[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘శ్రీమద్రమారమణ’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము. డల్లాస్ లోని సిరికోన సంస్థ – నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నవల ఇది.]
[ప్రొద్దుటూరులో జరిగే హరికథా సప్తాహంలో తన పేరు నమోదు చేయించుకోడానికి వెళ్తాడు వైనతేయ. పేర్లు నమోదు చేసుకునే ఆయన వైనతేయని చూసి ఆశ్చర్యపోయి, శివుడి మీద ఒక పద్యమో శ్లోకమో చెప్పమని అడిగితే, ఆయన అనుమతితో లలితా సహస్రనామంలోని ధ్యానశ్లోకాన్ని రాగయుక్తంగా పాడి వినిపిస్తుంది. అక్కడ చేరినవారంతా వైనతేయని అభినందిస్తే, స్థానిక ఆడిటర్ నాగరాజశర్మ గారు మెచ్చుకుని వంద రూపాయలు కానుకగా ఇస్తారు. తర్వాత అగస్త్యేశ్వర స్వామివారిని దర్శించుకుని వస్తాడు. వైనతేయ హరికథా గానం చేయవలసిన తేదీ, సమయం ఒక కాగితం మీద రాసిస్తాడాయన. నంద్యాలకి తిరిగివచ్చి అమ్మానాన్నలతో గడిపి, బేతంచెర్లలో దస్తగిరిసారు ఇంటికి వెళ్తాడు. సారుకు, కాశింబీకి మొక్కుతాడు. ప్రొద్దుటూరు హరికథా సప్తాహం గురించి సార్కు చెబితే, తిరుపతి వెళ్ళి సదాశివశర్మ గారిని కలిసి ఆయన మార్గదర్శనం తీసుకుందామని అంటాడు. ఈలోపు లైబ్రరీలోని పుస్తకాలు అధ్యయనం చేస్తాడు వైనతేయ. సదాశివశర్మ గారింటికి వెళ్తారు. శర్మగారు, వకుళమ్మ ఎంతో సంతోషిస్తారు. బయట భోం చేసి వచ్చినందుకు వకుళమ్మ నొచ్చుకుంటుంది. ప్రొద్దుటూరు హరికథాసప్తాహం గురించి చెప్పి, తాను తయారుచేసిన కాయితాలని శర్మగారికిస్తాడు వైనతేయ. ఆయన దాన్ని పరిశీలించే లోపు కొండ పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని వస్తారు దస్తగిరిసారు, వైనతేయ. రాత్రి భోజనాలయ్యాక, శర్మగారు వైనతేయకి ఎన్నో సూచనలు చేస్తారు. మర్నాడు కూడా మరికొన్ని జాగ్రత్తలు చెప్తారు. వచ్చేసే ముందు శర్మగారి పాదాలకు నమస్కరిస్తాడు వైనతేయ. – ఇక చదవండి.]
తదేక దీక్షతో ప్రాక్టీసు చేయసాగాడు. శంకరుని కథ ఆధ్యాత్మిక విషయాలతో నిండి ఉంటుంది. సామాన్యులకు అంతగా ఆసక్తికరంగా ఉండని మాట నిజం. దాన్ని ఎలా మలిస్తే బాగుంటుందో.. అతనికి ఒక అవగాహన వచ్చింది. తల్లి అతన్ని సన్యాసం స్వీకరించడానికి అనుమతించకపోతే, ‘నదిలో మొసలి పట్టుకొన్నదని, సన్యాసం స్వీకరిస్తే తప్ప కాలిని వదలనంటున్నద’ని అబద్ధం చెప్పడం, పరకాయ ప్రవేశంతో రాజు శరీరంలోకి ప్రవేశించి, దాంపత్య రహస్యాలను తెలుసుకోవడం, చండాలునితో (శివుని) తో సంవాదం, ఇలాంటి హ్యుమన్ ఎలిమెంట్స్ను ప్రదర్శిస్తే, ప్రేక్షకులు ఆనందిస్తారని అనుకున్నాడు.
