Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కవి, కథకుడు డా. అగరం వసంత్ ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘కథ మరిచిన మనిషి’ అనే కవితా సంపుటి వెలువరించిన డా. అగరం వసంత్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం డా. అగరం వసంత్ గారూ.

డా. అగరం వసంత్: నమస్కారం.

~

ప్రశ్న1: ‘కథ మరిచిన మనిషికవితాసంపుటిని వెలువరించినందుకు అభినందనలు. ఈ సంపుటి ఈ శీర్షిక పెట్టడంలో మీ ఆలోచన ఏమిటి? కవిత్వం పుస్తకానికి కథతో ప్రారంభమయ్యే పేరు పెట్టడం యాదృచ్ఛికమా? లేక ఆ పేరుతో ఉన్న కవిత శీర్షికనే పుస్తకానికి ఉంచారా?

జవాబు: ‘ఏంరా! నీ కథ?’ సహజంగా మా ప్రాంతంలో జన బాహుళ్యంలో ఉన్న మాట ఇది. ఇక్కడ కథ అంటే.‌. ఏమిటి నీ విషయం? నిన్ను నీవు మర్చిపోతున్నావని ప్రశ్నించడం, హెచ్చరించడం. పరిధులు దాటుతున్నావని చెప్పడం. అదే నా ఆలోచన. కవిత్వమైనా, కథ అయినా, నవల అయినా మనిషి కేంద్రంగా సాగేదే కదా. ఈ కోణంలోనే ‘కథ మరిచిన మనిషి’ అనే కవితను రాయడం జరిగింది. కవితా సంపుటికి పేరుగా కూడా ఎంచుకున్నాను.

ప్రశ్న 2: తెలుగు రాష్ట్రాలకు దూరంగా, వేరే రాష్ట్రంలో ఉన్న తెలుగువారిగా, అక్కడ తెలుగు భాషను కాపాడుకునే లక్ష్యంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, పుస్తకాలు ప్రచురించడం, ప్రాచుర్యం లోకి తేవడం గొప్ప విషయం. హోసూరు ఆంధ్ర సాంస్కృతిక సమితి గురించి, కృష్ణగిరి జిల్లా రచయితల సంఘం గురించి వివరిస్తారా?

జవాబు: హోసూరు ప్రాంతానికి చెందిన స్వర్గీయ కోదండరామయ్య గారు తెలుగు భాషాభిమాని. రచయిత రాజకీయవేత్త హోసూర్ ఆంధ్రాలో చేరాలని పోరాడిన వ్యక్తి కూడా.. ఆయన ఎమ్మెల్యేగా హోసురు ప్రాంతం నుంచి ఎన్నికైన తర్వాత తమిళనాడు ప్రభుత్వంతో పోట్లాడి హోసూరు నడి బొడ్డున ఆంధ్ర సాంస్కృతిక సమితి భవనాన్ని ఏర్పరిచారు. హోసూరులో జరిగే తెలుగు భాషాపరమైన ఉద్యమాలు, సాహితీ కార్యక్రమాలు ఇప్పటికీ ఆ భవనంలోనే సాగుతాయి.

ఇక క్రిష్ణగిరి తెలుగు రచయితల సంఘం 2007న ప్రారంభమైంది (అంతకు మునుపే ఇక్కడ రచయితల సంఘం అనేది ఉండేది). ‘నడుస్తున్న చరిత్ర’ సంపాదకులు రమేశ్ బాబు గారు అప్పుడు హోసూరులో జరిగే తెలుగు ఉద్యమాలకు తమ పత్రిక ద్వారా బాగా ప్రచారం కల్పించేవారు అలానే.. సా వెం రమేష్ గారు కూడా చాలా సంవత్సరాలు ఇక్కడ తెలుగు కోసం పనిచేశారు. వారి ఆధ్వర్యంలోని క్రిష్ణగిరి జిల్లా తెలుగు రచయితల సంఘం ఏర్పాటు అయింది. ఇప్పటికీ 23 పుస్తకాలు ‘కృష్ణరసం’ ద్వారా ప్రచురించడం జరిగింది. నేను ముందు కార్యకర్తగా మా జిల్లా రచయితల సంఘంలో చేరి అటు తర్వాత కార్యదర్శిగా, ఇప్పుడు అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను.

