఆ గోడల వెనుక ఓ విప్లవం ఎదుగుతున్నది! ఈ ఇద్దరు కారాగుప్తుల సంకల్పం త్వరలో బ్రిటిష్ రాజ్యానికి అల్లకల్లోలం కలిగించబోతున్నది.

“ఈ జైలు మనల్ని విడదీసినా, మన నిరత సంకల్పాన్ని త్రుంచివేయలేదు!” అంటూ తాత్యా తల పైకెత్తి, గట్టిగా గానం చేశాడు –

“ఆకాశానికి నక్షత్రాలెన్నో..
కాని నా హృదయానికి భారతభూమే ధ్రువతార..!
జై భారత సంధాత్రీ! వీరపుత్ర జనయిత్రీ!”

ఆ చీకటికొట్ల మధ్య ఈ గీతం మెత్తటి వెలుగులా మొదలై కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుతురై వ్యాపించింది.

***

అన్నదమ్ముల ఈ తాత్కాలిక కలయిక తరువాత, ఎట్టకేలకు బాబారావు ఒకనాడు వినాయక్‌కి ఒక రహస్య సందేశం పంపించగలిగాడు. ఆ చీటీలో ఇలా రాశాడు:

“నీ విజయమే నా ప్రేరణ, నా ఓర్పుకు అదే ఆధారం. నా త్యాగం వల్లనైనా, నువ్వు భారత్ కోసం ముందుకు సాగుతావని భావించాను. కాని నువ్వు పారిస్‌లో ఎలా పట్టుబడ్డావు? మన త్యాగం ఏమైంది? మన సొసైటీని ఇప్పుడు ఎవరు చూసుకుంటారు? ఇదంతా నమ్మలేకపోతున్నాను.. నువ్వు ఇక్కడకు ఎలా వచ్చావు?”

తాత్యాకు సమాధానం రాయడం అత్యంత కష్టంగా అనిపించింది. తన బాధను దాచుకుని, అన్నను ఓదార్చాలి అనే బాధ్యతతో జవాబు పంపాడు:

“బాబా! విజయం, పరాజయం ఇవన్నీ కాలచక్రంలో చిన్నపాటి సంఘటనలు మాత్రమే. మన తొలి యుద్ధంలో ఓడిపోతే అది మన తప్పు కాదు. ఓటమిని ఎదుర్కొని కూడా నిలబడగలగడం, అదే అసలు సాహసం! ఇతరులను త్యాగానికి ప్రేరేపించిన మనమే, నేడు ఇదే బాధను అనుభవిస్తున్నామంటే గర్వించాలి! ఇక్కడ శిక్షను అనుభవిస్తూ, మన దేశంకోసం ఆలోచించడమే ఇకపై మన జీవితలక్ష్యం. మనపై నిందలు వచ్చినా సరే, అవమానాన్ని స్వీకరించి తలెత్తి నిలబడాలి. స్వంత కుటుంబానికి కూడ తెలియకుండా దేశంకోసం ప్రాణత్యాగం చేయడం గొప్పదే! కాని ఆత్మబలంతో పోరాడి విజయులై ప్రఖ్యాతి పొందడం కూడ అంతే గొప్పది. మనం అక్కడ లేనంత మాత్రాన స్వాతంత్ర్యపోరాటం ఆగిపోదు. ఈ విప్లవానికి అసంఖ్యాక యోధులు ఉన్నారు, మన లోటు ఈ యుద్ధాన్ని ఆపలేదు!”

తాత్యారావు సమాధానం బాబారావుకు కొత్త ఆశను, ధైర్యాన్ని ఇచ్చింది.

***

1906లో, సావర్కర్ లండన్ వెళ్లి, ఇండియా హౌస్, ఫ్రీ ఇండియా సొసైటీ వంటి సంస్థలతో కలసి పనిచేశాడు. అక్కడ విద్యనభ్యసించే రోజుల్లోనే, బ్రిటిష్ దోపిడీ గురించి తెలుసుకుని, ఇతర విద్యార్థులకు ఆ విషయాన్ని వివరించాడు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వతంత్రం కావాలని తపించిన అతడు, అనంతర కాలంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని, భారత జాతీయ కాంగ్రెస్‌ను, విభజనను సమర్థించిన నేతలను కూడ ఎదుర్కొన్నాడు. లండన్లో అతడు 1857 సిపాయి తిరుగుబాటుపై ఒక పుస్తకం రాశాడు. అది నామమాత్రపు తిరుగుబాటు కాదనీ తొలి స్వాతంత్ర్య సంగ్రామమనీ పేర్కొన్నాడు. ఈ తిరుగుబాటు హిందూ-ముస్లిం ఐక్యతకు విశిష్టమైన ఉదాహరణ అని బలంగా నమ్మాడు, అంతే బలంగా సమర్థించాడు. ఈ పుస్తకం తెల్లప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయుల్లో విప్లవభావాలను ప్రేరేపించింది.

3. బ్రిటిష్ అధికారుల అఘాయిత్యాలు

“సావర్కర్!” అంటూ గట్టిగా పిలిచాడు బ్యారీ. “నువ్వు బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశావు! నీ తిక్క కుదరడానికే సెల్యులర్ జైలుకు వచ్చిపడ్డావు. ఇక ఇప్పుడు ఇక్కడ ఎలా జీవించాలో నేర్చుకో!”

“జీవించడం నాకు నువ్వు నేర్పించాల్సిన అవసరం లేదు బ్రిటిష్ అధికారీ!” సావర్కర్ ధైర్యంగా బదులు చెప్పాడు. “స్వేచ్ఛకోసం జీవించడం ఎలా ఉంటుందో నేనే నీకు చూపిస్తాను!”

ఆ మాటలు బ్యారీకి మింగుడుపడలేదు. “ఐతే సరే. ఇకనుండి నీ పని పెంచుతున్నాను.. రోజుకు ముప్ఫై పౌన్ల కొబ్బరినూనె తీయకపోతే.. తీవ్రమైన శిక్షను అనుభవించాలి!”

సావర్కర్ ఎప్పటిలానే చిరునవ్వు నవ్వాడు. “నా శరీరాన్ని కష్టపెట్టవచ్చు. కానీ నా మనస్సును ఓడించలేవు!”

సైనికులు కాళ్లకున్న సంకెళ్లతోనే అతడిని లాక్కొచ్చి కోలుకొట్టాయిలో పడేశారు.

“ఏం పని చేయాలో తెలుసా?” జైలుగుమాస్తా గట్టిగా అరిచాడు.

“ఏది ఇచ్చినా చేయగలను” బంధనాలతో మడమలు, మెడ, మణికట్లు ఒరుసుకుపోయినా తొణక్కుండా సమాధానం ఇచ్చాడు సావర్కర్.

“నీవు భరించలేవు!” అని పఠాన్ అధికారి నవ్వాడు.

సావర్కర్ ఆత్మవిశ్వాసంతో, “భారతమాత కోసం తినే ఈ దెబ్బలు ఏమాత్రం లెక్కలోకి రావు! చరిత్రనే తిరగరాయడానికి నేను ఇక్కడికి వచ్చాను!” అన్నాడు.

“ఐతే రాయి. ఈ రాతిని తిప్పుతూ చరిత్రని రాయి” అని హేళనగా నవ్వుతూ గుమాస్తా మరో ఖైదీ దగ్గరకు వెళ్లాడు.

గానుగలో ఎండుకొబ్బరి ఆడించి నూనె తీయడం మామూలు పని కాదు! సిల్వర్ జైల్లో విధించే శిక్షలన్నిటిలో ఇదే అత్యంత కఠినమైనది. ‘కోలు’ అనేమాట వినగానే ఖైదీలు నిద్రలో కూడ ఉలిక్కిపడతారు. సాయంకాలానికి ముప్పై పౌన్ల నూనె తీయడానికి పొద్దుటినుండి ఆగకుండా అరవై ఏడు పౌన్ల బరువైన బండని తిప్పాలి. అరచేతుల చర్మం బొబ్బలెక్కాలి, కాలిపిక్కల నరాలు తెగిపోవాలి, వెన్నెముక విరిగిపోవాలి. కాలకృత్యాలకు విరామం లేదు. ఎక్కువమంది ఖైదీలకు అజీర్తి, అతిసారం నిరంతరం ఉంటుండేవి. వారు ఆ కోలు తిప్పుతూనే అక్కడే కానిచ్చేవారు. దానికో శిక్ష. ఆగితే పిర్రలపై లాఠీ దెబ్బలు. ఆగినా నరకం, ఆగకపోయినా నరకం. నూనె కొలత తగ్గితే ముళ్ల కొరడా దెబ్బలే రాత్రికి ఆహారం. తెల్లవారితే మళ్లీ అదే గానుగ. అదే మొద్దు చాకిరీ. అదే కొలత. అదే కొరడా.

“ఓహ్! మీరు వాటిని మళ్లీ మళ్లీ ముద్దాడుతారు,
పగలంతా జాగ్రత్తగా మెరుగుపెడతారు!
మీరు ఏమనుకుంటున్నారు?
అవి వెండి, బంగారు అలంకారాలా?”
ఇది పిచ్చి భ్రమ మాత్రమే..!”
ఇవి ఇనుప సంకెళ్లు –
ఒకరోజు ఇవి విరిగిపోతాయి.
కానీ అప్పటివరకు,
మన ఆశలపాదాలను చుట్టుకునే ఈ సంకెళ్లను
ఎవరు రూపొందించారు?
సామాజిక నియమాల పేరుతో
ఈ సంకెళ్లను మనమీద ఎవరు మోపారు?
ఆలోచించండి..”

మూగ ఎద్దులా సాయంకాలం వరకు వగరుస్తూ గానుగను తిప్పాడు వినాయక్. ఆ రోజు అతడు గురుగోవింద్ సింగ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఓ మహాకావ్యం రాయాలని సంకల్పించాడు. రోజుకు ఓ ఇరవై శ్లోకాల వరకు రాయగలిగితే, తన ఖైదు ముగిసే సమయానికి యాభై వేలు – లక్ష శ్లోకాలతో ఒక గొప్ప కావ్యం పూర్తి చేయవచ్చు. ఐతే, లిఖిత సాధనాలు లభ్యం కాకపోవడం వల్ల, శారీరక శ్రమ చేస్తూ ఉండడం వల్ల పద్యాలను జ్ఞాపకం పెట్టుకోవల్సి వచ్చేది. నెత్తురు చెమటగా మారింది. ఒంటిపైనుండి ధారలుగా కారిన చెమటమడుగులో పాదాలు జారుతున్నా గుండ్రంగా తిరుగుతూనే ఉన్నాడు. నడుము పడిపోయేలా కఠోరమైన శ్రమ చేసిన చేతులు నెరసిపోయాయి. ఆత్మమాత్రం మరింత బలపడింది.

ఆ రాత్రి..

“అన్నా!”

“తాత్యా! నీ చేతులు?” బాబారావు తమ్ముడి చేతుల్లో గడ్డకట్టిన రక్తాన్ని చూసి తట్టుకోలేకపోయాడు.

“ఓస్, ఇదా అన్నా? ఇది నేను అండమాన్‌లో రాసిన మన దేశ స్వాతంత్ర్యపు తొలి అధ్యాయం!”

***

1909లో నాసిక్ కలెక్టర్ ఏ.ఎం.టి. జాక్సన్ హత్య కేసులో సావర్కర్‌పై అభియోగాలు వచ్చాయి. 1910లో దేశద్రోహిగా అరెస్టు చేసి భారత్‌కు తీసుకువచ్చారు. పైకోర్టుకు అర్జీ పెట్టుకునే వీలులేని ఒక ప్రత్యేక న్యాయస్థానం అతడికి రెండు జీవిత కాలాల కఠిన కారాగార శిక్ష విధించింది. దాని అమలుకు సావర్కర్‌ను అండమాన్ నికోబార్ దీవుల్లోని సెల్యులర్ జైలుకు పంపించారు. శోకిస్తున్న భార్య యశోదాబాయిని ‘దేవుడు తనకు అందరిలా ఒకటే జీవిత కాలం ఇచ్చినా బ్రిటిష్ వారు మాత్రం రెండు జీవితాలు ఇచ్చార’ని చెప్పి ఓదార్చాడు సావర్కర్.

4. రాతిపై రాతలు

సిల్వర్ జైలులో ఖైదీల భద్రతావ్యవస్థ అత్యంత పకడ్బందీగా ఉండేది. ఖైదీలను ఒకరితో ఒకరు మాట్లాడుకోనిచ్చేవారు కాదు. ఒకసారి గదిలోకి వెళితే ఇక తెల్లవారేవరకు బయటికి రాకూడదు. కటకటాల తలుపుల గొళ్లెం ఖైదీచేతికి అందకుండా పక్కనున్న గోడలో అమర్చి ఉంటుంది. దీనితో ప్రయోజనాలు అనేకం – తాళంకప్పల ఖర్చు లేదు, వార్డెన్లు బరువైన తాళంచెవుల గుత్తులను మోయనవసరం లేదు, ఖైదీలు తాళమో గొళ్లెమో పగలగొట్టి పారిపోయే అవకాశం ఉండదు.

