[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
చతుర్థ సర్గ
అత్రాన్తరే మదనబంధురయాద్ వసన్తః
శృంగారసారకుముదాకరరోహిణీశః।
మానాన్ధకారవినివారణభానుమూర్తిః
స్ఫూర్జల్లతాలిలలనానవయోవనశ్రీ॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 1)
మదన బంధువయిన వసంతం సమాప్తమయిపోయింది. శృంగార భరితమయిన కుముద పూలకు చంద్రుడు ఎలాగో, అంధకారాన్ని నివారించటాని సూర్యుడు ఎలాగో, నవ యవ్వనవతులకు విరబూస్తున్న తీగలు అలాగ.
తత్చైత్రోత్సవే రాజా పుష్పలీలా చికీర్షయా।
యయౌ మడవారాజ్యోర్వం నౌకారూఢః సతాన్వితః॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 2)
చైత్రోత్సవం నాటి పుష్పలీలా ఉత్సవంలో పాల్గొనేందుకు పుత్ర సహితంగా నౌకారూఢుడై రాజు మడవ రాజ్యం వెళ్ళాడు.
కశ్మీరు నూతన సంవత్సరారంభాన్ని, చైత్ర మాసంలో పుష్పోత్సవంలా జరుపుకుంటారు. మంచు కరిగి, పూలు విరిసే కాలం ఇది. మంచు కరగటం ఆరంభమవటం తోటే నూతన సంవత్సరం ఆరంభమవుతుంది కశ్మీరీయులకు. సర్వసాధారణంగా మార్చి నెలలో వస్తుందీ ఉత్సవం.మనకు ‘ఉగాది’ లాంటి పండుగ అన్నమాట. ‘హరిపర్వతం’ పై పెద్ద ఉత్సవం జరిగేది. కశ్మీరు ఇస్లామీయుల వశం అయిన తరువాత ఈ ఉత్సవంలో ఇస్లామీయులు కూడా ఉత్సాహంగా పాల్గొనేవారు. రాను రాను ఈ ఉత్సవం ఇస్లామీయుల నూతన సంవత్సరం నౌరోజ్ సంబరాలుగా రూపాంతరం చెందింది. ఈ రోజున ఇస్లామీయులతో సహా కశ్మీరీయులంతా కొత్త బట్టలు కుట్టించుకుంటారు. తాను జీవించి ఉన్నంత కాలం పండిత జవహర్ లాల్ నెహ్రు ఈ నౌరోజ్ పండగ రోజు కొత్త కుర్తా ధరించేవాడు.( ఈవారం కశ్మీరీయులు నౌరోజ్ పండుగ జరుపుకుంటున్నారు).
నిజానికి ‘నౌరోజ్’ ఇరానీయుల పండగ. పర్షియన్లు భారత్లో స్థిరపడిన తరువాత ఈ ఉత్సవాలు ఆరంభమయ్యాయి. ఆరంభంలో జూన్ నెలలో ‘నౌరోజ్’ పండుగ జరుపుకునేవారు. కాశ్మీరులో మార్చి నెలలో జరుపుకోవటం ఆనవాయితీ కావటంతో, ఇస్లామీయులుకూడా ఈ ఉత్సవాలలో పాల్గొంటూంటడంతో, రాను రాను, పుష్పలీలా ఉత్సవం స్థానాన్ని నౌరోజ్ పండుగ ఆక్రమించింది. జూన్ నుంచి మార్చి కి మారింది. జైనులాబిదీన్ కాలానికి ఇంకా పుష్పలీలా ఉత్సవం, నౌరోజ్ పండుగలు వేర్వేరుగా జరుపుకునేవారని ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది. ఈ ఉత్సవాలలో పాల్గొనేందుకు జైనులాబిదీన్ తనతో పాటుగా భవిష్యత్తులో రాజయ్యే హాజీఖాన్ ను వెంట తీసుకుని వెళ్ళటం వెనుక అతడికి పరమత సహనం నేర్పటం ఒక ఉద్దేశం అయి ఉంటుంది.
