[‘సవర్లకొండ, ఇతర కథలు’ అనే కథాసంపుటి వెలువరించిన శ్రీ కరుణకుమార్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం కరుణకుమార్ గారూ.
కరుణకుమార్: నమస్కారం. ఈ ఇంటర్వ్యూకు ఆహ్వానించినందుకు సంచికకు, సంపాదక బృందానికి కృతజ్ఞతలు.
~
జ: శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం, కంట్రగడ గ్రామం నా స్వస్థలం. 10వ తరగతి వరకు ప్రభుత్వ బడిలో చదువుకున్నాను. 10వ తరగతి తర్వాత చదువు కొనసాగించడానికి శ్రీకాకుళం టౌన్లో ఒక ఆఫీసరు గారింట్లో ఉంటూ చదువుకోవాల్సిన పరిస్థితి. ఆ వాతావరణం, ఆ పరిస్థితులు నచ్చక, ఆ వయసులో వచ్చిన కోపం, నిస్సహాయత కారణంగా ఎవరికీ చెప్పకుండా మద్రాసు వెళ్లిపోయాను. హోటల్లో క్లీనర్గా 15 ఏళ్ల వయసులో నా ప్రస్థానం మొదలుపెట్టాను. రక రకాల పనులు, ఆ తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు అని పదేళ్లు. తర్వాత ఇంటికొచ్చేశాను. ఈ పది సంవత్సరాల జీవితం ఇచ్చిన అనుభవాలు, నాకు తారసపడ్డ మనుషులు, నేను ఎదుర్కొన్న పరిస్థితులు నాకు జీవితం పట్ల ఒక దృక్కోణాన్ని కల్పించాయి. అంతర్లీనంగా ఇవన్నీ నా కథా రచనలో ప్రతిఫలిస్తూ ఉండవచ్చు. ఉండకపోవచ్చు కూడా. నిర్దిష్టంగా చెప్పలేను.
ప్రశ్న 2: ‘సవర్లకొండ’ కథ ఒక విభిన్నమైన కథ. ఇది మామూలు మూస ఐడియాలజికల్లీ ఓరియెంటెడ్ కథ అన్న అపోహతో చదవటం ఆరంభించిన పాఠకుడు చివరికి వచ్చేసరికి ఇది నిజజీవితాన్ని నిక్కచ్చిగా, నిష్పాక్షికంగా ప్రదర్శించి, మానవ మనస్తత్వంలోని ఔన్నత్యాన్ని, అమాయకత్వాన్ని, నైచ్యాన్ని నిజాయితీగా ప్రదర్శించిన అత్యద్భుతమైన కథ అన్న భావనతో స్తబ్దుడవుతాడు. ఈ కథకు ప్రేరణ, కథా సంవిధానం, పాత్రల వ్యక్తిత్వాలను తీర్చిదిద్దిన విధానం విపులంగా వివరిస్తారా? ఎందకంటే, మీ వివరణ ఎందరో వర్ధమాన కథకులకు, కథా రచన ఔత్సాహికులకు మార్గదర్శనం చేస్తుంది.
జ: ఈ కథలో ఉన్నదంతా నేను నా బాల్యంలో చూసిన నేపథ్యం. తూర్పు కనుమలకు ఆనుకుని, ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో పెరగటం వలన నక్సలైట్లను చూడటం, అప్పుడప్పుడు వాళ్ళకు భోజనం సమకూర్చటం మా ఊరి ప్రజలకు అలవాటైన పని. మా స్కూల్కు నక్సలైట్లు వచ్చి ఉద్యమం గురించి 8,9 తరగతుల పిల్లలకు చెప్పేవారు. విప్లవ సాహిత్యం చేతి వ్రాత ప్రతులను దస్తూరీ బావున్న పిల్లలతో రాయించేవారు. వారంటే భయమూ, గౌరవమూ ఉన్న రోజుల నుండి వ్యక్తుల కారణంగా ఉద్యమాలు బలహీనపడిన రోజులలో వారిని ప్రజలు ద్వేషించే పరిస్థితుల దాకా నాకు అవగాహన ఉంది. ఒకప్పుడు పోరాటాల పురిటి గడ్డ అయిన శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు మాజీలు రియల్టర్లుగా, లిక్కర్ కాంట్రాక్టర్లుగా ఉన్నారు. హైదరాబాద్ లోని మూసాపేట్ 90ల ప్రాంతంలో ఏర్పడింది. అక్కడ ఈరోజు భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నవాళ్ళలో 95 శాతం మా జిల్లా, మా ప్రాంతం నుండి వలస వచ్చిన రైతులు. ఇవన్నీ సమ్మరైజ్ చేస్తే పుట్టిన కథ సవర్లకొండ.
