[‘సంతోషాల గాలిపటం’ అనే బాల కథాసంపుటి వెలువరించిన శ్రీమతి జొన్నలగడ్డ శ్యామల గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]


సంచిక టీమ్: నమస్కారం జొన్నలగడ్డ శ్యామల గారూ.
జొన్నలగడ్డ శ్యామల: నమస్కారం.
~
ప్రశ్న 1. మీ తొలి బాల కథాసంపుటి ‘సంతోషాల గాలిపటం’ వెలువరించినందుకు అభినందనలు. బాలల కథలు వ్రాయాలన్న ఆలోచన ఎప్పుడు, ఎలా కలిగింది?


ప్రశ్న 2: మీకు కవయిత్రిగా, కథా రచయిత్రిగా, కాలమిస్టుగా, వ్యాసకర్తగా, జర్నలిస్టుగా సుదీర్ఘ అనుభవం ఉంది. రచనలు చేయడం ఎప్పుడు, ఏ ప్రక్రియతో మొదలుపెట్టారు? మీ సాహితీ ప్రస్థానం గురించి వివరించండి?
జ: నేను ఎనిమిదో తరగతిలో ఉండగానే రెండు బాలల కథలు రాశాను. కానీ అవి ఏ పత్రికకూ పంపలేదు. ప్రచురణ గురించిన ఆలోచన కూడా అప్పటికి నాకు లేదు. అందువల్ల ఆ కథలు వెలుగు చూడలేదు. ఆ కాగితాలు కూడా దాచుకోలేదు. ఆ తర్వాత 1980 లో అనుకుంటా తొలిసారిగా ఓ హాస్యకథ రాశాను. ఆ కథకు ‘పాట తెచ్చిన ప్రమాదం’ అని పేరు పెట్టాను. కథ రాశానే కానీ నా పేరు మీద పంపడానికి సంకోచం.. కారణం కథలో విషయం కాస్తంత ఇబ్బందిగా అనిపించింది.. ఇప్పుడు ఆలోచిస్తే ‘అందులో ఏముందని అంత సంకోచపడడానికి’ అనిపిస్తుంది. మావారి పేరు మీద ‘హాస్యప్రభ’ మాస పత్రికకు పంపాను. ఆ పత్రిక వారు, కథ పేరు ‘చాదస్తపు మగడు’గా మార్చి ప్రచురించారు. నా పేరు మీద లేని నా తొలి కథ నేపథ్యం అది. ఇక 1986లో ‘ఉదయం’ వీక్లీలో ఉద్యోగంలో చేరాక నా రచనా వ్యాసంగం బాగా పుంజుకుంది. 1987లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో.. అప్పటి సంపాదకులు రాజేంద్ర గారు నా కథ ‘సుఖీభవ!’ ప్రచురించి ప్రోత్సహించారు. అదే సంవత్సరం ‘ఉదయం’ వీక్లీలో మరో కథ ‘ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో!’ ప్రచురితమైంది. అలా వృత్తిపరంగా విభిన్న వ్యాసాలు, కాలమ్స్ వగైరాలతో పాటు మనసులో ఏదైనా ఇతివృత్తం మెదలగానే కథలు రాసేదాన్ని. అయితే ఉద్యోగ బాధ్యతలు, ఇంటి బాధ్యతలు ఇబ్బడి ముబ్బడై నాకు తీరిక దొరికేదికాదు. ఆఫీసుకి ఇల్లు చాలా దూరం కావడంతో అధిక సమయం సిటీ బస్సుల్లో ప్రయాణానికే సరిపోయేది. ఆంధ్రప్రభ వీక్లీ, యువ మాస పత్రిక, ఆంధ్రజ్యోతి వీక్లీ, మయూరి, ఉదయం వీక్లీ, ఉదయం ఆదివారం అనుబంధం, ఆంధ్రప్రదేశ్ మేగజైన్, వార్త ఆదివారం అనుబంధం, వార్త మహిళల ప్రత్యేకం చెలి, భూమిక, తెలుగు జ్యోతి (న్యూజెర్సీ.. యుఎస్) వగైరాలలో నా రచనలు ప్రచురితమయ్యాయి. గతంలో ఆకాశవాణిలో కూడా కథానికలు, వివిధ అంశాలపై ప్రసంగాలు వినిపించాను. ఇక సంచికలో కాలమ్స్, కథలు, యాత్రా కథనాలు రాయడం మీకు తెలిసిందే. సత్యం న్యూస్.నెట్లో కవితలు రాశాను. ఇప్పటి వరకు దాదాపు 80 కథలు, అసంఖ్యాక వ్యాసాలు, కవర్ స్టోరీలు, కాలమ్స్, కవితలు, యాత్రాకథనాలు, బాలల కథలు, అనేక పుస్తక సమీక్షలు రాశాను. నాకు ఇష్టమైన వ్యాపకం చదవడం, రాయడమే.


