Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రచయిత, అనువాదకులు శ్రీ రంగనాథ రామచంద్రరావు ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘అమ్మ ఆటోగ్రాఫ్’ అనే కథాసంపుటి అనువదించిన శ్రీ రంగనాథ రామచంద్రరావు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం రంగనాథ రామచంద్రరావు గారూ.

రంగనాథ రామచంద్రరావు: నమస్కారం.

~

ప్రశ్న 1. ప్రశ్న 1: ప్రముఖ కన్నడ యువ రచయిత శ్రీధర్‌ బనవాసిగారి కథాసంపుటి అమ్మ ఆటోగ్రాఫ్‌ని అనువదించాలని ఎందుకు అనిపించింది? అనువాదం కోసం మూల రచయితని మీరు సంప్రదించారా లేక ఆయనే మిమ్మల్ని అడిగారా?

జ: బహుశా మూడేళ్ళ క్రితం ఓ ఫ్రెండ్‌ ద్వారా నా ఫోన్‌ నెంబర్‌ తెలుసుకుని శ్రీధర్‌ నాకు ఫోన్‌ చేశారు. తన గురించి చెప్పుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం పొందిన తన నవల ‘బేరు’ గురించి ప్రస్తావించి దాన్ని అనువదించమని కోరారు. అయితే ఆ సమయంలో నేను కొన్ని పుస్తకాల అనువాదాల్లో బిజీగా ఉండటం వల్ల కొంత సమయం తర్వాత చెప్తానన్నాను. ఆ విధంగానే 2022లో అవస్థ, తేజో తుంగభద్ర ప్రచురితమయ్యాక 2023లో అవధేశ్వరి (అంతకుముందే సాహిత్య అకాడెమీ కోసం చేసిన అనువాదం), ఒక్కొక్క తలకూ ఒక్కొక్క వెల, మలాన్‌, యాతనా గృహం అనువాదాలు పూర్తయి అయ్యాక, ‘అమ్మ ఆటోగ్రాఫ్‌’ అనువాదానికి తీసుకున్నాను. ఇవన్నీ 2023లోనే ప్రచురితమయ్యాయి.

‘అమ్మ ఆటోగ్రాఫ్’ పుస్తకంతో అనువాదకులు రంగనాథ రామచంద్రరావు

ప్రశ్న 2: మీరు స్వయంగా కథకులు. చక్కని అనువాదకులు. ఓ కథని గాని ఓ పుస్తకాన్ని గాని అనువాదానికి ఎంచుకోడంలో ముఖ్య పాత్ర మీలోని పాఠకుడిదా లేక కథకుడిదా? పాఠకుడిగా ఇతివృత్తం నచ్చి అనువదించాలని అనుకుంటారా లేదా, మూల రచయిత శైలో లేదా మూల రచనలో ప్రదర్శించిన టెక్నిక్‌/వైవిధ్యం/ఓ విశేష అంశం నచ్చి, ఓ రచయితగా వాటిని మీరూ వ్యక్తీకరించవచ్చని అనువాదానికి పూనుకుంటారా?

జ: ఇది నిజంగా చాలా క్లిష్టమైన ప్రశ్న. దీనికి జవాబు చెప్పడం కష్టం. ప్రయత్నిస్తాను.

అనువాదానికి కథను కానీ, నవలను కానీ ఎంచుకోవడంలో ముఖ్య పాత్ర నాలోని పాఠకుడిదే. చదివితే ఆ రచనకు రీడబిలిటి ఉందో లేదో చూస్తాను. రీడబిలిటి ఉందంటే ఆ రచయిత శైలి బాగుందనే అర్థం. ఇక పాఠకుడిని ఆకట్టుకోవాలంటే ఇతివృత్తం చాలా ముఖ్యం. నచ్చిన ఇతివృత్తాన్ని కొంత మంది రచయితలు విభిన్నమైన రీతిలో ప్రెజెంట్‌ చేస్తారు. ఈ అన్ని లక్షణాలున్న రచనలనే నేను అనువాదానికి ఎన్నుకుంటూ వచ్చాను. అంతేకాకుండా అలాంటి రచనలను తెలుగులోకి తీసుకుని రావాలని, తెలుగు పాఠకులకు అందివ్వాలన్నది నా బలమైన కోరిక. ముఖ్యంగా వైవిధ్యమైన ఇతివృత్తాలు, దాని కథనం, నవలగా మలిచే విధానం నన్ను ఆకట్టుకుంటాయి. నేను సాహిత్య అకాడెమీ కోసం చేసిన అనువాదాలు చూస్తే అందులోని వస్తు వైవిధ్యం, ఆ రచనల కోసం వాళ్ళు చేసిన కృషి, అందుకు వాళ్ళు చేబట్టిన రచనా నిర్మాణానికి దిగ్భ్రాంతి చెందుతాం. అలాంటి వాటిల్లో అవధేశ్వరి, అంతఃపురం, ఓం ణమో, తిరుగుబాటు మొదలైనవి. ఈ రచనలు పాఠకులే కాదు, రచయితలు కూడా చదవాల్సినవి అని అనిపిస్తాయి.

‘అమ్మ ఆటోగ్రాఫ్’ పుస్తకంతో మూల రచయిత శ్రీధర్ బనవాసి

ప్రశ్న 3: మీరు చాలా కథలు రాశాలు. అనువాదాలు విస్తృతంగా చేశారు. మీకు సొంత కథలు వ్రాయడం సులువా? లేక అనువాదాలా? ఎందువల్ల?

జ: సందేహం లేకుండా సొంత కథలు రాయడం సులభం. ఒక సంఘటనో, ఒక దృశ్యమో, ఒక విషయమో మనల్ని కదిలించాలి, మనలో కలవరం పుట్టించాలి, నిద్రపట్టకుండా చేయాలి. ఆలోచింపజేయాలి. దాన్ని కథగా అల్లుకోవాలి, ఒక ఫ్రేమ్‌లో దాన్ని ఊహించుకుని కథ మొదలుపెడితే అదే చివరి వరకూ తీసుకెళుతుంది.