ప్రశ్న 3: 1991-92లో తొలి కవిత రాశానని ‘నా మాట’లో తెలిపారు. ఈ సందర్భంగా మీ రచనా ప్రస్థానం గురించి చెప్పండి.

జవాబు: అప్పుడు నేను హోసూరులో ఇంటర్ చదువుతున్నాను. మా క్లాసులో కొంతమంది బాగా పాటలు పాడేవాళ్లు. పద్యాలు పాడేవాళ్లు. అంతేకాదు మా ఊళ్లో మాది వ్యవసాయ కుటుంబం. మా పొలాల్లో పని చేయడానికి ఎక్కువ మంది కూలీలు వచ్చేవాళ్లు. వాళ్లతో పాటు నేనూ కూడా పనిచేసేవాడిని. అప్పుడు చాలా జానపద గేయాలు విన్నాను. అలా తెలుగు భాషపై మక్కువ ఏర్పడింది. నా రచనా ప్రస్థానానికి కూడా అక్కడే బీజం పడింది. ఓ ప్రేమ కవిత రాశాను. అది మయూరి పత్రికలో అప్పుడు అచ్చయింది.

ప్రశ్న 4: మీరు కవితలు, కథలు, వ్యాసాలు, నవలలు రాశారు. వీటిల్లో ఏది రాయడం మీకు సులువు? ఎందువల్ల?

జవాబు: మంచి ప్రశ్న అడిగారు. నాకైతే కవిత. అల్పాక్షరాలతో అనంత అర్థం అలవోకగా చెప్పొచ్చు అనే ఉద్దేశం నాది.

ప్రశ్న 5: ఎంతో ఒత్తిడితో ఉండే వైద్యవృత్తిలో ఉన్న మీకు సాహిత్య సృజన చేయటానికి ఎంత సమయం దొరుకుతుంది? మీ రచనా పద్ధతిని తెలియజేయండి.

జవాబు: ఇంతే సమయమని చెప్పలేను. కాకపోతే పగటిపూట వానలు కురిసేటప్పుడు నా కాస్త సమయం దొరుకుతుంది.

ప్రశ్న 6: కవితకి లయ ప్రధానమా? వస్తువు ప్రధానమా? భావ వ్యక్తీకరణ ప్రధానమా? మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు?

జవాబు: మూడు ప్రధానమే.

ప్రశ్న 7: ‘ఆటలు ఆటలు’ బాల్యాన్ని అద్భుతంగా చిత్రించిన కవిత. ఈ కవిత రాయడానికి పురికొల్పిన సంఘటనో లేదా దాని నేపథ్యమో వివరిస్తారా?

జవాబు: చాలానే ఉన్నాయి. ముఖ్యంగా నా చిన్నప్పటి బాల్యం హాయిగా పదిమంది పిల్లలతో కలిసి వీధుల్లో ఆటలు ఆడుకునే వాళ్ళం కానీ.. నేటి పిల్లల బాల్యం.. అసలు ఇల్లు వదిలి రావడం లేదు. వచ్చినా ఆట అంటే క్రికెట్ తోనే ముగిసిపోతుంది. ఈ విషయాలన్నింటినీ మనసులో ఉంచుకొని ఆ కవిత రాయడం జరిగింది.

ప్రశ్న 8: చీమల్ని చెట్లెక్కించాలిఅన్న కవితకి శీర్షిక విభిన్నంగా ఉంది. ఈ కవిత వెనుక ఉన్న ఆలోచన ఏమిటి?

జవాబు: ఇంకేముంది యువతకు, అణగారిన వర్గాల వారికి అధికారం దక్కాలనే ఆలోచన తప్ప..

ప్రశ్న 9: మనం జీవించడం లేదు, కేవలం బ్రతుకుతున్నామంతే అని చాటిన జీవితంకవిత గురించి చెప్పండి. ఏ సందర్భంలో ఆ కవిత రాశారో వివరిస్తారా?