ప్రశ్న 3: ‘సాయమ్మ’ కథ మూస ఫెమినిస్ట్ కథకులకు భిన్నంగా సాంప్రదాయ పరిధిలో ఒదుగుతూ కూడా, తన వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసంతో నిలుపుకున్న మహిళ కథ. సాయమ్మ పాత్రకు ప్రేరణ ఏమిటి? ఈ కథలో ఒక్క సాయమ్మనే ప్రధాన పాత్ర అయినా మిగతా ప్రతి పాత్ర కూడా సజీవంగా కనిపిస్తుంది. తక్కువ అన్న భావన కలగలేదు. ఈ కథకు పథకం ఎలా వేసుకున్నారు? సినిమా పరిభాషలో స్టోరీబోర్డ్ తయారీ గురించి చెప్పండి?
జ: ‘సాయమ్మ’ కథలో పాత్రలన్నీ నేను నిజజీవితంలో చూసిన, మాట్లాడిన బలమైన వ్యక్తిత్వమున్న మా ప్రాంతపు స్త్రీలు. పథకం అంటూ ఏమీ లేదు. ఇలాంటి పాత్రలతో ఒక కథ రాయాలి, అందులో ఏం చెప్పాలి అని అనుకున్న తర్వాత రాయటం మొదలుపెడతాను. లోపల నిజాయితీగా అనుకుంటే ఆ భావం కాగితం మీదకు అక్షరాలుగా వస్తుంది అనుకుంటాను. విజ్ఞాన ప్రదర్శనతో, సౌందర్యంతో రాయాలని అనుకోను. సినిపిల్లి పాపమ్మ, ఆకూరు బంగారమ్మ అనే ఇద్దరు స్త్రీలు కలిపితే సాయమ్మ పాత్ర. 10 ఏళ్ల వయసున్నప్పుడు వీళ్ళిద్దరూ నాలో బలంగా నాటుకుపోయిన మనుషులు.
జ: మహిళ అంటే నిర్వచనానికి లొంగని ఒక శక్తిగా నేను చూస్తాను. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం మహిళలు మగవారికంటే మానసికంగా, శారీరకంగా చాలా బలవంతులు. ఇక ఫెమినిజం అనే పదం నాకు పరిచయం కాకముందే నేను శక్తివంతమైన, ఆత్మ నిర్భరత కలిగిన మహిళలను చూశాను. ఇప్పటి సోషల్ మీడియా ప్రమాణాల ప్రకారం ఉండే ఫెమినిజం మీద నాకు ఏ అభిప్రాయము లేదు. ఫెమినిజం అంటే అన్నింటా సమానత్వం ఉంటూనే పురుషులు పురుషులు గానూ, స్త్రీలు స్త్రీలుగానూ ప్రకృతి నియమానుసారం ఉండాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.
ప్రశ్న 5: ‘పురుగు’ కథ ఒక విభిన్నమైన కథ. మానసికశాస్త్ర అభ్యాసంలో ఒక ఉదాహరణగా చూపదగ్గ కథ. శాలిని పాత్ర గురించి చెప్పండి. ఆధునిక సమాజంలో పసిపిల్లల నుంచి పండుముసలి వరకూ ఒంటరితనంతో, ప్రేమ రాహిత్య భావనతో ఎందుకు బాధపడుతున్నారు, మీ కోణం నుంచి చెప్పండి.
