[‘కథా సోపానములు’ అనే వ్యాస సంపుటి వెలువరించిన డా. బి.వి.ఎన్. స్వామి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం డా. బి.వి.ఎన్. స్వామి గారూ.
డా. బి.వి.ఎన్. స్వామి: నమస్కారం.
~
ప్రశ్న1: ‘కథా సోపానములు’ అనే వ్యాస సంపుటి వెలువరించినందుకు అభినందనలు. ఈ పుస్తకం వెనుక ఉన్న ఆలోచన ఏమిటి? ఆ నేపథ్యాన్ని వివరిస్తారా?
జవాబు: కొత్తగా కథలు రాయాలనుకున్న రచయింతలకు ‘ఎలా రాయాలి?’ అనే ప్రశ్న ఎదురవుతుంది. వారి కోసం ‘కథా సోపానములు’ అనే పుస్తకం రాసాను. లబ్ధప్రతిష్ఠులకు కూడా ఈ పుస్తకం ఉపయోగపడుతుందని చెప్పగలను.
ప్రశ్న 2: ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో “దీని కోసం రచయిత వేసుకున్న ప్రణాళిక, విషయాన్ని వివరించే తీరు, అవసరమైన మేరకు ఇచ్చిన ఉదాహరణలు ఈ రచన విశిష్టతని తెలుపుతాయి” అన్నారు ప్రొఫెసర్ బన్న ఐలయ్య గారు. ఈ పుస్తక రూపకల్పన ఎలా జరిగిందో వివరిస్తారా?
జవాబు: ప్రతి రచయిత ‘కథావస్తువు’ను తన అభిరుచి మేరకు ఎన్నుకుంటాడు. వస్తువును కథగా ములచే క్రమంలో తడబడతాడు. అలాంటి వారికే సులభమైన పద్ధతిలో కథ రాయడాన్ని నేర్పించడం కోసం ఒక కరదీపికను అందించాలనుకున్నాను. దాని ఫలితమే ‘కథా సోపానములు’. పాశ్చాత్య కథలను ఉదహరిస్తూ కథలు రాసే పద్ధతిని తెలిపాను.
ప్రశ్న 3: పి.హెచ్.డి. కోసం సమర్పించిన మీ పరిశోధనా గ్రంథానికీ, మీ ఈ పుస్తకానికి పరోక్ష సంబంధం ఉన్నట్లు అనిపిస్తోంది. మీ పి.హెచ్.డి. థీసిస్ గురించి, డాక్టరేట్ సంపాదించడానికి మీ కృషి గురించి చెప్పండి?
జవాబు: ‘ఉత్తర తెలంగాణ కథా సాహిత్యం – పరిశీలన’ (1970-2000 వరకు) అనేది నా పరిశోధనా గ్రంథం. ముప్పది సంవత్సరాల కథను చదివినపుడు, ఆయా కథలు రాసే విధానాన్ని కూడా గమనించాను. ఆయా రీతులపై విస్తారంగా వ్యాసాలు రాయాలని అప్పుడే అనుకున్నాను. ఈనాటికీ అది తీరింది. సకాలంలో నా థీసిస్ సమర్పించడానికి జయధీర్ తిరుమలరావు గారి పర్యవేక్షణ తోడ్పడింది, నాలుగు జిల్లాల్లో ముప్పయ్ సంవత్సరాల్లో వచ్చిన కథలను సమకూర్చుకోవడం, విశ్లేషించడం ఒక అసిధారావ్రతం.
ప్రశ్న 4: కథకుడిగా, కథా పరిశోధకుడిగా, సంపాదకుడిగా మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? మీ కథా రచన గురించి వివరిస్తారా? తొలి కథ ఎప్పుడు ప్రచురితమైంది? తాజా కథ ఎప్పుడు వచ్చింది?
జవాబు: ‘పంచపాల’, ‘కుదురు’ అనే రెండు కరీంనగర్ కథాసంకలనాలకు మిత్రులతో కలిసి సంపాదకత్వం వహించాను. ‘తెలగాణ చౌక్’ (ఉద్యమ కథల తొలి సంకలనం) కు కర్ర ఎల్లారెడ్డి గారితో కలిసి సంపాదకత్వం వహించాను.
కథా పరిశోధకుడిగా ‘అందుబాటు’ పుస్తకం ప్రచురించాను. అందులో 224 మంది కథకుల పరిచయం ఉంది. కథకుడిగా ‘నెలపొడుపు’, ‘రాత్రి పగలు – ఒక మెలకువ’ రెండు కథా సంపుటల్ని ప్రచురించాను.