ఇక అనువాదమా? సొంత రచనంత సులభం కాదు. మనదికాని మరో భాషలో ప్రవేశం ఉండాలి. ఒక్కో రచయితది ఒక్కో శైలి. ఒక్కో ప్రాంతపు కన్నడ ఒక్కో రకం. తెలుగులో ఉన్నట్టే అనేక రకాల మాండలికాలు. ప్రామాణిక కన్నడ నుంచి అనువాదం చేయటం సులభమే అయినా మాండలికంలో రాసిన కథలు నవలలు అనువాదకుడికి ముప్పుతిప్పలు పెడతాయి. అయితే నా విషయానికి వస్తే సాహిత్యం నాకు ప్రాణం. అదే నా లోకం. నాకు ఎంతో ఇష్టమైనది కాబట్టి ప్రతి కష్టమూ నేను ఇష్టంగానే భరించాను. ఒక్కో అనువాదం నాకు ఒక్కో పాఠమే. ‘తినగ తినగ వేము  తీపు’ అంటారే అలా చదవగా చదవగా అర్థమవుతుంది. మరీ అర్థంకాని పదాల కొసం పదకోశాలున్నాయి, మిత్రులున్నారు. నా వరకు నేను మూల రచయితల నుంచే నా అనుమానాలు తీర్చుకునేవాడిని. అలా చేస్తే మూల రచయితలు ఎంత సంతోషిస్తారో. కొన్నిసార్లు ఒక్కో పదానికి తెలుగులో సరైన పదం కోసం ఎంత కసరత్తు చేయాలో అది అనువాదకుడికే తెలుస్తుంది. సొంత రచనలో ఉండే స్వేచ్ఛ అనువాదకుడికి ఉండదు. స్వేచ్ఛానువాదం పేరుతో నేను మరీ స్వేచ్ఛను తీసుకుని అనువాదాలు చేయను. అలా చేస్తే చదివే పాఠకుడికి అందరి రచనల శైలి ఒకేలా అనిపిస్తుంది. నేను వీలైనంత వరకు మూల రచయిత చెప్పిన తీరులోనే చెప్పడానికి ప్రయత్నిస్తాను. అప్పుడే కదా కుం. వీరభద్రప్ప రచనకు, వివేక్‌ శానభాగ రచనా విధానానికి, శంకరమోకాశి పుణేకర శైలిలో ఉన్న తేడాలు తెలిసేది.

ప్రశ్న 4: అనువాదకుడిగా అమ్మ ఆటోగ్రాఫ్‌మీ ఎన్నో పుస్తకం? ఈ సందర్భంగా కథకుడిగా, అనువాదకుడిగా మీ ప్రస్థానం ఎప్పుడు, ఎలా మొదలైందో వివరంగా చెప్తారా?

జ: అనువాద కథాసంకలనాలలో ‘అమ్మ ఆటోగ్రాఫ్‌’ 19వ పుస్తకం.

మీ ప్రశ్నలోని రెండో భాగానికి సమాధానం చెప్పాలంటే చాలా వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. అయితే వీలైనంత సంక్షిప్తంగా చెప్పటానికే ప్రయత్నిస్తాను. మాది 80-90 ఏళ్ళ క్రితం కర్ణాటక నుంచి వలస వచ్చి ఆదోనిలో సెటిల్‌ అయిన కుటుంబం. నేను పుట్టింది ఆదోనిలోనే. ఆదోని ఒక చిన్న భారతం అనుకోండి. ఆదోనిలో ప్రధానంగా 3 భాషలు తెలుగు, కన్నడ, ఉర్దూ భాషలు ఉన్నప్పటికీ, మరాఠీ, సాలె, దర్జీ, గుజరాతీ, మర్వాడి – ఇలా అనే భాషలు మాట్లాడేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇతర భాషల పట్ల అభిమానం కలగటానికి ఇది కూడా ఒక కారణం.

నేను పాఠశాలలో ఆరవ తరగతిలో చదువుతున్నప్పుడు (1963) మాకు లైబ్రేరి పీరియడ్‌ ఉండేది. స్కూల్‌ లైబ్రేరి నుంచి క్లాస్‌ లీడర్‌ కథల పుస్తకాలు తెచ్చి పిల్లలకు పంచేవాడు. ఆ పుస్తకాలు, అందులోని కథలు చదవటంతో నాకు పుస్తకాల పట్ల అభిమానం, ఆసక్తి మొదలైంది. అప్పటి నుంచే గ్రంథాలయంకు వెళ్ళటం అలవాటైంది. రోజూ మా ఊరి బ్రాంచ్‌ లైబ్రేరీకి వెళ్ళి దొరికిన పుస్తకం చదివేవాడిని. బహుశా సాహిత్యం పట్ల అప్పుడే నాకు ఇష్టం ఏర్పడి వుండాలి.

ఇక స్కూల్లోనూ మా సైన్స్‌ మేడమ్‌ మధురమణిగారు తమ ఖాళీ సమయంలో వచ్చి ఆర్‌.ఎల్‌. స్టీవెన్సన్‌ రాసిన ‘‘ట్రెషర్‌ ఐలాండ్‌’’ కదను¸ చెప్పడం జరిగింది. అందులోని ‘జిమ్‌’ పాత్ర ఇప్పటికీ ఇష్టమైన పాత్ర. తరువాత పుస్తకం చదివాను. నా మొదటి రచన 6వ తరగతిలో రాసిన ‘ఓడిపోయిన రాకుమారి’, అయితే పబ్లిష్‌ కాలేదు. అప్పట్లో పత్రికలకు ఎలా పంపాలో కూడా తెలియదుకదా! ఆ సమయంలో చదివిన కథలు, నవలలు, కథ సరిత్సాగరం పుస్తకాలు, శరత్‌ సాహిత్యం, రవీంద్రనాధ్‌ ఠాగూర్‌, బంకిం చంద్ర రచనలు, బొల్లిముంత శివరామకృష్ణ, గద్దె లింగయ్య, రెంటాల గోపాలకృష్ణగార్ల అనువాద సాహిత్య రచనలు నాలో సాహిత్యం పట్ల, అనువాద సాహిత్యంపట్ల అభిరుచిని కలిగించి ఉండాలి.

కాలేజిలో అడుగు పెట్టాక (1970-73) మా ఇంగ్లీష్‌ లెక్చరర్‌ వడ్లమూడి చంద్రమౌళిగారు పాఠంగా ఆర్‌. కె. నారాయణ్‌ కథను చెబుతూ తమ ఖాళీ సమయాల్లో రాచకొండ, బీనా దేవి కథలు చెప్పేవారు. అలాగే మా హిందీ లెక్చరర్‌ శ్రీ అనంత్‌ కమల్‌నాథ్‌ పంకజ్‌గారు అనువాద సాహిత్యం పరిచయం చేశారు. అలాగే మరో ఇంగ్లీష్‌ లెక్చరర్‌ పీ.ఎస్‌, మూర్తిగారు. లైబ్రేరీలో చదివిన శరత్‌, రవీంద్రనాధ్‌ ఠాగూర్‌, బంకించంద్ర – వీరు తెలుగు రచయితలు కాకపోయినా వారి సాహిత్యం బహుశా తెలుగు పాఠకులమీద, రచయితల మీద ప్రభావం ఉందనే అనుకుంటాను. అలాగే నా మీద కూడా. కొడవటిగంటి కుటుంబరావు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, బీనాదేవి, అంపశయ్య నవీన్‌, రంగనాయకమ్మ, యద్దనపూడి సులోచనారాణి, కోమలాదేవి, శ్రీశ్రీ, అడవి బాపిరాజు, బసవరాజు అప్పారావు, దువ్వూరి రామిరెడ్డి, దాశరథి, సి. నారాయణరెడ్డి కాలేజీ జీవితంలో ఇంకా ఎందరో నన్ను ప్రభావితం చేసినవారు, సాహిత్యాన్ని సీరియస్‌గా తీసుకోవటానికి ప్రేరణ ఇచ్చారనుకుంటాను.

