Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కథా రచయిత, స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్ శ్రీ వేమూరి సత్యనారాయణ ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘ఎనభైలో ఇరవై’ అనే కథాసంపుటి వెలువరించిన శ్రీ వేమూరి సత్యనారాయణ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం వేమూరి సత్యనారాయణ గారూ.

వేమూరి సత్యనారాయణ: నమస్కారం.

~

ప్రశ్న 1. మీరు ఇటీవల ఎనభైలో ఇరవైఅనే కథాసంపుటి ప్రచురించినందుకు అభినందనలు. మీ 80వ జన్మదినం సందర్భంగా వెలువరించిన 20 కథల సంపుటి కాబట్టి ఈ పుస్తకానికి ఎనభైలో ఇరవైఅనే పేరు పెట్టారా? లేక ఏదైనా ఇతర కారణం ఉందా?

జ: వేరే కారణం లేదు. అసలీ కథా సంపుటి ఆలోచన రేకెత్తించింది స్నేహితులు శాతవాహన. “డిసెంబర్ 1 (2024) ఎనభైయవ పుట్టినరోజు కదా, మీ కథలతో ఒక సంపుటి ప్రచురించవచ్చు కదా, ఆ సందర్భంగా” అంటూ సూచించినా నేను పెద్దగా ఉత్సాహం చూపించలేదు. ఆ మాట విన్న నా భార్య శ్రీలక్ష్మి కూడా ఆ ఆలోచన బలపరచడంతో ఒప్పుకుని మొదలుపెట్టాను. డి.టి.పి చెయ్యడం, ప్రూఫులు దిద్దటం ఈ పనులు జరుగుతుండగా పుస్తకం పేరు ఏమీ అనుకోలేదు. అయితే ఆర్టిస్ట్ అన్వర్ కవర్ డిజైన్ చెయ్యడం కోసం పేరేమనుకున్నారూ అని అడిగినప్పుడు మాత్రమే పేరు గురించి ఆలోచించడం జరిగింది. అన్వర్‌ని సలహా అడిగితే ‘వేమూరి సత్యానారాయణ కథలు’ అని సూచించాడు. ‘కథల సత్యం’ ఎలా ఉంటుందీ అని అడిగితే నచ్చలేదన్నట్టుగా మౌనం వహించాను. పుస్తకం తెద్దామన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి – సీనియర్ రచయిత, నాకు చిరకాలంగా మంచి స్నేహితుడిగా ఉన్న ‘వసుంధర’ (జొన్నలగడ్డ రాజగోపాలరావు) గారి సలహాలు తీసుకున్నాను. ఆయన దగ్గర నుంచి వచ్చిందే ఈ ఆలోచన. “వయసు, కథల సంఖ్యా కలిపి ‘ఎనభైలో పదిహేడు’ అంటే ఎలా ఉంటుందీ?” అన్నారు. అప్పటికీ 17 కథలే ఉన్నాయి. తర్వాత కథల సంఖ్య 20కి మారి ఇలా ‘ఎనభైలో ఇరవై’ గా మారింది. పుస్తకం వచ్చే లోపు, పేరు ప్రకటించగానే, “ఎనభై వచ్చినా ఇరవైల వ్యక్తిగానే ఉంటున్న మీకు తగ్గ పేరు” అని వ్యాఖ్యానించారు కొందరు. నా ఉద్దేశంలో ఇది వయసుకీ, కథల సంఖ్యకీ సంబంధించింది మాత్రమే.

ప్రశ్న 2: మీరు కథా రచయితగా, నాటక రచయితగా, సంపాదకులుగా, సినీ కథకుడిగా, స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్ గా దాదాపు 50 ఏళ్ళ నుండి కృషి చేస్తున్నారు. మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? మొదటగా ఏ ప్రకియతో సాహిత్య వ్యాసంగం మొదలుపెట్టారు? ఎప్పుడు? మీ కథా రచన గురించి వివరిస్తారా?

జ: సాహితీ ప్రస్థానంగా చెప్పుకో తగ్గ స్థాయి కాదు ఈ రంగంలో నా ప్రయాణం. ఎప్పుడూ గొప్ప రచయిత అవాలన్న కోరిక ఉన్న మనిషిని కాదు. డిగ్రీ చదువుతున్న రోజుల్లో పత్రికలు బాగా చదివేవాడిని. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వారపత్రికలతో పాటు యువ, భారతి మాస పత్రికలు వస్తుండేవి. ఆ తర్వాత వచ్చిన ‘జ్యోతి’ మాసపత్రిక నాకెంతగానో నచ్చింది. ముళ్ళపూడి వెంకటరమణ, బాపు, నండూరి రామారావు గారు, రావికొండలరావు, పి.వి.కె.రంగారావు, ‘ఎడిటోరియల్’ బోర్డ్‌గా ఉండి వి. రాఘవయ్య గారి ఆధ్వర్యంలో నడిచేది. తర్వాత, తర్వాత నా ప్రయాణంలో రచయితగా గాని, సంపాదకుడిగా గాని నా మీద ఆ పత్రిక ప్రభావం చాలా ఉంది. డిగ్రీలో ఉండగానే ఆంధ్రపత్రికలో ‘హమేషా తమాషా’ అనే శీర్షికకు ఒక రచన పంపితే ప్రచురించారు. అయిదు రూపాయల పారితోషికం కూడా వచ్చింది. నాకు బంధువు, మంచి మిత్ర్రుడు అయిన మండవ గోపాలకృష్ణతో నా స్నేహానికి గుర్తుగా ‘సత్యగోపాల్’ అన్న పెన్ నేమ్‍తో రాశానది. దాని పేరు గానీ, దాని లోని విషయంగాని ఏవీ గుర్తులేవు ఇప్పుడు. ఇది ప్రచురితమైన నా తొలి రచన.

