[‘ఆనందతాండవం’ అనే కథాసంపుటి వెలువరించిన సాహిత్య ప్రపూర్ణ డా. కె. జి. వేణు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం డా. కె. జి. వేణు గారూ.
డా. కె. జి. వేణు: నమస్కారం.
~
ప్రశ్న 1. మీరు రచించిన 20 కథల సంపుటికి శీర్షికగా మొదటి కథ ‘ఆనందతాండవం’ పేరునే ఎంచుకోవడంలో ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?
జ: నా కథల సంపుటికి ‘ఆనందతాండవం’ అనే పేరును ఎంచుకోవడానికి కారణం, ఆ కథ ఎందరినో ఆకర్షించింది, ఆలోచింపజేసింది, నామీద ప్రశంసల వర్షాన్ని కురిపించింది. అంతేకాదు, ప్రేమ పేరుతో ఎంతో మంది ఆడపిల్లలు, ముందు, వెనక, లోతుగా, అసలు జీవితాన్ని సరైన కోణాలలో ఆలోచించకుండా తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. అలాంటి సంఘటనలను స్వయంగా చూశాక, ఆ కథను రాయాలనిపించింది. అంతేకాకుండా, భారతీయ వ్యవస్థలో వున్న వివాహం యొక్క ప్రత్యేకతను చాలా గట్టిగా చెప్పాలనిపించి ఈ కథను ఒక వేదికగా చేసుకున్నాను. నా కథలు తప్పకుండా పాఠకులను ఆనందపరుస్తాయన్న భావనతోనే నా కథల సంపుటికి ‘ఆనందతాండవం’ అనే పేరును ఖరారు చేయడం జరిగింది.
ప్రశ్న 2: ఇది మీ తొలి కథాసంపుటి. కవిగా, నాటక రచయితగా, వ్యాసకర్తగా, కథకుడిగా మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? మొదటగా ఏ ప్రకియతో సాహిత్య వ్యాసంగం మొదలుపెట్టారు? ఎప్పుడు? మీ కథా రచన గురించి వివరిస్తారా?
నా సాహిత్య ప్రస్థానం మొదట, కథతోనే ప్రారంభమయింది. నేను పదవ తరగతి చదువుతున్నప్పుడే, మా తెలుగు మాస్టారు రాళ్లబండి శ్రీనివాస్ గారు నా చేత ‘చెల్లని నాణెం’ అనే కథను రాయించారు. ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నప్పుడు కవితలు రాయడం మొదలుపెట్టాను. డిగ్రీ మొదటి సంవత్సరంలోనే రెండే రెండు పాత్రలతో ‘తిరిగి వచ్చిన వసంతం’ నాటికను రచించి, ప్రదర్శించడం జరిగింది. ఆ తరువాత డిగ్రీ రెండవ సంవత్సరంలోనే ఆకాశవాణి కడప ద్వారా నేను రాసిన నాటికలు చాలా వరకు ప్రసారమయ్యాయి. నేను ఉద్యోగంలో చేరాక మళ్ళీ కథలు రాయడం మొదలు పెట్టాను. స్వాతి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, మయూరి మొదలైన వారపత్రికలలో నా కథలు వస్తూ ఉండేవి. నేను ఎక్కువగా సామాజిక అంశాలతో మొదట్నుంచి కథలు రాస్తున్నాను. కథ ఒక పురాతనమైన సాహిత్య ప్రక్రియ. ఊహా వచ్చాక, తల్లి ద్వారా ఏ బిడ్డకైనా పరిచయమయ్యే సాహిత్య ప్రక్రియ కథ. అందుకే కథలంటే నా కిష్టం.
ప్రశ్న 3: మీకు కవితలు వ్రాయడం సులువా? కథలా? లేక నాటిక/నాటకాలా? ఎందువల్ల?
