Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-63

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

పంచమ సర్గః

యత్రతీరే సురేశ్వర్యాః క్షేత్రం భక్తి విముక్తిదమ్।
వారాణస్యధికం భాతి తీర్థ రాజే విరాజితమ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 40)

ఈ సరస్సు తీరంలో అనేక వింత స్థలాల నడుమ సురేశ్వర మందిరం నిలిచి ఉంది. వినోదంతో పాటు ముక్తి నిచ్చే ఈ క్షేత్రం వారణాసి కన్నా అధిక శోభతో వెలుగొందింది.

‘గంగా మెరీ మా కా నామ్, బాప్ కా నామ్ హిమాలయ్’ అంటాడో సినిమా కవి. భారతీయ ధర్మంలో హిమాలయాలు, గంగానదిల ప్రాధాన్యాన్ని  ఎత్తి చూపిస్తుందీ వాక్యం. ‘వారణాసి’ భారతీయ ధర్మానికి కేంద్రం లాంటిది. భక్తి క్షేత్రం అది. అలాంటి వారణాసి క్షేత్ర ప్రభను మించి పోయింది సురేశ్వర క్షేత్రం అంటున్నాడు శ్రీవరుడు. ఎవరయినా ఉత్తమమైన దానితోటే పోల్చుకోవాలని తపిస్తారు. వారణాసిని మించిన భక్తి క్షేత్రం ఇంకొకటి  లేదు. ఆ వారణాసినే మించిందనటం కశ్మీరులో సైతం, వారణాసితో పోటీ పడగల ఒక క్షేత్రం ఉన్నదని చెప్పటమే.

గమనిస్తే చుట్టుముట్టిన ఇస్లామీ సముద్రం నడుమ ద్వీపాల్లా ఆనాటి పవిత్ర క్షేత్రాలు నిలిచి తమ అస్తిత్వాన్ని మాత్రమే కాదు, భారతీయ అస్తిత్వాన్ని కూడా కాపాడాయి. వారణాసి పై చరిత్రలో జరిగిన దాడులను స్మరిస్తే ఏ రకంగా, ఎన్ని మార్లు దాడులు జరిగి, మందిరాలను ధ్వంసం చేసినా ఏ రకంగా మందిరాన్ని తిరిగి నిలపటం ద్వారా భారతీయులు తమ అస్తిత్వాన్ని కాపాడుకున్నారో తెలుస్తుంది.

క్రీ.శ. 1034లో అహ్మద్ నయల్తిజీన్ వారణాసిపై దాడి చేశాడు. వారణాసిపై చరిత్రలో నమోదైన తొలి దాడి ఇది. ఈయన మహమద్ గజనీ సైన్యాధికారి. క్రీ.శ. 1194లో కుత్బ్ ఉద్-దిన్-ఐబక్ దాదాపుగా 1000 మందిరాలను ధ్వంసం చేశాడు. ఆ మందిరాలు ధ్వంసమైన స్థలంలో రజియా సుల్తానా మసీదును నిర్మించింది. అది ధ్వంసమైన విశ్వనాథ మందిర స్థానంలో నిర్మితమైన మసీదు. దాంతో ‘అవిముక్తేశ్వర మందిరం’ స్థానంలో విశ్వనాథ మందిరాన్ని నిర్మించారు. క్రీ.శ 1494లో మహమ్మద్ షాహ శర్కి మళ్లీ మందిరాన్ని ధ్వంసం చేశాడు. మళ్లీ నిర్మించిన ఈ మందిరంతో సహ పలు మందిరాలు సికిందర్ లోడి ధ్వంసం చేశాడు. రాజా తోడర్‌మల్ సహాయంతో పండిత నారాయణ భట్టు 1585లో మళ్ళీ మందిరాన్ని నిర్మించాడు. ‘షాహజహాన్’ పాలనా కాలంలో దాదాపుగా 76 పునర్నిర్మితమైన ఆలయాలను ధ్వంసం చేశారు. క్రీ.శ 1669లో కాశీ విశ్వనాథ మందిరాన్ని ధ్వంసం చేయమన్న ఔరంగజేబు ఆదేశలను అనుసరించి విశ్వనాథ మందిరం స్థానంలో ‘జ్ఞానవాపి’ మసీదును నిర్మించారు. విశ్వనాథ మందిరానికి చెందిన  ‘ముక్తి మందిరం’ మసీదులో భాగమైంది. క్రీశ 12వ నుండి 17వ శతాబ్దాల నడుమ వారణాసి మందిరాలన్నీ సగటున కనీసం అయిదు మార్లు ధ్వంసమై పునర్నిర్మితమయ్యాయని ఒక అంచనా.