ఆ తర్వాత నాకు తెలియకుండానే కథలు రాయడం, కవితలు రాయడం, ఛందోబద్ధంగా పద్యాలు రాయడం అలవాటైంది. అనువాదాలు చేయటం అలవాటైంది.

మొదటగా పబ్లిష్‌ అయింది కాలేజీ మ్యాగజైన్‌లో ప్రచురితమైన ‘ఎందులకు?’ అనే కవిత (1971). అనువాద కథ ‘బస్‌ స్టాప్‌’ ‘స్రవంతి’ మాస పత్రికలో (1972), సొంత కథ ‘సందు చివరి ఇల్లు’ ప్రగతి వారపత్రికలో (1975) అచ్చయ్యాయి. ప్రగతి వారపత్రికలో చాలా అనువాద కథలు వచ్చాయి.

డిగ్రీలో ఉండగానే సొంత కథలు, అనువాద కథలు రాసేవాణ్ణి. అనువాదాలు కన్నడ నుంచి, హిందీ నుంచి చేసేవాడిని. స్కూల్లో మా హిందీ టీచర్‌ ప్రోత్సాహంతో హిందీలో విశారద చేయటం కూడా నాకు హిందీ సాహిత్యం పట్ల కూడా ఇష్టం ఏర్పడిరది. అనువాదానికి సహాయకారి అయ్యింది.

డిగ్రీ తర్వాత నేను బి.యిడి చేయడానికి మైసూరు రీజనల్‌ కాలేజిలో చేరటం నా సాహిత్య జీవితానికి మరో మలుపు. అక్కడ ప్రసిద్ధ కన్నడ రచయిత ఎస్‌.ఎల్‌ భైరప్పగారు మాకు లెక్చరర్‌గా రావటం కలలో కూడా ఊహించలేదు. అప్పటికే ఆయన వంశవృక్ష చదివాను. శ్రీ కృష్ణ ఆలనహళ్ళితో, ఈశ్వరచంద్రతో పరిచయం, కుం.వీరభద్రప్పతో పరిచయం కలిగింది. ఇలా కన్నడ రచయితలతో వారి సాహిత్యంతో పరిచయం కావటంతో, వారి రచనల ప్రభావంతో నేను పూర్తిగా కన్నడ అనువాదాలవైపు మరలాను.

బి.యిడి. తర్వాత ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు..

అయితే వీటిలో పడి నా అభిరుచులను మానుకోలేదు. ఒకవైపు సాహిత్యం, మరో వైపు సంగీతం, చిత్రకళలో సాధన..

ఇక 1991నుంచి సీరియస్‌గా రచనలు చేస్తూ వచ్చాను. ‘విపుల’ మాసపత్రిక నన్నొక అనువాదకుడిగా నిలబెట్టింది. ఆనాటి సంపాదకులు శ్రీ చలసాని ప్రసాదరావుగారికి, తర్వాత వచ్చిన ప్రతాప్‌చంద్రగారికి, కె.బి. లక్ష్మిగారికి, నవ్య సంపాదకులు జగన్నాథ శర్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారు అందించిన ప్రోత్సాహం మరవలేనిది.

అప్పట్లో ఆదివారం ఆంధ్రజ్యోతిలో చిన్నచిన్న ఆర్టికల్స్‌ కూడా రాసేవాడిని, నా శైలి బాగుందని, నవ్య సంపాదకులు జగన్నాథ శర్మగారు క్రైమ్‌ కథలు రాయడానికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి విజయవాడకు షిఫ్ట్‌ అయ్యింది. అక్కడ తోటకూర రఘుగారి సహకారంతో చాలా సంవత్సరాలు పోలీస్‌ ఫైల్‌ కథలు, క్లూ కథలు, అనువాదాలు ఎన్నో రాశాను. మళ్ళీ నవ్యలో జగన్నాథ శర్మగారు 40 వారాల పాటు భారతీయ భాషల నుంచి నేను చేసిన అనువాదాలను ప్రచురించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా నా సాహిత్య ప్రయాణంలో సహకరించిన వారందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 2011లో రిటైర్డ్‌ అయ్యాక మా కుటుంబం హైదరాబాద్‌కు చేరుకుంది. అనేక మంది రచయితలతో, కవులతో, ప్రచురణకర్తలతో పరిచయాలు, వారి ప్రోత్సాహంతో ఎన్నో అనువాదాలు చేయటం, అవి ప్రచురితం కావటం తెలిసిందే. వారందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

రంగనాథ రామచంద్రరావు గారి పుస్తకాలు

ప్రశ్న 5: మీ పుస్తకాలకి మీరే డిటిపి, లేఅవుట్‌ చేసుకుంటారు. ఈ నైపుణ్యం మీకెలా అబ్బింది? ప్రచురణా రంగంలో కొత్త సాంకేతికత ప్రవేశించాకా, పాత పద్ధతుల వల్ల ఏదైనా ఇబ్బంది ఎదురువుతోందా?

జ: ఒకప్పుడు చేత్తోనే రాసేవాణ్ణి. ఆ తర్వాత నేను రచనను సీరియస్‌గా తీసుకని విస్తృతంగా రాయటం మొదలుపెట్టిన తర్వాత రాసిన ప్రతి రచనను టైపింగ్‌ చేయించి పంపేవాణ్ణి. అయితే నేను ఒక పబ్లిషర్‌ కోసం చేసిన అనువాద పుస్తకం టైపింగ్‌ చేయించే విషయంలో చాలా ఇబ్బంది పడ్డాను. ఒకరికి ఆ పని అప్పగించాను. ఆ వ్యక్తి మంచి డిజైనరే. అయితే ఒక పెళ్ళి పత్రిక డిజైన్‌ చేస్తే వచ్చే డబ్బులతో పోల్చితే వాళ్ళకు నేను చెల్లించబోయేది బహుశా తక్కువగా అనిపించిందేమో, లేదా వాళ్ళ పనుల ఒత్తిడి వల్లనేమో ఓ సంవత్సరం పాటు నా వర్క్‌ను చేయకుండా వాయిదా వేస్తూ నన్ను తిప్పారు. దాంతో చాలా విసిగిపోయాను. ఇక నేనే టైపింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో మా యింటికి దగ్గర్లోనే ఓ కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభించారు.