తరండమండలీ రాజ్ఞో వితస్తాంతరంగా బభౌ।
శక్రస్యేవ విమానాలీ ఛాయాపట విభూషితా॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 3)
వితస్తపై రాజు పడవల మండలి – ఆకాశగంగలో ఇంద్రుడి విమానాల వరుసలా ఉన్నాయి.
స్వకీయ రాజావాసస్థో రాజావంతి పురాద్ గతః।
విజయేశాదిదేశేషు నాట్యం ద్రష్టుముపావిశత్॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 4)
అవంతిపురం నుంచి ఆరంభించి విజయేశతో సహా రాజు పలు స్థలాలలో ఆగి నృత్యాలను ఆనందంగా దర్శించాడు.
బనిహాల్ – శ్రీనగర్ దారిలో ‘వంతపోర్’ ఉంది. దీన్నే అవంతిపూర్లా భావిస్తున్నారు. ఈ నగరాన్ని అవంతివర్మ నిర్మించాడు. ఇక్కడ ప్రసిద్ధి పొందిన రెండు ఆలయాలు అవంతేశ్వర, అవంతిస్వామి మందిరాల అవశేషాలున్నాయి.
శివాంశం భూభుజం జేతుం యత్ర రాజ సభానిభాత్।
భవాశక్తో భవత్ కృత్యా బహుధా స్వం మనోభవః॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 5)
శివాంశజుడయిన రాజును గెలిచేందుకు అత్యంత ఉత్సాహంతో రాజ సభలో వామదేవుడు బహురూపాలు ధరించి వచ్చినట్టుంది.
సాధారణంగా రాజును విష్ణువు అవతారంగా భావిస్తారు. నీలమత పురాణంలో రాజును ‘హరాంశజుడు’ అనటం ఉంది. క్షేమేంద్రుడు సైతం రాజును ‘హరాంశజుడు’ అన్నాడు. కానీ శ్రీవరుడు ఇక్కడ రాజును ‘శివాంశజుడు’ అంటున్నాడు. దీనికి కల్హణుడు రాసిన ‘కశ్మీరా పార్వతీ తత్ర రాజాజ్ఞేయ శివాంశజ’ అనటం ఆధారం అనిపిస్తుంది. శ్రీకృష్ణుడు, కశ్మీరును ఆక్రమించమన్న మంత్రుల సలహాకు ఒప్పుకోక ఈ శ్లోకం చెప్తాడు – ‘కశ్మీరు పార్వతి, రాజు శివాంశజుడు’ అని. శ్రీవరుడు కశ్మీర రాజును ‘శివాంశజుడు’ అనటం వెనుక కల్హణుడి శ్లోకం ప్రభావం ఉండి ఉంటుంది.
సాలంకార ప్రబంధజ్ఞాః సిద్ధాంతశృత్ విశృతాః।
యత్రాంతః కరణోద్యుక్తా ద్రష్టారో గాయనా అపి॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 6)
అక్కడ ప్రేక్షకులు గాయనీ గాయకులు అలంకార సహితమైన ప్రబంధాలు, సిద్ధాంతాలు, తత్వం తెలిసిన వారు. ఉత్తమ ప్రదర్శనను అభినందించగల శక్తి కలవారు.
శ్రీవరుడు రాసిన ఈ శ్లోకం చదివిన తరువాత మనసు ఆనందమయం అవుతుంది.
కళను అర్ధం చేసుకుని, అనుభవించగల, ఆభినందించగల వారుండటం కళాకారుల అదృష్టం. లేకపోతే ఎంత లోతయిన సాహిత్య సృజన అందించినా దాన్ని పైపైన కూడా స్పృశించలేని వారుంటే, అంత అద్భుతమైన సృష్టి కూడా వ్యర్థం.
శ్రీవరుడి ఈ శ్లోకం ఆనాటి సామాజిక అంశాలను తెలుపుతుంది.
