Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హిందీ నవలా పరిచయం-4 – సమాజపు ద్వంద్వ వైఖరిని విశ్లేషణాత్మకంగా చర్చించిన నవల ‘సేవాసదన్’

[హిందీ నవలల పరిచయం శీర్షికలో భాగంగా ‘సేవాసదన్’ అనే నవలని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి.]

ప్రేమ్‌చంద్ భారతదేశం గర్వించదగ్గ సాహితీకారుల్లో ఒకరు. కథా, నవలా ప్రక్రియను హిందీ భాషలో అత్యుత్తమ స్థానానికి తీసుకెళ్లిన రచయిత. ప్రేమ్‌చంద్ శైలితో ప్రభావితమై ఎందరో సాహితీకారులు తరువాత నవలా ప్రక్రియను తమదిగా చేసుకున్నారు. అప్పటిదాకా హిందీ సాహిత్యంలో నవలకు పెద్దగా ఆదరణ లేదు. ప్రేమ్‌చంద్ వల్లే హిందీ పాఠకులకు నవల వైపుకు ఆకర్షితులయ్యారన్నది నిజం. వీరి అసలు పేరు ధన్‌పత్‌రాయ్. ఉర్దూలో నవాబ్ రాయ్ పేరుతో రాసేవారు. మూడు వందలకు పైగా కథలు, డజను పైగా నవలలు, ఎన్నో సాహితీ వ్యాసాలు, అనువాదాలు చేసారాయన. వీరి కథలన్నీ ‘మానసరోవర్’ పేరుతో ఎనిమిది సంపుటాలుగా దొరుకుతాయి.

ప్రేమ్‌చంద్ తన రచనలలో స్త్రీ పాత్రల ద్వారా సమాజంలోని అసమానతలను, మానవ నైజాన్ని, వివక్షను, సామాజిక అన్యాయాలను చర్చించే ప్రయత్నం చేసారు. బెంగాలీ సాహిత్యంలో శరత్ చంద్ర ఎంతో ఉదాత్తమైన స్త్రీ పాత్రలను సృష్టించారు. ప్రేమ్‌చంద్ అలాంటి పాత్రలకి హిందీలో జీవం పోసారు. అయితే శరత్ స్త్రీలు తమను తాము జీవితానికి అనుకూలంగా మలచుకునే క్రమంలో సంఘర్షణను అనుభవిస్తారు. ప్రేమ్‌చంద్ సృష్టించిన స్త్రీ పాత్రలు పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోవడానికి సంఘర్షిస్తారు. అందుకే వీళ్లలో తిరుగుబాటుతనం, సమాజాన్ని ప్రశ్నించి ఎదిరించే ధైర్యం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రేమ్‌చంద్ తన రచనలలో ఆదర్శవాదాన్ని, యథార్థవాదాన్ని కలిపి ఆదర్శోన్ముఖ యథార్థవాదం అనే కొత్త శైలిలో రచనలు చేసారు. ఇది ఆయనకే సొంతమైన శైలి. జీవితంలో ఆదర్శం, యథార్థం రెంటిని కలిపి ప్రయాణించాలనుకోవడమే పెద్ద సంఘర్షణ. ఈయన పాత్రలు ఈ రెండు వాదాల నడుమ నలిగిపోతూ తమ జీవిత మార్గాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి.

ప్రేమ్‌చంద్ కథలు రాస్తూనే రెండు చిన్న నవలికలను రాసిన తరువాత మొదటిసారి ఓ పూర్తి స్థాయి నవలను ఉర్దూ భాషలో రాసే ప్రయత్నం చేసారు. అదే ‘బాజార్ – ఎ – హుస్న్’. కాని ఇది ముందుగా హిందీలో ‘సేవాసదన్’ పేరుతో 1919 లో ప్రచురణకు నోచుకుంది. తరువాత ఉర్దూలో 1924 లో లాహోర్‌లో దీన్ని ప్రచురించారు. అలా ‘సేవాసదన్’ వీరి మొదటి నవల. ఈయన నవలలన్నీ చదివినా నాకు ప్రత్యేకంగా ‘సేవాసదన్’ చాలా ఇష్టం. ఇందులో ప్రధాన పాత్ర సుమన్ జీవిత సంఘర్షణ, ఆమె వేసే ప్రశ్నలు ఈ రోజుకీ నేటి సమాజ వ్యవస్థకు సంబంధించి కూడా గొప్ప ప్రాసంగికతను కలిగి ఉంటాయి. హిందీ సాహిత్యంలో నాకు నచ్చిన గొప్ప పాత సుమన్.

ఈ నవలలో ప్రేమ్‌చంద్ చాలా సమస్యలను చర్చిస్తారు. సమాజంలో అవినీతి, వివాహ వ్యవస్థలో కట్నం అనే ఆచారం క్రింద నలిగిపోయే కుటుంబాలు, వేశ్యా వృత్తి, వేశ్యల పట్ల సమాజంలోని ద్వంద్వ నీతి, మధ్యతరగతి జీవితాలకే పరిమితమైన నీతి సూత్రాలు, పేదరికం, స్త్రీలపై జరిగే దోపిడి, పితృస్వామ్య వ్యవస్థ దాష్టికం, ఇన్ని సమస్యలను నవలలోని వివిధ పాత్రల నడుమ నడిచే కథతో చర్చిస్తూ ఎంతో ఆలోచనను కలగజేసే నవల ‘సేవాసదన్’. రచయిత శైలి సునిశితమైన దృష్టికోణం, మనిషి స్వార్థంతో ఇతరులపై ఆధికారాన్ని సంపాదించుకోవాలనే గుణం వీటన్నిటినీ చర్చిస్తూ, మనిషిలో దాగున్న ఆ లోపలి మనిషిని ప్రతి పాత్రలో చూపిస్తూ ఉంటారు. గొప్పతనం, మంచితనం మాటున మనిషిలోని మరో మనిషి తొంగి చూస్తూ మానవ సంబంధాలను సంక్లిష్టం చేస్తూ వెళ్ళడాన్ని ఈయన రచనలో గమనిస్తే వీరి నవలలలో జరిగిన మానసిక విశ్లేషణ మానవ సమాజాన్ని అర్ధం చేసుకోవడానికి మనకు ఎంతో సహాయం చేస్తుంది.

