[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
పంచమ సర్గః
దుర్లభోపద్రవానిష్టా యత్ర యత్రాభవత్ క్షితిః।
స సుయ్య ఇవ సస్యాఢ్యాం తత్ర తత్రా కరోన్నృపాః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 27)
ఉపద్రవాల ఫలితంగా పంటలు పండని భూములు, అస్సలు పంటలు పండే వీలు లేని భూములలోనూ, సుయ్య లాగా రాజు పంటలు పండించి, ప్రజల సంపత్తికి కారకుడయ్యాడు.
కశ్మీరును అవంతివర్మ పాలిస్తున్న కాలంలో ‘సుయ్య’ అనే వ్యక్తి వితస్తనది ప్రవాహాన్ని మళ్లించటం వల్ల, దేశంలో నీటి పారుదల సౌకర్యాలు పెరిగి, అంత వరకూ పంటలు పండని భూములను సస్యశ్యామలం చేశాడు. కశ్మీరు చరిత్రలో అది ఒక అద్భుతమైన ఘట్టం. అందుకే సుయ్యుడి పేరు కశ్మీరు చరిత్రలో చిరంజీవిలా నిలిచిపోయింది.
‘సుయ్యుడి’ లాగే జైనులాబిదీన్ కూడా, కశ్మీరులో నీటి పారుదల వసతులను అభివృద్ధి చేశాడు. నీరు లేని ప్రదేశాలకు నీరు చేరే వీలు కల్పించాడు. దాంతో నీరు లేక పంటలు పండటం దుర్గభమైన ప్రాంతాలలో పంటలు పండాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల, ఉపద్రవాల వల్ల పంటలు పండే వీలు లేని ప్రాంతాలూ సస్యశ్యామలం అయ్యాయి,. దాంతో కశ్మీరు ప్రజల అభివృద్ధి వేగవంతమయింది.
న తత్ స్థలం న కాత్నారో న స దేశో న సాటవీ।
యత్ర నా నీయ కుల్యాః స్వాః స్వనామాంకా పురీర్వ్య ధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 28)
కశ్మీరంలో జైనులాబిదీన్ నీరు ప్రవహింప చేయని స్థలం లేదు, అడవి లేదు, దేశం లేదు, అంటే కశ్మీరంలో ప్రతి ప్రాంతానికీ నీరు అందే ఏర్పాట్లు చేశాడన్న మాట జైనులాబిదీన్. దాంతో జైనులాబిదీన్ పేరు ఉండని స్థలం, నగరం లేకుండా అయిందన్న మాట.
న సా నదీ న తత్ క్షేత్రం న స గ్రామో న సా పురీ।
న తత్ స్థానం న యద్ రాజ్ఞా జైననామాంకితం కృతమ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 29)
కశ్మీరులో ‘జైన’ పేరు స్మరించని నది లేదు. గ్రామం లేదు. నగరం లేదు. చిన్న భూమి కూడా లేదు.
కశ్మీరమంతా ‘జైన’ పేరుతో నిండిపోయిందన్న మాట. అణువణువూ ‘జైన’ పేరును స్మరిస్తున్నదన్న మాట. నిజానికి, శ్రీవరుడి రాజతరంగిణిని తృతీయ రాజతరంగిణి అని అంటున్నాము కాని శ్రీవరుడు ‘జైనరాజతరంగిణి’ అన్నాడు.
యత్ర యత్రోభవన్నిమ్నః ప్రదేశేస్తత్ర కుల్యయా।
వ్యధాత్ రాజా సరః పక్షి బిసశృంగాటాం భూషితమ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 30)
ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలున్నాయో అక్కడ పక్షులు, కమలాలతో అలంకృతమైన సరస్సులను నిర్మించేశాడు.
ధాన్యో వారిధరో ధరోపకారణోద్యుక్తః సదా జీవనైర్యః
సింధోః సలిలం నిరర్ధకతయా నిత్యే నికృష్ట్యాన్వహమ్।
కాన్తారేష్వ ఫలేషు కౌషు రుచిరం ముచత్యభీక్ష్ణం యత్
స్తత్సకోదిత సర్వసస్య విభవో లోకః సుఖీ జాయతే॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 31)
సముద్రంలో నిరర్ధకంగా ఉన్న జలాలను స్వీకరించి మేఘాలు భూమిపై వర్షింపచేస్తాయి. ఆ వర్షాల వల్ల పంటలు పండుతాయి. ప్రజల ఐశ్వర్యం పెరుగుతుంది. ప్రజలు సంతోషంగా జీవిస్తారు. అలాంటి మేఘాలు, ప్రశంసార్హాలు.