తర్వాత ఏమి రాయలేదు. నాతో పాటు సాహిత్యం, ఇష్టంగా చదివే అప్పటి రూమ్‍మేట్ కంకిపాటి గంగరాజు, మండవ గోపాలకృష్ణ కబుర్లలో పత్రిక పెట్టే ఆలోచనల కలలు కనేవాళ్ళం. అవి అలా కలలుగానే మిగిలిపోయాయి.

తర్వాత జీవిత గమ్యంలో కొన్నాళ్ళు హైదరాబాదులో, ఒక తాత్కాలిక ఉద్యోగం. అప్పటికే మా ఊరివాళ్ళు వేమూరి నాగేశ్వరరావు, వేమూరి బలరామ్ హైదారాబాద్‌లో ఉద్యోగాల్లో వున్నారు. ఒక ఊరివాళ్ళం కావటంతో తరచూ కలిసేవాళ్ళం. అలా ఒకసారి రవీంద్రభారతిలో ఒక హాస్యనాటిక చూసినప్పుడు స్ఫూర్తితో ‘ఏడుపే మిగిలింది’ పేరుతో ఒక హాస్య నాటిక రాశాను. అవకాశాలు లభించటంతో హైదారాబాద్ లోనే మూడు చోట్ల వినాయకచవితి పందిళ్ళలో ఆ నాటికను విజయవంతంగా ప్రదర్శించాము నేనూ, బలరామ్, నాగేశ్వరరావుతో పాటు మరో ఇద్దరు మిత్రులు నటులుగా. ఆ ఉత్సాహంతో తరువాత సంవత్సరం నేను ‘త్యాగమూర్తులు’ అనే నాటకం రాయగా మా ఊర్లో ప్రదర్శించాం. ఆ నాటకం స్క్రిప్టు ఆనవాళ్ళు కూడా లేవు ఇప్పుడు.

ఆ తర్వాత రచనలకు దూరమే. అయితే బలరామ్ స్వాతి పత్రిక ప్రారంభిస్తూ, ఆ పత్రిక సంపాదక శాఖను నిర్వహించుటకు ఆహ్వానించటంతో జీవితం ఒక రకంగా సాహిత్యం వైపు మలుపు తిరిగింది. అప్పుడు స్వాతి పత్రికకు గౌరవ సంపాదకుడిగా ఉన్న శీలా వీర్రాజుగారు సంపాదకుడిగా నాకు గురువు. మూడేళ్ళు ఆ పత్రికలో పని చేశాక 1973లో జ్యోతి మాసపత్రికలో ‘సహా సంపాదకుడిగా’ అవకాశం రావటంతో హైదరాబాదు నుంచి మద్రాసుకి మకాం మార్చాను. స్వాతి సంపాదకుడిగా ఉండగా ఆ పత్రికలో ఎప్పుడూ నేను కథలు రాయలేదు, కొన్ని వ్యాసాలు, ఒక మినీ కథ తప్ప.

అయితే అదే సమయంలో చలసాని ప్రసాదరావు గారి ప్రోత్సాహంతో ఆయన సంపాదకుడిగా ఉన్న ‘వసుధ’ మాసపత్రికలో ‘పారిజాతం’ అనే కథ రాశాను. కథగా ప్రచురితమైన నా తొలి రచన అది. అదే కాక, నేను మరో నలుగురు మిత్రులు కలిసి ఒక గొలుసు కథ రాయటం జరిగింది. అది ఆంధ్రపత్రిక వారపత్రికలో ప్రచురితమైంది. వారానికో భాగం చప్పున. ఎర్రంశెట్టి శాయి, చందు సోంబాబు, డి. ప్రభాకర్, తడిమళ్ళ రామకృష్ణ, నేను కలిసి రాసిన ఆ కథ పేరు ‘మై డియర్ ప్యూన్’. దానిని ఈ సంపుటిలో చేర్చలేదు.