జ: ఒంటరితనానికి ఆధునికము అంటూ ఏమీ లేదేమో. ప్రేమ రాహిత్యం విశ్వనాథ సత్యనారాయణ, శరత్, చలం రచనల నుండి కాంటెంపరరీ రచనల వరకు అన్నింటా ఒక ప్రధాన వస్తువు గానే ఉంది. ప్రేమ అని పేరు పెట్టుకున్న కంఫర్ట్ జోన్ను, లేని ఒక ఫీలింగ్ను వెతుకుతూ మనుషులు కొంతకాలానికి చచ్చిపోతారేమో అని అనిపించినపుడు వచ్చిన కథ ‘పురుగు’. శాలిని పాత్ర నిజజీవితంలో నేను మాట్లాడిన ఒక అబ్బాయిది.
ప్రశ్న 6: ‘నాలుగువందల తొంభయ్ ఎనిమిది’ కథ సాహిత్య ప్రపంచంలో అందరూ ఆమోదించే పొలిటికల్లీ కరెక్ట్ కథలకు భిన్నమయిన కథ. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు మీ కథ సమకాలీన సమాజంలోని సమస్యను మరో కోణంలో చూపించారని నిరూపిస్తాయి. ఈ కథకు మీ సన్నిహితుల స్పందన ఎలావుంది?
జ: పత్రికలకు కథలు పంపే అలవాటు లేదు. ఎవరన్నా అడిగితే ఇవ్వటం తప్ప. తర్వాత కొన్నాళ్ళకు ఈ కథ చదివిన టైటానిక్ సురేశ్ గారు సారంగకు పంపమన్నారు. పంపాను. ప్రచురించారు. పొలిటికల్లీ కరెక్ట్ అనేది ఎవరు నిర్ణయిస్తారు? మగవాడు బాధితుడుగా ఉండటం పొలిటికల్లీ కరెక్టా కాదా అనేది పక్కన పెడితే, ఎన్నో మహిళా పోలీస్ స్టేషన్లలో ఇలాంటి కథలు సమాధి అయిపోవటం నాకు తెలుసు. ఈ కథ లోని ‘వాడు’ నిజానికి సూసైడ్ చేసుకున్నాడు. కథలో వాడి మరణాన్ని నేను రాయదలుచుకోలేదు.
ప్రశ్న 7: ‘మేఘమాల’లో కూడా స్త్రీ పాత్రను ప్రత్యేకంగా ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం కల వ్యక్తిగా తీర్చిదిద్దారు. పైగా కథ సినిమా ప్రపంచానికి చెందినది కూడా. ఇంతవరకూ సినిమా ప్రపంచంలోని మహిళల ఆధారంగా వచ్చిన రచనలలోని స్త్రీ పాత్రలకు పూర్తిగా భిన్నమైన పాత్ర. సినిమా వ్యవస్థలోని అభద్రతా భావాన్ని, స్వార్థాన్ని, నైచ్యాన్ని చూపుతూ కూడా, ఎక్కడా నెగటివ్ భావన రాకుండా, ఇది జీవితం అని ఆమోదించేట్టు చేస్తూ, నాయిక పాత్రను అత్యుత్తమ వ్యక్తిత్వంతో తీర్చిదిద్దారు. ఈ కథారచన ప్రక్రియను తెలపండి. నాయిక పాత్రకు ప్రేరణ గురించి కూడా చెప్పండి.
జ: సినిమా ప్రపంచం పైన బయట సదభిప్రాయం లేదు. ముఖ్యంగా సినిమాలో పనిచేసే మనుషుల వ్యక్తిత్వాల మీద రాళ్లు విసరటంలో సినిమా ఆవలి సమాజానికి ఒక పైశాచిక ఆనందం ఉంటుంది. నేను సినిమాలలో పని చేయటం మొదలుపెట్టాక, సినిమా ప్రపంచాన్ని అర్థం చేసుకోవటంతో పాటు అందులోని డైమన్షన్స్ను, అవసరాలను, అభద్రతను, ఆ లైట్ల నేర్పే జీవిత సత్యాలను కథగా రాశాను. నాయిక పాత్ర ప్రేరణ చాలా మంది ఉన్నారు. భవిష్యత్తులో ఉంటారు కూడా. ఇంతవరకూ సినిమా ప్రపంచంలోని మహిళల ఆధారంగా వచ్చిన రచనలలోని స్త్రీ పాత్రలకు పూర్తిగా భిన్నమైన పాత్ర అని మీరన్నారు. కానీ నిజానికి సినిమా రంగంలోని స్త్రీలు చాలా అత్యుత్తమ వ్యక్తిత్వంతో ఉంటారు. వాళ్ళే సర్వైవ్ అవుతారు.