ప్రొద్దుటూరు హరికథా సప్తాహం రానే వచ్చింది. వైనతేయ తల్లిదండ్రులు, దస్తగిరిసారు దంపతులు వచ్చారు. రామ్మునిగౌడు “పిల్లడు హరికత ఎట్ల చెప్తాడో చూస్తా” అని రావడం విశేషం. వైనతేయకు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు కేటాయించారు.
వివిధ మంటపాలతో, దూరదూరంగా, ఒకేసారి నాలుగైదు హరికథా గానాలు జరుగుతున్నాయి. అటు విజయనగరం, బరిస్సా లోని బరంపురం, పర్లాకిమిడి నుంచి, ఇటు గోదావరి జిల్లాల నుండి, అటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ తెలంగాణ జిల్లాల నుండి, ఇటు కర్నాటక రాయచూరు, మైసూరు, బెంగుళూరుల నుండి హరికథా విద్వాంసులు విచ్చేశారు. ఏడు రోజులకు మొత్తం 35 మంది నమోదు చేసుకున్నారు. వారిలో వృద్ధులు, మహిళలు కూడా ఉన్నారు. అందరిలో చిన్నవాడు మన వైనతేయనే!
వైనతేయకు మేకప్ వేశారు. సాక్షాత్తు బాలశంకరుని వలె ఉన్నాడు. వంగపండు రంగు పంచె, కాషాయం రంగు దట్టి, కాళ్లకు గజ్జెలు, మెడలో చేమంతిమాల. చిడతలు, హార్మోనిస్టును, తబలిస్టును కళాకారులే తెచ్చుకోవాలి. దస్తగిరిసారు హార్మోనిస్టు. తబలిస్టును సారే ఏర్పాటు చేశాడు. ఆయన పేరు జయరాములు. ఆయనది రామళ్లకోట. ముగ్గురూ రిహార్సల్స్ బాగా చేసి ఉన్నారు.
హరికథా గానాలు వీక్షించడానికి హరికథా ప్రియులందరూ పెద్ద సంఖ్యలో విచ్చేసినారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరులోని లాడ్జీలన్నీ నిండిపోయాయి.
ప్రతి హరికథకునికీ, ముందు వరుసలో కూర్చుని, పాండిత్యం, అభినయం, గాత్రం, ఇలా పాయింట్లను ఇద్దరు న్యాయనిర్ణేతలు ఇస్తున్నారు.
వైనతేయ వేదిక మీదికి వచ్చి అందరికీ నమస్కరించాడు. ముందుగా విఘ్నేశ్వరస్తుతి. మోహనరాగం. అది సంస్కృత శ్లోకం కాకుండా తెలుగు పద్యం పాడి అందరినీ ఆకట్టుకొన్నాడు. అది అందరికీ తెలిసిన పద్యమే. కానీ మోహన రాగంలో ఒదిగి భక్తులను అలరించింది.
ఉ.:
“తొండము నేకదంతమును దోరపు బొజ్జయు వామహస్తమున్,
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్,
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యల కెల్ల నొజ్జవై,
యుండెడి పార్వతీ తనయ! ఓయీ గణాధిప! నీకు మ్రొక్కెదన్!”
“భక్తులారా! ఈ రోజు మీకు నేను ఆదిశంకరాచార్యుల చరిత్రను హరికథాగానం చేయబోతున్నాను.’ అని వాయిద్య సహకారం అందించే వారిని సభకు పరిచయం చేశాడు. తన గురువులను, ఆదిభట్ల వారిని స్మరించుకున్నాడు.
‘శృతి స్మృతి పురాణానాం..’ అన్న సదాశివశర్మ గారు చెప్పిన శ్లోకాన్ని మధురంగా ఆలపించాడు.
శంకరుడు, నదిలో తన కాలిని మొసలి పట్టుకుందని, సన్యాసం స్వీకరిస్తే తప్ప విడవదని తల్లితో చెప్పాడని చెబుతూ, ఈ పద్యం ఖరహరప్రియ రాగంలో ఆలపించాడు.