తొలి కథ ‘పరీక్ష’ 2000 సంవత్సరంలో వచ్చింది. తాజా కథలు పత్రికల్లో ఉన్నవి. ఇప్పటి వరకు ఐదు ‘కథా విమర్శ’ పుస్తకాల్ని వెలువరించాను. మూడు పరిశోధనాత్మక పుస్తకాల్ని ప్రచురించాను.
‘మూడు తరాల తెలంగాణ కథ’ అనే బృహత్ కధా సంకలనం తెలంగాణ సాహిత్య ప్రక్రియ ఆధ్వర్యంలో వెలువడింది. దాని సంపాదకులలో నేనొకడ్ని.
ప్రశ్న 5: “కథ-కథానిక అనే రెండు పదాలు గందరగోళపరుస్తుంటాయి. వీటిని సమానార్థకాలుగా వాడుతుంటారు. వాస్తవానికి ఇవి రెండు కొద్ది బేధాలతో వేరువేరు” అనీ, “ఆధునిక కథానిక ప్రయోజనం కథ కంటే భిన్నమైనది” అనీ మొదటి వ్యాసంలో అన్నారు. వీటి గురించి మరింత వివరిస్తారా?
జవాబు: ఇంగ్లీషులో షార్ట్ స్టోరీ ఊది. దాని ప్రభావంతో గురజాడ తరువాత వచ్చిన వాటిని ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు ‘కధానిక’ అని పిలిచారు. అలా అది ప్రాచుర్యం లోకి వచ్చింది. ఆది నుండి ప్రాచీన యుగంలో కూడా కథ ఉంది. దాని ప్రభావం వల్ల నేటి కథానికను కూడా కథ అనే పిలవడం జరగుతోంది. క్లుప్తత, సంక్షిప్తత, కథానిక ప్రధాన లక్షణాలు. ప్రాచీన సాహిత్యం లోని కథ విస్తారంగా ఉండి బహుళ ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. ఒకే అంశం ప్రాతిపదికగా, సూటిగా పయనించి లక్షిత ప్రయోజనాన్ని చేరేది కథానిక.
ప్రశ్న 6: “కథకు పేరు పెట్టడం ఒక కళ” అంటూ, “పేరుతో కూడా ప్రయోజనాలను సాధించవచ్చు” అన్నారు. మరింత వివరిస్తారా? ఇటీవలి కాలంలో తెలుగు కథలకు పేరు పెడుతున్న తీరుతెన్నుల గురించి మీ అభిప్రాయం ఏమిటి? పేరు కథలోని విషయాన్ని రివీల్ చేయకూడని కొందరంటున్నారు. మీరేమంటారు?
జవాబు: ఇటీవలి కాలంలో ఉర్దూ, ఆంగ్ల భాషలలో తెలుగు కథ పేరు పెడుతున్నారు. సగం తెలుగు, సగం ఇంగ్లీషు కలిపి కూడా పెడుతున్నారు. ప్రాంతీయ భాషలో కూడా పేర్లు పెట్టడం కనిపిస్తుంది. ఇది ఆహ్వానించతగిన పరిణామం. పేరులోనే విషయాన్ని బహిర్గతం చేయాలనుకున్న కథకులు, మరింత శ్రద్ధగా కథ రాయాల్సి ఉంటుంది. కథకుడి స్వేచ్ఛను మన్నించాల్సిందే.
ప్రశ్న 7: కథకి ‘ప్రారంభం’ గురించి చెబుతూ, కథని ఇంటితోనూ, పాఠకుడిని అతిథితోనూ, కథకుడిని కుటుంబీకుడిగా పోల్చారు. ప్రారంభం (ఎత్తుగడ) అంటే ఆహ్వానం లాంటిది అన్నారు. అయితే ఇటీవల కాలంలో కథకి ప్రారంభం తట్టక, ముగింపు నుంచి మొదలుపెట్టి వెనక్కి వెళితే ప్రారంభం వస్తోందని కొందరు కథకులు చెబుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు: ప్రతీ ముగింపు మరొక ఆరంభానికి నాంది పలుకుతుంది. సాంకేతికంగా కథకు ప్రారంభం తప్పదు కదా.
ప్రశ్న 8: ‘సంఘటన – సన్నివేశం’ అనే వ్యాసంలో రెండిటికీ తేడాలు చెబుతూ ఇద్దరు విదేశీ రచయితల కథల ఉదాహరణలు తెలిపారు. వీటికి మీ స్వీయ కథల నుంచి ఉదాహరణలివ్వమంటే ఏయే కథల నుంచి ఇస్తారు? ఎందుకని?