ప్రశ్న 8: ‘వాంటేజ్ పాయింట్’ కథలో మీరు మానవత్వానికి మంచితనానికి పెద్దపీట వేశారు. కానీ ఇది విష్ఫుల్ థింకింగ్ కాదా?
జ: విష్ఫుల్ థింకింగ్ అనుకున్నా అభ్యంతరం లేదు. ఆ పాత్రలు అలాగే ఉండాలని, అలాగే ప్రవర్తించాలని నేను బలంగా అనుకున్నాను. అదే రాశాను. మంచితనం, మానవత్వం కథల్లో ఉండాలని అనుకోలేదు కానీ.. అన్ని సార్లూ దుర్మార్గం రాయలేకపోవటం కూడా ఒక కారణం కావచ్చు.
ప్రశ్న9: ‘చీకటి’ కథ చదివిన తరువాత ఇక ముందుకు వెళ్ళాలనిపించని ఒక ఇనెర్షియా కలుగుతుంది. ఈ కథా రచనకు ప్రేరణ, కథ అల్లిన విధానం, ఎక్కడా తీర్పులు చెప్పని సమతౌల్యం ఎలా సాధించారు?
జ: తీర్పు చెప్పటానికి నేనెవరు? ఈ కథకు ప్రేరణ మదనపల్లె సంఘటనతో పాటు ఇరవై ఏళ్లలో నేను చూసిన, చదివిన, మాట్లాడిన మానవ మస్తిష్కం లోని గ్రే ఏరియా. కథ అల్లిన విధానం అయితే నిజంగా నాకు కూడా తెలీదు. ఇలా రాయాలి అనుకుని రాసుకుంటూ పోయాను. ఈ కథ రాసినప్పుడు నేను నేనుగా లేను. ఆ ఉన్మాద స్థితి ఏ కథ రాసినప్పుడు నాకు కలగలేదు. కథ రాసి పూర్తి చేసిన తర్వాత చింపేద్దాము అని అనుకున్నాను. రెండ్రోజులు నా ఆలోచనా విధానం కూడా చాలా డిస్టర్బ్ అయ్యింది.
ప్రశ్న 10: మీ కథలన్నీ చదివిన తరువాత కొట్టొచ్చినట్టు కనిపించేది సమతౌల్యం. ఒక రకమయిన సమన్వయ భావన. మీ కథలన్నీ నిత్య జీవితంలోంచి వచ్చాయన్న నమ్మకం కలుగుతుంది. మీరు ఈ అంశం గురించి కథ రాయాలని ఎలా నిర్ణయించుకుంటారు? నిర్ణయించుకున్న తరువాత కథనెలా రాస్తారు?
