[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘శ్రీమద్రమారమణ’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము. డల్లాస్ లోని సిరికోన సంస్థ – నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నవల ఇది.]
[స్లాబ్స్, వాటి పాలిషింగ్ పరిశ్రమకి ప్రసిద్ధి చెందిన బేతంచెర్లకి చేరతారు దస్తగిరి, కాశింబీ, వైనతేయ. తాను పనిచేసే జిల్లా పరిషత్ హైస్కూలులో వైనతేయని చేరుస్తాడు దస్తగిరిసారు. వైనతేయకు ఈ స్కూలు, ఇక్కడి టీచర్లు బాగా నచ్చుతారు. ఇంగ్లీషు సారు రాకాసారు చెప్పిన కాబూలీవాలా పాఠం వైనతేయకు బాగా నచ్చుతుంది. ఆయన పాఠం వివరిస్తుండగా, అందులోని ఒక విషయాన్ని కాళిదాసు కూడా చెప్పాడని ఆ వివరం చెప్తాడు వైనతేయ. రాకాసారు ఆశ్చర్యపోతాడు. స్టాఫ్రూమ్లో తోటి టీచర్లతో విషయం చెబితే, సోషల్ టీచర్ మస్తానయ్య వైనతేయ ప్రతిభని పొగుడుతాడు. తెలుగు సార్ కూడా – వాడు పద్యాలను రాగయుక్తంగా, శ్రావ్యంగా చదవగలడని మెచ్చుకుంటాడు. రాత్రి భోజనాలయ్యాక, పొద్దున్న రాకాసారు చెప్పిన కాబూలీవాల పాఠం గురించి దస్తగిరిసారుతో చెబితే, ఆయన దాన్ని అభినయించి చూపమంటే, చేసి చూపిస్తాడు వైనతేయ. బాగుందని అంటూ, ఇకపై పాఠాలలోని కొన్ని అంశాలను హావభావాలతో వివరించమని చెప్తాడు. కాబూలీవాలా గురించి వైనతేయ రాసిన వ్యాసంలో చిన్న చిన్న తప్పులుంటే వాటిని దిద్ది ఇస్తాడు. మర్నాడు బడిలో రాకాసారు ఆ వ్యాసాన్ని చూసి మెచ్చుకుంటాడు. కాశింబీ అనారోగ్యం పాలవుతుంది. ఆమెకు గర్భసంచీ తీసేయాల్సి వస్తుంది. కూతురు వచ్చి కొన్ని రోజులు తల్లికి సేవలు చేసి వెళ్తుంది. ఆ తర్వాత, దస్తగిరిసారు కూడా టైఫాయిడ్కి గురై, మంచం పడ్తాడు. వారిద్దరూ కోలుకునేదాక అన్ని పనులూ తానే చేస్తూ, జాగ్రత్తగా చూసుకుంటాడు వైనతేయ. ఛార్లెస్ డికెన్స్ వ్రాసిన ఆలివర్ ట్విస్ట్ నవలను సంక్షిప్తీకరించి, పదో తరగతి పిల్లలకి నాన్-డీటెయిల్డ్గా పెడతారు. రాకాసారు ఆ పాఠం చెప్పినప్పుడు, వైనతేయకి అది బాగా నచ్చేస్తుంది. పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యకమాలలో పాల్గొనే పిల్లలను పేర్లివ్వమంటారు. దస్తగిరిసారుని అడిగి, ఆలివర్ ట్విస్ట్ కథని హరికథగా చెప్తానని, తన పేరిస్తానని అంటాడు వైనతేయ. – ఇక చదవండి.]
రెండు రోజులు తదేక దీక్షతో ‘ఆలివర్ ట్విస్ట్’ కథను హరికథగా తయారు చేశాడు వైనతేయ. ఆ అనాథ పిల్లవాడు వర్క్ హౌస్లో పడిన కష్టాలను ఒక పాటగా వ్రాశాడు. దానిని భూపాలరాగంలో స్వరపరిచాడు.
