[‘జీవితమొక పయనం’ అనే నవల వెలువరించిన శ్రీ జిల్లేళ్ళ బాలాజీ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం జిల్లేళ్ళ బాలాజీ గారూ.
జిల్లేళ్ళ బాలాజీ: నమస్కారం.
~
ప్రశ్న 1: మీ తొలి స్వంత నవల ‘జీవితమొక పయనం’ వెలువరించినందుకు అభినందనలు. మొదటి స్వంత నవలను ప్రచురించటం ఆలస్యమైనట్టు అనిపిస్తోందా?
జ: ఈ ఆలస్యానికి కారణం నేనే. 1983 నుండి కథలు రాస్తున్నప్పటికీ నేనేనాడు సొంతంగా నవల రాయాలని అనుకోలేదు. అందుకు ముఖ్యమైన కారణం, కథలు రాయటమంటేనే నాకిష్టం. నవల రాయటానికి ఎప్పుడూ నేను ప్రయత్నించలేదు. పైగా నవలకు విస్తారమైన కాన్వాస్, చాలా సమయం వెచ్చించాలన్నది నా అభిప్రాయం.
ప్రశ్న 2: మీకు కథా రచయితగా, అనువాదకుడిగా మంచి పేరుంది. ఎన్నో నవలలను తెలుగులోకి అనువదించారు. తొలిసారిగా మీ స్వీయ నవలను ప్రచురించటంలోని అనుభవాలు, అనుభూతులను వివరిస్తారా? మీ సాహితీ ప్రస్థానం గురించి చెప్పండి.
1990లో జాగృతి వారపత్రిక నిర్వహించిన కథల పోటీలో నా కథకు (శత్రు సంహారం) కన్సోలేషన్ బహుమతి లభించింది. కథను ప్రచురించటమే కాక, ఆ పత్రికవారు తాము తీసుకొచ్చే ప్యాక్డ్ఫుడ్స్ ప్రత్యేక సంచిక కోసం ఓ కథను రాయమని ఉత్తరం రాయటంతో నేను రాసిన కథను (ఎర్ర తివాచీ) ప్రత్యేక సంచికలో ప్రచురించటం మరువలేనిది.
2000లో సుప్రభాతం వారపత్రికవారు కథల పోటీ పెడితే నేను యాంటీ నక్సలిజంపై కథ (నలుగురిలో ఒకడు) రాయగా దానికి తృతీయ బహుమతి లభించింది. కానీ దాన్ని చదివి, ‘‘తిరుపతిలో నివసించేవారికి నక్సలిజం గురించి ఏం తెలుసు?’’ అంటూ ఓ పాఠకుడు తీవ్రమైన విమర్శ చేశాడు. ఒక సమస్య గురించి కథ రాయాలంటే ఆ సమస్యను ఎదుర్కొనేవారే రాయాలన్న నిబంధనేమీ లేదనీ సమస్యను ఫీల్ అయ్యేవారు కూడా కథ రాయచ్చని పత్రికకు ప్రత్యుత్తరం రాశాను.
2012లో నేను రాసిన సీరియస్ కథకు (సిక్కెంటిక) విశేష బహుమతితో పాటు చాలా ప్రశంసలూ దక్కాయి. ఆ వెంటవెంటనే వరుసగా ఒక హాస్య కథకు (కాస్ట్లీ దొంగలు) విశేష బహుమతీ, సరసమైన కథకు (పరిష్కృతం) పదివేల రూపాయల బహుమతీ వచ్చాయి. ఆ తర్వాత సాహస కథకు (పరిరక్షణ) పదివేల రూపాయల బహుమతీ అందుకున్నాను. చెప్పొచ్చేదేంటంటే ఈ విషయంలో నాకు సీనియర్ ఎన్టీఆర్ గారే ఆదర్శం. నటుడుగా ఆయన అన్ని రకాల పాత్రలు ధరించినట్టుగానే రచయితగా నేను అన్ని రసాల కథలూ రాయాలన్నదే నా అభిమతం.
2014లో నా కథ (తోబుట్టువు) కన్నడంలోకి అనువదింపబడి కన్నడనాట నిర్వహించబడిన అనువాద కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందటం నాకెంతో ఆనందాన్ని కలిగించించింది. నా కథ అన్యభాషలోకి అనువదింపబడటం అదే మొదటిసారి. తర్వాత సిక్కెంటిక కథ ఆంగ్లంలోకి అనువదింపబడింది. సజీవం కథ తమిళంలోకి తర్జుమా చెయ్యబడింది.