జ: సమతౌల్యం అన్నది ప్రశంసగా తీసుకుంటున్నాను. సిస్టమాటిక్గా జీవించటం నాకు తెలియకుండా నాకు అలవాటైన జీవన విధానం. బహుశా అందుకే నా కథలు అలా ఉన్నాయేమో. నేను ఇలా అనుకుని.. ఇలా ఉండాలి.. అని అయితే రాయలేను. ఒక సంఘటన, ఒక వార్త, ఒక మనిషి ప్రవర్తన, ఒక సంభాషణ లోంచి ఒక ఐడియా వస్తుంది. కొన్నాళ్ళ పాటు అది లోపల తిరుగుతూ ఒక రూపానికి వచ్చాక ఇక రాయకుండా ఉండలేని ఒక అవస్థ కలిగినప్పుడు రాస్తాను. కథను రాసేటప్పుడు ఒకే ఫ్లో లో రాస్తాను. వాయిదాల పద్ధతిలో రాయలేను. తర్వాత ఎడిట్ చేసుకుంటాను. తెలిసిన వాళ్ళకు పంపి అభిప్రాయం అడుగుతాను. సూచనలు నాకు అంగీకారమైతే స్వీకరిస్తాను. ఇది అహంకారం కాదు. నాకు తెలిసిన ఆ కథ వాళ్ళకు తెలియకపోవచ్చు. పొలిటికల్లీ కరెక్ట్ లేదా కాదు అనే అభిప్రాయం అవతలి వ్యక్తికి ఉండవచ్చు. నాకు కరెక్ట్ అనిపిస్తే అదే ఉంచుతాను. నా కథలు పత్రికలలో ప్రచురితం కాలేదు. ఈ సంకలనం లోని నాలుగు కథలు డైరెక్ట్గా ప్రచురించినవి. రైటర్స్ మీట్ ద్వారా ప్రచురించిన ‘కొత్త కథ’ సంకలనాలు, వెబ్ మాగజైన్స్, కొంతమంది రచయితలను ప్రోత్సహిస్తూ అన్వీక్షికి ప్రచురించిన సంకలనాలలో మాత్రమే నా కథలు వచ్చాయి.
ప్రశ్న11: మీ వ్యక్తిత్వం మీ కథలనెలా ప్రభావితం చేస్తున్నది?
జ: నా వ్యక్తిత్వమే నా కథలలో నా పాత్రల పట్ల సహానుభూతిని కలిగి కథను రాయిస్తుంది అనుకుంటున్నాను. అలా అని నా కథల్లో పాత్రలు నా వ్యక్తిత్వం అని చెప్పటానికి లేదు. నిజానికి నా వ్యక్తిత్వం ఇదీ అని నేను అనుకున్నట్లు అవతలి వాళ్ళకు గోచరించటం అసాధ్యం.
ప్రశ్న12. కథా రచనలో మీ లక్ష్యం ఏమిటీ? ఈ సంకలనంలోని కథలు ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తున్నాయని మీరు భావిస్తున్నారా?
జ: అసలు నాకు కథా రచన లక్ష్యాలు అంటూ ఏమీ లేవు. నా కథా రచన నాతో నేను చేసుకునే స్వీయ భావ ప్రకటన. ఇంకో రకంగా వ్యాపకం. సినిమా రచయితగా, దర్శకుడిగా రాయటం ఒక అవసరం.
ప్రశ్న13. ఈ కథల్లో ఏదైన ఒక్క కథ, మీకు బాగా నచ్చిన కథను ఎన్నుకోమంటే ఏ కథను ఎన్నుకుంటారు?
జ: చీకటి. నిస్సందేహంగా.
ప్రశ్న14. ఏ కథ రాయటానికి మీరు ఎక్కువ కష్టపడ్డారు? ఎందుకు?
జ: ‘నాలుగొందల తొంబై ఎనిమిది’. ఆ కథ నాకు చాలా పర్సనల్.
ప్రశ్న15. ఏ కథను సునాయాసంగా రాశారు?
జ: ‘జింగిల్ బెల్స్’. ‘ఇన్ ద మూడ్ ఫర్ లవ్’ కథా సంకలనానికి రాసిన కథ. అప్పటికే అది సర్పయాగం లాంటి ఒక సినిమా కథగా చేద్దామని అనుకున్న ప్లాట్. అప్పుడే శ్రీదేవి నటించిన ‘మామ్’ సినిమా రావటంతో కథలో ప్లాట్ దాదాపు ఒకటే అవ్వడంతో సినిమా స్క్రిప్ట్ రాయటం ఆపేశాను. ఆ ప్లాట్తో రాసిన కథ ఇది.
ప్రశ్న16. మీరు కథల్లో మాండలికం వాడినా బూతులు ఎక్కడా కనబడవు. ఇది మీరు కావాలని వాడలేదా? కథల్లో మాండలికం వాడకంపై మీ అభిప్రాయం ఏమిటి?