సుమన్ తండ్రి కృష్ణచంద్ర ఒక పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్. ఆయనకు సుమన్, శాంత ఇద్దరు కూతుర్లు. ఇద్దరినీ ఎంతో ప్రేమగా పెంచుతాడు. ఆ ఇంట అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇద్దరూ ఆడపిల్లలు అందమైన వాళ్ళే కాని సుమన్‌లో ఓపిక తక్కువ. తనకు కావలసినది దొరికే దాకా ఊరుకోని మనస్తత్వం ఆమెది. తండ్రి ఇచ్చే ప్రేమ, ఆ ఇంట దొరికే సౌకర్యాల కారణంగా జీవితంలో తన ప్రత్యేకతను నిలుపుకోవడమే ధ్యేయంగా నమ్మి ఆమె జీవిస్తూ ఉంటుంది. శాంత స్వభావం దీనికి విరుద్దం. దొరికిన దానితో రాజీ పడిపోయే మనస్తత్వం ఆమెది. ఇద్దరూ పెళ్ళి వయసుకు వచ్చేసరికి కృష్ణచంద్రకు సమస్యలు మొదలవుతాయి. అన్ని సౌకర్యాలు కుటుంబానికి అమరుస్తూ డబ్బు మిగుల్చుకోలేక పోతాడు కృష్ణచంద్ర. కట్నాల జోరు ఎక్కువగా ఉన్న సమాజంలో సుమన్‌కు మంచి వరుడిని తీసుకురావడానికి వేలలో డబ్బు అవసరం అవుతుంది. జీవితంలో నీతి నిజాయితీకి కట్టుబడి పై సంపాదనకు ఆశపడకుండా జీవించడం వల్ల జీతం తప్ప మరో ఆధారం అతనికి ఉండదు. దీనితో సుమన్ పెళ్లి చేయలేననే భయం పట్టుకుంటుంది. తప్పని పరిస్థితులలో ఓ కేసులో పెద్ద ఎత్తున లంచం తీసుకుని సుమన్ పెళ్ళి ఓ అందమైన యువకుడితో నిర్ణయిస్తాడు. కాని లంచం తీసుకున్నాక పంపకాలుటాయన్నది అతనికి తెలియకపోవడంతో ఇతర ఉద్యోగులు అతను మాత్రమే డబ్బు తీసుకోవడాన్ని సహించలేక పైవాళ్లకు సమాచారం అందిస్తారు. పెళ్ళి పందిరిలోనే కృష్టచంద్ర అరెస్ట్ అవుతాడు. జైలుకు వెళుతూ భార్యతో ఆ డబ్బుతో సుమన్ పెళ్లి జరిపించమని చెబుతాడు. కాని భర్తను విడిపించుకోవాలన్న ఆశతో ఆమె ఈ కేసు కోసం డబ్బంతా ఖర్చుపెడుతుంది. మొత్తం డబ్బు అయిపోతుంది. సుమన్ పెళ్ళి ఆగిపోతుంది. కృష్ణచంద్ర జైలుపాలవుతాడు. అన్నీ పోగొట్టుకుని ఆమె తన అన్నగారైన ఉమానాధ్ పంచన ఇద్దరు కూతుళ్లతో చేరుతుంది.

ఉమానాధ్ మంచివాడే కాని ఈ అదనపు బాధ్యతను మోసే శక్తి ఉన్నవాడు కాదు. అతని భార్య ఈ ముగ్గురు ఆడవాళ్లని హీనంగా చూస్తూ ఉంటుంది. రాజకుమారిగా పెరిగిన సుమన్ ఆ యింట పనిమనిషి స్థానానికి దిగజారుతుంది. ఇది ఆమె తట్టుకోలేకపోతుంది. ఉమానాధ్ ఓ సంవత్సరం పాటు సుమన్ కు మంచి సంబంధం చూడాలని చాలా వెతుకుతాడు. కాని మంచి వరుడి కోసం కట్నానికి కావల్సిన డబ్బు అతని దగ్గర ఉండదు. దీనితో తప్పక గజాధర్ అనే పేద వ్యక్తితో సుమన్ పెళ్ళి జరిపిస్తాడు. గజాధర్ మొదటి భార్య చనిపోతుంది. అతను సుమన్ కన్నా ఎన్నో సంవత్సరాలు పెద్ద. కాని పెద్ద కులానికి చెందిన వాడు. అన్ని విషయాలలో రాజి పడినా కులం విష్యంయలో రాజీ పడక శ్రోత్రియ బ్రాహ్మణుడికే పిల్లనిచ్చానని తృప్తి పడతాడు ఉమానాధ్. ఈ పెళ్ళితో సుమన్ భవిష్యత్తు మాత్రం అంధకారమయం అయిపోతుంది.

పెద్ద ఇంట్లో అపురూపంగా పెరిన సుమన్ బెనారస్‌లో ఇరుగు సందులలో ఓ చిన్న చీకటి ఇంట్లో తన కన్నా ఎంతో పెద్ద వయసున్న గజాధర్‌తో కొత్త జీవితం మొదలెడుతుంది. ఆ ఇరుకు ఇల్లు, లేమితో జీవితం ఆమెను చాలా ఇబ్బంది పెడుతుంది. ఇంట్లో నౌకర్ల మధ్య జీవించిన ఆమె ఇక్కడ ప్రతి పని స్వయంగా చేసుకోవలసి వస్తుంది. గజాధర్ భార్యను ప్రేమించడం తెలియని వాడు. ఆమెను ముందు ముద్దుగా చూసుకున్నా సుమన్ ఆనందంగా జీవించడానికి సరిపడ్డ డబ్బు అతను తేలేడు. ఒకే ఒక కూరతో నెయ్యి, తీపి లేకుండా భోంచేయడం సుమన్‌కు కష్టంగా ఉంటుంది. అయినా ఆ జీవితానికి అలవాటు పడడానికి ఆమె చాలా కష్టపడుతుంది. ఆ మురికి వీధుల్లో ఆమె రాజసంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఆమె ప్రత్యేకతను ఎవరైనా గమనిస్తే అది ఆమెకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. ఆమె భర్తకు ఆమె విద్యలన్నీ నిరుపయోగమే. తన చుట్టు ఉన్న సాధారణ స్త్రీలలా ఆమె ఉండలేకపోతుంది. చదువు, సంగీతం, శుభ్రత, అందంగా ఇంటిని తీర్చుదిద్దుకోవడం ఇవన్నీ వచ్చిన ఆమె చదువు లేని ఆ ఇతర స్త్రీలతో కలవలేకపోతుంది.

