[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
చతుర్థ సర్గ
ఖుజ్యాబ్దోల్కాదిరాఖ్యస్య శిష్యః సర్వగుణాంబుధేః।
భూభుజశ్చిత్త మనయద్ రాగతలదిభిర్ముదమ్॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 31)
సర్వగుణ సాగరం లాంటి వాడయిన అబ్దుల్ ఖాదిర్ శిష్యుడు సుజ్య తన సంగీత పరిజ్ఞానంతో సుల్తాన్ను సంతోషపెట్టాడు.
‘సుజ్య’ అన్న పేరు ‘షూజా’కు రూపాంతరంగా భావిస్తారు. ‘ఐన్-ఇ-అక్బరీ’ లో ‘సుజ్య’ అసలు పేరు ‘ఖాజా’ అని రాశారు. ‘ఖాజా’ అన్నది సుల్తానుల దగ్గా ఉండే నపుంసకుల నామంగా భావిస్తారు. ‘తవ్వాకత్-ఎ-అక్బరీ’ లో ‘ముల్లా ఊదీ’, ‘ఖురసాన్’ నుండి వచ్చాడు. ఇతడు పేదవాడు. ఖ్వాజా అబ్దుల్ ఖాదిర్ శిష్యుడు అని ఉంది. ఈ ‘ఊదీ’ వాయిద్యాలు వాయించటంలో ప్రావీణ్యం ఉన్నవాడు. ఇతడి సంగీత ప్రావీణ్యాన్ని మెచ్చిన సుల్తాన్ ఇతడికి అనేక రకాల బహుమతులు ఇచ్చాడని ఉంది.
‘ఖురసాన్’ అనేది ‘ఇరాన్’లో ప్రాచీన చరిత్ర గల ప్రాంతం. ఇక్కడ ఆ కాలంలో పార్శీలు ఉండేవారు. తరువాత ఈ ప్రాంతం పూర్తిగా ఇస్లాంమయం అయిపోయింది. ‘పార్శీ’లు ప్రాణాలు అరచేత పట్టుకుని భారత్ వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు.
ఖురసానాగతో ముల్లాజాదకాఖ్యో మహీపతేః।
వాదనాత్ కూర్మవీణాయాః ప్రాపాతులమనుగ్రహమ్॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 32)
ఖురసాన్ నుండి వచ్చిన ముల్లా జాదక్, కూర్మవీణ వాదనంతో రాజును సంతోషపరిచి అతని అనుగ్రహ పాత్రుడయ్యాడు.
శ్రీవరుడు ‘ ముల్లా జాద్దక్’ అన్నాడు. ఇతను ఖురసాన్ నుంఛి వచ్చిన ‘ముల్లా జాద్’గా భావిస్తున్నాడు. ‘ముల్లా’ అన్నది అరబ్బీ శబ్దం. ఆజాన్ పిలుపును ఇచ్చేవారు, పిల్లలకు పాఠాలు చెప్పేవారిని మౌల్వీ, ముల్లా అంటారు. శ్రీవరుడు ప్రస్తావించిన కూర్మ వీణను కచ్ఛపి వీణగా భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో కచ్ఛపి వీణను ‘కఛువా సితార్’ అంటున్నారు.
