[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]


పంచమ సర్గః
అత్రాన్తరే సుతప్రాప్త్యా నిశ్చింతః సుకృతోద్యతః।
కుల్యా నవనవాః కర్షన్ ప్రతిష్ఠారసికో భవత్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 1)
తన కొడుకు తన వెంటే ఉండటంతో రాజు ప్రశాంత చిత్తుడయ్యాడు. నిశ్చింతతో ఇప్పుడు తన దృష్టిని సత్కార్యాల వైపు మరల్చాడు. ప్రజోపయోగ కార్యాలను ఆరంభించాడు. నీటి పారుదలను మెరుగు పరచేందుకు కాలువలు తవ్వించటం వాటిని ఆరంభించటం వంటి పేరు ప్రఖ్యాతులు అందించే కార్యక్రమాలు ఆరంభించాడు. ‘ప్రతిష్ఠారసికో భవత్’ అన్నాడు శ్రీహరుడు.
ఇప్పుడు జైనులాబిదీన్కు అంతర్గత కలహాల చింత లేదు. కొడుకుల నడుమ రాజ్యం కోసం పోరు లేదు. రాజ్యంలో అరాచకం, అల్లకల్లోలాలు అన్నీ అదుపులోకి వచ్చాయి. దాంతో శేషజీవితాన్ని సత్కార్యాలు జరుపుతూ గడపటంపై దృష్టి పెట్టాడు జైనులాబిదీన్. ఇప్పుడతని ప్రక్కనే కొడుకు ఉండటంతో అతడికి ఇక దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎంతో మంది సుల్తాన్ల కన్నా అదృష్టవంతుడు జైనులాదిబీన్. అతని జీవితంలో చరమ దశ ఎలాంటి పోరాటాలు, ఖైదులు, మానసిక వేదనలు లేకుండా ప్రశాంతంగా గడచే వీలు చిక్కింది.
కవిః శ్రో జోనరాజో యాం స్వసందర్భాన్తరే బ్రవీత్।
గ్రంథ విస్తార భీత్యా తద్వర్ణనం న మయాం కృతమ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 2)
కవి జోనరాజు తన గ్రంథంలో రాసిన విషయాలను, గ్రంథ విస్తార భీతి వల్ల మళ్లీ నేను ఇక్కడ చెప్పటం లేదు.
ఈ శ్లోకం రాజతరంగిణి రచనలో శ్రీవరుడి ప్రణాళికను తెలుపుతుంది.
జోనరాజు రాజతరంగిణి క్రీ.శ. 1150 నుండి క్రీ.శ.1459 నడుమ కాలంలోని కశ్మీరు చరిత్రను ప్రదర్శిస్తుంది. జైనులాబిదీన్ క్రీ.శ. 1420లో రాజ్య కార్య భారం చేపట్టాడు. అంటే దాదాపుగా 39 ఏళ్ల జైనులాబిదీన్ పాలనా కాలాన్ని జోనరాజు తన రాజతరంగిణిలో ప్రదర్శించాడు. శ్రీవరుడు క్రీ.శ 1459 నుండి 1486 వరకూ అంటే జైనులాబిదీన్ 27 ఏళ్ల పాలన కాలాన్ని మాత్రమే తన రాజతరంగిణిలో పొందుపరచాడు. కానీ జోనరాజుకు భిన్నంగా శ్రీవరుడి రాజతరంగిణి వర్ణన ప్రాధాన్యంగా సాగింది. ఫిరంగి వర్ణన, యుద్ధ వర్ణన, నాగోత్సవం, దీపోత్సవాల వర్ణన ఇలా కశ్మీరులో చివరిసారిగా భారతీయులు అతి వైభవంగా జరుపుకున్న పండుగల సంబరాల వర్ణనలను శ్రీవరుడు రాజతరంగిణిలో పొందుపరచాడు. అంటే జోనరాజు ఏయే అంశాలను తన రాజతరంగిణిలో పొందుపరచాడో, అయా విషయాలను తన రాజతరంగిణిలో పొందుపరచలేదని స్పష్టం చేస్తున్నాడు శ్రీవరుడు. అదీ అయిదవ అధ్యాయం ఆరంభంలో.
