Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-38

[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]

నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.

***

చతుర్థాశ్వాసము:

563.
చం.:
చదివితి పెక్కు శాస్త్రముల, చాలశృతుల్‌, ఘనతర్కముల్‌, మహా
విదులగు నాదు నొజ్జలు ప్రవీణుని జేసిరి, నన్ను ప్రేమతో
చదువుల సారమెల్ల మది చక్కగ దోచెను దానవేశ్వరా!
అదె ఇది విన్ముతండ్రి! తగ నీకును చెప్పెద నంచు బల్కినన్‌

564.
కం.:
సంతోషమ్మున జనకుడు
ఎంతో ఊహించి పలికె నెల్ల చదువులన్‌
ఇంతగసారము నేర్చితి
వెంతయునుప్పొంగె మనము నీధీప్రతిభన్‌

565.
వచనము.:

“నీవు చదివిన చదువుల సారములోనుండి, ఒక మంచి విషయమును నాకు శ్రవణపేయముగా వినిపింపుము. మీ  అమ్మకూడ ఎంతో ఆసక్తితో వినసిద్ధముగానున్నదో చూడుము. మహారాజ్ఞీ! రమ్ము, ఇటు దగ్గరగా రమ్ము! మన ప్రియపుత్రుని విద్యాప్రదర్శనమును తిలకింపుము” అని, హిరణ్యకశిప మహారాజు, నిజపత్నినికూడ దగ్గరకు పిలిచెను. ఆమెయు వచ్చి, కుమారుని బుగ్గలు పుణికి, తలనిమిరి, నిలుచుండెను. అంతట నాబాలుడు

566.
పద్మనాభము:
తాత! వినుమయ్య, సతతంబు హరిజేరుటకు
తథ్యముగా కావలయు తండ్రీ!
చేతమున విష్ణువును చెన్నుగను నిల్పుటకు
చేరి నవభక్తుల జరించన్‌
ప్రీతిగను కీర్తనము పేర్మిశ్రవణంబును ని
వేదనము సఖ్యమును జేయన్‌
రీతిగను అర్చనము లీనమయి వందనము
లేదనక దాస్యమొనరింపన్‌

567.
ఉ.:
తొమ్మిది రీతులన్‌ హరిని తోయజనాభుని జెందు విద్యలన్‌
సమ్మతితోడ నేర్చితిని, సత్యమునే కనుగొంటి నాన్న! ఆ
కమ్మని విష్ణుగానమును గానము చేసెడు విద్యనేర్చితిన్‌
నమ్ముము తండ్రి! విద్యలకు పారము సారము మాధవుండుగాన్‌

568.
మ.:
గురువుల్‌ లౌకికమైన విద్యను తగన్‌ గుర్తుండ నేర్పించినన్‌
అరయంజాలక నాది దేవు హరి నా ప్రాపంచికంబైన మ
ద్గురుబోధల్‌ పరమాత్మ జేరుపథమున్‌ కూర్పంగ లేవంచు, నే
స్థిరచిత్తంబున ముక్తినొందు విధమున్‌ సిద్ధంబుగా బొందితిన్‌

569.
మ.కో.:
పుట్టునిచ్చితివీవు తండ్రిగ పుణ్యమార్గము చూపగా
దిట్టలైనను నాదు యెజ్జలు తెల్పరైరి సుమార్గమున్‌
కట్టిపెట్టితి సర్వవిద్యల, గర్వమోహము బాసితిన్‌
ఎట్టకేలకు పద్మనాభుని నెమ్మనంబున నిల్పితిన్‌

570.
కం.:
ఆతండె నాకు గురువుయు
నాతండే మార్గదర్శి ఆతడెహితుడున్‌
ఆతండె నాకు లక్ష్యము
నాతని నుతియింతు నెపుడు నసురశ్రేష్ఠా!

571.
వచనము:
అనిన కుమారుని వచనంబులను విని మొదట విభ్రాంతుడై, పిదప క్రుద్ధుడైన ఆ దానవ మహీపతి, ముఖము జేవురించ, పెదవులదర, నేత్రములు అరుణిమ నొంద, నొక్కనుదుటన సుతుని ఒడినుండి నేలబడద్రోసి, కోపానలజాజ్వాల్యమాన మానసుండై, పర్జన్యగర్జారవంబును బోలిన కంఠస్వరంబున దిక్కులు పిక్కటిల్ల, గురువులతో నిట్లు పలికెను.

572.
ఉ.:
విప్రకులాధమా! సుతుని విద్యలబోధల జేయుమంచు నే
నప్రతిమాన జ్ఞానులని నమ్ముచు మీకడబంప, వీడిటుల్‌
నా ప్రతిజోదు విష్ణువును నా యెదుటే స్తుతియించు చుండెగా
క్షిప్రము నిట్టి ధోరణిని భేదము చేయక పర్వునిల్చునే?