గజాధర్ ఆమెకు సంసార స్త్రీల ఔన్నత్యాన్ని గురించి బోధిస్తూ ఉంటాడు. దానితో ఆ కష్టాలను తాను భరించడం తనకు గౌరవం అని ఆమె కొంత కాలం నమ్ముతుంది. ఆమె ఇంటి ముందు భోలాబాయీ అనే ఓ వేశ్య ఉంటుంది. ఆమె జీవించే పద్దతి, ఆమె ఇంటికి వచ్చే వాళ్ళు ఆమెను దేవతలా చూడడం సుమన్ గమనిస్తుంది. ముందు తనలాంటి సంసార స్త్రీ ఆమెతో స్నేహం చేయడం తప్పని, తాను భోలా కన్నా ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తున్నానని ఆమె అనుకుంటుంది. కాని క్రమంగా తన జీవితంతో భోలా జీవితాన్ని పోల్చి చూసుకుంటే భోలాని అందరూ ప్రత్యేకంగా చూడడం ఆమె ప్రసరించే చూపుల కోసం డబ్బున్న వాళ్ళు పలుకుబడి ఉన్నవాళ్లు వెంపర్లాడడం సుమన్‌ను అయోమయానికి గురి చేస్తాయి. తాను పాటించే మర్యాద ఎవరి కోసం అన్న ప్రశ్న ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. గజాధర్ భయంతో ముందు భోలాతో ఆమె మాట్లాడకపోయినా క్రమంగా ఆమెతో స్నేహం పెరుగుతుంది.

ఆ సమయంలోనే సుమన్ పక్క వీధిలో ఉండే సుభద్ర అనే స్త్రీతో పరిచయం పెంచుకుంటుంది. సుభద్ర భర్త పద్మసింగ్ ఒక పెద్ద లాయరు. సుభద్ర సుమన్ మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. భోలీని అందరూ తప్పుడు స్త్రీగా పరిగణిస్తే ఆమెను ముందు ద్వేషించిన సుమన్ తరువాత ముస్లింల పండుగులకూ రమనవమి సంబరాలకు అత్యంత గౌరవంతో భోలిని గాన కచేరికి ఊరి పెద్దలు ఆహ్వానించడం, ఆ ప్రదర్శన చూడడానికి నగరంలోని పెద్దలందరూ పోటీ పడి రావడం, భోలిని అందరూ దేవతగా కొలవడం చూసి నిర్షాంతపోతుంది. ఒక పక్కన ఆమెను తప్పుడు స్త్రీ అంటూనే, ఆమె ముందు నీతిగా బతకడానికి కష్టపడుతున్న తనలాంటి సంసార స్త్రీలను కనీసం మనుషులుగా చూడని సమాజ వైఖరి ఆమెని కోపం తెప్పిస్తుంది. ఓసారి పార్కులో ఆమె ఓ బెంచీపై కూర్చుంటుంది. కాపలావాడు ఆమెను అక్కడి నుండి బలవంతంగా లేపేస్తాడు. అతనే ఆ బెంచిపై భోలీని మర్యాదగా కూర్చోబెట్టి ఆమె ఎదురుగా చేతులు కట్టుకుని నిల్చోవడం చూసాక సుమన్ కోపంతో పిచ్చిదయిపోతుంది. ధర్మకర్తలు, విద్యావేత్తలు, స్థితిపరులు, పేరున్నవాళ్ళు అందరూ భోలి ముందు చేతులు కట్టుకుని నిలబడ్డం చూసాక ఆమెలో తన జీవితం పట్ల కసి పెరిగిపోతుంది. నీతి సూత్రాలను భోధించే కులీనుడైన ఆమె భర్త ఓ పక్క భోలీతో మాట్లాడవద్దని అంక్షలు విధిస్తూ ఆమె కచేరిలకు ఆశగా వెళ్లడం చూసాక, ఈ సంసారం, నీతి సూత్రలతో తానేం బావుకుంటూందో సుమన్‌కు అర్థం కాదు. తాను భోలి కన్నా అందగత్తెనని, ఆమె కన్నా బాగా పాడగలనని సుమన్‌కు తెలుసు. మరి మర్యాద పేరుతో తాను దరిద్రం, అవమానాలు, అనిశ్చిత నిండిన జీవితం తప్ప ఏం అనుభవిస్తున్నాను అనే ప్రశ్న ఆమెను నిరంతరం వేధిస్తూ ఉంటుంది.