అక్కడ జరుగుతున్నది ఇస్లామేతరుల పండుగ. ఆ పండుగకు రాజు వచ్చాడు. జైనులాబిదీన్కు భారతీయ సాహిత్యంతో, ముఖ్యంగా సంస్కృత సాహిత్యంతో సన్నిహితమైన పరిచయం ఉంది. ఎందుకంటే ఆయన గురువు, శ్రీవరుడి గురువు ఒకడే!
జోనరాజు!
జైనులాబిదీన్ వెంట వచ్చిన హ్యాజీఖాన్తో సహా జైనులాబిదీన్ సంతానానికి గురువు శ్రీవరుడు!
జరుగుతున్నవి ఇస్లామేతరుల సంబరాలు. అయినా అక్కడ ఉన్న వారందరికీ సాహిత్య పరిజ్ఞానం ఉందని, ప్రబంధాలు, అలంకారాలు తెలుసని శ్రీవరుడు అనటం వెనుక అర్థం ఇది. రాజు, యువరాజుతో సహా అక్కడ ఉన్న వారందరికీ భారతీయ సాహిత్య సృజనతో పరిచయం ఉంది.
నానాగ్రామగతాశ్చారూరరాగమనోహరాః।
యత్ర గీతా రసస్ఫీతా బభుర్యువతయోపి॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 7)
సంగీతంలో నిష్ణాతులు, మధురమైన స్వరం కలవారు, పాట పాడాలన్నా ఉత్సాహం కల యువతులతో శోభితమయింది నగరం.
‘నీలమత పురాణం’ నుంచీ కశ్మీరులో ప్రస్ఫుటంగా కనబడేది మహిళలు పురుషులకు ఏ మాత్రం తీసిపోని విధంగా సామాజిక జీవనంలో పాల్గొనడం. కాశ్మీరుకున్నంత మంది మహిళా పాలకులు దేశంలో ఇతర ఏ ప్రాంతానికీ లేరు. సంగీత సాహిత్యాలలో యువకులు ఎంత నిష్ణాతులో, యువతులు అంతకన్నా ఎక్కువ ప్రతిభావంతులు. ఓ వైపు కశ్మీరం ఇస్లామీయుల వశమై సర్వం మారిపోతున్నా, జైనులాబిదీన్ వల్ల, ఇంకా భారతీయుల ప్రతిభావ్యుత్పత్తులు సజీవంగా నిలబడ్డాయి కశ్మీరులో, తరువాత కాలంలో మహిళలు వెనుకబడటానికి కారణాలు వెతకాల్సి ఉంటుంది తప్ప, భారతీయ ధర్మాన్ని దోషిగా భావించటం పొరపాటని శ్రీవరుడి ఈ అందమైన శ్లోకాలు నిరూపిస్తాయి. ‘యత్ర గీతా రసస్ఫీతా బభుర్యువతయోపి’.
కలాకలాపవేత్తాసీన్మానమానససౌఖ్యాభృత్।
రంగరంగదృచిర్లోకో విద్యావిద్ యాతసంశయః॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 8)
అక్కడి వారు కళను అర్థం చేసుకునేవారు. పండితులు. గౌరవప్రదమైన వారు. ఆనందించేవారు, ఉత్సాహం కలవారు. తమ నాణ్యతను, సంస్కారాన్ని ప్రతిభను వారు వేదికపై ప్రదర్శించారు. వేదిక మర్యాద తెలిసినవారు. నాట్యాన్ని ఆనందించి, ఆనుభవించగలిగిన వారు.