జ: రాయడం అన్నది ఇష్టమయ్యాక అన్ని ప్రక్రియలు సులువుగానే ఉంటాయి. కాకపోతే కవితను తొందరగా వ్రాయవచ్చు. కారణం కవిత నిడివి తక్కువగా ఉంటుంది. మనసులో కలిగిన భావాలను వెంటవెంటనే కాగితం మీద పెట్టే అవకాశం ఉంటుంది. కొంచెం కష్టపడ్డా, నాటకం రాస్తే, ఆ నాటక ప్రదర్శన జరిగినప్పుడు, విశేషమైనటువంటి ప్రేక్షకుల యొక్క అభిమానాన్ని స్వయంగా అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది.
ప్రశ్న 4: కథకి సంబంధించి – వస్తువు, శిల్పం, శైలి లో మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు?
జ: కథకు వస్తువు, శిల్పం, శైలి అన్నవి తప్పనిసరి అంశాలు. అన్నింటికీ తగిన ప్రాధాన్యత ఇవ్వవలసిందే. ఇవి ఎప్పుడైతే పరిపూర్ణంగా పొదగబడతాయో, ఆ కథ అజరామరమవుతుంది. ఒక సజీవ జీవనదిలా ప్రేక్షకుల హృదయాలలో శాశ్వతంగా ప్రవహిస్తుంది. వర్తమానంలో వందలాదిమంది కథలు రాస్తున్నారు. కానీ చాలామంది తమ కథల ద్వారా గుర్తించబడటం లేదు కారణం, వారి కథల్లో వైవిధ్యమైన కథా వస్తువు లేకపోవటం, వారికంటూ ఒక ప్రత్యేకమైన శైలి లేకపోవడమే, కథా రచనలో శిల్పం యొక్క ప్రాధాన్యతను వాళ్లు గుర్తించక పోవడం.
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, మల్లాది రామకృష్ణ శాస్త్రి, అల్లం రాజయ్య, అబ్బూరి ఛాయాదేవి, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, చాగంటి సోమయాజులు, కాళోజీ నారాయణరావు, పెద్దిబొట్ల సుబ్బరామయ్య, కేతు విశ్వనాథరెడ్డి, మొక్కపాటి నరసింహశాస్త్రి.. ఇలా మొదలైన సుప్రసిద్ధ రచయితలు అందరూ కూడా, కథా రచనలో ప్రత్యేకంగా గుర్తించబడడానికి కారణం, వారు అనుసరించినటువంటి శైలి, వారు ఎన్నుకున్న కథలు యొక్క వస్తువు, అన్నింటినీ ఒక అద్భుత శిల్పంలా మలచగలిగిన నేర్పు, ప్రధాన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు.
‘శైలి’ అన్నది రచయిత యొక్క తనదైన ఒక మార్కులాంటిది. అది సన్నివేశాల వర్ణనలో కానీ, కథకు ఎంచుకున్న వస్తువులో కానీ, కథలో వాడే భాషలో కానీ.. ఎందులోనైనా సరే ఉండవచ్చు. ఒక రచయిత అలతి పదాలతో వివరిస్తూ కథను అల్లితే, మరో రచయిత ధారాపాతమైన పదాలతో కథను కొనసాగించవచ్చు. ఒక రచయిత వాస్తవాన్ని చెప్తే, మరో రచయిత తన కథనిండా ఊహలు చేయవచ్చు. శైలి అన్నది వైయుక్తికం. అది రచయిత యొక్క వ్యక్తిగత అంశం.
విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన 35వ పుస్తక ప్రదర్శనలో ‘ఆనందతాండవం’ కథాసంపుటి ఆవిష్కరణ
ప్రశ్న 5: ‘నాన్నా! నన్నిలా పెంచండి’ కథలో యశ్వంత్ పాత్రలో వయసుకు మించిన పరిణతి వ్యక్తమవుతుంది. ఒకే కథలో మూడు సమస్యలని ప్రస్తావిస్తూ నడిపారు. ఈ కథ నేపథ్యం గురించి వివరిస్తారా?