కేవలం, మరో రొట్టె కావాలని, భోజనంలో అడిగినందుకు అనాథాశ్రమం కేర్ టేకర్ ట్విస్ట్ను ఎన్ని చిత్రహింసలు పెట్టాడో ఒక ఉత్పలమాలలో వివరించాడు. దాన్ని కల్యాణిలో ట్యూన్ చేశాడు.
‘పేదరికం నేరాలకు దారితీస్తుంది’ అనీ ఒక విశ్వజనీన సత్యాన్ని తేటగీతిలో కూర్చాడు. వ్యభిచారిణి ఐనా, నాన్సీ యొక్క ఉదాత్త వ్యక్తిత్వాన్ని, ట్విస్ట్ పట్ల ఆమె చూపించిన ప్రేమను, చివరగా ఆమె హత్యకు గురయిన ఉదంతాన్ని వివరించాడు.
చివరగా, తల్లిదండ్రులు లేని, వీధిబాలలు, సంఘవ్యతిరేకశక్తులుగా మారకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన, సమాజం పైన ఉందనే సందేశంతో హరికథను ముగించాడు.
దస్తగిరి సారు, రాకాసారు, మల్లికార్జునయ్యసారు వైనతేయ రాసిన దానికి కొన్ని మార్పులు చేశారు. మెరుగులు దిద్దారు.
స్కూలు వార్షికోత్సవం. డోన్ ఎమ్.ఎల్.ఎ. శిఖామణి గుప్త ముఖ్య అతిధి. బేతంచెర్ల సి.ఐ. ఆంబ్రోజ్ గారు ప్రత్యేక ఆహ్వానితులు. హెడ్ మాస్టర్ అనంతపద్మనాభయ్య గారు సభకు అధ్యక్షులు. వైనతేయకు పదిహేను నిమిషాలు కేటాయించారు.
పాఠశాల వార్షిక నివేదిక, క్రీడలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం, పిల్లలకు బూందీలడ్డు పంపకం అయింతర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి
చివరగా, “టెంత్ -’బి’ విద్యార్థి వైనతేయ హరికథా ప్రదర్శన” అని ప్రకటించారు.
వైనతేయ హరిదాసు వేషంలో స్టేజి మీదకు వచ్చాడు. అందరికీ నమస్కరించాడు. దస్తగిరిసారు ఎవరిదో హార్మోనియం తెప్పించి పెట్టుకొన్నాడు. క్రాఫ్ట్ టీచర్ రంగస్వామికి డోలక్లో ప్రవేశముంది. వాళ్లిద్దరూ హరిదాసుకు వాద్యసహకారం అందిస్తారు
“సభికులారా! ఈ రోజు నేను గానం చేస్తున్న హరికథ, ప్రఖ్యాత రచయిత ఛార్లెస్ డికెన్స్ వ్రాసిన నవల ఆలివర్ ట్విస్ట్!” అనగానే వేదిక మీద నున్న ఎం.ఎల్.ఎ, సి.ఐ. గారితో పాటు సభిలందరూ ఆశ్చర్యపోయారు. ‘ఇంగ్లీషు నవలను హరికథ చెబుతాడా?’ అందరిలో ఆసక్తి నెలకొంది.
“ఈ కథను క్లాసులో మాకు బోధించిన రాకాసారుగారికి, హరికథకు మెరుగులు దిద్దిన మా తెలుగు సారు గారికి, నాకు జీవితా న్నిచ్చిన మా దస్తగిరి సారుగారికి, మా గరువర్యులు శ్రీ ఆంజనేయ శర్మగారికి, శ్రీ సదాశివ శర్మగారికి సవినయ ప్రణామం. ముందుగా విఘ్నేశ స్తుతి!” అని చెప్పి,
“అత్రాగచ్ఛ జగద్వంద్య గీర్వాణ పరిపూజిత।
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ॥”
అంటూ దర్బార్ కన్నడ రాగంలో వినాయకుని స్తుతించాడు.
