Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-36

[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]

నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.

***

చతుర్థాశ్వాసము:

535
ఆ.వె.:
గురువు లేది చెప్ప గురుతుగా బల్కును
అనుపపాఠరీతి ననుసరించు
కాని మానసమున దాని నిలుపలేదు
సత్యదూరమనుచు ఛాత్రుడచట

536.
ఉ.:
అంతట నొక్కనాడు సుతు నధ్యయనంబు పరీక్ష చేయగన్‌
చెంతను ఊరుపీఠమున చిన్ని కుమారుని నుంచి, “నాయనా!
ఎంతటి విద్య నీవు గడియించితి?” వాగతి దెల్పునాకనన్‌
ఎంతయు భక్తి బాలుడిటు ఏర్పడ జెప్పెను తాతపాదుకున్‌

537.
మ.:
జనకా! జీవులు ‘నాది’ ‘నేను’ యనుచున్‌, సత్యంబు సాధింపకన్‌
కనుచున్‌ మోదము మోహపాశములతో కల్పించుకొన్నట్టి భా
వనలన్‌ చీకటి నూతివంటి జగమున్‌ వ్యగ్రాత్ములై క్రుంగుచున్‌
గణనీయంబగు దుఃఖ మందుచు వృథా కార్పణ్య క్లేశాత్ములై

538.
కం.:
అహమును వదలక నెపుడున్‌
ఇహమును తమ లక్ష్యమనుచు నీల్గెడివారల్‌
అహరహమును తపియింతురు
శ్రీహరి చరణంబె వారి చేదును కరుణన్‌

539.
శా.:
ఆశాపాశములన్‌ దగుల్కొనక నా యానందపూర్ణున్‌ హరిన్‌
రాశీభూతకృపానిధిన్‌, భవహరున్‌, లక్ష్మీమనోనాయకున్‌
నాశంబన్నదిలేని చిన్మయుని సన్మార్గప్రదున్‌ మాధవున్‌
ఏ శంకన్‌ విడి గానధ్యాన స్మరణన్‌ హెచ్చింతు విశ్వాశ్రయున్‌

540.
వచనము:
“ఈ ఎఱుకను నేను నేర్చుకున్నాను తండ్రీ!” యని పలికిన తనయుని జూచి, “బాలుర బుద్ధి, ఇతరుల బోధలను బట్టి మారుచుండును గదా!” యని దరహాసము చేసి, గురువులతో నిట్లుపలికెను.

541.
చం.:
గురువరులార! మీ వసతి గుంభనరీతిని విష్ణు భక్తులీ
చిరుతని, మారువేషముల జేరి, విరోధిని మెచ్చు శాస్త్రముల్‌
అరయగజేసినారు, భవదాశ్రయమందున, జాగరూకులై
సరియగు విద్య నేర్పుడు భృశంబగు శ్రద్ధ, సహింపనేనికన్‌

542.
ఆ.వె.:
అనుచు సుతుని బంపె నసురవిభుడు తాను
గురులనటుల మిగుల గారవించి
భావి, తనయురీతి భావింప బాలుడు
సక్రమంబుగనుచు బాగుపడును

543.
వచనము:
అని, రాక్షసేంద్రుండు, తన సుతుని దృక్పథము తప్పక మారునను ఆశాభావంబుతో నుండెను. అచట, గుర్వాశ్రమమున చండామర్కులు ప్రహ్లాదుని ఇట్లు ప్రశ్నించిరి.

544.
ఉ.:
బాలక! నీకు మేమెపుడు పాఠము చెప్పితిమయ్య, ఱేనికిన్‌
చాల విరోధియైన హరి సంస్తుతి చేయగ? నీదు తండ్రి నీ
ప్రేలుట జూచి మమ్ములను మేలగు నొజ్జలు కాదనెన్‌, సదా
ఏలిక ప్రాపుగోరెదము, ఇట్లొన రించితివేమి చెప్పుమా?

545.
సీ.:
విష్ణు పక్షమయిన విపరీత బుద్ధినీ
కెట్లు వచ్చెచెపుమ క్లిష్టమిదియె
నిరతంబు మాబోధ నిత్యంబు వినుచును
అన్నిపాఠములను అప్పచెప్పి
వినయంబు జూపుచు ప్రియభాషలాడుచు
మమువెర్రివారినిగాను జేసి
దానవ పతి చెంత మానంబు దీసితి
వెంతచేటును దెచ్చితీవు వత్స!
తే.గీ.:
ఎవ్వరైనను నిను మభ్యపెట్టి యిటుల
విష్ణుభక్తిని బోధించి వెళ్లినారొ?
లేక సహజంబుగా నీవె రీతి నేర్చి
పిచ్చి ప్రేలాపనలు చేసి వచ్చినావొ?