జ: ‘నాన్న నన్నిలా పెంచండి’ కథలలో యశ్వంత్ పాత్ర చాలా వైవిధ్యమైనది. వర్తమానంలో మనమంతా గమనిస్తూనే వున్నాం. పిల్లలు చాలా తెలివితేటలతో ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ఆలోచన ధోరణి చాలా భిన్నంగా వుంటోంది. ప్రపంచవ్యాప్తంగా మేధావులుగా గుర్తించబడినటువంటి ఎందరో పిల్లల సమగ్ర విషయాలను మనం గుర్తిస్తూనే వున్నాం. నెలలు నిండిన పిల్లల ఆలోచనలు సైతం మనల్ని అబ్బురపరుస్తున్నాయి.
యశ్వంత్ ఆ కోపకు చెందిన పిల్లాడు. చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగిన వాడు. తనకు అమ్మ ప్రేమ కావాలి. తండ్రి లాలన కావాలి. అవి కరువైపోయినటువంటి, ఆ లేత మనసు పడిన బాధను, తాను గొప్పగా వ్యక్తం చేయగలిగినటువంటి ఆలోచన కలిగి వున్నవాడు యశ్వంత్. అమ్మా, నాన్నల ప్రేమకు దూరమవుతున్న పిల్లలు ప్రస్తుతం చాలామంది మన మధ్య వుంటున్నారు. అందరికీ ఒక ప్రతినిధిగా యశ్వంత్ ఈ కథలో నిలబడుతున్నాడు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ప్రధానమైన తప్పులను ఎత్తి చూపడానికి నేను ఈ పాత్రను ఒక సాధనంగా ఎన్నుకోవడం జరిగింది. మన కవులు, రచయితలు చాలా గొప్పవారు. వారు అందించిన సాహిత్య సంపద, మన పిల్లలందరికీ సంపూర్ణంగా అందాలన్నదే నా భావన. దానినే కథలో వ్యక్తపరిచాను.
ఒక పిల్లవాడు తన పుట్టినరోజుకు కొత్త బట్టలు కొనుక్కోమని తల్లిదండ్రులు చెప్పిన సరే, వినకుండా అతడు బట్టలు లేని అనాథ పిల్లలకు బట్టలను కొని ఇచ్చిన ఒక సంఘటనను నేను నేరుగా చూసిన తర్వాత, ఈ కథకు శ్రీకారం చుట్టడం జరిగింది. నా కథలలో యశ్వంత్ పాత్ర చాలా ఇష్టమైన పాత్రగా మిగిలిపోతుంది.
ప్రశ్న 6: మనిషి అంతర్మథనాన్ని చక్కగా చాటిన కథ ‘చేదు చెరుకులు’. సాధారణంగా రైతులకు ఎదురయ్యే సమస్యలను కాకుండా ఓ కొత్త పాయింట్తో అల్లిన ఈ కథ కల్పితమా? లేక మీరు గమనించిన ఘటనతో అల్లారా? ఈ కథ నేపథ్యం గురించి వివరిస్తారా?
జ: రైతులు, రైతుల వ్యవసాయం, వ్యవసాయంలో నష్టాలు, బాధలు, కష్టాలు, పండిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, దళారుల యొక్క మోసాలు.. వీటి మీద చాలా కథలు వచ్చాయి. నేను ఈ ‘చేదు చెరుకులు’ అనే కథ ద్వారా ఒక వైవిధ్యమైనటువంటి దోపిడీ ఎలా జరుగుతుందో, ఒక సామాన్యుడ్ని, తోటి సామాన్యులు, మానవత్వాన్ని మరిచి ఎలా దోపిడీ చేస్తారో.. అనే విషయాన్ని ప్రధానంగా ఈ కథలో చెప్పదలుచుకున్నాను. ఈ కథ కల్పితం ఎంత మాత్రం కాదు. నేను విశాఖపట్నం నుండి, నా తల్లిని చూడడానికి ప్రొద్దుటూరు వెళ్తున్నప్పుడు, రైలులో నెల్లూరు వరకు వచ్చి, నెల్లూరు నుంచి బస్సులో బయలుదేరాను. ఆత్మకూరు అనే ఊరు దాటిన తర్వాత, ఆ రోడ్డు మీద ఒక లారీ చెరుకులతో తిరగబడి ఉంది. వెంటనే అటు వెళ్తున్న వాహనాలన్నీ అక్కడ ఆగిపోయాయి. నేను కథలో చెప్పినటువంటి దృశ్యాలు, అన్నీ అక్కడ జరిగాయి ఆ దృశ్యాలనే సజీవంగా నా కథలో పొందుపరచడం జరిగింది మానవతా విలువలను ప్రధానంగా చెప్పడమే ఈ కథ యొక్క ఉద్దేశంగా నేను ఎన్నుకున్నాను.
