[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
పంచమ సర్గః
దిగంతరీయయా రీత్యా యత్ర రాజ్ఞావ్యవారితాః।
ప్రియామగమనం నార్యశ్రితామారుహ్య కుర్వతే॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 61)
అసక్తికరమైన శ్లోకం ఇది.
బాహ్య దేశాన్నుంచి కాశ్మీరు వచ్చిన వారు, బాహ్య దేశాల సంప్రదాయాన్ని అనుసరించి, తమ పతి చితిలో పడి సజీవ దహనమవటాన్ని రాజు నిషేధించ లేదు. వారికి అడ్డు చెప్పలేదు. ‘బాహ్యదేశాల నుంచి’ అంటే, కశ్మీరు కాక భారతదేశంలోని ఇతర భాగాల నుంచి అని పలువురు వ్యాఖ్యానించారు. అలాంటి వారు తమ ప్రేమించిన వారి చితిలో పడి దహనమవ్వాలనుకుంటే, రాజు అడ్డు చెప్పలేదు అని చెప్తున్నాడు శ్రీవరుడు.
‘సతి’ కశ్మీరుకు కాత్త కాదు. రాణీ దేవి వాక్పృష్ట తన పతితో పాటు చితిలో మరణించిందని రాజతరంగిణి ద్వారా తెలుస్తుంది. ‘సతి’ పద్దతి కశ్మీరు లోనూ అమలులో ఉండేదని ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. కశ్మీరులో స్త్రీలే కాదు పురుషులు కూడా తమ స్త్రీ మరణిస్తే ఆ చితిలో దూకి ప్రాణత్యాగం చేసిన సందర్భాలున్నాయి. జలౌక రాజు, మిహిరకులుడు ఇందుకు ఉదాహరణలు. అంటే, సతి సహగమనం, పతిసహగమనం రెండూ కశ్మీరులో అమలులో ఉండేవన్న మాట. కానీ కశ్మీరు ఇస్లాంమయం అయిన తరువాత ఈ పద్ధతి తానంతట అదే అదృశ్యయమయిపోయింది. ఎందుకంటే, ఇస్లామేతరలన్న వారే లేని పరిస్థితి నెలకొంది కశ్మీరులో. కాబట్టి ‘సతి’ని పాటించేవారు లేరు. కానీ జైనులాబిదీన్ అధికారానికి వచ్చిన తరువాత కశ్మీరు వదిలిన ఇస్లామేతరులు తిరిగి కశ్మీరులో నివిసించే పరిస్థితులు కల్పించాడు. వారిలో సతీ సహగమనం పాటించేవారు ఉన్నారు. వారు సతీ సహగమనం పాటిస్తే రాజు అభ్యంతరాలు చెప్పలేదు. అడ్డు చెప్పలేదు. ఈ శ్లోకం ద్వారా శ్రీవరుడు చెప్పదలచుకున్న దేమిటంటే, రాజు తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సంబంధం లేకుండా ఎవరి సాంప్రదాయాన్ని, పద్ధతులను పాటించే స్వేచ్చ ఇచ్చాడన్న మాట. ఇందుకు భిన్నంగా బ్రిటీష్ వారు, వారి కారణాలేవేవో చెప్పి, ఇక్కడి వారి పద్దతులను, ఆచారాలను, మాన్పించటమో రూపాంతరం చెందించటమో చేశారు. దీన్ని బట్టి పరమత సహనం అంటే, లౌకిక రాజ్యం అంటే తనకు నచ్చినా నచ్చకపోయినా ఎదుటివాడికి వాడి ధర్మాన్ని పాటించే స్వేచ్ఛ, సంప్రదాయాన్ని అనుసరించే స్వేచ్ఛను ఇవ్వటం అని అర్థం అవుతుంది. దాన్ని హేళన చేయటం, దూషించటం, తప్పని వారించటం, మాన్పించటం లౌకిక తత్వం కాదు. పరమత సహనం కాదు. అందుకే జైనులాబిదీన్ పాటించినట్టు పరమత సహనం పాటించిన మరో సుల్తాను లేడు అనటం అనృతం కాదు, అతిశయోక్తి కాదు. జైనులాబిదీన్ తో పోలిస్తే, ఇప్పటి లౌకిక వాదులకు, మేధావులకూ లౌకిక వాదం అంటేనే తెలియదని ఘటాపథంగా చెప్పవచ్చు.
అర్థిసంధోపకారార్థ పౌరాణాం సుకృతీ నృపః।
విహారం బహు విస్తారం తత్సంగమతటే వ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 62)
మారీ నదీ సంగమం వద్ద రాజు పేదవారి కోసం ఒక పెద్ద విహారం నిర్మించాడు.