తే.గే.:
మొసలి కాలుబట్టె; మోచనంబివ్వదు
సన్యసించినంత సంతసించు
జనని! సమ్మతింపు, చావును తప్పింపు
వేరు దారి లేదు ప్రేమ రాశి!”
తర్వాత, ‘అమ్మా, సమ్మతి నీయవే, సుతుని చేకొమ్మా, బంగారుతల్లి’ అన్న పల్లవితో, తల్లి మనసు కరగేటట్లు, ఒక పాట పాడాడు. అది తనే రాశాడు. దాన్ని తిల్లాంగ్ రాగంలో కూర్చాడు. ఆ పాట ముగిసిన వెంటనే, చప్పట్లు మారుమ్రోగాయి.
మధ్యలో చలోక్తులతో రక్తి కట్టించాడు. పరమశివుడు ఆదిశంకరునికి, ఛండాల రూపంలో ఎదురై కనువిప్పు కలిగించి, “మనిషి, దేవుడు వేరు కాదు, ఒక్కరే అన్న అద్వైత సిద్ధాంతాన్ని ప్రవచించిన నీవే నన్ను పక్కకు తొలగమని నీ శిష్యులంటుంటే మిన్నకున్నావే? నీకిది తగునా?” అని నిలదీసే దృశ్యాన్ని ఈ పద్యంతో ఆవిష్కరించాడు.
ఉ.:
“నన్ను శరీరిగా దలచి, నా పొడ గిట్టక పోవుమంటివో?
మిన్నగ వెల్గు నాత్మనని మేలుగ జూసి గ్రహించలేవొకో?
ఎన్నియొ ధర్మశాస్త్రముల నిట్లు రచించిన యాదిశంకరా!
నిన్నును నన్ను నొక్కటిగ నెయ్యముతో ఘటియింపలేవొకో?”
కల్యాణి రాగంలో వైనతేయ పాడిన ఈ పద్యం అద్భుతంగా సాగింది. చివరగా, సాక్షాత్తు పరమేశ్వరుని అవతారమే శంకరుడు అని సదాశివశర్మ గారు చెప్పిన ‘కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీల లోహితః’ అన్న శ్లోకంతో ముగించాడు.
చివరి రోజు ఫలితాలు ప్రకటించారు. ప్రథమ బహుమతి, పార్వతీపురానికి చెందిన తిరువేంగళాచార్యులు గారికి రూ. పదివేలు, రెండవ బహుమతి కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన నరసింహ భాగవతార్ గారికి రూ. ఎనిమిది వేలు, మూడవ బహుమతి యానాదుల దిబ్బకు చెందిన వైనతేయ గారికి రూ. ఐదువేలు ప్రకటించారు, చివరగా అందర్నీ వడబోసిన న్యాయనిర్ణేతలు. వారికి శాలువా, జ్ఞాపిక బహుకరించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగారు వీరశివారెడ్డి ముఖ్య అతిథి.
వైనతేయ తల్లిదండ్రులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయినారు. తిరుపాలమ్మ వాడిని కౌగిలించుకొని, నుదుట ముద్దాటింది. దస్తగిరిసారు కళ్ల వెంట ఆనందబాష్పాలు. అలా తన తొలి విజయాన్ని నమోదు చేసుకొన్నాడు వైనతేయ. అతని ఫోటో, వివరాలు పేపర్లో కూడా వేశారు.
కడప ఆర్ట్స్ కాలేజీలో కూడా ప్రిన్సిపాల్ గారు, ఒక సభ చేసి, అతన్ని అభినందించి సన్మానించారు.
***
వైనతేయ ఫైనల్ యియర్కి వచ్చాడు. దస్తగిరిసారుకు ప్రమోషన్ ఇచ్చి, సోమయాజుల పల్లె అప్పర్ ప్రైమరీ స్కూలుకు హెడ్మాస్టరుగా వేశారు. అది చాలా చిన్న ఊరు. కర్నూలు – కడప హైవే మీద, రెండు పట్టణాలకు ఇంచుమించు మధ్యన ఉంటుంది.
