[జూన్ 23 కళా ప్రపూర్ణ దివాకర్ల వేంకటావధాని గారి జయంతి సందర్భంగా, ఆయన తన స్మృతి పథంలో నిలిచిన విశ్వనాథ వారి వక్తృత్వ స్ఫూర్తిని గురించి ఫిబ్రవరి 1975 నాటి ‘నందిని’ మాస పత్రికలో (సంపుటి 1, సంచిక 2) వ్రాసిన వ్యాసాన్ని సేకరించి అందిస్తున్నారు వారి కుమార్తె శ్రీమతి దివాకర్ల రాజేశ్వరి.]
మా నాయన గారికి సోదరులు నలుగురు. అన్నలిరువురు. తమ్ములలో మొదటి వారు శ్రీ తిరుపతి వేంకటేశ్వర కవులలో ఒకరైన తిరుపతి శాస్త్రి గారు. వారు పోలవరము జమీందారు గారికి ఆస్థాన కవులగుటచే కాకినాడలో ఉండెడివారు. ప్రతి సంవత్సరము తలిదండ్రుల ఆబ్దికములకు వారు సకుటుంబముగా అభిజన స్థానమైన యండగండి వచ్చెడివారు. అది క్షత్రియులు అధికముగా కల ఊరు. శ్రీ తిరుపతి శాస్త్రి గారు మా ఊరు వచ్చినప్పుడెల్ల ఎవరో క్షత్రియ గృహస్థులు వారిని సగౌరవముగా తమ ఇంటికి కొనిపోయి ఊరి లోని విద్యావంతులందరిని పిల్చి కవితా గోష్ఠి చేయించెడివారు. శ్రీ శాస్త్రి గారు జరీ అంచుల ఎర్రని సేలువ పైన ధరించి పలువురు వినుచుండ సారస్వత గోష్ఠి జరిపెడువారు. నేనును వారి ప్రక్కనే కూర్చుండి వినుచుండెడి వాడను. అప్పుడు నాకైదారేండ్ల కంటే ఎక్క్కువ యుండవు. గాయత్రీ రామాయణమందలి శ్లోకములు, భాగవతము నందలివి, శతకముల యందలివి కొన్ని పద్యములు నాకప్పుడు కంఠగతములై యుండెను. శ్రీ శాస్త్రి గారు తమ ప్రసంగము ముగిసిన తరువాత నాచే కొన్ని పద్యములు శ్లోకములు చదివించేడివారు. మా ఇంటికెదురుగా ఉన్నక్షత్రియులలో ఒకరు, వారి పేరు పేరిచర్ల సోమ రాజు గారు – శాస్త్రి గారితో “వీనిని మీయంత కవిని పండితుని చేయవలెను” అనెడివారు. శ్రీ శాస్త్రి గారు మందహాస మొనరించుచు నా శరీరము ప్రేమతో తడవెడు వారు. వారి మొగమున నందము చిందెడి ఆ మందహాసము నా కిప్పటికిని జ్ఞాపకమున్నది.
నా కారేండ్లు ఉదయమేడు గంటలకు పోస్టు వచ్చెను. మా నాయనగారొక కార్డు చదివి గొల్లుమని యేడ్చిరి. ఇంటిలోని వారందరు నేడ్చిరి. నేనును కారణము తెలియకుండానే యేడ్చితిని. తరువాత ఆంధ్ర పత్రిక వచ్చినది. అందులో తిరుపతి శాస్త్రి గారి నిర్యాణము దివాకరాస్తమయమను పేరుతో ప్రకటింపబడినది. పలువురు మిత్రులు, శిష్యులు, వారిని గూర్చి పద్యములు వ్రాసిరి. మా నాయనగారు పెద్ద పెట్టున నేడ్చుచు ఆ పద్యములు చదివిరి. లక్ష్మణుడు యుద్ధ రంగమున మూర్ఛిల్లినప్పుడు శ్రీరాముడేడ్చిన ఏడ్పు తరువాత చదివినప్పుడెల్ల నాకప్పటి మా నాయన గారి యేడ్పు జ్ఞప్తికి వచ్చుచుండును. వారంతంగా దుఃఖించుట మరెన్నడు చూడలేదు. అపుడు బిక్కమొగముతో చెంత చేరిన నన్ను చూచి వారు “తిరుపతీ వీనిని నీయంత కవిని పండితుని చేసెదననుకొంటినిరా, వీనికా అదృష్టము లేదు. నీవు లేమిచే లోకమంతయు శూన్యమై పోయినదిరా” అని మరల బిగ్గరగా ఏడువనారంభించిరి. నాకా అదృష్టము లేక పోయినది. కాని మా నాయన గారన్న ఆమాటలు నా గుండెలోనెప్పుడును మెదలుచునే యుండును.
బందరు లోని హిందూ కళాశాలలో ఇంటరులో చేరితిని. శ్రీ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారందు ఆంధ్రోపన్యాసకులు. నేను కళాశాలలో సంస్కృతము చదువుచుంటిని. వారు తెలుగే కాక సంస్కృతము కూడా బోధించుచుండిరి. తరుచుగా నేను వారి యింటనే యుండెడి వాడను. వారు కళాశాలకు తెల్లని ఖద్దరు ధోవతి, ఖద్దరు కోటు, ఖద్దరు తలపాగ ధరించి వచ్చెడివారు. వారు బోధించెడి తీరు, వారిని కళాశాలలోని యితర ఉపన్యాసకులు గౌరవించెడు విధానము నన్నెంతో ఆకర్షించెడివి. వారి ఉపన్యాసము లెచ్చట నున్నను వెళ్ళి వినుచుండెడి వాడను. వారు కొందరిని మెచ్చెడి వారు. కొందరిని నిర్భయముగా తెగడెడివారు. నా సహపాఠి, మా యూరివాడు, ఇంకూరి సత్యనారాయణ రాజు (పాపమాతడు యౌవనముననే దివంగతుడయ్యెను), ఆ యుపన్యాసములకు నాతో వచ్చి, దారిలో ఉపన్యాస విషయముల నుత్సాహముతో చెప్పుచు, నాతో “మీరును ఇట్లే కవి పండితులై ఉపన్యాసములు చెప్పి సభ్యులనలరించు కాలము వచ్చు” ననెడివాడు. ప్రేమతో అతడనెడి వాక్యములు నేనుపన్యాస వేదిక ఎక్కునప్పుడెల్ల జ్ఞప్తికి తగులుచుండును.
మాటలు విస్మృతములై గాలిలో కలసి పోవచ్చును, వాని ప్రభావము మాత్రము శాశ్వతముగా నుండి పోవును.
రచన: కళా ప్రపూర్ణ దివాకర్ల వేంకటావధాని
సేకరణ – రాజేశ్వరి దివాకర్ల