[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
పంచమ సర్గః
మత్ పిత్రు ప్రమయే రాజా విజ్ఞప్తః స మయైకదా।
దండయిత్వా కిరాతాంస్తాజ్ఞా శవశుల్కం న్యవారయత్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 58)
మా తండ్రిగారు మరణించినపుడు నేను రాజుతో శవశుల్కం విషయం చెప్పాను. రాజు కిరాతకులను దండించాడు. శవశుల్కం వసూలును నిషేధించాడు.
ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు వసూలు చేసే సుంకంతో పాటుగా కిరాతులు ‘శవశుల్కం’ వసూలు చేసే వారని తెలుస్తుంది. శ్రీవరుడు చెప్పటంతో రాజు శవశుల్కం వసూలును రద్దు చేశాడు.
ఇక్కడే ప్రశ్న వస్తుంది ‘కిరాతులు’ ఎవరన్నది.
కిరాతులను హిమాలయాల నివాసులుగా భావిస్తారు. కాలక్రమేణా వారు అటు అస్సాం ఇటు వింధ్య పర్వతాల వరకూ విస్తరించారు. కిరాతులు వేరు కిరాత జాతి వేరు. పలువురు విద్వాంసులు వీరిద్దరినీ ఒకటిగా భావించారు. వీరిని మంగోలియా నుండి భారత్ వచ్చిన వారిగా నిర్ధారించారు. కిరాతులు నేపాల్పై రాజ్యం చేసినవారు.
భారతీయ పురాణాల ప్రకారం కిరాతులు ‘తప్తకుండం’ నుండి ‘రామక్షేత్రం’ వరకూ విస్తరించారు. ‘తప్తకుండం’ను ‘రాజగృహం’ (బీహార్) గానూ, ‘రామక్షేత్రం’ను ‘రామటీక్’ లేదా ‘రామగిరి’ గానూ భావిస్తారు. కాలక్రమేణా కిరాతులను పర్వత ప్రాంతంలో ఉండేవారిగా, అనాగరికులుగా భావిచటం మొదలయింది. మహాభారతం, ఇతర పురాణాలలో కిరాతులను కాంభోజం, కశ్మీరుకి చెందిన వారిగా భావించటం కనిపిస్తుంది.
సభాపర్వంలో కిరాతులు – ఆటవిక జానపదులకు అధిపతులలైన బోయ రాజులని తెలుస్తుంది. అర్జునుడు వీరిని జయించాడు.
‘బృహత్ సంహిత’ లో కూడా కిరాతుల ప్రస్తావవ వస్తుంది. వీరిని హిమాలయ ప్రాంతాలలో, ముఖ్యంగా కాశ్మీరు ప్రాంతాలలో నివసించే వారిగా భావించటం కనిపిస్తుంది. అరణ్య ప్రాంతాలలో కొండ ప్రాంతాలలో ఔషధులను సేకరించే వారు వీరు అని ఉంది.
వాజసనీయ సంహిత, తైత్తరీయ బ్రహ్మపురాణంలోనూ కిరాతుల ప్రస్తావన కనిపిస్తుంది. అయితే కిరాతులు ఇళ్లు కట్టుకుని నివసించే వారిగా కనిపిస్తారు.
రామాయణంలో కిరాత స్త్రీల వెంట్రుకల వర్ణన ఉంటుంది. వారు సువర్ణ వర్ణంలో ఉంటారనటం కనిపిస్తుంది.
కిరాతులు ప్రాగ్జోతిషపుర వాసులని (అస్సాం), వారు భయంకరమైన అస్త్రాలను ప్రయోగించేవారనీ భారతం ద్వారా తెలుస్తుంది.
ఖారవేలుడి కాలంలో కిరాతులను, చైనా వారినీ ఒకేసారి ప్రస్తావించటం కనిపిస్తుంది. దీని ఆధారంగా కిరాతులు మంగోలులు అని కొందరు వాదిస్తారు.