“ఆర్యులారా, ఈ కథ అనాథ బాలలకు సంబంధించింది. అందుకే ‘అనాథనాథ!’ అని స్వామిని సంబోధించాను.” అన్నాడు.
కాషాయం రంగు ధోవతి కట్టుకుని, నడుముకు ఆకుపచ్చ రంగు దట్టీ బిగించాడు. నుదుట తిరునామం. చేతిలో చిడతలు. మణికట్టులకు చిన్న పులమాలలు చుట్టుకొన్నాడు. మెడలో కదంబమాల. సాక్షాత్తు బాల నారాయణదాసు గారి వలె ఉన్నాడు వైనతేయ.
“కేవలం ఒక రొట్టె అదనంగా కావాలని అడిగినందుకు కేంద్రం నిర్వాహకుడు ఆలివర్ను తీవ్రంగా కొడతాడు. ఆ సంఘటనను, ఒక ఉత్పలమాలా వృత్తంలో, కల్యాణి రాగంలో వైనతేయ ఆలపించిన తీరు వీక్షకుల గుండెల్లో తడికి కారణమైంది.
ఉ.:
ఆకలి తీరలేదనుచు నక్కరతో నొక రొట్టె కోరగన్
ఆ కఠినాత్ముడైన దొర ఆ పసిబాలుని చావబాదె; నీ
లోకము లోననాథలను, రోయగ జీవిత మట్లు క్రుంగగా
చౌకొని వారినుద్ధరణ చేసెడి వారలు లేరె? అక్కటా!
పిల్లలు నేరస్థులుగా మారడానికి పేదరికమే కారణం అని అన్యాపదేశంగా ఛార్లెస్ డికెన్స్ సూచించిన విశ్వసత్యాన్ని వాచ్యంగా వైనతేయ ఒక తేటగీతిలో ఆలపించాడు.
తే.గీ.:
పేదతనమది శాపంబు, భీకరంబు
నేరవృత్తికి కారణ మిదియె ధరను
బాల నేరస్థులెల్లరు బలులు గాదె
లేమి యను క్షుద్రశక్తికి, రీతి ఇదియె”
వేశ్య ఐన నాన్సీ వ్యక్తిత్వాన్ని చక్కగా ఆవిష్కరించాడు. ‘ఆమె శరీరం మలినమైనా, ఆమె మనసు పవిత్రం’ అన్నహరికథకుని మాటలకు చప్పట్లు! చివరగా ఒక సోషల్ మెసేజ్తో హరికథను ముగించాడు.
కం.:
“తలిదండ్రి లేని పిల్లల
వెలివేయక నక్కు జేర్చి పెంచుట విధిగా
నిలసంఘము భావించిన
కలదే వెత వారికపుడు కారె సమర్థుల్”
చివరగా మంగళాశాసనముతో హరికథ ముగిసింది. సరిగ్గా పదిహేను నిమిషాలకు ఒక్కనిమిషం కూడా మించలేదు. హరికథకునికి టైమ్ మేనేజ్మెంట్ కూడా చాలా అవసరం.
కరతాళ ధ్వనులు మారుమ్రోగాయి. దస్తగిరిసారు లేచి వచ్చి శిష్యుడిని అక్కున చేర్చుకున్నాడు.
హరికథ అనేది పెర్ఫార్మింగ్ ఆర్ట్. అంటే ప్రదర్శనాశీలమైన కళ. ఆ రోజు వైనతేయలో ఒక భావి మహోన్నత కళాకారున్ని దర్శించారు.
ఎమ్.ఎల్.ఎ. గారు వైనతేయను అభినందించి, ఐదువందల పదహార్లు చదివించారు. అతనికి ప్రత్యేక విశేష బహుమతి లభించింది.