ఔరంగజేబు మరణం తరువాత, మొఘలుల సామ్రాజ్యం బలహీనమై క్షీణిస్తుండటంతో వారణాసిపై దాడులు తగ్గిపోయాయి. దాంతో, ప్రస్తుతం వారణాసి మందిరంగా పరిగణనకు గురువుతున్న మందిరాన్ని రాణి అహల్యాబాయి హోల్కర్ 1775-77 నడుమ నిర్మించారు.

వారణాసి శోభను తలదన్నే శోభతో అలరారిన సురేశ్వర మందిరం ఉనికి పురావస్తుశాఖ వారు నిర్ధారించారు. కానీ కశ్మీరులో ఈ మందిరానికి గత వైభవం లేదు. కశ్మీరులో ప్రస్తుతం ఇస్లామేతరులు ధైర్యంగా నివసించే పరిస్థితులు ఇంకా సంపూర్ణంగా నెలకొనలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందేమిటంటే, ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ‘మందిరం’  భారతీయ ధర్మానికి అస్తిత్వం. మందిరాన్ని కాపాడుకుంటే, ధర్మాన్ని కాపాడుకున్నట్టే.  ఇటీవలి కాలంలో మందిరాలు ధర్మక్షేత్రాలుగా కాక వ్యాపార కేంద్రాలుగా మారటం అంత శుభ పరిణామం కాదు. ధర్మ ప్రేమికులంతా ఈ విషయం పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మందిరానికి అసలు అర్థాన్ని లక్ష్యాన్ని గ్రహించాల్సి ఉంటుంది.

విహారైరగ్రహారైశ్చ మఠైః సుకృత కర్మఠైః।
ఆశ్రమైరశ్రమై రాజవాసైః స్వర్గోపమానం వ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 41)

ఈ ప్రాంతాన్ని స్వర్గధామంలా మార్చేశాడు రాజు. విహారాలు, మఠాలు, ఆశ్రమాలు నిర్మించాడు. అక్కడ జరిగే పవిత్ర చర్చల వల్ల ఈ ప్రాంతం పుణ్య స్థలం అయింది.

బహుశా తాను పాలించే ప్రాంతంలో ఇలా మఠాలు, విహారాలు, ఆశ్రమాలు నిర్మించి వారి దృష్టి పుణ్యకార్యాల నుంచి మరలకుండా ఏర్పాట్లు చేసిన ఏకైక సుల్తాన్ జైనులాబిదీన్ అయి ఉంటాడు. ఇతర సుల్తానులు ఎంతగా పరమత సహనం ప్రదర్శించినా దాని వెనుక రాజకీయమో, లేక, మత సంకుచిత చర్యలో కనిపిస్తాయి. కానీ జైనులాబిదీన్‌లో మాత్రం సంకుచితం కనబడదు. ఆయన ఓ వైపు ఇస్లామీయుల కోసం కన్‍ఖాలు నిర్మించాడు. వారికి వృత్తులు కల్పించాడు. వారి సుఖమయ జీవనం కోసం ఎన్నో ఏర్పాట్లు చేశాడు. అలాగే, ఇస్లామేతరుల కోసం కూడా అంత శ్రమించాడు. దీని వెనుక రాజకీయం లేదు. ప్రణాళికలు, పథకాలు లేవు. ప్రజలంతా సుఖంగా, శాంతితో బ్రతకాలన్నది అతని ఆలోచన. ఈనాడు కశ్మీరు సిల్క్, తివాచీలు, షాల్‌ల గురించి మనం మాట్లాడుతున్నాము. కశ్మీర్‌లో ఈ వృత్తులను ప్రవేశపెట్టి ప్రోత్సహించింది జైనులాబిదీన్.