కుమార సంభవంలో కిరాతులు హిమాలయాలల్లో దేవదారు వృక్షాల నడుమ జంతువులను వేటాడేవారని ఉంది. సాంచీస్థూపం పై భిక్ష స్వీకరిస్తున్న కిరాతుడి చిత్రం ఉంది. ‘మనుస్మృతి’లో కిరాతులను క్షత్రియులుగా భావించటం కనిపిస్తుంది. మధ్య యుగం వచ్చే సరికి కిరాతులను ‘వనవాసులు’ గా భావించటం అనవాయితీ అయింది. తులసీ రామాయణంలో కూడా వీరి ప్రస్తావన వస్తుంది.
శ్రీవరుడి రాజతరంగిణిలో కిరాతులను తక్కువ స్థాయికి చెందిన వారిగా భావించటం కనిపిస్తుంది.
కిరాతుల గురించి భారతీయ పురాణాలలో, శాస్త్రాలలో, కావ్యాలలో ఉన్న వర్ణనలు, వివరాలను గమనిస్తే ప్రాచీన భారతీయ సమాజం గురించి ఏదీ నిర్ధారణగా తీర్మానించటం కుదరదని అర్ధమవుతుంది. ఒక గ్రంథంలో ఆటవికులుగా ప్రదర్శితమయిన వారు మరో గ్రంథంలో క్షత్రియులుగా వర్ణితమవుతారు. ఒక గ్రంథంలో ఆటవికులుగా వేటగాళ్ళుగా చిత్రతమయినవారు, మరో కావ్యంలో బోయ రాజులవుతారు. కాబట్టి, ఈనాడు మేధావులు తీర్మానిస్తున్నట్టుగా ప్రాచీన సమాజం లేదనిపిస్తుంది. భారతీయ సమాజం నిత్య గతిశీలమైనది. ప్రాంతం ప్రాంతానికి సమాజ స్థితిగతులు, స్థాయీభావాలు మారుతుంటాయి. కాబట్టి ఇతర సమాజాల గురించి ఊహించినట్టు భారత సమాజాన్ని ఊహించటం కుదరదు. ఇతర సమాజాలకు వర్తించిన నియమనిబంధనలు భారతీయ సమాజానికి వర్తించవు. ఏక సూత్రీకరణ వీలు కాదు. భారతీయ సమాజ పరిణామ క్రమాన్ని ఎంతో లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. పైపైన చూసేసి తీర్మానాలు, నిర్ధారణలు చేస్తే అనర్థాలు తప్పవు. ఎందుకంటే కిరాతులను భారతీయ గ్రంథాలు లింబ, రాయ, యక్ష, క్షత్రియులతో పాటు కొండజాతి వారిగా, ఆటవికులుగా కూడా చిత్రించాయి. దీని గురించి లోతుగా పరిశోధన, అధ్యయనం లేకుండా తీర్మానిస్తే అనర్థం తప్ప మరొకటి ఒనగూడదు.
తతః ప్రభ్రుతి తతస్థాన్ విమానా నగరాన్తరే।
దహ్యన్తే దర్శన ద్వేషి మ్లేచ్ఛానాం హృదయేః సమమ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 59)
ఆ సమయం నుంచీ శవదహన దర్శన దోషులయిన మ్లేచ్ఛుల ఇష్టానికి వ్యతిరేకంగా ఆ ప్రాంతం సామాన్య ప్రజలు స్వేచ్ఛగా శవదహనాలు జరిపేవారు.
ఇక్కడ శ్రీవరుడు వాడిన వాక్యం సరిగ్గా చెప్పాలంటే, దహనమవుతున్న శవాలతో పాటు మ్లేచ్ఛుల హృదయాలూ సమానంగా దహించుకుపోయేవి.