***
ప్రీఫైనల్ పరీక్షలు ముగిశాయి. పబ్లిక్ పరీక్షల కోసం దీక్షగా చదువుతున్నాడు వైనతేయ. సెంటరు శేషారెడ్డి ఎయిడెడ్ స్కూలులో పడింది. అన్ని పరీక్షలు బాగా రాశాడు. కొన్ని రోజులు అమ్మానాన్నల దగ్గర ఉందామని యానాదుల దిబ్బకు బయలుదేరాడు.
కోనేటయ్య, తిరుపాలమ్మ కొడుకును చూసి సంతోషించారు. బాగా ఎత్తు ఎదిగాడు. చదువు, సంస్కారం వల్ల అతడి ముఖంలో ఒక తేజస్సు!
ఆ రోజు వరన్నం, పుండుకూర (గోంగూర) పప్పు, నూనొంకాయ చేసింది అమ్మ. తల్లిదండ్రులిద్దరూ ఎందుకో డల్గా ఉన్నట్లు గమనించాడు. భోజనాలయింతర్వాత తండ్రిని అడిగాడు.
“నాయనా, ఏమయింది? ఎందుకట్లా మొగాలు వాడిపోయినాయి?”
తిరుపాలమ్మ చెప్పింది “వైనా, పెదరెడ్డి తన బాకీ తీరుస్తారా, లేక చేను రాసిస్తారా అని గొంతు మీద కూర్చోని ఉండాడురా!”
“మనం తీసుకొన్నది ఐదువేలు. నా జీతంలో ఇన్నూరు (రెండువందలు) రూపాయలు. వడ్డీ కింద పట్టుకుంటూనే వుండె. వడ్డీతో కలిసి ఏడు వేల ఎనిమిది నూర్లయిందంటాడు. ఎక్కడ నుంచి తేవాల? శేను రాసిస్తే మన గతి ఏమి?” అన్నాడు కోనేటయ్య.
“నాయనా, ఆ రోజు దస్తగిరి సారు ఏమనె? తొందరపడి చేను రాసియ్యగాకండి. ముందు ముందు దానికి మంచి ధర వస్తాది. రెడ్డి తొందరపడితే నాకు చెప్పండి. ఏదో మార్గం చూద్దాము అన్నాడు కదా! “.
“అన్నాడు, ఆ దర్మరాజు. ఇప్పటికే నీ బరువంతా తన మీద వేసుకునె. ఇంకా ఆ మానుబావున్ని ఏ ముగం పెట్టుకొని అడుగుతామురా! “
“నేను సారుతో మాట్లాడతాను. అక్క పెండ్లికి రెడ్డి డబ్బు యిచ్చిందే.. మన చేను మీద కన్నేసి. ఇంక మీరు ఇక్కడ ఉండవద్దు. నీవు రెడ్డి దగ్గర పడే కష్టం టౌనులో పడితే ఫలితం బాగుంటుంది. నాలుగు రోజులుండి, అక్కను, బావను చూసి, అక్కడి నుంచి నేరుగా బేతంచెర్లకు పోతాను.”
“నేరుగా పోతావా? ఎట్లా?”
“అక్కావాళ్లు గుంతకల్లో కదా ఉండేది? అక్కడ రెండ్రోజులుంటా. గుంతకల్ నుంచి బేతంచెర్లకు రైలుంది. గుంటూరుకు పోయే రైళ్లన్నీ బేతంచెర్లలో నిలబడతాయి. ఛార్జీ కూడా శానా తక్కువంట. అట్లా రమ్మని చెప్పింది మా దస్తగిరిసారే!”
అమ్మా, నాయనల మొగాలు కొంచెం తేటపడినాయి. తండ్రితో చాటు జొన్న పంట కోయడానికి చేసుకు వెళ్లాడు. జొన్నపంట బాగానే పండింది. కంకులన్నీ కొడవలితో కోసి, కళ్లంలో పరచి, రెండు టన్నుల బండ రోలర్ను ఎద్దులకు కట్ట కంకులను రోలర్తో తొక్కించారు. జొన్నలు కంకులను వదిలి వేరు పడినాయి. చేటలతో తాలునంతా చెరిగి వేసి, జొన్నలను గోనె సంచులలో పోసి, పురికోసతో మూతులు బిగించారు.