జవాబు: మీ ప్రశ్నకు సరిపోయే జవాబుగా నేను రాసిన ‘చావు ప్యాకేజీ’ కథను పేర్కొంటాను. ఆమె చావు ఒక సంఘటన. చావు చుట్టూ అల్లుకొని ఉన్న సాంసృతిక రూపం ఒక సన్నివేశం. ఈ రెంటి మధ్య జరిగిన ఘర్షణ కథను ముందుకు తీసుకెళ్తుంది.
ప్రశ్న 9: ‘వర్ణనలు’ వ్యాసంలో, “వస్తుతత్వాన్ని పాఠకుడికి అందించడానికి, కథ వేగంగా ముందుకు నడవడానికి వర్ణనలు తోడ్పడుతాయి” అని చెబుతూ, “ఏ వర్ణనలైనా కథకు బలాన్నిచ్చేవిగా ఉండాలి” అని అన్నారు. ఈ వ్యాసంలో ప్రస్తావించిన గొగోల్ ఓవర్ కోట్ కథలోని వర్ణన కాకుండా మీకు నచ్చిన పాశ్చాత్య రచయిత/తెలుగు రచయిత కథలోని మరో ఉదాహరణని ఇవ్వగలరా?
జవాబు: అల్లం శేషగిరిరావు కథ ‘చీకటి’. ఇందులోని ప్రధాన పాత్ర డిబిరిగాడు. వీడికి సంబంధించిన వర్ణనలు వాడి తత్వాన్ని పట్టించేవిగా ఉన్నవి. అవి కథకు బలాన్ని చేర్చాయి.
ఉదాహరణ:
“నీట్లో అలజడి. తుపాకి గురిలో నల్లటి నీడ నీట్లో నుంచి లేచింది. డిబిరిగాడు బురదలోంచి నాచును తొక్కుకుంటూ గట్టెక్కుతున్నాడు. వాడి భుజం మీద తడిసిన వల. చంకలో నత్తగొట్టు. చలిలో వణికిపో కుండా ఉన్నా గబగబా అంగలేసుకుంటూ వేడికి మంట దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. వలని పక్కన పెట్టి నత్త గొట్టుని దగ్గరే ఎత్తి పడేశాడు. అది పడిన దగ్గరే కదల కుండా మంట వేడిలోకి చెవిటి చూపులు చూస్తోంది. డిబిరిగాడు ఒంటి మీద కారుతున్న బురద నీటితో మంటలోకి దూరిపోతున్నట్లు కూర్చున్నాడు.”
ప్రశ్న 10: ‘సంభాషణలు’ వ్యాసంలో “సంభాషణ కొనసాగి సంవాదంగా మారాలి” అని అన్నారు. వీటి గురించి మరింతగా చెప్తారా?
జవాబు: సంభాషణ వల్ల పాఠకుడికి ఒక ఎరుక కలగాలి. సంవాదన ఇద్దరి మధ్య జరుగుతుంది. దాని వల్ల విషయాలు, భావనలు అర్థమవుతాయి. మాటల్ని అర్థవంతంగా పేర్చడం లోనే కథకుడి నైపుణ్యం ఉంటుంది. Economy of words పద్దతి పాటించడం వల్ల సంభాషణల్లోకి బిగువు చేరుతుంది. శ్రీరమణ లాంటి కథకులు తక్కువ మాటల్లో ఎక్కువ అర్థాన్ని వండి వడ్డిస్తారు. ఉదాహరణకు ‘బంగారు మురుగు’ కథలోని సంభాషణం.
బాదంచెట్టు కింద ఒంటరిగా కూచోబెట్టి బామ్మ హితోపదేశం మొదలు పెట్టింది.
“పిల్ల పేరు గాయిత్రి..”
“అయితే..”
“రోజూ పదిసార్లు పిలిచినా చాలు పుణ్యం పురుషార్థం.. పదిమందిలో పుట్టి పెరిగిన పిల్ల..”
“అయితే..”
“కష్టసుఖాలు తెలుస్తాయి.. అరటిదూట కూర ఆవపెట్టి కమ్మగా వండుతుందిట.. పెద్దపెద్ద ముగ్గులు వేస్తుందిట..”
“అయితే..”
“ఒరే కోర్నాసీ దూటకూరకీ, ముగ్గులకీ బోలెడు ఓర్పూ, ఓపికా కావాల్రా – పనితనమూ ఉండాలి.. పిల్లకి రుక్మిణీ కల్యాణం కంఠతా వచ్చుట – టీకా తాత్పర్యంతో సహా.”