దీర్ఘైశ్చతుష్కికాషస్తైనృత్యేన్త ఇవ సూనృతాః।
దృశ్యంతే యే జనైర్దూరాద్వేమ చ్ఛత్ర వరోదరా॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 41)

దూరం నుంచి చూసేవారికి బంగారు కప్పుతో ఉన్న మధ్య భాగంలో తాపసులు చేతులతో రుద్రాక్షలు తిప్పుతూ ధ్యానం చేస్తున్నట్టు కనిపిస్తుంది. నాలుగు బలమైన స్తంభాలు చేతులు తిప్పుతున్న భ్రాంతి కలుగుతుంది.

యేషాం సిద్ధపురీ నామ ప్రసిద్ధం నృపతేద్గృహమ్।
స్వసౌధైః కురుతే సిద్ధవిమానావలి విభ్రమమ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 42)

సిద్ధపురి అన్న పేరు పొందిన రాజ భవనం, ఎలా నిర్మితమైందంటే సిద్ధుల రథాలు వరుసగా ఉన్న భ్రమను కలిగిస్తున్నది.

జీర్ణ దేవాలయా యత్ర రాజధాన్యన్తరీకృతా।
ధృత్యైన్నాత్యా నిజస్థిత్యా సుత్యార్థా భూభుజా కృతాః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 43)

ఇక్కడ రాజు జీర్ణ దేవాలయాలను పునరుద్ధరించాడు. అవి గతంలో కన్నా ఉన్నత స్థితిని పొందాయి.

ఇస్లామీయులు జైనులాబిదీన్ మీద కినుక వహించటంలో ఇలాంటి చర్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. సుల్తాన్ పండితులను చేరదీయటం, వారి పండుగలలో స్వయంగా పాల్గొనటం, జీర్ణ దేవాలయాలను ఉద్ధరించి, పూర్వం కన్నా వైభవోపేతంగా నిర్మించటం వంటి చర్యలు ఆగ్రహం కలిగించినా, ఆ ఆగ్రహాన్ని జైనులాబిదీన్ అదుపులో పెట్టటం అతని పాలనా దక్షతకు, ప్రతిభకు నిదర్శనం.

యత్ర సర్వతృణేక్లేద నిర్మోదోత్పన్నభూస్థలీ।
సంచారిణ్యుర్వరా రాజ్ఞా సఫలా విహితా ధియా॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 44)

తేలే ద్వీపాలపై గడ్డి, మట్టి వేసి వాటిని ఫలవంతం చేశాడు రాజు.

‘తేలే ద్వీపాలు’ కశ్మీరుకు ప్రత్యేకం. వీటిని కశ్మీరు భాషలో ‘రాఢ్’ లంటారు. కశ్మీరు సరస్సులలో మొలిచే గడ్డి మొక్కల తీగలు ఒకదానికొకటి చుట్టుకుని చిన్న చిన్న మొక్కల ద్వీపాలుగా ఏర్పడతాయి. దాదాపుగా ఆరు అడుగులు ఉండే ఈ తీగ మొక్కల ద్వీపాలు సరస్సుల్లో తేలుతుంటాయి. ‘డల్’ సరస్సులో అధికంగా కనిపించే ఈ తేలే సరస్సులను ‘తేలే తోటలు’ (Floating gardens) అంటున్నారు.