బండ్ల కెత్తుతుండగా, శేషశయనారెడ్డి మనుషులు వచ్చారు. జొన్న సంచులు రెడ్డి తన గరిసెలకు తొలమని చెప్పినాడని, బండ్లను మళ్లించుకుపోయినారు. జొన్నలను వడ్డీ క్రింద జమేసుకుంటాడట. వైనతేయ తన మనసులో ధృడంగా నిశ్చయించుకొన్నాడు, తన తల్లిదండ్రులను శేషశయనారెడ్డి సంకెళ్ల నుంచి విడిపించాలని. వారికి ధైర్యం చెప్పాడు.
రెండు రోజుల తర్వాత ప్యాపిలికి వెళ్లి అక్కడ అనంతపురం బస్సెక్కి గుత్తి దిగాడు. గుత్తి నుండి బల్లారి పోయే మార్గంలోనే గుంతకల్ వస్తుంది. అనంతపురం జిల్లాలో అదొక పెద్ద టౌన్. దక్షిణ మధ్య రైల్వేలో పెద్ద జంక్షను. మద్రాసు – బొంబాయి పెద్ద లైను (బ్రాడ్ గేజ్), సికింద్రాబాదు – బెంగుళూరు చిన్న లైను, హుబ్లీ లైను అక్కడ కలుస్తాయి.
గుత్తి నుంచి గుంతకల్ 30 కి.మీ. ఉంటుంది. రమణమ్మ వాళ్లు కసాపురం రోడ్డులో, శివాలయం ఎదుట సందులో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అది రేకుల పై కప్పుది. పెద్ద రూమును వెదురు తడికెతో రెండుగా విభజించినారు. ఒక దడి కట్టి బచ్చలిల్లు (బాత్ రూమ్) చేసుకున్నారు పెరట్లో. మరుగుదొడ్డి లేదు. రమణమ్మ, మునిసిపాలిటీ వారి పబ్లిక్ టాయ్లెట్కి వెళుతుంది, పాపతో సహా. పాప పేరు అంజని. బావ పేరు అంజనప్ప. అతడు చెంబట్టుకొని రైలు కట్టకు పోతాడు.
గుంతకల్ – బళ్లారి మధ్య ప్రయివేటు బస్సులను ఇంకా జాతీయం చేయలేదు. కారణం, వాటికి రెండు రాష్ట్రాల పర్మిట్లు ఉంటాయి. అంజనప్ప ‘ఫ్లయింగ్ ఎక్స్ప్రెస్’ అనే బస్సు డ్రైవర్. చాలా సంవత్సరాలు క్లీనరుగా పని చేసి, పెండ్లికి రెండేండ్ల ముందే డ్రయివరయినాడు.
ఆ బస్సు ‘నంజప్ప’ అనే ఆయనది. ఆయనకు ఐదు బస్సులున్నాయి. అంజనప్పకి జీతం నెలకు మూడు వేలు. బత్తా రోజుకు ఇరవై. రోజూ ఆరు సింగిల్స్ తిరగాల. పొద్దున్న ఆరుకు డ్యూటీ ఎక్కితే మాడు గంటలకు దిగుతాడు. ఇంటద్దె నాలుగు వందలు. అంజని అక్కడకు దగ్గరలో, గీతా టాకీసు సందులోని మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో రెండో తరగతి చదువుతూంది.