“అయితే..”
“అయితేనా? ఇష్టమైన వాడికోసం ఏదైనా చేసే జాణతనం ఉందని.. నువ్విట్టాగే మీనమేషాలు లెక్కిస్తూ కూచుంటే ఆ పిల్లే నిన్ను లేవదీసుకు పోతుంది.. సరేనా..” అంది నాకు రోషం తెప్పించాలని.
పైన పేర్కొన్న “అయితే..” అనే ప్రశ్నను నాలుగు సార్లు వేసి కావలసినంత సమాచారాన్ని అందించారు. చివరన అదే ప్రశ్నను అడిగిన వాడికి వేసి అతడి నోరు మూయించేసారు. మాటల్లో పొదుపు అంటే అదే.
ప్రశ్న 11: “తెలుగులో వస్తువు ఇతివృత్తం అనే రెండు పదాలను సమానార్థకాలుగా వాడుతున్నారు. కానీ రెండింటి మధ్య స్వల్ప తేడా ఉంది” అని ‘వస్తువు’ అనే వ్యాసంలో వ్యాఖ్యానించారు. ఈ తేడాని గురించి సమగ్రంగా వివరించండి.
జవాబు: మంచి అన్నీ అడిగారు. వ్యాసం లోనే స్పష్టంగా నిర్వచించాను. సమగ్రం అని అడిగారు కనుక ఉదాహరణలు వివరించే ప్రయత్నం చేస్తాను. కథకు ఎన్నుకున్న అంశాన్ని ‘వస్తువు’ అంటాం. అంశం ముడిసరుకు లాంటిది. వస్తువు లేదా అంశం లేదా ముడి సరుకును ప్రయోజనాత్మకంగా తీర్చిదిద్దే ప్రణాళికను ఇతివృత్తం అంటారు. సాధారణంగా కథ ఏకాంశ ప్రాతిపదికగా సాగుతుంది. అందుకు భిన్నంగా అనేక అంశాలను ఇముడ్చుకొని సాగే కథలు కూడా ఉంటవి. ఒక ప్రణాళిక (ఇతివృత్తం) లో ఒకే అంశం (వస్తువు) ఉండటం ఒక రకం. ఒక ప్రణాళికలో అనేక అంశాలు ఒదిగి ఉండటం మరో రకం. ఒకే ఇతివృత్తంలో అనేక వస్తువులు ఉండటం వల్ల కధ కూలిపోయే ప్రమాదం ఉంది. సమర్థుడైన కథకుడు అనేక పరికరాల్ని చేతపట్టుకొని కథను కూలిపోకుండా నిలబెట్టే ప్రయత్నం చేయగలడు. ఆ దిశగా ప్రయత్నం చేసిన కథకులలో ఆదెపు లక్ష్మీపతి ఒకరు. అతడు రాసిన ‘ముసల్దాని ముల్లె’ కథ అలాంటి ప్రయత్నమే.
ప్రశ్న 12: తెలంగాణ బాలల కథ – పరిశీలన అనే వ్యాసంలో చక్కని విషయాలను, బాలసాహిత్యంలో కృషి చేస్తున్న రచయితలను పేర్కొన్నారు. సందర్భానుసారంగా మీ రచన ‘కశప’ గురించి ప్రస్తావించారు. ‘కశప’ గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తారా?