ప్రశ్న 3: ఈ పుస్తకం శీర్షిక ‘సంతోషాల గాలిపటం’ అని పెట్టడం వెనుక ఆలోచన ఏమిటి? పుస్తకంలో ఆ పేరుతో కథ ఏదీ లేదు కదా?
జ: ఏ పుస్తకానికైనా ముందుగా ఆకట్టుకునేది ముఖచిత్రం. అందులోనూ బాలల కథల పుస్తకం అంటే మరింత ఆహ్లాదంగా ఉండాలి. అందుకే దానికి అనువుగా ‘సంతోషాల గాలిపటం’ అని పేరు పెట్టాను. మీరు ప్రశ్నలో ‘పుస్తకంలో అలాంటి కథ లేదు కదా’ అన్నారు. ఇందులో 26వ కథ ‘గాలిపటమా పద పద’. దాన్ని ఆధారం చేసుకునే, కొద్దిగా మార్చి ‘సంతోషాల గాలిపటం’ (ఈ పుస్తకం బాలలకు నచ్చేది, బాలలు మెచ్చేది కావాలన్న ఆకాంక్షతో) అన్నాను. నిజానికి పుస్తకం టైటిల్, పుస్తకంలోని కథల పేర్లలో ఒకటి కానక్కరలేదు. కానీ అలవాటుగా చాలా మంది దాన్ని అనుసరిస్తున్నారు. రచయిత తన ఆలోచన మేరకు పుస్తకం మొత్తానికి అన్వయించేలా అర్థవంతమైన, ఆకట్టుకునే పేరు పెట్టవచ్చు.


ప్రశ్న 4: “ఈ కథల్లో విలువలు నేర్పేవారు కూడా ఎక్కడో బయట నుండి వచ్చేవారు కాదు. అమ్మా నాన్న, మామయ్య, పెద్దనాన్న, క్లాసు టీచరు.. వీళ్ళే” అంటూ, “ఇల్లు బడి – ఇవి నేర్పని పాఠాలు సమాజం కూడా ఎప్పటికీ నేర్పలేదు” అని తమ ముందుమాటలో ఆచార్య మృణాళిని వ్యాఖ్యానించారు. పిల్లల కథల్లో తల్లిదండ్రులని, దగ్గరి బంధువులని, టీచర్లని పాత్రలుగా చేయాలన్న ఆలోచన వెనుక ప్రేరణ ఏమిటి?
జ: ఆచార్య మృణాళిని చెప్పింది చాలా వాస్తవం. బాలలకు తొలి గురువులు తల్లిదండ్రులే. ప్రత్యేకించి పాఠంలా బోధించకపోయినా వారిని పెంచే క్రమంలో ఎన్నో నేర్పుతారు. అలాగే ఇంట్లో పెద్దలు తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, మామయ్య, బాబాయిలు కూడా వారికి ఎన్నో విషయాలు చెపుతారు.. మంచి దారి చూపుతారు. అలాగే స్వయంగా తమ ప్రవర్తనతోనూ పిల్లలను ప్రభావితం చేస్తారు. ఆ తర్వాత బడి. బడిలో టీచర్లను పిల్లలు సునిశితంగా గమనిస్తారు. టీచర్ అంటే పిల్లలకు ఆరాధ్య దైవమే. చాలామంది పిల్లలు టీచర్ ఆట ఆడుతూ, తమ టీచర్ను అనుకరించడం అందరికీ తెలిసిందే. అలాగే బడిలో స్నేహితులు. బాల్య స్నేహం మధురాతి మధురం. అందువల్లే ఇందులోని కథల్లో పాత్రలు ఎక్కువగా కుటుంబ సభ్యులు, దగ్గర బంధువులు, టీచర్లు, స్నేహితులు అయ్యారు.