శ్రీవరుడు ఇస్లామీయుల వశమైన సుల్తానుల పాలనలో ఉన్న రాజ్యాన్ని వర్ణిస్తునట్టు అనిపించదు. ప్రాచీన ప్రబంధాలలోని ఉత్కృష్ట పాలనలో సర్వ సౌఖ్య శాంతి భద్రతలతో విలసిల్లుతున్న రాజ్యాన్ని వర్ణిస్తున్నట్టు అనిపిస్తుంది. బహుశా శ్రీవరుడికి కూడా రాజతరంగిణి రచన సమయానికి కశ్మీరు భవిష్యత్తు బోధపడి ఉంటుంది. జైనులాబిదీన్ కాలంలో కాశ్మీరులో పండితులు, పాండిత్యం ఇస్లామ్కి పూర్వకాలంలోని శాంతి భధ్రతలను అనుభవించారు. సాహిత్యంతో సహా సృజనాత్మక కళలకు కూడా అత్యంత ఆదరణ లభించింది.
జైనులాబిదీన్ మరణంతో పరిస్థితి మారిపోయింది.
జైనులాబిదీన్ జీవించినంత కాలం అణిగి ఉన్న మత ఛాందసం జైనులాబిదీన్ మరణంతో అడ్డుకట్ట తెగిన వరద నీరులా కశ్మీరుని ముంచెత్తింది. శ్రీవరుడు ఆ వరద తాకిడిని కూడా అనుభవించాడు.
ఎలాగయితే కల్హణుడి రాజతరంగిణి లేకపోతే ప్రాచీన కశ్మీరు వైభవం తరువాత తరాల ఊహకు కూడా అందేది కాదో, తాను పొందుపరచకపోతే, జైనులాబిదీన్ కాలం నాటి వైభవం భవిష్యత్తు తరాలకు తెలిసే వీలు లేదని శ్రీవరుడు గ్రహించినట్టున్నాడు. అందుకని ఇంత విపులంగా ఆనాటి సంబరాలను, ప్రేక్షకులను, కళాకారులను వర్ణిస్తున్నాడు. పైగా ఇది దీపం ఆరిపోయే ముందు వెలిగే వెలుగనీ శ్రీవరుడు గ్రహించినట్టున్నాడు. ఇలాంటి సంబరాలలో జైనులాబిదీన్ స్వయంగా పాల్గొంటున్నాడనీ, ఇస్లామేతరులకు సంబరాలు జరుపుకునే స్వేచ్ఛనిస్తున్నాడనీ, ఇస్లామ్ ఛాందసవాదులంతా జైనులాబిదీన్పై కినుక వహించారు. పర్షియన్ రచయితల రాతల వల్ల ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఒకప్పుడు అతడు ఇంత స్వేచ్ఛగా ఆనందంగా సంబరాలు జరుపుకున్నామన్న సత్యాన్ని పొందుపరచాడు.
శ్రీవరుడు అనుకున్నాడో లేదో కానీ కొన్నాళ్ల తరువాత ఉత్సవాలు సంపూర్ణంగా అదృశ్యం అయిపోయాయి. వీటి స్థానం ‘నౌరోజ్’ ఆక్రమించింది.
ప్రతితాలైకతాలాది బహుతాలవిభూషితమ్।
తత్ర తారాచనారాచ సంజ్ఞానం విదధుర్నాటాః॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 9)
ఇది సంగీతం, నృత్యం గురించి ఎంతో లోతైన పరిజ్ఞానం ఉన్న కవి రాయగలిగిన శ్లోకం.
అక్కడి వారికి తాళం, ఏకతాళం, బహుతాళంతో కూడిన ‘తారాచ – నారాచ’కు సంబంధించిన పరిజ్ఞానం కలవారు.
పైపై అర్థం చెప్పుకోవాలంటే రాగతాళ, హావభావాలలో నిష్ణాతులు. ఇవన్నీ నేర్చినవారు.
‘ఏకతాళ’ అంటే కేవలం ‘దృత’ తాళం ఉన్నది.