జవాబు: కధా రచన, కథా పరిశోధన, కథా విమర్శ, కథ సంపాదకత్వం అనే నాలుగు స్తంభాల మధ్య సంచరించే నేను, కథా ప్రయోగం అనే అయిదవ స్తంభం వైపు వెళ్ళాను. వచన కవిత ప్రక్రియలో అనేక కొత్త రూపాలు పుట్టుకొచ్చి, ప్రక్రియలుగా స్థిరపడుచున్నవి. ఈ పరిణామం నన్ను కథా సాహిత్యం వైపు దృష్టి సారించేటట్లు చేసింది. దాని ఫలితమే ‘క.శ.ప.’ (కథా శతక పద్యం). కథా సాహిత్యంలో ఏదైనా ఒక ప్రయోగం చేయాలని సంకల్పించాను. ఇరవై వాక్యాల పరిధి విధించుకొని అనేక అంశాలపై చిన్న చిన్న కథలు రాసాను. ఆ కథల సారాంశం ఇమిడి ఉన్న శతక పద్యాలను కథ కింద చేర్చాను. శతక పద్యం లోని మూడవ పాదం లోని ఏదైన ఒక పదాన్ని కథకు శీర్షికగా పెట్టి ఆ పదాన్ని కథలో ఎక్కడో ఒక చోట వచ్చేలా జాగ్రత్త వహించాను. అలా ఒక నిర్మాణం జరిగింది. మకుట సహిత శతక పద్యాన్నే ఎంచుకున్నాను
ఇందుకు ప్రాచీన సాహిత్యం నుండి నేటి వరకు వచ్చిన శతక పద్యాలను ఉపయోగించుకున్నాను. పాఠకులకు ఒక పేజీలోనే కథ, శతక పద్యం రెండు చదివేలా అమర్చాను. శతక పద్యంపై నాకున్న ప్రేమ అలా చేయించింది. మొత్తం 117 కథలలో క.శ.ప. వెలువరించాను. చాలా మంది దృష్టికి ఇది వెళ్ళింది. ‘కథకు పద్యం రాసాడు’ అనే అపవాదు నాకు మిగిలింది. అపవాద దోషం నుండి విముక్తి పొందడానికి మళ్ళీ క.శ.ప. మార్గం పట్టాను. ఈసారి కథ నాదే, శతక పద్యం నాదే. ‘కశప చెప్పిన కథనమ్ము కాంతి పథము’ అనే మకుటంలో తేటగీతి పద్యాలు రాసాను. మొత్తం 116 కథలు రాసాను. నిర్మాణం పాతదే. కథ, పద్యం రెండూ కొత్తవి. ఇందులో ఎక్కువగా బాలలకు ఉపయోగపడే కశప ఉన్నవి. ఒకటి రెండు నెలల్లో ఈ ‘క.శ.ప.-2’ (కథా శతక పద్యం-2) బాలసాహిత్యంగా వెలువడనుంది. కథాసాహిత్యానికి ఒక ప్రయోగాన్ని కూర్చాను అనే తృప్తి మిగిలింది.
ప్రశ్న 13: ‘కథా సోపానములు’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఉంటే వాటిని పంచుకుంటారా? ఈ సంపుటికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?
జవాబు: ‘కధా సోపానములు’ పుస్తకంగా రాకముందు ‘సంచిక’లో ధారావాహికంగా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. అందుకు ‘సంచిక’కు శతకోటి ధన్యవాదములు. ఈ సమయాన గుర్తు చేసుకోదగిన సోదర సమానుడు కీర్తిశేషుడు స్వర్గీయ డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి. అతని సంకల్పం వల్లనే ఈ పుస్తకం నీల్ కమల్ పబ్లికేషన్స్ ద్వారా వెలువడింది. ముందుమాటలు అందించిన బన్న అయిలయ్య, విహారి గార్లకు కృతజ్ఞతలు. పుస్తకం గురించిన సమీక్షలు ఎక్కువగా రాలేదు. ఆ ఖాళీని ‘సంచిక’ ఈ విధంగా పూరించింది. అందుకు మరొకసారి ధన్యవాదాలు. పాఠకుల ఆదరణ తప్పక ఉంటుంది ఆనేది నమ్మకం. పుస్తకాలు పబ్లికేషన్స్ వారి వద్దనే ఉన్నవి కనుక ఆదరణను అంచనా వేయలేకున్నాను.
ప్రశ్న 14: సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలు ఏవైనా సిద్ధమవుతున్నాయా?
జవాబు: డిసెంబర్ 2025 లోపు నేను రాసిన ‘పల్లేరుకాయలు’ ఆ నవలను విడుదల చేస్తాను. అందుకు తగిన పని పూర్తి కావస్తుంది. ముందుమాట రాసిన నందిని సిధారెడ్డి నవలను ‘ఆత్మకథాత్మక నవల’ గా పేర్కొన్నారు.
~
సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు డా. బి.వి.ఎన్. స్వామి గారు.
డా. బి.వి.ఎన్. స్వామి: ధన్యవాదాలు.
***
రచన: డా. బి.వి.ఎన్. స్వామి
ప్రచురణ: నీల్ కమల్ పబ్లికేషన్స్, హైదరాబాద్
పేజీలు: 142
వెల: ₹ 300/-
ప్రతులకు:
నీల్ కమల్ బుక్ హౌస్,
సుల్తాన్ బజార్, కోటి,
హైదరాబాద్.
ఫోన్: 9000168953
~
‘కథా సోపానములు’ అనే వ్యాస సంపుటి పరిచయం:
https://sanchika.com/kathaa-sopaanamulu-book-intro-kss/