నెలకొకసారి ఖైదీల గదులు మారుస్తుండేవారు. ఖైదీలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని కొత్త గదులకు మారే సమయంలో రహస్యంగా సమాచారాన్ని బదిలీ చేసుకునేవారు. ప్రతి గదిలో నేలకి దగ్గరగా గోడలో ఒక చిన్న చీలిక ఉండేది. ఆ చీలిక కేంద్ర ఆవరణ వైపు ఉండేది. పహరా సిపాయిలు దాపులో లేనపుడు అవకాశం గ్రహించి గదుల్లో ఉండే ఖైదీలు ఆ చీలికలవద్ద నోటిని పెట్టి ఆవరణలో పనిచేసే ఖైదీలతో రహస్యంగా సంభాషించడం మొదలుపెట్టారు. అలాగే, ప్రతి గదిలో వెనుకగోడకి పన్నెండు అడుగుల ఎత్తులో ఒక చిన్న కిటికీ ఉండేది. తాము పడుకోవడానికి ఇచ్చిన చెక్కపలకలను నిలువుగా గోడకాన్చి వాటిపైకి ఎగబాకి కిటికీ కడ్డీలను పట్టుకుని ఆవరణలో ఉన్న ఖైదీలతో మాట్లాడే ప్రయత్నం చేసేవారు.

ఒక ముసురు పట్టిన రాత్రి.

“సావర్కర్!” అంటూ లోగొంతుకతో ఒక పిలుపు వినబడింది.

“నువ్వు ఇక్కడేనా?”

పక్కగదిలో ఉన్న ఉల్లాష్‌కర్ దత్త నిట్టూర్చాడు. “ఆఁ! కొబ్బరిపీచు కొట్టీ కొట్టీ నా చేతులనుండి రక్తం ధారలుగా స్రవిస్తున్నది, ఇటుకలు మోసీ మోసీ నా ఎముకలు అరిగిపోయాయి. అన్నా! మనం బ్రతకలేమా?”

సావర్కర్ అది వింటూ, గంభీరంగా అన్నాడు – “బ్రతకాల్సిందే! మన భస్మదీప్తిలోనే ఇతర వీరులు ప్రేరణ పొందుతారు.”

“ఇక్కడి శిక్షలు..?” సందేహంగా ఆగిపోయింది నానీ గోపాల్ ముఖర్జీ అనే ఒక పదహారేళ్ల పడుచువాని కంఠం. నాని సరదాగా ఉండే చురుకైన పిల్లాడు. నియమాలకు వ్యతిరేకంగా మైనర్లచేత కఠినమైన శిక్షలతో కూడిన శారీరక శ్రమ చేయించడం నేరమైనా జైలర్ బ్యారీ ఎవరి మాటా వినేరకం కాదు. ఈమధ్య నాని శరీరం ఊపిరి తీసుకోవడానికి కూడ మొరాయించడం తరచుగా జరుగుతున్నది.

104 డిగ్రీల జ్వరంలో నిలువుసంకెళ్ల శిక్షను అనుభవించిన సావర్కర్ “ధైర్యంగా ఉండగలగడమే మన ఆత్మవిశ్వాసానికి, విప్లవ చైతన్యానికి నిజమైన పరీక్ష!” అని వారిని ఊరడించ ప్రయత్నం చేశాడు.

“ధైర్యంగా ఎలా ఉండగలము? ఇందుభూషణ్ రాయ్ తన శిక్షను ఒక్కరోజు సడలించమని ఎంత ప్రాధేయపడ్డాడు! ఆ దుష్టుడు బ్యారీ విన్నాడా? క్రూరమైన ఈ శిక్షల కంటె కంఠపాశమే మేలని గదిలోనే ఉరిపోసుకున్నాడు.. ఇక్కడ మన మాట ఎవరు వింటారు?” మరో ఖైదీ గురుముఖ్ సింగ్ కలతపడ్డాడు.

సావర్కర్ చిరునవ్వుతో అన్నాడు, “కాలం వింటుంది! మనం చెబుతూనే ఉండాలి!”

***

ఐతే, ‘ఎలా చెప్పాలి’ అని అమితంగా మథనపడ్డ తాత్యాకు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. అంతే! గోడలమీద రాతలు మొదలయ్యాయి.

సెల్స్ గోడలు సున్నంతో తాపడం చేసి ఉండేవి. సిపాయిల కంటిచూపుకు చిక్కకుండా మొసలిముళ్లు, గోళ్లు, సన్నటి మేకు, పదునైన రాతి ముక్క వంటివాటితో గోడలమీద రాయడం ప్రారంభించాడు.

ఇచ్చట భారత చరిత్ర రాయబడుచున్నది! ఈ సందేశాల్లో ఆర్థిక, రాజకీయ సిద్ధాంతాలపై కీలకమైన విషయాలు ఉండేవి. పద్యాలూ పాటలూ ఉండేవి. వేదాంతం ఉండేది. మరుసటి నెలకు కొత్త ఖైదీ ఆ గదిలో ప్రవేశించినప్పుడు ఆ సందేశాలను చదివేవాడు. అలా విప్లవఝరి కాగితాల పుటల్లోంచి కాక, గోడల్లోంచి వీరుల గుండెల్లోకి ప్రవహించింది! వినాయక్ అండమాన్‌కు రావడం ఖైదీలకు ఓ ప్రేరణగా మారింది. అతడి ఆశ, ధైర్యం, తార్కిక ఆలోచనా ధోరణి, దార్శనికత, దేశభక్తితో నిండిన చైతన్యం జైల్లోని అన్ని గోడల మీద విస్తరించాయి.

“ఓ యువకులారా..!
దేశం కోసం మరణించేందుకు ప్రతిజ్ఞ చేయండి!
ఆశలు అణచివేయబడుతుంటే,
దేశం నిశ్చేష్టంగా విలవిలలాడుతుంటే,
మీరు ఇంత నిశ్చింతగా ఎలా ఉండగలుగుతున్నారు?
మీ హృదయాలను ఈ బాధ కుదిపేయదా..?
హిందూ జయధ్వనిని మోగిస్తున్నాను, వింటున్నారా?
మళ్లీ మళ్లీ పిలుస్తూనే ఉన్నాను..!
నా గొంతు ఈ నినాదంతో బొంగురుపోయింది!
లక్ష్యం కోసం పోరాడండి.. రండి..!”

***

సెల్యులర్ జైలులోకి అడుగుపెట్టిన క్షణం నుంచి వినాయక్ సావర్కర్ ఖైదీగా కాక, ఓ విప్లవాగ్నిగా మారాడు. తన సాహిత్యంతో సమాజంలో మార్పు తేవాలనే తన ఆశయాన్ని వినాయక్ పటిష్టంగా ఉంచుకున్నాడు. విడుదల సమయానికి అతడు 1000-1200 కవితలు రాశాడని ఒక అంచనా. అండమాన్ జైలు ఖైదీలకు అమానవీయ శిక్షలు, శ్రమను విధించి, వారిని భయపెట్టి అణచివేయాలని బ్రిటిష్ పాలకులు భావించారు. విప్లవానికి నూతనంగా ఊపిరులూదిన వ్యక్తిగా, అండమాన్ జైల్లో ఖైదీల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల అసంతృప్తికి మూలకారణంగా నిలిచాడు సావర్కర్. ఖైదీలలో ఐకమత్యాన్ని పెంపొందించాడు. అతడి ప్రభావంతో జైలులో ఉన్న చాలమంది స్వాతంత్ర్య సమరయోధులు తిరుగుబాటుకు, నిరంకుశత్వాన్ని వ్యతిరేకించడానికి ప్రేరణ పొందారు.

5. బంధనాలను బద్దలుకొట్టే స్వరం

అమానుషమైన శిక్షలవల్ల మూగబోయిన కవితలు మళ్లీ పుట్టాయి. నలుగురితో కలిసి ఉన్నప్పుడు సావర్కర్ తన గేయాలను పాడేవాడు. అది వారికి కాలక్షేపంగాను, అతడికి తన రచనలు గుర్తుపెట్టుకోవడానికి వీలుగాను ఉండేది. వారు విడుదలైపోయి దేశం చేరుకున్నాక తమతమ ప్రాంతాల్లో ఆ రాగాలు వినిపించేవారు. అలా సావర్కర్ సాహిత్యం దేశమంతటా ప్రచారమవసాగింది. ‘హిందుత్వ’, ‘భారతజనని’, ‘స్వాతంత్ర్య భిక్ష’ మరాఠీలో గోడలపై కనిపించసాగాయి. ‘ఈ గోడలే నా జ్ఞాపకాలను భద్రపరిచే పుటలు!’ అనుకున్న వినాయక్ రాస్తున్నాడు. బ్రిటిష్ అధికారులకు ఇది తెలిస్తే అతడిపై మరింత హింస ఖాయం. ఐనా చెక్కుచెదరని మొండిధైర్యంతో రాస్తూనే ఉన్నాడు. తన గదిలోని ఎత్తైన చిన్న కిటికీలో వాలే బుల్లి మైనాపిట్టలకు ‘స్వేచ్ఛ’ అనే పదాన్ని బోధించసాగాడు. తోటి ఖైదీలతో పాటు వాటికీ దేశభక్తి గేయాలు నేర్పించసాగాడు.

ఒకరోజు పఠాన్ మీర్జాఖాన్ గోడపైని రాతలు చూడనే చూశాడు. ముఖం ఎర్రబడిపోతుండగా, “ఇది ఎవరు రాశారు?” అని మండిపడ్డాడు.

“ఇది నా హస్తాక్షరం!” అంటూ సావర్కర్ ముందుకు వచ్చాడు. “నా కలమే నా ఆయుధం!”

“నీకు మరణశిక్ష వేస్తాం!” పఠాన్ గర్జించాడు.

“హహ్హహ్హ! నా మరణం బ్రిటిష్‌కు మరో శవపేటిక మాత్రమే అవుతుంది. కాని నా స్వరం ఎప్పటికీ సజీవంగా ఉంటుంది!”

“నిన్ను బ్రతకనివ్వం, సావర్కర్!”

“నేను కాదు.. స్వాతంత్ర్యం బ్రతకాలి! ఒక్కో జన్మకు ఒక్కో పని ఉంటుంది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం జీవించడమే నా జన్మ పని.”

“ఆదిలేని, అంతంలేని, నిరోధంలేని ఆత్మ నాది.
నన్ను ఓడించగల పగవాడు పుట్టని లోకం నాది.
ఓ మూర్ఖ శత్రువా..!
మరణంతో నన్ను భయపెట్టగలవని అనుకోకు.
శిలల దహించు జ్వాలలోకి నన్ను విసిరివేయి.
అది నా స్పర్శతో చల్లనైపోతుంది!
ఆకలిగొన్న సింగపు గుహలోకి నన్ను విసిరివేయి.
అది నా ముందు మోకరిల్లుతుంది!
రా..! నీ మహాసైన్యాన్ని రప్పించు..!
మరణాన్ని వర్షించే బాణాలను ప్రహరించు!
ఆ నీలకంఠుడైన శివునిలా,
నీ హాలాహలాన్ని మింగి జీర్ణించుకోగలను.
మరణాన్నే సవాల్ చేసి సమరరంగంలోకి దిగుతాను!
దాంతో ఆ మరణమే నా ఎదుట వణికిపోతుంది..!”

లాభం లేదని జైలర్ బ్యారీ ఎదుట నిలబెట్టారు.

“ఓహ్! సావర్కర్, ఇది స్కూలు కాదు, జైలు!”

“నీ జైలుగోడలు నా ఆలోచనలను ఆపలేవు ఆఫీసర్!”

“నువ్వు ప్రభుత్వ ఆస్తిని పాడుచేస్తున్నావు!”

“నేను స్పెన్సర్ యొక్క ‘ఫస్ట్ ప్రిన్సిపుల్స్’ సంపూర్ణంగా ఒక గోడపై రాశాను. జె.ఎస్.మిల్స్ రాజకీయ ఆర్థిక సిద్ధాంతాల నిర్వచనాలను మరో గోడపై రాశాను. అది పాడుచేయడమా?”

“నీ భాషలో ఏవో పిచ్చిరాతలు రాస్తున్నావు. జమాదార్! ఇతడి గదికి సున్నం వేయించు” అని మీర్జాను పురమాయించి “ఇలాంటి పనులు చేస్తూ నువ్వు ఇక్కణ్నుంచి బ్రతికి బట్ట కట్టగలవా? చూద్దాం!” కళ్లను అరమూసి బ్యారీ నిర్లక్ష్యంగా అన్నాడు.

“నన్ను బ్రతికించేది నువ్వు వేసే శిక్షలు, స్వార్థం కేంద్రమైన నీ బ్రిటిష్ రాజ్యం కావు.. త్వరలో నిజం కానున్న నా స్వాతంత్ర్య స్వప్నాలు!” అని సావర్కర్ నొక్కి వక్కాణించాడు. అతడి కళ్లలో ఉడుక్కున్న ఛాయ ఇసుమంతైనా లేదు.

బ్రిటిష్ సామ్రాజ్యం ఒక అపరిమిత అపరాజితుడిని తామే నిర్మించామని తెలుసుకున్న రోజు అది!

