Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-26

[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]

నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.

***

తృతీయాశ్వాసము:

385.
పంచచామరము:
పాంచరాత్రులు నిన్ను జేరగ భవ్యమోక్షము బొందగా
నంచితంబగు సేవయే తమ యాత్మధర్మముగాగ, వే
రంచు నిన్ను దలంపకన్ యనురక్తి జూపుచు సాగుచున్
కొంచెమైనను నిన్ను వీడక కూడియుందురు నిత్యమున్.

386.
తే.గీ.:
ద్వైతమైనట్టి భ్రాంతిని వెతను బొంది
కల్పితంబైన స్వప్నేంద్రజాలమనుచు
తెలియ నేరరు తాడును యురగమనుచు
బాహ్యలోకంబు నిజమని బాగ నమ్మి

387.
వచనము:
దేవా! తత్త్వజ్ఞులు వేదాంతులు అపరోక్షానుభవమున జీవ దేవ తారతమ్యంబు తొలగి, చిదానంద రూపుడైన నిన్ను తెలియుదురు.

388.
కం.:
కన మంత్రజ్ఞులు సాంఖ్యము
ఘనయోగము విడిచి, యాత్మ కాయములను, నీ
వను లక్ష్యంబున నిలుపుచు
పూనిక నిను చేరుచుంద్రు, భుజగశయానా!

389.
కం.:
వేదములన్నియు నీదగు
పాదములను ఉద్భవించె వనరుహ నేత్రా!
నీ దయతో, పదునెన్మిది
చదువులు నేర్పించు గురులు ఛాత్రులు నీకున్

390.
ఉ.:
నీటిని సృష్టి చేసి, తగ నీదగు బీజము నాటి, యందునన్
చాటితి అండ రూపుడగు సత్యుని, బ్రహ్మ, మరీచియున్, భృగున్
దీటుగ దేవదానవులు, తేకువ ముజ్జగముల్ చరించు నీ
ధాటిని; వారి జాప్త శశి ధారణ! సర్వయఘో విదారణా!

391.
సీ.:
వేదాల గోల్పోయి వేదన కుమిలెడు
బ్రహ్మ గాచితి వీవు మత్స్యరూప!
తాబేలు రూపాన తాల్చి మందరమును
సుధను జిలుకునట్టి విధము జూపి
యజ్ఞ వరాహమై యవనిని రక్షించి
నేలతల్లిని నీవె నిలిపినావు
అశ్వముఖుడ వగుచు యజ్ఞకేసరముల
హయఘోష లోంకారమయము కాగ
తే.గీ.:
రాగి జడలను నింపారు రమ్యశిరము
నిండు చందురు బోలిన నీ వదనము
నరుడు నారాయణుండని అరయు వారి
నిరతమును కాచు కారుణ్య నిధి! మహాత్మా!

392.
కం.:
జరిగినది జరుగుచున్నది.
జరిగెడునది ఎల్ల నీవె శాశ్వతమహితా!
అరులను దునుముము మురహరి!
సురలను కాపాడు దైత్యశోషణ! కృపతోన్

393.
శా.:
రాజీవాక్ష! దయాళు! మాధవ! కృపన్ రాజిల్లు నీ చూపులన్
ఈ జీవుల్ చరియించు, కృష్ణ! మదిలో నీ నామమున్ తల్చినన్
ఆజన్మాంతము శాంతి సౌఖ్యముల మా కందింతు, ఇంద్రానుజా!
తేజోమండల మధ్యవర్తి! వరదా! తీక్ష్ణాంశు సమ్యక్ప్రభా!

394.
తరువోజ:
గరుడుడు ధ్వజముగ గలిగిన చతుర
కరమగు మహిమల గలగిన యనఘ
ఉరుతర మణిమయ యురమది వెలుగ
ఉగరపు గొడుగును ఒనరిన ఘనుడ
నిరతము నిను గని నిలిచెడు మతిని
నిఖిలము నొసగుము నిజకృప మిగుల
అరితతి సమయగ అతిశయముగను
అనయము సురలకు అభయము నిడుమ

395.
కం.:
వైకుంఠవాస! కేశవ!
నాకాధిపు వైరి జంపి మము బ్రోవు హరీ
సాకల్య ధర్మ రక్షణ!
శోకానలవారి! శౌరి! సురరిపుహరీ!

