అనూహ్య సాంకేతికాభివృద్ధితో
దేశదేశాల మనసులు దగ్గరవుతున్నాయి..
అంతర్జాల వేదికలు
ఆమనికి నీరాజనాలర్పిస్తున్నాయి,
వివిధ దేశాల్లోని తెలుగు కోకిలలన్నీ
మధుర గానాలతో మైమరపిస్తున్నాయి..
మానీటర్ పై జాలువారిన కవితలు
మెరుపులవుతున్నాయి..
అందరి రాశులు
అద్భుతంగా వెలుగొందుతున్నాయి..
మానవజీవిత వికాసానికి
ఇంతకంటే ఇంకేం కావాలి?!
శ్రీశార్వరికీ శుభస్వాగతాలు పలకడానికి
సర్వజనులు సంతోషంగా సమాయత్తమయ్యారు
అల్లన మెల్లన రావమ్మా
శ్రీ ‘శార్వరీ’
చీకటనే అర్థాన్నిచ్చినా
అందరి జీవితాల్లో
పండు వెన్నెల పంచాలమ్మా!
అరవై వత్సరాల్లో
నువ్వో తీపి గుర్తుగా మిగలాలమ్మా!
తరతరాలు స్మరించుకోవాలమ్మా!!
లక్ష్మీ సుజాత గారు పుట్టింది ఆంధ్రా, పెరిగింది తెలంగాణ.. భద్రాచలం, ఖమ్మం జిల్లా. ఇంటర్ చదివే రోజుల నుండి పలు పత్రికల్లో క్విజ్లు, ఆర్టికల్స్, కథలు, కవితలు ప్రచురితమయ్యాయి. వివిధ బాలల పత్రికలలో వీరి బాలల కథలు ప్రచురితమయ్యాయి. తెలుగు వెలుగులో రాసిన కథకు అభిమానుల నుండి ప్రత్యేక ప్రశంసలు పొందారు. అష్టాక్షరి, ధ్యానమాలిక అను మాసపత్రికలకు ఆధ్యాత్మిక వ్యాసాలు రాస్తున్నారు. వివిధ అంతర్జాల పత్రికలలో వీరి కవితలు ప్రచురితమవుతున్నాయి. టేకు ఆకులపై రంగవల్లికలు వేసినందుకు గాను వండర్ బుక్ మరియు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు.