Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కథ, నవలా రచయిత్రి శ్రీమతి లలిత రామ్ ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘సెలయేటిలో మొగ్గ సంపెంగలు’ అనే కథాసంపుటిని వెలువరించిన శ్రీమతి లలిత రామ్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం లలిత రామ్ గారూ.

లలిత రామ్: నమస్కారం.

~

ప్రశ్న1. మీరు రచించిన 23 కథల సంపుటికి పెట్టిన శీర్షిక సెలయేటిలో మొగ్గ సంపెంగలువిభిన్నంగా ఉంది. సంపెగలు చెట్లకి ఉంటాయి, నీటిలో ఉండవు. అలాగే సాధారణంగా వాడుకలో సంపెంగ మొగ్గలు అంటారు. మరి మీరెందుకు మొగ్గ సంపెంగలు అన్నారు? ఈ శీర్షికలో సెలయేరు, సంపెంగలు ప్రతీకాత్మకమా? పుస్తకానికి ఈ శీర్షిక ఉంచడం వెనుక మీ ఆలోచనని వివరిస్తారా?

జవాబు: విభిన్నమైన కథల సంపుటి శీర్షిక పేరు పెట్టాలి అన్న అలోచన కన్నా, ఒక రచయిత్రిగా, నిజాయితీతో, సరళంగా నా మనశ్చిత్రాలను మీ ముందుకు తీసుకు రావాలనే ఈ శీర్షిక ఎన్నుకొన్నాను.

పార్వతీ అమ్మవారు చాంపేయకుసుమప్రియ. చాంపేయము అంటే సంపంగె పువ్వు. సువాసన, కాంతి ఇచ్చే లక్షణాలు కల పుష్పం. నాకు ఎంతో ప్రియము, దూరము (ఈ దేశంలో దొరకవు) అయిన ఈ కుసుమాలు నాలో వికసించే భావాలే. ఇవి జ్ఞానపరంగా ఇంకా మొగ్గలే. నా మనసన్న సెలయేరులో తేలుతున్న, సంపూర్ణంగా వికసితం కాని భావాలను అర్పించటమే ఈ శీర్షిక వెనుక ఉన్న అభిప్రాయము.

పుస్తక ముఖచిత్రం ఆర్టిస్ట్ వాసు గారు చంద్రునిలో శ్రీకృష్ణుడిని చిత్రించారు. ఆ పరమాత్ముని, ఆయనను చేరిన మా తాతగారి పాదాల వద్దకు చేరి వికసించాలి మరి నా మొగ్గ సంపంగెలు. ఈ మాట వర్డ్ ప్లే, పదాలతో కేళి. మీ ప్రశ్న నన్ను మరింత అలోచింపచేసింది. ధన్యవాదాలు.

ప్రశ్న 2. ఇది మీ ఎన్నవ కథాసంపుటి? తెలుగు, ఇంగ్లీషు కవయిత్రిగా, కథకురాలిగా, నవలా రచయితగా, సంపాదకురాలిగా, అనువాదకురాలిగా, మ్యూజిక్ ప్రొడ్యూసర్‍గా మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? మొదటగా ఏ ప్రకియతో సాహిత్య వ్యాసంగం మొదలుపెట్టారు? ఎప్పుడు? మీ కథా రచన గురించి వివరిస్తారా?

జవాబు: ‘మొగ్గ సంపెంగలు’ నా మొదటి తెలుగు కథల సంకలనం. నేను మొదటిసారిగా తెలుగు నవల ‘అవంతీ కల్యాణం’తో 2013లో రచనా వ్యాసంగం చేపట్టాను. ఈ నవలను వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా స్థాపకులు రాజు గారు ప్రోత్సహించి, ప్రచురించారు. తర్వాత ఉద్యోగం చేస్తూ, ఒక ఆంగ్ల నవల, శ్రీమతి భారతీరావు గారి పర్యవేక్షణలో తెలుగు నవరాత్రి ప్రార్థనల చేకూర్పు సంకలనం, శ్రీ ఆండాళ్ ఆంగ్ల అనువాదం వ్రాశాను.

కృష్ణశాస్త్రి గారి లలిత గీతాల ఆల్బం భారతదేశ గాయకుడు, మరియు అమెరికాలో తెలుగు గాయని పాటలతో ప్రొడ్యూస్ చేశాను. అంతర్జాతీయ తెలుగు కవితల, వ్యాసాల సంకలనాలకు ప్రతిపాదకురాలిగా వంశీ ఆర్ట్స్ ద్వారా ప్రచురణకు తోడ్పడ్డాను. ప్రపంచ తెలుగు సమితి అన్న సంఘానికి ఫౌండర్‌గా గ్లోబల్ సాహిత్య, సంగీత సమావేశాలను ఒక బృందంతో కలిసి ఏర్పాటు చేస్తాము.

నా సాహిత్య పయనానికి సాహిత్యవేత్తలు, ప్రముఖులు, తోటి రచయితలు, పత్రికా రచయితలు, ప్రచురణకర్తలు ఎంతో ప్రోత్సాహం అందించారు. చిత్రకారులు, సాంకేతిక నిపుణులు రచనలను మెరుగు పరిచారు. కథలు వ్రాయటం, పత్రికలు, సంకలనాలకు మొదలుపెట్టి, కేవలం నాలుగు పుటలలో ఒక అమరమైన, సృజనాత్మకమైన సందేశం అందించటంలో సంతృప్తి, ఇష్టసిద్ధి కలగటంతో, ఈ కథా సంకలనం ప్రచురించటమయ్యింది.

ప్రశ్న 3. మీపై మీ తాతగారు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ప్రభావమెంత? కొన్ని కథలలో మీరు చేసిన వర్ణనలు – భావుకులకు కృష్ణశాస్త్రి గారిని మరోసారి గుర్తుచేస్తాయి. తాతగారితో మీకున్న జ్ఞాపకాలలో కొన్నింటిని మా పాఠకులతో పంచుకుంటారా?

జవాబు: మా తాతగారు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు నాకు స్ఫూర్తి, కవితాశక్తి, పరిణామచింతాశీలత – అన్నీ ఆయనే! నేను తెలుగులో ఉపయోగించే భాష, భాషలంకారాలు, ప్రతీకాత్మకత మొదలైన వానిపై ఆయన ప్రభావం చాలా వుంది. ఆయన సున్నితమైన రసభరిత, భక్తి, దేశభక్తి, పల్లె, కార్మిక, ఇంకా పలురకాల పాటలు నా మనస్సులో ఎప్పుడూ మెదులుతూనే ఉంటాయి.

తాతగారు వాయిస్ కోల్పోయిన తర్వాత తన ఆలోచనలను, మాటలను నోట్ పేడ్ పైన వ్రాస్తే, అతిథులు వచ్చినప్పుడు నేనే చదివేదానను. ఆయన ఉపన్యాసాలను కూడా! చిన్నప్పుడు నా చేతిని పట్టుకొని, “తల్లీ, నీవు బాగా తిని వెయిట్ పెరగాలి” అనేవారు. ఏడవ తరగతిలో పువ్వులపై కథ వ్రాస్తే ఎంతో మెచ్చుకొన్నారు. ఆయన ప్రముఖులను, బంధువులను కలవటానికి తన అంబాసిడర్ కార్లో వెళ్తూ, ముగ్గురు మనవలనూ తీసుకెళ్ళేవారు. మా తాత, బామ్మ గారి లైబ్రరీ వంటి గదిలో పుస్తకాల మధ్య తారాట్లాడుతూ వుండేదానను. ఆయన కృష్ణ పక్షం, మంగళ కాహళి సంపుటాలలో పద్యాలు, పాటలు, తర్వాత ‘బంగారు పంజరం’, ‘కలసిన మనసులు’ చిత్రాల్లోని పాటలు నాకు ఎంతో ఇష్టం.

హై స్కూలులో, కాలేజీలో చదివేటప్పుడు మా ఇంట్లో జరిగే కవి, రచయితా సమ్మేళనాలలో ఆయన ప్రక్కనే కూర్చుండేదానను. యువరచయితలను మెచ్చుకొనేవారు. అయ్యో, నేను వ్రాయగలనా అనుకొనేదానను. అమెరికాలో ఉద్యోగం, మిగతా బాధ్యతల వల్ల ఆలస్యంగా అయినా వ్రాయటం చేపట్టాను. అంతా భగవంతుని కృప.