ఆయన నంద్యాలలో కాపురం పెట్టి, సోమయాజుల పల్లెకు తిరగసాగాడు. ముప్పావు గంట ప్రయాణం; బస్సులో. ఒక బజాజ్ చేతక్ స్కూటరు కొనుక్కున్నాడు. టైం సేవ్ అవుతుందని. ఆయన నంద్యాలలో కాపురం ఉండడానికి మరో కారణం కూడా ఉంది. శిష్యుడు వైనతేయకు, తన దగ్గరికి వచ్చిపోవడానికి దగ్గరని, అనుకూలమని. వాడంటే అంత ప్రాణం ఆ గురువర్యునికి.
గురువు ముందు శిష్యునికి విద్యలో ఓనమాలు నేర్పుతాడు. వైనతేయకు సంగీత గురువు దస్తగిరి సారే! ఆయన హార్మోనిస్టు. గొప్ప గాయకుడు కాదు. సంగీత పరిజ్ఞానం, రాగజ్ఞానం ఉన్నాయి. ఈ అయిదేళ్లలో శిష్యుడు సంగీత, సాహిత్యరంగాలలో ఆరితేరాడు. ఒక రకంగా చెప్పాలంటే దస్తగిరిసారు స్థాయిని మించిపోయాడు. కానీ, వాటికి ఆ ఆలోచనేరాదు. ఆయనంటే అంత గౌరవం, ప్రేమ. శిష్యుడు డాక్టరేట్ చేసి, యూనివర్సిటీ ప్రొఫెసర్ ఐనా, చిన్నపుడు ఎలిమెంటరీ స్కూల్లో తనకు చదువు చెప్పిన టీచర్కు పాదాభివందనం చేసే సంస్కృతి మనది. “ఢిల్లీకి రాజైనా, తల్లికి కొడుకే కదా!”
సంగీత సాహిత్యాలలో తన పరిమితులు సారుకు తెలుసు. అందుకే, ప్రొద్దుటూరు హరికథా సప్తాహం పోటీలకు, మార్గదర్శనం చేయడానికి, వైనతేయను సదాశివశర్మ గారి దగ్గరికి తీసుకువెళ్లాడాయన. ‘తన కొలది తాను ఎరిగినవాడు’ దస్తగిరిసారు. లౌకికమైన, విద్యా, ఉద్యోగ విషయాలలో మాత్రం ఆయనే వాడికి దిక్సూచి.
నంద్యాల, కజిన్ వలీ, అన్నయ్య తన దగ్గరికి వస్తున్నందుకు ఆనందించాడు. నడిగడ్డ వీధి లోనే ఆయనకు ఇల్లు చూసి పెట్టాడు. మూడు గదులు; వరుసగా ఉన్నాయి. చివరిది కిచెన్ కమ్ డైనింగ్ రూమ్. ఇంట్లోనే కొళాయిలు, పైన ఓవర్ హెడ్ ట్యాంక్. మునిసిపాలిటీ వారి మంచి నీళ్ల కొళాయి కనెక్షన్ కూడా ఉంది. కాశింబీకి నీళ్ళు మోసుకునే పని తప్పింది.
వైనతేయ వచ్చి, మినీలారీలో బేతంచెర్ల నుంచి సామానులు తరలించడం, నంద్యాల లోని కొత్తింట్లో సామానులన్నీ అమ్మకు సర్ది యివ్వడం చేసి వెళ్లిపోయాడు. తిరుపాలమ్మ కూడా వచ్చి సాయం చేసింది.