ప్రాచీన కాలం నుంచీ ఈ ‘తేలే ద్వీపాల’ను కశ్మీరులో వ్యవసాయం కోసం వాడేవారు. జైనులాబిదీన్ ఈ పద్ధతిని పునః ప్ర్రారంభించాడు. ఈ కదిలే ద్వీపాలపై పంటలను  పండిచటం ఆరంబించాడు జైనులాబిదీన్. అందుకే రాజు ఆ ద్వీపాలను ఫలమంతం చేశాడు అన్నాడు శ్రీవరుడు. అంటే ప్రాచీన విజ్ఞానాన్ని తిరిగి ఉపయోగించటం వల్ల కశ్మీరను సమృద్ధం చేశాడన్నమాట.

కశ్మీరులో ఇలాంటి తేలే పంటల ద్వీపాలు రెండు రకాలు. ఒకటి ‘రాఢ్’లు. రెండవది  ‘డేంబ్’లు. ‘రాఢ్’లు కదలుతుంటాయి పడవల్లాగా. ‘డేంబ్’లు కదలవు, స్థిరంగా ఉంటాయి. వీటిపై పలురకాల పంటలను పండిస్తారు. టమాటా, దోసకాయ, పుచ్చకాయలు, వంకాయలు, బీన్స్, బెండకాయ, మిరపకాయ వంటివి, ఆకుకూరలు కూడా ఈ తేలే ద్వీపాలపై పండిస్తారు. దాదాపుగా ఆరు వేల కుటుంబాలు ఈ తేలే ద్వీప పంటలపై ఆధారపడి జీవిస్తాయి కశ్మీరులో.  ఇది కాక పర్యాటక కేంద్రాలుగా ఈ ద్వీపాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇటీవల కాలంలో బాగా ప్రచారంలోకి వచ్చిన ‘ఆర్గానిక్ ఫార్మింగ్’ ప్రాచీన కాలం నుంచీ కశ్మీరులో అమలులో ఉన్నదన్నమాట.

కశ్మీరులోని ‘తేలే వనాల’ను చూసి ప్రభావితమైన కర్నాటక ప్రభుత్వం ఇటీవల ‘లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్స్’ లోనూ ఇలాంటి ‘తేలే వనాలను’ నిర్మించే పథకం ఆరంభించింది.

ఏకత్ర దేశే యత్రాన్తః సత్రం శ్రీజైనవాటికా।
యోగినాం పాత్రపూజార్థం కృత భోగాకృతస్మయమ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 45)

‘జైనవాటిక’ లోని యోగులు పాత్రపూజ కార్యక్రమం నిర్వహించిప్పుడు జైనులాబిదీన్ ‘తాను రాజును’ అన్న విషయం విస్మరించి సామాన్యుడిలా వారితో సహకరించాడు.

‘జైనవాటిక ఆశ్రమం’ అన్నాడు శ్రీవరుడు. అంటే జైనులాబిదీన్ నిర్మించిన ఆశ్రమంలో ఉన్న యోగులు ‘పాత్రల పూజ’ కార్యక్రమం నిర్వహిస్తే జైనులాబిదీన్ ఆ పూజలో సామాన్యునిలా పాల్గొన్నాడన్నమాట.

పీర్ హసన్ ప్రకారం జైనులాబిదీన్ ‘జైనపురం’లో కొన్ని మైళ్ళ విస్తీర్ణం కల తోటను నిర్మింప చేశాడు. నాలుగు వైపులా అందమైన స్తంభాలు పాతించాడు. ‘బాగ్’ అంటే పూలతోట. ఈ శబ్దం ‘వాటిక’ అన్న శబ్దం నుండి వచ్చిందని పలువురి అభిప్రాయం. ఈ  ‘తోట’ ద్వారా జైనులాబిదీన్ పలు కుటుంబాలకు జీవిక ఏర్పాటు చేశాడు. ఈ భూభాగాన్ని ఉలేమాలకు అందే ఏర్పాట్లు చేశాడు.

