[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
అపురూపమైనదమ్మ ఆడజన్మ
~
చిత్రం: పవిత్ర బంధం
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
గానం: కె. జె. ఏసుదాస్
~
పాట సాహిత్యం
సాకీ:
కార్యేషుదాసి, కరణేషు మంత్రి,
భోజ్యేషు మాతా, శయనేషు రంభా,
పల్లవి :
అపురూపమైనదమ్మ ఆడజన్మ,
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
మగవాడి బ్రతుకులో సగపాలు తనదిగా
జీవితం అంకితం చేయగా..
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
చరణం :
పసుపుతాడు ఒకటే మహాభాగ్యమై
బతుకుతుంది పడతి పతే లోకమై
మగని మంచికోసం పడే ఆర్తిలో
సతిని మించగలరా మరే ఆప్తులు?
ఏ పూజ చేసిన ఏ నోము నోచిన
ఏ స్వార్థం లేని త్యాగం భార్యగా రూపమే పొందగా
॥అపురూపమైనదమ్మ॥
చరణం :
కలిమి లేములన్ని ఒకే తీరుగా కలిసి పంచుకోదా సదా తోడుగా కలిసి రాని కాలం వెలే వేసినా విడిచిపోని బంధం తనై వుండదా
సహధర్మచారిణి సరిలేని వరమని, సత్యాన్ని కనలేని నాడు
మోడుగా మిగలడా పురుషుడు?
॥అపురూపమైనదమ్మ॥
♠
“నరనారీ సంబంధము/ పరిభావింపుము దిశా
విభాగము వరుసన్/ ధర జననీ, భగినీ, సహచరీ/
కుమారీ క్రమము నిజంబగుట సుధీ!”
అంటారు రాయప్రోలు వారు. జననీ, భగినీ, సహచరీ, కుమారీ అనే నాలుగు రూపాలలో పురుషుని జీవితాన్ని నాలుగు దిక్కులుగా, స్త్రీ ఆవరించి ఉంటుందనీ, మానవ జీవితంలో మహిళల ప్రాధాన్యతను తేల్చిచెప్పారు.
ఈ శతాబ్దంలో మాతృ హృదయంతో పురుష రూపంలో జన్మించిన మొట్టమొదటి విమర్శకుడు, కవి ఎవరూ? అంటే రాయప్రోలు సుబ్బారావు గారనే చెప్పాలి! కవిత్వంలోనూ, సాహిత్య విమర్శలోనూ ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలకు భూమిక ‘స్త్రీ’. కవిగా తృణకంకణాది కావ్యాలతోపాటు విమర్శకుడిగా స్త్రీవాద భావనను ఆలంబనగా చేసికొని రమ్యాలోకాది విమర్శ గ్రంథాలను రాశారు.
వాల్మీకి ఒక రాముడి గురించి వ్రాస్తాడు, ఒక సీత గురించి వ్రాస్తాడు, రావణాసురుని గురించి వ్రాస్తాడు, హనుమ గురించి వ్రాస్తాడు. కవి ఎన్ని పాత్రలలో పరకాయ ప్రవేశం చేయాలి? వాల్మీకికి సీత గురించి తెలుసా? సీత మనసు సీత భావాలు తెలియకపోతే, అర్థం కాకపోతే సీతను అతడు ఎలా ఆవిష్కరిస్తాడు? మనసును కదిలించే అద్భుతమైన ఘట్టాలన్నీ, ఎలా వచ్చాయి, ఎక్కడినుండి వచ్చాయి? అంటే గొప్ప ఊహాశక్తి నుండి! ఈ భావనా శక్తి గనక సరిగ్గా లేకపోతే, ఆ కవిత్వం రాణించడానికి అవకాశం లేదు. అందుకే imagination heartful గా, హృదయంగమమై హృదయగతమై వుండాలి. Poetry is the expression of imagination. ఇది expression of content, కాదు expression of feeling. భావనా శక్తిని వ్యక్తీకరించడమే.