రమణమ్మ కూడా, శివాలయం ముందు గోనెపట్ట పరచుకొని, టెంకాయలు, పూలు, ఉదికడ్లు, కర్పూరం, అమ్ముతుంది. నబీసాబ్ మండీ నుంచి హోల్సేల్లో టెంకాయలు వారానికికోసారి కొనుక్కొచ్చుకుంటుంది. సోమవారం ఆమెకు వ్యాపారం బాగా జరుగుతుంది. కార్తీకమాసం, శివరాత్రప్పుడు బేరాలు బాగుంటాయి. మొత్తం మీద రమణమ్మ కూడా నెలకు పన్నెండు వందల వరకూ సంపాదిస్తూంది.
యానాదుల దిబ్బలో అమ్మానాన్నలకంటే, గుంతకల్లో అక్కాబావల పరిస్థితి మెరుగ్గా ఉందని గ్రహించాడు వైనతేయ. బావకు సైకిలు కూడా ఉంది. దాని మీద ఇద్దరూ కసాపురం వెళ్లి, శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని వచ్చారు. ఆంధ్ర దేశంలోని ప్రసిద్ధ ఆంజనేయ క్షేత్రాలలో కసాపురం ఒకటి. అది గుంతకల్ నుండి పత్తికొండకు వెళ్ళే మార్గంలో వస్తుంది.
కసాపురంలో స్వామి పన్నెండడుగుల ఎత్తున్నాడు. పక్కతిరిగి నిలుచున్న భంగిమ. నల్లరాతితో చెక్కారు విగ్రహాన్ని. దయ్యాలు, భూతాలు పట్టిన వారు అక్కడ స్వామికి సేవ చేస్తే స్వస్థత పొందుతారు
అక్కడ మూడడుగుల పొడవు, అడుగున్నర వెడల్పు గల స్వామివారి పాదరక్షలున్నాయి. అవి తోలుతో చేసినవి. అవి అరిగిపోయి ఉండడం చూసి ఆశ్చర్యపోయినాడు వైనతేయ.
అంజనప్ప చెప్పాడిలా “గిడ్డయ్య (హనుమంతుడు) రాత్రి పూట ఈ చెప్పులు వేసుకొని తిరుగు తాడంటారా!”
బావమరిది బట్టల షాపులో ప్యాంటు, షర్లు చింపించి (తీసి), టైలరు దగ్గర కుట్టించాడు బావ. మేనకోడలు ఆ నాలుగు రోజులూ మామను వదలలేదు.
రెండు రోజుల తర్వాత హుబ్లీ – గుంటూరు ప్యాజింజర్లో బేతంచెర్ల చేరుకున్నాడు, డోన్ మీదుగా.
***
వైనతీయకు, స్కూలు వార్షికోత్సవం నాడు, ఎమ్.ఎల్.ఎ. శిఖామణి గుప్త గారిచ్చిన ఐదువందల పదహార్లు, దస్తగిరిసారు కివ్వబోతే ఆయన తీసుకోలేదు. పైగా కోప్పడ్డాడు కూడా. అందులో మూడువందలు కోనేటయ్య కిచ్చాడు. మేనకోడలికి గౌను కొనిచ్చాడు. అది ఎనభై రూపాయలైంది. గుంతకల్లో కొబ్బరి భక్ష్యాలు ఫేమస్ అని అక్క చెప్పింది. వాటిని కోస్తా జిల్లాల వాళ్లు బొబ్బట్లు అంటారు. అవి చిన్నగా పూరీల సైజులో ఉంటాయి. ఒక ముప్ఫై రూపాయలకు వాటిని ప్యాక్ చేయించుకుని, కాశింబీ అమ్మకిచ్చాడు. డజను వచ్చాయి.