ఇస్లాంలో శవదహనం లేదు. వారు శవాన్ని భూమిలో పాతిపెడతారు. అందుకే ‘సింకిందర్ బుత్షికన్’ శవదహనాన్ని నిషేధించాడు. శవదహనం చేయటం కష్టసాధ్యమయ్యేట్టు పన్ను విధించాడు. ఇప్పుడు ఆ పన్నును రద్దు చేయించాడు శ్రీవరుడు. దాంతో శవాలు దహించుకుపోతుంటే మ్లేచ్ఛుల హృదయాలూ దహించకుపోతున్నాయి
శ్రీవరుడు ‘మ్లేచ్ఛులు’ అన్న పదం ఇస్లామీయులను సూచిస్తూ వాడాడు. గమనిస్తే ఒక్క జైనులాబిదీన్ను తప్ప ఇతర ఇస్లామీయులందరినీ మ్లేచ్ఛులుగానే శ్రీవరుడు సంబోధించటం కనిపిస్తుంది. శ్రీవరుడి దృష్టిలో జైనులాబిదీన్ మ్లేచ్ఛుడు కాడు, ఎందుకు కాదంటే, ఆయన పరమత సహనం ప్రదర్శిస్తున్నాడు కాబట్టి.
ఇస్లామీయులకు ‘శవదహనం’ ఇష్టం లేదు. వారు తమ మత బోధనలకు వ్యతిరేకంగా ఉన్నదాన్ని ఆమోదించరు. అది ఇతర మతం వారి ధర్మానుసారమైనదైనా, తమకు వ్యతిరేకమైనదాన్ని భరించలేరు. ఆ మనస్తత్వాన్ని శ్రీవరుడు ఈ శ్లోకం ద్వారా ప్రదర్శిస్తున్నాడు. అయితే ఈ శ్లోకంలో శ్రీవరుడు ఓ రకమైన వికారమైన ఆనందాన్ని ప్రదర్శించటం కనిపిస్తుంది. శ్రీవరుడు సాధించింది తాత్కాలికమైన చిన్న విజయం. శవశుల్కాన్ని రద్దు చేయించాడు, రాజు అండదండలతో. దానికే శవం దహించుకుపోతున్నట్టు ‘మ్లేచ్చుల’ హృదయాలు కూడా దహించుకుపోతున్నాయి అంటున్నాడు. ఒక రకమైన వికారమైన ఆనందం ఇది. చిన్న పిల్లవాడు, పెద్దలు వద్దన్న పని చేసి, వారు కోపంతో ఊగిపోతూంటే తానేదో విజయం సాధించనట్టు భావించి ఆనందించటం లాంటిది ఇది. ఇప్పటికీ భారతీయులు ఇదే మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఒక హోలీ పండుగ స్వేచ్ఛగా జరుపుకుని ఎంతో సాధించినట్టు భావిస్తున్నారు. కానీ ఆ పండుగ స్వేచ్ఛగా వారు పోలీసుల బందోబస్తు నడుమ గడుపుతున్నామన్న విషయాన్ని విస్మరించి ఏదో విజయం సాధించినట్టు భావిస్తున్నారు. అనాటికీ ఈనాటికీ ఇదే మనస్తత్వం కనిపిస్తుంది. ఈ మనస్తత్వాన్ని తరువాత శ్లోకం స్పష్టంగా చూపిస్తుంది.
నిరర్గలా వయం జాతా ఇతీవ శివికా హకైః।
ఛత్రహస్తైః ప్ర నృత్యన్త్యో దృశ్యన్తే వాద్య నిస్వనైః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 60)
‘మేము ప్రతిబంధ రహితులమయ్యాము’ అని సంతోషిస్తూ ‘శివికలు’ శవానికి గొడుగు పట్టి, వాయిద్యాలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ శవదహనం చేశారు.
శవదహనంపై ప్రతిబంధకాలు, శవశుల్కం తొలగిపోవటంతో ‘శివికలు’ ఇప్పుడు వాయిద్యలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ శవయాత్రను జరిపేవారు. శవదహనం చేసేవారు.