ప్రొద్దుటూరులో బహుమతి వచ్చింతర్వాత, వైనతేయకు పోగ్రాములు రాసాగాయి. రెండు నెలలకోసారి ఎవరో ఒకరు ఆహ్వానించేవారు. గజేంద్రమోక్షం, విప్రనారాయణ, శ్రీకృష్ణతులాభారం, భక్తశిరియళ వంటి కథలను, తగిన మార్పులను చేసి చెప్పేవాడు. ప్రతి పోగ్రాముకు వెయ్యిన్నూట పదహార్లు, మధ్యలో భక్తుల చదివింపులు రెండు మూడు వందలు వచ్చేవి. కాని ఈ చదివింపులు కథనానికి అవరోధం అవుతున్నాయని గమనించి, వైనతేయ ముందుగానే, భక్తులకు విజ్ఞప్తి చేసేవాడు. ప్రోగాం చివరలో రమ్మని.
రాయచోటి, హిందూపురం, గద్వాల, ఆత్మకూరులలో పోగ్రాములు చేశాడు వైనతేయ. మంచిపేరు తెచ్చుకున్నాడు. పాండిత్య ప్రదర్శన కాకుండా, పామర జన రంజకంగా హరికథ ఉండాలని, సింహచలశాస్త్రిగారు, తిరుపతి కళాశాలలో చెప్పిందానిని తు.చ. తప్పకుండా ఆచరిస్తున్నాడు.
ఫైనల్ యియర్ చివర, కళాశాల వార్షికోత్సవం జరిపారు. వైనతేయకు ఒక ఆలోచన వచ్చి, ఇంగ్లీషు లెక్చరర్ డేవిడ్ రాజు గారితో చెప్పాడు –
“సార్. మన వార్షికోత్సవంలో, నేను షేక్స్పియర్ ‘హామ్లెట్’ నాటకం లోని సాలలొక్వే (స్వగతాలు) లను, యథాతథంగా, తర్వాత సరళమైన తెలుగు పద్యాలలో, అభినయించి ప్రదర్శిద్దామని అనుకుంటున్నాను. మీ ఆశీస్సులు కావాలి.”
అతని గొంతులో వినయం ఉట్టిపడింది. ఆ వినయమే అతన్ని గురుప్రియుడిని, జనప్రియుడిని చేసింది. ‘విద్యా దదాతి వినయమ్’ అన్నది వైనతేయుని పట్ల అక్షరసత్యం!
ఇంగ్లీషు సారు సంతోషించాడు. “ఇట్ విల్ బి యాన్ అల్టుగెదర్ డిఫరెంట్ రెండరింగ్, వైన!” అన్నాడు. “ది సాలిలొక్వేస్ ఇన్ హామ్లెట్ ఆర్ ఫిలసాఫికల్ అండ్ డీప్. ఐ విల్ గైడ్ యు యాజ్ టు హౌ యు కెన్ డు జస్టిస్ టు ది స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్. బట్ రిగార్డింగ్ తెలుగు పోయమ్స్, మ౦గా మేడమ్ విల్ హెల్ప్ యు. ఓకె?” అన్నాడు.
“థాంక్యూ సార్!” అన్నాడు వైనతీయ ఆనందంగా.
ఇద్దరూ కలిసి రెండు స్వగతాలను ఎంపిక చేశారు. ఒకటి, ఆత్మహత్య చేసుకుందామని, హామ్లెట్ అనుకొని, సందిగ్ధతతో, చెప్పేది – ‘టు బి ఆర్ నాట్ టు బి, దటీజ్ ద క్వశ్చన్’. రెండవది, ‘హౌ ఆల్ అకేషన్స్ డు ఇన్ఫార్మ్ అగైనెస్ట్ మి’ అనేది. మొదటిది మూడవ అంకంలో, మొదటి దృశ్యంలో వస్తుంది (ACT 3, Sc 1); రెండవది, నాటకం చివరి స్వగతం. అది నాలుగవ అంకంలో, నాల్గవ దృశ్యంలో (ACT 4, Sc 4) వస్తుంది.
