[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]
నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.
***
ద్వితీయాశ్వాసము:
225.
మ.:
పిలిపించెన్ తన యప్సరోమణుల నా బింబాధరల్, కాముడే
విలు సంధించిన పుష్పబాణములనన్ విచ్చేసి, దేవేంద్రుతో
చెలువారన్ తమకాజ్ఞ ఇమ్మనిరి, రాశీభూత శృంగారముల్
లీలన్ జూపుచు, స్వర్గనాథుడపుడీ రీతిన్ వచించెన్ తగన్
226.
ఉ.:
అచ్చరలార! హేమకశిపాద్భుత ధీర తప ప్రభావమున్
మెచ్చిన సృష్టికర్త వరమిచ్చి ఖలున్ కరుణించెనేని, యా
మచ్చర రక్కసుండు మన భాగ్యము తీరగ స్వర్గలోకమున్
రచ్చ యొనర్చి, దేవతల ఛిద్రము జేయు, వరాల శక్తితోన్
227.
సీ.:
లావణ్యవతులైన లలనామణుల జూచి
కామము గల్గని ఘనుడు గలడె?
ప్రియమైన పల్కుల ప్రేమ మీర చరించు
సుదతుల జేరని సుమతిగలడె?
ఒయ్యారపున్ కుల్కు లయ్యారెయనిపించు
భామల విదిలించు మౌని గలడె?
మెరుపు తీవల బోలు మిసిమి తనువుల వారి
కాదని తపియించు జోదు గలడె?
తే.గీ.:
మీరు నెందరొ సంయమి వరుల నటుల
తపము భంగము గావించి తనరలేదె
వలపు సంపద దైత్యునిన్ నిలువరించి
మనల గాపాడు డని నాథు డానతివ్వ
228.
వచనము:
దేవకాంతలు సురనాథుతో నిట్లు పలికిరి.
229.
సీ.:
రాగముల్ విడనాడి భోగముల్ వీడు వి
రక్తులకును పరి రంభ రంభ
తన హొయల లయలను తాపసుల వేధించి
చెన్నొందు సతి యూర్వశీ లలామ
మేని సోయగముల మునులను మురిపించి
పాలించు మేనక పైడితునక
ఇక తిలోత్తమయన్న నొక మదన బాణంబు
మేటి ధీరులనైన మించు జాణ
తే.గీ.:
వరలు వజ్రాయుధమ్మది వమ్ముయైన
వారకాంతల చిన్నెలు వన్నెలపుడు
కఠిన చిత్తాల కరగించి కామశరము
మునుల డెందము ఛేదించు పూనిక గను.
230.
కం.
మా చూపుల తూపులకై
వేచుచు తపమాచరించు వేదవిదుల్, మా
కుచముల పొందును గోరెడు
నచలాత్ములు ఋషులు, దేవనాథ! ఎఱుంగన్
231.
కం.:
మా యధర సుధల గ్రోలగ
సంయములును సోమరసము శ్రద్ధగ గ్రోలన్
చేయుదురు బ్రహ్మచర్యము
మా యాలింగనము గోరి మహిత మునీంద్రుల్
232.
తే.గీ.:
స్వర్గప్రాప్తిని గోరెడు సర్వులనఘ!
మాదు పొందును కాంక్షింతు రదియె నిజము
అన్ని తపముల లక్ష్యము అమరలోక
సౌఖ్యమన్నను మము గూడు సరళి కాదె!
233.
ఉ.:
ఈ పని మాకు లోకముల మేలుకటంచు దలంచి మేము, మీ
ప్రాపున, దైత్యనాథుని యపార తపంబును మాదు సొంపులన్
రూప విలాస విభ్రమములన్, మరుతూపుల చూపులన్, మహా
తాపసి హేమకశ్యపుని ధ్యానము భంగము చేయలేమొకో?
234.
తరువోజ:
అనగను అమరుల అతివలు మిగుల
మనమున సురపతి మరిముద మొలుక
పనిచెద మలయపు పవనుని, లలిత
వనముల పరశశి వనరులు వరల
తనియగ మదనుడు తన శరములను
మునులను నరులను ముదమున చెరుప
అనవుడు సురసతు లమరుల విభుని
యనుమతి గొనుచును యరుగగ, పలికె
235.