సుభద్ర ఇంట్లో సుమన్ ఎక్కువ సమయం గడపడం మొదలెడుతుంది. తన సంసారం నుండి కొంత ఊరట కోసం ఆమె సుమన్ ఇంటిని ఆశ్రయంగా మార్చుకుంటుంది. ఆ భార్యా భర్తల ముచ్చటైన సంసారం తాను కోల్పోతుందేంటో ఆమెకు గుర్తు చేస్తూ ఉంటుంది. పద్మసింగ్ తన ఇంట్లో ఓ సంబరం చేద్దామని అనుకుంటాడు. ఆ ఉత్సవంలో భాగంగా భోలీ బాయి కచేరి ఏర్పాటు చేస్తాడు. ఎంతో మర్యాదస్తుడని, తాను దైవంగా భావించే పద్మసింగ్ కూడా వేశ్యలకు ఇస్తున్న గౌరవాన్ని చూసి సుమన్ ఆశ్చర్యపోతుంది. ఆ రోజు అక్కడ ఉత్సవంలో పాల్గొని ఆమె అర్ధరాత్రి ఇంటికి చేరుతుంది. గజాధర్ సుమన్‌లో వచ్చిన మార్పుకు ముందే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ రోజు ఆమె అర్ధరాత్రి ఇంటికి వస్తే అతని కోపం విచక్షణను చంపేస్తుంది. నిర్ధాక్ష్యణ్యంగా సుమన్‌ను అనుమానంతో ఇంటి నుండి గెంటేస్తాడు. తెల్లారేదాకా ఆ ఇంటి గుమ్మం ముందు ఏడుస్తూ కూర్చున్న సుమన్ తరువాత అంత అవమానించి ఆ భర్త దగ్గరకు వెళ్లలేక పద్మసింగ్ ఇంటికి వెళ్లిపోతుంది. జరిగింది తెలుసుకున్న ఆ దంపతులు తమ ఇంటికి బాధలో వచ్చిన స్త్రీకి ఆశ్రయం ఇవ్వడం తమ ధర్మం అని నమ్మి ఆమెను ఇంట ఉండనిస్తారు. కాని గజాధర్ కోపంతో సుమన్ మీద వేసే నిందలు పద్మసింగ్ చెవుల దాకా రావడంతో అతను భయపడి సుమన్‌ను ఇంటి నుండి వెళ్లిపొమ్మని ఆదేశిస్తాడు.

సుమన్ పద్మసింగ్‌ను అభిమానిస్తుంది. ఆ నగరంలో అతనో గొప్ప మగవాడని నమ్ముతుంది. కాని అతని బలహీనత, ఎవరో అన్న మాటలకు తనను నిరాశ్రయిరాలిని చేయడంతో ఆమెకి సమాజంపై, మంచితనంపైనే విరక్తి కలుగుతుంది. సమాజంపై కోపం కసి ఆమెను ఆలోచించనివ్వవు. అక్కడి నుండి నేరుగా భోలీబాయి ఇంటికి వెళ్తుంది. ఆమె దగ్గర శిక్షణ తీసుకుని వేశ్యగా సొంత కచేరీలు చేయడం మొదలెడుతుంది.

ఆ నగరంలో విఠల్ దాస్ గొప్ప సంఘ సంస్కర్తగా చలామణీ అవుతూ ఉంటాడు. ఒక విధవాశ్రమం పెట్టి దానికి చందాల కోసం నగరంలో జోలె పట్టి తిరుగుతూ ఉంటాడు. ఇతను పద్మసింగ్‌కు మంచి మిత్రుడు. సుమన్ భర్తను వదిలి పద్మసింగ్ ఇంట్లో ఉంటుందని విని దానితో పాటు తనను చేరిన అపవాదులను నమ్మి అతను పద్మసింగ్ గురంచి తప్పుగా మాట్లాడతాడు. స్నేహితుడి మాటలకే కోపంతో పద్మసింగ్ సుమన్‌ను ఇంటి నుండి పంపించేస్తాడు. ఇప్పుడు ఆమె సుమన్ బాయిగా మారిందని తెలిసి పద్మసింగ్ విఠల్ దాస్‌తో జరిగిందంతా చెపుతాడు. విఠల్ దాన్ ఇది విని చాలా బాధపడతాడు. సుమన్ ను కలుస్తాడు.

ఇక్కడ సుమన్‌తో విఠల్ దాస్ జరిపే సంభాషణను ప్రేమ్‌చంద్ ఎంతో విశ్లేషణాత్మకంగా రాస్తాడు. ఒక సంసార స్త్రీగా తనను సమాజం ఏం ఆదరించిందని, హింస తప్ప తనకు మర్యాద పేరుతో ఏం మిగిలిందని సుమన్ అడిగే ప్రశ్నలు విఠల్ దాస్ లోనూ ఆలోచనలను రేకెత్తిస్తాయి. తాము వేశ్యల పట్ల చూపే ద్వంద్వ వైఖరి, సంస్కార స్త్రీల పట్ల ప్రదర్శించే నిర్లక్ష్యం స్త్రీలలో ఎలాంటి అల్లకల్లోలాన్ని రేపుతాయో విఠల్ దాస్ సుమన్ మాటలతో గ్రహిస్తాడు. సుమన్‌ని తన పంథా మార్చుకొమ్మని, ఆమె జీవించడానికి తాను చందా ద్వారా కొంత సహాయం చేస్తానని అంటాడు. పద్మసింగ్ తాను నెల నెలా ఇరవై రూపాయలు సుమన్ కోసం ఇస్తానంటాడు. ఇంకో ఇరవై ఎవరైనా ఇస్తే సుమన్ ఆ వృత్తి లోనుండి బైటకు రావచ్చని గ్రహించి విఠల్ దాస్ డబ్బున ధనవంతులను సహాయం కోసం సంప్రదిస్తూ ఉంటాడు. సుమన్ తాను ఏదైనా పాఠశాలలో పని చేయగలనని చెబుతుంది. ఒక బ్రాహ్మణ స్త్రీని వేశ్యా వృత్తి నుండి బైటకు లాగాలని ఎంత పట్టుదలతో ప్రయత్నించినా హిందూ సమాజంలో స్త్రీ ఉద్ధరణ కోసం కాస్త డబ్బు సహాయం చేసే ధర్మదాతలు విఠల్ దాస్‌కు కనిపించరు. సుమన్‍కు సమాజం పని చేసుకుని బతికే అవకాశాన్ని కలిగించదు. కాని ధర్మం గురించి స్త్రీ నైతికత గురించి మాత్రం వీళ్ళంతా పెద్ద పెద్ద చర్చలు చేస్తూ ఉంటారు.