ఆ రెండింటినీ, రైమ్ అండ్ రిథమ్కు అనుగుణంగా, ఇంగ్లీషులో పాడటం ప్రాక్టీసు చేశాడు. షేక్స్పియర్ ఎక్కువగా అంత్యానుప్రాసను కాకుండా, బ్లాంక్ వర్స్ (రైమ్ లేనిది) వాడాడు. దానిని ఫ్రీ వర్స్ అని కూడా లాక్షణికులు పిలుస్తారు. తర్వాత వాటి సారాంశాన్ని తెలుగు పద్యాలుగా రాసుకున్నాడు. వాటికి రాగాలు కూర్చాడు.
వార్షికోత్సవంలో మూడవ అంశం వైనతేయది. దస్తగిరిసారు వచ్చాడు. ఈ కొత్త ప్రయోగం పట్ల ఆయన చాలా ఆసక్తిగా ఉన్నాడు. తెలుగు పద్యాలలో అలమేలుమంగ మేడమ్ కొన్ని మార్పులు చేశారు.
సభకు ముఖ్య అతిధిగా, కడప మున్సిపల్ చైర్మన్ శ్రీ అహ్మద్ బాషా గారిని ఆహ్వానించారు. బహుమతి ప్రదాదనం జిల్లా కలెక్టర్ గారి సతీమణి శ్రీమతి జాహ్నవీ కౌర్. ఆమె పంజాబీ. ఆమె భర్త గుర్వీందర్ సింగ్ కడప కలెక్టరు.
“ఇప్పుడు మన పైనలియర్ విద్యార్థి వైనతేయ, షేక్స్పియర్ వ్రాసిన ప్రసిద్ధ నాటకం హామ్లెట్ లోని రెండు సాలిలొక్వేలను ప్రదర్శిస్తాడు” అని ప్రయోక్త, జువాలజీ మేడమ్ కనకమ్మ గారు ప్రకటించారు.
వైనతేయకు డెన్మార్క్ రాజకుమారుడు హమ్లెట్గా కొంత మేకప్ వేశారు. అతడు వేదిక పైకి వచ్చి అందరికీ అభివాదం చేసి, హామ్లెట్ క్యారెక్టర్ గురించి, అతను పడిన అంతర్మథనాన్ని గురించి రెండు నిమిషాలు చక్కని ఇంగ్లీషులోపు ప్రసంగించాడు. తర్వాత మొదటి స్వగతాన్నిపారంభించాడు.
స్వగతం తనలో తాను చెప్పుకునే ఆలోచనా స్రవంతి. కేవలం ప్రేక్షకులకు తెలియాలని నటుడు బిగ్గరగా చెబుతాడు. తెలుగు నాటకాలలో ‘తనలో’ అని ‘ప్రకాశముగ’ అని బ్రాకెట్లలో స్వగతాన్ని సూచిస్తారు.
To be or not to be
that is the Question:
whether ‘tis nobler in
the mind to suffer
The slings and arrows
of outrageous fortune
Or, to take Arms
against a sea of troubles
And by opposing end them.
To die, to sleep, No more
And by a sleep, to say
The heart ache and
the thousand natural shocks
That Flesh is heir to?
“ఈ స్వగతం చాలా పెద్దది. సమయాభావం వల్ల కొంత భాగాన్నే తీసుకున్నాను. దాని సారాంశాన్ని, తెలుగు పద్యాలతో ఇప్పుడు అలపిస్తాను. ఇది సీస పద్యం. సింధు భైరవి రాగం” అన్నాడు.
దస్తగిరిసారు హార్మోనియంతో రెడీగా ఉన్నాడు. శృతి ఇచ్చాడు
సీ.:
“జీవనంబును రోసి చింతించు మనిషికి
మరణంబె శరణంబు మహిని నెపుడు
కడలి బోలిన కష్టమిడుముల నిడగను
మిగులపు వెత కంటే తగును చావు
వాటి కెదురుగను వజ్రంపు సదృశమౌ
సంకల్పమున గెల్చి మనగ వలయు
ఏది సరియగునొ యెఱుక లేక విసిగి
అస్తినాస్తుల విచికిత్స క్రుంగి
తే.గీ.:
చచ్చిపోయిన, క్షణములో చావు వెతలు
బ్రతికియుండిన శుభముల బడయవచ్చు
తేల్చుకోలేని నా బుద్ది తీవ్రమయిన
మానసిక బాధ నొందుచు మరుగుచుండె”
సభలో కరతాళధ్వనులు!