ప్రశ్న 7: ‘మహాదాత’ కథలో మనుషుల ద్వంద్వ వైఖరిని కళ్ళకు కట్టారు. శ్రీనివాసరావు పాత్రకు ప్రేరణ ఎవరు? నిజ జీవితంలో మీకు తారసపడిన వ్యక్తా లేక కల్పిత పాత్రా? ఈ కథ నేపథ్యం గురించి వివరిస్తారా?
జ: ‘మహాదాత’ కథ చాలామందిని ఆలోచింపజేసింది. ఇల్లు అద్దెకు తీసుకుని, ఒకవేళ ఎవరైనా ఆ ఇంట్లో చనిపోతే, శవ సంస్కారాలు చేయటానికి, శవాన్ని ఆ ఇంటికి తీసుకురావటానికి, ఇంటి యజమానులు ఎక్కడా ఒప్పుకోవడం లేదు. ఇది నిత్యం జరుగుతున్న సత్యం. దీనినే కథలో ప్రధానంగా ప్రస్తావించాను.
వర్తమానంలో మనుషుల యొక్క ద్వంద్వ వైఖరి స్వభావాలను ఎండగట్టడంలో ఈ కథ తన విజయపతాకాన్ని ఎగురవేసిందనుకుంటున్నాను. ఉపకారాన్ని మరిచిపోయే మనుషులే ఎక్కువగా ఉన్న ఈ వర్తమానంలో ఒక మహాదాత తన జీవితాన్ని అందరికీ ఎలా త్యాగం చేశాడో వివరించడానికి ఈ కథను నేను ఎన్నుకున్నాను. అందులోనూ అతను ఒక ఉపాధ్యాయుడు. తన మరణం తర్వాత కూడా తన శరీరం, విద్యార్థులకు పాఠాలు చెప్పాలన్న ఉద్దేశంతోనే ముందుగానే తన పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి రాసి ఇచ్చినటువంటి ఉదాత్త స్వభావుడు ఈ మహాదాత. ఈ కథ కూడా కల్పితం ఎంతమాత్రం కాదు. ఆ మహాదాత స్వభావాలు కలిగినటువంటి ఒక వ్యక్తిని నేను స్వయంగా చూసిన తర్వాత, అతని అనుభవాలతో పరిచయం ఏర్పరచుకున్న తరువాత, ఆయననే కథానాయకుడ్ని చేసి ఈ కథను రచించడం జరిగింది.
ప్రశ్న 8: “మాట్లాడాలంటే అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా?”, “జీవించడమంటే జీవం లేకుండా బ్రతకడమా?” ఈ వాక్యాలు నేటి కుటుంబాల తీరుతెన్నులని, సమాజపు పోకడలని చెప్పకనే చెప్పాయి. ‘మేనత్త తల దువ్వుతోంది’ కథలో సత్యవతి లాంటి వాళ్ళు నేటి కాలంలో ఇమడగలరా అన్న సందేహం కలిగినా, ఆమెను ప్రేమించి, ఆమె ప్రేమను పొందేవారు దొరకడం ఆమెకి తృప్తినిచ్చినట్టే, పాఠకులకూ తృప్తినిస్తుంది! ఈ పాత్ర రూపకల్పన గురించి చెప్తారా?