2021లో మన ‘సంచిక’లో నా బాల్యస్మృతులను (పగడాలు.. పారిజాతాలూ) సీరియల్గా వేశారు. ఆ తర్వాత అలాంటి రచనలు ఊపందుకున్నాయని ఘంటాపథంగా చెప్పగలను.
నేను నవల రాసే సమయానికి వందకు పైగా కవితలు, 150 కి పైన కథలూ రాయటం పూర్తిచేశాను.
2020లో కోవిడ్ ఇండియాలోకి ప్రాకి ఒక విచిత్రమైన పరిస్థితిని మనం ఎదుర్కొన్నాం. ఎక్కడికీ వెళ్ళకూడని ఆంక్షలు, ప్రయాణాలు చెయ్యకూడదన్న నిర్బంధం, క్వారంటైన్ సెంటర్లు, రెడ్ జోన్లు.. మొత్తానికి అలా ఇంట్లోనే బంధీలయ్యే కఠినమైన నిబంధనలు అమలవుతున్నాయి. అప్పుడు నాకు నవల రాయాలన్న సంకల్పం ఏర్పడిరది.
నా అనుభవాలకు కొంత కల్పనను జోడించి నవల రాయటం పూర్తి చేశాను. దాన్ని ఒక నవలల పోటీకి పంపాను. ఆ నవలను చదివిన జడ్జి నవల బాగుందనీ, కానీ చివరన అర్థాంతరంగా ముగిసినట్టుగా ఉందనీ, కనుక మరింత పెంచి రాయమనీ సలహా ఇచ్చారు. దాంతో మరో 11 చాప్టర్లు పెంచి రాయటం జరిగింది. నాకు మొదటి నుండీ నేను రాసే నవల వారం వారం సీరియల్గా రావాలని కోరిక ఉండేది. అది ‘సంచిక’ తీర్చింది. దాదాపు ఆరునెలలు సీరియల్గా ప్రచురించింది. ఈ సందర్భంగా అప్పటిదాకా సాహిత్యమే చదవని వాళ్లను సైతం ‘సంచిక’ చదివేలా చేశాను. వారం వారం నా సీరియల్ కోసం వాళ్లను ఎదురుచూసేలా చేశాను.
ప్రశ్న 3: దాదాపు ఇరవైకి పైగా నవలలను తెలుగులోకి అనువదించారు. అనువాద నవలల సరళి వాటి రచనా సంవిధానం మీ సొంత నవల వ్రాయడంలో ఏమైనా ప్రభావం చూపాయా?
జ: నేను 2002 నుండి అనువాదాలు చెయ్యటం మొదటుపెట్టాను. అనువాదాలు చెయ్యటం యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన. మా పెద్దక్క తమిళంలో డిటెక్టివ్ నవలలు విరివిగా చదివేది. నేను కథలు రాస్తుండటాన్ని గమనించి ఓరోజు రాజేష్కుమార్ గారి డిటెక్టివ్ నవలలాంటి నవలను రాయమని కోరింది. నాకు డిటెక్టివ్ సాహిత్యం రాయటం ఇష్టం లేదన్నాను. నీకూ తమిళం వచ్చు కనుక ఈ డిటెక్టివ్ నవలనే తెలుగులోకి అనువదించమని సలహా ఇచ్చింది. అలా మొదట్లో నేను వరుసగా 3 డిటెక్టివ్ నవలల్ని అనువదించాను. ఆ తర్వాత తిరుపతికి మకాం మార్చాక అక్కడి మిత్రులు ‘కాలక్షేపం కోసం రాసే సాహిత్యం ఎందుకూ పనిరానిదని, జయకాంతన్ నవలను అనువదించ’మని కోరారు. అలా నేను ‘కల్యాణి’ నవలను అనువదించగా దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. దాంతో వరుసగా నేను సీరియస్ నవలలను అనువదించాను. జయకాంతన్ గారివి 4 నవలలు, రెండు నవలికలు, ఎస్.రామకృష్ణన్ నవలలు రెండు, ఒక కల్కి నవల, ఇమయమ్ రాసిన మరో నవల, వచన రామాయణం, 130 కి పైగా కథలూ తెలుగులోకి అనువదించాను.