లోకే డల్ ఇతి ఖ్యాతం యదగాధం సరోవరమ్।
తస్య ప్రతిష్ఠాప్రస్తావాద్ క్రియతే మనాక్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 32)
ఈ దేశంలో ‘డల్’ అనే పేరున్న లోతైన సరస్సు ఉంది. ఎంతో ప్రఖ్యాతి పొందిన ఈ సరస్సు చరిత్రను వర్ణిస్తాను.
శ్రీనగరంలో పర్యటకులను అమితంగా ఆకర్షించే ‘దాల్’ సరస్సను శ్రీవరుడు ‘డల్’ సరస్సు అంటున్నాడు.
ఈ సరస్సును ‘మహాసరిత్’ అనేవారు. తరువాత ఈ సరస్సును ‘సురేశ్వరి’ అనేవారు. దుర్గామాతకు ప్రతిరూపంగా అతి పవిత్రంగా భావించేవారీ సరస్సును. రాజతరంగిణిలో ఈ ‘డల్’ సరస్సు లేక ‘డల్సర్’ అనటం కనిపిస్తుంది. సురేశ్వరి ‘డల్’ గా ఎందుకు మారిందో ఎలా మారిందో తెలియటం లేదు. కానీ 14వ శతాబ్దం నుండీ ఈ సరస్సును ‘డల్’ సరస్సు అనే పిలుస్తున్నారని శ్రీవరుడి రాజతరంగిణి ద్వారా తెలుస్తోంది. ‘డల్’ అన్నది తిబ్బత్తు పదం. ‘నిశ్శబ్ద నీరు’ అని అర్థం.
ఆ రాజధాన్యా యద్ దీర్ఘం సురేశ్వర్యాః సరోవరమ్।
నౌకారూఢో చరన్నిత్యం వ్యోమ్నీవేన్దుః సునిర్మలే॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 33)
సురేశ్వర సరోవరం రాజధాని వరకూ విస్తరించి ఉంది. ఆ సరోవరం నీటిలో నిర్మలాకాశం ప్రతిఫలిస్తూంటుంది. ఆ నీటిలో నౌకారూఢుడై రాజు విహరిస్తుంటాడు నిత్యం.
‘డల్’ సరస్సే సురేశ్వర సరస్సు. జైనులాబిదీన్ తన చివరి దశలో ఈ సరస్సులో ఆకాశంలో చంద్రుడిలా నౌకాయానం చేస్తూ శ్రీవరుడు పఠిస్తూ వివరించే శాస్త్ర గ్రంథాలు వింటూ గడిపాడు. బహుశా, అందుకే శ్రీవరుడు ఈ సరస్సును విపులంగా వర్ణించాలని సంకల్పించాడు.
జైనులాబిదీన్తో సంబంధం ఉన్న ప్రతిదాన్నీ శ్రీవరుడు ఎంతో అప్యాయంగా, ప్రేమగా వర్ణిస్తున్నాడు.
అంత్ర్ర పత్రా యత్రాతః సోడ్డీనాః పట సుందరాః।
పోతా ఇవారుచిన్ పోతా రాజ్ఞాః శాకునికాన్వితాః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 34)
సరస్సులో రాజు నౌక ధ్వజం గాలికి అల్లల్లాడుతుండగా అది ఆకాశంలో విహరించే పక్షిలా తోచింది. రెండు వైపులా తెడ్లు పక్షి రెక్కల్లా తోచాయి. వాతావరణం గురించి తెలిసిన వారు, నౌకను నడిపే నావికులు. సరస్సులో ప్రయాణించే నౌకను ఆకాశంలో విహరించే పక్షితో పోల్చటం అత్యంత రమణీయమైన, ఔచితీవంతమైన వర్ణన.