స చ హాజ్యే విహారాశ్చ పారావారే పురుధ్వయే।
గృహశ్రోణి మణివ్రాతనాయకశ్చ్రి యామాపుతుః।
అన్యాః ప్రతిష్ఠాస్తంకాలం రాజ్ఞా స్వస్ధేన కారితాః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 63)
రెండు నగరాలలోని వజ్రాలలాంటి ఇళ్ళ నడుమ ఈ విహారం, నదీ తీరానికి మరో వైపున ఉన్న విహారం హాజ్య విహారాలు మణిమయ కేంద్రాలుగా అనిపిస్తాయి.
హజ్య విహారం శ్రీగనరంలో ఉండేదని తెలుసు. కానీ ఇప్పుడు దాని అనవాళ్ళు లేవు.
శ్రీహర్షో నృపతిర్భభూవ కవితారాజ్యే తరా యే భవన్।
సర్వే తే కవయః కిమన్యదపి శ సూదాః స్త్రీయో భారికాః॥
సన్త్యద్యాపి కృతాని తైః ప్రతి గృహం పద్యాని విధానిధీ।
రాజా చేద్ గుణవాన్ గుణేషు రసికో లోకో భవేత్ తాదృశః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 64)
కవి అయిన శ్రీహర్షుడు రాజు అయినప్పుడు రాజ్యంలోని ప్రతి ఒక్కరూ కవి అయ్యాడు. ఆ కాలంలో మహిళలు, వంటవాళ్లు, కుమ్మరి వాళ్లు అందరూ కవులే. ఆ కాలంలో వారి రచనలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి. రాజు విజ్ఞాన సముద్రం అయితే, అతను ప్రతిభకు పట్టం కట్టే వాడయితే, అతని రాజ్యంలో ప్రజలు కూడా అలాంటివారే అవుతారు.
శ్రీవరుడు శ్రీహర్షుడి ఉదాహరణ చెప్పటం ఆలోచనలను కలిగిస్తుంది. ఎందుకంటే, శ్రీహర్షుడి కాలంలో శ్రీహర్షుడిని అనుసరిస్తూ కవులు తామరతంపరగా అభవృద్ధి చెందినా, తురుష్కుల పట్ల అతనికి ఉన్న పక్షపాతం వల్ల, వారు చెప్పినట్టు, వినటం వల్ల అపకీర్తిని మూటకట్టుకోవటం వల్ల అతడిని ప్రజలు ‘తురుష్క హర్షుడని’ అని పిలిచారు. ఇక్కడ రాజు తురుష్కుడు. కానీ విజ్ఞానం పట్ల ఆసక్తి కలవాడు. ప్రతిభను గౌరవించేవాడు. కానీ, చివరికి అతడిని వ్యతిరేకించే ఇస్లామీయుల వల్ల దెబ్బ తిన్నాడు. అందుకని తురుష్క హర్షుడి లోని ‘కవి’ అన్న లక్షణాన్ని మాత్రమే ప్రస్తావించాడు శ్రీవరుడు.
శ్రీవరుడి ఈ శ్లోకం మరో విషయాన్ని చెప్తుంది. శ్రీహర్షుడు అతడి కాలంలో పెద్ద పేరు పొందాడు, కవిగా, గాయకుడిగా. శ్రీవరుడి ఈ శ్లోకం వల్ల, శ్రీవరుడి కాలానికి కూడా హర్షుడి కవితలు, గీతాలు ప్రజలలో ప్రచారంలో ఉన్నాయని తెలుస్తుంది. అంటే, శ్రీవరుడు రచించిన కవితలు, నాలుగు శతాబ్దాల పాటుగా సజీవంగా ఉన్నాయన్న మాట. ముస్లిం పాలనలోనూ శ్రీవరుడి రచనలు సజీవంగా ఉన్నాయి. ప్రజలలో ప్రచారంలో ఉన్నాయని తెలుస్తుంది. అంటే, శ్రీవరుడు రచించిన కవితలు, నాలుగు శతాబ్దాల పాటుగా సజీవంగా ఉన్నయన్న మాట. ముస్లిం పాలనలోనూ శ్రీవరుడి రచనలు సజీవంగా ఉన్నయి. ప్రజలలో ప్రచారంలో ఉన్నాయి. కానీ జైనులాబిదీన్ మరణం తరువాత అధికారానికి వచ్చిన సుల్తానులు సంస్కృతానికి, భారతీయ భాషలకు కానీ ప్రాధాన్యాన్నివ్వలేదు. పర్షియన్ భాషకే ప్రాధాన్యం ఇచ్చారు. దాంతో నెమ్మదిగా సంస్కృతం వెనుకబడింది. సంస్కృతంలో రచనలు వెనుకపడ్డాయి. నాలుగు వందల ఏళ్లపాటు సజీవంగా ఉన్న హర్షుడి కవితలు, గీతాలు అదృశ్యం అయ్యాయి. ఈనాడు హర్షుడి గురించి కల్హణుడు చెప్పిన విషయాలు తప్ప మరేమీ తెలియవు. అతని రచనలు లభించటం లేదు. గుర్తున్నవారు లేరు.