బహుశా ఐ.ఐ.టీ., ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, చెన్నయి, ఘన సత్కారం చేసిన మొదటి తెలుగు కవి ఆయనేనేమో. ఎప్పుడూ తెల్లటి వస్త్రాలలో, స్వచ్ఛమైన చిరునవ్వుతో, కారుణ్య హృదయంతో వెలిగే మౌనివర్యులు మా తాతగారు.

ప్రశ్న 4. మీ నాన్నగారు బుజ్జాయి గారు ప్రసిద్ధ చిత్రకారులు. వారి నుంచి మీకు చిత్రకళ ఏమైనా అబ్బిందా? చిత్రలేఖనంలో మీకు ప్రవేశం/ప్రావీణ్యం ఉందా? మీ నాన్నగారు గీసిన చిత్రాలలో మీకేది బాగా నచ్చింది?

జవాబు: ప్రముఖ చిత్రకారులు శ్రీ దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి అనగా బుజ్జాయిగారి కుమార్తెగా జన్మించటము నా అదృష్టం.

బాల్యంలో కొన్ని చిత్రాలు, ప్రతికృతులు గీయటానికి ప్రయత్నించాను. మా తమ్ముడు కృష్ణశాస్త్రి నామధేయుడు చిత్రకారుడు. నాకు ఈ ప్రావీణ్యత అబ్బలేదనే అనాలి. ఇప్పుడు కూడా క్లాసస్ తీసుకోవాలనే తపన. అయినా వ్రాయటం నా మొదటి లవ్.

మా నాన్నగారు గీసిన తాతగారి చిత్రం, పెద్ద తాతగారి భోగరాజు పట్టాభి సీతారామయ్యగారి చిత్రం, మహాభారతం, పంచతంత్రం, సంయుక్త, బానిస పిల్ల, పిల్లలు-పువ్వులు పుస్తకాలకు వేసిన చిత్రాలు నాకు ఇష్టం. మా వూరు వచ్చి, నా కోసం గీసిన చిత్రాలు మరీ ఇష్టం.

ప్రశ్న 5. మీకు కవిత/కథ/నవల – వీటిలో ఏది వ్రాయడం సులువని అనుకుంటారు? ఎందువల్ల?

జవాబు: నా ఉద్దేశంలో వచన కవిత్వం వ్రాయటం కాలమానం ప్రకారం సులభమే. రెండు, మూడు రోజులలో ఒక సార్థక, అర్థవంతమయిన కవిత వ్రాయగలము.

అయితే గేయగాథలను అంటే ballads ను, మహాకావ్యాలను – epic poetry ను రచించటము అతి క్లిష్టం.

కథలు వ్రాయటం మధ్యస్థం. పాత్రలను సృష్టించిన తర్వాత వాని అభివృద్ధి, వికాసం, ఉన్నతి సంగ్రహంగా మలిచి, బిగువయిన కథావస్తువుతో, ఆకట్టుకొనే భాషతో, సందేశంతో కొన్ని రోజులలో, మళ్ళీ మళ్ళీ అలోచింపచేసే కథ వ్రాయగలము. కానీ ఇది వరకు చెప్పని, ఎవరూ ఇంతవరకూ చదవని కథను వ్రాయగలమా అనే ఛాలెంజ్ ప్రతీ కథారచయితా, రచయిత్రీ ఎదుర్కొంటారు.

ఒక మంచి నవల వ్రాయటానికి సంవత్సరాలు పట్టవచ్చు. విశ్వనాధవారి ‘వేయి పడగలు’, చండీదాస్ గారి ‘హిమజ్వాల’, రంగనాయకమ్మ గారి ‘బలి పీఠం’, Pearl Buck’s The Good Earth, Ayn Rand’s Fountainhead వంటి నవలలు, పాత్రలు, సంఘర్షణ, కథ, అచ్చెరువొందే భాషతో పాటు, జటిలమైన, సంకీర్ణమైన తత్త్వాలు, సాంఘిక సమస్యలు, సమాధానాలు, భవిష్యత్తుకి నిచ్చెనలు వంటి మరెన్నో విషయాలతో ఇమిడి ఉంటాయి. మామూలు నవలకూ, మంచి నవలకూ తేడా, మంచినీటికీ, అమృతానికీ ఉండే భిన్నత్వం. ఒకటి జీవితం, మరొకటి అమరత్వం.