‘ఖురసాన్’కు, కశ్మీరుకు ప్రాచీన కాలం నుంచీ సంబంధాలు ఉన్నాయన్న అభిప్రాయం అధికంగా వినిపిస్తుంది. “The Brokpa Darads of Dah, Hano and Garkun in Ladakh” అనే వ్యాసంలో F. M. Hasnain – కశ్మీరుకు నాగులను ఆరాధించే ఆలోచనను ఖురసాన్ నుండి వచ్చిన ఆర్యులు తీసుకుని వచ్చారనీ, వీరు గిల్జిత్, అస్తర్, దాహ్, హనో, గర్కున్, కార్గిల్ ల గుండా కశ్మీరు వచ్చారని ప్రతిపాదించాడు. అందుకే కశ్మీరు ముస్లింలు ఈనాటికీ హిందువులతో సమానంగా నాగపూజ చేస్తారంటాడు. మీర్జా హైదర్ దహ్లత్, అబుల్ ఫజల్, హైదర్ మాలిక్ చూద్రా వంటి వారు కూడా కశ్మీరు ఇస్లామీయుల నాగ ఆరాధన గురించి ప్రస్తావించారు. వీరి ప్రకారం ప్రాచీన కాలం నుండీ కశ్మీరుకూ ఖురసాన్కూ నడుమ సంబంధ బాంధవ్యాలున్నాయి. అయితే కశ్మీరుపై ఖురసాన్ ప్రభావాన్ని చర్చించే వారి ప్రతిపాదనలన్నీ ఆమోదయోగ్యంగా అనిపించవు. వీరి ప్రకారం కశ్మీరులో అగ్నిని పూజించటం, పెళ్ళిళ్ళ సమయంలో అగ్నికి ప్రదక్షిణ చేయటం, పూజలలో దీపాలు వెలిగించటం వంటి పద్ధతులు పార్శీల అగ్ని ఆరాధన ప్రభావమే. నాగుల పూజలు, దీపారాధన వంటివన్ని ఖురసాన్ పార్శీల ప్రభావమే అనటం ఆమోదయోగ్యంగా అనిపించదు.
తుంబవీణాధరః సోహం సర్వగీతవిశారదః।
ఉద్దద్ద నవగీతాంకం కౌశల సమదర్శయమ్॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 34)
సర్వగీతా విశారదుడు, తుంబవీణాధారి అయిన నేను నవీన గీతాలతో నా కౌశల ప్రదర్శన చేశాను.
అన్యేపి జాఫరాణాద్యా మయా సహ నృపాగ్రగాః।
తౌరూష్కాన్ దుష్కరాన్ రాగాన్ గాయన్ వీణయా సమమ్॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 35)
నాతో పాటు జఫారానా ఇతరులు వీణపై రాజు ముందు తురుష్కుల పాటలు పాడేరు.
ఇక్కడ శ్రీవరుడు దీపోత్సవ సందర్భంలో తాను పాటలు పాడడం గురించి చెప్తున్నాడు. శ్రీవరుడు కవి, పండితుడు మాత్రమే కాదు, గాయకుడు, సంగీత విద్వాంసుడు కూడా. అందుకే తన కావ్యంలో దీపోత్సవం సంబరాలలోని నృత్య, గీతాలను అంత సూక్ష్మంగా ప్రస్తావించాడు. సంగీత వాయిద్యాల గురించి చెప్పగలిగాడు. ఇప్పుడు తాను సాంప్రదాయక పాటలే కాదు, మ్లేచ్ఛ వాయిద్యాలు వాయించటం, తురుష్క గీతాలు గానం చేయటంలోనూ నిష్ణాతుడనని చెప్పుకుంటున్నాడు. శ్రీవరుడు ప్రస్తావించిన ‘జాఫర్’ ఎవరో ఆధారాలు లేవు.
శ్రీవరుడు తురుష్క గీతాలు అన్నాడు. ఆ కాలంలో తురుష్క రాగాలు రెండు రకాలు. ఒకటి తురుష్క గౌడ్ రాగం. రెండవది తురుష్క తోడీ రాగం. తురుష్క గౌడ్ లో శుద్ధ నిషాద స్వరం ఆరోహణలో, కోమల నిషాదం అవరోహణలోనూ వాడతారు. రిషభ పంచమ స్వరాలు వర్జితాలు. మంద్రస్థాయిలో గాంధార ప్రయోగం ఉంటుంది. తురుష్క తోడీ రాగంలో గాంధార స్వర ప్రయోగం ఉంటుంది. నిషాద, రిషభ, పంచమ స్వరాల ప్రయోగం అధికం.
తురుష్క రాగాలను వీణా వాయిద్య సహాయంతో, తురుష్క గాయకులతో పాటు పాడి మెప్పించాడన్న మాట శ్రీవరుడు.
