Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-41

[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]

నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.

***

చతుర్థాశ్వాసము:

600.
వచనము:
అంత హిరణ్యకశిపుడు, గదాశూల ఖడ్గ ప్రహారములు తనమేను నంటక, చిరునవ్వుతో నిల్చిన ఆ చిన్ని పాపని గాంచి, ఆశ్చర్యచకితుడై యిట్లు తలపోసెను.

601.
ఉ.:
ఏమిది యబ్బురంబు? ఘనభీకర శస్త్రములన్నియున్‌ సుతున్‌
ఏమియు చేయలేక, ఫలమివ్వక, వ్యర్థములయ్యె, దీనినే
నేమనియందు? వీనిదగు నిశ్చల ధైర్యము జూడ నయ్యహో!
ఏమఱినారొ రాక్షసులు? ఏమి విచిత్రము? వీడు చావడే?

602.
వచనము:
అని వితర్కించి, తన సైనికుల కివ్విధంబున పుత్ర వధోపాయములనుపదేశించెను.

603.
సీ.:
మదపు టేనుగులను నదయత తెప్పించి
ఈ దుష్టుద్రొక్కించి ఈల్గజేయు
డతిఘోర విషసర్ప తతిదెచ్చి ఈ తుల్వ
కరిపించి చంపుడు కరుణమాని
పర్వతంబుల నుండి పడద్రోయుడీ ఖలున్‌
లోతు లోయలలోకి భీతికలుగ
నవరంధ్రములనెల్ల నవరోధమును జేయు
విషభోజనంబుల వీనిజంపు
తే.గీ.:
డన్నపానము లేకుండ అలమటింప
జేసి, నశియించునట్లుగ జేసి, ఇతని
ప్రాణముల దీసి, బాలుని, నాకుముదము
శాంతిగూర్పుడు వెసనాకు శాశ్వతముగ

604.
కం.:
అనువిభు బల్కుల నసురులు
అనురాగము లేక పుత్రునంతము జేయన్‌
యానతి జేయును, పాపము!
కననౌనే యిట్టి తండ్రి గరుణారహితున్‌

605.
శా.:
కనగన్‌, ఏలికయాజ్ఞ మీరగలమే? కార్పణ్యమున్‌ బూనియా
ఘనదైత్యుండు తనంత తానె స్వసుతున్‌ ఖండిరపగా కోరినన్‌
మనమేలా మది జింత చేయవలె, మా ప్రావీణ్యమున్‌ జూపి, ఈ
తని మర్దించి శవంబు జూపి, విభు సంతాపబు బాపందగున్‌

606.
చం.:
అని మనమందు రాక్షసులు అవ్విధి నిశ్చయమందినన్‌, కడున్‌
వినయము, గౌరవంబులను వీడక సుస్మితుడౌచునిల్చునా
చిన చిరు కూన జంపగను చేతులు రాక, బలీయమౌ విధిన్‌
గని, తమభృత్యధర్మమును గాచుచు, బాలుని జంప చేకొనన్‌

607.
సీ.:
దనుజ విభునివైన దంతి శాలలనుండి
పర్వతంబుల బోలు మదగజముల
మావటీడుల సాయమంది తోడ్కొనివచ్చి
ప్రహ్లాదకుమరుని మధ్యనుంచి
ఉరుగజంబుల మీదకు నుసినిగొలుపగ
తొక్కింప జూడగ మిక్కిలిగను
కరులు నేలను యున్న యా చిరుత శిశువును
మేనును మర్ధింప పూనుకొనగ
తే.గీ.:
భక్తవర్యుడు నిర్భయశక్తితోడ
అంబుజాక్షుని స్మరియించె నంతనపుడు
బాలువదనము సింహము బోలిగజము
లన్ని మరలెను వెనుకకు, అబ్బురముగ

