[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]
నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.
***
చతుర్థాశ్వాసము:
504.
కం.:
శ్రీమదహోబిలవాసా!
కామితముల దీర్చుదేవ! కరుణాసింధూ!
భామిని శ్రీసతి గూడుచు
సేమము నరసింహ! మాకు శ్రేయము నీవే!
505.
చం.:
తనయుని భక్తితత్పరత తాను యెరుంగక హేమకశ్యపుం
డనయము పుత్రవత్సల సుభావమునన్ జరియించుచుండగన్
జననియు పుత్రు చందముల సంతసమొందుచు, స్వప్నమందు, తా
గనినది గుర్తు చేసుకొని, కాతరమానసయయ్యు, మాధవున్
506.
తే.గీ.:
తన మనంబున విష్ణుని ధ్యానమలర
సాధ్విలీలావతీ దేవి యధికభక్తి
పుత్రప్రేమయు నిజనాథు భూరిక్షేమ
మును దలంచుచు నిశ్చింతబూనె యపుడు
507.
కం.:
భక్తుడు బ్రాహ్మణులందును
రక్తుడు పరమాత్మయందు రాగ ద్వేషా
న్ముక్తుడు సత్యవ్రతుడున
శక్తుడు పరహాని దలప సన్మతి యుతుడున్
508.
ఉ.:
పాదములంటి జోతలిడు పావనులైనటువంటి పెద్దలన్
ఆదర భావముంగలుగ నార్తుల జూచు కృపాసమృద్ధుడై
సోదర మిత్రభావమును చూపు సమానుల యందు సఖ్యమున్
భేదము లేక సర్వులను బ్రీతిగ జూచు కుమారుడా గతిన్
509.
తే.గీ.:
విద్య గరపెడు గురువుల వినయముగను
దేవభావంబు జూపుచు సేవజేయు
విద్య, ధన, వంశ సంభవ వీతగర్వ
దురభిమానంబుతో బాలు డరసె హరిని
510.
సీ.:
పానజూదము వంటి వ్యసనంబులందున
నాసక్తి లేనట్టి మహితబుద్ధి
వేదాలజెప్పిన, వివిధ భోగములందు
విముఖుడై చరియించు శమముతోడ
ఇంద్రియముల దోచు నెట్టి సుఖములందు
వైరాగ్యభావన బరగువాడు
మనమును ప్రాణమున్ మేనును కామంబు
హీనంబుగా, నిగ్రహించువాడు
తే.గీ.:
అసురభావము లేనటువంటి వాడు
లలితవిమలాంతరంగుడై వెలుగువాడు
సత్త్వగుణసుసంపన్నుడై శాంతుడగుచు
బాలప్రహ్లాదుడందరివాడు సతము
511.
తే.గీ.:
మంచి గుణములు ప్రహ్లాద బాలునందు
సహజమైనట్టి తొడవుల సామ్యమగుచు
జ్ఞానపూర్ణుల మెప్పును తానుబడసి
గర్వమిసుమంత బొందక బాలుడలరె
512.
చం.:
సురసభలందు సాధువుల సుందరగాథల బల్కునాడు, ఆ
సురరిపునాథు పుత్రుని యశోశిషయంబును, భక్తిశ్రద్ధలన్
కరమగు జ్ఞాన సంపదలు కల్గు వివేకులు మెచ్చుకోలుగన్
అరయుచునుంద్రు, బాలకుని దైనవదాన్యత, సాధు శీలతన్
513.
సీ.:
గణనీయ మైనట్టి ఘనభక్తి కేశవు
సహజభక్తిని ధ్యానసహితుడగుచు
ఆటలపైధ్యాస అణుమాత్రమును లేక
జడుడంచు పిల్లలు జాలినవ్వ
భౌతికమది యెల్ల పట్టనట్టుగ నుండి
నిత్యపరాధీన మతిగ నిలచి
వయసుకు మించిన వైరాగ్యమును బొంది
ప్రత్యేక బాలుడై బరగు చుండె
తే.గీ.:
విమలహరి దివ్య పాదార విందములను
నిరత తాదాత్మ్య చిత్తంబు నిలిపియుండి
నిత్యకృత్యములన్నియు నిర్వహించు
కాని తలపడు మదిలోన కార్యములను
514.
చం.:
ఒక పరి నవ్వు బిగ్గరగ, నొక్కపరిన్ విలపించు, శ్రీహరిన్
సకలముగా భజంచుతరి సంతసమందునలౌకికంబుగన్
ఒకపరి దుఃఖమొందు మరియొక్కపరిన్ పెనుసంభ్రముంబుతోన్
రకరకమైన మానసిక లక్షణుడై చరియించు వ్యగ్రతన్
515.