జ్యోతి మాసపత్రికలో పని చేస్తుండగా, అడపాదడపా ఉత్సాహపడి కొన్ని కథలు రాశాను, అదే పత్రికలో. దీన్తో పాటు నా ఉద్యోగంలో భాగంగా సినిమా విశేషాలు, కొన్ని ఇంటర్వూలు, ఆర్టికల్స్ రాసేవాడిని. అదే సమయంలో ‘చన్నీళ్ళకు వేన్నీళ్ళు’గా సంపాదన కోసం కొన్ని వెండితెర నవలలు రాశాను ‘లక్ష్మీపతి’ పేరుతో. మా ఆవిడ పేరు శ్రీలక్ష్మి అని చెప్పాను కదా!

1982లో సాహిత్యం నుంచి, సినిమాల వైపు మలుపు తీసుకుంది నా జీవితం. ఎమ్.ఆర్. ప్రసాదరావు గారు నిర్మించిన ‘మంచు పల్లకీ’ సినిమాకి సమర్పకుడిగా, నిర్మాణ సారథిగా నా సినీ జీవితం ప్రారంభమైంది. ఆ సినిమాకు నేను ఎడిటర్‌గా వుండగా రచయితగా పరిచయమైన యువకుడు ‘వంశీ’ని దర్శకుడిగా పరిచయం చెయ్యడం జరిగింది. దర్శకుడుగా మారినా కూడా రచనలు వదిలిపెట్టక ‘మా పసలపూడి కథలు’తో ప్రఖ్యాతి గడించిన వంశీ తర్వాత తీసిన చాలా సినిమాలకు నేను ‘స్క్రిప్ట్ కో-ఆర్టినేటర్’గా పని చేశాను. అతని దర్శకత్వంలోనే స్రవంతి మూవీస్ నిర్మించిన ‘మహర్షి’ సినిమా నేను కథ సమకూర్చిన ఏకైక సినిమా.

జ్యోతి పత్రిక నుంచి సినిమాలకు మారాక, కథల పరంగా నా రచనలకు పుల్‌స్టాప్ పడింది. దాదాపు సెమీ విశ్రాంత జీవితం ప్రారంభించాక, 2015 నుంచి మళ్ళీ కథలు రాయటం మొదలు పెట్టాను. రాస్తున్నాను.

ఈ సంపుటి ప్రచురణ నాటికి నేను రాసిన కథలన్నీ ఈ ఇరవై మాత్రమే!

ప్రశ్న 3: తొలి రోజుల్లో నాటకాలు రాసిన మీరు, తర్వాత వాటిని కొనసాగించకపోవడానికి కారణం ఏమిటి?

జ: ముందు చెప్పినట్టు ఏదీ కోరిక పడి మొదలు పెట్టిన ప్రక్రియ కాదు. అప్పటికి ఆ నాటిక రాయటం, ఆ వెంటనే నాటకం రాయటం ఒక ఉత్సాహపు ప్రయత్నం. అవి రెండూ నాటిక, నాటకం నిర్వచనాలకు నిలుస్తాయా లేదో కూడా తెలియదు. It just happened.

ప్రశ్న 4: 1971 నాటి ‘పారిజాతం’ అనే కథ నుండి 2024లో రాసిన ‘చలపతి చక్రభ్రమణం’ వరకూ, మీ సుదీర్ఘ సాహితీ ప్రస్థానంలో సమాజంలోనూ, సాహిత్య రంగంలోనూ ఏ మార్పులను మీరు గుర్తించారు?

జ: సమాజపరంగా చాలా చైతన్యం గమనించాను. పాత సాంప్రదాయలు అనీ, సంస్కృతి అనీ గుంజలకు కట్టేసి ఉంచిన విలువలలో లోపాలు కూడా ఉన్నాయనీ, అవి న్యాయం కాదనీ గొంతెత్తి అడగగలిగిన వ్యక్తులను కూడా రూపొందించింది సమాజం. రచనల పరంగా కూడా స్త్రీల పరంగా, మతం కారణంగా, కులం కారణంగా సమన్యాయం పొందని వాళ్ళు వాళ్ళ సమస్యలు వివరించగలుగుతున్నారు. నా మటుకు నాకు నా చుట్టూ ఉన్నదే అయినా, ఉన్నవాళ్ళే అయినా అంతకు ముందు తెలియని వాళ్ళ జీవితాలు తెలుస్తున్నాయి. ఆలోచింప జేస్తున్నాయి.

ప్రశ్న 5: పలు సమకాలీన సమస్యలను ఇతివృత్తాలుగా తీసుకుని కథలుగా మలిచారు. వీటి వెనుక మీరు సమాజంలోని సమస్యలని, మనుషులని అత్యంత దగ్గరగా పరిశీలించినట్లు తోస్తుంది. ఏదైనా అంశాన్ని కథగా మలచాలనుకున్నప్పుడు మీ పద్ధతి ఎలా ఉంటుంది?

జ: నాకు తెలిసి ప్రతి మనిషిలోనూ ఈ పరిశీలన అనేది ఉంటుంది. గమనింపూ ఉంటుంది. కథో, కవితో వ్యాసమో రాసే ఇంట్రెస్ట్, ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు వాటికి అక్షర రూపం ఇస్తారు. కథ ఒక సంఘటన గురించి కావచ్చు, సమస్య గురించి కావచ్చు. పాఠకుడికి కథగా అందిచాలనుకున్న తర్వాత ఏ రచయితకయినా తర్వాత జరిగేది ఆలోచనల మథనమే. ఆ ఆలోచనలే వెంటపడి ఎలా రాయాలో మార్గాలు చూపిస్తాయి.

