[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘స్నేహమా వర్ధిల్లు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
నిరాశ నిన్ను నిలువెల్లా కమ్మేసి
క్రుంగదీస్తుంటే..
ఓటమి నిన్ను అగాధాల వంటి
అపజయాల పరిచయాలు చేస్తుంటే..
బాధలెన్నో నిన్ను ఇబ్బందులకు
గురయ్యేలా కారణమవుతుంటే..
చిక్కుముడుల వంటి సమస్యలు
నిన్ను వెంటాడి వేటాడుతూ
సంద్రాన్ని అతలాకుతలం చేసిన
సుడిగుండల తుఫాను అలజడులు
నీ మదిలో సృష్టిస్తుంటే..
చిరునవ్వులే మాయమైన మోములో..
సంక్రాంతుల ఉషస్సులు
ఉదయింపజేసే ఆత్మీయం స్నేహం!
సదా ఉల్లాసాన్ని, సదా ఉత్సాహాన్ని నింపుతూ
‘నేనున్నాను నేస్తం’ అంటూ
నిరాశలెన్నో బాధించినా..
ఓటమిలెన్నో ఇబ్బందిపెట్టినా..
బలాదూర్ అంటూ చైతన్యాన్ని నరనరానా నింపుతూ
స్ఫూర్తిని అందించే అభినందనీయం స్నేహం!
ఉత్తమ స్నేహితులు
తోడుగా ఉంటే అధైర్యాలు
‘ఉఫ్’ అన్నట్లుగా మాయమవుతుంటాయి!
ఉన్నత వ్యక్తిత్వాన్ని
సంతరించుకునేలా నిన్ను తీర్చిదిద్దుతూ..
స్నేహితులు దిక్సూచిగా మారుతుంటే..
కష్టాలన్ని బంగారాన్ని కాల్చి
వన్నెతెచ్చినట్లుగా
నువ్వు మరింత సమర్థవంతంగా
పోటీగా ధీమాగా నిలబడే అవకాశాన్ని
కల్పించే అవకాశాలుగా ఎదురవుతుంటాయి!
స్నేహమా వర్ధిల్లు..
ఇలలో వైభవమై..
దైవ స్వరూపమై.. కీర్తినందుకో!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.