జ: కుటుంబాలలో ఒకప్పుడు మనుషుల మధ్య ఎలాంటి సంబంధాలు ఉండేవి, మరి ఇప్పుడు ఈ వర్తమానంలో, సాంకేతికపరంగా ఎంతో అభివృద్ధి సాధించినటువంటి ఈ నేపథ్యంలో, ఆ మానవ సంబంధాలు ఎలా మృగ్యంగా మారిపోతున్నాయో ప్రధానంగా ఈ కథలో చెప్పడం జరిగింది. ఒకే ఇంట్లో తల్లి, తండ్రి, పిల్లలు, అందరూ కలిసి, ఆనందంగా భోంచేయడం కుదరని పరిస్థితులను, ఈ వర్తమానంలో మనం చూస్తూ వున్నాం. వాటిని జీర్ణించుకోలేకపోయింది మేనత్త సత్యవతి. కుప్పకూలుతున్న మనుషుల నైతిక విలువలను గురించి మరోసారి గుర్తు చేయడానికి సత్యవతి పాత్రను ఒక పనిముట్టుగా నేను ఈ కథలో వాడుకున్నాను. మనుషుల మధ్య ఆర్థిక సంబంధాలు రోజురోజుకు బలపడుతున్న నేపథ్యంలో, ఈ ఆర్థిక బంధాల కంటే మానవత్వాన్ని నిలబెట్టే, ప్రేమ ఆప్యాయత బంధాలు చాలా గొప్పవని నిరూపించే మార్గంలో ఈ కథ నడవడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సత్యవతి పాత్ర మనషుల మధ్య ఇమడడం కష్టమైనా సరే, తమ ప్రయత్నాలను మాత్రం మానకూడదు. ఆ ప్రయత్నాల ఫలితమే, సత్యవతి అనాథ పిల్లలకు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వగలిగిన మేనత్తగా మిగిలిపోయింది. ఆ పాత్రలో సజీవంగా మా సొంత మేనత్తే నాకు కనపడుతుంది.
‘ఆనందతాండవం’ కథాసంపుటికి గిడుగు రామమూర్తి జాతీయ పురస్కారం అందుకుంటున్న రచయిత
ప్రశ్న9: ‘మబ్బుల్లో మందహాసం’ చక్కని కథ. శంకరం లాంటి వ్యక్తులు అసలు ఉన్నారా? ఉంటే ఈ కథలో చెప్పినట్టు ప్రవరిస్తారా? లేదూ, ప్రస్తుత కాలంలో, సమాజంలో శంకరం లాంటి వాళ్ళుంటే బాగుంటుందనిపించి, ఆ పాత్రని సృష్టించారా?
జ: నిజమే ‘మబ్బుల్లో మందహాసం’ కథలో శంకరం పాత్ర సృష్టించబడింది. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషుల అవసరం ఈ సమాజానికి చాలా ఉంది. ఆ అవసరాన్ని పూర్తి చేయడానికి ఈ కథను నేను రాశాను. అంతేకాదు, కథలో ఇద్దరు వృద్ధదంపతులు శంకరాన్ని చేరదీయడం, చనిపోయిన తమ కొడుకును శంకరం పాత్రలో చూసుకోవడం.. ఈ సన్నివేశాలన్నీ కథను చాలా బలంగా నడిపించడానికి దోహదపడిన అంశాలుగా నేను భావిస్తున్నాను.
ప్రశ్న 10: “బాధపడడం జీవితంలో ఒక భాగం మాత్రమే. అంతేకానీ, బాధపడటం ఒక్కటే జీవితం కాదు..” అన్న ఈ వ్యాఖ్య సునంద వ్యక్తిత్వాన్ని హృద్యంగా ప్రదర్శిస్తుంది. ‘మా తల్లి బంగారం’ కథ వెనుక నేపథ్యం వివరిస్తారా?