ఈ విషయంగా ఈ సంపుటిలోని కథలన్నిటి వెనకా ‘కథ ఇలా’ అన్న మకుటంతో వాటి రూపకల్పన జరిగిందో వివరించడానికి ప్రయత్నించాను. కథ రాసే ప్రక్రియ పరంగా ఒక కథ గురించి ప్రస్తావించాలి. ఇందులో ‘లవ్‌ లీ’ అనే కథ అది. ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితం ఈ కథకి మూలం అయిన, ‘ప్రేమించాడో, ప్రేమించాననుకున్నాడో గాని సుబ్బారావు ప్రేమించన్నాడు’ అంటూ ఒక సుబ్బారావు వ్యక్తిత్వం ప్రధానంగా ఆలోచించిన కథ. కాలాలు దాటి ఇటీవల రాయటానికి వచ్చేసరికి ఇప్పటి సంధ్య కథలోకి వచ్చింది. రాసే క్రమంలో ‘పెంకుటింటి’ ప్రస్తావన అప్పటికప్పుడు ప్రవేశించి కేవలం సుబ్బారావు కథ కాక సుబ్బారావు సంధ్యల కథగా మార్చింది. ఈ మార్పు కథకు మరింత న్యాయం చేసిందా అన్నది పాఠకులు నిర్ణయించాలి.

ప్రశ్న 6: తొలి కథ నాటి నేటి నుంచి ఇటీవలి వాట్సప్ గ్రూపుల కథల వరకూ, ఆడియో కథల వరకూ – పాఠకులను చదివించేందుకు – మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు? పాఠకుల అభిరుచి, పఠనాసక్తులలో ఏయే మార్పులు గమనించారు? సాంకేతిక అంశాలలో ఎప్పటికప్పుడు ఎలా అప్‍డేట్ అయ్యారు?

జ: పాఠకుల్ని చదివించేందుకు అంటూ ప్రత్యేకంగా నన్ను నేనీమీ మార్చుకోలేదు. ఎప్పుడూ కూడా చెప్పదలచిన విషయాన్ని ఆసక్తిపరంగా చెప్పటమే ప్రధానమే అని నమ్మి రచనలు చేశాను. సాంకేతికంగా ‘update’ అవడం విషయంలో, చాలా వరకూ ‘update’ అవుతునే ఉన్నాను. సాంకేతికంగా ఇంకా చాలా adopt చేసుకోలేకపోతున్నాను కూడా. ఉదాహరణకు ఇప్పుడు ఈ మాటలు పెన్నుతో కాగితంపైన రాస్తున్నాను. కంప్యూటర్ మీదో, laptop మీదో టైపు చెయ్యటం అంతగా అలవాటు కాలేదు. అలా సాంకేతికతను improve చేసుకొనే ఆలోచనలు ఉన్నాయి. ప్రయత్నాలు, వేగమే తక్కువ.

ప్రశ్న 7: ఈ పుస్తకంలోని చాలా కథలకు ఓ. హెన్రీ స్ఫూర్తి ఉన్నట్లు అనిపిస్తుంది. ఆయన ప్రభావం మీ రచనలపై ఎంత వరకు ఉంది?

జ: ఓ. హెన్రీ స్పూర్తి ఉంది అయితే అది కొన్ని కథలకే పరిమితం. కాకపోతే ప్రతి కథ చివరి వాక్యం దగ్గర వచ్చేసరికి ఆయన నా భుజం తడుతూ ఉంటాడు.

ప్రశ్న 8: కథకి సంబంధించి – వస్తువు, శిల్పం, శైలి లో మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు?

జ: వస్తువు ఒక్కటే నాకు వివరంగా తెలిసింది. శిల్పం, శైలి నిర్వచనం నాకు పూర్తిగా తెలియదు. అయితే కథని ఆసక్తికరంగా చెప్పే క్రమంలో నా కథలలో కూడా వస్తువుతో పాటు, శిల్పమూ శైలీ భాగాలుగా ఉంటాయనే అనుకుంటాను.

ప్రశ్న9: మీరు స్వాతి, జ్యోతి పత్రికలకు సంపాదక బాధ్యతలు నిర్వహించారు. ప్రమోదఅనే మాసపత్రికని నడిపారు. ఓ సంపాదకుడిగా, కథలని ప్రచురణకి ఎంపిక చేసేటప్పుడు ఆ కథల్లో ఏవేవి ఉండాలని భావించారు?మీ లోని సంపాదకుడు మీ లోని కథకుడికి నోచెప్పిన సందర్భాలేవైనా ఉన్నాయా? కథకుడిగా రాసి, సంపాదకుడిగా – మీకు మీరే వద్దనుకుని ఆపేసిన కథలున్నాయా?