ఒక జాతి వారు మరో జాతి పై ఆధిక్యం సాధించటానికి ప్రధాన సూచన – తాము గెలిచినవారు – తమని తాము మరచి పోయేట్టు చేయటం, వారి పద్ధతులను మార్చటం, సంప్రదాయాలను రూపాంతరమొందించటం. వారు తమ విద్యుక్త కర్మలు చేయకుండా అడ్డు పడటం. సంస్కృతి సాంప్రదాయాలు అమలు కాకుండా చూడటం. అంటే తాము గెలుచుకున్న వారు తమని తాము మరచిపోయి తమ అస్తిత్వాన్ని సంపూర్ణంగా మరచిపోవాలన్న మాట. అందుకోసం గెలిచిన వారు ఎంతటి కఠినమైన చర్యలనైనా చేపడతారు. ఎంత క్రూరంగానైనా వ్యవహరిస్తారు.
మందిరాలను ధ్వంసం చేయటం, వాటి స్తానే మసీదులను నిర్మించటం, పట్టణాలు పల్లెల పేర్లు మార్చటం, వీధుల పేర్లు మార్చటం, తాము గెలుచుకున్న వారి సంస్కృతిని, చారిత్రిక చిహ్నాలను ధ్వంసం చేసి రూపుమాటం కూడా దీనిలో భాగమే. ఇలా సర్వత్ర సర్వం ధ్వంసం అయిపోతుంటే ఏదో ఒకటి నిలబెట్టుకున్న వాడు ప్రపంచాన్ని జయించినంత ఆనందం పొందుతాడు. సంబరాలు చేసుకుంటాడు.
శవదహన శుల్కం నిషేధించటంతో కశ్మీరులో సంబరాలు జరగటం ఇలాంటిదే. ఇలాంటిదే ఇప్పటి సమాజంలో కనిపిస్తుంది.
‘శివిక’ అన్న పదం పలు అర్ధాలనిస్తుంది.
‘శివిక’ అంటే పల్లకీ మోసేవారు. ‘శివిక’ అంటే ఉత్తర భారతదేశంలో ధీర్ఘచతురస్రాకారపు మందిరం. ‘శివిక’ అంటే శవాన్ని దహించేవారు.
ఈ శ్లోకంలో శవవాహకులు, శవాన్ని దహించేవారు అన్న అర్థాలు వస్తాయి. శవాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లటం వాయిద్యాలు వాయించటం మనకు తెలుసు. కానీ ఇస్లాంమయమైన కశ్మీరులో ఇది నిషేధం.
ఇస్లాం మయమైన కశ్మీరం వరకూ ఎందుకు? శవయాత్ర వరకూ ఎందుకు? మామూలు పండగల ఊరేగింపులప్పుడే మసీదు ముందు వాయిద్యాలు మ్రోగించవద్దని, నినాదాలు ఇవ్వవద్దని దాడులు జరగటం, హింస చెలరేగటం అదీ ప్రజాస్వామ్య లౌకిక రాజ్యంలో మనం చూస్తూనే ఉన్నాం.
ఎలాగయితే వాయిద్యలు మ్రోగించి, నినాదాలిస్తూ ఏదో సాధించినట్టు ఇప్పుడు లౌకిక ప్రజాస్వామ్యంలో సంబర పడుతున్నారో, ఆ కాలంలో సుల్తాన్ పాలన కాలంలో వారూ అలాగే సంబర పడ్డారు.
రాజాజ్ఞ అయింది కాబట్టి నృత్యాలు చేస్తూ, శవయాత్రను జరిపారు. స్వేచ్ఛగా శవదహనం కావించారు.
అప్పుడు రాజాజ్ఞ అయింది. ఇప్పుడు పోలీసుల రక్షణ ఉంది. తేడా అల్లా అంతే.. అప్పటికీ ఇప్పటికీ మనస్తత్వాలలో ఎలాంటి మార్పులు రాలేదు. పరస్పర సహనం, సహకారం, స్నేహ సౌహార్ద్ర భావనల బదులు అహంకారాలు, అనుమానాలు, ద్వేషాలు భయాలు, అప్పుడూ ఇప్పుడూనూ.
(ఇంకా ఉంది)