ఇలా చెప్పటం వల్ల జైనులాబీదీన్ పాలనా కాలం గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే జోనరాజు రాజతరంగిణి, శ్రీవరుడి రాజతరంగిణి రెంటినీ కలిపి చదవాల్సి ఉంటుంది. దేనికేదే ప్రత్యకంగా రచించినా, ప్రత్యేకంగా చదువుకోగలిగినా, మొత్తం తెలియాలంటే రెండూ చదవాల్సిందే. ఈ రకంగా శాశ్వతంగా తన పేరును, గ్రంథాన్ని జోనరాజు పేరుతో, గ్రంథంతో ముడివేశాడు శ్రీవరుడు.
ఏకైవాస్త్యమరావతీ దివిపురీ సాజ్ఞాత్ నిర్మాణకా
తత్రాప్యత్ర సదా విమానవసతి దైవాదిషు శ్రూయతే।
సోభూద్ భూమిపురందరః పురశతం కుర్పన్నవం సర్వతో
యత్రైతే నివసన్తి మానసహితాస్తే భూమిదేవాదయః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 3)
స్వర్గంలో ఉన్న నగరం అమరావతి. అమరావతి నగర నిర్మాణం ఎలా జరిగిందో ఎవరికీ తెలియదు. అక్కడ విమానాలుంటాయి. దేవతలు ఆ విమానాలలో ప్రయాణాలు చేస్తుంటారు. భూమి మీద కూడా అలాంటి వంద పైగా నగరాలు నిర్మించి భూమి పురందరుడయ్యాడు రాజు. ఈ నగరాలలో భూతల దేవతలు (బ్రాహ్మణులు) నివసిస్తారు.
‘పురందర’ అన్నది వైవస్వత మన్వంతరంలో ఇంద్రుడి పేరు. మత్స్యపురాణం పురందరుడిని 18 మంది వాస్తు శాస్త్రకారులలో ఒకరిగా పరగమిస్తుంది. ‘పురందరుడు’ అంటే నగర నిర్మాణాలలో నిష్ణాతుడన్న మాట. వాస్తు శాస్త్ర నిపుణుడు. కశ్మీరులో వంద పైగా అమరావతి లాంటి నగరాలను నిర్మించి జైనులాబిదీన్ భూమి పురందరుడయ్యాడన్న మాట.
అమరావతిని ఇంద్రపురి, సురపురి అంటారు. విశ్వకర్మ నిర్మించాడు అమరావతి నగారాన్ని. ఈ నగరంలో స్తంభాలు బంగారు స్తంభాలు. సింహాసనం బంగారు సింహాసనం. నాలుగు వైపుల సుందర రమణీయమైన ఉద్యానవనాలుంటాయి. జలాశయాలుంటాయి. నిత్యం సుందరమైన వాయిద్య ధ్వని వినిపిస్తుంటుంది. ఆ అమరావతిని విశ్వకర్మ ఎలా నిర్మించాడో తెలియదు కానీ భూమి మీద వందల కొద్దీ అమరావతి లాంటి నగరాలను జైనులాబిదీన్ నిర్మింపచేయటం మనకు తెలుసు, కళ్లారా చూస్తున్నాం అంటున్నాడు శ్రీవరుడు. అంతే కాదు, ఆ అమరావతిలో దేవతలు ఎప్పుడూ విమానాలల్లో తిరుగుతుంటారు. కానీ భూమి పైన అమరావతిలో భూమి దేవుళ్లు నిరంతరం నివసిస్తుంటారు. బ్రాహ్మణులను భూమి దేవతలు అనికూడా అంటారు. జైనులాబిదీన్ కట్టిన నగరాల్లో బ్రాహ్మణులు సుఖసంతోషాలతో జీవించగలగటంవల్ల అవి అమరావతికి దీటుగా నిలబడ్డాయి. వారులేకపోతే, అవి అమరావతినగరంకాదు, సుల్తాన్ పురిలయ్యేవి.
