[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]
నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.
***
చతుర్థాశ్వాసము:
~
586.
వచనము:
అని అర్ధనిమిలిత నేత్రుడై భక్తి పారవశ్యముతో పలుకుచున్న ఆ చిన్ని బాలునిపై, సుంతయైనను దయమాలి, మరలనాతని నేలద్రోచి, విస్ఫులింగములనుమియుచున్న నేత్రములతో, తన సైన్యాధిపతుల రావించి, ఇట్లు ఆజ్ఞ నొసంగెను.
587.
ఉ.:
రక్కసులార! వీడు మన రాక్షసవంశవినాశకారి, తా
నక్కజమైన ధైర్యమున నా యెదుటే హరి కీర్తనంబు, పె
న్మక్కువతోడ జేయు, సుతమాత్రుడుగాడు విరోధి నాకు, నన్
అక్కట! పుత్ర రూపమున బాధలు వెట్ట జనించెనేమొకో?
588.
కం.:
పినతండ్రి, గపటచాతురి
హననము గావించినట్టి హరినాయధమున్
వినుతి యొనర్చెడు నీఖలు
ననుమానము లేక చంపు డనుమతినిత్తున్
589.
సీ.:
ఎగ్గు సిగ్గును లేక నెవ్వానిపాదము
లీతుల్వ పూజించు నిష్టముగను
తండ్రినే యెదిరించి, తరియింప నెవ్వాని
నామకీర్తనమును తాను జేయు
అసమంజసంబుగా నార్తి నెవ్వానిని
పరమాత్ముడని తలచు భ్రమలతోడ
సాధువర్తనలేక, సాధించ నెవ్వాని
తలచి, తండ్రికి నెగ్గు తలచువీని
ఆ.వె.:
విష్ణుదేవుననుచు విర్రవీగెడువాడు
వీని, దుష్టునెటుల స్వీకరించె?
అరయ దుష్టుడెపుడు దుర్మార్గునే జేరు
కాన, వీని జంపగానురండు
590.
ఉ.:
వైరిని గొల్చువాని, రిపుపక్షము జేరినవాని, పాపమున్
కోరుచునుండువాని, తన కూరిమి బంధు జనంబు పట్ల, నిం
పారెడు ప్రేమలేక కులనాశము చేయ దొడంగువానినిన్
జీరకవిడ్వగా దగును, శ్రేయము గల్గగ, పుత్రుడైననున్
591.
ఉ.:
మేనున నొక్క భాగమది పెద్ద వ్రణంబున కుళ్లుచుండగన్
దానిని వేరు చేసి, మనదైన శరీరము గాచుకోవలెన్
లేనియెడన్ వినష్టమయి లేనిదగున్ స్థితి, కానమీరు, మీ
వైన తెఱంగులన్ హననమందగ జేయుడు ఈ దురాత్మునిన్
592.
కం.:
పెట్టుడు విషమును, లేదా
కొట్టుడు పరిఘాది శస్త్ర కోటుల, లేదా
నట్టడవివదలివేయుడు
మట్టును బెట్టుడు యటంచు పలుక విభుండున్
593.
వచనము:
అంత ప్రభుని యాదేశంబున రాక్షసులు
594.
సీ.:
దారుణమైనట్టి దశనంబులను చూపు
వదనంబులను చాల భయము గొల్ప
శూలహస్తులగుచు సుంతయు దయలేక
ప్రహ్లాదబాలకు పట్టితిగిచి
కడుభీతికలిగించు గడ్డాల మీసాల
రక్తనేత్రములతో రభసులగుచు
ఖడ్గముల్ గదలతో కఠిన ప్రహారాల
పసిబాలు నొప్పింప పాశవికులు
తే.గీ.:
ఎల్ల అవయవముల తల్లడిల్లగ బొడిచి
అమితమైనట్టి క్రోధంబు అతిశయింప
కఠిన రాజాజ్ఞ మన్నించి కసిగ బాలు
చిత్రహింసల గురి జేసి చెలగిరకట!
595.
మ.:
తనయున్ హింసలపాలు చేయగ మహా దైన్యార్తియై తల్లియున్
తనుయడ్డంబున బోవ కశ్యపుడు ఆ తన్వీమణిన్, సాధ్వి, తా
ననురోధించె, బలంబునన్ జనని, నామాతాంతరంగంబు దా
రుణమౌ క్షోభను బొంద మూర్ఛ కలిగెన్, లుప్తస్పృహాభీలమై
596.
శా.:
అత్యాశ్చర్యము! ఎన్ని భంగులను వారాబాలకున్ చంపగా
భృత్యాదర్శముతో ప్రయత్నములతో బాధింపగా జూచినన్
నిత్యానంద పరాత్పరుండగు హరిన్, మిధ్యాహరిన్ శౌరి, తా
నత్యంతంబగు భక్తి నెమ్మనమునన్ భావించు పుణ్యాత్మునిన్
597.