ప్రశ్న 6. ఈ సంపుటి లోని కథలను, వాటి పేర్లను, మీ ఆత్మీయ పలుకులను పరిశీలిస్తుంటే మీలో భావుకత్వం, ఆధ్యాత్మికత ఎక్కువ అని తెలుస్తోంది. భావుకత్వం అంటే తాతగారి స్ఫూర్తి అనుకోవచ్చు. ఆధ్యాత్మికత ఎలా అలవడిందో వెల్లడిస్తారా?

జవాబు: నాకు, చెల్లికీ చిన్నప్పటి నుంచీ గుడికి వెళ్ళటము అలవాటు. మా కుటుంబంలో అన్ని మతాలను గౌరవించటము, భారతం, రామాయణం వంటివి చదవటము నేర్పారు పెద్దలు. అమ్మగారు సహస్రనామాల పారాయణం చేసేవారు. బామ్మగారు నిశ్చల, నిర్మల, గుప్త తత్త్వవేత్త.

శ్రీ సామవేదం గారి భాష్యాలపై నాకు ఆసక్తి, అభిలాష, భక్తి. ఆయనను మా ఊరిలో కలిసే భాగ్యం లభించింది. తర్వాత అమెరికాలో కొన్ని సమూహాలలో పారాయాణాలు, భాష్యాలు వినటము, ఆధ్యాత్మిక పరమైన శిక్షణతో, హిండూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికాలో కోర్సు వర్కుతో, భగవద్గీత పారాయణంతో ఆధ్యాత్మికపై మరింత ఆసక్తి కలిగిందన్నమాట.

ప్రశ్న 7. “ప్రతి కథలో చక్కని నిర్మాణ సౌష్టవముతో కథను చాలా సమర్థవంతంగా మలచారు. ఎత్తుగడ, నడక, ముగింపు బాగున్నాయి. పాత్రల్లో సంఘర్షణ, పాఠకుల మనసులను ఆకట్టుకుంటుంది. ఆలోచింపచేస్తుంది. ఆర్ద్రతలో ముంచుతుంది” అని తమ ముందుమాటలో డా. శ్రీదేవి శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా, కథకి సంబంధించి – వస్తువు, శిల్పం, శైలి లో మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారో చెప్తారా?

జవాబు: డా. శ్రీదేవి శ్రీకాంత్ గారి వ్యాఖ్యానం వారి లోతయిన తెలువితేటలకూ, ప్రఙ్ఞకూ చిహ్నం.

ఈ సంకలనంలో నేను పలు రకాల కథలు వ్రాశాను. సాంఘిక కథలలో పాత్రలకు, సందేశానికీ, పౌరాణికాలలో కొన్నింటికి భాషకూ, మరి కొన్నింటికి కథకూ, డిటెక్టివ్ కథలలో కథావస్తువుకూ ప్రాముఖ్యత ఇచ్చాను. ప్రతీ కథలో అన్నీ సమపాళ్ళల్లో కాకపోయినా ఏదో విధంగా బహిర్గతమవుతాయి.

నా కథలలో జ్యాగ్రఫీ, అంటే ప్రకృతీ, పరిసరాలు, పట్టణాలు, గ్రామాలు అగుపిస్తాయి. మన సుందర తెలుగుని ఇంకా అలంకరించి అత్యంత సుందరంగా మలచాలన్న తృష్ణ మాత్రం ఎక్కువే.

ప్రశ్న 8. ఈ పుస్తకంలోని సాంఘిక కథలు, చారిత్రిక కథలు, పౌరాణిక కథలు, డిటెక్టివ్ కథలకు – వేటికి వాటికి యుక్తమైన భాషను వాడారు. విభాగానికి ఒక రచనాశైలి పాటించడంలో మీ అనుభవమేమిటి? ఏ కథలలో సంభాషణలు, భాష అలవోకగా సాగాయి?