నేనెప్పుడూ ఏదైనా కథో, నవలో అనువదిస్తున్నప్పుడు సొంత రచనలు ఏవీ రాయను. అలాగే సొంతంగా ఏవైనా రచనలు చేస్తున్నప్పుడు దేన్నీ అనువదించను. ఇలా చెయ్యటం వల్ల ఒకదానిపై ఒకటి ప్రభావం చూపించే అవకాశం ఉండదని నమ్ముతాను. ఇంకో ముఖ్యమైన విషయం పఠనం అంటూ జరిగేది ఏమీ రాయనప్పుడే, అదీ తెలుగు సాహిత్యమే చదువుతాను. ఏది అనువాదం చెయ్యాలనుకుంటానో అప్పుడు మాత్రమే దాన్ని చదువుతాను. ఇది నా పద్ధతి. ఇక నేను అనువదించినంత మటుకు జయకాంతన్ గారిది ఒక సరళి, ఎస్.రామకృష్ణన్ గారిది మరో స్టైల్. కల్కి గారిది ఇంకోటి, ఇమయమ్ గారిది మరోదారి. వాటినంతా నేను ఆస్వాదిస్తూ అనువదిస్తాను. వాటినంతా అనువదిస్తున్నంత వరకూ మాత్రమే మనసులో ఉంచుకుంటాను. తర్వాత ఏదీ మనసులో దాచుకోను. అయితే ఇందులో ఎస్.రామకృష్ణన్ గారి నవలా పద్ధతి నాకు నచ్చింది. ప్రతి చాప్టర్కూ ఒక శీర్షికను పెట్టటమనే పద్ధతి నాకూ బాగా నచ్చింది. ఇది పాఠకులను నవల చదివేందుకు ఆకర్షించగలదని నమ్మాను. అందుకని ఆ పద్ధతిని నా నవలలోనూ ఉపయోగించాను. ఇది మన తెలుగులోనూ ఎన్నో ఏళ్ల క్రితం నుండే ఉంది.
ప్రశ్న 4: ‘జీవితమొక పయనం’ మీ జీవిత కథేనని సామాజిక మాధ్యమాలలో వెల్లడించారు. మొదటి నవలనే ఆత్మకథాత్మక నవలగా వెలువరించటంలో – సంశయాలు, సంకోచాలు లాంటివి ఏమైనా ఎదురయ్యాయా? వ్యక్తిగత గోప్యతకి భంగం కలగకుండా, జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను, కీలకమైన వ్యక్తులను ప్రస్తావించుకుంటూ, ‘నొప్పించక తానొప్పక’ అన్న రీతిలో రాయడం కష్టమైందా?
జ: ‘జీవితమొక పయనం’ నవల ఆత్మకథ కాదు. ఆత్మకథలో అన్నీ వాస్తవ సంఘటనలే రాయాలి. అలా రాయటం అంత సులభం కాదు. పైగా ఆత్మకథలో వాస్తవ సంఘటనలను ఆధారాలతో సహా రాయవలసి ఉంటుంది. అంతేకాదు, ఆత్మకథ రాయటానికి నేను అంతో ఇంతో ప్రముఖ వ్యక్తై ఉండాలి. ఏదైనా రంగంలో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండాలి. అలాంటి వ్యక్తిని కాను, నేనొక సామాన్యమైన వ్యక్తిని, నేను ఆత్మకథ రాస్తే ఎవరూ చదవరు. అయితే నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను సందర్భానుసారం ఈ నవలలో పొందుపరిచాను. కొంత కల్పితం కూడా రాశాను. ఇది రెండూ కలగలిసిన రచన ఈ నవల. దీనికి మీరు ఆత్మకథాత్మక నవల అని పేరు పెడితే నాకేమీ అభ్యంతరం లేదు.
ప్రశ్న 5: ఆత్మకథాత్మక నవల కాబట్టి, నిజ జీవిత ఘటనల నడుమ కాల్పనిక సన్నివేశాలు జొప్పించలేరు. నవలా పఠనం ఆసక్తికరంగా ఉండటానికి ఏమేం చేశారు?
జ: పాఠకులకు ఇది ఆత్మకథ కాదు అన్న భావన ప్రారంభంలోనే కలిగించటానికి ఒక నిరుద్యోగి ఏ ఉద్యోగమూ దొరక్క జీవితంలో విసిగి వేసారి ఇంటి నుండి పారిపోయినట్టుగా నవల మొదలుపెట్టాను. ఇది నవలపై ఆసక్తిని కలిగించిందని నమ్ముతున్నాను. సో, కన్యాకుమారికి పారిపోయిన కథానాయకుడు ఏ ఉద్దేశంతో వెళ్లాడో అది నెరవేరిందా లేదా అని వెంటనే చెప్పకుండా కన్యాకుమారి పరిసర ప్రాంతాల విశిష్టతలను, సంఘటనలను బాగా ఆసక్తికరంగా ఉండేలా చొప్పించాను. నవలలో నేను చూపించిన ప్రాంతాలన్నీ వాస్తవమైనవే. మొత్తానికి ఇది ఆత్మకథ కాదు నవల అనుకునే నేను రాసుకుంటూ ముందుకు వెళ్లాను.