సరస్సులో నీరు నీలి రంగులో ఉంది. స్వచ్ఛమైనది. ఆ నీటిలో ఆకాశం ప్రతిఫలిస్తోంది. అంటే నీరు ఆకాశమయిందన్న మాట. పక్షి విహరించేది ఆకాశంలో. నౌక విహరిస్తున్నది ఆకాశం ప్రతిఫలిస్తున్న నీటిలో. దూరం నుంచి చూసే వారికి నౌక పక్షిలా ఆకాశంలో విహరిస్తున్నట్లు కనబడటంలో ఆశ్చర్యం లేదు. నిజానికి అది అలాగే కనిపిస్తుంది కూడా.
‘డల్’ సరస్సు ఒడ్డున నుంచుని, ఆ సరస్సులో విహరించే నౌకలను చూసే వారికి ఇది అనుభవం.
కశ్మీరు పర్యటించే వారు ఈ సరస్సులో ‘బోట్ హౌస్’ లలో ఉంటారు. సరస్సులో నౌకలపై విహరిస్తారు. కానీ దూరంగా కాస్త ఎత్తున కూర్చుని సరస్సును చూడటం ఒక అత్యధ్బుతమైన అనుభవం. శ్రీవరుడు వర్ణిస్తున్నది ఆ అనుభవాన్ని. ఇప్పటితో పోలిస్తే శ్రీవరుడి కాలంలో ఇంకా అత్యద్భుతంగా ఉండి ఉంటుంది.
పక్షి ఎగిరేటప్పుడు రెక్కలను ఆడిస్తుంది. నౌకను రెండు వైపులా వారు వేసే తెడ్లు పక్షి రెక్కలు. నౌక పైన జండా ఉంటుంది. ఎండ పడకుండా వస్త్రం కప్పుతారు. తెరచాప ఉంటుంది. గాలికి అది ‘ఫడఫడ’ కొట్టుకుంటుంది. అది పక్షి గాలిని చీల్చుకుంటూ వెళ్ళే శబ్దం లాంటిది.
గమనిస్తే శ్రీవరుడు ‘నౌక’ అన్న పదం వాడలేదు. ‘పోతా’ అన్న పదం వాడేడు. ‘పోతా’ శబ్దం అర్థపూర్ణమైనది.
కశ్మీరు సరస్సులమయం. వివిధ సరస్సులలో భిన్నభిన్నమైన నౌకలు ప్రయాణిస్తాయి. సముద్రంలో ప్రయాణించే నౌకలు పెద్దవి. వీటిని కశ్మీరులో ‘సజ్జూ’ లాంటారు. ఇవి వితస్త, ఊలూరు సరస్సులలో ప్రయాణిస్తాయి.
‘హౌస్ బోట్’లు మనకు తెలుసు. వీటిల్లో గదులుంటాయి. ఇవి నౌకాగృహాలు.
‘షికారా’లు చిన్న నౌకలు. వీటిల్లో వెనుక భాగంలో యాత్రికులు సుఖంగా కూర్చుంటారు.
వితస్తలో కానీ ‘డల్’ సరస్సులో కానీ నీరు ప్రవహించదు. అది నిశ్చలమైన నీరు. ఆ నిశ్చలమైన నీట ప్రయాణంలో ఎలాంటి ప్రమాదం ఉండదు. సరస్సులో తెడ్డు వేసినప్పుడల్లా మధురమైన లయబద్ధమైన శబ్దం అవుతుంది.
జైనులాబిదీన్ సరస్సులో ‘పోత్’ నౌకా ప్రయాణం చేస్తున్నాడని శ్రీవరుడు అవటం వెనుక లోతైన అర్థం ఉంది.
కశ్మీరు శైవం ప్రకారం ‘పోత్’ అన్నది శుభప్రదమైన జంతువును వాహనంగా చేసుకోవటం అన్న అర్థం ఇస్తుంది. ఉచ్చదశను సూచిస్తుంది. ఈ జంతు వాహనాన్ని అధిరోహించి ‘నది’ దాటటం అంటే అత్యంత పుణ్యాన్ని సంపాదించటం అని సూచిస్తుంది.
జైనులాబిదీన్ చివర దశ ఇది. ఆయన నది ప్రయాణం చేస్తున్నాడు శుభప్రదమైన వాహనాధిరోహం చేసి నది దాటటం ముక్తిని సూచిస్తుంది. త్వరలో జైనులాబిదీన్ ముక్తిని పొందుతాడని సూచిస్తుందీ పదం.