వేశ్యగా మారిన సుమన్ దగ్గరకు ఆ నగరంలోని ధనికులందరూ వంతుల వారీగా వస్తూ ఉంటారు. వారిని దూరం ఉంచుతూనే కేవలం కచేరీలవరకే పరిమితం అవుతూ ఉంటుంది సుమన్. ఆమెను పొందాలని నగరంలోని పెద్దవారంతా ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకరితో మరొకరు పోటీలు పడుతూ ఉంతారు. క్రమంగా సుమన్ ఆ వాడలో పేరున్న వేశ్యగా ఎదుగుతుంది. మగవారిని ఆడించడంలో నైపుణ్యం సంపాదిస్తుంది.

కాని ఆ జీవితం, మొగవాళ్ళ కళ్ళలోని కామం ఆమెను ఆశాంతి పాలు చేస్తాయి. పద్మసింగ్ అన్న ఓ భూస్వామి. అతని ఏకైక కుమారుడు సదన్. డబ్బులో పెరిగిన సదన్ పల్లెటూరి జీవితం నచ్చక బాబాయితో పట్నం వస్తాడు. ఇక్కడి భోగాలను చూసి మైమరిచిపోయి విలాసాల బాట పడతాడు. ఇతను వేశ్యావాడకి వచ్చినప్పుడు సుమన్‌ను చూసి మోహిస్తాడు. ఆమెను ప్రేమిస్తున్నానంటూ ఆమెతో స్నేహం పెంచుకుంటాడు. కరడు కట్టిన కామ పిశాచాల నడుమ ఈ యువకుడి ప్రేమ సుమన్‌ను ఆకర్షిస్తుంది. అతనితో స్నేహంగా ఉంటుంది. అయితే ఈ ప్రేమ పిచ్చిలో ఓ సారి సదన్ పిన్ని సుభద్ర చేతి కున్న బంగారు కడియాన్ని దొంగలించి సుమన్‌కు తెచ్చి ఇస్తాడు. దాన్ని స్నేహితురాలి కడియంగా గుర్తుపట్టిన సుమన్ దాన్ని తిరిగి పద్మసింగ్‌కు ఇస్తుంది. మార్కెట్‌లో ఓ దుకాణంలో ఇది అమ్మకానికి వచ్చిందని చెప్పి సదన్ తన దగ్గరకు వస్తున్న విషయాన్ని దాస్తుంది. సదన్‌కు ఇంకా దగ్గరయి పద్మసింగ్‌కు తలవంపులు తేవడానికి ఆమె ఇష్టపడదు. కాని ఆమె మాటల్లో ఆమె స్థితికి ఆమె ఆ దారి ఎంచుకోవడానికి తన లాంటి మర్యాదస్థుల ద్వంద్వ వైఖరి ముఖ్య కారణం అని అర్థం చేసుకుంటాడు పద్మసింగ్. రక్షించమని తన ఇల్లు చేరిన ఆ కులీనురాలి పతనానికి తన బలహీనత ముఖ్య కారణం అని అతని మనసు ఘోషిస్తూ ఉంటుంది. పశ్చాత్తాపం చేసుకోవలన్న ఆలోచన అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఆ ఆలోచనలతోనే వేశ్యలపై ఆకర్షణ జనంలో తగ్గాలని, శుభకార్యాలలో వారి చేత నాట్యం చేపించే పద్దతికి సమాజం స్వస్తి పలకాలని, వారికి ఊరవతల ఆవాసాలను కల్పించాలని ఉద్యమిస్తాడు. వేశ్యావృత్తిని నిర్మూలించాని ప్రయత్నించే క్రమంలో డబ్బు, పేరున్న సంఘసంస్కర్తలు దీనికి ఒప్పుకోకపోవడం, సహకరించకపోవడం చూసి పద్మసింగ్ బధపడతాడు.

తాను గొప్పగా భావించిన వేశ్యా జీవితంలోని మరో కోణం సుమన్‍౬ను బాధిస్తుంది, తనకు తాను ప్రత్యేకంగా జీవించాలనుకునే తత్వం ఆమెది. కాని ఈ గౌరవం వెనుక కామ దాహం ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందుకని విఠల్ దాస్ సహకారంతో విధవాశ్రమంలో తన గతం ఎవరికీ తెలియనీయకుండా చేరిపోతుంది. అక్కడి తోటి స్త్రీలలో ఒకరిగా కలిసిపోతుంది. శ్రమను నమ్ముకుని సాధారణ జీవితానికి అలవాటు పడిపోతుంది.

సుమన్ వేశ్యగా మారిన తరువాత ఆమె స్థితికి తానూ కారణం అని తెలుసుకున్న ఆమె భర్త పశ్చాత్తాపంతో రగిలిపోతాడు. తన మొండి వైఖరికి, ఆ పేద జీవితానికి అలవాటు పడడానికి సుమన్ ఎంత కష్టపడిందో అతనికి గుర్తుకు వస్తూ ఉంటుంది. కేవలం ఈర్శ్య అసూయలతో, భర్తగా అధికారి హోదాలో తాను ఆమెకు చేసిన అన్యాయం అతన్ని తినేసూ ఉంటుంది. విరక్తితో అతను సన్యాసిగా మారిపోతాడు. ఆ ఇల్లు, ఊరు వదిలి దేశాటనకు వెళ్ళిపోతాడు.