ఈ నవలలో స్వామి వివేకానంద కన్యాకుమారికి వచ్చి ఓ బండరాయిపై కూర్చుని ధ్యానం చేసిన సంఘటన జరిగి వంద సంవత్సరాలు (1892-1992) పూర్తికావటం, 1992లో జరిగిన బాబ్రీమసీదు కూలదోసిన సందర్భంగా మతసామరస్యాన్ని కాంక్షిస్తూ ఓ సంఘటనను రాయటం, అలాగే 1993లో లాతూర్లో సంభవించిన భూకంపం సంఘటనను గుర్తుకు తెచ్చే విధంగా ఓ చాప్టర్ను రాయటం ఇవన్నీ ఈ నవలకు ఆకర్షణలే.
ప్రశ్న 6: మామూలు నవలల్లో ఉండే ప్రేమ, రొమాంటిక్ సన్నివేశాలను కొన్నిచోట్ల కల్పించటానికి అవకాశం ఉన్నా, మీరు ఉపయోగించుకోలేదు. ఎందుకనీ?
జ: నవల చాలా సీరియస్గా సాగుతున్నప్పుడు ప్రేమకూ, రొమాంటిక్ సన్నివేశాలకూ ఆస్కారం లేదు. కథానాయకుడు నిరుద్యోగి అయినపుడు వీటికి అవకాశమే లేదు. పైగా అనవసరం అనిపించింది. అయినప్పటికీ మాధవరెడ్డి గారి అమ్మాయి ఇతని పట్ల ఉన్న ప్రేమను అంతర్లీనంగా, పరోక్షంగా మాత్రమే చెప్పాను. ఆపైన చెబితే అది కథానాయకుడి లక్ష్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉన్నదని పెంచలేదు.
ప్రశ్న 7: కథానాయకుడు రాఘవని ఎక్కువ శాతం కెరీర్ ఓరియెంటెడ్గానే, కుటుంబ బాధ్యతలు మోసే వ్యక్తిగా చూపించే క్రమంలో అతని పాత్ర చిత్రణలో కాస్త ఆత్మవిశ్వాసం లోపించినట్టు, అతను ఎక్కువగా అంతర్ముఖుడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరేమంటారు?
జ: ఔను. ఒక మామూలు యువకుడికి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం ఉద్యోగాన్ని సంపాదించటం. చదివిన చదువుకు తగ్గ ప్రభుత్వ ఉద్యోగం రానప్పుడు తనకిష్టమైన ఉద్యోగాన్నైనా అతను వెతుక్కుంటాడు. అలాంటిదే ఈ కథానాయకుడికి ఉపాధ్యాయుడి ఉద్యోగం లభించటం. తను జీవితంలో ఉపాధ్యాయుడుగా అడ్జెస్ట్ అయిన విషయాన్ని స్నేహితుడికి చెబుతాడు కూడా. అతని పాత్ర చిత్రణలో ఆత్మవిశ్వాసం లోపించినట్టుగా మీకు అనిపించింది అంటే, అందుకు అతను ఎదుర్కొన్న అవమానాలే కారణం. నిరాశా నిస్పృహలు అతణ్ణి చుట్టుముట్టినప్పుడు మనిషిలో ఆత్మవిశ్వాసం లోపించక ఏమౌతుంది. అలాంటి పరిస్థితుల్లో అతను అంతర్ముఖుడిగా ఉండటం కూడా సహజమే కదా.
ప్రశ్న 8: జీవితంలో ఎదిగే ప్రక్రియలో ఆర్థికపరమైన అడ్డంకులు వ్యక్తుల అభిరుచులను అణచివేస్తాయి. రాఘవ విషయంలోనూ ఇది కనబడుతుంది. పాటలు పాడటంలో అభిరుచి ఉన్నా, దాన్ని ఓ ప్రజ్ఞగా మార్చుకోలేకపోతాడు. బహుశా, జీవితంలో ఆర్థికంగా వెసులుబాటు లభించాకా హాబీలను కొనసాగించే అవకాశం ఉంటుంది. కానీ రాఘవ ఆ ప్రయత్నం చేసినట్టు అనిపించదు. ఎందువల్ల?