జ: ఒక సంపాదకుడిగా కథలలో ‘ఏదో’ ఉండాలనే ఉద్దేశంతో నా కథల ఎన్నిక జరగలేదు. ప్రధానంగా వస్తువు, రాసిన విధానం, చదవటంలో నేను ఏమైనా ఇబ్బంది పడుతున్నానా, ఇవి దృష్టిలో పెట్టుకుని సెలక్టు చేసేవాడిని. భాషా పరంగా శైలి పరంగా కొంచెం క్లిష్టంగా ఉన్నా ఆకట్టుకున్న సందర్భాల్లో మరోసారి మరోసారి చదివి వాటినీ ప్రచురణకి తీసుకొనేవాడిని. ఏ సంపాదకుడి ఎన్నికైనా చాలా వరకూ ‘వ్యక్తిగతం’ గానే ఉంటుందనుకుంటాను.

నేను స్వాతిలో ఉండగా నాకు బాగా నచ్చి అప్పటి పరిస్థితులు కారణంగా ఆ కథను ప్రచురణకు తీసుకోలేకపోయినా, తర్వాత చాలా కాలం తర్వాత కూడా ఆ కథ జ్ఞాపకం నన్ను వదలక, ఆ రచయితని సంప్రదిస్తే, ‘తిరిగొచ్చిన కథ ఏదైనా పనికి రానిదిగా భావించి చింపేసే అలవాటుంద’ని చెప్పాడాయన. ఆయనకి ఆ కథను వివరంగా గుర్తు చేసి తిరిగి రాయించి, జ్యోతి మాసపత్రికలో ప్రచురించాను. అప్పటికి ఆ కథ ‘రిజెక్షన్’ ఆ రచయితకు జరిగిన అన్యాయంగా భావించాను. ఆ కథ పేరు ‘థాంక్ యూ వెరీమచ్’. రచయిత పేరు ‘అపర్ణ’ అని గుర్తు.

ప్రశ్న 10: ఈ పుస్తకంలోని కొన్ని కథలకు – ఒక ఐడియా తట్టి, మిత్రులని రాయమని అడగడం, వారు రాయకపోవడంతో మీరే కథ రాయడం జరిగింది. ఆలోచన తట్టినప్పుడు, రాసినప్పుడు మీరు కథకుడు. రాయమని అడిగినప్పుడు బహుశా ఎడిటర్. మీలోని ఈ ఇద్దరినీ ఎలా బాలెన్స్ చేశారు?

జ: ‘ఆలోచన తట్టినప్పుడు, రాసినప్పుడు మీరు కథకుడు. రాయమని అడిగినప్పుడు బహుశా ఎడిటర్. మీలోని ఇద్దరినీ ఎలా మానేజ్ చేశారు?’

ఈ ప్రశ్నకు జవాబు క్లుప్తగా చెప్పగలను. మీ ప్రశ్నలలో ఉన్న ఎడిటర్ ఆ సందర్భంలో నాతో లేడు. కేవలం నా బద్ధకంతో రెగ్యులర్‌గా కథలు రాసే ఫ్రెండ్స్‌ని కేవలం స్నేహపూర్వకంగానే అడిగాను. ఇక్కడ ఈ విషయంగా ఒక ఆసక్తికరమైన సంగతి పంచుకోవాలి. ఇలాగా ఒక కథాంశం స్నేహితుడు నాయని కృష్ణమూర్తితో చెప్పాను. ప్రయత్నిస్తాను అన్నాడు కాని రాయలేదు. కొన్నాళ్ళ తర్వాత అదే కథాంశంతో ఆంధ్రపభలో పద్మకుమారి రాసిన ఒక కథ వచ్చింది. ఆశ్చర్యపోయి ఆ రచయిత్రికి C/O ఆంధ్రప్రభ అడ్రస్‌కి ఈ విషయం తెలియజేస్తూ ఉత్తరం రాశాను. ఆ రోజుల్లో ఈ కథాంశం ఎప్పుడో నేను అనుకున్నదే; కనుక మీకొచ్చిన పారితోషికంలో నాకూ భాగం ఉంటుంది అన్న చిన్న చమత్కారంతో. ఆమె బదులివ్వలేదు. ఆ సంగతి మర్చిపోయాను. కొన్నాళ్ళ పోయాక కృష్ణమూర్తిని కలిసినప్పడు “ఏమిటి సత్యంగారూ, ఆంధ్రప్రభలో వచ్చిన కథ రెమ్యూనరేషన్‌లో వాటా కావాలా” అని అడిగి షాక్ ఇచ్చారు. జరిగినదేమంటే ఆ కథ ఆయన రాసి కాబోయే భార్య పేరిట పంపి ఆమెకి బహుమతిగా ఇచ్చాడట!