సుమన్ తల్లి జబ్బుతో అన్న ఇంట ఆదరణకు నోచుకోలేక చనిపోతుంది. కృష్టచంద్ జైలు నుండు విడుదలయి వస్తాడు. శాంత ఒక్కతే అనాథగా ఆ ఇంట ఉండడం చూసి భరించలేకపోతాడు. తన చేతకానితనాన్ని నిత్యం గుర్తు తెచ్చుకుంటూ తాగుడికి బానిసవుతాడు. ఉమానాధ్ శాంత పెళ్ళి కొసం ప్రయత్నిస్తూ ఉంటాడు. సుమన్ పతన వార్త వారి దాకా రాదు. ఒక సారి గజాధర్ ఉమానాధ్‌ని కలుస్తాడు. సాధువుగా తిరుగుతూ తాను సంపాదించిన ధనాన్ని తీసుకొచ్చి అతనికిచ్చి శాంత పెళ్ళి ఆ డబ్బుతో జరిపించమని చెప్తూ సుమన్ జీవితంలా ఆమె పతనం కాకుండా కాపాడమని, ఇలా అయినా తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపం చేసుకునే అవకాశం ఇమ్మని అడుగుతాడు. అప్పుడే ఉమానాధ్‌కు సుమన్ గురించి తెలుస్తుంది. పెద్ద కూతురిని చూడాలని ఆమె అడ్రస్సు అడిగే బావకు ఆయనేవో అబద్దాలు చెబుతూ దాటేస్తూ ఉంటాడు.

సుమన్ విధవాశ్రమంలో చేరిపోయాక ఆమె కనిపించక సదన్ కొన్నాళ్ళు పిచ్చివాడవుతాడు. అతని తల్లి తండ్రులు సదన్ పెళ్ళి చేయాలనుకుంటారు. గజాధర్ ఇచ్చిన డబ్బుతో శాంత పెళ్ళి సదన్‌తో నిశ్చయిస్తాడు ఉమానాధ్. అయితే భార్యకు సుమన్ సంగతి చెప్పడంతో ఆమె పక్కింటివారికి ఈ విషయాన్ని తెలియజేస్తుంది అలా ఊరంతా ఈ విషయం పాకుతుంది. పెళ్ళి కోసం వచ్చిన పెళ్లికొడుకువారి మధ్య ఊరి వాళ్ళు పెళ్ళికూతురు అక్క వేశ్య అని తెలియజేస్తారు. దానితో సదన్ తల్లి తండ్రులు ఈ సంబంధం కాదనుకుని సగంలో జరుగుతునన్ పెళ్లి ఆపి తిరిగి వెళ్లిపోతారు. సంగతి విన్న కృష్ణచంద్ షాక్‌కు లోనవుతాడు. ఆత్మహత్య చేసుకుంటాడు. అతన్ని కాపాడాలని గజాధర్ ప్రయత్నించి విఫలుడవుతాడు.

తన వల్ల చెల్లెలి పెళ్ళి ఆగిపోయిందని, తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని సుమన్ కు తెలుస్తుంది. ఆమె ఇది భరించలేకపోతుంది. సుమన్‌ను ఎంతో ఆరాధించన సదన్ శాంత సుమన్ చెల్లెలని తెలుసుకుని ఆమెని అసహ్యించుకోవడం సమాజంలోని స్వార్ధ వైఖిరికి కుల వివక్షకు నిదర్శనం. తాను చేస్తున్నది సరయిన పని అని శాంతను పెళ్ళి చేసుకుంటే తమ కులం అపవిత్రం అవుతుందని అప్పటిదాక వేశ్యావాడలలో విహరిస్తూ గడిపిన సదన్ కూడా నమ్ముతాడు. అందుకే శాంత కోసం అతను తల్లి తండ్రులను ఎదిరించడు. తండ్రి చేస్తుంది సరయినదే అని కులాన్ని కాపాడుకోవడం ముఖ్యం అని నమ్ముతాడు ఆ విలాస పురుషుడు.

వేశ్యావృత్తిని బహిష్కరించాలి అని కృషి చేస్తూ అన్న కొడుకు పెళ్ళిలో వేశ్యతో కచేరి పెట్టించకుండా ఆ డబ్బుతో ఊరిలో బావి తవ్వించాలని, పేదలకు దానం చేయాలని పద్మసింగ్ ఎంతో ప్రయత్నిస్తాడు. కాని వేశ్యల ఆట పాట లేకుండా పేళ్ళి ఏంటని ఆ ఊరి పెద్దలు, స్త్రీలు అందరూ ఎదురు తిరుగుతారు. పైగా అలా జరగని పెళ్ళి పెళ్ళే కాదని తేల్చేస్తారు అందరు. మళ్ళీ వీరే పెళ్ళి కూతురు అక్క ఒకప్పుడు వేశ్య అని, ఇప్పుడు వృత్తి మాని గౌరవంగా బతికే ప్రయత్నం చేస్తుందని తెలిసినా ఆ పెళ్ళిని రద్దు చేసుకుని కులాన్ని రక్షించుకోవడానికి వెనుతిరగడం న్యాయమైన పని అని నమ్ముతారు. ఈ ద్వంద్వ సమాజ వైఖరిని ప్రేంచంద్ ఈ నవలలో ఎంతో విశ్లేషణాత్మకంగా చర్చించారు.

పద్మ సింగ్ ఎంత ప్రయతించినా వేశ్యా వృత్తిని నిర్మూలించడానికి ఎవరూ సహాయం చేయరు. చివరకు ఎంతో కష్టం మీద వారి ఆవాసాలను ఊరవతల ఏర్పాటు చేయడానికి మున్సిపాలీటీలో ఒప్పందం కుదురుతుంది. అయితే వీరిని సంస్కరించాలని పట్టు వదలని విఠల్ దాస్, పద్మసింగ్ లు వేశ్యలను విడిగా కలిసి వారి భవిష్యత్తు గురించి చర్చిస్తూ ఉంటారు. శాంతకు మళ్ళీ వివాహం చేయాలని ఉమానాధ్ అనుకుంటే తనకు సరిగిన సగం వివాహాంతో సదన్ తన భర్త అని భావించి శాంత – పద్మసింగ్ కు తన గోడు తెలుపుతూ ఉత్తరం రాస్తుంది. విఠల్ దాస్ ఇచ్చిన స్పూర్తితో పద్మసింగ్ ఆమెను అత్తింటికి తీసుకెళుతున్నట్లుగా తనతో తీసుకువచ్చేస్తాడు. సుమన్ ఉన్న విధవాశ్రమంలోనే ఆమెతో పాటు శాంతకు ఆశ్రయం కల్పిస్తారు.