జ: ‘సాయమ్మ’, ‘పుష్పలత నవ్వింది’, ‘సవర్లకొండ’ ఆ ప్రాంతంలో జరిగే కథలు. ఒక్క ‘పుష్పలత నవ్వింది’ తప్ప మిగతా రెండు కథలు వాడుక భాషలో మాండలికాన్ని కలిపి వ్రాసిన కథలు. మాండలికంలో బూతులు ఉండాలని నేను అనుకోలేదు. ఆ కథలకు అవసరం పడలేదు కూడా. కథల్లో మాండలికం వాడకం అవసరాన్ని బట్టి, ఆ కథా వాతావరణాన్ని బట్టి ఉంటుంది. ఉండాలి. అప్పుడే మన పొరుగునే మాట్లాడుకునే మన మాతృభాషలోని మనకు తెలియని సౌందర్యం మనకు తెలుస్తుంది. బలవంతంగా వాడే లేదా రుద్దే మాండలిక కథలు కాలానికి నిలబడకపోవచ్చు.
ప్రశ్న17. సినిమా స్క్రిప్టు రచనానుభవం, సినిమా దర్శకత్వానుభవాలు మీ కథా రచనపై ఎలాంటి ప్రభావం చూపాయి?
జ: ముందు నేను కథలు రాసాను. తర్వాత సినిమాలకు వ్రాసాను. తర్వాత నేను సినిమాలు తీసేటప్పుడు కథా రచన స్క్రిప్టు, దర్శకత్వంలో నాకు చాలా ఉపయోగపడింది. ముఖ్యంగా రాసిన దానిని దృశ్యంగా మలచటంలో డీటెయిలింగ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. స్క్రిప్టు రాయటంలో కథా రచన డీటెయిలింగ్.. నాకు, నాతో పనిచేసే టెక్నీషియన్లకు, నా టీమ్కు చాలా ఉపయోగకరంగా ఉంది.
ప్రశ్న18. ‘చున్నీ’, ‘మేఘమాల’ వంటి కథలలో ప్రధాన పాత్రలు సామాజికంగా గౌరవప్రదంగా భావించే ప్రవర్తనకు భిన్నంగా ప్రవర్తించినా మీరు ఆ పాత్రలను గౌరవంగానే చిత్రించారు. ఒకరకంగా చెప్పాలంటే, నైతికవిలువల పరిథిలో వొదిగేవారికన్నా ఉన్నతమైన వ్యక్తిత్వం చూపించారు. ఒక వ్యక్తి ఉత్తముడు, మరొకడు పతనమైనవాడు అని ఎలా నిర్ధారిస్తారు మీరు?
జ: అసలు ఉత్తమము, అథమము అనే దానిని నేను విశ్వసించను. స్థల, కాల పరిమితుల బట్టి అవి మారిపోతూ ఉంటాయి. మనిషి ఆలోచనలలోని గ్రే ఏరియాను ఏ మనిషి కూడా తన జీవితకాలంలో విశ్లేషించుకోలేడు. మనది ప్రీ కండిషన్డ్ సమాజం. అందులో అందరికీ ఆమోదయోగ్యంగా, సాటి వారిని మానసికంగా.. శారీరకంగా హింసించకుండా బ్రతికితే అదే ఉత్తమం అనుకుంటాను నేను. నైతిక విలువలు అనేవి నలుగురు మనుషులో, నలభై పుస్తకాలో, ఒక ధర్మాసనమో నిర్ణయించలేవు అనేది నా అభిప్రాయం. విచక్షణ పాళ్ళు బట్టే నైతికత. అంతే.
ప్రశ్న19. కథకుడు తీర్పులు చెప్పటం, ఉపదేశాలివ్వటం, ఆవేశం, ద్వేషం ప్రదర్శించటం అవార్డులకు రాచబాట అయిన సాహిత్య ప్రపంచంలో మీ కథలు పూర్తిగా భిన్నంగా, తీర్పులివ్వటం, ఆదర్శాలు, ఆవేశాలు లేకుండా వున్నాయి. మీ దృష్టిలో కథకుడి బాధ్యత ఏమిటి? ఒక కథకుడిగా సమకాలిక కథలపై మీ అభిప్రాయం ఏమిటి?