***

సెల్యులర్ జైలు ఒక నిగూఢ నరకం – బయటివారి అవగాహనకు మించిన అకృత్యాలతో నిండిన లోకం. అక్కడి దేవుడు జైలర్ డేవిడ్ బ్యారీ! క్లిష్టమైన పోరాటాల్లో గట్టెక్కిన విప్లవయోధులు, కుట్రదారులు, అసహాయశూరులు కూడ అతగాడిముందు శిశిరంలో ఆకుల్లా రాలిపోయేవారు, మరుగున పడిపోయేవారు. తాము అనుభవిస్తున్న రాక్షసశిక్షలతో నిరంతరం పోరాడుతున్న ఖైదీలు వేధింపులను తట్టుకోలేక మానసిక స్థైర్యం కోల్పోయి, చివరకు ఆత్మహత్యే మంచిదని భావించేవారు. ఖైదీలకు గౌరవప్రదమైన ‘బడా-బాబు’గా మారిన సావర్కర్‌ను జైలర్ బ్యారీ మరియు అతడి అనుచరులు తీవ్రంగా ద్వేషించేవారు. బడా-బాబు అనేక జైలు సమ్మెలను ప్రేరేపించి, ఖైదీల కోసం మెరుగైన, మానవీయ వాతావరణం కోసం వినతిపత్రాలు కోకొల్లలుగా సమర్పించాడు. ‘ఆత్మహత్యాత్మక విధానం’ అయిన నిరాహారదీక్షను మాత్రం వ్యతిరేకించాడు. యువ రాజపుత్ర విప్లవకారుడు పృథ్వీ సింగ్ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నపుడు అతడిని సావర్కర్ అర్థవంతమైన పోరాటానికి ప్రేరేపించాడు – “హల్దీఘాటీ యుద్ధంలో మేవార్ మహారాణా కూడ వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గాడు. ఒంటరిగా ఈ కారాగృహంలో ప్రాణాలర్పించడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఒనగూరదు” అని పృథ్వీని సావర్కర్ బుజ్జగించాడు.

6. తప్పించుకోవాలా? పోరాడాలా?

అండమాన్ జైలుకు వచ్చే బందీలందరూ ఏదో ఒక రకంగా వీరులే. పెద్ద సంఖ్యలో ప్రజలను ఏకకాలంలో ప్రభావితం చేసిన వారే. బంధించనలవికాని వారి చైతన్యక్రాంతిని మామూలు చెరల్లోను, పోలీసు స్టేషన్లలోను అదుపు చేయలేక భారత సామ్రాట్ చక్రవర్తి ప్రతినిధి కర్జన్ ప్రభుత్వం చేతులెత్తేసిన వైనమే సెల్యులర్ జైలు. మరణశిక్ష నుండి తప్పించుకుని పట్టుబడ్డ తిరుగుబాటుదారులను సెల్యులర్ జైలుకు జీవితకాలం వెలివేసేవారు. దేశానికి, కుటుంబానికి దూరంగా, అననుకూల వాతావరణంలో పోరాటవీరుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు, శారీరకంగా వారిని బలహీనపరిచేందుకు ప్రకృతి బ్రిటిషువారికిచ్చిన ఒక సదవకాశం ఈ దీవులు.

ఇక్కడికి రాకముందే అండమాన్ జీవితం గురించి సావర్కర్ తెలుసుకున్నాడు. అప్పుడు నిర్బంధ జీవితం అంత కష్టంగా అనిపించలేదు. ఆరునెలలు జైల్లోనే గడిపిన తరువాత ఆవరణలోనుండి బయటకు వెళ్లనిస్తారు. సముద్రపు ఒడ్డున కూర్చొని స్వచ్ఛమైన స్వేచ్ఛావాయువును గుండెలనిండుగా హాయిగా పీల్చుకోవచ్చు. ఓ పదేళ్లు గడిచాక, సత్ప్రవర్తన టిక్కెట్టు సంపాదించి, కుటుంబసభ్యులు ఒప్పుకుంటే ఇక్కడికే రప్పించి ఇల్లు కట్టుకొని యాభై ఏళ్ల శిక్ష ముగిసేవరకు స్థిరపడవచ్చు. అప్పటికి ఆవలి ప్రపంచం ఎంతగా మారిపోయి ఉంటుందో!

రెండు జీవిత కాలాలు ఒకేసారి శిక్ష అనుభవించేలా పెట్టుకున్న అర్జీని ప్రభుత్వం తిరస్కరించింది. ఒకదాని తరువాత మాత్రమే మరొకటి అని స్పష్టం చేసింది. అదొక దిగులు.

మరుక్షణమే ఇంకో ఆలోచన వచ్చింది. తనకోసం, తన లక్ష్యం కోసం పోరాడినవాళ్లకు పది పదిహేనేళ్లు కఠినశిక్ష పడింది. మరి పాపం వారందరూ ఎన్ని కష్టాలు అనుభవించాలో. వారిలో తన బాల్యస్నేహితులు, సహాధ్యాయులు, సహోద్యోగులు, తనకోసం ప్రాణం పెట్టే అనుచరులు ఉన్నారు. ఎన్నాళ్లిలా? తామందరూ ఇక్కడ అంతమైపోవలసిందేనా..!

***

అపరిశుభ్రత, దుర్వాసన, అసహ్యత జైలు వంటగదిలో నిత్యం కలసిమెలసి ఉంటాయి. ఎనిమిది వందలమంది ఖైదీలకు వంట చేయడానికి కేవలం ఐదుగురు ఖైదీలకే డ్యూటీ వేసేవారు. వారు ఏదో రోగంతో మూలుగుతూ పెద్దగా శ్రమ చేయలేని స్థితిలో ఉండేవారు. ఆ వంటగాళ్ల శరీరాలనుంచి చెమట కారి వండుతున్న కూరల్లో, గంజిలో, అన్నంలో నేరుగా పడేది. పదునైన కత్తులతో శిక్షించాక నీలుక్కుపోయిన చర్మంలా కనిపించే రొట్టెలు, అరగుడపు అన్నం, ఉడికీ ఉడకని కూరగాయలు, పప్పుగింజలే కనబడని పప్పు, కిరసనాయిలు వాసన దంచికొట్టే గంజి – ఇక్కడి ఖైదీల నిత్యాహారం. ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేదు. “తినకుంటే ఆకలితో చచ్చిపోండి!” అని వార్డెన్లు తేల్చేసేవారు.

ఒకసారి ఖైదీలకు వడ్డించిన ఆకుకూరలో ఇంకేదో రంగు కనబడింది. అదొక కాళ్లజెర్రి. అడుగున్నర పొడవున్న దాన్ని తీసి వినాయక్ బ్యారీ ముఖం ముందు ఊపాడు.

“ఓహ్ వినాయక్! ఈ మాత్రానికేనా. ఉడకబెట్టిన కాళ్లజెర్రిని తినడంవల్ల ఇంతవరకు నా జైల్లో ఖైదీలెవరూ పైకి పోలేదు. లాగించేయి, రుచి బాగుంటుంది” అని పెద్దగా నవ్వసాగాడు.

వేసారిపోయిన సావర్కర్ ఖైదీల దగ్గరికి తిరిగివచ్చి రహస్యంగా తన సహచరులతో మాట్లాడాడు. “ఈ గోడలు ఇక నన్ను ఎక్కువకాలం బంధించలేవు!”

“ఎలా?” అడిగాడు దాజీ నారాయణ్ జోషి, వినాయక్ ప్రాణస్నేహితుడు, మరో ఖైదీ.

సావర్కర్ గోడలను తడుముతూ భద్రత గురించి, జైలు అధికారులు అశ్రద్ధగా వ్యవహరించే సమయాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.

“త్వరలోనే ఒక నౌక రానుంది. రాత్రివేళ.. సముద్రం అంధకారమయంగా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న బోటు ఉంటే చాలు. తప్పించుకోవచ్చు!”

“అది చాలా ప్రమాదకరం, సావర్కర్!” మరో ఖైదీ ఖగేంద్రనాథ్ చౌధురి అన్నాడు.

“భయపడితే స్వాతంత్ర్యం రాదు!” అంటూ సావర్కర్ లోగొంతుకతోనే కాని గట్టిగా “నా శరీరాన్ని తెల్లదొరలకి అప్పగించినా, నా మనస్సు మాత్రం ఎప్పటికీ వాళ్ల చేతికి చిక్కదు!” అన్నాడు.

***

ఓ నిష్ఠుర సముద్రుడా!
నీ అలల అట్టహాసంతో నన్ను ఎగతాళి చేస్తున్నావు!
బ్రిటన్ క్రూరశక్తికి భయపడి వెనుకడుగేస్తున్నావా?
శ్వేత ప్రభుత నీపై తన ఆధిపత్యాన్ని చూపిస్తున్నదా?
నా తల్లి బలహీనురాలు కాదు!
ఓ సముద్రుడా! నిన్ను ఒక్క గుక్కలో మింగిన అగస్త్య మహర్షికి
ఆమె ఈ కథను చెప్పబోతోంది!
నన్ను తీసుకెళ్లరా, ఓ సముద్రుడా!
నన్ను నా మాతృభూమి వద్దకు చేర్చు!
నా ప్రాణం గిజగిజలాడుతున్నది..!
ఆమెనుండి దూరంగా ఉండడం నన్ను వేధిస్తున్నది!
ఎంతో వేధిస్తున్నది, ఓ సాగరా!

కృష్ణపక్షపు రాత్రి. సముద్రపుటలలు పెద్దశబ్దంతో విరుచుకుపడుతున్నాయి. ఖైదీలు, అధికారులు మంచి నిద్రలో ఉన్నారు. కానీ సావర్కర్ కళ్లు నిద్రతో మూత పడలేదు. పగలంతా ఎద్దుల్లా చాకిరీ చేసి అలసిపోయిన గస్తీ పోలీసుల చూపుల్లో అనాసక్తి పొరలు కమ్ముతున్నాయి. ఇదే.. ఇదే తప్పించుకోవడానికి సరైన సమయం!

ఒక ముసుగుదారి ద్వారా చిన్నపడవ ఏర్పాటైంది. పరారీకి అవకాశం ఉన్నది. కాని..

“అన్నా, నిన్ను ఒక్కడిని ఇక్కడ విడిచిపెట్టి వెళ్లలేను!”

“తాత్యా! నువ్వు వెళ్లాలి. ఇక్కడి నా కథ ముగిసినా, దేశంలో మన పోరాటం కొనసాగాలి!”

సావర్కర్ తొలిసారి భయపడ్డాడు. బ్రిటిషువారికి కాదు, తన అన్నను విడిచి వెళ్లడానికి!

“ఇది నువ్వు చేయాల్సిన నిర్ణయం, వినాయక్!”

“నన్ను బ్రిటిష్ ప్రభుత్వం బంధించలేదు, అన్నా. మన అనుబంధమే బంధించింది!”

“బంధాలు, బంధనాలు నీ మనసే వేస్తుంది. ఆలస్యం చేయక వెళ్లు తాత్యా, వెళ్లు!” ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడం వల్ల ఖళ్లుఖళ్లున దగ్గుతూ ఆయాసపడుతూ చెప్పాడు బాబారావు.

వినాయక్ తర్జన భర్జన పడ్డాడు.

1910లో మార్సెయి తీరానికి ఈదిన ప్రయత్నం గుర్తొచ్చింది. మరు నిముషంలోనే తనను ఫ్రెంచ్ పోలీసులు పట్టుకొని తిరిగి బ్రిటిష్వారికి అప్పగించిన దుస్థితికి అవినీతి అంటే ఏవగింపు కలిగింది! ఇప్పుడా తప్పిదం మళ్లీ జరుగకూడదు. ఈసారి పోరాడాలని నిర్ణయించుకున్నాడు. ఎవరేమైనా అనుకోనీ. పిరికిపంద అనుకోనీ, జైలుజీవితం వల్ల మతి స్థిమితం తప్పిందనుకోనీ. తాను ఇక్కడే ఉంటాడు. అందరూ ఉరితాళ్లను ముద్దు పెట్టుకొని మెడకు తగిలించుకుంటే భరతమాత మెడకు తగిలించిన ఈ బ్రిటిష్ గుదిబండలని తొలగించేదెవ్వడు? తాను బ్రతకాలి. నిరాశతో కాక, ఆరోగ్యకరమైన ఆలోచనలు చేయాలి.

“నన్ను నమ్మండి అన్నా, బ్రిటిష్ మనల్ని ఇక్కడనుంచి పంపి తీరాల్సిందే!” మెదడులో ఒక పథకం రూపుదిద్దుకుంటుండగా బాబారావుతో అన్నాడు. “మనం చేయాల్సింది శారీరక పోరాటం కాదు. ఆలోచనల, వ్యూహాల, తత్వశాస్త్ర పోరాటం!”

***

మేజర్ ముర్రే చిలిపిగా నవ్వాడు. “సావర్కర్! బ్రిటిష్ రాజ్యంలోనుంచి నువ్వు తప్పించుకోవడానికి మార్గమే లేదు!”

సావర్కర్ కళ్లలో అగ్నిగోళాలు రాజుకున్నాయి. “నా దేశం ఒకరోజు స్వతంత్ర అవుతుంది. ఆనాటికి నేను బతికి ఉండి చూసినా, చూడలేకపోయినా.. భారతజాతి ఆంగ్లేయులను మా గడ్డ నుండి గెంటేస్తుంది, కాచుకో!”

ముర్రే నవ్వుతూ, “అది నీ ఊహల్లో జరగొచ్చు!” అన్నాడు.

