[వాణి వేమవరపు గారు రచించిన ‘స్ఫురణ’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


అరుణోదయపు కాంతులలో నా తల్లి రూపు,
మధురమైన గొంతుకతో ఆ తీయటి పిలుపు,
ఆమె ఒడిలో ఆదమరచి ఊగుతూ నేను.
ఏదీ,.. కనులు తెరిచేసరికి ఆమె జాడనే లేదు,
తియ్యటి ఆ గొంతుక మరి వినిపించనూ లేదు,
వెనుతిరిగి చూచినా
అమ్మ ఎక్కడా లేదు.
కల నుండి నిజం నా ముందు నిలిచింది,
గతం నుండి ప్రస్తుతం స్ఫురణకే వచ్చింది,
వదిలి వెళ్ళిన అమ్మ మరి ఇక రాదని తెలిసింది,
వెన్నంటే ఉంటుందన్న నమ్మకమే మిగిలింది.
మరణం కాదు ఇది మరో జన్మమో తనది,
మరి ఈ జన్మకు మాకు వీడ్కోలే పలికింది,
మళ్లీ జన్మంటూ ఉంటే తనే తల్లిగా రావాలని,
ఆ చల్లని ఒడిలో మళ్ళీ పాపగా నే ఊగాలని,
భారమైన కనులకు తడి తానే తుడవాలని,
మది నిండుగా కోరుతూ,
మరి మరి నే వేడుతూ.
అమ్మ
~
ఇలలో నీలాగా ఎందరుండగలరు అమ్మ,
నీ కడుపున పుట్టిన ధన్యమే నాదు జన్మ,
నీ ఒడిన ఊయలూగి ఎంత మేము మురిసామో,
నీ చేతి ముద్ద తిని ఇంత వారమయ్యాము,
చుక్కానివై మాకు దారి చూపి నావమ్మ,
చక్కని చుక్క నీవు బంగారు మాయమ్మ.
ఇలలో నీలాగా ఎందరుండగలరు అమ్మ
నీ కడుపున పుట్టిన ధన్యమే నాదు జన్మ.
వెతలన్నీ గుండె నిలిపి చిరునవ్వుతో పలికేవు,
కరుణను కన్నుల నిలిపి అందరినీ చూచేవు,
అమ్మ రూపున నిలచిన ఆ జగదంబవే నీవు,
ఇలలో నీలాగా ఎందరు ఉండగలరు అమ్మ,
నీ కడుపున పుట్టిన ధన్యమే నాదు జన్మ.
ఇంట నీవు లేకపోతే వెలుగు ఎక్కడిదే అమ్మ,
నీ గొంతుక వినకపోతే మది
నిలువదు మాయమ్మ,
నీ చల్లని కన్నుల వెలుగులు మాపై చల్లవే అమ్మ,
మా వెన్నువై నిలిచి ముందుకు నడపవే ఓయమ్మా,
ఇలలో నీలాగా ఎందరుండగలరు అమ్మ,
నీ కడుపున పుట్టిన ధన్యమే నాదు జన్మ.