[శ్రీ చిరువోలు విజయ నరసింహారావు రచించిన ‘శ్రీ భారతీ నారద భాషా విచారము’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము. ఇది 3వ భాగము.]
~
21.
స్త్రీల నుద్ధరించు సమస్య మేలు, సంఘ
మందు పోరాడి హక్కుల నంద వలయు
పురుషుల యహంబు నణచగా స్ఫూర్తి నంది
కలసి కట్టుగా నినదించి ,కదలి రండు
మగువ సంక్షేమ సాధన మాన్య మనిరి
వీరె కవితల స్త్రీవాదు లైరి నాడు
22.
సంఘ కుల మత శ్రేణుల సాగువారు
తమ కులపు గౌరవము బెంచి, దళిత హితము
గోరి పోరాడ సమకట్టి కూడి, క్రాంతి
కవితలను వ్రాయ సాగిరి గళము బెంచి
వారె దళిత కవులటంచు వరలి నారు
23.
పొంది కొంత కమ్యూనిష్టు పోకడలను
తీవ్ర వాదంబు తెరలేపి,దీన జనుల
యుద్ధరణమె లక్ష్య మనుచునుద్యమింప
సరస, విరస విభాగంబు లవతరించె
కవుల మధ్య విభేదముల్ ఖండితముగ
దెలియ జెప్పి తా జయ మంద వెలసినారు
24.
కథలు చెప్పి, సంఘము నందు కష్ట సుఖము
లెల్ల కనుల కట్టిన రీతి నింపు గూర్చి
వచన రచనలు వెలయించి వాసి గనిరి
వారె సత్కథా కవులంచు వరలినారు
25.
నాటి ప్రౌఢ కవుల లోన మేటి వారు
కొన్ని నాటకములు,వ్రాసి ,మిన్న యనగ
పద్యములు పాడి, రాగాలు భాసిలు గతి
ప్రేక్షకుల నలరించి తా ప్రీతి గనిరి
వారె నాటక కర్తలై ప్రతిభ గనిరి
26.
పలువురకు జీవనము ధన భాగ్య మబ్బి
నాటకం బొక వృత్తియై నాణ్య మయ్యె
కళలకును, గాన విద్యకు ఖ్యాతి కలిగె
వీను విందును,చెవులకు వేడ్కగూర్చె
హర్ష పులకితులై యొప్పి రాదరమున
27.
దినము నంతయు పనిచేసి, తేరుకొనగ
మదికి నానంద మందగా మనుజు లెల్ల
నాటకంబులు చూడగా నడచినారు
నాటి విశ్రాంతి దాయిగా నమ్మినారు
28.
జాతి పరదేశ పాలనా యాతనలను
బానిసత్వ బాధ పడగ పాడి కాదు
త్వరను ముక్తి సాధన మొండె ధన్య మనుచు
నైకమత్య పోరాటంబు లవసర మని
విప్లవాత్మక భావాలు విస్తరిల్ల
విప్లవ కవు లవతరించి వీరు లైరి
29.
దేశ భక్తిని చాటగా తేట తెలుగు
గేయ పద్యాలు వ్రాయుచు కీర్తి గనిరి
దేశ భక్తి కవులు పెక్కు రాశయముల
దీప్తి విస్తరింపగ జేసి రాప్తు లగుచు
30.
దైవభక్తి పెంపొందింప ధన్య మనుచు
నార్తితోడనర్చించినారాదిదేవు
వివిధ దేవి ,దేవతలను వేడ్క తోడ
భక్తి శతకముల్, స్తుతులను వ్రాసినారు
భక్తి కవులని వారికి ప్రతిభ కలిగె
(సశేషం)
21 అక్టోబర్ 1939 న జన్మించిన శ్రీ చిరువోలు విజయ నరసింహారావు ప్రవృత్తి రీత్యా కవి. దుర్గా మహాలక్ష్మి, దుర్గా ప్రసాదరావు గార్లు తల్లిదండ్రులు. ఎం.ఎ. విద్యార్హత. రైల్వే మెయిల్ గార్డుగా ఉద్యోగ విరమణ చేశారు. భార్య సత్యప్రసూన. ముగ్గురు కుమారులు.
15 శతకములు ముద్రితములు. రెండు జీవితచరిత్ర గ్రంథాలు వెలువరించారు. అనువాదాలు చేశారు. నీతి శతకములు, సాయి శతకములు తదితర రచనలన్నీ కలిపి 73.