“ఇది ఊహ కాదు.. భవిష్యత్తు!” సావర్కర్ మొండిగా అన్నాడు.

సిల్వర్ జైలు సూపరింటెండెంట్ మేజర్ జె.ఎచ్.ముర్రే మిగతా అధికారుల్లా క్రూరంగా కాకుండా, సహనశీలతతో మానవ మనస్తత్వాన్ని అర్థం చేసుకునే వ్యక్తి. ఖైదీలతో హితమైన వైఖరిని ప్రదర్శించేవాడు, వారి న్యాయమైన డిమాండ్లను అంగీకరించేవాడు.

“ఆల్రైట్. నువ్వు స్వేచ్ఛా జీవితం పొందిన తర్వాత ఏమి చేయాలని అనుకుంటున్నావు?”

“నన్ను విడుదల చేసే పరిస్థితులపై అది ఆధారపడి ఉంటుంది. వాటిని బట్టి నా భవిష్యత్ మార్గం అప్పుడు నిర్ణయించుకుంటాను.”

“ఏ విధమైన పరిస్థితులంటావు?”

“కాలానుగుణమైన పరిస్థితులు. నూతన సంస్కరణలు సత్ఫలితాలను అందించి, ప్రజలకు మరింత అధికారం కల్పించే దిశగా సాగితే, నేను శాంతియుతమైన రాజ్యాంగబద్ధమైన మార్గాల్లో సహకారం అందిస్తూ పని చేస్తాను. రాజకీయాల్లో పాల్గొనకూడదని నాపై నిషేధం విధిస్తే గనుక, నాకు అనుమతించబడిన ఇతర రంగాల్లో సేవ చేస్తాను. జవాబుదారీతనంతో కూడిన సహకార విధానాన్ని అనుసరించే వ్యక్తిగా, జైలుజీవితంలో నిరుపయోగంగా ఉండే కన్నా, నా దేశానికి ఉత్తమంగా సేవ చేసే అవకాశాలను అంగీకరించడం నా కర్తవ్యంగా భావిస్తాను.”

సావర్కర్ తన జైలు జీవితంలో ముర్రేతో ఇటువంటి అనేక సంభాషణలు జరిపినప్పటికీ, అవి అతడి శిక్షలో తగ్గింపుకు ఎటువంటి ఖచ్చితమైన ఫలితాన్నీ ఇవ్వలేదు.

***

1910 జూలై 8 – సావర్కర్‌ను లండన్లో అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరచిన బ్రిటిష్ అధికారులు విచారణ కోసం భారతదేశానికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. మోరియా ఓడ ఫ్రాన్స్ లోని మార్సెయి (Marseilles) తీరానికి చేరుకున్నప్పుడు, అతడికి తప్పించుకునేందుకు ఒక అవకాశం కనిపించింది. సన్నటి తన శరీరాన్ని మూత్రశాలలోని గుండ్రటి కిటికీ ద్వారా సముద్రంలోకి దూకించి, ఈదుతూ మార్సెయి రేవు పట్టణాన్ని చేరుకున్నాడు. అతడి లక్ష్యం పారిపోవడం కాదు, ఫ్రాన్స్‌లో శరణు పొందడం. ఫ్రెంచ్ రేవు పోలీసులు సావర్కర్‌ను పట్టుకున్నారు, అంతర్జాతీయ చట్టాలను పాటించకుండా వెంటనే అతడిని బ్రిటిష్ అధికారులకు అప్పగించేశారు. ఈ ఘటన తర్వాత శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఫ్రాన్స్ – బ్రిటన్ ప్రభుత్వాలపై విచారణ జరిపింది, కాని అప్పటికే బ్రిటిష్ వారు సావర్కర్‌ను భారతదేశానికి తరలించేయడంతో ఫ్రాన్స్ మిన్నకుండిపోయింది. స్వేచ్ఛకోసం సావర్కర్ చేసిన ఈ సాహసోపేత యత్నం అతడి ధైర్యానికి, చాకచక్యానికి, అచంచలమైన సంకల్పానికి ఒక చిరస్మరణీయ ఉదాహరణ.

7. వ్యథా, వ్యూహమా?

జైల్లో సావర్కర్ అనుభవాలు ప్రాణంపోయేంత శ్రమపెట్టించేలా ఉండేవి. జైలుసిబ్బంది అతడిని మరింతగా కష్టింపచేసేందుకు ప్రయత్నించేవారు. తిండి కూడా సరిపోయేది కాదు. బాబారావు ఆరోగ్యం కోలుకోలేనంతగా దెబ్బతిన్నది. ఐనప్పటికీ, వినాయక్ నీరుకారిపోలేదు. క్షమాభిక్షపత్రం ద్వారా విడుదలకు ప్రయత్నించాడు.

“ఈ వినతి ఎందుకు రాస్తున్నావు, సావర్కర్?” బరీంద్ర కుమార్ ఘోష్ తడుముకుంటూ ప్రశ్నించాడు.

“ఈ పత్రంద్వారా బయటకు వెళ్లి, మన పోరాటాన్ని కొనసాగించాలి.”

“నిన్ను విడిచిపెట్టమని ఎందుకు వాళ్లని బ్రతిమిలాడుతున్నావు? మనం స్వేచ్ఛను గెలుచుకోవాలి, అడుక్కోకూడదు!” అసహనంతో అన్నాడు బరీంద్ర.

సావర్కర్ కలాన్ని పైకెత్తి, ఒక్క క్షణం అతడిని చూశాడు. “యోధుడు ఒక్కటే ఆయుధం వాడడు, సోదరా. బ్రిటిష్ వాళ్లు మనం కత్తినే ప్రయోగిస్తామని అనుకుంటారు. మన మాటల గంభీరతను అర్థం చేసుకోరు.”

“మరి, నీ విన్నపాన్ని బ్రిటిష్ అధికారులు నమ్ముతారంటావా?”

సావర్కర్ నవ్వాడు. “నన్ను నమ్మకపోవడమే నా గెలుపు!”

“నువ్వు చెబుతున్నది అర్థం కాలేదు, ఇది వ్యూహమా? నిబద్ధతా?”

“ఇది మన సంకల్పానికి నిబద్ధత. నేను వీరమరణం పొంది అమరుడినవ్వాలని కోరుకోవడం లేదు. విజేతనై మాతృభూమి దాస్యశృంఖలాలు తెగ్గొడతాను.”

బరీంద్ర చిన్నగా నిట్టూర్చాడు. “మరి, వాళ్లు తిరస్కరిస్తే?”

సావర్కర్ నెమ్మదిగా నవ్వి, బాసింపట్టు వేసిన తన కాలి కోణంలోకి చూస్తూ అన్నాడు, “అప్పుడు వాళ్లే ఓడినట్లు. ఎందుకంటే ప్రతీ తిరస్కరణ వారి నిజస్వరూపాన్ని ప్రపంచానికి వెల్లడిస్తుంది.”

ఘోష్ తల ఊపుతూ మరింత దగ్గరకి వచ్చాడు. “కానీ.. ఈ ఉపాయం నిజంగా పని చేస్తుందంటావా?”

సావర్కర్ సాలోచనగా మౌనం వహించి, తన వినతిపత్రాన్ని మడిచి, నెమ్మదిగా తల పైకి ఎత్తాడు.

“ఎంత నేర్పుగా గురిపెట్టిన బాణమైనా, లక్ష్యాన్ని చేరుకునే ముందు గాలికి పరీక్షించబడాల్సిందే. మనలో ప్రతి ఒక్కరూ తెలివిగా ఆలోచిస్తే, సమస్యకు మూలకారణాన్ని అన్వేషిస్తే, తపస్సు చేస్తే.. ఖచ్చితంగా ఒకరోజు ఈ గోడలు నేలమట్టమవుతాయి. నా కలం ఇప్పుడు ఈ గోడల్ని పగలగొట్టలేకపోయినా, కనీసం నా ప్రయత్నంవల్ల పుట్టే సకారాత్మక ఊహలు మన ఉరితాళ్లను తెంచగలవు.”

“కానీ, అప్పుడు నువ్వు ఇంకా ఇక్కడే ఉండిపోతావు, కదా?” ఘోష్ కొంచెం బాధతో అన్నాడు.

“యోధుడు తన ధ్యేయాన్ని ఎన్నటికీ కోల్పోడు,” సావర్కర్ మృదువైన చిరునవ్వుతో అన్నాడు. “నన్ను చీల్చి చెండాడినా, నా ఆలోచనలను ఎవ్వరూ బంధించలేరు.”

***

1913. నవంబర్ 14.

బ్రిటిష్ హోం మెంబర్ సర్ రెజినాల్డ్ క్రాడక్ తన అండమాన్ జైలుపర్యటనలో భాగంగా సావర్కర్‌ను కూడ విచారించి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించాడు.

తన టేబుల్ మీద ఉన్న పత్రాలలో ఒకదాన్ని పైకి లేపాడు. “ఈజ్ దిస్ వినాయక్ సావర్కర్స్ మెర్సీ పిటిషన్?”

“అవును, సార్. అతడు మళ్లీ క్షమాభిక్ష అడుగుతున్నాడు.”

“అంతేనా? మనకు లొంగిపోయాడా?”

క్రిందిఅధికారి నోరు మెదపలేదు.

వివరాల కోసం పత్రం విప్పి చూడగానే, క్రాడక్ నోట మాట రాలేదు. మంచి ఆంగ్లపరిజ్ఞానంతో, అత్యంత మర్యాదపూర్వకమైన భాషతో, అంశాలవారీగా, ఎంతో లోతైన అధ్యయనంతో, కాదనలేని అభ్యర్థనలతో నిండి ఉన్న ఆ కృపాభిక్ష విజ్ఞప్తిని చూసి అచ్చెరువొంది కాసేపు మౌనంగా ఉండిపోయాడు.

‘..ఇక్కడి వాతావరణం నాకు సరిపడలేదు.. కుంగుబాటు నన్ను లొంగదీసుకుంటున్నది..’

‘..ఇంతవరకూ గడిపిన దాదాపు మూడేళ్ల శిక్షాసమయంలో సంపూర్ణ మొత్తంగా పదిహేను నెలల ఏకాంతవాసం, అరవై మూడు రోజులు నిలబడి ఉండే గోడసంకెళ్లు, ఐదు నెలలు అడ్డసంకెళ్లు, పది రోజులు అడ్డకడ్డీ సంకెళ్లు, ఇరవై నాలుగు రోజులు దండన ఆహారం, సుమారుగా ఇంకో ఇరవై రోజులు ఆస్పత్రి శిక్షను అనుభవించాను. జైళ్ల పరిపాలన వ్యవస్థలో నమోదు కాని ‘ఆస్పత్రి శిక్ష’ను ఇక్కడ అమలు చేస్తున్నారు..’

..ఈ హింసకు పరాకాష్ఠగా నా మిత్రుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకో స్నేహితుడు పిచ్చివాడై పోయాడు, మరొకడు జ్వరంతో పోయాడు.. ‘

‘..నా తోటి ‘డి’ ఖైదీలందరినీ విడుదల చేశారు.. నన్ను తప్ప!.. జైలు అధికారులపట్ల నేనెంతో మర్యాదగా వ్యవహరించాను. వేసిన శిక్షలన్నింటినీ కాదనకుండా ఎదురు చెప్పకుండా అనుభవించాను..’

‘..అనేకమంది బ్రిటిష్ పాలకులు మాలాంటి పాలితుల పట్ల అకారణ ద్వేషం ప్రదర్శిస్తున్నారు.. ఏసుక్రీస్తుకి సెయింట్ పాల్‌కి జరిగిన అన్యాయం మరచిపోయారా..’

‘..భారతీయ జైల్లో ఉండుంటే ఈపాటికి నన్ను సత్ప్రవర్తన కారణంగా విడుదల చేసుండేవారు లేదా శిక్షను తగ్గించి ఉండేవారు..’

‘..ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సామ్రాజ్యమా! మాలో ప్రవేశించిన రాజద్రోహం అనే క్రిమిని చంపు. మమ్మల్ని కాదు..’

‘..కుటుంబాన్ని కలుసుకునేందుకు సెలవు ఇప్పించండి.. మీరు ఒకరికి వేస్తున్న శిక్ష ఆ కుటుంబమంతా అనుభవిస్తున్నది..’

‘..పుణ్య భరతవర్షపు ‘ఇండియన్ నేషనలిజా’న్ని రాజకీయ బలిదానాలతో సమూలంగా పెకలిద్దామనుకోవడం మీ భ్రమ..’

‘..ప్రభువులవారు కరుణించి నా పరిస్థితిని అర్థం చేసుకొని వేరే జైలుకి తరలించడమో లేదా ఇక్కడ శిక్షను మెరుగుపరచడమో చేస్తే ఇండియాలో జరుగుతున్న రాజకీయ పురోగతికి మీరు నన్ను ఒక ఉదాహరణగా చూపవచ్చు. ఆంగ్ల ఆధిపత్యానికి నేను తల ఒగ్గుతాను. ఇంతకంటే మీ అభ్యుదయ భావాల ప్రభుత్వానికి ఇంకేమి కావాలి ?..’