573.
తే.గీ.:
దుర్మతులు మీరు, విప్రుల త్రోవ ఇదియె?
శత్రుపక్షము వహియించి సుతునికిటుల
వైరి కీర్తన మొనరించు పథము నేర్పి
నాకు నెగ్గును గూర్చితి రకట! మీరు!

574.
వచనము:
అనిన రాక్షస ప్రభుని పలుకులకు గడగడ వణకుచు, చండుడిట్లనె.

575.
ఉ.:
దానవనాథ! ఈ చదువు తానుగ నేర్చెను, మేము నేర్పలే
దీనవ వక్ర భాషణము, తీరుయు తెన్నుయు నేర్పినాము, మా
మానసమందు వంచనను భావము లేదు మహాప్రభావ! నీ
యాన! క్షమింపు మమ్ములను అంతకుమించినదేది? మాదెసన్‌

576.
సీ.:
మేము నేర్పిన దాని తాపెడ చెవిబెట్టు
తనమాటయే తగ తథ్యమనును
మేము బోధించిన సుమహిత జ్ఞానంబు
సత్యదూరమనుచు సతముపలుకు
రాక్షసనాథుడే రక్షించు మనలను
యన్న శాస్త్రము తాను అపహసించు
పరిపాలనా దక్ష పాండిత్యమును జెప్ప
విశ్వపాలన జేయు విష్ణువనును
తే.గీ.:
మీదు భృత్యులమయ్య మే మిట్లు చేయు
సాహసంబదిగల్గునే సార్వభౌమ!
మేము నేర్పిన దిదికాదు నమ్ము విభుడ!
సహజసిద్ధము సుతుబుద్ధి స్వంతమనఘ

577.
వచనము:
అని, శుక్రతనయులైన చండ, అమర్కులు, ముకుళితహస్తులై రాక్షసేంద్రుని మరిమరి ప్రార్థింప, నాతుడు, నేలమీద త్రోసివేయబడియు, నెటువంటి భయమును ఖేదమును బొందక, స్థితప్రజ్ఞుడై, గురువులను తండ్రిని, మాటమాటికి చూచుచున్న ప్రహ్లాదకుమారుని, చేతి రెక్కబట్టి, విసురుగా లేపి నిలబెట్టి, క్రోధాగ్ని ప్రజ్వరిల్లగా నిట్లు పలికె.

~

లఘువ్యాఖ్య:

ఈ భాగములో ప్రహ్లాదుడు తండ్రికి తాను ఎన్నో శాస్త్రములు, వేదములు, తరుణాలు చదివినాని చెప్పుచున్నాడు (పద్యాలు 563, 564). అప్పుడు తండ్రి (వచనము 565) ఆ చదువు నుండి ఒక మంచి విషయమును వివరింపుమని, లీలావతీదేవిని కూడా పిలుస్తాడు. ప్రహ్లాదుడు (పద్యం 566, పద్మనాభ వృత్తములో) హరిని చేరుటకు కీర్తనము, శ్రవణము, సఖ్యము, అర్చనము, దాస్యము మొ॥ వివిధ రీతులను వివరిస్తాడు. ‘నవవిధ భక్తి’ పద్ధతులవి. పద్మనాభము విశిష్ట ఛందస్సు. దానిలో రెండు యతి స్థానాలుంటాయి. 26 అక్షరాలుంటాయి. పద్యం 567లో (మ) గురువులు నాకు లౌకికమైన చదువు నేర్పినారు. అవి పరమాత్మను చేరు మార్గమును బోధింపలేవని తెలిసి ముక్తినొందే విధాన్ని తెలుసుకున్నానంటాడు. పద్యం 569 మత్తకోకిలా వృత్తం, లయప్రధానం. “నాన్నా! జన్మనిచ్చినావు. గురువులు, నీవు సరైన జ్ఞానము నేర్పలేదు. కాబట్టి గర్వ మోహములను విడిచినాను” అంటాడు. పద్యం 570 (కం)లో హరియే తనకు గురువు, మార్గదర్శి, హితుడు, లక్ష్యము అని సృష్టం చేస్తాడు. తర్వాత వచనం 571లో హిరణ్యుని కోపావేశాన్ని కవి వర్ణించారు. పద్యం 572లో (ఉ.) గురువులను తీవ్రంగా నిందిస్తాడు హిరణ్యుడు. “మిమ్ములను నమ్మి పిల్లవాడిని పంపితే, మీరు చేసింది ఇదా?” అని నిలదీస్తాడు. గురువులు గజగజ వణికి, పద్యం 573లో (ఉ.) “ప్రభూ, ఈ విద్య మేము నేర్పలేదు – వాడే సొంతంగా నేర్చుకున్నాడు. మమ్మల్ని క్షమించండి” అని అంటారు. అప్పుడు (వచనం 577) రాక్షసపతి, నిర్వికార నిశ్చలుడై చూచుచున్న కొడుకుతో ఇలా అంటాడు.

(సశేషం)

Exit mobile version