నా..
మా..
అనే పదాలు మరచి
‘మన’ అనే పదం..
ఉచ్చరించలేని..
మహానుభావులుగా
చెలామణి అయ్యే..
స్వార్థ జనావళికి,
వారి స్నేహానికీ,
స్వస్తి పలికేస్తా!
ముఖస్తుతితో
మునగచెట్టు ఎక్కించి,
పొగడ్తల మత్తుతో
ఒళ్ళు పులకింపజేసి ,
నా వీపు వెనక..
నా శీలాన్ని వెక్కిరించే,
నక్కజిత్తుల
నాగన్నల స్నేహానికి
స్వస్తి పలికేస్తా!
అవసరానికి ఒకలా,
అవసరం తీరాక మరోలా,
మనిషిని లెక్కగట్టే
మాయమనుష్యుల
స్నేహానికి,
మరో ఆలోచన లేకుండా,
స్వస్తి పలికేస్తా!
హోదాల గర్వంతో,
‘మనీ’ ఉందన్న మదంతో
స్నేహాన్ని
చిన్నచూపు చూసే,
ఇరుకు బుద్ధి..
మకిలి మనస్సుల
మురికి స్నేహానికి,
స్వస్తి పలికేస్తా!
కులంతో..
మతంతో..
ప్రాంతంతో..
భాషతో..
స్నేహాన్ని ముడిపెట్టే,
కుచ్చిత బుద్ధుల,
దొంగస్నేహానికి..
స్వస్తి పలికేస్తా!
నిండు హృదయంతో,
నన్ను నేను నమ్ముతూ
నిజాయితీగా బ్రతికేస్తా..!!
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.