భారతీయ సాంప్రదాయక సంగీతంలో సంగీతాన్ని పలికేందుకు వాడే పదం ‘తాళం’. లయబద్ధమైన శబ్దం ఇది. చేతితో వేళ్లతో తొడపై లయబద్ధంగా వేసేది తాళం. సంగీత సమయాన్ని కొలిచే గడియారం లాంటిది తాళం. సంగీత వాయిద్యంపై లయబద్ధంగా వేసే మౌలిక శబ్దం తాళం. రాగం, తాళం కలిస్తే సంగీతం అవుతుంది. ఉత్తర భారత పద్ధతిని హిందుస్తానీ సంగీతం అంటారు. దక్షిణ భారత సంగీత పద్ధతి కర్ణాటక. సంగీత సమయాన్ని కొలిచిది తాళం.
ఏకతాళం అంటే ‘ఏకే నైవ దృతేన స్వాదేక తాలితి సంజ్ఞయా’ అంటుంది శాస్త్రం.
ప్రతితాళం ఇప్పుడు వాడుకలో లేదు.
‘లో దృతో ప్రతి తాళ్ స్యాద్’
ఒక లఘు, రెండు దృత మాత్రలు కలిస్తే ప్రతితాళం అవుతుంది.
శ్రీవరుడి కాలంలో ‘ప్రతితాళం’ వాడేవారని ఈ శ్లోకం వల్ల తెలుస్తుంది. ‘బహుతాళం’ అంటే అనేక తాళాల కలయికతో వాడినది.
తాళంలో మాత్ర, విభాగం సామ, ఠేకా వంటి భాగాలుంటాయి. హిందుస్తానీ సాంప్రదాయిక సంగీతంలో తీన్తాళ్ (16 మాత్రలు), ఏకతాళ్ (12 మాత్రలు), ఠుమ్రీ, దాద్రా, రూపక తాళం వంటి బహుతాళాలు ఉన్నాయి.
కశ్మీరంలో శ్రీవరుడి కాలంలో భారతీయ శాస్త్రీయ సంగీతం సజీవంగా ఉందని తెలుస్తుంది.
కానీ కశ్మీరు సంగీత చరిత్ర రాసే వారంతా, కశ్మీరుకు సంగీత చరిత్ర లేదని, సుల్తాన్ జైనులాబిదీన్ కాలంలో సంగీతం ‘సూఫీ’ల ద్వారా కశ్మీరులో ప్రవేశించిందని రాస్తారు. ఇది నిర్ధారితమైన చరిత్రగా కశ్మీరు పిల్లలు నేర్చుకుంటారు. భారతదేశంలో కశ్మీరు సంగీతం గురించి రాసేవారు ఈ విషయాన్నే సత్యంగా భావిస్తున్నారు.
“Music is introduced to in Kashmir during the rule of sultan Zain-ul-Abidin Known as Budshah (1420-70) and before this time there is no historical evidence to prove that there was any kind of music around and so possibly were no musicians around!”
-The Traditional Music of Kashmir by Ramachandra Kousika.
రాజతరంగిణిలో భారతీయ సంగీతం, సంగీత వాయిద్యాల ప్రస్తావన విస్తృతంగా ఉంది. ఘటం, ఇతర వాయిద్యాలు ప్రాచీన కాలంలో వాడేవారని కల్హణుడు రాశాడు. ‘హార్వాన్’ ప్రాంతం త్రవ్వకాలలో క్రీ.శ. 4వ శతాబ్దానికి చెందిన సంగీత వాయిద్యాలు లభించాయి. అక్కడ దొరికిన శిల్పాలలో మహిళలు సంగీత వాయిద్యాలు వాయిస్తున్న శిల్పాలు దొరికాయి. వీణ వాయిస్తున్న శిల్పాలు లభించాయి. క్రీ.శ. 1120-21 కు చెందిన కశ్మీర్ రాజు భిక్షుచారుడు వీణ వాయిద్యంలోనే కాదు, జానపదుల ‘ఛక్రి’ సంగీతంలో కూడా నిపుణుడు. కల్హణుడి కన్నా ముందు నుంచీ ఈ సంగీతం కశ్మీరు జనులలో ప్రాచుర్యంలో ఉంది. రాజతరంగిణిలో ‘హదుక్క’(big pipe) వంటి వాయిద్యాల ప్రస్తావన ఉంది. రబాబ్, సారంగి వంటివి ఇస్లామీయుల వల్ల కశ్మీరు వచ్చి చేరాయి. జైనులాబిదీన్ కాలంలో అఫ్ఘనిస్తాన్ నుంచి కశ్మీరు వచ్చి స్థిరపడిన జానపద గాయకులు ‘రబాబ్’ను కశ్మీరులో ప్రవేశపెట్టారు. స్థానిక ‘ఛక్రి’ సంగీతంలో 14వ శతాబ్దం నుంచి రబాబ్, సారంగిల వాడకం ఆంభమయింది. ఇవన్నీ ప్రస్తావిస్తూ డాక్టర్ సునీల్ ధర్ “Artists from central Asia, during Sultanate period brought with them, their art, music, musical instruments and culture resulting in wonderful classical music which is known as ‘Sufiana Mosiqui’” అని వ్యాఖ్యానించారు.