శ్రీవరుడి ఈ శ్లోకం వలన ఏ రకంగా మన జీవన విధానం రూపాంతరం చెందిందో, ఎన్నెన్ని అమూల్యమైన గ్రంథాలు, శాస్త్రాలు, సాహిత్యం ఎలా నామరూపాల్లేకుండా అదృశ్యమయిపోయాయో తెలుస్తుంది. ఒక పూర్తిగా భిన్నమైన జాతి, మరో జాతిని ఎలా తన అసలు స్వరూపం మరచిపోయేలా చేయగలదో ఈ శ్లోకం సూచిస్తుంది. ‘భాష’ అత్యంత ప్రధానమైనది. ‘భాష’ని కోల్పోతే సాహిత్యం, సంస్కృతి, సాంప్రదాయాలు పోతాయి. జీవన విధానం మారిపోతుంది. అందుకే ‘భాష’ను కాపాడుకున్నంత కాలమే అస్తిత్వం నిలుస్తుంది. భాషను నిలిపేది సాహిత్యం. ఇతర ధర్మాలకు భిన్నంగా, భారతీయ ధర్మం వెయ్యేళ్లు పైగా నిరంతర దాడులను, పరాయి పాలనలను తట్టుకుని ఈనాటికీ సజీవంగా నిలబటానికి ప్రధాన కారణం ఒక తరం నుండి మరో తరానికి అందుతూ ఈనాటికీ స్పూర్తినిస్తున్న వేదాలు, ఉపషనిత్తులు, పురాణాలు, రామాయణం, భారతం, భాగవతం వంటి సాహిత్యం, సంస్కృత భాష. ప్రాంతీయ భాషలతో పాటు సంస్కృత భాషను సజీవంగా నిలపాల్సిన అవశ్యకతను భారతీయ సమాజం గ్రహించాల్సి ఉంటుంది. సంస్కృత భాషకు ఊపునిచ్చేవి ప్రాంతీయ భాషలు. అవి సంస్కృతానికి ప్రత్యామ్నాయాలు కావు.
ఛాత్రశాలా విశాలాస్తా ధర్మార్థం గుణశాలినా।
కృతా యాభ్యః శృతః శబ్దస్తర్కవ్యాకరణోద్భవః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 65)
సుగుణవంతుడైన రాజు ధర్మం కోసం, విశాలమైన విద్యార్ధుల వసతి గృహాలను నిర్మించాడు. విద్యార్థులు వల్లె వేస్తున్న వ్యాకరణాల హోరు ఆ విద్యాశాలల్లో మార్మోగుతూంటుంది.
ఆచార్య పుస్తకావాస సహాయాన్న సమృద్ధిభిః।
పాఠయన్ సర్వవిద్యానాం వర్ధయామాస మండలమ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 66)
విద్యార్ధులకు ఆచార్యులు, పుస్తకాలు, నివాసం, ఆహారంతో సహా ఇతర అనేక రూపాల సహాయాలు చేస్తూ రాజు విద్యార్జన పరిధులను విస్తృతపరిచాడు.
రాజు చేసిన అన్నదానాలు, పునరుద్ధరించిన మందిరాలు, పూజా పద్దతులు, సంబరాలు అన్నిటినీ వివరించిన తరువాత శ్రీవరుడు విద్య దగ్గరకు వచ్చాడు.
సమాజాభివృద్ధిలో అత్యంత ప్రాధాన్యం వహించే అంశం విద్య. భారతీయులకు వారికే ప్రత్యేకమైన విద్యా పద్ధతులు ఉన్నాయి. సువ్యవస్థితమైనది అది. కానీ విదేశీ పాలకులకు, విజేతలమన్న అహంకారం ఉంటుంది. కాబట్టి పాలితుల అధిక్యాన్ని, వారి పద్ధతులలోని జ్ఞానాన్ని గుర్తించే సహృదయం ఉండదు. ఎందుకంటే పాలితులకు ప్రభువుకు భిన్నమైన ప్రత్యేక అస్తిత్వం ఉండటం ప్రభువుకు ప్రమాదకరం. కాబట్టి ఏ ప్రభువు కూడా తమకు భిన్నమైన అస్తిత్వంతో పాలించే ప్రజలను ఉండటాన్ని సహించటం కష్టం. ఇందుకు భిన్నంగా, జైనులాబిదీన్ భారతీయ వ్యవస్థలను పునరుద్ధరించాడు. వారి విద్యా వ్యవస్థను అభివృద్ధి పరచి, ప్రోత్సహించాడు. అద్భుతమైన విషయం ఇది.