ఉ.:
తోడుగ మీకు ప్రకృతిని, ద్రుంపగ దైత్యు తపోవ్రతంబు, మీ
రాడుట పాడుటల్, భృశము నందము చిందగ నిచ్చుచుంటి, మీ
ఈడును సోయగంబులును నెమ్మనముల్ సకలాయుధంబులై
వాడగ, స్థైర్య చిత్తమది, భగ్నము జేయుడు సద్విలాసులై
236.
వచనము:
అని దేవేంద్రుండు పలుక, అప్సరోత్తమ యైన తిలోత్తమ ఇట్లనియె.
237.
సుగంధి:
వాలు చూపు నేను జూడ వాలిపోవు దైత్యుడే!
ఆలకించి తేనెలొల్కు నాదు పల్కు సోలడే!
నీలవేణి తోడగొట్ట నేలవాలి మొక్కడే!
మేలమాడ యోగి యైన బ్రీతి లొంగిపోవడే!
238.
వచనము:
అని పలుక, సురేంద్రుండు సంతసించె. అంత నప్సరోమణులందరు దైత్యమణి తపము చేయుచున్న గంధమాదన గిరి కరిగిరి.
~
లఘువ్యాఖ్య:
పద్యం 225లో ఇంద్రుడు తన అప్సరసలను పిలిపిస్తాడు. వారు మన్మథుడే విల్లు సంధించిన పుష్పబాణములా అన్నట్లున్నారు. ‘వారు రాశి పోసిన శృంగారములు’. పద్యం 226 లో ఇంద్రుడు “హిరణ్యకశిపునికి బ్రహ్మ కరుణించి వరాలిస్తే, మనం చాలా ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి వీరు అతని తపస్సును భగ్నం చేయాలి” అని చెప్తాడు. పద్యం 227లో ‘ఎంతవారలైన కాంతదాసులే’ అన్న విషయాన్ని రకరకాలుగా వివరించారు కవి. “ఎంతో మంది మునివర్యుల తపసును మీరు భగ్నం చేశారు. వీడి తపస్సును కూడా పాడు చేసి, దేవతలను కాపాడండి” అంటాడు (పద్యం 228) ఇంద్రుడు. పద్యం 229 లో దేవ కాంతల వర్ణన. మేనక ‘పైడితునక’, ‘తిలోత్తమ ఒక మదన బాణం’ అంటారు కవి. పద్యాలు 230 – 234 లలో దేవకాంతలు తమ గర్వాతిశయాన్ని ప్రదర్శిస్తారు. ఎంత తపశ్శాలురైనా తమకు దాసోహం కావలసిందేనంటారు. మునులు సోమరసం తాగేది తమ అధర సుధలను గ్రోలడానికేనట. అన్ని తపముల లక్ష్యం అమరలోక సౌఖ్యమే. పద్యం 233 లో, తమ ఈ పని లోక కల్యాణం కోసమేనని, తమ సొంపులు, రూప విలాసవిక్రమములతో దానవనాథుని తపస్సు చెడగొట్టి, దేవనాథునికి ముదంబుగూరుస్తామంటారు. పద్యం 234లో కవి తరువోజ అనే దేశీఛందస్సును వాడారు. ఒక్కో పాదంలో 30 అక్షరాలు, 3 యతి స్థానాలు, అన్నీ లఘువులే ఉండడం దీని ప్రత్యేకత. దీనిలో సింహభాగం అచ్చతెనుగు పదాలనే కవి ఉపయోగించారు. పద్యం 235లో దేవకన్యలకు తోడుగా ఇంద్రుడు ప్రకృతిని పంపుతాడు. పద్యం 237 సుగంధి వృత్తంలో తిలోత్తమ తన జడతో కొడితే చాలు దైత్యపతి పాదాక్రాంతుడవుతాడనడం ఆమె ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది.
(సశేషం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా, రీడర్గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్లో సీరియల్గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.