టెంత్ రిజల్టు రావడానికి ఇంకా నెలన్నర పైనే ఉంది. గురుశిష్యులిద్దరికీ సెలవులే. ముగ్గురూ, అక్కడికి దగ్గరలో ఉన్న మద్దిలేటి నరసింహస్వామిని దర్శించుకొని వచ్చారు. రంగాపురం స్టేషను డోన్కు, బేతంచెర్లకు మధ్య వస్తుంది. దాన్ని ‘నీళ్లు లేని రంగాపురం’ అంటారు. అక్కడ నీటికి కటకట ఆట. గుంటూరు – గదగ్ ప్యాసింజర్లో వెళ్ళి, రంగాపురంలో దిగి, అక్కడ నుంచి జట్కా బండిలో మద్దిలేటి క్షేత్రం చేరుకున్నారు. రైలంతా స్వామికి బలిగా సమర్పించబోయే గొర్రెలు, మేకలతో జనం ఎక్కారు.
మద్దిలేటి నరసింహస్వామిని ‘మద్దిలేటయ్య’గా వ్యవహరిస్తారు ప్రజలు. ఆయన పేరు పెట్టుకుంటారు. మద్దిలేటి, మద్దయ్య, మద్దమ్మ ఇలా.
ఒక గోనె సంచిలో బియ్యం, కందిపప్పు, టమోటాలు, ఉర్లగడ్డలు, నిమ్మకాయలు, పచ్చిమిరప, ఒక సీసాలోనూనె, తిరగమోత గింజలు, నాలుగు గిన్నెలు తెచ్చుకొంది కాశింబీ.
గుడి దట్టమైన అడవిలో ఉంది. ఆ ప్రాంతాన్ని ‘కటికవాని కుంట’ అంటారు. పక్కనే ఒక వాగు ప్రవహిస్తుంది. దాని పేరు మద్దిలేరు.
ముక్కోటి ఏకాదశి నాడు శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహుని కల్యాణం జరుగుతుంది.
స్వామివారి దర్శనం అయింది. కాశింబీ మూడు రాళ్లు పెట్టి, పొయ్యి ఏర్పాటు చేసుకొంది. వైనతేయ ఎండు కట్టెలు ఏరుకొని వచ్చాడు. వాగులో ఒక ప్లాస్టిక్ బిందెతో నీళ్లు తెచ్చాడు.
కాశింబీ పొయ్యి వెలిగించి, అన్నం, టమోటా పప్పు, ఉర్లగడ్డల (బంగాళా దుంపలు) ముద్దకూర చేసింది. నిమ్మకాయ చిత్రాన్నం (పులిహోర) కలిపింది. ముగ్గురూ తిన్నారు. రాత్రికి కూడా సరిపోతాయి. ఆ రోజు రాత్రి స్వామి ఆలయం లోనే నిద్ర చేయాలని వచ్చారు. ఎండాకాలమైనా, అక్కడ చల్లగా ఉంది. ఒక మంటపంలో, షోలాపూరు దుప్పటి పరుచుకుని పడుకున్నారు.
ఎనిమిది గంటలకు భజన బృందం వచ్చారు. వారిది మల్కాపురం. హార్మనియం, ఢక్కి, తాళాలతో దిగిపోయారు. భజన గుడిలో మొదలయింది. దస్తగిరిసారు, వైనతేయ వెళ్లి పాల్గొన్నారు. కాశింబీ విశ్రాంతి తీసుకుంటానన్నది.
బృందంలో ముగ్గురు గాయకలున్నారు. వైనతేయ భజనలో తన గొంతు కలిపిన కొంతసేపటికే అతని గాత్రం గొప్పదని బృందసభ్యులు గ్రహించారు.
దస్తగిరి సారిలా చెప్పాడు – “వీడు నా శిష్యుడు. హరికథలు కూడా చెబుతాడు. తిరుపతిలో హరికథా కోర్సు చదువుకున్నాడు. మీరు అనుమతిస్తే, భజన తర్వాత భక్త ప్రహ్లాద హరికథ చెప్పిస్తాను. హార్మోనియం నేను వాయిస్తాను.”
భజన బృందం వారు పరమానందభరితులైనారు.
“అంత కంటే భాగ్యమా సామి!” అన్నారు.
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా, రీడర్గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్లో సీరియల్గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.