సాధారణంగా పాలితులకు ప్రత్యేక అస్తిత్వం ఎందుకు ఉండకూడదనుకుంటారంటే, ప్రత్యేక అస్తిత్వం ఉన్నంత కాలం ఆత్మగౌరవం, ఆత్మాభిమానాలుంటాయి. ఆవి ఉన్నాయంటే ఎదుటివాడి ఆధిక్యాన్ని, అధికారాన్ని ఆమోదించటం కష్టం, దాంతో తిరుగుబాట్లు, పోరాటాలు, వీలు చిక్కతే అధికార స్థాపన తప్పనిసరి అవుతాయి. కాబట్టి పాలితులెప్పుడూ అణిగిమణిగి విధేయులుగా ఉండాలనుకుంటారు పాలకులు. అందుకని పాలితులకు వారి ప్రత్యేక అస్తిత్వాన్ని గుర్తుకు తెచ్చే ఏ చిహ్నాన్ని సహించరు పాలకులు. ఇందుకు భిన్నంగా జైనులాబిదీన్ పాలితులలో తమకు భిన్నమైన వారిని సైతం వారి అస్తిత్వాన్ని నిలుపుకోవటంలో ప్రోత్సహించటమే కాదు రాజుగా తన వంతు సహాయం అందించటం అద్భుతమైన విషయం. ఇలా చేయాలంటే ముందు రాజుకు తన మీద అత్యంత విశ్వాసం ఉండాలి. తను సహాయం చేస్తున్న వారి విధేయత మీద తిరుగులేని నమ్మకం ఉండాలి. జైనులాబీదీన్కి తన స్వశక్తి మీద విశ్వాసం, తాను సహాయం చేస్తున్న పండితుల విధేయత పట్ల నమ్మకం అధికంగా ఉన్నయని అతడి ప్రవర్తన నిరూపిస్తుంది.
ప్రజాస్వామ్యంలో ఒకే దేశ ప్రజల నడుమ మైనారిటీల పట్ల ప్రభుత్వం పక్షపాతం చూపిస్తున్నదని మెజారిటీలు భావించటం, మెజారిటీల వల్ల తమకు భద్రత లేదని, అన్యాయం జరగుతోందని మైనారిటీలు భావించటం, ఉద్విగ్నతలు, సంఘర్షణలు వాతావరణాన్ని కలుషితం చేయటం మనం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. అలాంటిది, పూర్తిగా ఇస్లాంమయమైన రాజ్యంలో ఇస్లామేతరులను సమానంగా చూస్తూ, వారికి స్వేచ్ఛనిచ్చి కూడా రాజ్యంలో నిరసనలు, ద్వేషభావ ప్రకటనలు, విధ్వంసక చర్యలు జరిగే వీలు లేకుండా రాజ్యాన్ని నడపటం జైనులాబిదీన్ గొప్పదనానికి, పరిపాలనా దక్షతకు నిదర్శనం.
న విద్యా సుఖయోః సంధిస్తేజస్తి మిరయోరివ।
ఇతి వ్యర్థం వచశ్ఛక్రే మునీనామభయప్రదః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 67)
విద్య, సుఖలాలసలు – వెలుతురు చీకట్లలా ఒకే స్థలంలో ఉండటం అసంభవమన్న జనుల వచనాలను తప్పని నిరూపిస్తూ రాజు అందరికీ రక్షణ కల్పించాడు.
సాధారణంగా పండితులు ఎంత గొప్ప వారయినా దరిద్రం అనుభవిస్తారు. ఎక్కడో శ్రీనాథుడు, తిక్కన వంటి వారుంటారు. శ్రీనాథుడు కూడా చివరి దశలో దరిద్రం అనుభవించాడు. కాబట్టి లక్ష్మీసరస్వతులు ఒక దగ్గర ఉండరనే సామెత ఉంది. కానీ ఒక వ్యక్తి పండితుడు, ధనవంతుడై సుఖంగా జీవించగలడని జైనులాబిదీన్ నిరూపించాడు అంటున్నాడు శ్రీవరుడు.
(ఇంకా ఉంది)