“..శక్తిమంతులైనవారికే క్షమాభావం చూపే సామర్థ్యం ఉంటుంది. కనుక, తిరుగుబాటు చేసిన కుమారుడు తిరిగి రావాల్సింది తల్లిదండ్రుల గుమ్మం దగ్గరికే – అంటే, ప్రభుత్వం వద్దకే!..”

‘..దయచేసి ఈ దీనుడిపై కనికరం చూపి.. నన్ను త్వరగా విడుదల చేయమని నా చేతులెత్తి అర్థిస్తున్నాను..’

“ఇది క్షమాభిక్ష విజ్ఞాపన కాదు.. వ్యూహం!” అని ఆ కాగితాల్ని విసిరికొట్టాడు క్రాడక్.

***

బ్యారీ సంబరంగా అతడివద్దకు వెళ్లి, “సావర్కర్! నీ అభ్యర్థన విఫలమైంది” అని చెప్పాడు. బ్యారీ ఖైదీలకు చెడు వార్తలను చెప్పడం ఆనందంగా భావించేవాడు. తరచూ సావర్కర్‌పై పైఅధికారులకు తప్పుడు ఆరోపణలు నివేదించేవాడు.

సావర్కర్ చిరునవ్వుతో ఉండిపోయాడు.

***

“బ్యారీకి గట్టి సమాధానం చెబుతావనుకున్నాను” సుధీర్ కుమార్ సర్కార్ దబాయించాడు. అతడు తాను నేరం చేశానని ఒప్పుకుంటూ పంపిన క్షమాభిక్ష అభ్యర్థన ఇంకా పరిశీలనలో ఉంది. చుట్టూ చీకటిగదుల్లో బిక్కుబిక్కుమంటూ గడిపే ఖైదీల రోదనలు. ఇద్దరూ మట్టినేలపై ఎదురెదురుగా కూర్చొని, వారి ఆలోచనలను పంచుకుంటున్నారు.

“నా మౌనం కూడా స్వాతంత్ర్యనినాదమే!”

“అంటే, సావర్కర్, నీవు నిజంగా మారిపోయావా? నువ్వు ఇప్పుడు తెల్లవారివైపేనా?”

అతడి సంశయానికి సావర్కర్ నవ్వాడు. “నా శరీరాన్ని బ్రిటిష్ కష్టపెట్టగలదు. కానీ నా ఆత్మ భారత స్వాతంత్ర్యపోరాటానికే కట్టుబడి ఉంటుంది!”

సుధీర్ గోడకి ఆనుకొని, లోలోపల కలత చెందుతున్నా తన స్వరాన్ని పెంచి, “బడా బాబూ! మనం అసలు ఇంకెప్పుడైనా భారతభూమిని చూడగలమా? ఈ కారాగారం.. ఈ ద్వీపం.. మన కలల శ్మశానంలా అనిపిస్తున్నాయి.”

“శ్మశానం, నిజమే. కానీ ఇదే పోరాటభూమి కూడా! మన శత్రువులు మనల్ని ఇక్కడకి నెట్టిపారేసి మన పోరాటాన్ని అంతమొందించేశామనుకుంటున్నారు. కానీ వాళ్లు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, విప్లవపు విత్తనాలు చిమ్మచీకట్లోనే బలంగా పెరుగుతాయని.”

సుధీర్ విరక్తిగా నవ్వుతూ, “కాని మన పరిస్థితి చూశావా? ఎద్దుల్లా కాడెకు కట్టి మరీ మనతోటి నూనె తీయిస్తున్నారు. ఎవరిని చూసినా మలేరియా, డయేరియా. మన శరీరాలు సంకెళ్లలో బంధించబడ్డాయి, మన వందేమాతర నినాదాలు ఈ సముద్రపు అలల్లో మునిగిపోయాయి. మనలో ఇంకా ఈ మాత్రం ఊపిరుండటమే గొప్ప. వాళ్లు మన ఆత్మను ధ్వంసం చేయాలని చూస్తున్నారు” అన్నాడు.

వినాయక్ ఒక నిమిషం మౌనంగా ఉండి తన పిడికిలిని బిగిస్తూ ఇలా అన్నాడు- “సరిగ్గా అందుకే.. అందుకే, మనం వాళ్లకు తలొగ్గకూడదు! బ్రిటిష్ వాళ్లు తమ చట్టాలను మనకు వ్యతిరేకంగా ప్రయోగిస్తారు. కాని నేను వారి చట్టాలను పూర్తిగా చదివాను, అర్థం చేసుకున్నాను. అవే మన ఆయుధాలు అవుతాయి, సుధీర్! వారు నన్ను వారిచట్టాల ప్రకారం శిక్షించారని అనుకుంటే, అవే చట్టాలను నేను వారిమీద తిరగబెట్టగలను! మన పోరాటం కేవలం వీధుల్లో అరవడంలోనే కాదు, బాంబులు పేల్చడంలోనే కాదు, వారి పాలనావిధానాన్ని ఛేదించడంలో కూడా ఉంది!”

సుధీర్ కుమార్ సర్కార్ ఇంకా హేమచంద్ర కనుంగో- ఇద్దరూ శ్రీ అరోబిందో ఘోష్‌తో సన్నిహితంగా పనిచేసినవారే. హేమచంద్ర పారిస్‌లో బాంబు తయారీ శిక్షణ పొందిన తొలి భారతీయులలో ఒకడు; మాణిక్తల బాంబు కేసులో సిల్వర్ జైలుకి వచ్చాడు. సావర్కర్ దీన్నే ఎత్తిపొడిచాడు. సుధీర్ ఆలోచనలో పడ్డాడు.

“బ్రిటిష్ వాళ్లు మనం ప్రదర్శించే బలహీనతను నిజమని నమ్మితే, అజాగ్రత్తగా మారతారు. అదే అదనుగా మనం మన పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలి.”

సుధీర్ తలాడిస్తూ తన నిశ్చయాన్ని వ్యక్తం చేశాడు – “ఇప్పుడు అర్థమైంది. మనం చేసే ప్రతి కదలిక ఒక యుద్ధం. మనం రాసే ప్రతి మాట ఒక ఆయుధం!”

సావర్కర్ అభినందనగా నవ్వుతూ “అవును! ప్రగతి క్రమశిక్షణను కోరుతుంది. క్రమశిక్షణ త్యాగాన్ని కోరుతుంది. విప్లవం కేవలం తుపాకులతోనే కాదు, అది ఆలోచనలతో, వ్యూహాలతో, పట్టుదలతో నడుస్తుంది. మన విముక్త భారత స్వప్నాన్ని ఇక ఎవ్వరూ అణచలేరు.”

ఇద్దరి మధ్యా ఒక నిశ్శబ్ద క్షణం. ఆ వెలితిని చీల్చుతూ బయట ఎక్కడో ఒక మరణ ఆర్తనాదం.

సుధీర్ మృదువుగా “ఒక రోజు, మనం స్వేచ్ఛగా తిరుగాడుతున్నప్పుడు.. మన భారతభూమి నిజంగా విముక్తి పొందినప్పుడు.. మరి.. ఈ గోడలమధ్య ప్రతిధ్వనించిన మన మరణస్వరాలను ఎవరైనా గుర్తుచేసుకుంటారా?”

సావర్కర్ దృఢంగా చెప్పాడు – “ప్చ్.. ఎవరూ గుర్తుపెట్టుకోకపోవచ్చు. భరతమాత సంకెళ్లు వీడిన వెంటనే సెల్యులర్ జైలు బందిఖానాగా ఉండకూడదు. భారత రక్షణవ్యూహంలో ఈ దీవులని కీలకంగా మార్చాలి, ముఖ్యంగా – నావిక మరియు వైమానిక దళాల స్థావరంగా! నా అంచనా నిజమైతే ఇది భవిష్యత్తులో ఓ నిఘా కేంద్రంగా మారుతుంది. ఈ అండమాన్ ద్వీపసమూహం భవిష్యత్తులో శత్రువుల నుండి మన దేశాన్ని కాపాడే మొదటి రక్షణ కుడ్యంగా నిలుస్తుంది! మన మాటలు ఇక్కడి గాలిలో నినదిస్తాయి, మన పాటలు ఈ నల్లటినీటి అలలపై సయ్యాటలాడతాయి. మనం ఒక్కొక్కరం దీపపువత్తిలా కాలిపోతున్నాం, కాని మన సమష్టి విప్లవతేజస్సు అమితాభంగా నిలుస్తుంది.”

శ్రద్ధగా వినుమమ్మా, ఓ భారతమాతా!
నీ చిన్నికుమారుని మాట వినుమమ్మా!
నీ పాలతో పెరిగినవాడను,
నీ ప్రేమతో పుష్టిచెందినవాడను,
నా శరీరాన్ని నీ విడుదలకై అర్పించెదను,
నీ ఋణానికి ఇది తొలి కానుకమ్మా !
పునర్జన్మల అనంతంలోనూ,
నా దేహాన్ని నీ విముక్తి హోమంలో సమర్పించెదను!
నా తదనంతరం
ముప్పై కోట్ల స్వాతంత్ర్యయోధులు
వీరత్వంతో ముందడుగు వేసెదరు.
సమస్త కష్టాలను సహించెదరు.
హిమాలయ శిఖరాలపై,
స్వాతంత్ర్య ధ్వజాన్ని ఎగురవేసెదరమ్మా!

***

సావర్కర్‌కు చట్టాలపై లోతైన అవగాహన ఉంది. అతడు అత్యంత ప్రాయోగిక దృష్టితో వ్యవహరించేవాడు. బ్రిటిష్ జులుముని ఎదుర్కోవడానికి వారి స్వంతనిబంధనల సహాయంతోనే పోరాడాలని నిశ్చయించుకున్నాడు. భౌతికబలంతో కాకుండా, బుద్ధిబలంతో, న్యాయపరంగా వారి విధానాలను ఎదిరించాలని భావించాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి పలు దఫాలు కృపాభిక్ష కోసం అర్జీలు సమర్పించాడు. ఇవి కేవలం తన స్వీయరక్షణ కోసం కాకుండా, జైలుజీవితాన్ని వ్యూహంగా మార్చుకొని, తన లక్ష్యానికి చేరువయ్యేందుకు రచించిన శక్తిమంతమైన సాహిత్య పత్రాలు. సావర్కర్ రాజకీయ తత్త్వశాస్త్రం విశేషమైనది. మానవతావాదం, తార్కికత, విశ్వసామరస్య భావన, ప్రజాస్వామ్యం, ప్రయోజనవాదం, వాస్తవవాదం వంటి పలు తాత్త్వికసిద్ధాంతాల మేళవింపు అతని ఆలోచనలలో కనిపిస్తుంది.

8. పుస్తకాల కోసం పోరాటం

బరువైన తడి ఇటుకలు మోసే పనిలో అంతర విరామం. ఖైదీలు ఒకచోట చేరి బడలిక తీర్చుకుంటున్నారు. వామనరావు జోషి జనపనారతో చేసిన తన అంగీలోనుండి ఒక పుస్తకం తీసి చదువుదామని తెరచి భారంగా నిట్టూర్చాడు. “ఇక్కడ మంచి పుస్తకాల గురించి ఆలోచించడమే వృథా.. ఇలాంటి ఒక పుస్తకం పొందడానికి కూడ పదిసార్లు అడగాలి!” అంటూ తన చేతిలోని పుస్తకాన్ని పక్కన పారేశాడు.

జితేంద్రనాథ్ దాస్ దానికి అంగీకారసూచకంగా తల ఊపి అన్నాడు – “పైపెచ్చు మనం పుస్తకాలను మార్చుకోవడం గాని, వాటిలో నోట్స్ రాయడం గాని చేస్తే, కఠిన శిక్షలు వేస్తున్నారు!”

“జైలు మన గుజరాతీ, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, మద్రాసీ విప్లవకారుల భిన్నగళాలతో నిండిపోయింది. మన ఆలోచనలు, మన లక్ష్యం ఒక్కటే! కాని ఛ! మన మేధను ఈ గోడలు నిర్బంధిస్తున్నాయి!” భగత్ రామ్ దిగులుగా అన్నాడు.

“అధికారుల ఇండ్లలో పాచిపనులు చేస్తున్న మన సహోదరుల పుణ్యమా అని అప్పుడప్పుడు వార్తాపత్రికల చిన్న చిన్న ముక్కలు దొరుకుతున్నాయి. లేకపోతే బయటి ప్రపంచపు ఆనుపానులు కూడ మనకి తెలియవు!” బోగా చౌదరి అన్నాడు.

“ఒక పత్రికను ఈ జైల్లోకి తీసుకురావడం కంటే ఏనుగును తేవడం తేలిక!” అన్నాడు వినాయక్.

అందరూ నవ్వారు.

“బ్యారీ మనకొక సవాలు. అతడు పెద్దగా ఏమీ చదువుకోలేదు. మనని చదువుకోనివ్వడు. తాత్వికత, సమాజశాస్త్రం అర్థంపర్థం లేనివిగా కొట్టిపడేస్తాడు. ‘జాతి’, ‘దేశం’ అనే పదాలు ఉంటే చాలు, ఆ పుస్తకాన్ని విప్లవాత్మకమైనదిగా భావించి, నిషేధిస్తున్నాడు. తత్త్వశాస్త్రం అంటే యువతను తప్పుదోవ పట్టించేదిట!” బిభూతి భూషణ్ పెదవి విరిచాడు.