ప్రశ్న11: ఈ సంపుటి లోని మొదటి కథ పారిజాతంలో – పారిజాతం తన భర్త తనని కొట్టినా, ఆ తరువాత వారం రోజుల పాటు ఎంతో ప్రేమని చూపిస్తాడనీ, దానిలో థ్రిల్ ఉందని అంటుంది. అయితే ఎంత మొగుడయినా అలా కొట్టడాన్ని పార్వతమ్మ సమర్థించలేకపోతుంది. 1971లో రాసిన ఈ కథని సంపుటిలో చేరుస్తున్నప్పుడు – నేటి మహిళలలో పెరిగిన అవగాహన రీత్యా, గృహహింస చట్టం నేపథ్యం దృష్ట్యా – ప్రస్తుత తరుణంలో ఈ కథ ప్రాసంగిత (రెలవెన్స్) పట్ల ఏదైనా అనుమానం/సంశయం కలిగిందా?

జ: ఇది ఈ ‘ఇష్యూస్’ పరంగా చర్చించ తగ్గ కథ. కాని కేవలం సరదాగా చదువుకునే కథగా మాత్రమే దీనిని స్థానం. ‘మొగుడు కొట్టి తర్వాత ఓదార్చటాన్ని’ రోమాంటిసైజ్ చేసి దానికి సమాధానం ఇవ్వటం నా ఉద్దేశం కాదు. ఎవరైనా ఈ విషయంగా నిలదీస్తే నా ఉద్దేశం వివరించి, అయినా ఆ విమర్శ నిలిస్తే ఖచ్చితంగా ‘సారీ’ చెప్తాను..

ప్రశ్న12. సినీ నటుల్నీ, రాజకీయాలని కలిపి రాసిన అసెంబ్లీలో తారాబలంకథ సరదాగా సాగింది. ఈ కథ నేపథ్యం గురించి సంచిక పాఠకులకి వివరిస్తారా?

జ: ఆ కథ చివర కథానేపథ్యంలో వివరణ ఉంది. నాకు బంధువు, మిత్రుడు రచయిత నందగోపాల్. ఆయన రాసిన ‘సినిమాగా సినిమా’ పుస్తకానికి జాతీయ బహుమతి వచ్చింది. ఆయన కోరిక పైనే ‘దేవదాసు మళ్ళీ పుట్టాడు’ సినిమాకు వెండితెర నవల రాశాను. అప్పట్లో ఆయన నడుపుతున్న సినిమా పత్రిక ‘కినిమా’ పత్రిక కోసం రాజకీయాలు, సినిమాలు కలగలుపుగా ఒక సరదా కథ రాయాలని అడగ్గా వచ్చిన ఆలోచనతో రాసిన కథ. ఆయన అడగటాన్ని మించి వేరే ప్రత్యేక నేపథ్యం ఏమీ లేదు.

ప్రశ్న13. ఓ రిక్షా వెనుక కనబడి మిమ్మల్ని వెంటాడిన ఓ వాక్యం మీ కథై, మరో 23 మంది చేతిలో కథగా మారి ఆనాటి వాన చినుకులుఅనే కథాసంకలనంగా రూపుదిద్దుకుంది. ఈ కథ వెనుక నేపథ్యం, గురించి, ఆ కథా సంకలనం వెలువరించడంలోని అనుభవాల గురించి వివరిస్తారా?

జ: ఒక వృద్ధాప్యం, ఒక అనారోగ్యం, ఒక మరణం చూసిన ఆలోచనలు శుద్ధోధనుడ్ని బుద్ధుడిగా మార్చాయి.

చెట్టు కింద వుండగా మీద పడ్డ యాపిల్‌ ‘పైకెందుకు పోలేదు, కిందెందుకు పడింది’ అన్న న్యూటన్‌ ఆలోచన ‘భూమ్యాకర్షణ’ అన్న వైజ్ఞానిక వాస్తవాన్ని మనకు తెలియజేసింది.

అలా అని కాదుగాని ఈ పుస్తకం రావటానికి మూలమైన ఒక ఆలోచన వుంది.

దాదాపు 25 ఏళ్ల క్రితం ఒక గూడు రిక్షా మీద నేను చూసిన ‘ఆనాటి వాన చినుకులు’ అన్న వాక్యం నన్ను ఆలోచనల్లోకి నెట్టింది.

ఇంత భావుకత నిండిన అందమైన వాక్యం ఆ రిక్షా మీద ఎందుకుంది? ఎలా వచ్చింది? ఇది తొలి ఆలోచన.

దానికి కర్త ఎవరు? ఆ రిక్షావాలానా, ఆ రంగులేసిన చిత్రకారుడా, తయారు చేసిన కర్మాగారపు యజమానా? యింకా ఎవరైనానా? ఈ ఆలోచన తరవాతది.

సరే! ఎవరో ఒకరు.. ఈ వాక్యం అలా యథాలాపంగా రాసి వుండరు. దీని వెనుక ఏదో సంఘటనో, అనుభవమో, అనుభూతో ఏదో ఒకటి వుంటుందన్న ఆలోచన కలిగింది ముఖ్యంగా.