జ: మీ ప్రశ్నలోనే జవాబూ ఉంది. ఒక మధ్య తరగతి కుటుంబంలోని వ్యక్తులకు వ్యక్తిగత అభిరుచులు, హాబీలు ఒక స్థాయి వరకే బహిర్గతమవుతాయి. రాను రాను జీవితంలో ఆర్థికంగా నిలదొక్కుకోలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు అవన్నీ అడుగంటిపోతాయి. దాంతో వాటిని కొనసాగించే అవకాశం లేక జీవన పోరాటంలో మునిగిపోతారు. అయితే వాళ్లకు పిల్లలు పుట్టాక వాళ్ల ద్వారా తమ కోరికలను, అభిరుచులను నెరవేర్చుకునే ప్రయత్నం చెయ్యటం మనం ఎన్ని సందర్భాల్లో చూడలేదు. ఈ నవలలో రాఘవ మంచి గాయకుడైనప్పటికీ అది అతని జీవితంలో ప్రముఖ పాత్ర వహించలేకపోయింది.
ప్రశ్న9: జీవితపు ముఖ్యమైన దశలో తనకి సాయం చేసిన మాధవరెడ్డితో తరువాతి కాలంలో రాఘవ సంబంధాలు ఎలా ఉండేవి? ఆయన కూతురు సురేఖ తనని పెళ్లి చేసుకోవాలని అనుకోవటం రాఘవకు నచ్చదు. అందువల్ల ఆమెను దూరం పెట్టినట్టే, బాబాయితోనూ గ్యాప్ మెయిన్టెయిన్ చేశాడా?
జ: నిజానికి తరువాతి కాలంలో బాబాయితో సత్సంబంధాలు కొనసాగించేవాడే. కానీ ఎప్పుడైతే ఆయన కూతురు సురేఖ తనను ప్రేమిస్తోందని తెలుసుకున్న తర్వాత అది బాబాయి అబ్బాయిల మధ్య అపార్థాలకు దారి తీసే పరిస్థితులు ఎదురవుతాయేమోనని రాఘవ భయపడ్డాడు. అందుకే సురేఖను దూరం పెట్టాలనుకుంటూనే బాబాయికి కూడా దూరమయ్యాడు. ఒకవేళ రాఘవ తామరగుంటలోనో, హైదరాబాద్లోనో ఉండుంటే రాఘవ పరిస్థితులకు లొంగిపోయేవాడో ఏమో? కానీ ఒక స్థిర నిర్ణయం తీసుకున్నాక అతను మళ్లీ వెనక్కు తిరిగి చూడలేదు.
ప్రశ్న 10: రాఘవ ఓ కిరాణా కొట్టు అతనికి ‘తండల్’ పద్ధతిలో అప్పు ఇస్తాడు. ఈ తండల్ పద్ధతి స్థానికమా? అంటే చిత్తూరు జిల్లా, తమిళనాడు సరిహద్దులలో వ్యవహరించే పదమా? దీని గురించి వివరిస్తారా?
జ: నిజానికి నాకు ఆ పదానికి అర్థం కూడా తెలియదు, అసలది తెలుగా తమిళమా కూడా తెలియదు. ఇప్పుడైతే మైక్రో ఫైనాన్స్, పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్ వంటివి జోరున తెర ముందుకు వచ్చాయి కానీ, ఒకప్పుడు ఈ తండల్ పద్ధతే విస్తృతంగా అమలవుతుండేది. చిన్న వ్యాపారుల పాలిట ఈ పద్ధతి ఓ గొప్ప వరమనే చెప్పాలి. ఐదువేలు నుండి పదివేలు వరకూ అప్పు తీసుకొని రోజూ వంద రూపాయలు దాకా అప్పు చెల్లించటం అతనికి తెలియకనే జరిగిపోతుంది. వంద రోజులయ్యేసరికి అప్పూ చెల్లింపు అయిపోతుంది. ఒకసారి క్రమం తప్పకుండా చెల్లించాక ఈసారి అప్పు మొత్తాన్ని పెంచుతాడు అప్పిచ్చేవాడు. కొన్నిసార్లు లక్ష రూపాయల వరకూ అప్పిచ్చిన సందర్భాలున్నాయి.