జవాబు: నా తెలుగు శైలి తెలుగు నవలతోనే ప్రారంభం అయ్యింది. వ్రాసింది ప్రేమ కథే అయినా, అమెరికా పాత్రల సంభాషణలలో ఆంగ్లం వాడినా, వృత్తాంతంలో, వర్ణనలలో, చిత్రీకరణలో తెలుగు గుప్పించాలన్న యత్నం తొలి నవల. వాచా ప్రుషావసు! వాచా వదామి మధుమత్!

ఆంధ్ర మహాభారతం, తాతగారి శ్రవ్యనాటికలు, వ్యాసాలు, కథలు, తెలుగు రచయితల నవలలు, సమకాలీనుల రచనలు స్ఫూర్తినిచ్చినవే. కలిసిన మహామహుల ప్రభావం కూడా. వాడిన భాష, కథ, పాత్రలు నా సొంతం పూర్తిగా. నాకు అన్ని విధాలలా నచ్చిన కథలు, బృందావన విహారిక, నీ పదములె చాలు, క్షమించు సజనీ, ప్రభాతంలో శర్వరం, ధరణీధార. సంభాషణలు డిటెక్టివ్ కథలలో, కాస్త హాస్యం ఉన్న కథలలో సులభంగా సాగాయి.

ప్రశ్న 9. మనసులోని భావాన్ని బట్టి బృందావనం యశోదకి మృగాలు, గుడ్లగూబలు, గబ్బిలాలు నిండిన అడవిలా అనిపిస్తే, చిత్రలేఖకు విద్యావనంలా తోస్తుంది. పాత్రల స్వరూప స్వభావాల మధ్య చక్కని పరిణతి నిండిన బృందావన విహారికకథకి ప్రేరణ ఏమిటి? ఈ కథ నేపథ్యం వివరిస్తారా?

జవాబు: నాకు సున్నితమైన ప్రేమ, ప్రణయం, రసానుభూతి ఇతివృత్తాలతో కథలు వ్రాయటమంటే ప్రీతి.

రాధాకృష్ణల పై ఒక స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నీక్‌తో కథ వ్రాయాలన్న ఉద్దేశం కలిగింది. రాధామాధవుల ప్రేమ మనుష్యభావాలకు, జీవుల ప్రణయావేశాలకు అతీతమైనది.

వారిద్దరూ బృందావనంలో కలవటంలో, వారి రాసలీలలలో పరమార్థం యేమిటి, అక్కడ జంతులోకం, వారి పక్షులూ నేటికి కూడా కృష్ణమూర్తిని ఎలాగ కొలుస్తాయి, పరమాత్ముని ప్రణయ డోలికలు యశోదమ్మను, రాధ చెలులను ఎలాగ ప్రేరేపించాయి అన్న ఆలోచనలతో వ్రాసిన కల్పిత కథ. “We are slowed down sound and light waves, a walking bundle of frequencies tuned into the cosmos. We are dressed up in sacred garments and we are instruments through which our souls play their music “, అంటారు ఆల్బెర్ట్ అయన్స్టైన్ ఈ సవరించిన ఉల్లేఖనలో.

సాధారణ ప్రేమ కథలు కోకొల్లలు. ప్రేమ కథలలో టైటానిక్ వంటి చలనచిత్ర గాథ, 13-15 యేళ్ళ వయసులో ప్రేమించిన రోమియో జూలియట్, ప్రేమ కోసం పెళ్ళినే త్యాగం చేసిన ప్రేమికులు ‘ఏక్ వివాహ్ ఐసా భీ’ సినిమా కథ మొదలైనవి ఒక కట్టింగ్ ఎడ్జ్ కథావస్తువు కలిగి ఉన్నవి. రాధాకృష్ణుల కథతో మొదలుపెట్టి మరిన్ని ప్రేమకథలు వ్రాయాలన్న ఒక అభిలాష.

ప్రశ్న 10. జలరాశిలోని జీవరాశిని కాపాడాలనుకునే నర్మద తీసుకున్న ఓ నిర్ణయాన్ని ఆమె కొడుకు తొలుత వ్యతిరేకించినా, చివర్లో తల్లి ఆంతర్యం గ్రహించి, ఆమె బాటలోనే నడుస్తాడు. అత్యంత ఆధునిక ఇతివృత్తంలో అల్లిన కథకి విస్మయ జగత్తులో జలజనేత్రఅని పేరెందుకు పెట్టారో వివరిస్తారా?