అక్కడ ఎం.ఎస్‌.ఆఫీస్‌ నేర్పడానికి 40 రోజుల కోర్స్‌ పెట్టారు. నలబై ఐదేళ్ళ వయసులో పిల్లలతోపాటు చేరి ఎం.ఎస్‌. ఆఫీస్‌ నేర్చుకున్నాను. మొదట్లో టైపింగ్‌ మిషన్‌ మీద ఆల్ఫాబెట్స్‌ టైప్‌ చేయటం, ఫింగరింగ్‌ అంటే ఏ అక్షరానికి ఏ వేలు ఉపయోగించాలో చెప్పారు. రోజూ వెళ్ళటం అలా టైపింగ్‌ చేయటం రావటం. ఓ వారం తర్వాత కంప్యూటర్‌ ముందు కూర్చోబెట్టి కొత్త ఫైల్‌ ఓపెన్‌ చేసి టైప్‌ చేయడం నేర్పారు. అలాగే ఒక్కో టూల్‌ ఎలా ఉపయోగించాలో చెప్పారు. అక్కడ నాగరాజు అనే ఇన్‌స్ట్రక్టర్‌ ఎంతో ఓపికగా చెప్పేవారు. అలా ఎం.ఎస్‌. ఆఫీస్‌లో మరీ లోతుగా కాకపోయినా టైపింగ్‌ చేయటం, చేసింది సేవ్‌ చేయటం, అన్ని నేర్చుకున్నాను. 40 రోజుల తర్వాత సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఎంత సంతోషమో! అయితే నా టార్గెట్‌ వేరుకదా! నా కథలు, నా బుక్కుల టైపింగ్‌ సమస్య. అదే నాగరాజ్‌ సార్‌ను అడిగి మరో 40 రోజులు నా అభ్యాసం కొనసాగించాను. అప్పుడు తెలుగు టైపింగ్‌, పేజ్‌ మేకర్‌లో పేజి ఓపెన్‌ చేయటం, టైప్‌ చేయటం, టూల్స్‌ ఎలా వాడాలో, పి.పి,టి.లో స్లైడ్‌ ఎలా చేయాలో చెప్పారు. అలాగే ఫోటో షాప్‌. అంతా కొంచెం కొంచెమే. అదే సమయంలో మా స్కూళ్ళకు కంప్యూటర్లు వచ్చాయి. స్కూలు ఇంగ్లీషు ఉపాధ్యాయుడు అనిల్‌కుమార్‌కు అప్పగించారు. హైదరాబాద్‌లో ట్రైనింగ్‌ ఇచ్చారు. స్కూల్లో ఆయనకు కంప్యూటర్‌ క్లాసులు అప్పగించారు. బరహ సాఫ్ట్‌వేర్‌ ఇచ్చారు. నేనూ అదే స్కూల్లో లెక్కల మాస్టార్ని కదా! అక్కడ నా లీజర్‌ పిరియడ్‌లో కంప్యూటర్‌ క్లాసుకు వెళ్ళి పిల్లలతోపాటు కూర్చుని వారికి సహాయపడుతూ కొంత అనుభవం సంపాదించాను. అలాగే స్కూల్లో యూనిట్‌ టెస్ట్‌ల ప్రశ్నపత్రాలు తయారు చేయడంలాంటి పనులు స్కూలు కోసం, నా తరగతి విద్యార్థుల కోసం చేసేవాడిని. ఆ అలాగే కంప్యూటర్‌ గురించి వచ్చిన కిరణ్‌కుమార్‌గారి పుస్తకాలను చదివి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. నా మొదటి కథా సంపుటిని చిరంజీవి కంప్యూటర్స్‌ నడిపే శ్రీనాథ్‌ చేత టైప్‌ చేయించటం, లేఅవుట్‌ చేయించటం, అందులో బొమ్మలు పెట్టడం బాగా గమనించాను. ఏదైనా ఒకటి రెండు సార్లు చూశానంటే నేర్చుకోగలను. ఇంతా చేసి విజయవాడ శ్రీశ్రీ ప్రింటర్స్‌ దగ్గరికి వెళితే ఆ బొమ్మలకు లింక్‌లు ఇవ్వలేదు చేయించుకుని రండి అన్నారు. అప్పుడు మరో టిటిపి ఆపరేటర్‌ దగ్గరికి వెళ్ళి లింక్‌లు పెట్టించుకుని వచ్చి వారికి ఇచ్చాను. అది నాకొక పాఠం. అలా అనుభవాలే నాకు పాఠాలు చెప్పాయి. అప్పటి నుంచి మరొకరిపై ఆధారపడకుండా నా పుస్తకాల పని నేను చేసుకుంటున్నాను. అయితే నాకున్న పరిమిత జ్ఞానంతోనే నా పనులు జరిగిపోతున్నాయి. మరీ నేను చేయలేని ఆపరేషన్స్‌ ఉంటే అందులో నిపుణులను ఆశ్రయిస్తున్నాను.

ప్రశ్న 6: ‘అమ్మ ఆటోగ్రాఫ్‌’ పుస్తకంలోని అనువాద కథలు ముందుగా ఏ పత్రికలోనూ ప్రచురితమవలేదా? నేరుగా పుస్తకంగానే విడుదలయిందా?

జ: అవును, ఈ కథా సంకలనంలోని కథలు ఏ పత్రికలోనూ ప్రచురితం కాలేదు. కరోనా కారణంగా ‘విపుల, చతుర, నవ్య’ లాంటి పత్రికలు ఆగిపోయిన తర్వాత నాలాంటి అనువాదకులకు చాలా కష్టమైంది. అనువాదాలు ప్రచురించే కొన్ని పత్రికలు కూడా పేజీల పరిమితి ఉండటంతో వాటికి పంపడం మానేశాను. ఈ కథా సంపుటి నేరుగా ‘ఛాయా’ బుక్స్‌ ద్వారానే పబ్లిష్‌ అయ్యింది.  ‘సంచిక’ వెబ్‌ మాగజైన్‌ కొన్ని అనువాద కథలు ప్రచురించింది. అలాగే రమ్య, మాధురిలాంటి వెబ్‌ మ్యాగజైన్లు ప్రోత్సహిస్తున్నాయి.

ప్రశ్న 7: శ్రీధర్‌ బనవాసిగారు చిత్రకారులు కూడానా? విషయ సూచికలో కథ పేరుతో పాటుగా ఆ కథకి గీసిన బొమ్మని కూడా బాగా డిజైన్‌ చేశారు. ఈ ఐడియా మీదా? లేక ఒరిజినల్‌ పుస్తకంలో శ్రీధర్‌ ఉపయోగించారా?

జ: శ్రీధర్‌ బనవాసి చక్కటి డిజైనర్‌. ఈ ఐడియా నాది కాదు. ఒరిజినల్‌ పుస్తకంలో శ్రీధర్‌ ఉపయోగించిందే. పుస్తకాన్ని వీలైనంత అందంగా తీసుకుని రావాలని ఎప్పుడూ అనుకుంటాను. అందుకే శ్రీధర్‌ నుంచి ఆ బొమ్మలు తెప్పించుకుని నేను డిజైన్‌ చేశాను. మలెనాడుకు సంబంధించిన రెండు చిత్రాలను ప్రత్యేకించి మొదలి పేజీలోనూ, చివరి పేజీలోనూ పెట్టాను.