శ్రీజైననగరే పంచదశాబ్దే యా కృతా పురా।
రాజధానీ నవామ్యుచ్చా విద్ధా దేవగృహోపరి॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 4)
15వ సంవత్సరంలో జైనులాబిదీన్ నూతన రాజధాని నిర్మించాడు. ఈ రాజధానిలో దేవగృహం ఎంతో ఎత్తున ఉంది.
‘జైననగరం’ అన్నది ప్రస్తుతం కశ్మీరులో ‘హరిపర్బత్’ నుండి ‘అంబునహర్’ వరకూ ఉన్న ప్రాంతం వరకూ ఉండేదని భావిస్తున్నారు. ‘జైనగంగ’ తీరం దగ్గర ఉండేదీ నగరం. ఈ ‘జైనగంగ’ను ప్రస్తుతం ‘లభమ్ కుల్’ అంటున్నారు. ఈ ప్రాంతాన్ని రాజధాని, లేక ‘రాజదాన్’ అన్న పేర్లతో పిలుస్తారు. ‘తారీఖ్-ఎ-రషీదీ’ ప్రకారం ‘జైనదీల్’ నగరమే జైననగరం.
మీర్జా హైదర్ ప్రకారం ఈ భవంతి (దైవగృహ) 12 అంతస్తుల భవనం. ప్రతి అంతస్తులో 50 పైగా గదులుండేవి. తానీ భవంతిని 1553లో చూసినట్టు మీర్జా హైదర్ రాశాడు. ఆ తరువాత ఈ భవంతి కూలిపోయింది. ఇప్పటికీ ఈ భవంతి, ఇక్కడ జరిగే ఉత్సవాల పాటలు కశ్మీరులో పాడతారు. ఈ భవంతి గురించి ‘శుకుడు’ కూడా తన రాజతరంగిణిలో రాశాడు. ఇప్పుడీ నగరాన్ని ‘నౌశహారా’ అంటారు. పదహారవ శతాబ్దం వరకూ ‘రాజదాన్’ లేక ‘రాజధాని’ అనేవారు.
ఈ నగర నిర్మాణాలు, ఈ భవనాల నిర్మాణాలు, కాలువల కట్టడాల గురించి తెలుసుకుంటుంటే ఏ రకంగా కశ్మీరును జైనులాబిదీన్ దీర్ఘకాలం ప్రభావితం చేశాడో తెలుస్తుంది. ఇంకా కశ్మీరులో జైనులాబిదీన్ ప్రవేశ పెట్టిన వృత్తులు గురించి తెలుసుకుంటే, ఈనాటికీ కశ్మీరులో ఆనాడు జైనులాబిదీన్ ప్రవేశ పెట్టిన వృత్తులే ప్రధాన వృత్తులన్నది గమనిస్తే, కశ్మీర్ను జైనులాబిదీన్ తిరుగులేని రీతిలో ప్రభావితం చేయటం అర్థమవుతుంది. అయితే ఆ కాలంలో జైనులాబిదీన్ ఏర్పాటు చేసినవన్నీ ఈనాటికీ కశ్మీరులో అమలవుతున్నాయి, ఒక్క ‘పరమత సహనం’ తప్ప!
తస్యాః సమీపే నృపతిశ్చత్వారింశేథ్య వత్సరే।
ఇష్టికాదారు సంబద్ధం రాజవాసం నవం వ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 5)
ఈ నగరానికి సమీపంలోని 40వ సంవత్సరంలో దారువుతో, చక్కటి కర్రలతో రాజప్రాసాదం నిర్మింపచేశాడు.
ఈ నగరానికి సమీపంలోని రాజు 1564 సంవత్సరంలో రాజప్రసాదం నిర్మింప చేశాడు.