జ: జరిగిన నష్టాన్ని తలుచుకుంటూ జీవితాంతమూ కన్నీళ్లను మోస్తూ, రాత్రి, పగలు దుఃఖిస్తూ, తన జీవితాన్ని క్రుంగదీసుకునే సామాన్యమైన మహిళ మనస్తత్వానికి విరుద్ధంగా ‘మా తల్లి బంగారం’ కథలో ‘సునంద’ మనస్తత్వం మనకు కనిపిస్తుంది. చెప్పాలంటే తనకు చాలా అన్యాయం జరిగింది. తాళి కట్టిన వాడు, దాంపత్య బంధానికి ఏమాత్రం విలువలు ఇవ్వకుండా, మంచి చెడులను పూర్తిగా మరచిపోయి, మానసికంగా, శారీరకంగా తనను నానా హింసలు పెట్టి, ఒక రాక్షసుడి కంటే దారుణంగా ప్రవర్తించి, చివరకు పరిస్థితిని విడాకుల దాకా తీసుకెళ్లాడు. అయినా సునంద బాధపడలేదు, భయపడలేదు. ఆనందంగానే విడాకులను స్వీకరించింది. తన బ్రతుకును తాను బ్రతకాలి అనుకుంది. కానీ కథ అక్కడితో ఆగిపోతే అది మామూలు కథ అవుతుంది. తనను తన భర్త అనేక విధాలుగా హింసించినప్పుడు, కారిన కన్నీటిని తుడిచిన చేతులు ఎవరివో కాదు. ఆ చేతులు తన అత్తమామలవి. వారిని సైతం ఆ దుర్మార్గుడు నడిరోడ్డు మీద వదిలేసి, ఇల్లును అమ్మేసి వెళ్ళిపోయాడు. ఆ వృద్ధ దంపతుల వేదనను అర్థం చేసుకున్న ఈ సునంద, ఆ వృద్ధ దంపతులను తన పిల్లలుగా దత్తత తీసుకోవడం అన్నది ఒక ఉదాత్తమైనటువంటి, అద్భుతమైనటువంటి విషయంగా నేను గుర్తిస్తున్నాను. ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచే పాత్రను నేను సృష్టించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కథ ద్వారా మహిళలకు ఒక మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వడం నా రచన ఉద్దేశం.
ప్రశ్న11: ‘అనగనగా ఒక రాజ్యం’ అనే జానపద కథని, సాంఘిక కథల సంపుటిలో చేర్చడంలో ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? లేక కథలోని ప్రతీకాత్మకత దృష్ట్యా సాంఘిక కథ గానే పరిగణించారా? ఈ కథ గురించి ఇంకా చెప్తారు?
జ: మనం ఏ దేశ చరిత్రను చూసినా సరే, యుద్ధాలు, యుద్ధాలు, యుద్ధాలు. రెండు రాజ్యాల రాజుల కోసం వేలాదిమంది సైనికులు తమ ప్రాణాలను పోగొట్టుకోవడమన్నది, అతి దారుణమైనటువంటి విషయం. యుద్ధం జరిగింది. సరే. సైనికులు చనిపోయారు. ఆ చనిపోయిన సైనికుల యొక్క కుటుంబాలను రాజులు, మహారాజులు ఎవరైనా ఆదుకున్న దాఖలాలు చరిత్రలో మనకి ఎక్కడా కనిపించవు. ఇది మరింత దౌర్భాగ్యమైన చర్య. యుద్ధాలు మానవజాతికి శాపాల్లాంటివి. జరుగుతున్న చరిత్రలో సైతం, ప్రతి దేశం యుద్ధం కోసం, తన ఆదాయ వనరుల్లో అధిక భాగాన్ని వెచ్చిస్తున్నది. నూతన అస్త్రాలను కొనుకుంటున్నారు. వివిధ రకాల మారుణాయుధాలను రూపొందిస్తున్నారు. అంతేకాదు, క్షణాలలో మొత్తం విశ్వమంతా నాశనం అయిపోయే అణుబాంబులకు ఆహ్వనం పలుకుతున్నారు. యుద్ధాల కోసం దేశాలన్నీ పోటీపడుతున్నాయి.