608.
చం.:
దయను గజేంద్రమోక్షమును దైన్యముబాపుచు, నక్రబంధమున్‌
రయమున వీడ జేసిన పరాత్పరు మాధవు లీలతోడ, ని
ర్భయుడగు బాలు చుట్టు కరిబృందము నిల్చి మహోగ్రతుండముల్‌
జయజయ యంచు నెత్తి తమ జాతికి రక్షకుడైన విష్ణుకున్‌
ప్రియడగు దైత్యసూను పయి ప్రేమను జూపెను బాష్పయుక్తమై

609.
తే.గీ.:
దానవేశ్వరువీరులు దక్కి చేష్ట
లబ్బురంబును భయమును నుబ్బమదిని
మావటీలును దిగి బాలు మహిత భక్తి
వందనంబుల నొనరించి పాదములకు

610.
వచనము:
ప్రహ్లాద కుమారుని, రాక్షస యోధులు, ఏన్గులను శాసించు మావటీవారు, ఇట్లు స్తుతించిరి.

611.
ఉ.:
బాలుడ వీవు గాదు వర భక్తవరేణ్యుడ వయ్య, ధీరతన్‌
గ్రాలుచు, సత్కరీంద్రములగారవమున్‌ యనురాగమున్‌, తగన్‌
లీలగ బొందినావు, హరిగమ్యుడవైతివి, మాదుజన్మలున్‌
చాలను సార్ధకంబగుచు సన్మతి బొందితిమిప్డు నీదయన్‌

612.
కం.:
అని ప్రహ్లాదుని భుజముల
తనియుచు మోయుచును నాథుదరి దోడ్కొనుచున్‌
వినయంబు మెరయవచ్చిరి
ఘనదైత్యుడు విస్మయంబు గలుగగ జూడన్‌

~

లఘువ్యాఖ్య:

పద్యం 601 (ఉ) లో హిరణ్యుడు – తనయుడు ఘనభీకర శస్త్రాల నన్నింటిని ఎదుర్కొని, నిశ్చలుడై నిలిచాడే, వీడు చావడం లేదే? అని ఆశ్చర్యపోతున్నాడని అన్నారు కవి. పద్యం 603 (సీ)లో ప్రహ్లాదుని రకరకలుగా వధించమని, ఏనుగులతో తొక్కించి, పాములతో కరిపించి, కొండలమీది నుండి క్రిందికి తోసి, విషం పెట్టి, ఎలాగైనా సరే వీనిని చంపి నాకు సంతోషము, శాంతి కలిగించమని రాక్షసులను ఆదేశించినాడని కవి చెప్తున్నారు. పద్యం 604 (కం) లో రాక్షసులు, ‘కన్నకొడుకునే చంపమనే తండ్రి ఎక్కడైనా ఉంటాడా’ అని అనుకుంటున్నారు, పద్యం 605 (శా) ‘ఐనా రాజుగారి ఆజ్ఞ మీరలేము కదా! అయినా మన కెందుకు?’ అనుకుంటున్నారు. పద్యం 607 (సీ) లో రాజు గారి ఏనుగు శాలల నుండి మత్తగజాలను తెచ్చారు మావటివారు. వాటిని బాలుని మీదకు ఉసిగొలుపగా, అతడు నారాయణుని ధ్యానించి, చిరునవ్వుతో నిలిచాడు. అతని ముఖం సింహముఖమువలె తోచి గజములు వెనక్కు మరలాయి. పద్యం 608 (చం) లో తమ జాతిని రక్షించిన మాధవుని లీల అనుకొన్నాయి. ప్రహ్లాదుని చుట్టూ చేరి తొండాలనెత్తి జయ జయ ధ్యానములు (ఘీంకారాలు) చేశాయి. వాటి కన్నుల్లో నీళ్ళు పద్యం 611 (ఉ)లో రాక్షస యోధులు, మావటీలు, ప్రహ్లాదునితో, “నీవు బాలునివి కాదు. పరమ భక్తాగ్రేసరునివి. మా జన్మలు సార్థకం” అని చెప్తారు. పద్యం 612 (కం)లో అతనిని భుజముల మీద సంతోషంతో మ్రోయుచు, రాజు దగ్గరికి తెచ్చినారని వివరించారు కవి.

(సశేషం)

 

Exit mobile version