Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-37

[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]

నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.

***

చతుర్థాశ్వాసము:

551.
వచనము:
అని ప్రహ్లాదుండు గురువులకు స్పష్టము చేయ, వారు కోపించి, “దండం దశగుణం భవేత్‌” అన్న సూక్త్యానుసారము శిక్షించినగాని, వీడు మన దారికి రాడని నిశ్చయించి, సేవకు బిల్చి, ఇట్లు పలికిరి

552.
ఉ.:
సేవక! బెత్తమొక్కటి విశేషముగా కొని తెమ్ము, వీడు మా
లావగు జిత్తులన్‌, గురుల, రాక్షస జాతిని మోసగించుచున్‌
ఈ విపరీత పోకడల నెగ్గుదలంచుచు దైత్యనాధుకున్‌
మా వలనన్‌ ఇదంతయును భావ్యమటంచు విభుండు బల్కగాన్‌

553.
కం.:
అనునయ వచనములను తగ
మనసును మార్చంగ మేము పాటులు బడినన్‌
వినయము దప్పుచు, తనదే
ఘనమని వచియించు, వీని కట్టడి జేయన్‌

554.
తే.గీ.:
దండమొక్కటి శరణము దానవేంద్రు
సుతని చెడు బుద్ధి మరలింప, సుంతయైన
భయములేకను మన రిపు బ్రస్తుతించు
మాకు, తండ్రికి నపకీర్తి నందజేయు

555.
ఆ.వె.:
మంచి గంధవనము వంటి దైత్యకులము
నందు ముండ్ల చెట్టు భంగియితడు
వనము నరికి వేయు వనమాలి గొడ్డలి
వీడు కర్రయగుచు వేడ్కజూడు

556.
మ.:
అని చండుండు నమర్కుడున్‌ మిగుల సామంబు దానంబులన్‌
ఘనదండమ్మున దైత్యపుత్రుమనమున్‌ గావింప నిర్విష్ణుతన్‌
తన నెన్నోగతులన్‌ భయంబు గలుగన్‌ తర్జించుచున్‌ తిట్టగన్‌
వినడాశ్రీహరి పాదపద్మరతుడా ప్రేలాపనల్‌ కొంచెమున్‌

557.
ఉ.:
నాలుగు పూరుషార్థముల నట్లు సమస్తములన్ని నేర్పుగన్‌
బాలకు చేత నభ్యసన మా గురువర్యులు చేయజేసి, స
చ్ఛీలుని జేయనెంతయును చెప్పగరానటువంటి పాట్లతో
లాలన తోడ సైతము సరైన పథంబున బెట్టజూడగన్‌

558.
కం.:
అవి యన్నియు బ్రహ్లాదుడు
సవివరముగ నేర్చుకునియె సవినయమతుడై
ఇవియే తండ్రికి జెప్పగ
ప్రవచించిరి గురువులతని ప్రాధేయముతోన్‌

559.
ఆ.వె.:
గురువులతని తోడ నరుదెంచ మాతయు
సంతసించి సకల శాస్త్రములను
కొడుకు నేర్చెననుచు కోరిన భోజ్యంబు
లన్నిపెట్టి, పతికి తనయు జూప

560.
ఉ.:
పాదములందు వాలుచు, నపారమునైనటువంటి గారవం
బాదరమున్‌ ఘటింపు సుతు, బ్రాణసమానుని గ్రుచ్చి ఎత్తుచున్‌
నాదరి జేరుమంచు తొడయందిడి, ముద్దిడి, పుత్ర వత్సలుం
డైదితి సూనుడెంతయును కౌతకమొప్ప వచించె నిట్టులన్‌

561.
మ.:
తనయా! విద్యలనేర్చి నీ విటుల సద్దైత్యాన్వయాహ్లాదివై
మనగేహంబున కేగు దెంచితివి, నీ పట్లన్‌ గురుల్‌ శ్రద్ధతో
ఘన శాస్త్రంబుల బోధ జేసిరి కదా, కావించినిన్‌ పండితున్‌
వినకౌతూహల మయ్యె నాకు, చెపుమా విద్యార్థసారంబులన్‌

562.
వచనము:
అని ముద్దుల తనయుని నడుగ, నబ్బాలకుడు నిర్భీతిగా నిట్లు పలికెను.

~

లఘువ్యాఖ్య:

ఈ భాగంలో గురువులకు కోపం వస్తుంది. వచనం 551లో బాలుని శిక్షించాలనుకుంటారు. పద్యం 552 (ఉ)లో సేవకునితో, బెత్తం తెప్పించి బెదిరిస్తారు. పద్యాలు 553, 554, 555 లలో  వీడు దైత్యవంశానికి ప్రమాదం. రాక్షసవనాన్ని నరికే గొడ్డలి విష్ణువైతే, వీడు దానికి కర్ర అని అంటారు. అయినా, ఎంత భయపెట్టినా (పద్యం 556), ప్రహ్లాదుడు వినడు. పద్యం 557లో (ఉ) నాలుగు పురుషార్థములను నేర్పిస్తారు. నానాపాట్లు పడతారు. పద్యం 558 (కం)లో అన్నీ నేర్చుకుంటాడు. “ఇవే మీ నాన్న దగ్గర చెప్పాలి చూడు” అని మాట తీసుకుంటారు. పద్యం 559 (ఆ.వె.) లో తాము మళ్ళీ బాలుని తీసుకుపోతారు. లీలావతీ దేవి సంతోషించి, బాలునికి నచ్చిన తిండి పెడుతుంది. పద్యం 560 (ఉ) లో తండ్రి పాదములకు నమస్కరించిన కొడుకును, తండ్రి ముద్దాడి, ఏం నేర్చుకున్నావని అడుగుతాడు. వచనం 562లో బాలుడు నిర్భయంగా తాను నమ్మినది తండ్రికి చెప్పడం ప్రారంభిస్తాడు.

(సశేషం)

 

Exit mobile version