‘అమ్మ ఆటోగ్రాఫ్’ కథకు రచయిత డిజైన్ చేసిన చిత్రం

ప్రశ్న 8: ‘అమ్మ ఆటోగ్రాఫ్‌’ కథలో “మీ నాన్న నా జీవనానికిచ్చింది ఈ ‘గంగాళమంత అన్నం’” అని తల్లి కొడుకుతో అంటుంది. గంగాళమంత అన్నం అంటే అమ్మ జీవితమే అని కొడుకు అర్థం చేసుకుంటాడు. ఈ కథ నేపథ్యం వివరిస్తారా?

జ: ‘అమ్మ ఆటోగ్రాఫ్‌’ అనేది చాలా దిగువ మధ్యతరగతి కుటుంబం కథ. ఈ కథ ఒకే ఒక్క కొడుకు ఉన్న భార్యాభర్తల గురించి కథ. ఇక్కడ పేదరికం ఉన్నప్పటికీ, భర్త మద్యపాన వ్యసనం వారి కుటుంబ శాంతిని, భార్య, కొడుకు అందమైన కలలనే నలిపివేస్తుంది. భర్త వేధింపులు, పేదరికం ఉన్నప్పటికీ, అత్యంత సంయమనంతో కొడుకును పెంచుతూ, జీవనం సాగిస్తోంది ఆ తల్లి. చివరికి భర్త చనిపోయిన తర్వాత, ఒంటరిగా పనిచేస్తూ తన కొడుకును పెంచుతూ జీవితాన్ని గడిపే ఆమె, మొత్తం సమాజంలో అత్యంత బాధ్యతాయుతమైన మహిళగా చూడబడుతుంది. ఈ కథలోని తల్లిపాత్ర మన నేలగుణం కలిగిన ఒక సాధారణ మహిళ. తన జీవితం ఇలా అయ్యిందికదా అని కుంగిపోకుండా కొడుకుకు ఉత్తమ సంస్కారమిచ్చి, అతనికి విద్య చెప్పించి, విద్యావంతుడ్ని చేసి, జీవితంలో తాను అనుకున్న లక్ష్యాలను, తన అంతరంగిక ఆశలను, కోరికలను, తన కొడుకు జీవితంలో చూడాలనే మనస్సు ఆమెది. తనలాగా కొడుకు చేయి పట్టుకునే స్త్రీ జీవితం తనలా కాకూడదని కలలుకనే తెలివైన మనిషి ఆమె. అంతటి కలలు కలిగిన తల్లి తన కొడుకుకి ఉత్తరం రాసేటప్పుడు, “బాబూ.. మీ నాన్న నా జీవనానికి ఇచ్చింది గంగాళమంత అన్నం. ఈ అన్నంలోనే నేను నీకు ఇంత తినడానికి పెడుతున్నాను” అని రాయటంలోని ఉద్దేశం కొడుకుకు బుద్ధిమాటలు చెప్పేటప్పుడు, ఆమె నడిచివచ్చిన దారిని, పరిమితులను, పరిస్థితినంతటిని ఆమె గంగాళంతో పోల్చింది. జీవితంలో మనం అదుపు తప్పి నడవకూడదు. మనకున్న పరిధిలోనే జీవితాన్ని నిర్మించుకోవాలి. వయస్సు ఆకర్షణలకు చిక్కి, విలాసవంతమైన జీవితానికి బానిస కాకూడదనే జ్ఞానాన్ని బోధిస్తుంది. ఆమె మాటల్లో బాధ ఉంది. కొడుకు పట్ల కలవరం ఉంది. ఆమె మాటల్లో ఆందోళన కనిపిస్తోంది. కొడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ దారి తప్పకూడదని, చదువుపై దృష్టి పెట్టాలనే హెచ్చరిక ఉంది. ఇలా ప్రతిసారి ఉత్తరాల ద్వారా, కొడుకు వయస్సులో ఏర్పడగలిగే సహజభావాలను అర్థం చేసుకుంటూ, బుద్ధిమాటలు చెబుతూ అతని జీవితంలో ఆ తల్లి ఒక గురువవవుతుంది.

ప్రశ్న9: “ప్రతి సంవత్సరం కాముని పున్నమి వచ్చిందంటే అదో పెద్ద పండుగ. వీధి కుర్రవాళ్ళకు పండుగ కేవలం ఒక సాకు” అన్నారు. బనవాసి అనే ఊరిలో జరిగే ఆ పండుగ విశిష్టత ఏంటి? ‘కాముని వీధి కుర్రవాళ్ళు’ కథ నేపథ్యం చెప్పండి.

జ: బనవాసిలో ఉన్న ‘కాముని వీధి’ అనే వీధికి ఆ పేరు రావడానికి ముఖ్య కారణమే ఆ వీధిలో కాముడిని కాల్చటం. ఆ ఆచారాన్ని పాటించటం వల్లనే. ఆలయం వెనుక రోడ్డులో ఉన్న ఈ వీధి కుర్రవాళ్ళు కాముని దహన వేడుకను చాలా బాగా నిర్వహిస్తూ వస్తున్నారు. దీనికి ఇరుగుపొరుగున ఉన్న వీధి వాళ్ళు కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు. ఈ వేడుక వెనుక కాముని వీధి కుర్రవాళ్ళ ఉత్సాహం అపారమైనది. వారం రోజులపాటు, వాళ్ళు కామదేవుడి, రతీదేవి బొమ్మలను తయారు చేసి, అందమైన పందిరి వేసి, వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి, చివరికొకరోజున, వీధి కుర్రవాళ్ళందరూ ఒకచోట చేరి వాటిని కాల్చివేస్తారు. దహనం చేసే రోజు ముందు రాత్రి, ప్రజలు మేల్కోవటానికి ముందే, వీధిలోని ఇళ్ళ నుండి కట్టెలను, పుల్లలను దొంగిలించి, దానితో కామన్నను కాల్చటమన్నది జనపదుల కల్పనో లేదా గ్రామ నమ్మకం వల్లనో, మొత్తానికి బనవాసిలోని ‘కామిని వీధి’లో ఈ ఆచరణ నడుస్తూ వస్తోంది. ఇలాంటి ఆచరణ వీధి కుర్రవాళ్ళ ఆనందానికి మరో సాక్ష్యం.. ఇదే విధంగా ఈ కాముని వీధిలో ఈ వేడుక వందలాది సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తోంది. కానీ కాలం గడిచేకొద్దీ, కాలచక్రం దొర్లుతున్నట్టే, కామునివీధి పిల్లలు ఎప్పుడైతే చదువుల కోసం, ఉద్యోగాల కోసం ఊరు వదిలి దూరంగా వెళ్లడం మొదలుపెట్టారో, అసలు సంప్రదాయం మసకబారుతూ పోయింది. ఇరుగు పొరుగు వీధుల పిల్లలు ఆచరిస్తున్న కాముని పండుగ ఉత్సాహం తగ్గుతూ పోయింది.