జవాబు: మన దేశాల చుట్టూ ఎగసెగసి పడుతున్న ఐదు మహాసముద్రాల పర్యావరణ వ్యవస్థ, వివిధ అద్భుత జీవరాశులు, వాతావరణ వర్షాది క్రమబద్ధత, మూలాధార వస్తువుల ఉత్పత్తి – ఆసక్తికరమైన విజ్ఞాన శాస్త్ర విషయాలు. మానవునికి, పంచభూతాలలో అతి ముఖ్యమైన జలానికి ఒక అవినాభావ సంబంధము.

జలము అంటే అమృతము, కోమలము, జీవితము, శివము, తీర్ధము అని మరెన్నో శుభకరార్థాలు కలవు. అటువంటి జలరాశిలో జీవరాశిని కాపాడటం మన బాధ్యత అన్న ధృఢవిశ్వాసంతో వ్రాసిన ఈ కథకు పెట్టిన శీర్షిక ‘విస్మయ జగత్తులో జలజనేత్ర’.

కథానాయకి వ్యాపార ప్రపంచం, ఆమె కాపాడుకోవాలి అనుకొన్న జలరాశీ, రెండూ విస్మయ జగత్తులే. ఆమె కన్నులలో కరుణామయ అశ్రువులు ప్రవహించి ఆమెను జలజనేత్రను చేశాయి. ఆమె గమ్యాన్ని తెలియపరిచాయి. “మనిషైతే, మనసుంటే, కనులు కరగాలిరా, కరిగి కరుణ కురియాలిరా, కురిసి జగతి నిండాలిరా.”

ప్రశ్న 11. ‘క్షమించు, సజనీ’ కథలోని మహీధర్ పాత్ర లక్షణాలు, విసిరే మాటల బాణాలు – సంపద వల్లో, హోదా వల్లో కలిగిన అభిజాత్యపు వ్యక్తుల ప్రవర్తనను ప్రదర్శిస్తుంది. ఈ పాత్ర కల్పిత వ్యక్తా, లేక నిజజీవితంలో మీరు తారసపడిన వ్యక్తా? ఈ కథ నేపథ్యం గురించి చెప్తారా?

జవాబు: ‘క్షమించు సజనీ’ అన్న శీర్షికలోనే ఇమిడి ఉంది, ఈ కథ వ్రాయటంలో నా దృక్పధం.

ఈ కాలంలో, భవిష్యత్తులో ఒక దేశపు యువత, ఆ దేశ ప్రజలకూ, సంఘానికీ, వ్యవస్థకూ కొండలపై వెలిగే దీపాలు. ఈ అంశంతో నా మొదటి నవలలో పాత్రల సృష్టి, చిత్రీకరణ, పయనం, ఉన్నతి, సంభాషణలు మలిచాను.

ప్రస్తుత కాలంలో యువతీ యువకులలో సమర్థతతో పాటు లక్ష్యం, కళలలో సాధన, మానవత్వం, ఔదార్యం వంటి గొప్ప గుణాలు చూస్తున్నాము. సజనీ వంటి ఆదర్శ యువతీయువకులను నేను, ఇక్కడి అన్.ఆర్.ఐ లు తరుచూ, ప్రతి పండగలో, సభలో కలుస్తాము. అచ్చెరువొందుతాము.

మహీధర్ లాంటి అభియోగము ఉన్నవ్యక్తులను నేను ప్రత్యక్షంగా కలవలేదు. కొన్ని చలన చిత్రాలలో, యువతీయువకులు పొగ తాగుతూ, బార్స్‌లో టైం గడుపుతూ, వేపింగ్, చేస్తూ, విద్య తప్ప మిగతా అన్నింటిపై ఆసక్తి చూపుతారు. ఈ అలవాట్లు పాశ్చాత్య ప్రభావం అని కుటుంబాలలో పెద్దలు బాధపడతారు. నిజానికి పాశ్చాత్య దేశాలలో ఎక్కువ శాతం మన ఎన్.ఆర్.ఐ. యువత బాధ్యతలను గుర్తించి, లక్ష్యాలతో పయనించేవారు! ఇది రచయిత్రిగా నాకు చాలా ముఖ్యాంశము!