ఉ.:
దానవ దుష్ప్రహారములు దైన్యము నొందుచు నిష్ఫలంబులై
పూనికలన్నివమ్మయి విభూషితుడయ్యెను బాలకుండు, స
న్మానము జెంది; పుష్పవరమాలికలన్, గగనాన దేవతల్
కానగ, మెచ్చ, నిశ్చలముగా స్థిరచిత్తుడునౌచు నిల్వగాన్
598.
సీ.:
నిర్వికారుండగు నీరజనాభుండు
బ్రహ్మయై ఇంద్రియ భావములకు
గోచరించకయుండు గూఢాత్ముడగుచును
నిర్దేశమును జేయు నిర్ణయింప
అలవిగానటువంటి జలజాతనయనుడు
సర్వసాధనముల శాసకుండు
జ్యోతిస్వరూపుడై భీతిని తొలగించి
భక్తాగ్రగణ్యుల బాపువెతల
ఆ.వె.:
అట్టి వేదసారు నఖిల జగదాధారు
హృదయమందు నిల్పి ముదముతోడ
ముకుళిత కరముల మురవైరి మనమున
ధ్యానమగ్నుడయ్యె దైత్యవరుడు
599.
కం.:
ఆతని నిశ్చల భక్తికి
జోతలు జేసిరియసురులు, చూచితిమిపుడున్
మా తలరాతల మార్చెడు
భీతావాహమైన మహిమ మిదియని యనుచున్
~
లఘువ్యాఖ్య:
ఈ భాగంలో, హిరణ్యుని కోపావేశం, రాక్షసులకు ప్రహ్లాదుని చంపించమని ఆదేశించడం, అతడు ఆ హింసలను ఆనందంగా భరించడం, అతని నిశ్చల భక్తిని వర్ణించారు కవి. పద్యం 587లో (ఉ) రాక్షసులారా! వీడు నా ఎదుటే హరిని కీర్తిస్తున్నాడు. వీడు నాకు విరోధి గాని, కొడుకు మాత్రం కాదు అని అన్నాడు హిరణ్యుడు. పద్యం 588లో (కం) చిన్నాన్నను కపటంతో చంపిన వానిని పొగుడుతున్నాడు. వీడిని చంపండి, ఇదే మీకు అనుమతినిస్తున్నాను అన్నాడు. పద్యం 589లో (సీ) వీడు ఎవరినైతే సిగ్గు లేకుండా, సొంత తండ్రినే ఎదిరించి పూజిస్తున్నాడో, వాడు కూడ దుష్టుడే. దుర్మార్గుడు దర్మార్గులనే ఇష్టపడతాడు కదా అని అన్నాడు హిరణ్యుడు. పద్యం 590లో (ఉ) శత్రువును ఆరాధించేవాడిని, శత్రుపక్షంలో చేరినవాడిని, తన ఆత్మీయుల పట్ల ప్రేమలేనివాడిని విడిచిపెట్టాలని శాస్త్రం చెబుతున్నదని అంటాడు. పద్యం 591లో (ఉ) శరీరంలో ఒక భాగంలో పుండు లేచి కుళ్ళిపోతే దాన్ని తొలగించాలి. లేకపోతే, మొత్తం శరీరం నశిస్తుందని చెప్తాడు హిరణ్యుడు. పద్యం 592లో (కం) కాబట్టి, వీనికి విషం పెట్టండి, పరిఘలతో కొట్టండి, నట్టడవిలో వదిలెయ్యండి అని ఆనతిస్తాడు. పద్యం 594 లో (సీ) రాక్షసుల వర్ణన చేశారు కవి. దారుణ కోరలు చూపుతూ శూలాలు ధరించి, గడ్డాలు, మీసాలు, ఎర్రని కన్నులు కలిగి, వివిధ ఆయుధాలతో బాలుని హింసిస్తున్నారని అన్నారు. పద్యం 595 లో (మ), దాన్ని చూడలేక, తల్లి అడ్డం వెళ్తే, ఆమెని పక్కకు లాగుతాడు హిరణ్యుడు. పద్యం 596 లో (శా), ఎన్ని రకాలుగా వారు చంపచూసినా, ఆశ్చర్యంగా, అవన్నీ నిష్ఫలములైనాయి. దేవతలు పుష్పవర్షం కురిపించారని చెప్తారు కవి. పద్యం 598 లో (సీ) పరమాత్మతత్త్వాన్ని కవి వర్ణించారు. నిర్వికారుడు, గూఢాత్ముడు, జ్యోతిస్వరూపుడు అని అంటారు. పద్యం 599 లో (కం) ప్రహ్లాదుని నిశ్చల భక్తికి దైత్యులు జోతలు చేశారని అన్నారు కవి.
(సశేషం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా, రీడర్గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్లో సీరియల్గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.