యత్ పృష్టే స్వర్ణకలశో భాభిర్భాతి మనోహరః।
హేమపద్మ ఇవోన్ముక్తః శక్రేణ శృతకీర్తినా॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 6)
రాజప్రసాదంపై స్వర్ణకలశం శోభాయమానంగా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, రాజు ఖ్యాతి విని ఇంద్రుడు స్వర్గం నుంచి స్వర్ణకలశం భూమిపైకి పంపినట్టుంటుంది.
యద్ ద్వారాగ్రే నియుక్తే భ్యస్తత్తత్కర్మ సమాదిశన్।
ఆజీవం సోవసద్ రాజా రాజధాన్యుజ్ఞితాస్థితిః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 7)
ఈ నిర్మాణం ద్వారం వద్ద నియుక్తులైన సేవకులకు అదేశాలిస్తూ రాజు జీవితాంతం రాజధానిని వదలి ఇక్కడే నివసించాడు.
అంటే, తన కొడుకు తిరిగి తన దగ్గరకు రావటంతో జైనులాబిదీన్ నెమ్మదిగా అన్ని బాధ్యతలు వదల్చుకోవటం ఆరంభించాడన్న మాట. అందులో భాగంగా రాజధానిని వదలి తన కోసం కట్టుకున్న ప్రత్యేక భవనంలోకి మారిపోయాడు. జీవితాంతం ఇక్కడే నివసించాడు. ఇక్కడే మరణించాడు.
జీవిత చరమాంకంలో ఇంత ప్రశాంతంగా జీవించిన సుల్తానులు ఎంతో అరుదు.
యత్ర వాపీగతా హంసా గీతశంసాం స్వనచ్ఛలాత్।
కుర్వంతీవ సమీపస్థ గాయద్ గీతాంకి సంస్కృతైః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 8)
పక్కనే ఉన్న కొలనులో ఉన్న హంసలు గాయనీగాయకులు గానం విని ఆకర్షితమై, గాయకులతో పాటు తానూ ప్రశంసాపూర్వకంగా పాడుతున్నట్లు శబ్దాలు చేస్తున్నాయి. ‘వాపీ’ అన్న పదం వాడేడు శ్రీవరుడు. ‘వాపీ’ అన్నది పెద్ద జలాశయం. రాళ్లతో చేసిన మెట్లుంటాయి. ఈ మెట్లు ఆధారంగా దిగి నీళ్లు తీసుకునే వీలుంటుంది. సరోవరం, కూపీ, వాపీ, తటాకం వంటి పదాలన్నీ జలాశయాలను సూచించినా, ప్రతి పదానికీ నిర్దిష్టమైన అర్థం ఉంది. ‘వాపీ’ కి ఆంగ్లంలో ‘tank’ సమనార్థం.
యత్ర సర్వీకృతారాతిః సుపర్వాధిపతిర్యథా।
సర్వాహః సుఖగాంధర్వ చర్వణై రనయత్ సుఖమ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 9)
ఇక్కడ శత్రువులందరినీ ఇంద్రుడిలా నిర్జించిన రాజు, తన శేషజీవితాన్ని ప్రశాంతంగా, గంధర్వ విద్య ప్రదర్శనల ఆనందాన్ని అనుభవిస్తూ గడిపాడు.
అదృష్టవంతుడు జైనులాబిదీన్!
దాదాపుగా రాజ్యభారమంతా కొడుకుకు అప్పగించి, తన కోసం ప్రత్యేక భవనాన్ని నిర్మించుకుని తన కిష్టమైన రీతిలో శేషజీవితాన్ని గడపగలుగుతున్నాడు. ఈ అదృష్టం అందరు సుల్తానులకు ఉండదు.
కొడుకుల మధ్య అధికార పోరు చింతతోనో, తన తరువాత రాజ్యం ఏమైపోతుందోనన్న బెంగతోనో, కొడుకు రాజ్యం సాధించి జైల్లో వేస్తే ఆ జైలులోనే మ్రగ్గుతూనో, చివరి దశను గడిపేవారు సుల్తానులు. చివరికి అక్బర్ చివరి రోజులు కూడా ప్రశాంతంగా సాగలేదు.
