[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]
నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.
***
తృతీయాశ్వాసము:
401.
ఆ.వె.:
మిమ్ము సతము గొల్చు మేమిట్లు మిక్కిలి
భంగపడెడునట్టి పాడు కాల
మదియ దాపురించె మాధవా! వినుమయ్య
సిగ్గు తోడ మనసు చితికెనయ్య!
402.
ఉ.:
వాని గదావిఘాతముల వాడిన మా శిరముల్ ఇవి చూడు కేశవా!
వాని విశేష తర్జనము బారిన పారిన మమ్ము బ్రోవుమా!
దానవ సేవలన్ కమిలి తప్పిన కాంతుల చేతులివ్వె, ఓ
దీన సముద్ధరా! కనుము తేజము వీడిన దేవతా తతిన్
403.
కం.:
మా రాజ్యము మా సంపద
మా రంజిలు వైభవమ్ము మా భాగ్యములున్
ఈ రీతి కోలుపోతిమి
ఘోరాసుర దుష్ట ధాటి క్రుంగెను మనముల్
404.
ఉ.:
నీవే మాకిక దిక్కు శౌరి ఇకపై నీ పైన భారంబు, మా
కీవే నిర్భయ దివ్యభవ్య పదమున్ నీరేజపత్రేక్షణా
నీ వాత్సల్యమె మమ్ము గాచు వరదా! నీ ప్రాపు నిశ్చింత గాన్
చేవన్ తప్పిన మేము సాంత్వనముకై చేరన్ కటాక్షింపవే!
405.
కం.:
అని విన్నవింప నమరులు
విని మధు దమనుండు తగిన విధమున సురలన్
అనునయమున నోదార్చెను
తన కృప ప్రసరింప జేసి తనియగ మనముల్
406.
వచనము:
అనుకంపాపూరితుడైన అబ్జనాభుండు సురలతో నిట్లు పలికెను.
407.
ఉ.:
వింటిని దైత్యు దుర్మదపు వికృత చేష్టలు, దుష్టకృత్యముల్
మింటను భాస్కరోదయము మించిన చీకటి బాపునట్లు, నా
కంటకు పాపముల్ పగిలి కర్మఫలంబది పండువేళ, మీ
కంటిన వాని పీడ తొలగన్ వధియించెద, నోర్పు పట్టుడీ!
408.
తే.గీ.:
వివిధ రీతుల వానికి చావు లేని
వరము పరమేష్ఠిచే బొంది సురల నిటుల
చిత్రహింసల పాల్జేయు భాతృ ద్రోహి
మడియునట్లుగ నూహను పన్నినాడ
409.
మ.కో.:
వాని వ్రేలితో వాని కన్నులు భగ్నముల్ యొనరించగా
నేను దాల్చెద నారసింహుని మేను భీకర రూపమున్
నా నఖంబుల సంజె వేళను మట్టుబెట్టెద దైత్యునిన్
దానవాధము నంక పీఠిని దారుణంబగు రీతినిన్
410.
తే.గీ.:
కాన వీడుడు దుఃఖంబు కనుడు శాంతి
అశ్రితావన సంస్ఫూర్తి యసురు ద్రుంచి
అమరజాతిని రక్షింతునని వచించి
అదితి సుతులకు నభయంబు హరి యొసంగె
411.
తే.గీ.:
నన్ను ఒకసారి తలచినన్ మనమునందు
భక్తి మీరగ; కరుణింతు, వారి నేను
వారి వెతలెల్ల నాకిట్టె ప్రకటమగును
ఆర్త పరిపాలనంబు నొనర్తు నేను
412.
చం.:
గుణముల కీర్తనంబుననె కోరిన కామ్యము లిత్తు నేను, నా
ఘనతర సుప్రభావమున కాచితి వేదము లెల్ల, శాస్త్రముల్
కని విని, యంతరార్థముల గ్రాహ్యము నేనని గొల్చు వారి నన్
మననము చేయువారి వెత బాయగ జేతు నఖండమౌ కృపన్
413.
తే.గీ.:
గూఢమైనట్టి తత్త్వము కోరి తెలియ
అలవి కాదని ఇది యెల్ల సకలురకును
కరుణ నరసెడు విధమును కాంచ జేతు
నేన దెల్పుదు భువనాల మేలు గోరి
414.
ఉ.:
నేను సమస్త భూతముల నెల్ల సమంబుగ జూచువాడ, నన్
పూనిక, ధర్మచింతనను పొందిన వారిని గాతు తప్పకన్
కాని, యధర్మచార ఘన తామస గర్వ మదానుశీలురన్
నేనతి ఘోర శిక్ష సమయింతును లోకహితార్థమై వెసన్
415.
వచనము:
అని విష్ణుభగవాను డానతిచ్చిన..
416.
సీ.:
దుష్ట తామసులను ద్రుంపంగ శౌరికి
చెప్పవలసినది యొప్పు కాదు
శిష్ట తాపసులను చేరి రక్షింపంగ
పద్మనాభుని గోర బనియె లేదు
సాత్త్విక చిత్తులౌ స్వర్గవాసుల బ్రోవ
పుండరీకాక్షుడే పూనుకొనియె
హేమకశ్యపు జంప భీమ రూపము దాల్చి
నరసింహుడై వచ్చు సరసిజాక్షు
తే.గీ.:
డని మనంబున ముదమది సందడింప
భావి నరసింహ రూపము భావనమున
నిలువ సురనాథుతో గూడి నిర్జరాళి
హరికి కైమోడ్చి వెడలిరి హరితభయులు
~
లఘువ్యాఖ్య:
పద్యాలు 401, 402, 403 లో కూడా దైత్యునిచే తాము పడుతున్న హింసలను దేవతలు వివరిస్తారు. పద్యం 404 లో నీవు తప్ప మాకు వేరే గతి లేదని ప్రార్థిస్తారు. పద్యం 405 నుండి మహావిష్ణువు వారిని ఓదార్చి, తానున్నానని భరోసా కల్పించే పద్యాలున్నాయి. పద్యం 407లో ‘వాని దుర్మదపు వికృత చేష్టలు నేనూ విన్నాను, వాడి పాపం పగిలి, కర్మఫలం పండితే, వాడిని చంపి, వాడి పీడ మీకు తొలగిస్తాన’ని అంటాడు దేవదేవుడు. పద్యం 409లో బ్రహ్మ వరాలకు విరుధ్ధంగా, నృసింహావతారమెత్తి, గోళ్లతో, సంధ్యాసమయంలో, తొడల మీద, వానిని చంపుతానని స్వామి వాగ్దానం చేస్తాడు. పద్యాలు 410, 411, 412, 413, 414 లలో స్వామి తన తత్త్వాన్ని, ఆర్తత్రాణ పరాయణత్వాన్ని వివరిస్తాడు. తాను సమదర్శినని, కాని అధర్మవర్తనులను సహింపనని చెబుతాడు. పద్యం 416 లో సర్వజ్ఞుడైన స్వామికి తాము చెప్పవలసిన పని లేదని సాంత్వన పొందిన దేవతలు, నరసింహరూపములో స్వామి అవతరించి హిరణ్యని పీడ తొలగిస్తాడని సంతోషంతో వెనక్కు మరలుతారు.
(సశేషం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా, రీడర్గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్లో సీరియల్గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.