జ: నేను ముందే చెప్పాను. తీర్పులు ఇవ్వటానికి నేనేం అర్హత కలిగి ఉన్నాను? అవార్డులు, పురస్కారాలు మీద నాకు కొద్దిపాటి ఆసక్తి కూడా లేదు. వాటి కోసం రాసే పని చేయలేను. స్వతంత్రగా రాసుకోవాలి నేను. కథకుడి బాధ్యత వీలైతే మంచి కథ రాయటం తప్ప ఇంకేం ఉంటుంది? కథ చదివిన వారి నుండి ఒక మెచ్చుకోలు వస్తే అదే అవార్డు. నా వరకు కథ రాయటం నాకు ఇష్టమైన పని. నా వృత్తికి అవసరం. అంతే. సమకాలీన కథలను నేను జడ్జ్ చేయలేను. నాకు అంత శక్తి లేదు.
ప్రశ్న20. మీరు రాసినటువంటి కథలు, ముఖ్యంగా చీకటి లాంటివి, ఇతరులు రాస్తే వారిని కథకులుగా పరిగణించక పక్కన పెడతారు. అలాంటిది మీ కథలకు ప్రచారం లభించటం మీ స్నేహబృందం వల్ల అని కొందరు ఆరోపిస్తారు. కానీ, మీ కథలు చదివితే మీకు ఎలాంటి ఊతకర్రల అవసరం లేదని స్పష్టమవుతుంది. మీ కథలకు ఆమోదం లభించటంలో మీ స్నేహబృందం ప్రధాన పాత్ర పోషించిందంటారా?
జ: స్నేహబృందం అంటూ ఏమీ లేదు. ఎవరూ స్నేహితులు కారు. ప్రతి రంగంలో ఆయా సందర్భాలలో ఒక కామ్రేడరీ ఉంటుంది. ఈ రంగమైనా అంతే. అందరితో రోజూ కలవటం సాధ్యం కాకపోవచ్చు. సాధ్యపడిన వాళ్ళు తరుచూ కలవటం వలన వాళ్ళు స్నేహబృందంగా కొంతకాలం ఉంటారు. నా కథలకు ప్రచారం లభించి ఉంటే నా పుస్తకం ఈ పాటికి రెండవ ముద్రణకు వెళ్ళేది కదా. ఇంకా నా పుస్తక కాపీలు మిగిలే ఉన్నాయి. కలిసి పనిచేస్తాం. అభిప్రాయాలను పంచుకుంటాం. అయితే కథను అర్థం చేసుకోవటంలో, కథను రాయటంలో రైటర్స్ మీట్లో లభించిన అనుభవం నిస్సందేహంగా చాలా గొప్పది. రైటర్స్ మీట్లో కలిసే వాళ్ళందరూ ఆ రెండు రోజులు తాత్కాలిక స్నేహితులు. రైటర్స్ మీట్ ఫౌండర్ ఖదీర్ బాబు గారు నాకు స్నేహితుడు కాదు. ఆయన ఒక అన్నయ్య, తండ్రి స్థానంలో ఉండే వ్యక్తి. ఊతకర్ర సంగతి అటుంచితే, తొలి అడుగులు వేస్తున్నప్పుడు శిశువుకు కావలసిన దాపు ఖచ్చితంగా అవసరమే. అది నాకు ఖదీర్ బాబు గారు, రైటర్స్ మీట్ కల్పించాయి.
ప్రశ్న21. పుస్తక ప్రచురణలో మీ అనుభవాలేమిటి?