ఆ ఆలోచనే ముందుకెళ్లి దాని వెనుక కథ ఎన్ని రకాలుగానో వుండి వుండవచ్చు కదా అనిపించింది. అవును! అది ప్రేమకథ కావచ్చు, కరువు కాటకాల కథ కావచ్చు, ఒక సైనికుడి త్యాగం కథ కావచ్చు.. ఇలా ఈ వాక్యం వెనుక ఎన్నో రకాల కథలకు అవకాశం వుండొచ్చు అనిపించింది.

చాలా ఆలోచింపజేసింది. చాన్నాళ్లు ఈ ఆలోచనలు నన్ను వదల్లేదు. అప్పట్లో ఒక పత్రికా సంపాదకుడికి ఈ విషయం చెప్పాను. పై ఆలోచనలను రచయితలకు వివరిస్తూ (పేరు ఒకటే – కథలెన్నో అన్న కాన్సెప్ట్‌తో) ‘ఆనాటి వాన చినుకులు’ పేరుతో విభిన్నంగా ఒక కథల పోటీ నిర్వహించమని సూచించాను. ఎందుకో గాని అది కార్యరూపం దాల్చలేదు అప్పుడు.

తరువాత ఈ ఆలోచన నాలో పచ్చగా వుండగానే, ఉత్సాహం పట్టలేక స్నేహితులకు చెప్పేవాణ్ణి కొంతకాలం. ఆ క్రమంలోనే దర్శకుడు-రచయిత ‘వంశీ’కి యిదే విషయం చెబితే అతను స్పందించి ఈ పేరుతో ఒక కథ రాశాడు. అలా ఆ వాక్యానికి ఒక కథ తయారయింది అపుడే.

అపుడపుడూ గుర్తొచ్చినా, ఆ విషయం నా ఆలోచనల్లో ప్రాధాన్యత కోల్పోయింది.

నాలుగేళ్ల క్రితం, ఎప్పుడో ఆ సంపాదకుడికి చెప్పిన ఆలోచనకి నేనే ఒక కార్యరూపం తేవాలనిపించింది. కానీ కథల పోటీగా కాదు. ఒక ‘కథా కదంబం’గా.

పత్రికల్లో పనిచేసిన వ్యక్తిగా, సాహిత్యాభిమానిగా నాకున్న పరిచయాలతో నేను ఎన్నుకున్న రచయితలకు ఈ విషయం వివరించి, ఆ పేరుకి ఒక కథ రాయమని అడుగుతూ ఈ ఆలోచనను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశాను.

అయితే ఈ సంకలనంలోని ప్రతి కథా ఆ వాక్యం నాలో కలిగించిన స్పందనలని విని, ‘ప్రత్యేకంగా’ ఈ సంకలనం కోసం రాసినదే.

ఈ కథలు వాన ప్రధానమైన కథలు కావు. జ్ఞాపక ప్రధానాలు. యివి జ్ఞాపకాల మూటలు. జ్ఞాపకాల విరులు. జ్ఞాపకాల మాలలు. జ్ఞాపకాల సంతోషాలు. జ్ఞాపకాల విషాదాలు. జ్ఞాపకాల వినోదాలు. జ్ఞాపకాల విన్యాసాలు. జ్ఞాపకాల కథలు, జ్ఞాపకం అన్నది మనల్ని ఎప్పటికీ వీడని జ్ఞాపకమే కదా.

ప్రశ్న14. ‘ఆస్తి’ చక్కని కథ. తనకి తండ్రి వదిలి వెళ్ళిన ఆస్తి ఏమిటో గోపాలకృష్ణ చాలా స్పష్టంగా చెబుతాడు. ఈ కథ నేపథ్యం వివరిస్తారా?

జ: కొంత వాస్తవమూ, మరి కొంత కల్పనా కలగలుపు ఈ కథ. వాస్తవంలో కొడుకు తన తండ్రి పరువు నిలబెట్టాడు. అయితే తండ్రి తనకు చూపించిన ఈ స్ఫూర్తిని మించి ఆస్తి ఏమంటుందన్న అతని మాటలు రచయితగా నా జోడింపు.

ప్రశ్న15. ఈ సంపుటిలో మరో మంచి కథ రూపాంతరాలు’. బాగుపడడానికి లెక్కలేముంటాయన్న చిరువ్యాపారి జీవన సంతృప్తి, ఓ ధనికుడిలో మార్పుకి దోహదం చేసింది. ఈ కథ నేపథ్యం వివరిస్తారా?

జ: ‘రూపాంతరాలు’ నా మార్నింగ్ వాక్‌లో ఒకసారి జరిగిన ఒక సంఘటన. నేను ఒక కూరగాయల వ్యాపారికి కథలో లాగా కాస్త చేయుత నిచ్చి ఆ సమయంలో అతనితో మాట్లాడిన మాటలు; ఆ మాటల సందర్బంలో అతనిలో ఏ మాత్రం నిర్వేదం, నిరుత్సాహం, నెగిటివిటీ కన్పించకపోవటం నన్ను ఆలోచనలలో పడేసింది. ఈ కథ evolve అవుతున్న సమయంలో రచయితలు మానస, వసుంధర – వీరిద్దరూ కలిసి ఒక సినిమా చర్చలో పార్గొన్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ కథను వారికి narrate చూస్తూ improvise చేశాను. నా జీవితంలోని ఒక స్నేహితుడి జీవితంలోని అనుభవాలు కథలో భాగమయ్యాయి కూడా. అంతా పూర్తయాక వచ్చిన ఆలోచన the last supper కథ సమాంతరంగా చెప్పటం.