సినీ సాహిత్యం విషయానికి వస్తే, ఇప్పటివరకు స్త్రీలకు సంబంధించిన అన్ని పాటలను రచించిన వారు సినీ కవులే కానీ కవయిత్రులు కాదు. వాటిలో మహిళలను ఇటు ఎంతో ఉన్నతంగా చిత్రీకరించిన పాటలు, అటు ఒక ఆట వస్తువుగా, అంగడి బొమ్మగా వక్రీకరించిన పాటలు.. అన్ని మనకు కనిపిస్తాయి.
స్త్రీలను కించపరిచే విధంగా, చులకన చేసే విధంగా సిరివెన్నెల పాటలు వ్రాయకపోగా, వారిని ఎప్పుడూ మహోన్నతంగానే చిత్రీకరించారు. మహిళలపై వారికున్న ఆదరాభిమానాల్ని వారి పాటల్లో ప్రతిబింబించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు స్త్రీల సున్నితమైన భావోద్వేగాలను విశదీకరించేటప్పుడు, స్త్రీల పక్షాన నిలబడి ధైర్య వచనాలు పలికినప్పుడు, మహిళలను ఉన్నతంగా వ్యక్తీకరించినప్పుడు, స్త్రీల మనోభావాలకు అద్దం పడుతూ, సున్నితమైన ప్రతి భావాన్నీ, సునిశితంగా స్పృశించినప్పుడు, ఈయన ఒక పురుషుడై వుండి, స్త్రీల మనసులోకి చొరబడినట్టు ఇంత చక్కగా వారి భావాలను ఎలా వ్యక్తపరుస్తున్నారని ఆశ్చర్యపోక తప్పదు.
అసలు మగవారై ఉండి ఆడవారి మనసులో దూరి చూసినట్టు అంత గొప్పగా ఎలా వ్రాశారు? అని చాలా వేదికల్లో అడిగిన ప్రశ్నలకి ఆయన ఇచ్చిన సమాధానం.. ‘అసలు ప్రపంచంలో భగవంతుడు మాత్రమే పరమ పురుషుడు. మిగిలినదంతా ప్రకృతి. ప్రకృతి అంటే. స్త్రీ అయిన ప్రకృతిలో భాగమైన నాకు స్త్రీ హృదయం ఎందుకు అర్థం కాదు?’ ఇంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మనిషి కాబట్టే, తల్లి రూపంలో కానీ, భార్య రూపంలో కానీ, ఒక ప్రేయసి రూపంలో కానీ, కూతురి రూపంలో కానీ, చివరకు ఒక item girl పాత్రను కానీ.. ఏ విధమైన స్త్రీ పాత్రను వర్ణించినా, అంత ఉన్నతంగానే ఆ భావాలను ఆయన వ్యక్తపరిచారు.
సిరివెన్నెల స్త్రీలకు సంబంధించి వ్రాసిన కొన్ని పాటలు సాహిత్యాన్ని పరిశీలించి, ఆయన పంచిన ఉన్నతమైన అభివ్యక్తులను అర్థం చేసుకుందాం.
‘పవిత్ర బంధం’ (1996) చిత్రంలో కథానాయకునికి యాక్సిడెంట్ అయి మంచం మీద వున్నప్పుడు ఇల్లాలు చేసిన సేవల గురించి వర్ణిస్తూ, ఆమె ప్రాముఖ్యాన్ని వివరించే ఈ పాట చిత్రంలో నేపథ్య గీతంగా వినిపిస్తుంది. ఈ సందర్భానికి సిరివెన్నెల వ్రాసిన పాటలో ఆలుమగల అనుబంధానికి సంబంధించిన వ్యక్తిగత మనోభావాలు కూడా తొంగిచూస్తాయి. ఆయన జీవిత సహచరిని ఎంత గౌరవంగా చూసుకుంటారో, ఆదరిస్తారో నిజజీవితంలో మనం గమనించవచ్చు. తన విజయాల వెనుక తన భార్య శ్రీమతి పద్మావతి గారి సహకారం, ప్రోత్సాహం ఎంతో ఉందని, ఆమె తన బెటర్ హాఫ్ కాదని, ‘బెటర్ త్రీ ఫోర్త్’, అనీ సిరివెన్నెల చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. ‘శ్రీ’ (సంపద), ‘స్త్రీ’ (భార్య) లేని ఇల్లు కాంతిహీనంగా ఉంటుందనీ, ఆమె వల్లే జీవితానికీ, కుటుంబానికి పరిపూర్ణత లభిస్తుందని మనువు వ్యాఖ్యానం, సిరివెన్నెల రచనల్లో కూడా ప్రతిబింబిస్తుంది.