తిలప్రస్థాగతా యత్ర తటినీ త్రిపురేశ్వరాత్।
సంగచ్ఛత్ సుటంగాం యల్లంకాం ద్రస్ఠుమివోత్సుకా॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 35)
త్రిపురేశ్వరం నుంచి వస్తున్న తిలప్రస్త నది లంకను చూడాలన్న ఉత్సాహంతో సుటక్ వైపు పరుగులిడుతున్నట్టుంది.
‘ఆరా’ నదీ తీరంలో త్రిపురేశ్వరం ఉంది. ఆరా నదికి ఒక శాఖ ‘తిలప్రస్థ’. ‘శాలిమార్’ శాఖ నుండి వేరు పడిన ‘తిలప్రస్థ’ డల్ సరస్సులో కలుస్తుంది. నీలమత పురాణంలో ‘తిలప్రస్థ’ నది ప్రస్తావన వస్తుంది. దీనిని ‘తెలవల్ నాలా’ అంటున్నారిప్పుడు.
శ్రీ పర్వతోపి షట్క్రోస తీర్థస్నాన ఫలేప్సయా।
స్వసంగతిచ్ఛాద్ యత్ర మజ్జతీవ దివానిశమ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 36)
‘లంక్’ను దర్శించాలని తిలప్రస్థ ఎందుకుని పరుగులెడుతున్నదంటే ఆరు క్రోసుల నిడివి ఉన్న శ్రీపర్వతం అక్కడ నదిని కలుస్తుంది. అది నిత్యం నది నీటిలో స్నానం చేస్తూ తీర్థస్నాన పుణ్యం సంపాదిస్తున్నట్టుంది.
శైవలంతి ద్రుమా యత్ర కమఠన్తి చ పర్వతాః।
పుర్యశ్చ నాగలోకన్తి జలాన్తర్యత్ర బింబితాః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 37)
అక్కడ నీటిలో వృక్షాలు నాచులా ప్రతిఫలిస్తున్నాయి. పర్వతాలు తాబేళ్లలా, నగరాలు నాగలోకంలా అనిపిస్తున్నాయి.
యంచలత్త్పుణ్య భూషాలికులాని సరసీరుహమ్।
తత్సౌగంధ్యమివాఘ్రా తుమాన తానీక్షత్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 38)
అక్కడ భూములపై మొలిచిన మొక్కలు, పంటలు, కమలాల సువాసనను ఆఘ్రాణించేందుకు భూమి పైకి వంగుతున్నట్టున్నాయి.
యల్లంకాయుగలోత్ప్రేక్షా స్వోదయ ద్వయ సంభ్రమాత్।
జానే యాతి రవిః కుర్వక ప్రత్యబ్దమయ న ద్వయమ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 39)
రెండు లంకలను చూసి రెండు సూర్యోదయాలని భ్రమించిన సూర్యుడు రెండు ఆయనాలు చూస్తూ ప్రయాణిస్తాడు.
‘రెండు లంకలు’.. ఒకటి స్వర్ణమయమైన రావణుడి లంక, రెండు శోభాయమానమైన సుందరమైన కశ్మీరులో లంక.
‘రెండు ఆయనాలు’ ఉత్తరాయణం, దక్షిణాయనం. ఉత్తరాయణం అంటే సూర్యుడు ఉత్తర దిశకు ప్రయాణించటం. దక్షిణాయనం అంటే దక్షిణ దిశకు ప్రయాణించటం. ఉత్తరాన ఒక లంక ఉంది. దక్షిణాన ఒక లంక ఉంది. ఇది సూర్యుడిని అయోమయానికి గురి చేసింది. అందుకని ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరాని తిరుగుతున్నాడన్న మాట సూర్యుడు. ఒక సంఘటనను చమత్కరభరితంగా వర్ణిస్తూ కశ్మీరు లంక గొప్పతనాన్ని అద్భుతంగా చెప్తున్నాడు శ్రీవరుడు. దక్షిణాన ఉన్నది బంగారు లంక. ఉత్తరాన ఉన్నది ప్రాకృతిక సౌందర్య లంక. రెండూ ఒకటే అనుకుని సూర్యుడు భ్రమిస్తూ రెంటి చుట్టూ తిరుగుతున్నాడు.
(ఇంకా ఉంది)