396.
తరళము:
మరణమన్నది. జన్మయన్నది మానియున్న పరాత్పరా!
క్షరము కానిది కార్యకారణ కాదసాధ్యము కేశవా!
అరయ నంతము నాది యన్నది ఆత్మగల్గదు మాధవా!
దురిత నాశన! విశ్వపాలన! దుష్టదైత్యవిదారణా!

397.
వచనము:
అని పరి పరి విధంబుల బృందారకులు, దేవేంద్రుని నాయకత్వంబున. తమ యనంత దుఃఖములను, నారాయణునకు, సాష్టాంగ దండప్రణామంబులతో నివేదించిరి. వారి ప్రార్థనలను మందస్మిత వదనారవిందుడైన గోవిందుడు, “నిలింపోత్తములారా! మీకింత దైన్యస్థితి కల్గుటకు కారణం బెయ్యది? మీకు కల్గిన విపత్తును నేను తొలగించెద. సావధాన చిత్తులయి మీ యాపద నెఱింగి౦పుడు” అని ఆనతీయ, ముకుళిత హస్తులయి, ఇంద్రాది దేవతలు, పరమాత్ముతో నిట్లు పలికిరి.

398.
తే.గీ.:
దేవ దేవ తమకు తెలియని దేముండు
వర్తమాన భూత భావి సకల
మీవె వర్తింప జేతువు విదిత సర్వ!
అవధరింపుము ఐనను, మా వెతలను

399.
ఉ.:
ఘోర తపంబొనర్చిన యకుంఠిత దీక్షు హిరణ్యకశ్యపున్
వారిజ సంభవుండు గృపవర్ధిల దివ్యవరంబు లిచ్చినన్
తేరియు పార జూడగను తీక్ష్ణము నైన పరాక్రమంబునన్
ఆ రజనీచరాధముడు అస్తము వ్యస్తము జేయు లోకముల్

400.
మ.:
వరగర్వంబున దుష్ట దైత్యుడు మమున్ ప్రాణావశిష్టంబు గాన్
చరియింపందగు రీతి జేసె, దనుజుల్ సాహంకృతుల్ క్రొవ్వునన్
నిరతంబున్ మునిసాధు యోగవరులన్, మీ భక్తకోటిన్ మహ
త్తరమౌ పీడన చేయుచుండిరి, హరీ! తాళన్ అశక్యంబుగాన్
~

లఘువ్యాఖ్య:

పద్యం 385 పంచచామర వృత్తం. ‘పాంచరాత్రులు’ అనే సాధకులు స్వామిని ఎలా కనిపెట్టుకొని ఉంటారో కవి వివరిస్తున్నారు. పద్యం 386 లో వేదాంతపు లోతులు ఉన్నాయి. ద్వైత భ్రాంతిలో, తాడును పాము అనుకుని మానవులు కలత చెందుతున్నారు. వచనం 387లో వేదాంతులు, పద్యం 388లో మంత్రవేత్తలు, స్వామిని ఎలా చేరుతున్నారో కవి వివరించారు. పద్యాలు 389, 390లలో స్వామి వేదాలకు స్థానమని, సమస్త సృష్టిని, నీటిలో నుండి చేసి, సత్య, మరిచీ, బ్రహ్మలను ఉద్భవింపజేశాడని తెలిపారు. పద్యం 391 లో స్వామి వారి వివిధ అవతారములు వర్ణించబడినవి. పద్యం 392లో భూత భవిష్యత్ వర్తమానలన్నీ స్వామియే అన్నారు కవి. 394 తరువోజ అనే దేశీ ఛందస్సు. సర్వలఘువృత్తం. ప్రతి పాదం 30 అక్షరాలు కలిగి, 3 యతి స్థానాలు కలిగిన అరుదైన వృత్తం. పద్యం 395 కూడా స్వామి దివ్యతత్త్వమే. 397 వచనం. అందులో దేవతల ఆక్రోశం, ప్రార్థన ముగుస్తాయి. స్వామి వారి ఆపదను తొలగిస్తానని అభయమిస్తాడు.  పద్యాలు 398, 399 లలో “తమకన్నీ తెలుసు, బ్రహ్మ వరగర్వితుడైన హిరణ్యకశిపుడు మమ్మల్ని ఎన్నో బాధలు పెట్టుచున్నాడు” అని విన్నవిస్తారు. పద్యం 400లో కూడా అదే భయం వ్యక్తం.

(సశేషం)

Exit mobile version