Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-33

[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]

నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.

***

తృతీయాశ్వాసము:

ప్రహ్లాద కుమారుని బాల్యము

491.
కం.:
జననీ గర్భము వెడలిన
క్షణమున నుండియును విష్ణుగత మతియగుచున్‌
దనుజ శిశువు హరిధ్యానము
మనమున నిరతంబు జేసె పంకజనాభున్‌

492.
కవిరాజ విరాజితము:
పసిచిరుపాపగ పండెడు భంగిని
భావము చేయును, కేశవుడే
వసనముగావట పత్రము నందున
భాసిలునట్లుగ భక్తిమెయిన్‌
లసితముగా తను రాజిల బోరగి
లంగను కూర్మపు మూర్తిగనున్‌
వెస తన పాదము పెట్టుచు సాగగ
పేర్మిని వామన లీలజనున్‌
అసలగు క్షీరములందెడి వేళల
నాయదువంశజుభంగి యగున్‌

492.
ఉ.:
ముద్దుల మాటలన్‌, సరిగ పూర్తిగ రాని విధంబు తోడ, నా
ముద్దులు మూటగట్టెడు నపూర్వ పదంబులు బల్కుచుండు, నా
విద్దెలు నేర్చినట్టి శిశువిట్లు “పరాత్పర! లోకవంద్య! నా
కద్దియె చూడ విష్ణు పదగానము, శౌరి! మదంబ! శ్రీసతీ!”

493.
కం.:
ఆటల వేళల నాతడు
తోటి దనుజ బాలలకును తోయజునాభున్‌
పాటల, పాడెదమనుచును
దీటుగ శ్రీహరిని గూర్చి స్థిరమగుభక్తిన్‌

494.
కం.:
నృత్యము చేయుదమని తా
నత్యంతమునైన శౌరి యనుకంపము తాన్‌
నిత్యము నాడును సహచర
భృత్యావళి విస్మయంబు భృశముగ బొందన్‌

495.
సీ.:
తిండి తినెడు వేళ నండజవాహను
నామకీర్తనమును తాను విడడు
నిద్రబోయెడు వేళ నీరజాతనయను
ధ్యానంబు జేయును దనుజశిశువు
మేలుకొనిన వేళ పీతాంబర ధారి
గానంబు వీడడు గడియయైన
ఆటలాడెడు వేళ నటన సూత్రపుధారి
తలచుట మరువడు తథ్యముగను
తే.గీ.:
మనసు, వాక్కును, కాయంబు, పనులయందు
విష్ణు చింతన పరుడౌచు మెలగుచుండు
బాలప్రహ్లాదుడెంతయు భక్తితోడ
పువ్వు పుట్టగ పరిమళ మొసగు భంగి

496.
ఉ.:
“మూడున లేని సన్మతిని ముప్పది యేడుల గూడపొందరే?”
వీడక నన్ని వేళలను విష్ణుని గొల్చెడు బాలుజూచి, మా
ట్లాడెదు రార్యులిట్లు, పరమాత్ముని నవ్విధి నంత చిన్నదౌ
ఈడున సద్వివేకమున నేర్చినయాతడు ధన్యుడే కదా!

497.
తే.గీ.:
అనుచు తెలిపెను దేవశ్రవముని యపుడు
గాలవమునికి బ్రహ్లాదు గాఢభక్తి
మధుర వచనములను గూర్చు విధము దనర
నితరమునులును సంతోషమతులు యనగ

ఆశ్వాసాంత పద్యగద్యములు

498.
పంచ చామరము:
సమస్త జీవకోటి నిల్పు సారసాక్ష! మాధవా!
రమింతు వీవు సర్వలోక రక్షకుండవై హరీ!
సమానమైన దర్శనంబు స్వామి, నీది, చిన్మయా!
క్షమించు దోషరాశి, దేవ! కశ్మలంబు బాపవే!