‘కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ, షట్కర్మయుక్తా కుల ధర్మ పత్నీ’, అనే మనుస్మృతిలోని శ్లోకం, సాకీగా పాట ప్రారంభమవుతుంది.
భారతీయ సంస్కృతికి పట్టుకొమ్మలుగా నిలుస్తున్న వేదాలు స్త్రీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాయి. ఋగ్వేదం యజుర్వేదం, అధర్వణ వేదాల్లోని అనేక మంత్రాలు స్త్రీ ఔన్నత్యాన్ని విశేషంగా ప్రశంసించటంతో పాటు మహిళల్ని ఎంతో గౌరవంగా చూడాలనే బాధ్యతను పురుషులకు నిర్దేశించాయి. భర్తకు భార్యగా ఉంటూ, దాసి తరహాలో అతనికి సేవ చెయ్యటం స్త్రీధర్మం అనే భావనను వేదాలు నిరసించాయి. ఇంటికి యజమానురాలిగా, బిడ్డకు తొలి గురువుగా, అవసరమైన సందర్భాల్లో పురుషులతో సమానంగా విద్య అందాలనీ, విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత మాత్రమే వివాహానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని అధర్వణవేదం చెబుతోంది. ఇందుకు ఆయా వేదాల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి.
వేదాలతో సహా పురాణాలన్నీ స్త్రీని శక్తిస్వరూపంగా వర్ణించాయి. త్రిమూర్తుల కన్నా ఉత్తమస్థానంలో జగజ్జననిగా, పరాదేవతగా మహిళనే నిలిపాయి.
పల్లవి:
అపురూపమైనదమ్మ ఆడజన్మ,
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
మగవాడి బ్రతుకులో సగపాలు తనదిగా
జీవితం అంకితం చేయగా..
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా..
బ్రహ్మ సృష్టి చేస్తే.. అమ్మ ప్రతి సృష్టి చేస్తుంది. అంతటి మహోన్నతమైన శక్తి స్త్రీమూర్తికి మాత్రమే ఉంది. అందుకే అపురూపమైన స్త్రీ జన్మ పరిపూర్ణత కావాలంటే తాను ఇల్లాలుగా మారాలి. మారినంత మాత్రాన సరిపోదు, మనసా, వాచా, కర్మణా, భర్త జీవితంలో సగభాగం తనదిగా, జీవితాన్ని అంకితం చేయాలి. అప్పుడే ఆలుమగలు చెరొక సగమై, ఇద్దరూ కలిసి సంపూర్ణమైన జీవన యాత్రను కొనసాగించగలరని, సిరివెన్నెల అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నారు.
‘భార్య’పై అధికారం చెలాయించే హక్కు పురుషుడికి ఎప్పటికీ లేదని, ఆమెతో పురుషుడు ఏవిషయంలోనూ సాటిరాలేడని మనువు స్పష్టంగా చెప్పాడు. మనిషికి అర్థం, పరమార్థం స్త్రీవల్లే కలుగుతాయి. భార్యను మించిన స్నేహితుడు భర్తకు మరొకరు లేరు. పురుషుడు స్త్రీ లేకుండా పరిపూర్ణత్వాన్ని పొందలేడు. అతడిని స్వీకరించటానికి సమ్మతించి స్త్రీ అతని ఇంటికి భార్యగా వచ్చినప్పుడే పురుషుడికి పూర్ణత్వం సిద్ధిస్తుందంటాడు మనువు.
చరణం:
పసుపుతాడు ఒకటే మహాభాగ్యమై
బతుకుతుంది పడతి పతే లోకమై
మగని మంచికోసం పడే ఆర్తిలో
సతిని మించగలరా మరే ఆప్తులు?