జైనులాబిదీన్ సంస్కృతాన్ని, భారతీయ సాంప్రదాయ పద్ధతులను ఎంతగా ప్రోత్సహించాడో, తురుష్క, పర్షియన్ సాహిత్యాన్ని, సాంప్రాదాయాలనూ అంతగా ప్రోత్సహించాడు. పర్షియన్ సాహిత్య్యాన్ని సంస్కృతంలోకి అనువదింపజేశాడు. శ్రీవరుడు జులైఖా కథను సంస్కృతంలోకి అనువదించాడు. ఇలా పర్షియన్ భాషను అంటే మ్లేచ్ఛ భాషను నేర్చుకోవటాన్ని ఇతరులు చులకనగా చూసేవారు. రాజాస్థానంలో గౌరవం లభించినా, స్వంత కులంలో హేళన పాత్రులయ్యేవారు. ఇది ఆనాటి భారతీయ సమాజాన్ని రెండుగా చీల్చింది. కాలం అడుగులో అడుగు కదుపుతూ ముందుకు సాగినవారు, ప్రాచీన సాంప్రదాయాన్ని అనుసరించేవారుగా విభాజితమయింది ఆనాటి సమాజం. రాను రాను మ్లేచ్ఛ పద్ధతులను అనుసరించేవారు మతం మారిపోయారు. మతం మారిన తరువాత గతంలో తమను దూరం పెట్టినవారిపై, అవహేళన చేసినవారిపై ప్రతీకారం తీర్చుకున్నారు.
గీతం ద్వాదశరాగాంగం గాయతాం నః సభాన్తరేః।
ప్రీత్యై వైక్యమివాపన్నాస్తన్త్రీ కంఠోత్థితాః స్వరాః॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 36)
సభలో మేము 12 రాగాలు పాడే సమయంలో వీణ నుంచి వెలువడే స్వరం, కంఠం నుండి వెలువడే స్వరాలతో మిళితమై ఒకే స్వరం అయిపోయింది.
‘తవ్వాకత్-ఎ-అక్బరీ’ లో – “జైనులాబిదీన్ కాలంలో ఎంత గొప్ప గాయకులుండే వారంటే వారు ఒక స్వరాన్ని పన్నెండు రాగాలలో పాడగలిగేవారు, వాయిద్యాలపై వాయించగలిగేవారు” అని రాశారు.
శ్రీవరుడు సంగీత విశేషాన్ని ప్రస్తావించాడు. వీణ తీగల నుండి వెలువడే స్వరం, మానవ కంఠధ్వనితో మిళితమై సంతోషం కలిగించే harmony ని సృజించిందని అంటున్నాడు. సంగీతం జనరంజకం అంటుంది శాస్త్రం. దాన్ని ప్రస్తావించాడు శ్రీవరుడు.
దేశసంస్కృత కావ్యజ్ఞో రాజ్ఞో నికటవాస్యభూత్।
పండితో నోత్థసోమాఖ్యో దేశజైనచరిత్రకృత్॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 37)
దేశీ (కశ్మీరీ) భాషలో, సంస్కృత కావ్య మర్మజ్ఞుడైన పండిత నోత్థసోమ్, ‘జైన చరిత్ర’ రాశాడు. ఇతడు రాజుకు సన్నిహితుడు.
శ్రీవరుడి రచనను బట్టి చూస్తే, కశ్మీరీ భాష, సంస్కృత కావ్య మర్మజ్ఞుడైన పండితుడు ‘నోత్థసోమ్’ జైనులాబిదీన్కు సన్నిహితుడని అర్థమవుతుంది. ఈయన కశ్మీరీ భాషలో జైనులాబిదీన్ చరిత్రను రచించాడనీ తెలుస్తుంది. కానీ ఇప్పుడీ కావ్యం అలబ్ధం. ఈ కావ్య ప్రస్తావన ‘తవ్వాకత్-ఎ-అక్బరీ’ లో, పీర్ హసన్ రచనలోనూ ఉంది. వీరి ప్రకారం ‘సోమ్’ పద్య కావ్య రచన చేశాడని తెలుస్తుంది. ఆ కాలంలో అంటే, ఉర్దూ, హిందీ భాషల ఆవిర్భావం తొలి దశలలో ఈ రెండు భాషలను కలిపి ‘హైందవి’ అనేవారు. సోమ్ రాసిన ‘జైన చరిత్ర’ లభ్యం అయితే, జైనులాబిదీన్ గురించి మరింత సమాచారం తెలిసేది.
(ఇంకా ఉంది)