~
కం॥
మిత్తికి చిక్కిన మానిసి
నిత్తరి తన స్వానుభవము నేర్పడ జెప్పన్
చిత్తమ సాధ్యము, నెవ్వరు
నిత్తావుకు మరలిరారు యెప్పటికైనన్
~
కలెక్టరుగారి భార్య నివ్వెరపోయారు. షేక్స్పియర్ రాసిన దాన్ని ఎంత చక్కగా Pronounce చేశాడు ఈ అబ్బాయి? ఆమెకు తెలుగు రాదు కాబట్టి, పద్యాలు అర్థం కాలేదు. రెండూ తెలిసినవారు ఒక రకమైన థ్రిల్కు లోనయ్యారు.
ఈ ప్రోగ్రాం చేస్తూండగానే, వైనతేయ మస్తిష్కంలో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. షేక్స్పియర్ నాటకాలను తెలుగు లోకి అడాప్ట్ చేసుకొని, పద్యాలు, పాటలు కూర్చి, హరికథలుగా ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహే అతనిలో నూతనోత్తేజాన్ని నింపింది. దాని ప్రభావం రెండో స్వగతం మీద ప్రతిఫలించింది.
“How all occasions do
inform against me
And spur my dull
revenge! What is a main
of his Chief good and
market of his time
Be but to sleep and feed
a beast, no more
Sure, he that made us
with such large discourse
Looking before and after
gave us not that capability, and
god-like reason
To fust in unused”
ఈ స్వగతాన్ని చక్కని స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్లో ఆలపించి, దాని సారాన్ని ఒక మత్తేభవృత్తంలో వివరించాడు.
మ.:
“సకలంబైన పరిస్థితుల్ నను నిటుల్ సామర్థ్యహీనుండుగా
ప్రకటించంగ, పగన్ ఘటించక, క్రియా రాహిత్య శాపంబునన్
ఒకటే లక్ష్యము తిండి నిద్ర గలుగన్ ఒప్పారు నీ జీవితం
బకళంకంబగు యత్న స్ఫూర్తి కలుగన్, ప్రాణంబు సార్థక్యమా!”
“ఫ్రెండ్స్, గాడ్ హజ్ గివెన్ అజ్ రీజన్ అండ్ క్యాపబిలిటీ. మియర్ స్లీప్ అండ్ ఫూడ్ డజ్ నాట్ మేక్ వన్ హ్యూమన్. అవర్ ఫ్యాకల్టీస్ రస్ట్ వెన్ వియ్ టేక్ రెస్ట్. హామ్లెట్ హింట్స్ అట్ యాక్టివిటి అండ్ రీజన్.”
తే.గీ.:
“వాడకుండిన జీవముల్ వసినివాడు
దేవుడిచ్చిన సువివేక దీప్తి దనర
హేతుబద్ధత, సామర్థ్య హీనుడవక
ఇలను చరియించువాడె రాజలును సతము”
పద్యాలకు వైనతేయ కూర్చిన రాగాలు, దస్తగిరిసారు హార్మోనియం, వాటిని సుసంపన్నం చేశాయి. ఈ కొత్త ప్రయోగాన్ని అందరూ చాలా వినూత్నంగా ఉందని మెచ్చుకున్నారు.
దస్తగిరిసారు గద్గదమైన స్వరంతో ఇలా అన్నాడు “నాయనా! రాను రాను నాకందనంత ఎత్తుకు ఎదుగుతున్నావు. ఆకాశమే నీ పరిమతి కావాలని నా ఆశీస్సు!”
“యు హావ్ డన్ ఎ మిరాక్యులస్ జాబ్!” అని మెచ్చుకున్నాడు ఇంగ్లీషుసారు డేవిడ్ రాజు.
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా, రీడర్గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్లో సీరియల్గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.