ఏ పూజ చేసిన ఏ నోము నోచిన
ఏ స్వార్థం లేని త్యాగం భార్యగా రూపమే పొందగా
॥అపురూపమైనదమ్మ॥
తనకు రక్తాన్ని పంచి ఇచ్చి, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను వదిలి, తాళిబొట్టు అనే పసుపుతాడే బంధంగా, మహాభాగ్యంగా భర్త ఇంట్లో అడుగుపెట్టి, భర్తే లోకంగా స్త్రీలు జీవిస్తారు. భర్త గురించి ఒక భార్య పడే తపన, తాపత్రయం, మరెవరికైనా ఉంటుందా? ఆమెకు మించిన ఆత్మీయులు భర్తకు మరి ఎవరు లభిస్తారు? ఎన్ని పూజలు ఎన్ని నోములు నోచుకున్నా, నిస్వార్థంగా భర్తను ప్రేమిస్తూ, తన భర్త కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడే భార్యలు ఎంతమందికి లభిస్తారు? ఆ విధంగా జీవించే స్త్రీ జన్మ నిజంగా అపురూపమైనదేనని నిర్వచిస్తున్నారు సిరివెన్నెల.
చరణం:
కలిమి లేములన్ని ఒకే తీరుగా కలిసి పంచుకోదా సదా తోడుగా
కలిసి రాని కాలం వెలే వేసినా, విడిచిపోని బంధం తనై వుండదా
సహధర్మచారిణి సరిలేని వరమని, సత్యాన్ని కనలేని నాడు
మోడుగా మిగలడా పురుషుడు?
॥అపురూపమైనదమ్మ॥
ఒక జీవన సహచరిగా, మంచి స్నేహితురాలిగా, తోడూ నీడగా, కష్ట సుఖాలు, కలిమిలేములు భర్తతో కలిసి భార్య పంచుకుంటుంది కదా! ఒకవేళ, కాలం కలిసి రాక, భర్త ఇబ్బందులలో పడినా, ఒక నీడలాగా, స్థిరమైన బంధంగా భార్య తన వెంట నడవదా? సహ ధర్మచారిణికన్నా గొప్ప వరము మరేదీ లేదని మగవారు గుర్తించాలి. అలాంటి సత్యాన్ని గుర్తించలేని వాడు, భార్య గొప్పదనాన్ని అర్థం చేసుకోలేని వాడు మోడుగా మిగిలిపోతాడు కదా! అంటున్నారు సిరివెన్నెల. అంటే, అలాంటి పురుషుడు బ్రతుకు విలువను తెలుసుకోలేక, నిర్జీవంగా బ్రతుకుతాడనీ.. అందుకే భార్య విలువను, ప్రేమను, త్యాగాన్ని గుర్తించి, ఆమెను సరైన గౌరవంతో ఆదరించమని సిరివెన్నెల హితోపదేశం చేస్తున్నారు.
~
స్త్రీ శీలానికి సరికొత్త నిర్వచనం చెపుతూ ‘పెళ్లి చేసుకుందాం’ చిత్రంలో సిరివెన్నెల ఓ ఓదార్పు గీతాన్ని వ్రాశారు. అత్యాచారానికి గురైన ఒక స్త్రీకి సరైన ధైర్యవచనాల్ని నూరిపోసే ఈ పాట.. ప్రతి మనసును తప్పకుండా ఆకట్టుకుంటుంది.
పల్లవి: నువ్వేమి చేశావు నేరం – నిన్నెక్కడంటింది పాపం.. చినబోకుమా
చేయూత నందించు సాయం- ఏనాడు చేసింది సంఘం?
గమనించుమా
కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా? మార్గం చూపే దీపం కాదా ధైర్యం?
చరణం:
జరిగింది ఓ ప్రమాదం – ఏ ముంది నీ ప్రమేయం
దేహానికైన గాయం ఏ మందుతోనో మాయం
విలువైన నిండు ప్రాణం మిగిలుండడం ప్రధానం
అది నిలిచినంత కాలం – సాగాలి నీ ప్రయాణం
స్త్రీల తనువులోనే శీలమున్నదంటే పురుషస్పర్శ తోనే
తొలగిపోవునంటే ఇల్లాళ్ల దేహాలలో శీలమే వుండదనా?
భర్తన్న వాడెవడూ పురుషుడు కాదు అనా?