ప్రశ్న 5: ఈ కథల గురించి రాస్తూ, “పఠన ప్రవాహానికి ఆనకట్టలూ, అడ్డుకట్టలూ లేకుండా సాగిపోయింది రచనా శైలి” అని తమ ముందుమాటలో శ్రీ చొక్కాపు వెంకటరమణ వ్యాఖ్యానించారు. మీ ఉద్దేశంలో బాలసాహిత్యానికి వస్తువు, శైలిలో ఏది ప్రధానం? ఎందుకు?
జ: కథకు వస్తువు ఎంత ముఖ్యమో, శైలి కూడా అంతే ముఖ్యం. కథా వస్తువు బాగున్నా శైలి ఆకట్టుకోకపోతే చదవరు. ఫలితం శూన్యమవుతుంది. అదే విధంగా శైలి ఎంత బాగున్నా విషయం లేకపోతే కథ తేలిపోయి, పాఠకులను ఆకట్టుకోలేదు. కాబట్టి కథకు వస్తువు, శైలి రెండూ ప్రాణసమాలే.


ప్రశ్న 6: “పిల్లల కథ అనగానే రాజుల కథలు, జంతువుల కథలు, దెయ్యాలు రాక్షసుల కథలు, సాహసవీరుల కథలు, సాంఘిక కథలు, సైన్స్ కథలు మదిలో మెదులుతాయి. అయితే నేను ఎక్కువగా సాంఘిక కథలనే వ్రాశాను” అని మీ ముందుమాటలో వ్రాశారు. పిల్లల కోసం సాంఘిక కథలనే ఎంచుకోవడం వెనుక ఉన్న ఆలోచన గురించి చెబుతారా? పూర్తిగా జంతు పాత్రలతోనే నడిచిన ‘నువ్వా నేనా’, ‘తొండ గర్వభంగం’ కథలని మినహాయింపులుగా భావించవచ్చా?
జ: అవును.. బాలల కథలలోఎన్నో రకాలు ఉన్నా నేను ఎక్కువగా సాంఘిక కథలే రాశాను. కొన్ని కథలు జంతు పాత్రలతో రాశాను. అన్ని కథలూ ఒకే రకంగా రాయాలని ఏమీలేదు. అంతేకాదు ఈ రకంగా కూడా నేను రాయగలను అనే తృప్తికోసం కూడా వివిధ రకాలుగా రాయడం రచయితలకు పరిపాటే. దెయ్యాలు, రాక్షసులు, మాయలు, మంత్రాలు, రాజులు, యుద్ధాలు, మంత్రాంగాలు, సాహస వీరుల కథలు, జంతువులు, పక్షులతో కూడిన కథలు, ఏనాటి నుంచో ఉన్నాయి. అవన్నీ బాలలనే కాదు పెద్దలను కూడా అలరిస్తాయి. నీతిని బోధిస్తాయి. అయితే బాలల కథలు ప్రస్తుత తరానికి.. వారి నిత్య జీవితానికి, ప్రస్తుత సమాజ పోకడలకు దగ్గరగా ఉంటే వారికి ఎక్కువ తోడ్పడతాయని నేననుకుంటాను.
ప్రశ్న 7: పెద్దవాళ్ళ కోసం వ్రాసే కథలలకీ, పిల్లల కోసం వ్రాసే కథలకీ మధ్య ఉండే తేడాలేమిటి? పిల్లల కోసం వ్రాసే కథల్లో తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలేమిటని మీరు భావిస్తున్నారు?