జ: అన్వీక్షికి ఆలోచన పుట్టినప్పటి నుండి నేను వెంకట్, మహీలతో ఉన్నాను. వీళ్ళు స్నేహితులు, నా శ్రేయోభిలాషులు. 5 ఏళ్లలో అన్వీక్షికి ప్రచురణ రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించింది. నా పుస్తకం రెండేళ్ల క్రిందటే రావాలి. కుదరలేదు. నేను సినిమాలలో బిజీగా ఉండటం కారణం. ఈ సారి మహీ పుస్తకం ‘గన్స్ అండ్ మాన్సూన్స్’తో పాటు నా పుస్తకం రావాలనుకున్నది మహీ ఆలోచన. కథలను పంపించటం తప్ప నేను చేసిందేమీ లేదు. పుస్తకం పబ్లిషింగ్ క్రెడిట్ అంతా మహీ, వెంకట్ శిద్దారెడ్డి లదే.
ప్రశ్న22. సినిమాల్లో పనిచేయటం, కథలు రాయటం.. మీకు ఏది ఎక్కువ ఇష్టం?
జ: రెండూ. కథ రాయడం వలనే నేను సినిమా తీయగలిగాను. కథల్లో డబ్బు ఉండదు. సినిమాలో డబ్బు వస్తుంది. అంతే తేడా.
ప్రశ్న23. మీ కథలు చదివితే ఒక తెలివైన కథకుడు, పాఠకుడి మనసును, మెదడును తన అదుపులోకి తీసుకుని, తాను చూపించేదే చూసి, భావించమన్నదే భావించేట్టు మెస్మరైజ్ చేయగలడని అర్ధమవుతుంది. ఇంత అత్యుత్తమ స్థాయిలో రచనలు చేసే మిమ్మల్ని నిరక్షర కథకుడు అనటం మీరు ఆమోదిస్తారా? ఎందుకని ఆమోదిస్తారు?
జ: అది అచ్చుతప్పు. ముందుమాటలో రాసినది నిరక్షరాస్య కథకుడు అని. వెనుక పేజీ అట్టమీద అది నిరక్షర కథకుడు అని అచ్చు అయింది. మీ ప్రశంసకు థాంక్ యు.
ప్రశ్న24. మీరు ఇంకా ఎలాంటి కథలు రాయాలనుకుంటున్నారు?
జ: రెండు నవలలు రాయాలి అనుకుంటున్నాను. వాటి ఇతివృత్తాలు మనసులో ఉన్నాయి. కథలు అంటే ఇంతకు ముందు చెప్పినట్లు.. అనిపించినప్పుడు, రాయకుండా ఉండలేనప్పుడు రాస్తాను.
ప్రశ్న25. మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? ఇటు సాహిత్య ప్రపంచంలో, అటు సినిమా రంగంలో?
జ: ప్రణాళిక లేదు. ఒప్పుకున్న మూడు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ చేయాలి. అవి మరింత పని కల్పిస్తే ఆ పని చేయాలి. ఈ సంవత్సరం రెండు సినిమాలు తీయాలి అన్నది ఇప్పుడు నా ముందున్న పని. ఆ పనులు జరుగుతున్నాయి.
సాహిత్యప్రపంచం వంటి పెద్ద మాటలు నాకు ఇష్టం లేవు. నేను అందులో ఇమడలేను. అనిపించినప్పుడు రాయటం తప్ప ప్రణాళికలు అంటూ ఏమీ లేవు. నవలలు కూడా ఎప్పుడు రాస్తానో తెలీదు. ఖచ్చితంగా రాస్తాను.
~
సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు కరుణకుమార్ గారు.
కరుణకుమార్: సంచిక టీమ్కి నా ధన్యవాదాలు.
***
సవర్లకొండ, ఇతర కథలు (కథాసంపుటి)
రచన: కరుణకుమార్
ప్రచురణ: అన్వీక్షికి ప్రచురణలు
పేజీలు: 165
వెల: ₹ 200/-
ప్రతులకు:
అన్వీక్షికి ప్రచురణలు, హైదరాబాద్. ఫోన్: 097059 72222
ఆన్లైన్లో:
https://www.amazon.in/SAVARLAKONDA-Stories-by-Karuna-Kumar/dp/B0DQCNP8DC
~
‘సవర్లకొండ, ఇతర కథలు’ కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/savarlakonda-book-review-kmk/