శీలం అంటే గుణం అని అర్థం ॥నువ్వేమి॥
చరణం:
గురివింద ఈ సమాజం – పరనింద దాని నైజం
తన కింద నలుపుతత్వం – కనిపెట్టలేదు సహజం
తనకళ్లముందు ఘోరం – కాదనదు పిరికి లోకం
అన్యాయమన్న నీపై – మోపింది పాపభారం
పడతి పరువు కాచే చేవలేని సంఘం
సిగ్గుపడకపోగా నవ్వుతోంది చిత్రం
ఆనాటి ద్రౌపదికి – ఈనాటి నీగతికి
అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్లది అంతేగాని నీలో లేదే దోషం!
ఇది అత్యాచారానికి గురయిన నాయికను ఓదార్చి /నువ్వేమి చేశావు నేరం/ నిన్నెక్కడంటింది పాపం.. చినబోకుమా/ అనే మాటలతో.. ఎవరో చేసిన పనికి నీవు బాధ పడవద్దు! అంటూ ఆమె మానసికగాయానికి లేపనంలా పనిచేసే ఊరటను కల్పిస్తున్నారు. శీలానికి కొత్త అర్థం చెపుతూ, నీకు జరిగింది ఒక ప్రమాదం, నీకు సంబంధం లేకుండా మీ ప్రమేయం లేకుండా జరిగింది ఏదైనా ప్రమాదం లాంటిదే, అని సరికొత్త నిర్వచనం ఇచ్చారు సిరివెన్నెల. ఆ గాయాన్ని మాన్పుకోవడం కష్టమేమీ కాదు, తన లోపాలను కప్పిపుచ్చుకునే ఈ గురివింద సమాజం, ఏ రోజు ఎవరికి సాయం చేయకపోగా, దెప్పిపొడిచే మాటలు మాట్లాడుతుంది, అటువంటి సమాజం గురించి బాధపడవలసిన అవసరం లేదంటూ.. ఆమెను ఓదార్చిన సందర్భంలోని పాట ఇది.
~
‘ఆడపిల్ల’ చిత్రంలో, ఏ శాపం వల్లనో, ఏ పాపం వల్లనో మహిళల రక్తం పంచుకొని కొన్ని మగ మృగాలు పుడతాయనే.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిరివెన్నెల.
ఎవ్వరి శాపం ఎప్పటి పాపం
మహిళల రక్తం మరిగిన మగ మృగాన్ని కనే జన్మ ॥2॥
ధిక్కరించు తరుణి మగ జాతి కటికతనాన్ని
పాలుతాగి పెరిగే నీ మరణ శాసనాన్ని ॥ఎవ్వరి॥
చరణం:
సుగుణ శీలము సుదతి రూపము
కొనివ్వలేవులే కళ్యాణ యోగము..
~
‘లాయర్ సుహాసిని’ చిత్రంలో దివిలోని మెరుపులాగా, భువికి దిగిన కరుణలాగా, బ్రతుకును వెలిగించే వెలుగులాగా, చెలిమిని అందించే కలిమిలాగా, వలపుల మధువని లాగా, సుగుణాలకు తరగని గనిలాగా, అరుదైన వరంగా తన భార్యను వర్ణిస్తూ నాయకుడు పాట పాడుతుండగా, ఆమె ‘సామజవరగమనా’ అని వంత పాడుతూ ఉంటుంది. ఈ పాటంతా భార్యలోని సుగుణాలను నాయకుడి మనస్సుతో ఉన్నతంగా ప్రశంసించడం జరిగింది.