యుద్ధం ఎప్పుడు జరిగినా, అది వినాశనాన్నే కోరుకుంటుంది. అలాంటి యుద్ధం, ఈ మొత్తం ప్రపంచం నుండి సంపూర్ణంగా వెళ్లిపోవాలన్నదే నా ఉద్దేశం. యుద్ధం అంటే వినిపించని రోజు కోసం, అవయవాలు తెగిన ఈ ప్రపంచంలోని శాంతి ఎప్పటినుంచో ఎదురుచూస్తోంది. ఆ భావనతో రాసిన కథ ‘అనగనగా ఒక రాజ్యం’.
ప్రశ్న12. సాధారణంగా రచయితలకు తాము రచించేవన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?
జ: ‘ఆనంద తాండవం’ కథా సంపుటిలోని ప్రతి కథ నాకు నచ్చిందే. మన శరీరంలోని ఏ భాగం నీకు బాగా నచ్చుతుందంటే.. ఎలా చెప్పలేమో, ఈ కథల విషయంలో కూడా నా అభిప్రాయం అదే. అంతేకాకుండా ఈ సంపుటిలోని ప్రతి కథ, ఒక్కొక్క వైవిధ్యంతో కొనసాగుతుంది ఇతివృత్తాలన్నీ కూడా ఒకదానితో మరొకటి పోలిక లేని రీతిలో సాగిపోతున్నాయి. ఈ కథలలోని పాత్రలు, సన్నివేశాలు, సందర్భాలు.. నేను అన్నీ నా చుట్టూ ఉన్నటువంటి సమాజంలో, నిత్యం జరుగుతున్న వాటినుండి నేను నేరుగా స్వీకరించినవే. అందుకే ఈ కథలు, ఈ కథలలోని పాత్రలు అన్నీ నాకు ఇష్టం.
ప్రశ్న13. ఈ సంపుటిలోని ఏదైనా కథ రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?
జ: ‘ఆనందతాండవం’ కథా సంపుటిలోని ఏ కథను రాయడానికి నాకు కష్టం అనిపించలేదు. కానీ ‘డైరీలో చివరి పేజీ’ కథను రాయడానికి మాత్రం కొంచెం బాగా ఆలోచించవలసి వచ్చింది. ఎందుకంటే ఆ కథను సస్పెన్స్ కూడుకున్నటువంటి సన్నివేశాలతో నడిపించవలసిన అవసరం ఉంది. వాటి కోసం కొంచెం ఎక్కువగా ఆలోచించాను. ఈ కథను ఇంకా కొంచెం వైవిధ్యంగా రాయవచ్చుననుకుంటున్నాను.
ప్రశ్న14. చాలా కథలకు, క్రింద, అవి ఏ పత్రికలో ప్రచురితమై బహుమతి పొందాయో రాశారు కానీ, తేదీలు వ్రాయలేదు. ఎందుకని? తేదీల వివరాలు ఇచ్చి ఉంటే తెలుగు కథలపై పరిశోధనలు చేసేవారికి ఉపయుక్తంగా ఉండేది కదా?
జ: కరోనా దాకా నేను సాహిత్యాన్ని అంత ప్రధానమైన విషయంగా తీసుకోలేదు. అప్పటికి నాటకాలు ఎక్కువగా రాస్తూ, అడపాదడపా కవితలు, కథలు రాస్తూ ఉండేవాడిని. కరోనా తరువాత సాహిత్యం మీద విపరీతమైనటువంటి శ్రద్ధను కనపరచడం నేర్చుకున్నాను. అప్పటికే ముద్రణ జరిగిపోయినవి, బహుమతులు పొందిన కథల తేదీలను నమోదు చేసుకోలేక పోయాను. ఆ నష్టాన్ని ఇప్పుడు గుర్తించి, జాగ్రత్తపడుతున్నాను.
ప్రశ్న15. ‘ఆనందతాండవం’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఉంటే వాటిని పంచుకుంటారా? ఈ సంపుటికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?