‘కామునివీధి కుర్రవాళ్ళు’ కథకు రచయిత డిజైన్ చేసిన చిత్రం

ఇక్కడ కథకుడు రాసిన కథను చదివినపుడు, ఆ నాడు పొందిన ఉత్సాహం, సంభ్రమం, స్వస్థలాన్ని వదిలి జీవనోపాధి కోసం బయటి ప్రాంతాలకు వెళ్ళినవాళ్ళు ఆ తర్వాత, ఎటువంటి వేడుక లేకుండా, కేవలం ఒక సాకుతో జరుపుకుంటున్న ఆచరణను ఆ రోజులతో పోల్చుకుని ఆనందం, బాధతో రచయిత కథ రాశాడని అనిపిస్తుంది. ఇది కేవలం బనవాసిలోని కామునివీధికి చెందిన కథ కాదు. మన భారతదేశంలోని ప్రతి గ్రామంలోనూ ఇటువంటి సాంప్రదాయ పద్ధతులు అంతరించిపోతున్న కథ ఇది. మన బాల్యంలో కోల్పోయిన ఇలాంటి అనేక సంప్రదాయాలను గుర్తుచేసుకోవడానికి ఈ కథ ఒక ఉదాహరణ మాత్రమే.

ప్రశ్న 10: తప్పుడు దారిలో నడిచిన రవిని సాహిత్యం మార్చిన వైనాన్ని సౌదామిని అపార్ట్‌మెంట్‌కథ చెబుతుంది. కానీ ఆ మార్పు ప్రయోజకత్వం వైపు కాక, స్వీయసుఖం వైపు దారితీసినట్టు అనిపిస్తుంది. చివర్లో అతనికి జరిగిన ఉదంతాన్ని కలగా మార్చడం వల్ల – ఆ పాత్ర స్వరూప స్వభావాల పట్ల కొంత సందిగ్ధత ఉన్నట్టు తోస్తుంది. రవి పాత్ర రూపకల్పన గురించి వివరిస్తారా?

జ: ‘సౌదామిని అపార్ట్‌మెంట్‌’ కథలోని కథానాయకుడు రవి పాత్రను మనం రెండు భాగాలుగా చూడవచ్చు. అతను తన యవ్వనంలో ఎక్కడో దారి తప్పిపోయాడు, కానీ చివరికి సాహిత్య వ్యామోహంలో పడ్డాడు, సాహిత్యాన్ని చాలా తీవ్రంగా చదివాడు. కథలు, నవలలు, కవితల ద్వారా జీవితంలోని సీరియస్‌ను, బాధ్యతను గ్రహించడం ఒకవైపు ఉంటే, మరో వైపు తాను చదివిన కథలు, నవలల్లోని పాత్రలతో తనదైన భ్రాంతితో కూడిన ప్రపంచాన్ని నిర్మించుకుని, అదే భావోద్వేగాల, ఊహల ప్రపంచంలో తేలియాడుతూ, ఆ పాత్రలతో జీవించే తీరును చూడొచ్చు.

‘సౌదామిని అపార్ట్‌మెంట్’ కథకు రచయిత డిజైన్ చేసిన చిత్రం

ఈ ‘సౌదామిని అపార్ట్‌మెంట్‌’ కథలోనూ అతను ఎప్పుడో ఏదో ఒక కథలో లేదా నవలలో చదివిన సౌదామిని అనే పాత్రతో తన సొంత భ్రాంతితో కూడిన ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. అది నిజంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. తనది కాని ఆ కల్పనాప్రపంచంలో, తాను అనుభవించని, ఎవరితోనూ పంచుకోని తన భావాలన్నింటినీ, ఆలోచనలన్నింటినీ సౌదామిని పాత్రతో పంచుకుంటూ పోతాడు. చివరికి, ఆ పాత్రతోటి అతని విలాసవంతమైన ఫాంటసీ ముగియడంతో, దాని నుండి బయటకు వచ్చి, మళ్ళీ ఈ లౌకిక ప్రపంచానికి అనుగుణంగా మారడానికి కష్టపడతాడు. కొన్నిసార్లు అతను తాను ఊహించిన కలల కోసం ప్రాపంచిక ప్రపంచంలో వెతుకుతాడు. అతను వాస్తవికత-ఊహ రెండూ ఒకటే అన్నట్టు జీవించి, తన చుట్టూ ఉన్న వ్యక్తులతో ఇబ్బందికరమైన పరిస్థితిలో చిక్కుకుంటాడు. ఈ విధంగా, రవి పాత్ర రెండు ప్రపంచాల్లో నడిచే పాత్ర.

ప్రశ్న11: ‘ఊరు-దేవుడు’ అనే కథలో మలెనాడు అనే ఊరిలో బ్రాహ్మణ యువతి కనిపించకుండా పోవడం, దళితులకి అగ్రవర్ణాలకి గొడవలు జరగడం వంటి ఘటనలతోపాటు ప్రజలే పోలీసులను భయపెట్టడం వంటివి జరుగుతుతాయి. వీటినెలా అర్థం చేసుకోవాలి? ఆలయ బాధ్యతల నిర్వహణలో కులం/వర్ణం కన్నా ఆర్థిక కారణాలే ప్రాధాన్యం వహించినట్టు తోస్తుంది. ఈ కథ గురించి మీరేం చెప్తారు?

జ: సాధారణంగా, మన దేశంలోని ప్రతి గ్రామంలో జరిగే ఇటువంటి సంఘటనల కథలు వందల సంవత్సరాల పాటు ఆ కాలంలోని సామాజిక, ధార్మిక, రాజకీయ పరిణామాలను ప్రతిబింబించే ఫలితాలే.

ఈ నేపథ్యంలో మనం ‘ఊరు-దేవుడు’ కథను విశ్లేషించి చెప్పవచ్చు. కర్ణాటకలోని మలెనాడు ప్రాంతంలో ఉన్న ఈ ఊరిలోని దేవస్థానం వేల సంవత్సరాల పురాతనమైనది. సహజంగానే, రాజు, మహారాజుల కాలంలో నిర్మించిన ఇటువంటి దేవాలయాల ఆచరణలకు, నిర్వహణలకు, రక్షణకు మంచి ఆదాయ వనరులను రాజులు ఏర్పాటు చేసి పెట్టేవారు. దేవాలయ ఖర్చులకు, పూజపునస్కారాలకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి వేల ఎకరాల భూమిని దేవాలయానికి విరాళంగా ఇచ్చేవారు. అదనంగా ఆలయ పూజలు చేసే బ్రాహ్మణులను, దేవాలయ నిర్వహణ చూసుకునే పాళెగాళ్ళను, సేవలకు వివిధ కులాల ప్రజలను నియమించి, వారి జీవితాలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకు భూములు, ఇనాములు, కానుకలు ఇచ్చేవారు. అందువల్ల, వందలాది సంవత్సరాల నుంచి, పదిపదిహేను తరాల పాటు, ఇటువంటి ప్రత్యేక సౌలభ్యాలు, అధికారాన్ని అనుభవించిన ఉన్నత వర్గపు జనం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా శక్తివంతులై సమాజంలో కొనసాగుతారు. ఈ వ్యవస్థకు దూరంగా ఉన్నవారి కష్టాలు చెప్పడం కష్టం! ఈ ప్రజలు శక్తివంతులు చెప్పేది వింటూ, ఇచ్చింది తీసుకుంటూ కష్టాల జీవితాన్ని గడుపుతుంటారు. ఇలాంటివారు ఎప్పటికీ ఇలాంటి అధికారాన్ని ఈ వ్యవస్థలో పొందలేరు. అయినప్పటికీ, ఈ ప్రజలు ఏదో ఒక రోజు తాము ఉన్నత వర్గాల వారిలాగే జీవించాలని, అధికారాన్ని ఆస్వాదించాలని, వారిలాగే దేవుణ్ణి సేవించాలనే తమ కలలను, కోరికలను వదులుకోకుండా, వాటిని తమ తర్వాతి తరాలలో నాటి పోతారు.