పల్లవి:
ఆమె: సామజవరగమనా
అతడు: దివిని తిరుగు మెరుపు లలన
ఆమె: సామజవరగమనా
అతడు: కరుణ కరిగి భువికి దిగెన
ఆమె: సామజవరగమనా
అతడు: బ్రతుకు వెలిగె తరుణి వలన
ఆమె: సామజవరగమనా
అతడు: చెలిమి కలిమి మరువగలన
॥సామజవరగమనా॥
చరణం:
అతడు: అరవిరిసిన చిరునగవుల
ఆమె: సామజవరగమనా
అతడు: ఇల కురిసెను సిరి వెలుగులు
ఆమె: సామజవరగమనా
అతడు: సొగసుల మణి నిగనిగమని
ఆమె: సామజవరగమనా
అతడు: మెరిసిన గని మురిసెను మది
ఆమె: సామజవరగమనా
అతడు: వెలసెను వలపుల మధువని
చరణం:
ఆమె: సామజవరగమనా
అతడు: మమతల ఉలి మలచిన కల
ఆమె: సామజవరగమనా
అతడు: తళుకుమనెను వెలి కులుకుల
ఆమె: సామజవరగమనా
అతడు: సుగుణములను తరగని గని
ఆమె: సామజవరగమనా
అతడు: దొరికినదని ఎగసెను మది
ఆమె: సామజవరగమనా
అతడు: అరుదగు వరమిది తనదని
ఆమె: సామజవరగమనా
~
‘పుట్టింటి పట్టుచీర, చిత్రంలో.. దుఃఖభరితమైన స్త్రీల జీవితాలపై ఆవేదన వ్యక్తపరుస్తూ, ఆడజన్మకూ – కన్నీళ్ళకు యుగయుగాలుగా ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుంది, నిరంతరంగా కన్నీటి వర్షాలు కురిపిస్తూ ఉన్నా, కాస్తంత కనికరం కూడా కొన్ని జీవితాలకు ఎందుకు దక్కడం లేదో, అని బాధను వ్యక్తీకరిస్తూ సిరివెన్నెల ఈ పాట వ్రాశారు.
పల్లవి:
ఆడజన్మకీ అశ్రువులకీ వీడిపోని ఈ బంధం
ఏ యుగానిదో ఏ యుగానిదో ॥2॥
ఆశించలేదు ఏ అంతఃపురాలు
అడగలేదేనాడు ఆడంబరాలు
కాసింత కనికరమే ఇంత కరువవునా
అణువంత ఆదరణే అత్యాశ అనుకోనా
ఆషాఢ మేఘాలై నీలాల కళ్ళు వర్షించుతున్నాయే
ఆరారు కాలాలు చితిమంటలకైనా ఈ కన్నీళ్ళు ఆవిరి అయిపోతే అంతేచాలు ॥ఆడజన్మకీ॥
~
‘మహానటి’ చిత్రంలో భగ్నమైపోయిన కథానాయక జీవితాన్ని ఎంతో సానుభూతితో(ఇక్కడ సానుభూతి అంటే జాలి కాదు-Empathy.. సహ- అనుభూతి) అక్షరబద్ధం చేస్తూ, ఏ కథకైనా చివరకు మిగిలేది జ్ఞాపకాలే! అన్న సత్యాన్ని జోడించి, మనసుకు హత్తుకునే పాటను రచించారు. మనందరి మనసులో కలిగే భావాలు, ఆయన కలం నుండి పాటల రూపంలో బయటికి వస్తాయనటంలో సందేహమే లేదు!
పల్లవి:
అనగా అనగా మొదలై కథలు
అటుగా ఇటుగా నదులై కదులు
అపుడో ఇపుడో దరిజేరునుగా
కడలో ఎదురై కడదేరునుగా
గడిచే కాలాన గతమేదైనా స్మృతి మాత్రమే కదా
కోరస్: చివరకు మిగిలేది చివరకు మిగిలేది ॥2॥
చరణం:
ఎవరు ఎవరు ఎవరు నువ్వంటే
నీవు ధరించిన పాత్రలు అంతే
నీదని పిలిచే బ్రతుకేదంటే
తెరపై కదిలే చిత్రమే అంతే
ఈ జగమంతా నీ నర్తనశాలై
చెబుతున్న నీ కథే చివరకు మిగిలేది
విన్నావా మహానటి చెరగని చేవ్రాలిది
నీదేనే మహానటి చివరకు మిగిలేది
విన్నావా మహానటి
మా చెంపల మీదుగా ప్రవహించే మహానది
కోరస్: మహానటి మహానటి ॥3॥
ఆ ‘నీదేనే’ అనే మాటలో.. లాలిత్యం, మమకారం, మాటలకందని మమత, అందఱి ఆప్యాయతా నీకు మాత్రమే స్వంతం.. అన్న ప్రశంస.. అన్నీ ఇమిడి ఉన్నాయి. దివికేగిన ఆ మహానటి చెరగని ఆనవాళ్ళు తరతరాలకు ఆమె కథను చెబుతూనే ఉంటాయి.