జవాబు: ఒకటని కాదు రెండు అని కాదు ఎన్నో సందర్భాలు.. ఎందరో మనుషుల జీవితాన్ని దగ్గరుండి గమనించాక రాసిన కవిత అది.

ప్రశ్న 10: అక్షరమాలకవితలో తెలుగు భాష గురించి చెబుతూ, ‘కాలంతో కరచాలనం చేసిన చెట్టుఅని అన్నారు. ఇక్కడ మీ ఉద్దేశం తెలుగు భాష ప్రాచీనమైనదనా లేక మరేదైనా ప్రతీకగా వాడారా?

జవాబు: అవును మీ మాట అక్షర సత్యం. తెలుగు ప్రాచీన భాష అనే ఉద్దేశంతోనే ఆ మాట రాశాను. సహజంగా తమిళ వాళ్ళు మాదే ప్రాచీన భాష అంటారు. అంతేకాక ద్రావిడ భాషలన్నీ మా తమిళం నుండే వచ్చాయంటారు. ఇటీవలయితే భారతదేశం మరియు ప్రపంచం లోని 156 భాషలు తమిళం నుండే వచ్చాయి అంటున్నారు. కొంతమంది తెలుగు మేధావులు కూడా దీన్ని ఒప్పుకొని తమిళ భాషకి జై అనేస్తున్నారు. ఇక్కడ నా పాయింట్ ఏమిటంటే ప్రాచీన కావ్యాలుగా తమిళులు చెప్పుకునే వాటిలో తెలుగు వారి గురించి వడుగర్ అనే పదం వాడారు (తమిళంలో ము.వరదరాజన్ గారు తమిళ వాఙ్మయ చరిత్రను రాస్తూ ఈ మాట అన్నారు. ఈ పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ వారు వెయ్యగా తమ్మావజ్జల కోదండరామయ్య గారు తెలుగులోకి అనువదించారు). వడుగర్లు వెంకటాచలపతికి అటు పక్కగా ఉన్నారనీ అన్నారు. మరి ఇప్పుడు అక్కడ వాళ్లు ఉన్నారా, కనీసం వడుగర్ పేరు మీద ఒక తెలుగు కులమైన ఉందా.. ఊరు ఉందా, పోనీ ఆంధ్రదేశంలో ఎక్కడైనా ఉన్నారా లేదా తెలంగాణలో ఉన్నారా నాకైతే తెలియదు. నాకు తెలిసింది చెప్తాను వినండి.

తమిళనాడు మొత్తం ఈ వడుగర్ అనే తెలుగు కులం ఉంది. మా హోసూరు ప్రాంతంలో కూడా చాలా పల్లెల్లో ఈ వడుగర్ కులస్తులు ఉన్నారు. తమిళనాడు ప్రభుత్వం ప్రచురించిన తమిళనాడులోని తెలుగు కులాల జాబితాలో కూడా ఈ వడుగర్ కులం ఉంది.

ఇదంతా నేను ఎందుకు చెబుతున్నా అంటే ఆ వడుగర్ అప్పటి తమిళనాడు వాడే.

తెలుగువాడు ఎక్కడ ఉంటే అక్కడ వెంకటాచలపతి ఉండడం పెద్ద విషయం ఏమీ కాదు కావేరి నది ఒడ్డున కూడా వెంకటాచలపతి గుడి ఉంది.

వారి సంఘ సాహిత్యంలో ఒక తెలుగు కవి ప్రస్తావన కూడా ఉందట. ఆయనే కులైకణి వడుగర్.

వారి గ్రంథాలలోనే ఒక తెలుగు గురించి చెప్పుతూ మళ్ళా తెలుగు ప్రాచీన భాష కాదని ఎలా అంటారో, మన వాళ్ళు ఎలా వింటారో.. అప్పటికి తెలుగు సాహిత్యం లేకుంటే తెలుగు కవి ఎలా వచ్చాడండి?