499.
భుజంగ ప్రయాతము:
నిజానంద సంభూత నిత్యప్రకాశా!
అజేంద్రాది వంద్యా! మహామోక్షకారీ!
రజోబుద్ధి భంగించు రక్షాసుదక్షా!
భజింపంగ నీ దైన భావంబు నీవే!

500.
స్రగ్విణి:
నిత్యసత్యాత్మకా! శిష్ట మిత్రాత్మకా!
కృత్యనిర్దేశకా! దుష్టకృద్ఘాతకా!
మృత్యుసంభావనా నాశమంత్రాత్మకా
సత్యసంశోధకాధార! శౌరీ! హరీ!

501.
కం.:
దామోదర నీ యాదర
మే మాకది నిత్యనిధిగ, బ్రేమాస్పద, నీ
మోమున విరిసెడు కరుణయె
మామోక్షముకున్‌పునాది మహితసుతేజా!

502.
తరళము:
అమితమైన త్వదీయమౌదయ నందజేయవె కేశవా!
శమితమౌను మహాఘముల్‌ నిను సన్మనంబున నిల్పగన్‌
కుమతినాశక! సర్వపోషక! కృష్ణవర్ణ! సుశోభితా!
విమల దివ్యయశోనిధీ! ఘన విశ్వమోహన! వామనా!

503.
గద్యము:
ఇది శ్రీ లక్ష్మీనృసింహ పదాంబురుహనిశ్చలచిత్త, లక్ష్మీ నరసమాంబాపుత్ర, శ్రీమదహోబిలనారసింహదత్త పాండిత్య శేముషీయుక్త, దత్తశర్మ ప్రణీతంబైన, శ్రీలక్ష్మీనృసింహ మహాత్మ్యంబను దివ్య ప్రబంధంబునందు తృతీయాశ్వాసము.
~

లఘువ్యాఖ్య:

తల్లి గర్భం నుండి బయటికి వచ్చినప్పటి నుండి, ప్రహ్లాదుడు విష్ణువుపైనే బుద్ధిని నిల్పియున్నాడు (పద్యం 491). పద్యం 492 ‘కవిరాజు విరాజితము’ అను విభిన్న ఛందో ప్రక్రియ. దీనిలో 20 అక్షరాలు 2 యతులు ఉంటాయి. దీనిలో ప్రహ్లాద బాలుడు పడుకున్నపుడు వటపత్ర శాయిగ, బోర్లాపడినపుడు కూర్మావతారముగ. నడకలో వామనుడిగా, పాలు త్రాగేటప్పుడు కృష్ణుడిగ కవి ఉత్ర్పేక్షించినారు. ముద్దులు మూటకట్టు, వచ్చీ రాని మాటలతో కూడా ఆ పరమాత్మనే ధ్యానిస్తున్నాడు. తర్వాత 2 కంద పద్యాలలో (493, 494) ఆటలలో, నాట్యములలో సైతం హరి పాటలనే పాడతాడు. నృత్యం కూడ విష్ణు గానమే. తర్వాత సీస పద్యంలో (495) తిండి, నిద్ర, మేలుకొనినపుడు, ఆటలాడేటపుడు నిరంతరం విష్ణుచింతనా పరుడై ప్రహ్లాదుడున్నాడు. తర్వాత ఉత్పలమాల పద్యంలో (496) మూడేళ్లకు రాని మంచి బుద్ధి ముప్పది ఏండ్లకు కూడా రాదనే ఆర్యవాక్యము కవి ఉటంకించినారు. చివరగా తేటగీతిలో (497) దేవశ్రవ ముని గాలవబుషికి తెలిపాడు. ఆశ్వాసాంత పద్యములతో కవి పంచచామరము, భుజంగ ప్రయాతము, స్రగ్విణి, తరళము మొదలగు విభిన్న ఛందోరీతులతో పరమాత్మను కీర్తించుచున్నారు. చివరి గద్యములో తనకు నరసింహునిపై గల భక్తిని, ఆయన కరుణ చేతనే తన పాండిత్యమని కవి వినయముగా ప్రకటించుచున్నారు.

(సశేషం)

Exit mobile version