ఈ భావం స్ఫురణకు రాగానే ఆవిడ నటనను ఆస్వాదించే వారందఱికీ కంట నీరు ఆగదు. ఆ భావానికి అక్షర రూపమే, “మా చెంపల మీదుగా ప్రవహించే మహానది”.. మహానటి జీవితం అనూహ్యమైన పతనానికి దారి తీసిన తీరు, పెట్టించే కన్నీరు కూడా, ఎడతెగని ‘మహా’ నదిలాగా సాగుతుందన్న సిరివెన్నెల ఉపమానం కూడా మహోపమానమే! ‘మహా’ అనే పదానికి మన భాషలో, సాహిత్యములో విశిష్టమైన గాంభీర్యం ఉంది. ఆవిడ మన కంట నీరు తెప్పించి వెళ్ళి పోయినా, నిత్యం మన జ్ఞాపకాలలో ప్రవహిస్తూ ఉండే మహానది ఆమె.
~
‘అమ్మ రాజీనామా’ చిత్రం ద్వారా బహుళ ప్రచారంలోకి వచ్చిన, ‘ఎవరు రాయగలరూ.. అమ్మా! అను మాటకన్నా కమ్మని కావ్యం’.. అనే పాట ఒక కావ్య గీతంలా, అమ్మ పాటల్లో ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకుంది. ఇందులోని ప్రతి పంక్తి కూడా, అమ్మ సజీవ చిత్రాన్ని, త్యాగాలను, ప్రేమను, మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. సిరివెన్నెల గారి, wonderful melodious లో ఒకటిగా ఈ పాట నిలిచిపోయింది.
పల్లవి:
ఎవరు రాయగలరూ.. అమ్మా! అను మాటకన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ.. అమ్మా! అను రాగం కన్న తియ్యని రాగం..
అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి ॥ఎవరు॥
చరణం:
అవతారమూర్తియైనా అణువంతే పుడతాడు అమ్మపేగు పంచుకునే అంతవాడు అవుతాడు అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని ॥ఎవరు॥
ఎంతమంది మహనీయులు, ఎన్ని రకాల నిర్వచనాలు ఇచ్చినా, మాతృత్వపు అమృతాన్ని ఏవి సరిగ్గా నిర్వచించలేవని తేల్చి చెపుతూ, ఎవరు రాయగలరు, ‘అమ్మా’ అను మాటకన్నా కమ్మని కావ్యం? అనీ, ఆ పదమే ఒక కావ్య సమానం, కాబట్టి ఇంకెవరూ మించిన నిర్వచనం ఇవ్వలేరు- అని ఘంటాపథంగా తేల్చిచెప్పారు సిరివెన్నెల.
~
అమ్మా, నాన్నలిద్దరూ నాణేనికి బొమ్మ-బొరుసు లాంటివారని, వారి లాలన-పాలన బిడ్డల భవిష్యత్తుకు దారి చూపుతుందని, వారి ఎదుగుదలలో తల్లిదండ్రులు ఇద్దరికీ సమానమైన భాగస్వామ్యం ఉందని, తెలియజేసే పాటను సిరివెన్నెల ‘మావిడాకులు’ చిత్రం కోసం వ్రాశారు. ఈ పాటలో తల్లి గొప్పదనాన్ని తండ్రీ, తండ్రి గొప్పదనాన్ని తల్లీ, వివరిస్తారు.
పల్లవి:
అతడు: అమ్మంటే తెలుసుకో జన్మంతా కొలుచుకో
ఇలలో వెలసిన ఆ బ్రహ్మపేరు అమ్మ అనుబంధానికి అనురాగానికి తొలి రూపం అమ్మంటే
ఆమె: నాన్నంటే తోడురా నీ వెంటే నీడరా
అతడు: అమ్మయిన స్త్రీజన్మ అరుదైన పుణ్యం
చరణం:
అతడు: రొమ్ముల్లో నింపింది ప్రేమామృతం
పేగు చీలి ముడతపడిన పొత్తికడుపు చర్మం
స్త్రీజాతి త్యాగాలు రాసున్న గ్రంథం
మమతెరిగిన మాతృత్వం తరగని అందం
అది తెలియని సౌందర్యం దొరకని స్వప్నం
ఆమె: అతిమధురం తల్లితండ్రి అయ్యేక్షణం
తల్లి త్యాగాన్ని ప్రశంసించడంలో, ‘పొత్తికడుపు చర్మం, స్త్రీ జాతి త్యాగాలు రాసుకున్న గ్రంథం’, అనే వ్యక్తీకరణ ఎంత మనసుకు తాకేలా, హృదయాన్ని కదిలించేలా, ఉందో చూడండి! ఎంత లోతైన, సూక్ష్మ పరిశీలన! సిరివెన్నెల మార్క్ ఎక్స్ప్రెషన్స్ ఇవే!