అంటే మందిరాలు నిర్మించటం, పూజలలో పాల్గొనటం వంటి చర్యల వల్ల కలిగే ఆగ్రహం హద్దులు దాటకుండా ఉలేమాలకు, ఇతర ఇస్లామీయులకు కూడా ఆదాయం అందే ఏర్పాట్లు చేశాడన్న మాట. ఇలా రెండు వర్గాల నడుమ సమతుల్యం సాధించే ప్రయత్నాలు చేశాడు జైనులాబిదీన్.

ఈ సందర్భంగా ఒక విషయం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది.

శ్రీవరుడి రాజతరంగిణి పూర్తిగా భారతీయ దృక్పధాన్ని ప్రదర్శిస్తుంది. జైనులాబిదీన్ నిర్మించిన దేవాలయాలు, పునరుద్ధరించిన ప్రాచీన పద్ధతులు, ఇచ్చిన దానాల గురించి మాత్రమే చెప్తున్నాడు శ్రీవరుడు. ఇస్లామీయులకు జైనులాబిదీన్ అందించిన సేవల గురించి తెలుసుకోవాలంటే పర్షియన్ రచయితల రచనలనుంచి  తెలుసుకోవాలి. అప్పుడే జైనులాబిదీన్ ఎంతటి కత్తి మీద సాము చేశాడో అర్థమవుతుంది. ఛాందసవాదులను అదుపులో ఉంచుతూ, అసూయలు, ఆగ్రహాలను అణచివేస్తూ తుఫానుకు చేయి అడ్డుపెట్టి ఆపుతూ, పాలనను సాగించాడు జైనులాబిదీన్. అయితే, అతని చేయి అడ్డు తొలగగానే అంత వరకూ అదిమి పట్టి ఉంచిన సంకుచిత భావనల తుఫానులు కశ్మీరును ముంచెత్తాయి.

మధ్య పుష్కరిణీ మధ్యే సంక్రారిన్తః స్వాదలిప్యయా।
యత్రైతి ద్విజ రాజోపి యోగి చక్రాన్తరే ధృతమ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 46)

అక్కడ ఉన్న పుష్కరణీ తీర్ధం నీటిలో ప్రతిబింబిస్తున్న చంద్రుడు, పవిత్ర పుష్కరణి నీటిని సేవించేందుకు చంద్రుడు భూమిపైకి దిగి వచ్చాడన్నట్టు అనిపిస్తోంది. పుష్కరిణి నీట నడుమ ‘యోగి చక్రం’ ఉండటం భారతీయ సంప్రదాయంలో ఆనవాయితీ.

తిరుపతి పుష్కరిణిలో ‘సుదర్శన చక్రం’ ఉంటుంది. ఈ పుష్కరిణిలో నిత్యం స్నానం చేయటాన్ని  ‘చక్రస్నానం’ అంటారు.

కశ్మీరు శైవం యోగతంత్రలో అనేక ప్రయోగాలు చేసింది. శ్రీవరుడు ప్రస్తావిస్తున్న ‘యోగి చక్రం’ శైవ సంప్రదాయానికి చెందినదిగా పలువురు అభిప్రాయ పడుతున్నారు.

‘యోగి చక్రం’ అన్న భావన త్రిక సిద్ధాంతం ఆధారంగా ఏర్పడిందని, శివ. శక్తి, అణువు ఆధారంగా ఏర్పడిన సిద్ధాంతం త్రిక సిద్ధాంతం అనీ ఇంకొందరి అభిప్రాయం. ఏది ఏమైనా యోగి చక్ర తీర్ధంలోని నీటిలో ప్రతిబింబించే చంద్రుడు ఆ నీటిని తాగేందుకు ఆకాశం  వదలి తీర్థానికి వచ్చాడన్న శ్రీవరుడి ఊహ అద్భుతంగా, సముచితంగా, ఔచితీమంతంగా ఉంది.

(ఇంకా ఉంది)

Exit mobile version