‘ఊరు-దేవుడు’ కథకు రచయిత డిజైన్ చేసిన చిత్రం

రాజ్యాంగంలోని సమానత్వం, దున్నేవాడిదే భూమి అనే చట్టాలు దేశంలోని ప్రతి గ్రామంలో సామాజిక, రాజకీయ విప్లవానికి కారణమయ్యాయన్నది మాత్రం అబద్ధం కాదు. అదేవిధంగా, ఆలయ నిర్వహణ కింద ఉన్న వేలాది ఎకరాల భూమిని రైతులు దున్నడం ద్వారా ఆర్థికంగా సాధికారత సాధించారు. అదేవిధంగా, రాజ్యాంగంలోని రిజర్వేషన్‌ పథకాలు రాజకీయంగా జనులందరూ ఎదగడానికి వీలు కల్పించాయి. అదేవిధంగా, ప్రభుత్వాలు దేవాలయాలను స్వాధీనం చేసుకుని, తరతరాలుగా వస్తున్న నియమాలలో మార్పులు చేస్తే, అది గ్రామాల్లో పెద్ద తిరుగుబాటుకు దారితీస్తుంది.

‘ఊరు-దేవుడు’ అనే కథ, ఒక బ్రాహ్మణ అమ్మాయి వేరే కులానికి చెందిన అబ్బాయితో పారిపోవడంతో మొదలయ్యే కథ. ఆ ఊరిలో గతంలో జరిగిన అనేక సామాజిక మార్పులను వెల్లడిస్తుంది. ప్రజల మనస్తత్వం, విద్య ద్వారా పొందిన పరిపక్వత, అధికారమంతా ప్రజల సాంప్రదాయక బానిసత్వ మనస్తత్వం నుండి బయటికి వచ్చిన వ్యవస్థను సూచిస్తాయి. ఆలయానికి చెందిన వంశపారంపర్యంగా సంక్రమించిన కొన్ని బాధ్యతలు తరతరాలుగా దూరంగా ఉన్న ఇతర వ్యక్తులకు కూడా లభిస్తాయి. ఊరిలో వారికి కూడా సమాన గౌరవం లభిస్తుంది. ఈ విధంగా, ఒక సంఘటన ద్వారా, గ్రామంలోని అనేక సామాజిక క్రాంతి మలుపులను మనం విశ్లేషించవచ్చు.

ప్రశ్న12. ఈ సంపుటిలోని ఏ కథ మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?

జ: అమ్మ ఆటోగ్రాఫ్‌ కథా సంకలనంలోని కథల్లో నా మనస్సుకు దగ్గరైనవి ఏదని అడిగితే జవాబివ్వడం కష్టం. ఎందుకంటే శ్రీధర్‌ ఒక్కో కథను చక్కటి శిల్పిలా, భిన్నంగా తీర్చిదిద్దాడు. అయినా నా మనస్సుకు దగ్గరైన కథగా ఈ సంపుటిలోని ‘అమ్మ ఆటోగ్రాఫ్‌’ కథను పేర్కొంటున్నాను. ఈ కథ గురించి కొంత ఇంతకు ముందే చెప్పాను. అయితే నా మనస్సును కదిలించిన ఒక విషయం చెప్పాలి. ఏ కథకులకైనా, పాఠకులకైనా ‘అమ్మ’ అంటేనే ఒక అందమైన అనుభుతి కలుగుతుంది. వాస్తవానికి ‘అమ్మ’ అనే పదమే, అమ్మ అనే వ్యక్తే అపురూపమైనది. అమ్మ ఇతివృత్తంగా వచ్చిన ఏ కథ అయినా గుండెను కదిలిస్తుంది. ఈ కథలో కొడుకు పాత్ర ‘తల్లి కాలేజీ రోజుల్లో తనను దారి తప్పవద్దని చెబుతున్న అమ్మ, నిజంగానే తనను చదివించడానికి దారి తప్పింద’ అనే ఆలోచనలో పడతాడు. తనను ‘లంజ కొడకా’ అని మల్లిక్‌ సాబ్‌ అన్న మాటతో అనుమానిస్తాడు. ఆ అనుమానం భూతంలా వచ్చి అతని తలలో కూర్చుంటుంది. అప్పుడప్పుడు అతని మనస్సును అడుగుతుంటుంది. వెక్కిరిస్తుంటుంది. ఒకరోజు చిన్న విషయంలో గొడవ పడుతూ తల్లితో ఆ మాట అనేస్తాడు. ఆమెకు బాధ కలిగేలా దూషిస్తాడు. చివరికి అతను తన తప్పు తెలుసుకుంటాడు. కథ ఇక్కడితో ఆపివుంటే అది సాధారణమైన కథ అయివుండేది. కానీ శ్రీధర్‌ ఇచ్చిన ముగింపు, అతని ఆలోచనలు, అతని వెలిబుచ్చే విధానం మనల్ని అబ్బురపరుస్తాయి. తల్లిని తలుచుకుంటూ ఆ కొడుకు – ‘నువ్వు నాకు కేవలం అమ్మవు కాదు. నాకు తండ్రివయ్యావు. మంచి స్నేహితురాలివి అయ్యావు. శ్రేయోభిలాషివి అయ్యావు. అక్కవు అయ్యావు. గురువువు అయ్యావు. మొత్తానికి నువ్వు నాకు తప్ప ఎవరికీ ఏమీ కావటానికి సాధ్యం లేదమ్మా. ఈ రోజు నేను పెద్దవాడిని కావచ్చు. ఇద్దరు పిల్లల తండ్రిని కావచ్చు. అమ్మా ఈ రోజుకూ నాకు నీ కౌగిలి కావాలనిపిస్తుంది. ఒక్కసారి నిన్ను కౌగిలించుకుని, నేను నీతో అన్న మాటలన్నీ తప్పని ఒప్పుకుంటూ నిన్ను క్షమాపణలు అడుగుతాను..’ రచయిత కథను ఇక్కడితో ఆపడు. తాను తల్లి కోరుకున్నటే అయ్యాడని చెబుతూ – “ఒక దుఃఖం నన్ను ఇప్పటికీ వెంటాడుతోంది. ఈ రోజు నేను నా పిల్లలకు మంచి విద్య, ప్రేమ, సంస్కారం అన్నిటిని అందిస్తున్నాను. అది నువ్వు నాకు నేర్పిన పాఠమే అయినా, నాకు నీలాగా నువ్వు కురిపించిన ప్రేమధారలను నా పిల్లలపై కురిపించటానికి సాధ్యం కావటం లేదు. నువ్వు చూపించిన ప్రేమ నా పిల్లలకు దొరకడం లేదు. అమ్మా.. కచ్చితంగా నువ్వు మనవళ్ల మీద నాపై కురిపించిన ఆ ప్రేమ ధారను కురిపిస్తావా? నా పిల్లలకు ప్రేమ కావాలి. నీ సహనం, ఓర్పు, మంచితనపు సంస్కారం, నా బిడ్డలకు అందాలి. అది నాకు మాత్రమే పరిమితం కాకూడదు. నా కోరిక రోజు రోజుకూ పెద్ద కోరికగా పెరిగిపోతోంది. ప్రతి క్షణం, ప్రతి రోజూ, చిరకాలం నువ్వు నాతోనే ఉంటావు. నా తప్పును కచ్చితంగా క్షమించు. ఎదురుచూస్తుంటాను. ప్రతిక్షణమూ అది నన్ను బాధిస్తుంది. అమ్మా, నీ సమాధానం కోసం ఎదురుచూస్తుంటాను..’’ అంటూ శ్రీధర బనవాసి కథను తిప్పే మలుపు నన్ను కదిలించింది. నన్నే కాదు, కన్నడ కథా సాహిత్యంలో అతన్ని ఒక భిన్నమైన రచయితగా గుర్తించింది.