“ఇది మారాలి! జ్ఞానం మీద ఈ బంధనలు ఎంతకాలం కొనసాగుతాయి? మనం మంచి పుస్తకాలు తెప్పించుకునే హక్కుకోసం పోరాడాలి!” అని సావర్కర్ ఆవేశపడ్డాడు.

“ఐతే మనం చదవడానికి కొత్త మార్గాలను కనుగొనాలి. ఒకరికి లభించిన ఒక మంచిపుస్తకాన్ని అందరూ చదవగలిగేలా మారిస్తే?!” త్రైలోక్యనాథ్ చక్రవర్తి సాలోచనగా వినాయక్ వంక చూశాడు.

“ఇదే నా ఆలోచన! మనం రహస్యంగా గ్రంథాలయ వ్యవస్థను ఏర్పాటుచేసి, పుస్తకాలను గుప్తంగా ఒకరినుండి మరొకరికి చేర్చాలి. మన చదువుల యుద్ధం ఇప్పుడు మొదలైంది!”

***

కాలగమనంలో మార్పు వచ్చింది. ఖైదీలు వార్తలను తెలుసుకునేందుకు కొత్త గుప్తమార్గాలను కనుగొని, మేధకు పదును పెట్టుకున్నారు. తమ ఇళ్లనుంచి పుస్తకాలు తెప్పించుకునే అనుమతిని పొందారు. సావర్కర్ ఏళ్ల తరబడి చేసిన కృషి ఫలించి, పరిమితమైన వనరుల మధ్య జైల్లో ఓ చిన్నపాటి గ్రంథాలయం ఏర్పాటైంది. దాని నిర్వహణ ఖైదీలకే అప్పజెప్పారు. బ్యారీ తరువాత వచ్చిన అధికారి ఈ మార్పుకు అంగీకరించాడు.

వామనరావు ఆనందంగా ఒక పుస్తకాన్ని తిరగేస్తూ సంబరపడిపోయాడు – “వివేకానంద, టాల్‌స్టాయ్, మజ్జిని, అనీ బిసెంట్, బ్లంట్ష్లీ.. ఇవన్నీ మన చేతుల్లోకి వచ్చాయి! వినాయక్ జీ, ఇది మీ అభీష్టఫలం!”

సావర్కర్ చిరునవ్వుతో జోషి భుజం తడుతూ “ఈ చిన్న విజయం మనందరికీ చెందింది. ఇక చదవండి, ఆలోచించండి, మార్పును తీసుకురండి. చదువుతోనే మన మనోబలాన్ని పెంచుకోగలం!” అన్నాడు.

ఇలా, వినాయక్ దృఢసంకల్పం వల్లే కఠినమైన నిర్బంధం, ఒక జ్ఞానసముపార్జన కేంద్రంగా మారింది. కాలక్రమేణా, రామాయణం, మహాభారతం, హెర్బర్ట్ స్పెన్సర్, జె.ఎస్. మిల్స్ రచనల సహా దాదాపు రెండువేల పుస్తకాలను సేకరించగలిగాడు. అతడు తన తోటి రాజకీయ ఖైదీలతో మాట్లాడే అవకాశం పొందాడు. వారు ఇంచుమించుగా పాతికేళ్ల వయస్సు దాటని యువకులు. ధైర్యసాహసాలు కలిగినవారే అయినా, చరిత్ర, నాగరికత, పాలనల గురించి వారికి స్పష్టమైన అవగాహన లేదు. ఆ క్లిష్టపరిస్థితుల్లో, సావర్కర్ వారికి చదువుపై ఆసక్తిని ప్రేరేపించాడు. “మన జీవితాలు వృథా పోయాయి” అనే భావనతో ఉన్న ఖైదీలలో నూతన ఉత్సాహాన్ని నింపాడు. ఇంతే కాదు, చదువుకుంటేనే బుద్ధి వికసిస్తుందని, రాజకీయ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు అది సహాయపడుతుందని సహఖైదీలకు నూరిపోశాడు. యుద్ధానంతర ప్రపంచంలో భారతదేశం తన స్థానాన్ని ఎలా సుస్థిరం చేసుకోవాలో కూడ అతడు వారితో చర్చించేవాడు: “..మాట్లాడే స్వేచ్ఛ, మతస్వాతంత్య్రం, ప్రార్థనాస్వేచ్ఛ, సంఘాల ఏర్పాటు వంటి మౌలికహక్కులను అందరూ సమానంగా అనుభవించాలి. ప్రజాశాంతి, సామాజికశ్రేయస్సు, జాతీయ అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఈ హక్కులపై ఏదైనా పరిమితి విధించినా, ఆ నిషేధాలు ఏకపక్షంగా మతం లేదా జాతి ఆధారంగా కాకుండా, సమగ్ర జాతీయ ప్రయోజనాల దృష్టితో మాత్రమే అమలులోకి రావాలి” అని చెప్పేవాడు. తన ఏకాంత నిర్బంధాన్ని ఒక విద్యాలయంగా మార్చుకుని, యువఖైదీలకు చరిత్ర, తాత్త్వికత, రాజకీయశాస్త్రం వంటి విషయాలను పాఠాలుగా బోధించేవాడు.

***

సావర్కర్ యువఖైదీల మానసిక వికాసానికి విద్య, మేధోపరమైన చర్చల ప్రాముఖ్యతను గుర్తించి జైల్లో ‘నలంద విహార్’ అనే అనౌపచారిక విద్యాకార్యక్రమాన్ని ప్రారంభించాడు. తన అద్భుతమైన జ్ఞాపకశక్తి కారణంగా, గతంలో చదివిన పుస్తకాల సారాంశాలను సహఖైదీలతో చర్చించేవాడు. అలాగే తన రచనాప్రస్థానాన్ని కొనసాగించేందుకు ప్రేరేపించేవాడు. ఈ జైలుగోడలపై చేసిన వ్రాతలే “హిందుత్వ: హిందువు ఎవరు?” గ్రంథానికి పునాది వేశాయి. నలంద విహార్ ద్వారా, సావర్కర్ జైలుగోడలమధ్య ఉన్న ఖైదీలకు విద్యాప్రేరణను ఇచ్చాడు. మొదటగా వాళ్లు తమ మాతృభాష నేర్చుకోవాలని, ఆ తర్వాత హిందీని జాతీయ భాషగా అభ్యసించాలని, చివరగా ఇతర ప్రాంతీయ భాషలపై ప్రావీణ్యం సాధించాలని ప్రేరేపించాడు. ఈ విధంగా, చాలమంది ఖైదీలు మరాఠీ నేర్చుకుని, సావర్కర్ రచనలను అర్థం చేసుకునే స్థాయికి వచ్చారు. దశాబ్దం చివరికి, ఖైదీలలో అక్షరాస్యత శాతం ఎనభైకి చేరుకుంది!

9. శుద్ధి ఉద్యమం

జైలును నిర్వహించే సిబ్బందిలో – పెట్టీ ఆఫీసర్లు, జమాదార్లు, వార్డర్లే కాక, తక్కువ శిక్ష పడిన కొంతమంది నేరస్థులు కూడ ఉండేవారు. ఐతే, వీరిలో ఎక్కువశాతం పఠాన్, సింధీ, బలోచి ముస్లిములే ఉండేవారు. వీరంతా అధికారి బ్యారీకి నమ్మకస్థులుగా కనిపించడం కోసం అతడికి చాడీలు చెప్పేవారు, ఖైదీలపై దాడులు, వేధింపులు జరిపేవారు. రాజఖైదీలు అధిక శాతం హిందువులే, వారిని ‘కాఫిర్’ (అవిశ్వాసి) అని పిలిచేవారు. మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు నుండి వచ్చిన ముస్లిం ఖైదీలను కూడా ‘ఆధా కాఫిర్’ అని హేళన చేసేవారు. హిందూ ఖైదీలకు యజ్ఞోపవీతం ధరించే హక్కు లేదు. ముస్లిం ఖైదీలు గడ్డం పెంచుకోవచ్చు, వారికి మతపరమైన సెలవులు, పని మినహాయింపులు ఉండేవి. రామ్ రఖా అనే పంజాబీ బ్రాహ్మణుడు తన యజ్ఞోపవీతాన్ని బలవంతంగా తొలగించడాన్ని తట్టుకోలేక ప్రాణత్యాగం చేశాడు.

తమ స్వార్థం కోసం, వినోదం కోసం అధికారులు మతమార్పిడిని ప్రోత్సహించేవారు. నియమాన్ననుసరించి ఖైదీలందరికీ అన్నం, రొట్టెలు సమానంగా ఇచ్చేవారు. బలోచీలు అన్నం కంటె రొట్టెలను ఎక్కువగా ఇష్టపడతారు. వారు ఇతరుల కంచాల్లోనుండి రొట్టెలు లాగేసుకునేవారు. అలా ఎంగిలైన కంచంలోని ఆహారాన్ని ముట్టుకోవడానికి ఆచారవంతులైన ఖైదీలు ఇష్టపడేవారు కాదు. వారిని తోటి హిందువులేమో వెలివేసేవారు.

1920 ప్రాంతంలో భీకరాకారుడైన ఓ ముస్లిం ఖైదీ, ఓ గుజరాతీ హిందూ ఖైదీతో స్నేహం పెంచుకుని, మతాంతరం చేయాలని యత్నించాడు. అతడిని దురాశతో శారీరకంగా కూడ వేధించేవాడు. ఈ విషయం తెలుసుకున్న బాబారావు, ఓ గుమస్తా సహాయంతో గుజరాతీ ఖైదీని వేరే గదికి మార్పించాడు. దీంతో తీవ్రంగా కోపగించిన ఆ ముస్లిం ఖైదీ తన పాన్ దాన్‌తో బాబారావు తలపై బలంగా కొట్టాడు. రక్తస్రావంతో బాబా నేలకొరిగాడు. ఐతే, నేరస్తుడిని శిక్షించాల్సింది పోయి, బ్యారీ అతడిని ప్రశంసిస్తూ, “బాబారావుకు మాబాగా బుద్ధి చెప్పావు!” అని అభినందించాడు.

పఠాన్లు ఖైదీలను ఎక్కువ శిక్షిస్తామనే బెదిరింపులతో లేదా పొగాకు/కొబ్బరిముక్క ఇస్తామనే చిన్న చిన్న ప్రలోభాలతో, ఇస్లాం మతాన్ని స్వీకరించేందుకు ప్రేరేపించేవారు. వారికి ముస్లింపేరు పెట్టి, పూర్తిగా ఇస్లాంలోకి మార్చేవారు. ఇలా నెలకొకసారైనా జరిగేది. ఇస్లాంని స్వీకరించిన ఖైదీలు ఇక పాతమిత్రులతో ఎలా కలవగలరు? హిందూ ఖైదీలు కూడా వారిని తమలో కలుపుకోవడానికి ఆసక్తి చూపేవారు కాదు. దాంతో మతాంతరం మరింత బలపడేది.

వినాయక్ దానికి విరుగుడుగా ‘శుద్ధి’ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. శుద్ధి ప్రక్రియ చాలా సరళంగా ఉండేది – తులసి ఆకులు నమిలి, భగవద్గీతలోని ఏదైనా ఒక శ్లోకం పఠించడం మాత్రమే. ఆర్య సమాజం ఖైదీలు, హోతీలాల్ వర్మ వంటి పాత్రికేయులు ఈ ఉద్యమంలో చేరారు. శుద్ధి అంటే సావర్కర్ దృష్టిలో కేవలం మతపరమైన అంశం కాదు. సాంస్కృతిక పరిరక్షణ, ఐక్యత, దౌర్జన్యపూరిత మతమార్పిడులకు ప్రతిస్పందన.

ఇది ముస్లిం అధికారులకు ఆగ్రహాన్ని తెప్పించింది. వినాయక్ ఆహారంలో విషం కలిపారు. ఐతే, అన్న బాబారావు అప్రమత్తంగా ఉండడం వల్ల తాత్యా ప్రాణాలతో బయటపడ్డాడు.

***

ఓ స్వాతంత్ర్య దేవీ!
సువర్ణ భూమిలో నీకు ఏమి తక్కువ?
రోజూ కొత్తగా కోహినూరు పుష్పమాలను అలంకరించుకో!
ఈ సమస్త ఐశ్వర్యాలతో కూడిన మా భారతతల్లిని
ఎందుకు వదిలేసి వెళ్లిపోయావు?
ఆమె ఎందుకు పరుల దాసిగా మారిపోయింది?
నా హృదయం తల్లడిల్లుతున్నది,
నా గుండె తరుక్కుపోతున్నది,
దీనికి సమాధానం ఇవ్వు స్వాతంత్ర్య దేవీ!