ప్రశ్న11: హేమాద్రి చేసిన మోసాన్ని రాఘవ ఎదుర్కోలేకపోతాడు. కానీ సమాజంలో ఎక్కువమంది హేమాద్రి లాంటివాళ్లే. వాళ్ల ఆటలు కట్టించాలంటే, ఏం చేయవచ్చు?
జ: అసలు వడ్డీ వ్యాపారం చెయ్యటం ప్రమాదకరం. ఉన్న ఆదాయంతో జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. ఓ మోస్తరు ఆదాయం రెగ్యులర్గా వస్తుంటే సంతృప్తి పడాలి. అలా కాదు, ఎక్కువ వడ్డీకి ఆశపడి ఎక్కువ మొత్తం అప్పిస్తే రాబట్టుకోవటం చాలా కష్టమవుతుంది. ఈ వ్యాపారంలో బూతులు తిట్టించుకోవటమే కాదు అవసరమైతే బూతులతో పాటు కాలర్ను పట్టుకోగలిగే ధైర్యముంటేనే వడ్డీ వ్యాపారం చెయ్యాలి. లేదంటే నెత్తిన గుడ్డ వేసుకోవలసిందే. అవసరానికి అప్పు ఇస్తున్నప్పుడు బాగా తెలిసినవాళ్లకే ఇవ్వాలి. లేదంటే వాళ్లు మోసం చెయ్యటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తెలియని హేమాద్రిలాంటి వాళ్లకు ఇస్తే తర్వాత వాళ్ల ఆటలు కట్టించటం అంత సులభం కాదు.
ప్రశ్న12. రాఘవ పిల్లల ఎదుగుదల, వాళ్ల చదువులు – చాలా క్లుప్తంగా చెప్పి వదిలేశారు. సాధారణంగా మధ్య తరగతి కుటుంబాలలో, కొడుకు ఎదుగుతున్నప్పుడు – తండ్రితో వాదోపవాదాలు (రాఘవకు తన తండ్రితో జరిగినట్టు) జరుగుతాయి. ఇంట్లో ఉద్విగ్న వాతావరణం కనబడుతుంది. మీ నవలలో అటువంటివి జరిగినట్టు ప్రస్తావించలేదు. ఎందుకనీ? నవల నిడివి పెరిగిపోతుందని భావించారా?
జ: రాఘవకు 30 ఏళ్ల వయసులో ఇంట్లో నుండి పారిపోతాడు. అప్పటికే అతనికి జీవితం పట్ల చక్కని అవగాహన ఉంది. కనుక తల్లిదండ్రులతో వాదోపవాదాలకు అస్కారం లేదు. వాదాలు చేస్తాడు, కానీ అవి పరిపక్వంగా ఉంటాయి. మీకో విషయం చెబుతాను, నిజానికి రాఘవ తండ్రి మరణంతో నవల ముగించేశాను. కానీ ఓ పోటీ నిర్వాహకురాలు నవలను కొనసాగించమని చెప్పటంతో పెంచాను. అప్పటికీ నవల ఆరు మాసాల పాటు సంచికలో వచ్చింది. ఇంకా పెంచుకుంటూ పోతే పాఠకులకు విసుగు కలిగి ఎక్కడ బోర్ కొడుతుందేమోనని భావించి వాదోపవాదాల లాంటి అంశాలను స్పృశించలేదు.
ప్రశ్న13. రాఘవ తమ ఇంటిని బేరం పెట్టి, ఇల్లు అమ్ముడుపోయి డబ్బు చేతికి వచ్చేవరకూ మంద్రంగా పారే నదిలా సాగిన నవల, ఉన్నట్టుండి వడి పెంచుకుని వెల్లువలా సాగినట్టు తోస్తుంది. నవల హఠాత్తుగా ముగిసినట్టు అనిపిస్తుంది. ఎందుకని?
జ: నిజానికి మీకు అలా అనిపించటానికి చివరి పది చాప్టర్లు పెంచి రాయటమే కారణం. ప్రారంభించినప్పుడున్న స్థిమితం, మూడ్, నడక కొంత కాలం తర్వాత నవలను కొనసాగించటం వల్ల ముందున్న నడక వేగం పెరిగింది. దాంతో నవల హఠాత్తుగా ముగిసినట్టు అనిపించింది. కొత్తగా నా నవలను చదవటం మొదలుపెట్టిన కొత్త పాఠకులు అనేకమంది వెలిబుచ్చిన అభిప్రాయం ఇదే. ‘‘అప్పుడే అయిపోయిందా? మరి కూతురు పెళ్లీ, కొడుక్కు ఉద్యోగం, పెళ్లి.. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి.’’ అలా అన్నింటిని రాస్తూ పోతే నవల టివి సీరియల్ అయిపోతుంది అన్నాను. అసలు వాళ్లు అలా అడగటమే నా నవల విజయవంతమైనట్టుగా నేను భావిస్తున్నాను.