546.
వచనము:
అని విచారవదనులై ప్రశ్నింప, ప్రహ్లాద కుమారుడిట్లయినె.

547.
ఉ.:
జోతలొనర్తుశౌరికి, రజోగుణహారికి, చక్రధారికిన్‌
ప్రీతిగ నెప్ప్డు ‘తాను’ ‘పర’ భేదము మిధ్యగ నాచరించుచున్‌
చేతము మోహనిర్జితము చేసెడు మాయను దాల్చు కేశవున్‌
ఈ తను భావమున్‌ విడిచి ఈశ్వరు జేరగ నంజలించెదన్‌

548.
మ.:
హరి తానెప్డు కృపాంతరంగుడగుచున్‌, ఐశ్వర్య గర్వోద్ధతిన్‌
హరియించున్‌, తగనప్డు జీవునకు ‘తానన్యుండు’ యన్‌ భేదముల్‌
సరియై మోహము భగ్నమై సకల మౌ సారమ్ము సాకారమై
తరియించున్‌ పరమాత్మ జ్ఞానపథమున్‌ ధాత్రీసురేంద్రోత్తమా!

549.
కం.:
పరమాత్మ యిట్టివాడని
తరమే వర్ణింప దేవతలు ఘనయశునిన్‌
అరయగ మోహము నొందగ
శ్రీరమణుడె నాకు మోహఛిత్తిని జేసెన్‌.

550.
శా.:
సూదంటున్‌ ఇనుమెట్లు అంటు కొనునో శోభస్కరున్‌ మాధవున్‌
నాదౌ చిత్తము శౌరియందు దగిలెన్‌ నాభాగ్యపాశంబునన్‌
ఆ దేవుండు కృపన్‌ మదీయహృదయస్థానంబునన్‌ నిల్చె, నా
దౌ దానమొ? పుణ్యమొ? సుకృతమో? ధన్యుండనై నిల్చితిన్‌

~

లఘువ్యాఖ్య:

పద్యం 535 (ఆ.వె.) లో, గురువులు చెప్పింది నేర్చుకున్నట్లే ఉంటాడు గాని, మనస్సులో నిలపడని కవి చెబుతున్నారు. ఎందుకంటే ‘సత్యం’ అతనికి తెలుసు. పద్యం 536 (ఉ) లో రాజు కుమారుని తన ఒడిలో కూర్చున బెట్టుకుని, “నాయనా! నీవు నేర్చిన విద్యను నాకు చెప్పుము” అని అడుగుతాడు. పద్యములు 537, 538, 539 లలో – తండ్రికి ప్రహ్లాదుడు విష్ణుతత్త్వమును గురించి చెపుతాడు. “నాది, నేను అన్న భావం జగము చీకటి నూతి వంటిది. ఆశాపాశములనే బంధాల్లో చిక్కరాదు. నాశరహితుడైన, విశ్వాశ్రయుడైన నారాయణుడే నిత్యము, సత్యము. దీనినే నేను నేర్చుకొన్నాను” అంటాడు. 540 (వచనం)లో – అప్పుడా తండ్రికి కోపం రాదు, ఎవరో వీనికి దుర్బోధ చేశారని తలుస్తాడని తెలిపారు కవి. పద్యం 541 (చం) లో – “గురూత్తములరా! మీ వద్ద ఎవరో మారు వేషములలో విష్ణు భక్తులు వీనికి విరోధి శాస్త్రాలు బోధించినారు. మీరు జాగ్రత్తగా ఉండాలి” అని మళ్లీ బాలుని వారితో పంపిస్తాడు. పద్యం 544 (ఉ) లో గురువులు బాలుని మందలిస్తారు. “ఇవన్నీ మేము నీకెపుడు చెప్పినాము? మీ తండ్రి మమ్మల్ని నిందిస్తాడు, ఇలా చేశావేమి?” అంటారు. పద్యం 545 (సీ)లో ఆ గురువుల పరివేదనను కవి వర్ణిస్తారు. పద్యం 547 (ఉ) లో ప్రహ్లాదుడు – జవాబుగా, విష్ణు కీర్తనం చేస్తాడు! తన, పర, భేదాలు చక్రికి లేవంటాడు. పద్యం 549 (కం) లో – ఆ పరమాత్మను వర్ణించడం కష్టం అంటాడు. పద్యం 550 (శా) లో సూదంటు రాయిని ఇనుము ఎట్లు అతుక్కుంటుందో, అట్లు నా మనసు శౌరి యందు తగుల్కొన్నదని చెబుతాడు.

(సశేషం)

Exit mobile version