సుమన్ ఓ సారి సదన్‌ను కలిసి శాంతకు అతను చేసిన అన్యాయం గురించి ప్రశ్నిస్తుంది. సుమన్‌ను ఎదుర్కోలేక సిగ్గుతో చితికిపోతూ సదన్ తన ప్రవర్తన గురించి ఆలోచించడం మొదలెడతాడు. ఏ పని చేయకుండా బలాదూర్‌గా తండ్రి సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ బతకడంతో తాను స్వంత నిర్ణయాలు తీసుకోలేనని అర్థం చేసుకుంటాడు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే అతని అర కొర చదువుకు ఎక్కడా ఉద్యోగం దొరకదు. గంగా నదిపై ఓ నావ కొని దాన్ని నడపడం మొదలెడతాడు సదన్. ఇద్దరు పడవవాళ్ళని పనికి కుదుర్చుకుని రెండు నావలను కొని అతను క్రమంగా డబ్బు సంపాదించి ఓ చిన్న గుడిసె కట్టుకుంటాడు. సుమన్ గతం తెలియడంతో ఆమెను విధవాశ్రమంలో ఇతర స్త్రీలు అవమానిస్తూ ఉంటే అది భరించలేక ఆమె శాంతతో అక్కడి నుండి బైట పడుతుంది. ఆ ఇద్దరి స్త్రీలను తన ఇంటిని తీసుకువస్తాడు సదన్. పద్మసింగ్ దీనికి సంతోషిస్తాడు. సదన్ తండ్రి ముందు కోపగించినా మనవడు పుట్టిన తరువాత కొడుకుని స్వీకరిస్తాడు.

కాని సుమన్ పరిస్థితి ఇక్కడా దారుణంగా మారుతుంది. అప్పటి దాకా అక్క సంరక్షణలో ఉన్న శాంత తనదనే సొంత సంసారం ఏర్పడ్డాక అందులో ఆమెకు అక్క ఉనికి నచ్చదు. సుమన్ ఎంత చాకిరీ చేసినా ఆమెను భార్య భర్తలిద్దరూ తిరస్కారంగానే చూస్తారు. మనిషిలోని స్వార్థం పరిస్థితుల ఆధారంగా ఎలా మారుతూ ఉంటుందో శాంత ప్రవర్తన నిరూపిస్తుంది. తానో గొప్పింటి బిడ్డనని సంస్కర్తనని భావిస్తూ సదన్ సుమన్ ను చులకనగా చూస్తూ ఉంటాడు. ఒకప్పుడు ఆమె కనుచూపు కోసం దొంగతనానికీ సిద్ధపడ్డ సదన్ ఇప్పుడు ఆమె చెల్లెలి భర్తగా. ఇంటి యజమానిగా మారాక సుమన్ పట్ల అతని ప్రవర్తన మారిపోతుంది. ఇంకొకరి ఆశ్రయంలో దీనంగా రోజులు వెళ్లదీసిన శాంత భార్యగా యజమానురాలిగా మారాక అక్కను హీనంగా చూడడం తప్పనుకోదు.

విఠల్ దాస్, పద్మసింగ్ ల ప్రయత్నంతో తమ జీవితాలను మార్చుకోవాలనే ఆలోచన ఆ ఊరిలోని వేశ్యలలోకి పాకుతుంది. దీనతో కొందరు వృద్ధ వేశ్యలు తాము జీవితంలో సంపాదించినదంతా విఠల్ దాస్ చేతుల్లో పెడతారు. ఆ డబ్బు తోనే వారికి ఓ గృహం, చేతి వృత్తుల పనులునేర్పించే స్కూలు మొదలవుతుంది. వేశ్యల పిల్లలకు ఒక పాఠశాల కూడా నెలకొల్పుతారు. ఊరిలో ధనవంతులెవ్వరూ సహకరించకపోయినా వేశ్యల డబ్బుతో విఠల్ దాస్ సంకల్పం, ప్రేమ్ సింగ్ ఔదార్యంతో వేశ్యల సంస్కరణకు ఓ రూపం వస్తుంది.

సుమన్ సదన్ తల్లి తండ్రులు ఆ ఇంట చేరాక అక్కడ ఉండలేక చెల్లెలి నిరాదరణను భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. ఆమెను గజాధర్ కాపాడతాడు. ఆమె స్థితికి తానే కారణం అని ఆమెను క్షమించమని కోరతాడు. అతని నీడలో తనని ఉండనివ్వమని సుమన్ ప్రాధేయపడుతుంది. తాను సన్యసించానని, తనతో సుమన జీవించడం కుదరదని అతను చెప్తాడు. తనకు కట్టుబడి ఆమె జీవించడం కనా ఓ గొప్ప ప్రయోజనం దిశగా అడుగులు వేయాలని అంటాడు. వేశ్యల బాగు కోసం కట్టిన సేవాసదన్‌ను నడిపించే భాద్యత సుమన్ తీసుకోవాలని గజాధర్ ఆమెను కోరతాడు. ఈ పని ఆమె మాత్రమే చేయగలదని, ఆమెకు తెలిసిన విద్య, ఆమె జీవితం నేర్పిన పాఠాల ఆధారంగా ఆ వేశ్యల జీవితాలలో ప్రశాంతత కోసం ఆమె మాత్రమే పాటు పడగలదని చెప్పి శాశ్వతంగా ఆమె జీవితం నుండి నిష్క్రమిస్తాడు గజాధర్.