ప్రశ్న 11: వైవాహిక జీవితం గురించి అత్యంత సరళంగా, చిన్న చిన్న పదాలలో పెండ్లిఅనే కవితలో గొప్పగా చెప్పారు. ఈ కవిత ఏదైనా విశేష సందర్భం కోసం రాసినదా?

జవాబు: పెద్దగా ఏమీ లేదండి. సహజంగా హంగు ఆర్భాటాలు బాటలు లేకుండా పల్లెలో జరిగే పెళ్లి గురించి రాశాను అంతే.

ప్రశ్న 12: ఈ సంపుటిలో మీకు బాగా నచ్చిన కవిత ఏది? ఎందువల్ల?

జవాబు: అన్ని నచ్చుతాయండి, కానీ మీరు అడిగారు కాబట్టి ‘ఇది నా కవిత్వం’ అనే కవిత ఇష్టం.

ఎందువల్ల అంటే

*ఇది నా కవిత్వం
ఉన్నదాని నుండే వచ్చింది
నా నుండే వచ్చింది*

ఇక్కడ ఏవి దాపరింపులు లేవు అని చెప్పడం ఒక ఉద్దేశం అయితే కవిత్వమే కాదు ఈ సృష్టిలో ప్రతిదీ ఉన్నదాని నుండే వచ్చింది, లేని దాని నుండి ఏదీ రాదు ఏది కాదు అని చెప్పడం మరో ఉద్దేశం.

ప్రశ్న 13: ఈ సంపుటిలో ఏ కవితని రాయడానికి మీరు ఎక్కువ కష్టపడ్డారు? ఎందుకని?

జవాబు: ‘కదలిరా కవితా’. ఇదొక దీర్ఘ కవిత అచ్చులో 10 పేజీలు వచ్చింది. అనంతం నుండి మన అంతం వరకు రాయాలని ఉద్దేశంతో రాశాను. అందువల్ల కాస్త టైం తీసుకుంది.

ప్రశ్న 14: ఈ పుస్తకం ప్రచురణ అనుభవాలు చెబుతారా? పాఠకుల ఆదరణ ఎలా ఉంది?

జవాబు: ప్రచురణ అనుభవాలు ఏముంటాయి, మా జేబులోంచి డబ్బు తీసి ప్రచురించడమే. ఇక ఆదరణ అంటారా, అంతంత మాత్రమే.

ప్రశ్న 15: భవిష్యత్తులో ఎలాంటి రచనలు చేయాలనుకుంటున్నారు? కొత్త పుస్తకాలు ఏవైనా ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయా?

జవాబు: రెండు నవలలు ప్రచురణకు నోచుకోవాల్సి ఉంది. ఇక భవిష్యత్తులో అయితే పాటలు రాయాలని అనుకుంటా ఉన్నాను. ఇటీవల తెలుగు భాష ఉన్నతం గురించి తెలుగు తెలుగు అనే ఒక పాట రాశాను సినీ సంగీత దర్శకులు దాన్ని స్వరపరిచారు.

Krishnarasam కృష్ణ రసం
యూట్యూబ్ లో కెళ్ళి మీరు చూడవచ్చు

~

సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు డా. అగరం వసంత్ గారు.

డా. అగరం వసంత్: దండాలు.

***

కథ మరిచిన మనిషి (కవిత్వం)
రచన: అగరం వసంత్‌
ప్రచురణ: కృష్ణగిరి జిల్లా తెలుగు రచయితల సంఘం, హోసూరు
పేజీలు: 138
ధర: ₹ 200/-
ప్రతులకు:
డా. ఎన్. వసంత్,
బస్తి యువక బృందం,
2/1097, బస్తి, ఆవులపల్లి రోడ్డు,
హోసూరు, కృష్ణగిరి జిల్లా,
తమిళనాడు – 635109
ఫోన్‌: 94883 30209

 

~
‘కథ మరిచిన మనిషి’ కవితా సంపుటి సమీక్ష:
https://sanchika.com/katha-marichina-manishi-book-review-kss/

Exit mobile version