జ: పెద్దవాళ్ళ కోసం రాసే కథలకు, పిల్లల కోసం రాసే కథలకు తేడా పెద్ద, చిన్న అనే దాంట్లోనే ఉంది. పెద్దలకు రాసే కథల్లో కథా వస్తువులు, పాత్ర పోషణ, వర్ణనలు, సంభాషణలు అన్నీ వేరు. విశ్వంలోని ఏ విషయమైనా, విస్తారంగా చెప్పవచ్చు. నవరసాలకు.. (శృంగారం, వీరం, కరుణ, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం) అక్కడ స్థానం ఉంది. పిల్లల కథల్లో అలా కాదు. శృంగారం, భయానకం, బీభత్సం, రౌద్రం అంతగా నప్పవు. అయితే భయానకం కొంతవరకు దెయ్యాలు, రాక్షసులు, మాంత్రికుల కథల్లో మనకు పరిచయమే. భయం కలిగినా అదో రకం థ్రిల్ అని పిల్ల, పెద్ద ఫీలవుతారు. పిల్లల కథల్లో హత్యలు, ఆత్మహత్యలు, రక్తపాతాలు లేకపోవడమే మంచిది. పిల్లల కథలు విషాదాంతాలు అసలే కాకూడదు.. విషయం తీవ్రమైనదైనా సరే. వారిలో నైరాశ్యానికి దారి తీసే ప్రతికూల (నెగిటివ్) ధోరణి ఉండే కథనం అసలే ఉండకూడదు. పిల్లల కథల్లో మూఢనమ్మకాలకు తావు ఉండకూడదు. పిల్లల కథల్లో కథనం వారి స్థాయిలో ఉండాలి. రచయిత వారి స్థాయికి దిగి రాయాలి. బాలల కథ పదాడంబరం లేకుండా ఆహ్లాదంగా ఉండాలి. అలా అని కొత్త పదాల పరిచయం అసలే ఉండకూడదని కాదు. మరీ దీర్ఘ వాక్యాలు, అతి వర్ణనలు లేకుండా తేలికగా, హాయిగా చదువుకునేలా ఉండాలి. కథ చివర నీతి అంటూ ముక్తాయింపుగా ప్రత్యేకం చెప్పక్కరలేదు. కథ చదివితే అది అర్థమైపోవాలి. బాలల కథలు వారి సమగ్ర వ్యక్తిత్వానికి దోహదం చేసేవిగా ఉంటే మంచిది. సైన్స్, టెక్నాలజీల ప్రాముఖ్యత విశేషంగా పెరుగుతున్న ఈ కాలంలో తగిన విధంగా బాల సాహిత్యంలో వాటిని పొందుపరచడం కూడా మంచిదే.
ప్రశ్న 8: ఈ పుస్తకంలోని ప్రతీ కథ దాదాపు రెండు – మూడు పేజీలలో ముగిసింది. ఇంత తక్కువ నిడివిలో, brisk గా, to the point అన్నట్టు వ్రాయడం వెనుక జర్నలిస్టుగా మీ సుదీర్ఘ అనుభవం అక్కరకొచ్చిందని అనిపిస్తోంది? మీరేమంటారు?
జ: నిజమే.. ఈ కథల నిడివి చిన్నదే. ఆయా పత్రికలలో పిల్లల కథలకు కేటాయించే చోటును బట్టి రచయిత కథ రాయాల్సి ఉంటుంది. అదే నాకూ వర్తిస్తుంది. అది ఒక కారణం అయితే పిల్లల కథలు చిన్నవిగా ఉంటేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అవసరం లేకపోయినా కథను సాగదీయడం నాకు నచ్చదు. అంతేగాక మీరన్నట్లు జర్నలిస్టును కాబట్టి కూడా నాకు ఆ విధానం అలవడి ఉండవచ్చు.
ప్రశ్న9: చాలా కథల్లో పిల్లల పేర్లు వాళ్ళ స్వభావానికి తగ్గట్టుగా పెట్టినట్టు తెలుస్తోంది. ఇది యాదృచ్ఛికం కాదని, ఇతివృత్తం నిర్ణయించుకున్నప్పుడే ఆయా పాత్రలకు తగ్గ పేర్లు ఎంచుకున్నారని అనుకుంటున్నాము. దీని గురించి వివరిస్తారా?