ప్రశ్న 12. “కారెక్టర్ ఈజ్ ఎవ్రిథింగ్. అంతమందిలో నేరం చేసినవారిని పట్టటము పువ్వుల తోటలో ముల్లు కోసం వెతికినట్టే” అని అంటాడు అభినీత్. ఈ కథ నేపథ్యం వివరిస్తారా? ఓ డిటెక్టివ్‌కి అతని స్వభావాన్ని సూచించేలా ఆ పేరు పెట్టాలన్న ఆలోచన ఎలా తట్టింది?

జవాబు: ‘పచ్చ రెక్కలు’ నేను వ్రాసిన మొదటి డిటెక్టివ్ కథ. సంభాషణలు, కథా వస్తువు సాఫీగా సాగినా, నేను వ్రాస్తున్నప్పుడు తడబడిన మాట నిజం.

నా డిటెక్టివ్ ఆదర్శ యువకుడు కాబట్టి, అతని పేరు అభినీత్ అని ఒక రోజు అన్యూనమైన లైట్ బల్బ్ వెలిగింది.

కొన్ని కథలలో నేను చూడాలనుకున్న ప్రదేశాలు, నగరాలు వర్ణించి నా అభిలాష వ్యక్తపరుస్తాను. రాజస్థాన్ రాజుల కుటుంబంలో, వారి పరంపర నగల థెఫ్ట్ జరుగుతే, పెంపుడు చిలుక సహాయంతో నేరస్థురాలిని కనిపెడతాడు అభినీత్.

నేను ఆంగ్ల రచయిత్రి అగాథా  క్రిస్టీ అభిమానిని. ఆమె సృష్టించిన డిటెక్టివ్ హెర్క్యూల్ పాయిరో తన ‘లిట్టిల్ గ్రే సెల్స్’ తో నేరాలకు పరిష్కారం చూపెడతాడు. నా చిన్న ప్రయత్నంలో నా నాయకుడు “కారక్టర్ ఈజ్ ఎవ్రీథింగ్” అని, క్లూస్ తో కాక, మనుష్యుల నైజాలను బట్టి నేరస్థులను గుర్తిస్తాడు.

ప్రశ్న 13. సాధారణంగా రచయితలకు తాము రచించేవన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?

జవాబు: ప్రతీ రచయితకూ తాము వ్రాసిన ప్రతీ రచనా నచ్చుతుంది అని సూక్ష్మదృష్టితో మీరన్న మాట ముమ్మాటికీ నిజం.

నేను వ్రాసిన ప్రతి సాంఘిక కథ వెనకా నేను కలిసిన మనుష్యులు, నాకు తటస్థపడిన సంఘటనలూ, నిజాయితీ ఉన్నాయి. వాటిలో నాకు నచ్చిన కథ ‘ధరణీధార’. ఒక స్త్రీ తనకు చాలా భీతి కలిగించే కార్యాన్ని, మనస్థైర్యంతో ఎదుర్కొని, ఆ కార్యంలో విజయం సాధించి, తనను ఎగతాళి చేసిన మనుష్యుల ముందర హుందాగా, డిగ్నిటీతో నిలపడటం హర్షనీయం.

‘మచ్చలేని చందమామ’ నేను వ్రాసిన కథే అయినా, నాలుగేళ్ళ పిల్లవాని మనస్తత్త్వం నాకు కన్నీరు తెప్పించి, కథను గుర్తు చేసుకొన్న ప్రతీ సారీ గుండెను తాకుతుంది.

పౌరాణికాలలో ‘పదములె చాలు’ కథలో, శ్రీరాములవారి, సీతామ్మవారి అమూల్య పాదాలు స్పర్శించినట్లే భావన కలిగింది. ‘బృందావన విహారిక’ లో వనంలో ఒక జీవిగా రాధామాధవుల దర్శనభాగ్యం నాకు లభించినట్లే.

ప్రశ్న 14. ఈ సంపుటిలోని ఏదైనా కథ రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?

జవాబు: ఈ కథల సంపుటిలో నాకు అలవాటు లేని సాహిత్య ప్రక్రియలు, ఫేంటసీ అంటే భ్రమ జనితం, డిటెక్టివ్ అంటే అపరాధ పరిశోధనా కథలు వ్రాయటము ప్రయాసకరం అనిపించింది. సామాన్య జీవితం గడిపే రచయిత్రిగా, ఒక నేరాన్ని, పరిశోధనను,పరిష్కారాన్ని సృష్టించటం ఒక ఛాలెంజ్.