ప్రశ్న14. ఈ నవల రాయటానికి ఎంత కాలం పట్టింది? ఏదైనా సందర్భంలో చెప్పవచ్చా చెప్పకూడదా అని ఊగిసలాడి, చివరికి రాసేసిన అంశాలేవయినా నవలలో ఉన్నాయా?
జ: ఈ నవలను రాయటానికి నాకు దాదాపు ఏడాది కాలం పట్టింది. మొదటి నవల కాబట్టి సుదీర్ఘ సమయం తీసుకున్నాను. చాప్టర్లు డివిజన్ చేసుకుంటూ, రాసినదాన్ని దిద్దుతూ, హడావిడి పడకుండా స్థిమితంగా రాశాను. మొదట దీనికి పెట్టిన పేరు ‘ప్రయాణాలు ముగిసిపోవు’ అని. ఈ నవలలో నక్సలైట్ ఎపిసోడ్ ఎందుకు రాయాలి అనుకున్నాను. తర్వాత ఊహించి రాశాను. అలాగే బాబ్రీ మసీదు కూలగొట్టిన వారం తర్వాత జరిగిన ఒక కల్పిత సంఘటన రాద్దామా, వద్దా అని ఊగిసలాడాను. చివరికి రాశాను.
ప్రశ్న15. ‘సంచిక’లో ధారావాహికగా ప్రచురితమైన ఈ నవలను పుస్తక రూపంలో తీసుకు రావటంలో ఏవైనా ప్రత్యేక అనుభవాలున్నాయా? ఉంటే వివరించండి.
జ: పుస్తక రూపంలోకి తీసుకురావటానికి ప్రధానంగా ప్రింటింగ్ ఖర్చులను భరించలేకపోయాను. జయకాంతన్, కల్కి, ఎస్.రామకృష్ణన్లాంటి గొప్ప రచయితలను అనువదించిన నేను మొదటిసారి చిన్న మొత్తం కోసం తమిళంలోని ఒక పిల్లల నవలను తెలుగులోకి అనువదించాను. అలాగే నాకు పురస్కారాల రూపంలో వచ్చిన డబ్బునంతా నేను దాస్తూ వచ్చాను. అయినా డబ్బు చాలకుండా వచ్చింది. ఆ సమయంలో ప్రముఖ రచయిత సడ్లపల్లె చిదంబరరెడ్డి గారు కొంత ఆర్థిక సాయమందించారు. అలాగే కవర్ పేజీని ఫ్లిప్ కవర్గా తీసుకు రావాలనుకున్నాను. ధర విని మానుకున్నాను. అలాగే ప్రతి చాప్టర్కు ఒక బొమ్మను గీయించాలనుకున్నాను. ఒక ప్రముఖ ఆర్టిస్ట్ను సంప్రదిస్తే 51 చాప్టర్లకు లక్షన్నర అడిగాడు. కళ్లు తిరిగాయి. తమిళంలోని ఒక ఆర్టిస్టు ఎంతో గొప్పగా బొమ్మలు వేస్తున్నాడని తెలుసుకుని సంప్రదించాను. బొమ్మకు 500 అడిగాడు. 50 చాప్టర్లకు పాతికవేలు అవుతుందని 32 బొమ్మలకు కుదించాను. అయినా ఎక్కువే అవుతుందని మానుకున్నాను. ఆ సమయంలో నా దృష్టికి వచ్చిన అంశం ఏ.ఐ. (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) ద్వారా నేను ప్రయత్నించి బొమ్మలు గీయించాను. అవే ఈ నవలలో వాడటం జరిగింది. అలా ఏ.ఐ. బొమ్మలతో నిండిన తొలి తెలుగు నవలగా దీన్ని భావించవచ్చు.
ప్రశ్న16. మీ పుస్తకాలకి మీరే పేజ్మేకర్లో డిటిపి, లే అవుట్ చేసుకుంటారని తెలిసింది. ఈ నైపుణ్యం మీకెలా అబ్బింది. ప్రచురణా రంగంలో కొత్త సాంకేతికత ప్రవేశించాకా, పాత పద్ధతుల వల్ల ఏదైనా ఇబ్బంది ఎదురౌతోందా?