జ: కథల్లో పిల్లల పాత్రల పేర్ల విషయంలో మీ అభిప్రాయం సరైనదే. యాదృచ్ఛికం కాదు. కథా వస్తువును బట్టి ఆ పాత్రల స్వభావానికి సరిపోయేలా లేదా ఆ ప్రత్యేక సందర్భాలకు తగ్గట్టుగా నేను కావాలని ఆలోచించి పెట్టినవే.


ప్రశ్న 10: ఈ పుస్తకంలో రెండు మూడు కథల్లో పిల్లలకి కల వచ్చి, ఆ కలలో వారికి మేలు చేసేది ఏదో కనబడడమో లేక ప్రవర్తనని మార్చుకోమని చెప్పేదో కనబడుతుంది. ఈ కథలు చదువుతుంటే కలలకి సంబంధించి మీరు సంచికలో వ్రాసిన ‘సాహిత్యంలో స్వప్న సృజన!’ ఆర్టికల్ స్ఫురించింది. కథల్లో కలలపై మీ అభిప్రాయం ఏమిటి?
జ: కథల్లో ‘కల’ అనేది ఒక టెక్నిక్. ఇది ఏనాటినుంచో మన సాహిత్యంలో ఉన్నదే. అదే విషయం గతంలో ‘సాహిత్యంలో స్వప్న సృజన’ వ్యాసంలో సోదాహరణంగా వివరించడం మీకు తెలిసిందే. అదే ఈ సంపుటిలోని రెండు కథల్లో వాడడం జరిగింది.
ప్రశ్న11: చాలా కథల్లో ప్రత్యక్షంగా, కొన్ని కథల్లో అంతర్లీనంగా పర్యావరణంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. పర్యావరణ పరిరక్షణలలో పిల్లల పాత్ర గురించి వివరిస్తారా?
జ: నేడు పర్యావరణం ప్రమాదంలో ఉండడం.. ఫలితంగా మానవాళితో బాటు జీవజాలమంతా ఇక్కట్ల పాలవుతుండడం తెలిసిందే. పర్యావరణ పరిరక్షణ పట్ల పిల్లల్లో అవగాహన కలిగి, వారి వంతు పాత్ర వారు నిర్వహిస్తే భవిష్యత్తుకు భరోసా ఏర్పడుతుంది. అందుకే కొన్ని కథల్లో బాలలకు పర్యావరణ గురించిన చైతన్యం కలిగించే ప్రయత్నం చేశాను.
ప్రశ్న12. సాధారణంగా రచయితలకి తాము రాసే అన్ని రచనలు నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీకు బాగా నచ్చింది? ఎందుకు?
జ: మీరన్నట్లు రచయితకు తన రచనలన్నీ ఇష్టంగా ఉంటాయి. ఎందుకంటే తనకు నచ్చినవే కదా రాసేది. నేను కూడా అందుకు మినహాయింపు కాదు. అయితే. ‘నాటకం వేస్తున్నాం రారండి!’ కథావస్తువు వైవిధ్యమైంది. అంతే కాదు, సూక్ష్మంగా చూస్తే పెద్దలకు కూడా ఈ కథ ద్వారా ‘వచ్చిన అవకాశాలు పెద్ద, చిన్న అని చూడక అందుకుని రాణించాలి’ అనే సందేశం అందుతుంది. అందువల్ల నాకు ఈ కథ ప్రత్యేక. తృప్తినిచ్చింది.
ప్రశ్న13. ఈ సంపుటిలోని ఏ కథైనా రాయడం కష్టమనిపించిందా? ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?
జ: ‘ఉప్పనైనా సముద్రం గొప్పదే!’ కథ రాయాలనుకున్నప్పుడు మంచి నీరు, ఉప్పునీరు గురించి చర్చ.. ఎలా రాయాలని ఎక్కువ ఆలోచించా. పిల్లలు తల్లిదండ్రులతో బీచ్కు వెళ్ళినట్లు, వారి వద్ద ఉన్న వాటర్ బాటిల్ లోని మంచినీళ్ళు, సముద్రపు నీటిని హేళన చేసినట్లు మొదలుపెట్టి.. తర్వాత పిల్లవాడి ప్రశ్న.. తండ్రి వివరణ.. అలా అల్లేశాను. ఈ కథ విభిన్నంగానే రాశానని అనుకుంటున్నా. ఇక రాసేసిన కథ గురించి.. ఇలా రాసి ఉంటే.. వంటి ఆలోచన చేయను. దానికి బదులు కొత్త ఆలోచనతో మరో కొత్త కథ రాసుకోవచ్చు.