‘త్రిశక్తి’ అన్న ఫేంటసీ కథను ఇంకా మలుపులతో, అద్భుతాలతో వ్రాయవలసింది అన్న అలోచన, టైము దొరికితే కొన్ని కథలను ఇంకా పొడిగించాలేమో అన్న భావన వచ్చాయి.

ప్రశ్న 15. ‘సెలయేటిలో మొగ్గ సంపెంగలు’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఉంటే వాటిని పంచుకుంటారా? ఈ సంపుటికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?

జవాబు: ‘సెలయేటిలో మొగ్గ సంపెంగలు’ పుస్తక ప్రచురణకు పబ్లిషర్స్ శ్రీ వంశీ రామరాజుగారు, వారి సతీమణి శ్రీమతి సుధ తెన్నేటి గారు, శ్రీమతి జ్యోతి వలబోజు గారు ఎంతో తోడ్పడ్డారు.

ప్రియవాక్కులు వ్రాసిన శ్రీ సామవేదం గారికీ, శ్రీ వోలేటి గారికీ, డా. శ్రీదేవీ శ్రీకాంత్ గారికీ ప్రత్యేక ధన్యవాదాలు. చిత్రకారుడు వాసుగారు ముఖచిత్రం చక్కగా చిత్రించారు. కర్షక్ ఆర్ట్స్ ప్రింటర్స్ అతి త్వరగా, నీట్ గా ప్రింట్ చేశారు.

మా ఊరిలో ఈ సమ్మర్‌లో పుస్తకావిష్కరణ . చదివిన పాఠకులు సహృదయంతో ప్రశంసించారు. కొన్ని కథలు మనస్సుకి హత్తుకొన్నాయి అన్నారు.

ప్రశ్న 16. రచయిత్రిగా మీకు అతి ముఖ్యమైన అంశాలు ఏమిటి? మీ అభిమాన రచయితలు, రచయిత్రులు ఎవరు?

జవాబు: రచయిత్రిగా నాకు సత్యప్రియత, సరళత, మానవ నైజాలు, మనోతత్త్వాలు, తత్త్వశాస్త్రం, సందేశం ముఖ్యాంశాలు.

నాకు ప్రియమైన రచయితలు, కవులు – మొల్ల, బుచ్చిబాబు గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు, షేక్స్పియర్, భానుమతీ రామకృష్ణ, ఆంగ్ల రొమాంటిక్ ఈరా కవులు, లత, అఘతా క్రిస్టీ.

ప్రశ్న 17. సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలు ఏవైనా సిద్ధమవుతున్నాయా?

జవాబు: తెలుగు, ఆంగ్ల సాహిత్యాలు అంటే నాకు ఆసక్తి, అభిమానం. ఒక్కొక్కసారి మనము అనుకొన్న కథ రూపం దిద్దే ముందర, మరి కొన్ని యత్నాలు, ప్రణాళికలు ముందుకు దూసుకు వస్తాయి. ప్రస్తుతం సమూహ సంకలనం, నా స్వంత రచన అర్ వర్క్ ఇన్ ప్రాసెస్! మీ అందరి ఆశీస్సులతో మరింత వ్రాయాలి.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు లలిత రామ్ గారూ.

లలిత రామ్: ధన్యవాదాలు. మీ లోతయిన, అంతర్దృష్టి కల ప్రశ్నలకు కృతజ్ఞతలు.

***

సెలయేటిలో మొగ్గ సంపెంగలు (కథలు)
రచన: లలిత రామ్
ప్రచురణ: వంశీ ఆర్ట్ థియేటర్స్, హైదరాబాద్
పేజీలు: 150
వెల: ₹ 300
ప్రతులకు:
శ్రీ వంశీరామరాజు:
9849023852
అచ్చంగా తెలుగు బుక్స్:
8558899478 (వాట్సప్)
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా,
హైదరాబాద్. ఫోన్: 040-24652387

 

~

‘సెలయేటిలో మొగ్గ సంపెంగలు’ అనే కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/selayetilo-mogga-sampengalu-book-review-kss/

Exit mobile version