ఇస్లామీయులు తమ సంగీతం కశ్మీరులో ప్రవేశపెట్టేకన్నా ముందు కశ్మీరుకు ప్రత్యేకమైన భారతీయ సంగీత పద్ధతి, సంగీత వాయిద్యాలు కశ్మీరులో ఉన్నాయి. కానీ ఇస్లామీయులు తమ ప్రత్యేక వాయిద్యాలు సంగీత పద్ధతులు తెచ్చారు. ప్రాచీన సంగీతం అంతరించటమో, నూతన సంగీతంలో మిళితమై తన అస్తిత్వాన్ని కోల్పోవటమో సంభవించింది. దాంతో ఇస్లామీయులు ప్రభావంతో ‘సూఫీయానా’ సంగీతం తెరపైకి వచ్చింది.
కానీ చరిత్ర రచయితలు ఈ సూఫీయానా సంగీతాన్ని ‘కశ్మీరు సంగీతం’గా నిర్ణయించి, అంతకు ముందు కశ్మీరులో సంగీతం లేదని తీర్మానించారు. ఎలాగయితే కశ్మీరుకు భారతీయ చరిత్ర ఉన్నట్టు తెలియక అధిక సంంఖ్యాకులకు కశ్మీరు ఇస్లామీ చరిత్ర మాత్రమే తెలిసే పరిస్థితులు నెలకొన్నాయో, అలాగే కశ్మీర్ ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలేవీ లేవన్నట్టు, కశ్మీర్ సంగీతం ఇస్లామీయులతోనే ఆరంభమయినట్టు ఒక పద్ధతి ప్రకారం ప్రజలను నమ్మించారు. ఫలితంగా, ఇటీవలి కాలం వరకూ కశ్మీరుకు ప్రాచీన ఇస్లామేతర చరిత్ర ఉన్నట్టు దేశానికి తెలియకుండా పోయింది. ఇటువంటి పరిస్థితులు ఊహించినట్టే కల్హణుడు, జోనరాజు, శ్రీవరుడు ప్రజ్ఞాభట్టు, శకుడు ‘రాజతరంగిణి’ని క్రీ.శ.1580 వరకూ అంటే ఎంతవరకూ రాయగలరో అంత వరకూ రాసి భావి తరాలకు అందించారు. ఆ తరువాత కశ్మీరులో పర్షియన్ భాష సంపూర్ణంగా ఆధిక్యం సాధించింది. సంస్కృతం కొద్దిమంది పండితులకు మాత్రమే పరిమితం అయింది.
ఈ శ్లోకంలో శ్రీవరుడు వాడిన ‘తారా-నారా’ ఒక రకమైన చందస్సు. ‘నారా’ అన్నది ఒక లఘువు, ఒక గురువు, మూడు లఘువులు – గురువులు ఉండే ఛందస్సు. ఇవి కశ్మీరీ జానపద గీతాలు పాడేందుకు ఉపయోగించే మాత్ర ఛందస్సు.
(ఇంకా ఉంది)