***

మొదటి ప్రపంచయుద్ధ సమయంలో, జైలులోని పఠాన్ వార్డర్లు, ముస్లిములు అఫ్గాన్ సైన్యం భారత్ను ఆక్రమించి, మళ్లీ ఇస్లామిక్ పాలన ప్రారంభిస్తుందని ఆనందించారు. ఐతే, తుర్కుల పరాజయం తర్వాత వారు తీవ్రనిరాశకు గురయ్యారు. ఈ కాలంలోనే, సావర్కర్ విప్లవకారుడి దశనుంచి రాజకీయ తాత్వికుడిగా మారాడు. ‘హిందూ సంఘటిత్వం’ అనే సర్వభారత హిందూ ఐక్యత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, ఆర్యులు భాగస్వాములుగా ఉండాలి అని భావించాడు. ఇదే తరువాతికాలంలో ‘హిందుత్వ’ సిద్ధాంతంగా రూపాంతరం చెందింది, భారతదేశానికి ఐక్యతా భావనను అందించే ప్రయత్నంగా మారింది. అతడిని ప్రభావితం చేసిన భావజాలం శుద్ధభారతీయత. భాషను మరింత సంస్కృతమయం చేయడం ద్వారా దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో సావర్కర్ మరాఠీ భాషాశుద్ధికి కూడ కృషి చేశాడు.

10. బుద్ధిమంతుడు

1920. మార్చి 30.

అండమాన్ దీవుల ఉగ్రవాతావరణం, జైలులోని అమానవీయ పరిస్థితులు, నిత్యం శ్రమతో కూడిన శిక్షలు -వీటన్నింటినీ ఓడించగల మొక్కవోని ధైర్యం, పట్టుదల, సహనం వినాయక్ సావర్కర్ లోనే కనిపించాయి. ఐతే, ఈ అనుభవాలను ఎదిరిస్తూ అతడు బ్రిటిష్ ప్రభుత్వానికి 1911 నుంచి ఇప్పటివరకు ఐదు దయాహర్జీలు (mercy petitions) సమర్పించాడు. బ్రిటిష్ అధికారులకు మెల్లగా తెలిసొస్తున్నది – ‘ఈ మనిషిని మరిన్ని రోజులు జైలులో ఉంచడం తమకు ఓ పెద్ద ప్రమాదం!’ అని.

వినాయక్ తన జైలుగదిలో చుట్టూ ఉన్న కదలని గోడలను చూస్తూ నిలబడ్డాడు. చీకటిని చీల్చే కిరణంలా అతడి మనసులో ఒక ఆలోచన మెరిసింది. శత్రువు అజేయసంపన్నుడు, బలవంతుడు. వాడితో యుద్ధం అంటే మన దగ్గరున్న కొద్దిపాటి ఆయుధాలు అసలే సరిపోవు; తెగువ ఒక్కటే చాలదు. ఇలాంటి యుద్ధానికి శివాజీ మహారాజులా ఆలోచించగలిగిన మానసిక స్థిరత్వం ఉండాలి, అది వ్యూహాత్మకంగా కూడ ఉండాలి.

బ్రిటిష్ రాజు ఐదవ జార్జ్ సామూహిక క్షమాభిక్షకై బహిరంగ ప్రకటన చేసి ఉన్నాడు. రాజకీయ ఖైదీలకు శరణు కోరుకునే అవకాశం కల్పించాడు. మాంటేగు – చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలు బ్రిటిష్ పాలనలో కొత్త అధ్యాయాన్ని తెరిచాయి. కాని ఈ రాయబారాలు నిజమైన మార్పుకు నాంది పలుకుతాయా లేదా ఇది భారత్ కోసం బ్రిటిష్ వారు పన్నిన మరో పన్నాగమా?

సావర్కర్ కింద కూర్చొని ఒక కాగితం తీసుకున్నాడు. తన చేతులను నెమ్మదిగా తిప్పుతూ నొప్పులు తీర్చుకున్నాడు. రోజంతా శరీరాన్ని ఛిద్రం చేసే శ్రమ. చేతులనిండా ముళ్లు పొడుచుకున్నాయి, మృదుత్వం పోయింది. రామ్ బాన్స్ ఆకులనుంచి తెల్లటి గోగును వేరు చేస్తూ, లోపలి నారను గట్టిగా లాగుతూ, ఆ చేతులు తరచుగా రక్తంతో తడిసిపోయేవి. బ్రిటిష్ అధికారులకు ఇది కేవలం అండమాన్ ద్వీపపు వనరులు దోచుకునే మరో ప్రక్రియ. కాని తనకు? యాతనామయమైన శిక్ష. “పరాయిదేశాన్ని ఆదుకునే వస్త్రాలు తయారు చేయడానికి, మా స్వేచ్ఛను పణంగా పెట్టాల్సిందేనా?” అతడు తనలో తానే ఆలోచించాడు. ఇది మానసిక సహనానికి కూడా పరీక్ష. ఇవే కష్టాలు తనను కఠినంగా మార్చాయి, ఇవే తన శత్రువులకు ఉచ్చుగా మారబోతున్నాయి.

తన అక్షరాలతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని తికమక పెట్టగలదనే ఆత్మవిశ్వాసంతో చేతిలోని కలం పైకెగిరింది, వేటాడే గద్దలా. కాగితంపై సిరాతో ఒక సరికొత్త వ్యూహం రచించసాగింది. కావాల్సినదేమిటి? తన విడుదల. తన ప్రజల భవిష్యత్తు. నేరుగా ఇదే అడిగితే ఇస్తారా? ఇవ్వరు. అందుకే, వారికి కావాల్సింది వారికి ముందు ఇవ్వాలి. అప్పుడు తనకు కోరుకునే, తీసుకునే పైచేయి వస్తుంది. అతడి అక్షరాలు మరింత లోతుగా మెలికలు తిరిగాయి.

ఈ వినతిపత్రం ద్వారా, నేను బ్రిటిష్ ప్రభుత్వానికి నా నిబద్ధతను తెలియజేస్తున్నాను. నా మునుపటి చర్యలను పునఃపరిశీలించాను. బ్రిటిష్ పాలన కింద నా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. నా విడుదల, ప్రభుత్వ హితాన్ని దృష్టిలో ఉంచుకుని సమాజానికి మేలే చేయగలదు.”

దీపం మసకబారుతున్నది. ఒక అక్షరం తరువాత మరో అక్షరం కొనసాగుతున్నది. పైకి ఇది ఒక వాగ్దానం, తలొగ్గేయడం లాగా అనిపించినా – అతడి మనసులో తెలివైన చిరునవ్వు మెరిసింది – వారికి కావలసిన మాటలు ఇవే. తన స్వేచ్ఛను గెలుచుకోవాలంటే – కలెక్టర్లు, లెఫ్టినెంట్లు, రాజపాలకులు ఉన్న పాలనా వ్యవస్థలో బంధితుడిగా ఉన్నా, తానే ఒక వ్యూహకర్త కావాలి. గదిలోని దట్టమైన చీకటిమూలల్లోంచి ఒక చుంచు కిచకిచమని బయటకు పరిగెత్తింది. అంటే అక్కడ బొద్దింకల కోసం ఒక కాళ్లజెర్రి చేరిందనమాట. శత్రువు నీడలు చూస్తున్నాడు. అవి వాడికి అర్థం అయేలోపు తన ఆట ఆడేయాలి!

‘ఒక వ్యక్తి బందీగా ఉండి, శత్రువుతో శాంతిపరమైన మార్గంలో చర్చలు జరుపుతానని నిరూపించగలడా?’ ఆ ప్రశ్నకు సమాధానంగా, వినాయక్ తన కలాన్ని కాగితంమీద మరింత నిశ్చయంగా నడిపాడు. ఇతర రాజకీయ ఖైదీలు విడుదల అవుతుండగా, తనను మాత్రం జైల్లోనే ఉంచడం అన్యాయమని అతడు వాదించాడు. “నేను కూడా రాజకీయం కారణంగా అరెస్టయినవాడినే, నా కేసును కూడా మిగతావారిలానే పరిగణించాలి” అని పేర్కొన్నాడు. తాను ఒక బుద్ధిమంతుడైన నాయకుడనని, శాంతిపరమైన మార్గంలో సమాజానికి ఉపయోగపడతానని నిరూపించేలా తన మాటలను ఒదిగి రాశాడు. “నేను మార్పుకు సిద్ధంగా ఉన్నాను,” అని రాశాడు. నిజంగా మారుతున్నది ఎవరు? బ్రిటిష్ పాలకులు తనను విడిచిపెట్టినంత మాత్రాన, తన లక్ష్యాన్ని వదిలిపెట్టేసే మనిషి కాదు సావర్కర్!

అతడి దవడ బిగుసుకుంది. ఓరచూపుతో తన నలువైపులా ఉన్న గోడల అడ్డంకులను మరోసారి చూసి, గట్టిగా తల ఊపాడు. “వీటిని బద్దలు కొట్టే యుద్ధం కొనసాగుతున్నది,” అని తనకు తానే చెప్పుకున్నాడు.

***

1920.జులై 12

“నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. నీ వినతిని మళ్లీ తిరస్కరించాం, సావర్కర్,” బ్రిటిష్ అధికారి కృత్రిమమైన నవ్వు చిందించాడు.

సావర్కర్ కూడ నవ్వుతూనే ఆ టెలిగ్రామ్ ఉత్తర్వులను అందుకున్నాడు. అరచేతులు చెమట పడుతుండగా కాగితం అంచున అతడి వేళ్లు బిగిశాయి. ఒక క్షణం నిశ్శబ్దం నెలకొంది. మైనం దీపం వణుకుతూ, జైలు గోడల మీద పొడవైన నీడలు వేసింది.

“తిరస్కరించారా?” అతడి స్వరం కొద్దిగా చల్లగా మారింది. కొద్దిగానే. మరుక్షణంలోనే సర్దుకున్నాడు. పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. “స్వాతంత్ర్యం వినతులతో రాదు, గవర్నర్.. కానీ ప్రతీ తిరస్కరణ నా సంకెలల గొలుసును బలహీనపరుస్తుంది. ప్రతి గొలుసులోనూ ఒక బలహీన క్రమం ఉంటుంది.”

అధికారి అసహనంగా పెదవులు బిగించాడు. సావర్కర్ కదలలేదు. అతడి మనసులో అప్పుడే మరో వ్యూహం రూపొందుతున్నది.

***

1919 డిసెంబర్ 24న, బొంబాయి ప్రభుత్వం రాజకీయఖైదీల క్షమాభిక్షపై పరిశీలనకు సిద్ధంగా ఉందని ప్రకటించింది. ఐతే, ఈ క్షమాభిక్ష నుండి సావర్కర్ సహోదరులను మినహాయిస్తామని స్పష్టంగా పేర్కొంది. ఆ తర్వాత 1919 డిసెంబర్ 30న, భారత ప్రభుత్వం కూడ అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. ఈ నిర్ణయం మహారాష్ట్రలో తీవ్రనిరసనలకు దారి తీసింది. వివిధ పత్రికలు సావర్కర్ సహోదరులపై ఉన్న వివక్షను తప్పుబట్టాయి. బొంబాయి శాసనమండలిలో దత్తోపంత్ బెల్వీ ఈ విషయంలో ప్రశ్నను లేవనెత్తినా, బొంబాయి ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఒప్పుకోలేదు. 1920 జులై 12న, సావర్కర్ రాసిన ఆరవ, చివరి వినతిపత్రం తిరస్కరించబడింది. సావర్కర్ బ్రదర్స్‌పై బ్రిటిష్ పాలకుల కక్షసాధింపు, వారి మహత్తర త్యాగాన్ని మరింత స్పష్టంగా ప్రపంచానికి తెలియజేసింది! అది ఓటమి కాదు. క్లెమెన్సీ ప్రొక్లమేషన్ ద్వారా బ్రిటిష్ వారు తమ నిజస్వరూపాన్ని మరోసారి బయట పెట్టారు. మాంటేగు – చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలు ప్రగతిశీలమైనవి కావని, అవి కేవలం ప్రజలను ఊసరవెల్లి వాటంగా నడిపించడానికి మాత్రమే ఉద్దేశించినవని స్పష్టమైంది.

11. దీవి వెనుక – దేశం ముందే

1921. మే 1.

కాపలా బురుజులో సాయంత్రపు గంట మోగింది. అండమాన్ సెల్యులర్ జైలులో మరో రోజు నిస్సహాయంగా ముగిసింది. వీడీ సావర్కర్, శారీరకంగా క్షీణించినా, మనసులో మాత్రం ఓడిపోలేదు. నూనెకొట్టు తాళం వేసి, జమాదార్‌కు తాళంచెవులు అప్పగించాడు. తన గదివైపు నడుస్తుండగా, ఓ వార్డర్ వేగంగా నడుచుకుంటూ వచ్చి అతడి చేతిలో ఒక పత్రాన్ని దోపాడు. ఆ మనిషి కన్నుల్లో ఆనందపు కాంతి మెరుస్తున్నది.

సావర్కర్ ఆ కాగితాన్ని జాగ్రత్తగా మడత విప్పాడు. గుండె ఆత్రంగా కొట్టుకుంటున్నా, ముఖం మాత్రం శాంతంగా ఉంది. ఇంతకాలం ఎన్నో అపోహలు, తప్పుడువార్తలు విన్నాడు. కానీ ఈసారి ఏదో భిన్నంగా అనిపించింది. అది ప్రభుత్వముద్రను మోస్తున్న కాగితం. తన దృష్టిని కిందకు సారించి పూర్తి ఏకాగ్రతతో ఆ ఉత్తర్వులను చదివాడు – తాను, తన అన్న గణేశ్ దామోదర్ సావర్కర్, ఇద్దరూ భారత్‌కు వెళ్లనున్నారు. బొంబాయి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని స్పష్టం అయింది.