జ: నేను టెన్త్ ప్యాసయిందే టైపురేటింగ్ నేర్చుకున్నాను. ఇంగ్లీషు, తెలుగు రెండూ ప్యాసయ్యాను. ఆసక్తి కొద్దీ పదిహేనేళ్ల క్రితం నేను డిటిపి నేర్చుకున్నాను. దాంతో నా ప్రతి కథా నేనే పేజ్మేకర్లో టైపు చేసుకుంటాను. అలాగే కథల్నో నవలనో పుస్తకంగా తీసుకు రావాలనుకున్నప్పుడు బుక్ ఫార్మాట్ను నేనే లే అవుట్ చేసుకుంటాను. ఒక్క కవరుపేజీ మాత్రం చేసుకునే టెక్నిక్ (ఫోటో షాప్) తెలియదు. అది మాత్రం బయట చేయించుకుంటాను.
అలా కొనసాగుతున్న దశలో కొంత ఇబ్బంది ఎదురైంది. అదేంటో చెబుతాను. ఉన్నట్టుండి ఈ మధ్య అన్ని పత్రికలూ రచనలను యూనికోడ్లో పంపమని కోరుతున్నాయి. మళ్లీ మొదటి నుండి యూనికోడ్ నేర్చుకోవటం నాకిష్టం లేదు. నేను డైరెక్ట్గా తెలుగులోనే టైప్ చేసుకుంటాను. కానీ యూనికోడ్లో ఓవైపు ఇంగ్లీషులో టైప్ చేస్తుంటే అది తెలుగులోకి మారుతుంది. ఆ పద్ధతి నాకెందుకో నచ్చలేదు. కొత్తగా వచ్చే యువతరానికి అది ఉపయుక్తంగా ఉండవచ్చేమో కానీ నాకు అవసరం లేదనిపించింది. దాంతో ప్రధాన ఆదివారం సంచికలకు నేను కథలను పంపలేకపోయాను. ఇప్పుడున్న వాటిల్లో ఒక్క ‘సంచిక’ మాత్రమే పేజ్మేకర్లో టైపు చేసిన కథల్ని అంగీకరిస్తోంది. ఈ పరిస్థితుల్లో పేజ్మేకర్లో నుండి యూనికోడ్కు మార్చవచ్చని విన్నాను. అయితే అది ఎలాగో తెలియకపోతే ‘సంచిక’ సంపాదక బృందంలోని సోమశంకర్ గారు చాలా వివరంగా స్టెప్ బై స్టెప్ నాకు తెలిపారు. వారికి నా కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను.
ప్రశ్న17. కథకుడు, అనువాదకుడు, నవలా రచయితగా మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలేమైనా సిద్ధమవుతున్నాయా?
జ: భవిష్యత్తు ప్రణాళికలంటూ ఏవీ లేవండీ. నాకు తోచింది నేను రాసుకుంటూ పోవటమే. అడపాదడపా మంచి విషయం ఆలోచనకొస్తే కథగా రాస్తాను. అలా నేను కథా రచయితగా గుర్తింపు తెచ్చుకుంటే నాకంతే చాలు. అందుకే అనువాదాలు తగ్గించుకున్నాను. ఎందుకంటే అనువాదం నాకు అదనమే కానీ ప్రధానం కాదు. ‘సంచిక’ సంపాదకులు మురళీకృష్ణగారు మరో నవల రాయమని కోరారు. ఈసారి తప్పకుండా ఒక మంచి సబ్జెక్టు పైన నవల రాస్తాను.
~
సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, ‘సంచిక’ కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు జిల్లేళ్ళ బాలాజీ గారు.
జిల్లేళ్ళ బాలాజీ: ‘సంచిక’ టీమ్కి నా ధన్యవాదాలు.
***
రచన: జిల్లేళ్ళ బాలాజీ
ప్రచురణ: పార్వతి విశ్వం ప్రచురణలు
పేజీలు: 248
వెల: ₹ 300/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
~
జిల్లేళ్ళ బాలాజీ
9-535, ఓం శక్తి గుడి పక్క సందులో,
లింగేశ్వర నగర్, బైరాగిపట్టెడ,
తిరుపతి 517501
7382008979, 9866628639
gillella.balaji@gmail.com
~
‘జీవితమొక పయనం’ నవల సమీక్ష:
https://sanchika.com/jeevitamoka-payanam-book-review-kss/