సుమన్ సేవాసదన్ బాధ్యతలు తీసుకుంటుంది. ఆ ఊరిలో ఆమె చేసే పని ఎందరికో స్పూర్తిదాయకమవుతుంది. ఆమె గొప్పతనం, తెలుసుకున్న సుభద్ర ఆమెను చూడాలని వస్తుంది. పద్మసింగ్ ఇంకా సుమన్‌కు ఎదురు పడలేని స్థితిలో ఉండిపోతాడు. తమ చేతకానితనానికి పతనం అయిపోయిన ఆమె స్వీయ శక్తి తో నైతికంగా ఎదిగిన తీరు, ఒకరి ఆశ్రయంలో దీనంగా బతికే స్థితి నుండి వేల మంది నిర్బాగ్యులకు ఆసరా ఇచ్చే శక్తిగా మారిన వైనం అతన్ని ఆశ్చర్యపరుస్తుంది. అతన్ని మొదటి నుండి అభిమానించే సుమన్ ఏదో రోజు తనను వెతుక్కుంటూ అభినందిస్తూ పద్మసింగ్ తనను చూడడానికి వస్తాడన్న ఆత్మవిశ్వాసంతో సేవాసదన్ నిర్వాహకురాలిగా పనిలో నిమగ్నమవుతుంది.

నలుగురి ముందు నర్తించే స్త్రీలు, సమాజం భోగ వస్తువుగా చూస్తే స్త్రీలకు సమాజంలో అతి ఆదరణ అతి నిరాదరణ సమపాళ్లల్లో అందుతుంది. వాళ్లకు లభించే ఐశ్వర్యం, కీర్తి, ఆదరణ చాలా సార్లు మర్యాదస్థులుగా జీవించే స్త్రీలను ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. ఇలాంటి స్త్రీల పట్ల ప్రపంచం చూపే ఆ ప్రత్యేక ఆసక్తి, వారిని పూజించే మర్యాదస్థుల వైఖరి, ఆ స్త్రీలకు అందే సౌకర్యాలు, ఆరాధన, ఈ స్త్రీలను అయోమయానికి గురి చేస్తాయి. తమకూ అలాంటి గుర్తింపు, ఆదరణ కావాలని, తమనూ అంతలా ఇతరులు ఇష్టపడాలని వీరు అనుకోవడం సహజం. అందుకే నీతి సూత్రాలతో వారిని ఎంత బంధించాలని ప్రయత్నించినా అందులోని ద్వంద్వ వైఖరి, వారిని తిరగబడమై ప్రోత్సహిస్తుంది. తమ స్వార్థం కోసం వీరిని బంధించి, దానికి నీతిని ఆయుధంగా ఉపయోగించే వ్యవ్యస్థను ఎదిరించి తామూ ఆదరణను, గుర్తింపుని, ఆర్ధిక భద్రతను, సౌకర్యాలను, విలాసాలను పొందాలని స్వేచ్ఛను అనుభవించాలనే ఆలోచనతో స్త్రీ జాతి ఈ వ్యవస్థ నీతి పేరుతో వేస్తున్న బంధనాలను తెంచుకోవాలని ప్రయత్నిస్తుంది. ఆ తరువాత ఆ స్వేచ్ఛ లోనూ కనిపించే ఆనందం నిజం కాదని అర్థం అయేసరికి వాళ్ళ జీవితం మరో కొత్త జైలుగా మారుతుంది. కొన్ని సౌకర్యాలను నీతి వదిలేస్తేనే అనుభవించే స్థితిలో స్త్రీ సమాజాన్ని ఉంచడం ఎంత అన్యాయమో చర్చంచే గొప్ప నవల ‘సేవాసదన్’.

మలి వయసులో చిన్న చిన్న బట్టలు చెత్త డాన్స్ స్టేప్పులతో రీల్స్ తీసి ఆనందించే ఆధునిక స్త్రీలు, చదువు, హోదా, గౌరవం ఇచ్చే పనులను వదిలి సినిమాలలో చాన్సుల కోసం అర్ధ నగ్న ప్రదర్శనలను ఇవ్వడానికి ఉత్సాహపడే నటీమణుల వెనుక ఉండేది కళల పట్ల ప్రేమ కాదు, ఇలాంటి అయోమయపు అంధకారమే. దీనికి కారణం సమాజంలోని ద్వంద్వ వైఖరి అన్నది ఒప్పుకుని తీరాలి. ఈ నవల వచ్చి ఓ శతాబ్దం అయింది. నేటికీ సమాజంలో ఈ ద్వంద్వ వైఖరి నడుస్తూనే ఉంది. దాన్ని బద్దలు కొట్టి నిజమైన స్వేచ్ఛాయుత జీవనానికి స్త్రీకి పరిస్థితుల్నీ ఈ వందేళ్ళలోనూ సమాజం కల్పించకపోగా ఆమెను భోగవస్తువుగానే శాశ్వతంగా ఉంచేస్తూ, ఆ భోగ వస్తువు లాంటి స్థితి పట్ల ఆకర్షణ స్థాయిని ఇంకా పెంచి స్త్రీ జీవితాన్ని అల్లకల్లోలం చేసింది ఈ వ్యవస్థ. సమాజంలో స్తీ ఇక ఎప్పటికీ పురుషుని అధీనంలో ఉండే భోగవస్తువుగానే మిగిలించింది. ఆశ్చర్యంగా ఆధునిక స్త్రీ దీన్ని ప్రతిఘటించకుండా ఈ భోగం కోసం అందే ఆధునిక కొన్ని సౌకర్యాలకు తనను తాను కుదువ పెట్టుకుంటుంది.

స్త్రీ స్వేచ్ఛ కోసం ఎలాంటి బంధనాలను బద్దలు కొట్టాలో నిర్ణయించుకోవడానికి సహాయపడే గొప్ప నవల ‘సేవాసదన్’. ప్రేమ్‍చంద్ రాసిన ఇతర నవలలన్నీటి సమాజాన్ని నిశితంగా విశ్లేషించేవే. అన్నిటి మధ్య స్త్రీ జీవితం గురించి ఎంతో గొప్ప అవగాహనతో రాసిన నవలగా ‘సేవాసదన్’ నాకు అత్యంత ఇష్టమైన పుస్తకం.

***

సేవాసదన్ (నవల)
రచన: మున్షీ ప్రేమ్‍చంద్
ప్రచురణ: Maple Press
పేజీలు: 256
ధర: ₹ 150.00
ప్రతులకు:
https://www.amazon.in/Sevasadan-Premchand/dp/9389225248

Exit mobile version