[శ్రీమతి అక్షర రాసిన ‘సారీ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
వేగంగా పరుగెడుతున్న క్యాబ్ కంటే వేగంగా పరిగేడుతున్నాయి సునీత ఆలోచనలు. ఉదయం ఆఫీసుకి బయల్దేరే ముందు సునీత, ప్రకాష్ చాలా తీవ్రంగా ఘర్షణ పడ్డారు. ఇక మీదట కలిసి బ్రతకలేకపోతే విడిపోవటమే మేలని చెప్పి ప్రదీప్ మొహం మీద దభేల్మని తలపు వేసి బయటకు వచ్చి, అప్పటికే వేచి ఉన్న క్యాబ్లో ఆఫీస్కి వచ్చేసింది.
పెళ్లి అయిన ఈ నాలుగు ఏళ్లలో వారిద్దరు వాదించుకున్న సందర్భాలు లేకపోలేదు, కానీ తను తల్లి కాబోతున్నదని తెలిసిన దగ్గరనుంచీ ఇద్దరి మధ్య కయ్యాలు ఎక్కువై ఆ ఉదయం చిలికి చిలికి వాన కాదు కాదు కుంభవృష్టే అయింది. కయ్యానికి కారణం – ‘ఆర్థికంగా బాగా నిలదొక్కుకున్నాక సంతాన విషయం ఆలోచిద్దామ’ని ప్రదీప్. ‘ఇప్పటికే చాలా ఆలస్యం అయింది ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాద’ని సునీత, ‘అబార్షన్ చేయించుకోమ’ని ప్రదీప్. ‘వీల్లేద’ని సునీత. తీవ్రమైన మతాభిభేదం.
ఆఫీసుకి వచ్చి కొంత పని చేసుకుని కాసేపటికి మనసు కుదుటపడ్డాక – ‘ఇలా గట్టిగా ఒకరిపై ఒకరు కేకలు వేసుకుని రభస పడే కంటే ఒక్కసారి ఇద్దరం ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావాలి’ అన్న ఆలోచన వచ్చాక మనసు కాస్త స్తిమిత పడి హాఫ్ డే సెలవ పెట్టి తిరిగి ఇంటికి బయల్దేరింది సునీత.
ఈసరికి ప్రదీప్ ఆవేశంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోలేదు కదా అని భయపడి, ఆలస్యం చేయకుండా తను ‘సారీ’ చెపుతూ ప్రదీప్కి మెసేజ్ పెట్టి చాలాసేపు అయింది. ఎంత సేపటికి తన మెసేజ్ చూసిన గుర్తు కూడా కనిపించక ఆదుర్దా ఎక్కువ అయింది సునీతకి. పరి పరి విధాలుగా కలుగుతున్న ఆలోచనలు మనసును కంగారు పెడుతుంటే తమ అపార్ట్మెంట్ దగ్గర పడిన వెంటనే క్యాబ్ దిగి తమ ఫ్లాట్ వేపు చూసింది ప్రదీప్ ఆచూకీ కోసం. లోపల ఏమీ అలికిడి కనిపించక ‘ఉదయం తను కోపంగా ఆఫీసుకి బయల్దేరి వచ్చేశాక ప్రదీప్ ఏం చేసి ఉంటాడా’ అనుకుంటూ తన దగ్గర ఉన్న డూప్లికేట్ తాళంతో తలుపు మీద చేయి వేసిన వెంటనే తెర్చుకునేసరికి ఒక్క క్షణం లయ తప్పిన గుండెని అదుపులోకి తెచ్చుకుని లోపలికి అడుగు పెట్టింది సునీత.
ఎదురగా అందమైన పువ్వుల గుత్తి పట్టుకుని కళ్ల తోనే సారీ చెప్తూ నిలుచున్న ప్రదీప్ని చూసి ఎలా స్పందించాలో అర్థం కాక నిలబడిపోయిన సునీతతో “అలా చూడకు, నీలానే నా కోపం చల్లారాక నీకు మెసేజ్ పెట్టే లోపున వచ్చిన నీ ‘సారీ’ మెసేజ్ చూసి అప్పటికి అప్పుడు ఇలా ప్లాన్ చేశాను” అంటూ సునీతకి పూల గుత్తి అందించాడు ప్రదీప్.
పుట్టిపెరిగి గ్రాడ్యుయేషన్ చేసింది జంషెడ్పూర్లో. ఎం.ఎ. బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి చేసారు. వీరి నాన్నగారు కీర్తిశేషులు శ్రీ భాగవతుల ఉమామహేశ్వర శర్మగారు స్వయంగా తెలుగు సాహిత్యం, భాష అంటే ప్రాణంగా చూసుకునేవారు. ఆఖరిశ్వాస వరకూ తెలుగు కావ్య రచనలు చేసి, తెలుగుతల్లి సేవ చేసారు.
ఆయన ప్రభావం వలన కొంతా, అప్పటికే తెలుగు రచయిత్రిగా మంచి పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకున్న శ్రీమతి సుగుణమణి (అరవింద) గారి ప్రోత్సాహం, సాంగత్యం వలన వీరిలో కథలు రాయాలన్న ఉత్సాహం పొంగిపొర్లింది. ఫలితంగా ప్రయత్నపూర్వకంగా తెలుగు రాయటం, చదవటం నేర్చుకుని, స్థానిక పత్రిక కోసం రాసారు.
అవి అందరూ మెచ్చుకున్నందున ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి పత్రికలకు పంపటం, వారు వాటిని ప్రచురించటం జరిగింది. కథా రచయిత్రి పేరు తెచ్చుకుంటూన్న సమయంలోనే వివాహం జరిగి సంసార సాగరంలో మునిగితేలుతూ, స్కూల్ టీచర్ గా ఉద్యోగం చేస్తూ, జీవితాన్ని ఈ రెండింటికి అంకితం చేసారు. సంసార బాధ్యతలు కొంతవరకు తీరాక వీరి లోని రచయిత్రి నేను ఇంకా బ్రతికి ఉన్నానంటూ ముందుకొచ్చింది. ఈసారి తమ బంధువు అయిన అనూరాధ ప్రోత్సాహంతో మళ్లీ రాయటం మొదలుపెట్టారు. తాను సాహితీ ప్రపంచంలోకి అడుగుపెడితే పైలోకంలో ఉన్న తమ నాన్నగారు చూసి తప్పకుండా సంతోషిస్తారన్న ఆశతో ఉన్నారు.