ప్రశ్న14. మీరు వ్రాసిన 40కి పైగా పిల్లల కథలలోంచి 30 కథలతో రూపొందించిన ఈ పుస్తకం ప్రచురణలో ఏవైనా ప్రత్యేక అనుభవాలున్నాయా? ఉంటే వివరించండి. పుస్తకం కవర్ పేజీ, లోపలి బొమ్మలు చాలా బావున్నాయి. పుస్తకం నాణ్యత బావుంది. బుక్ డిజైనింగ్లో టీమ్ విఎంఆర్జి పాత్ర ఏమిటి?
జ: సొంతంగా పుస్తక ప్రచురణ తొలిసారి కాబట్టి ప్రతి అంశం ఒక అనుభవమే. ప్రచురణ విషయంలో ఆత్మీయ స్నేహితుల విలువైన సలహాలు కూడా నాకెంతో ఉపకరించాయి. పుస్తకం చూడగానే పిల్లలను ఆకర్షించేవి బొమ్మలే కాబట్టి వాటికి ప్రాముఖ్యత ఇవ్వాలనుకున్నాను. అందుకే సీనియర్ ఆర్టిస్ట్, కార్టూనిస్ట్ రాజు ఈపూరి గారిని సంప్రదించడం జరిగింది. రాజుగారు గతంలో అంటే ఉదయంలో పనిచేసే రోజుల్లో మా కొలీగ్. ఆ స్నేహం వల్ల మార్గం మరింత సుగమం అయింది. ఫలితంగా ముచ్చటైన బొమ్మలు నా కథలకు ప్రత్యేక ముస్తాబుగా నిలిచాయి. కథల టైటిల్స్ కూడా రాజుగారు రాసినవే. ఆ తర్వాత ఏ కథలు సంపుటిలో ఉంచాలి అన్నది మరో ఆలోచన. అన్నీ ఉండాలనే ఆశ. ముందు 32 కథలు అనుకున్నాను. అయితే తయారీలో అవి 30 కి కుదించవలసి వచ్చింది. పుస్తకాన్ని అందంగా డిజైన్ చేయడానికి విశేషానుభవం గల విఎంఆర్ జి ఇంటర్నేషనల్.. వెలుగూరి సురేష్ నా పట్ల ఆత్మీయంగా చూపిన ప్రత్యేక శ్రద్ధకు ఎన్ని కృతఙ్ఞతలు చెప్పినా తక్కువే.
ప్రశ్న15. రచయిత్రిగా మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలేమయినా సిద్ధమవుతున్నాయా?
జ: భవిష్యత్ ప్రణాళికలు అంటూ ప్రత్యేకంగా ఏమీ చెప్పలేను. ఐడియా ప్లస్ మూడ్ రెండూ కుదిరి, తగిన సమయం దొరికితే, ఏం రాయాలి అనిపిస్తే అది రాసుకుంటూ పోవడమే. అది పిల్లల కథ లేక పెద్దల కథ, కవిత, వ్యాసం ఏదైనా కావచ్చు. ప్రౌఢ సాహిత్య పరంగా ఇప్పటివరకు రాసిన కథలు, కాలమ్స్ పుస్తకాలుగా చూసుకోవాలని, అవి అందరి మన్ననలు పొందాలని కోరిక మాత్రం ఉంది. కానీ అది ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ, కాలం కలిసి వస్తే.. మనసులో ఓ ఆశాదీపం వెలుగుతూనే ఉంటుంది.
~
సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు జొన్నలగడ్డ శ్యామల గారు.
జొన్నలగడ్డ శ్యామల: సంచిక టీమ్కి నా ధన్యవాదాలు.
***


రచన: జొన్నలగడ్డ శ్యామల
పేజీలు: 96
వెల: ₹ 150/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
~
‘సంతోషాల గాలిపటం’ బాల కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/santoshaala-gaalipatam-book-review-kss/