వెచ్చనైన భావోద్వేగాల తుఫానొకటి అతడిలో ఉధృతంగా ఎగసిపడింది. ఒక దశాబ్దం పాటు గోడలు, ఒంటరితనం అతడి ప్రపంచంగా మారిపోయాయి. కాని ఇప్పుడు, ఈ క్షణం ఎదురైనపుడు అతడికి సంతోషం, ఉపశమనం – ఏదీ అనిపించలేదు. నిజంగా ఇది విడుదలేనా? లేక ఇంకో మోసమా? బాబాకి ఈ వార్త అందిందా? జైలులో ఎక్కువ శారీరక కష్టాన్ని భరించింది బాబారావే. అతడు తాత్యా కంటే ముందు అండమాన్ జైలులోకి వచ్చాడు, మరింత ఎక్కువ హింసను, వ్యాకులతను అనుభవించాడు, భార్యను కోల్పోయాడు, నిశ్చింత జీవితానికి దూరమయ్యాడు. “తాత్యా స్వాతంత్ర్యసంగ్రామానికి కిరీటం, నేను బలమైన గట్టు” అని బాబారావు భావించేవాడు. అతడి నిస్వార్థం, త్యాగస్వభావం ఎన్నడూ ఎక్కడా తగ్గలేదు. అటువంటి అన్న ఉండబట్టే ఇక్కడ పదేళ్లు గడపగలిగాడు. ఈ తరలింపుతో విధి మరోసారి మమ్మల్ని బొంబాయిలో వేరు చేస్తుందా అని వినాయక్ అనుమానపడ్డాడు.

అప్పటికే ఈ వార్త జైల్లో అగ్నికీలలా వ్యాపించింది. ఖైదీలు పరుగులెత్తుకుంటూ వచ్చారు, ఏడు పొడవాటి వరండాల్లో వారి అరుపులు మారుమోగాయి. “బాబూజీ! మీరు స్వేచ్ఛ పొందారు!”

సిక్కు ఖైదీలు, నిత్యపోరాట వీరులు అతడిని గట్టిగా హత్తుకున్నారు. “మీరు పది సంవత్సరాలు ఈ నరకాన్ని అనుభవించారు. మీ కష్టం ఈనాటికి ఫలించింది. ఇక, మీవెంటే మేము కూడ స్వేచ్ఛను పొందగలమని నమ్ముతున్నాం.”

వారి సంతోషపు కన్నీటిచుక్కలు ఒక్కొక్కటి నేలపై రాలుతున్నా, సావర్కర్ మాత్రం తన ఉద్వేగాన్ని అదుపు చేసుకున్నాడు. గత పదేళ్లలో అండమానుల్లో ఎంతోమంది ఆత్మీయమిత్రులను సంపాదించుకున్నాడు. ఇప్పటికే టికెట్ పొందాడు. త్వరలోనే ఇక్కడ స్వేచ్చగా ఉండే మనిషిగా, తన సొంత ఇంట్లో, తన కుటుంబంతో జీవించగలడు. కాని ఇప్పుడు దేశానికి వెళితే మళ్లీ జైలుపాలు కావలసి వస్తుంది. మిత్రులను కోల్పోతాడు, బంధాలు తెగిపోతాయి. దేశం విడిచి అండమానులకు రావాల్సి వచ్చినప్పుడు ఎంత బాధపడ్డాడో, ఇప్పుడు ఈ దీవులను విడిచిపెడుతున్నప్పుడు అంతకంటె ఎక్కువ వేదనను అనుభవిస్తున్నాడు. జీవితంలో మరోసారి ‘కాలాపానీ’కి వెళుతున్నట్లు అనిపిస్తున్నది.

తన స్వేచ్ఛ గురించి కాదు, తాను వదిలివెళ్ళిపోతున్న వారినిగురించి ఎక్కువ బాధపడ్డాడు. ఇంకా ఎన్నో జీవితాలు ఈ అంధకార గృహంలో మగ్గిపోతాయని తెలుసు. ఈ ఖైదీలు మరెన్ని ఉషోదయాలను ఇనుప ఊచల వెనుకనుంచి చూడాలి? మరెన్ని కలలు ఈ రాతిగోడల కింద నలిగిపోవాలి?

ఆ రాత్రి ముసిరిన ఆలోచనలు అతడిని నిద్రపోనివ్వలేదు. పదకొండేళ్లుగా గడిపిన ఈ చీకటి గది – చీకటే కాదు, ప్రతీ గోడ నిప్పులా మండే బాధ, శ్రమ, సుదీర్ఘ నిరీక్షణను మోస్తూ ఉండేది. కానీ ఇప్పుడు.. ఆ గోడలు అతడిని అదిమిపెట్టలేవు. ఆకలి, శ్రమ, శిక్ష, అవమానం, అణచివేత – ఇవన్నీ తన శరీరాన్ని ముక్కలు చేశాయేమో కానీ, తన సంకల్పాన్ని తాకలేకపోయాయి.

మరుసటి ఉదయం, జైలు అధికారి అతన్ని ఆఫీసుకు పిలిచాడు. అండమాన్ నుండి విడుదలకు చివరి ప్రక్రియ మొదలైంది. ‘డి’ ఖైదీ దుస్తులను విప్పివేసి, అతడు 1910లో తొలిసారిగా పట్టుబడినప్పుడు ధరించిన అవే పాత బట్టలు తిరిగి ఇచ్చారు. అవి వేసుకున్నప్పుడు డొక్కలెండిపోయిన తన శరీరంపై పరాయిచర్మంలా అనిపించాయి, తాను మరొక జీవితంనుంచి వచ్చినట్లు అనిపించింది.

జైలు సూపరింటెండెంట్ ముర్రే తన చేతిని ముందుకు చాపాడు. “భవిష్యత్తును జాగ్రత్తగా చూసుకోండి,” అన్నాడు. ఆ మాటల్లో ఒక హెచ్చరిక దాగి ఉంది.

సావర్కర్ తల ఊపాడు. “యుద్ధం ముగియలేదు, మేజర్. కేవలం రంగస్థలం మారింది.”

సెల్యులర్ జైలు గేట్లు భారీ శబ్దంతో డబడబా తెరచుకున్నాయి. ఈ మృత్యుడేరా నోరు తెరచి పదేళ్ల తర్వాత వారిరువురినీ బయట పడేసింది. మరణానికి మరో రణానికి మధ్యలో ఉన్న గడపను దాటారు. అన్నదమ్ములిద్దరినీ జైలుగేటు దగ్గర కొత్త గార్డులకు అప్పగించారు. ఈసారి, వారికి సంకెళ్లు వేయాల్సిన అవసరం లేదని చెప్పడంతో, వారి ప్రయాణం మరింత గౌరవప్రదంగా మారింది.

విడిచిపోతున్న క్షణంలో, ఓ ఖైదీ కంటతడి పెట్టుకుంటూ తాత్యారావుకు మొగలిపూల మాల వేసి గుండె చల్లబడేలా ఆశీర్వదించాడు. కొందరు ఆనందబాష్పాలతో పెద్దగా రోదించారు. ఈ ఆప్యాయతకు సావర్కర్ సహోదరులు చలించిపోయారు. విడిపోతూ, వినాయక్ ఒక సందేశాన్ని ఇచ్చాడు –

“ఒక దేవుడు, ఒక దేశం, ఒక ఆశయం,
ఒక జాతి, ఒక జీవితం, ఒక భాష!
వీటికి కట్టుబడి ఉంటాం.”

అని వారిచేత శపథం చేయించాడు.

స్వేచ్ఛగా బయట జీవించే ఖైదీలు జైలుముందర అతడిని కలవడానికి గుమిగూడారు. పండ్లు, పూలు, మిఠాయిలు, సోడాసీసాలు, బిస్కెట్ పొట్లాలు – ఒకటా రెండా ఎన్నెన్నో – అతడికి కానుకలు ఇస్తూనే ఉన్నారు.

“సావర్కర్ బాబూ, మీరు వెళ్లిపోతున్నారు.. మమ్మల్ని మరిచిపోరుకదూ?”

“ఈ గోడలు నిన్ను చాలా నలిపాయి, కానీ నీలోని దీప్తిని తీసుకోలేకపోయాయి!”

సావర్కర్ చిరునవ్వు తో “స్వేచ్ఛను ఊహల్లో కాక, యథార్థంగా గెలుచుకోవాలి,” నెమ్మదిగా అన్నాడు.

సముద్రపు ఉప్పటివాసన గాలితో ఛెళ్ళున ముఖాన్ని తాకింది. అతడి చొక్కా పక్షిరెక్కలా రెపరెపలాడింది. ఒకప్పుడు ఈ దీవి శాశ్వతనిర్బంధం అనిపించింది. కాని ఇప్పుడు అదే సముద్రమార్గం అతడిని స్వేచ్ఛ వైపు(?) నడిపించబోతున్నది. అదే సముద్రం తిరిగి అతడి తల్లిఒడిలోకి ప్రవహిస్తున్నది. ఈ క్షణం ఆ నీటిలో చేపలా ఈదాలనిపిస్తున్నది. పంటిబిగువున తనను తాను నియంత్రించుకున్నాడు. ఎందుకంటే ఇది తనకు అసంపూర్ణ విడుదల మాత్రమే. రత్నగిరిలో నిర్బంధమట.

అన్నదమ్ములిద్దరూ శరీరాలకు గాయాలు మిగిలినా, చెక్కుచెదరని మనోధైర్యంతో విజయులై ముందుకెళ్తున్నారు. వెనుక సెల్యులర్ జైలుగేట్లు మూసుకుపోయాయి. తీరానికి దూరంలో కలకత్తా వెళ్లనున్న ఎస్సెస్ మహారాజ స్టీమరు ఆశాదీపంలా నిలుచుని ఉంది. గుండె వేగంగా కొట్టుకుంది – సావర్కర్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు.

ఇదేనా నన్ను భయపెట్టిన నరకం?

ఇదేనా వేలాది సమరయోధుల రక్తంతో పునీతమైన బంధనశిబిరం?

నౌక కదిలింది. అండమాన్ అతడి చూపుకు మాయమైంది. నీలినేత్రాలలో ఒక అపరిమితమైన జ్యోతి తొణికిసలాడింది. నేటి వీడ్కోలు, రేపటి గెలుపుకు ఆరంభం.

***

సావర్కర్ పిటిషన్లన్నీ తిరస్కరించబడినా అతడి దేశభక్తి, త్యాగస్వభావం, అపారసహనం ముందు గండ్రసంకెళ్లు మైనంలా కరిగిపోయాయి. సహాయ నిరాకరణ ఉద్యమం, మాంటేగు-చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల వల్ల పెరుగుతున్న ఒత్తిడుల కారణంగా కొంతమంది రాజకీయ ఖైదీల విడుదలపై పునర్విమర్శ జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం తన వైఖరిని మార్చినట్లు కనిపించినా, సావర్కర్‌ను కఠిన నియంత్రణల కింద ఉంచాలని నిర్ణయించింది. అతడిని అండమాన్ నుంచి షరతులతో విడుదల చేసి రత్నగిరిజైలుకి తరలించారు. 1924 జనవరి 6న మాత్రమే అతడికి పూర్తి స్వేచ్ఛ లభించింది.

స్వాతంత్ర్యలక్ష్మికి జై! వందేమాతరం!!”

భారతదేశం 1947లో స్వతంత్ర అయింది. సావర్కర్ పోరాటం కేవలం ఒక ఉద్యమంగా మాత్రమే కాదు.. ఒక ఆలోచనగా, ఒక ధైర్యస్ఫూర్తిగా మిగిలిపోయింది. అతడికి అడ్డుకట్ట వేయబోయిన బ్రిటిష్ పాలకులు గతానికి చెందిపోయారు. కాని సెల్యులర్ జైలుగోడల ప్రతి ఇటుకలో అతడు రాసిన పదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. అతడు జైల్లో రాసిన రచనలు, చేసిన వ్యూహాలు భారతస్వాతంత్ర్య ఉద్యమంపై చెరగని ముద్ర వేశాయి. సావర్కర్ తత్త్వం భారతదేశాన్ని ఐక్యంగా ఉంచే గొప్ప రాజకీయ మేధస్సుగా నిలిచింది. సావర్కర్ కవిత్వం స్వేచ్ఛకోసం గానంచేసిన సంగీతం. అతడి వేదన కవిస్వరం పొందిన విప్లవం. అతడి కథ భారతస్వాతంత్ర్య పోరాటంలో అజరామరం.

స్వేచ్ఛాదీప్తి అవిరామంగా ప్రకాశిస్తుంది!”


అంకితం

సిల్వర్ జైలుని నిర్మించిన కాలంలో (క్రీ.శ.1896-1906) అక్కడి చెట్లను కొట్టి, కొండను చదును చేసి; రాళ్లని, మట్టిని బుట్టలతో, తట్టలతో తలమీద మోస్తూ బండ్లలో నింపి వాటిని ఎద్దులవలె లాగుతూ (ప్రస్తుత నేతాజీ స్టేడియం ఉన్న) తటీయ పల్లపు ప్రదేశంలో నింపిన – చరిత్రకు అనామకులైన – అసంఖ్యాక తెలుగు ఖైదీల శ్రమకు, త్యాగానికి, స్వాతంత్ర్యస్ఫూర్తికి ఈ కథ అంకితం.

Exit mobile version