ఉ.:
పొందును విష్ణుభావమును పూనియభేదము విశ్వరూపుతోన్
చిందులు పారవశ్యమున చెన్నుగ వేయు ననంత మోదమున్
అందుచు, గట్టిగా నఱచు ‘పాలయమాంహరి!’ యంచు దివ్యగో
వింద పదారవిందరత విస్తృతి దైత్యకిశోరుడాగతిన్
516.
మ.కో.:
దేవదేవుని తాకినట్లుగ దివ్యభావముగల్గగా
జీవశక్తికి ధన్యతన్ తగజెంది మోదప్రపూర్ణుడై
రావె కేశవ! శౌరి! మాధవ! రాగనాశక ! యంచు, స
ద్భావరంజిత సత్యనిష్ఠత బాలుడవ్విధి సొక్కుచున్
517.
సీ.:
అతని మిత్రులుకూడ నట్టివారే, సర్వ
సంగ పరిత్యాగ శమిత మతులు
వారి స్నేహముచేత వర్ధిల్లు భక్తిని
అంబుజాక్షుని ధ్యానమందు నిలిపి
పరమమైనట్టి మోదము బడయుచుండు
దాని విస్తృతమొనరించు దారినడచు
దుష్టసంగతివీడి దురితంబులను బాసి
నిలిచెను ప్రహ్లాద బాలకుండు
తే.గీ.:
విషయ సుఖములకిచ్చెను వీడుకోలు
తనకు నితరులకును సత్య ధర్మములను
శాంతినందించి నిశ్శేష సాంఖ్యయోగ
సిద్ధిబొందెను చిన్నారి చిట్టి బుడుత
518.
శా.:
రాజీవాక్షుని ధ్యానమందు తనదౌ రాజిల్లు సద్భక్తితో
నాజన్మాంతము విష్ణు దివ్యపదమున్ ఆశించు సత్పుత్రునిన్
రాజశ్రేష్ఠుడు హేమకశ్యపుడు సల్లాపంబులన్ శత్రువౌ
తేజోమూర్తి హరిన్ భజించు ఫణితిన్ తెల్లంబుగాన్ క్రోధియై
~
లఘువ్యాఖ్య:
పద్యం 505 లో ప్రహ్లాదుని భక్తి ఎరుంగక హిరణ్యుడు పుత్రవాత్సల్యం చూపుతున్నాడని అన్నారు కవి. తల్లి స్వప్నాన్ని గుర్తు చేసుకొని భయపడుతూ ఉంది. కాని విష్ణువును ధ్యానించి (పద్యం 506) శాంతి బొందినది. పద్యం 508లో ఆ బాలుడు పెద్దలకు పాద నమస్కారం చేస్తాడు. ఆర్తులను ఆదరిస్తాడు. సమానులను సోదరులుగా చూస్తాడు. పద్యం 509లో విద్య, ధనము, వంశం వల్ల అతనికి గర్వం అణుమాత్రమైనా లేదని చెప్తారు కవి. ఈ భాగమంతా ప్రహ్లాదుని సద్గుణ వర్ణనము, వినయశీలము వర్ణించబడినాయి. పద్యం 511లో సద్గుణాలు శతనికి సహజాలంకారాలైనాయని కవి చెబుతున్నారు (తొడవులు = సొమ్ములు). తర్వాత పద్యం 513లో వయసుకు మించిన వైరాగ్య సంపద ఆ బాలుని సొంతమని, ఆటలపై ధ్యాస లేదని, భౌతిక విషయాలు అసలు పట్టవని అన్నారు కవి. పద్యం 514లో ఆతని మనస్థితిని వర్ణించారు కవి. ఒకసారి గట్టిగా నవ్వుతాడని, ఓకసారి ఏడుస్తాడని, ఒకసారి సంభ్రమం పొంది, “హరీ! నన్ను పాలించు” అని అరుస్తాడని తెలిపారు. తర్వాత పద్యం 517లో అతని స్నేహితో కూడ అలాంటివారే అంటున్నారు కవి. పద్యం 518లో తండ్రికి కొడుకు విష్ణుభక్తి గురించి తెలిసి క్రోధంతో రగిలిపోతాడని అన్నారు కవి.
(సశేషం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా, రీడర్గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్లో సీరియల్గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.