ప్రశ్న16. సాధారణంగా రచయితలకు తాము రచించేవన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?

జ: ‘అమ్మకు ఆహ్వానం’. రాసినంత సేపు, మళ్ళీ ఎప్పుడు చదువుకున్నా మా అమ్మ గుర్తు రావటం వల్ల.

ప్రశ్న17. ‘రాక్షసుల్ని చూశాను’ చిన్న కథ. బహుశా మీ మదిలో ఎప్పుడో మెదిలిన ఇతివృత్తానికి ఇప్పుడు అక్షర రూపమిచ్చినట్టున్నారు. కథలో బజ్జీల వెల అర్థరూపాయి అని కాకుండా, పది రూపాయలో, ఇరవై రూపాయలో అని రాసి, చెల్లని నోటుని ఇచ్చినట్టుగా రాసి ఉంటే సమకాలీన కథలా ఉండేది కదా? నోటు అయితే గాలికి ఎగిరిపోవచ్చని, అర్ధ రూపాయి నాణెం ఎగిరిపోదని అలా ఉంచేసారా?

జ: ఈ కథా సంపుటి ముందుమాటలో నేను వివరించినట్లుగా ఈ కథలు 70 దశకం నుంచి ఇప్పటి వరకు రాసినవి. వాటిని ఏ మార్పులు లేకుండా ఆ కాలపు కథలుగా ఉంచాను, ప్రచురణ జరిగిన సంవత్సరాలు వివరాలు కూడా ఇస్తూ. అయితే నాలుగు చిన్న కథలు విషయంలో సంవత్సరాల వివరాలు ఇవ్వలేదు. మీరు ప్రస్తావించిన కథ 70 లలో ఎప్పుడో రాసింది. కథలో అర్ధరూపాయి అప్పటి రేట్.

ప్రశ్న18. ఎనభైలో ఇరవైపుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఉంటే వాటిని పంచుకుంటారా? ఈ సంపుటికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?

జ: ప్రచురణలో ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏమీ లేవు. సాఫీగానే జరిగింది. ముఖ్యంగా ఆత్మీయ మిత్రుడు నాయని కృష్ణమూర్తి ద్వారా పరిచయమైన ఆయన కుటంబం, నన్నూ నా వాళ్ళనూ కలుపుకుంది. కృష్ణమూర్తి జీవించిలేకపోయినా వారితో మా కుటుంబ బంధం కొనసాగింది. వారు నడుపుతున్న విజయవాణి ప్రింటర్స్ నా సొంత press అనేంతగా వారి సహకారం నాకు ఉండటం వల్ల ఈ ప్రచురణ మరింత సులభతరమైంది. అలాగే ఆత్మీయ మిత్రుడు, చిత్రకారుడు అన్వర్, బిజీగా వుండి కూడా అందమైన ముఖచిత్రం; లోపలి అర్థవంతమైన బొమ్మలతో అలంకరణ ఈ పుస్తకానికి అందం సమకూర్చాడు.

ప్రశ్న19. సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలు ఏవైనా సిద్ధమవుతున్నాయా?

జ: ప్రత్యేకంగా భవిష్యత్ ప్రణాళికలు ఏమీ లేవు. పుస్తకాలు చదవటం, రాయాలనిపించినపుడు రాయటం. గొప్ప passion తో కాకపోయినా మంచి హాబీగా బద్ధకం వదిలి రాయగలిగితే ఇప్పటికే ఇరవై పైన కథా వస్తువులున్నాయి, ఒక పుస్తకంలో భ్రీప్‌గా ఆ ఆలోచనలు notes తో. నవల రాద్దామన్న ఆలోచన ఒకటి చేరింది కొత్తగా. రాయగలిగితే సంతోషం. రాయలేకపోతే వెలితి గానూ భావించని స్థితి నాది.

~

సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు వేమూరి సత్యనారాయణ గారు.

వేమూరి సత్యనారాయణ: సంచిక టీమ్‌కి నా ధన్యవాదాలు.

***

ఎనభైలో ఇరవై (కథలు)
రచన: వేమూరి సత్యనారాయణ
ప్రచురణ: వేమూరి బుక్స్, హైదరాబాద్
పేజీలు: 216
వెల: ₹ 230/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్.-27. ఫోన్: 9000413413
విజయవాణి ప్రింటర్స్, చౌడేపల్లి: 9440804072
రచయిత: 9848321703
ఆన్‍లైన్‌లో:
https://www.amazon.in/Enabhailo-Iravai-Vemuri-Satyanarayana/dp/B0DTT4DQ3G

 

~
‘ఎనభైలో ఇరవై’ అనే కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/enabhailo-iravai-book-review-kss/

Exit mobile version