జ: ‘ఆనందతాండవం’ కథా సంపుటి ప్రచురణ నేను ఊహించనిది. నా కథలు సంపుటి రూపంలో రావడానికి ప్రధాన కారకులు నా ప్రాణస్నేహితుడు శ్రీ కొమ్మవరపు విల్సన్ రావు గారు. ఒకరోజు ఉదయం ఆయన నాకు ఫోన్ చేసి, మీ బహుమతి పొందిన కథలను ఒక సంపుటిగా వేద్దాం అన్నారు. అందుకు నేను సమ్మతించలేదు. నేను అంత శ్రమను భరించలేను అన్నాను. అక్కరలేదు ఆ శ్రమను నేను భరిస్తాను. మీరు వెంటనే మీ కథలను నాకు పంపించండి చాలు అన్నారాయన. అంతే నేను కథలను పంపించాను. ఆయన ఎంత శ్రమ పడ్డారో నాకు తెలియదు, కానీ మొత్తానికి నా కథల పుస్తకం బయటికి వచ్చింది. ఈ సంపుటి రావడానికి ఆయన పడ్డ శ్రమకు నేను జీవితాంతము రుణపడి ఉంటాను. ఈ కథలను పుస్తక రూపంలో ప్రచురించడానికి నవ మల్లెతీగ మాసపత్రిక సంపాదకులు కలిమిశ్రీ గారు ముందుకు వచ్చారు. నా కథల సంపుటి ముద్రణలో ఆయన అందించిన సహకారం చాలా విలువైనది. రెండు వారాలలోనే నా కథలను సంపుటిగా తీర్చిదిద్ది, విజయవాడలో జరిగిన పుస్తక ప్రదర్శనలో వాటిని ఆవిష్కరింపజేసి, అక్కడ వారందరికీ ఈ పుస్తకాలను పరిచయం చేశారు. కలిమిశ్రీ గారికి చాలా రుణపడి వుంటాను. ఆ తరువాత రెండు తెలుగు రాష్టాల నుండి కథా ప్రియులు పుస్తకాల కోసం ఫోన్ చేయడం, చాలా ఉత్సాహాన్ని కలిగించింది.
‘ఆనందతాండవం’ కథాసంపుటికి గిడుగు రామమూర్తి జాతీయ పురస్కారం అందుకుంటున్న రచయిత
గిడుగు రామమూర్తి పంతులు మరియు శేఖర్ వేదిక వారు 22-1-2025వ తేదీన హైదరాబాదులో, 2025 గిడుగు రామమూర్తి పంతులు జాతీయ కథా పురస్కారాన్ని ‘ఆనందతాండవం’ కథా సంపుటికి అందజేసిన శుభ సందర్భాన్ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ పురస్కారం రావటానికి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన డా. బిక్కి కృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ప్రశ్న16. సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలు ఏవైనా సిద్ధమవుతున్నాయా?
జ: ప్రతిరోజు సాహిత్య పరంగా ఏదో ఒకటి రాయాలన్నదే నా ప్రణాళిక. రాబోయే కాలంలో నా వ్యాసాలను, నా కవితలను, నా మినీ కవితలను, నా విమర్శ గ్రంథాలను పుస్తకాల రూపంలోకి తీసుకురావాలన్నది నా ప్రణాళిక. ఎప్పటినుంచో ఒక నవలను రాయాలనే కోరిక, భవిష్యత్తులో తప్పక తీరుతుందని ఆశిస్తున్నాను.
~
సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు డా. కె. జి. వేణు గారు.
డా. కె. జి. వేణు: సంచిక టీమ్కి నా ధన్యవాదాలు.
***
రచన: డా. కె. జి. వేణు
ప్రచురణ: నవమల్లెతీగ ముద్రణలు
పేజీలు: 180
వెల: ₹ 200/-
ప్రతులకు:
నవమల్లెతీగ
26-16-4, TF-1,
శుభశ్రీ టవర్స్,
ఉయ్యూరు జమీందారు వీధి, గాంధీనగర్,
విజయవాడ 520003. ఫోన్: 9246415150
~
డా. కె. జి. వేణు 9848070084.
~
‘ఆనందతాండవం’ కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/aanandataandavam-book-review-kss/