మాజీ కేంద్ర మంత్రి, ఆరెస్సెస్ ప్రచారక్ అనిల్ మాధవ్ దవే రచించిన ‘స్వరాజ్య్ సే సురాజ్ తక్’ పుస్తకానికి తెలుగు అనువాదం ఈ పుస్తకం. శ్రీ కస్తూరి రాకా సుధాకర రావు ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు.
శివాజీ పాలన నుంచి నేటి తరం నేర్చుకోవాల్సిన అంశాలను ఈ పుస్తకంలో స్పృశించారని, నాటి పరిస్థితులను, నేటి వాస్తవాలను అన్వయిస్తూ రచించిన ఈ గ్రంథం మార్గ నిర్దేశక గ్రంథమని ప్రకాశకుల మనోగతం. ఈ పుస్తకం పీఠికను ఇప్పటి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాశారు. ‘ఈ పుస్తకం శివాజీ పాలనా సామర్థ్యాన్ని గురించి తెలియజేస్తుంది. ఆయన పాలన వల్ల ప్రజా జీవనంలో ఎలాంటి మార్పులు కనిపించాయో ఈ పుస్తకం చెబుతుంది. ఆనాడు సుపరిపాలన ఎంత తప్పనిసరో నేడు కూడా అంతే తప్పనిసరి. ఎలాంటి పాలనావ్యవస్థకైనా ఇది అవసరం. ఆ విధంగా శతాబ్దాల తరబడి తరం తరం నిరంతరం చెరగని ముద్రవేసి, శతాబ్దాలుగా ప్రేరణనిస్తున్న గొప్ప జాతి నిర్మాత శివాజీ’ అని శ్రీ నరేంద్ర మోదీ అభిప్రాయం వ్యక్తపరిచారు. ‘నేను ఈ పుస్తకాన్ని నాయకులందరికీ, పాలకులందరికీ, అభిమానులందరికీ, ఉద్యోగులందరికీ, ముఖ్యంగా యువతకు సిఫార్సు చేస్తాను. వారు ఈ పుస్తకంలోని లోతైన పాఠాలను, శివాజీ ముందుకు తెచ్చిన అభివృద్ధి సూత్రాలను అధ్యయనం చేయాలి. రాబోయే అనేక తరాల నేతలకు, ముఖ్యంగా ఈ దేశాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చాలని కోరుకునే వారందరికీ శివాజీ ప్రేరణగా, మార్గ దర్శకుడిగా ఉంటారు.’ అని రాశారు. రచయితను అభినందించారు.
పుస్తకాన్ని పరిచయం చేసిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, సర్ సంఘ్ చాలక్ మోహనరావ్ భగవత్ సమాజ నిర్మాణంఓ శివాజీ ప్రదర్శించిన గుణాలను నేటి సమాజమనుకూలమైన వ్యవస్థ నిర్మాణ సమయంల్ దృష్టిలో ఉంచుకోవాలని, ఈ పుస్తకం ఆ దిశగా అధ్యయన అవలోకనాల ప్రక్రియకు వేగాన్నందిస్తుందని అభిప్రాయపడ్డారు. ‘ముందుమాట’ రాసిన బాబా సాహెబ్ పురందరే, ‘పుస్తకంలోని ప్రతి అధ్యాయం పాలనావ్యవస్థలోని ఒక్కొక్క అంగాన్ని గూర్చి వివరిస్తుంది. రచయిత అత్యంత సరళమైన భాషలో శివాజీ పాలనా వ్యవస్థను, దాని సామర్థ్యాన్ని, దాని నిత్య జాగరూకతను, శివాజీ లక్షణాలను గురించి వివరించారు’ అని రాస్తూ, ‘నాకు ఇది ఆధునిక ఆచార్య చాణక్యుడు వ్రాసిన కొత్త శివ పురాణంలా, జ్జాన సామర్థ్యాల అధిష్ఠాత అయిన శ్రీకృష్ణుడు వివరించినట్టు ద్యోతకం అవుతోంది’ అని అభిప్రాయపడ్డారు. ‘భారత పార్లమెంటు లోని ప్రతి సభ్యుడు, రాష్ట్రాల శాసనసభల్లోని ప్రతి సభ్యుడు ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా చదివి తీరాల’న్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
శివాజీ
స్వరాజ్యం నుంచి సురాజ్యం దాకా
మూల రచయిత: అనిల్ మాధవ్ దవే
అనువాదం: కస్తూరి రాకా సుధాకర రావు
వెల: రూ. 200/-
పేజీలు: 238
ప్రతులకు: సాహిత్య నికేతన్, 3-4-852
బర్కత్ పురా, హైదరాబాద్ – 29. ఫోన్: 040-27563236
~ సంచిక బుక్ డెస్క్
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.