అధికారం కోసం అతని సంతానం సలీమ్, ఖుస్రోల నడుమ పోటీ ఉండేది. తాగుబోతు, తిరుగుబోతు అని సలీమ్ను కాకుండా ఖుస్రోకు అధికారం కట్టబెట్టాలని అక్బరుకు ఉండేది. కానీ అక్బర్ ఖుస్రో వైపు మొగ్గు చూపటం సలీమ్ భరించలేకపోయాడు. తనపై కొడుకు విషప్రయోగం చేస్తున్నడనన్న అనుమానం అక్బర్కు ఉండేది. చివరికి సలీమ్ తిరుగుబాటు కూడా చేశాడు. తన కొడుకులలో ఎవరు రాజ్యార్హులో నిర్ణయించేందుకు ఇద్దరు కొడుకుల ఏనుగుల నడుమ యుద్ధ పోటీ ఏర్పాటు చేశాడు అక్బర్. సలీమ్కు చెందిన ఏనుగు విజయం సాధించింది. దాంతో సలీమ్ అభిమానులు, ఖుస్రో అభిమానుల నడుమ పెద్ద కొట్లాట జరిగింది, అక్బర్ ముందే. ఆ తరువాత అక్బర్, ఆరోగ్యం పాడయింది. అక్బర్ను మతం మార్చాలని ఆ దశలో కొందరు క్రిస్టియన్ మత ప్రచారకులు ప్రయత్నించారు. ఇది ఇస్లామీయులలో ఆగ్రహం కలిగించింది. చివరికి అక్బర్ మరణ స్థితిలో ఉండగా సలీమ్ బలవంతంగా అక్బర్తో ‘రాజు’గా తన పేరు ప్రకటింపచేసుకున్నాడు. ఆ తరువాత అక్బర్ మాట పడిపోయింది. అక్బర్ మరణ దశలో అతనితో ‘అల్లా’ పేరు పలికించాలని ఎంతో ప్రయత్నించారు. కానీ మాట పడిపోయి అక్బర్ శబ్దం ఉచ్ఛరించలేకపోయాడు. చివరికి ఓ అర్ధరాత్రి మరణించాడు. అతని తరువాత రాజయిన సలీమ్ తనని ‘జహంగీర్’గా ప్రకటించుకున్నాడు.
దీనితో పోలిస్తే, చివరి దశలో పాటలు వింటూ, నాట్యాలు చూస్తూ శ్రీవరుడి ద్వారా శాస్త్రాలు వేదాంతం వింటూ జైనులాబిదీన్ మరణించాడు. అందుకే అతను సుల్తానులందరిలోకి అదృష్టవంతుడు.
(ఇంకా ఉంది)

2 Comments
కొల్లూరి సోమ శంకర్
ఇది శ్రీమతి తాటికోల పద్మావతి గారి వ్యాఖ్య: *శ్రీవర తృతీయ రాజతరంగిణి ఈ వారం చాలా అద్భుతంగా రాశారు. రాజు వెంట కొడుకు ఉండి అరాచకాలను అదుపులోకి తేవటం, అమరావతి నగరాన్ని వర్ణించిన అద్భుతం, కొలనులో హంసలు గాయనీ గాయకుల గానం వినడం, రాజు శేష జీవితాన్ని గంధర్వ విద్య ప్రదర్శన ద్వారా ఆనందాన్ని అనుభవించి గడపటం అద్భుతమైన విషయాలతో వర్ణించిన శ్రీవర రాజతరంగిణి పరిచయం చేసినందుకు ధన్యవాదములు.
తాటికోల పద్మావతి
కొల్లూరి సోమ శంకర్
This is a comment by Mr. Konduri Kasivisveswara Rao: *This week’s Rajatharangini is having lot of information about Kashmir, Amaravathi and ancient Muslim rulers. Thank you Sir, Konduri Kasivisveswara Rao
*