[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘శాసించావు సుమా’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


ఇంతకాలం నా సంతోషం సగమే
నీ రాకతోనే అది నిండు పున్నమి
గతమంతా నా మనసు ఖాళీ
నీవు నన్ను కమ్మేశాక
నాకు కూడా చోటివన్నంత ఇరుకు
నేను నేనంటూ గొప్పగా
జబ్బలు చరిచాను ఇన్నాళ్ళూ
నీవు లేక నేను ఎక్కడని
బేలగా నిలిచాను ఈనాడు
లోకం అంతా నాదే నని
భావించాను ఓనాడు
నీవే నా లోకమని
నమ్మక తప్పని స్థితి ఈనాడు
నా పెదవులను శాసించావు
నీ పేరే జపించమని
నా అలోచనలను బంధించావు
నీ తలపులనే వరించమని
నా బతుకునే ఆదేశించావు
నీవుగా మిగిలిపొమ్మని
జన్మ జన్మకు సాగిపొమ్మని

పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్గా పనిచేస్తున్నారు.