ప్రశ్న13. ఈ సంపుటిలోని ఏదైనా కథ అనువదించడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా అనువదించి ఉండచ్చు అని అనిపించిందా?

జ: శ్రీధర బనవాసిది మలెనాడు ప్రాంతం. ‘యక్ష ప్రశ్న’లో మలెనాడు ప్రాంతపు మట్టివాసనలు, సంస్కృతి కనిపిస్తాయి. ఆతను రచనల్లోని రీడబిలిటి వల్ల కష్టపడలేదు. ఇక కథ అనువాదం గురించి, ఇంకా బాగా అనువదించి ఉండొచ్చని అనిపించిందా అని అడిగితే, ప్రసిద్ధ కన్నడ రచయిత వివేక్‌ శానభాగ ఒక సందర్భంలో నాతో, “భగవంతుడు వచ్చి అనువాదం చేసినా 100% చేయలేడు” అని అన్నటువంటి మాట గుర్తొస్తుంది. అలా అని నా అనువాదాన్ని సమర్థించుకోవటం లేదు. ఇది కేవలం నన్ను నేను ఓదార్చుకోవటానికి, ధైర్యం చెప్పుకోవటానికి అప్పుడప్పుడు గుర్తుచేసుకుంటాను. అంతే. కచ్చితంగా మనం రాసింది, అనువదించింది కొంత కాలం తర్వాత చదువితే ఇంకా బాగా రాసివుండొచ్చు అని అనిపించటం సహజమే. నిజానికి అలా అనిపించాలి. అలా అనిపించకపోతే పోతే మన సామర్థ్యం అక్కడితో ఆగిపోతుందేమో? మనలో అహంకారం పెరుగుతుందేమో? మనలో ఇక ఎదుగుదల ఉండదేమో?

‘యక్షప్రశ్న’ కథకు రచయిత డిజైన్ చేసిన చిత్రం

ప్రశ్న14. ‘అమ్మ ఆటోగ్రాఫ్‌’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఉంటే వాటిని పంచుకుంటారా? ఈ సంపుటికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?

జ: శ్రీధర బనవాసి కచ్చితంగా ఒక వైవిధ్యమైన కన్నడ రచయిత, కవి, నవలాకారుడు. ప్రత్యేకమైన అనుభవాలు అంటే ఏమీ చెప్పలేను కానీ ప్రతి కథను భిన్నంగా చెప్పడానికి ప్రయత్నించడం గమనించి ఆశ్చర్యపోయాను. ఈ కథల సంపుటి ప్రతిని చదివిన వెంటనే ‘ఛాయా’ కృష్ణమోహన్‌ బాబు, అరుణాంక్‌ లత ఇద్దరూ మనం ప్రచురిద్దామని అన్నారు. ప్రచురించారు. చదివిన ప్రతి ఒక్కరూ బాగుందన్నారు. పాఠకుల నుంచి స్పందన బాగుంది.

ప్రశ్న15. సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలు ఏవైనా సిద్ధమవుతున్నాయా?

జ: మనస్సులో సొంత కథలు రాయాలని ఉన్నప్పటికీ, కొన్ని సబ్జెక్ట్‌లు ఉన్నప్పటికీ, అనువాదాల ఒత్తిడి ఎంతగా ఉందంటే ఎప్పుడూ ఓ నాలుగైదు పుస్తకాలు అనువాదానికి సిద్ధంగా ఉండి, నన్ను సొంత కథలవైపు వెళ్ళనీయడం లేదు. కన్నడ నుంచి మంచి సాహిత్యాన్ని, నాలుగు కాలాలపాటు నిలిచిపోయే కొన్ని క్లాసిక్‌లను అనువదించి తెలుసు పాఠకులకు అందించాలని నా కోరిక. ప్రస్తుతం -కరిసిరియానం, తలారి, విద్యావంతురాలైన వేశ్య కథ, సమకాలీన కన్నడ కథలు-2 (17మంది రచయితల కథలతో), బి.టి. లలితా నాయక్‌ కథా సంకలనం, సరహపాదుడు – ప్రచురణకు సిద్ధంగా ఉన్న అనువాదాలు. అనువాదం చేస్తున్నవి బ్రిటీష్‌ బంగ్లా (శ్రీధర బనవాసి), మాకో ఏకాంతం (కావ్య కడమె), బంగారు దొడ్డి (మలెయూరు గురుస్వామి), బెసగరహళ్ళి రామణ్ణ కథలు, సావిన దశావతారగళు (కె. సత్యనారాయణ), అల్లమ ప్రభు వచనాలు.

~

సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు రంగనాథ రామచంద్రరావు గారు.

రంగనాథ రామచంద్రరావు: సంచిక టీమ్‌కి నా ధన్యవాదాలు.

***

అమ్మ ఆటోగ్రాఫ్ (అనువాద కథలు)
కన్నడ మూలం: శ్రీధర బనవాసి
అనువాదం: రంగనాథ రామచంద్ర రావు
ప్రచురణ: ఛాయా రిసోర్స్ సెంటర్, హైదరాబాద్
పేజీలు: 140
వెల: ₹ 150/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
~
ఛాయా రిసోర్స్ సెంటర్ 7093165151
ఆన్‍లైన్‍లో

https://www.amazon.in/Amma-Autograph-Shridhara-Banvasi/dp/9392968795

 

~
‘అమ్మ ఆటోగ్రాఫ్’ అనువాద కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/amma-autograph-book-review-kss/

Exit mobile version