ప్రపంచంలోని మరే ఇతర దేశం స్త్రీకి ఇవ్వని సమ్నుతస్థానాన్ని మనదేశం ఇచ్చిందన్న విషయం మనందరికీ తెలుసు. భారతమాత! అంటూ జన్మనిచ్చిన భూమికి నమస్కరించే సంస్కారం కేవలం మనదేశంలోనే ఉంది. స్వాతంత్య్ర సంగ్రామంలో కూడా ‘మాతృభూమి’, ‘వందేమాతరం’ వంటి నినాదాలు ప్రజల్లో స్వేచ్ఛాప్రియత్వాన్ని కలిగించి, స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిల్చాయి. కేవలం మనదేశంలోనే మహిళను ‘అమ్మా’ అని పిలిచే సంస్కారం ఉంది. పరిచయం లేని మహిళ ఎదురైతే, ఆమెతో మాట్లాడాల్సిన సందర్భం వస్తే ‘ఏమ్మా’ అంటూ సంబోధించే ఉత్తమగుణం ఈ మట్టిలో పుట్టిన ప్రతి మనిషికీ సహజంగా వస్తుంది.
దేశంలోని ప్రతి అణువులో మహిళాశక్తి ప్రకటితమవుతుంది. గంగ, గోదావరి, నర్మద, సరస్వతి, యమున.. ఒక్క బ్రహ్మపుత్ర తప్ప.. ప్రతి నదికీ స్త్రీ పేరు ఉంటుంది. కారణం.. మనిషికి అత్యంత ప్రాణాధారమైన వాటిల్లో నీటిని కూడా స్త్రీశక్తిగా పూజిస్తుంది మన దేశం. అంత ఉన్నతమైన విలువలను, సంప్రదాయాలను, సనాతన భావాలను ఊపిరిగా నింపుకున్న సిరివెన్నెల కూడా, తన సాహిత్యంతో స్త్రీలను అంతే మహోన్నతమైన స్థానంలో నిలిపారు.
సమాజాన్ని, సమాజంలో స్త్రీలని కించపరిచే పాటలు ఎప్పటికీ తాను వ్రాయనని, వ్రాయలేదని, వ్రాయలేననీ, సిరివెన్నెల చెబుతూ ఉంటారు. స్త్రీమూర్తుల ఔన్నత్యాన్ని, త్యాగాలను, ప్రతిబింబించే పాటలు మాత్రమే ఆయన ఇప్పటిదాకా రచించారు. మహిళా మూర్తులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు ఎన్నో రకాల కట్టుబాట్లు వేద కాలం నుండే భారతదేశంలో ఏర్పాటు చేయబడ్డాయి. యుగాల నాడే మహిళకు సర్వోన్నత గౌరవం ఇచ్చిన మన సంస్కృతిని మన వారసత్వ సంపదగా ఇలాంటి గొప్ప రచనలు కాపాడుతూ ఉంటాయి. స్త్రీలలో ఉన్నతమైన విలువలను పెంపొందిస్తూ, ఆత్మవిశ్వాసాన్ని పెంచి, జీవితాన్ని ఆనందమయం చేసుకునేందుకు, సిరివెన్నెలగారి గీతాలు నిండైన స్ఫూర్తినిస్తాయి.
Images Source: Internet
శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ గారు ఆంగ్ల అధ్యాపకురాలు, వ్యక్తిత్వ వికాస నిపుణురాలు, గీత రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు(తెలుగు-ఇంగ్లీష్-హిందీ), సామాజిక కార్యకర్త.