[శ్రీమతి లలిత రామ్ రచించిన ‘సెలయేటిలో మొగ్గ సంపెంగలు’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
కథా, నవలా రచయిత్రి శ్రీమతి లలిత రామ్ శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనవరాలు, ప్రముఖ చిత్రకారులు బుజ్జాయి గారి కుమార్తె. ‘సెలయేటిలో మొగ్గ సంపెంగలు’ రచయిత్రి తొలి కథాసంపుటి. దీని కన్నా ముందు ఒక తెలుగు నవల, ఒక ఆంగ్ల నవల, మరో నాలుగు పుస్తకాలు ప్రచురించారు. ఈ సంపుటిలో సాంఘిక కథల విభాగంలో 14, భ్రమజనితం విభాగంలో 1, పౌరాణిక కథల విభాగంలో 4, చరిత్రలో కల్పన విభాగంలో 2, డిటెక్టిక్ కథల విభాగంలో 2 – మొత్తం 23 కథలున్నాయి.
“కథలు కవితాత్మకంగా ఉంటూ, ఒకదానికొకటి వైవిధ్యంతో, ఏకబిగిన చదివించే చక్కని శైలితో ఉన్నాయి” అని తమ ముందుమాటలో వ్యాఖ్యానించారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ.
“లలితగారు విభిన్న తరహాలో సాంఘిక, పౌరాణిక, చారిత్రిక, డిటెక్టిక్ కథల సమాహారంగా ఈ సంపుటిని తీర్చిదిద్దారు. ఒక కదంబమాలలా వివిధ వర్ణాల సుమాలను కూర్చిన అనుభుతి కలిగింది” అన్నారు డా. తెన్నేటి సుధాదేవి.
“ప్రతి కథలోనూ నవ్యత, ప్రతి కథలోని కథన లోతు, రచయిత్రికి తన చుట్టుపక్కలవారితో గల సంబంధ బాంధవ్యాలు, సమకాలీన సమాజంలోని భిన్న మనస్తత్వాల సంభాషణాచాతుర్యం చాలా చక్కగా చిత్రించారు” అని తమ ముందుమాటలో పేర్కొన్నారు డా. శ్రీదేవి శ్రీకాంత్.
~
సాంఘిక కథలు:
ఒక మనిషి తన గురించి తాను ఆలోచిస్తూ, గడిపి వచ్చిన జీవితాన్ని పునశ్చరణ చేసుకుంటూ, వర్తమానంలో ఎక్కడ ఉన్నాడో బేరీజు వేసుకుంటూ, భావి గురించి ఆలోచించే జయకాంత్ ఒక అనాథ. తన తొలి బంధువుగా ఎంచుకున్న వ్యక్తిని దెబ్బలు తగిలి గాయాలైన పరిస్థితిలో చూస్తాడు. ఆమెని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆమె ప్రదర్శించిన ధైర్యం అతన్ని ఆకట్టుకుంటుంది. ‘సమన్విత’ కథ ఆసక్తిగా సాగుతుంది.
పెళ్ళికి ఆసక్తి చూఫని తమ పిల్లలకి వివాహ వ్యవస్థ గౌరవాన్ని, ఆదర్శాన్ని తెలియజెప్పి, ఎలా పరిణయాలకి పెద్దలు సిద్ధం చేశారో ‘మమ జీవన హేతున’ కథ చెబుతుంది. కరోనా సృష్టించిన సామాజిక విధ్వంసంలో – తానేంటో తెలుసుకుంటూ – అప్పటి దాకా, కావాలని సామాన్య గృహిణిగా ఉండిపోయిన శ్రావ్యకి తన గమ్యం తెలుస్తుంది. జీవితంలో కీలకమన నిర్ణయం తీసుకుని అమలు చేస్తుంది. ‘యువర్స్ ట్రూలీ, శ్రావ్య’ కథ ప్రేరణ కల్పిస్తుంది.
ఇష్టపడ్డ వ్యక్తి దారుణంగా ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే, తేరుకుని తన భయాన్ని జయించి, ఆ భయాన్నే వాహకంగా మార్చుకుని ఎదిగి, తనని అర్థం చేసుకుని గౌరవించే వ్యక్తిని పెళ్ళాడి జీవితంలో స్థిరపడిన యువతి కథ ‘ధరణీధార’. నిండు వ్యక్తిత్వానికి ప్రతిరూపం ధరణి.
శ్రీశైలమే ప్రపంచమైన యువతి, వివాహానంతరం అమెరికాలో స్థిరపడాల్సి వస్తే, ఒకానొక సందర్భంలో ఓ నదీతీరాన ఉన్న స్థలం విక్రయానికి వస్తే, దాన్ని కొని అక్కడ ఆలయం నిర్మించాలన్న దివ్య ప్రేరణ కలుగుతుందామెకి. భర్త సహకారం కొరవడినా, పట్టుదలతో ప్రయత్నిస్తుంది, దైవానుగ్రహంతో కెరీర్లో ఆమెకు ఉన్నత స్థితి లభిస్తుంది. మరి ఆమె తాను అనుకున్నది సాధించిందా? తెలియాలంటే ‘అనంజనా నది తీరాన’ కథ చదవాలి.
నోరుపై అదుపులేని ఓ పెద్దాయన, మాటల తూటాలతో తన మిత్రుడికి, అతని మనవరాలికి ఖేదం కలిగిస్తాడు. అయినప్పటికీ తాతామనవరాళ్ళిద్దరూ తొణకరు. ఆ పెద్దమనిషి తన తప్పు తానే తెలుసుకునేలా చేస్తారు. ‘క్షమించు సజనీ!’ చక్కని కథ! ‘విస్మయ జగత్తులో జలజనేత్ర’ తన గమ్యానికి తన కొడుకే అడ్డు చెప్పడంతో ఆశ్చర్యపోతుంది నర్మద. అయినా తొణకని మనోస్థైర్యంతో, తన గమ్యం దిశగా సాగుతుంది. తన ఆలోచనలలోని లోపాన్ని గుర్తించిన కొడుకు, తల్లి వెంటే నడవడం అభినందనీయం!
భ్రమజనితం (ఫేంటసీ కథ):
పూర్తిగా కల్పితమైన ‘త్రిశక్తి’ కథ ఉమాపరమేశ్వరులది. పార్వతి శివుడిని ఓ వింత కోరిక కోరుతుంది. కాదనలేని శివుడు ఆమె కోరిక తీరుస్తాడు. మానస సంతతిగా అన్వేష్, విహాన్, సారంగి అనే ముగ్గురు ప్రభవిస్తారు. వారికి ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పజెప్తారు పార్వతి పరమేశ్వరులు. మరి వారు ఆ బాధ్యతా నిర్వహణలో సఫలమయ్యారా? విఫలమయ్యారా? ఎందుకని? పార్వతి వాళ్ళకి శిక్ష విధించిందా? శిక్షణకు పంపిందా? చక్కని ప్రతీకాత్మక కథ.
పౌరాణిక కథలు:
‘నీ పదములె చాలు’ చక్కని కథ. రావణ వధానంతరం పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగివస్తూ, సీతాన్వేషణలో తమ పయనం (రామస్య అయనమ్) సాగిన ప్రాంతాలను సీతకు చూపిస్తూ ఎన్నో విషయాలు చెప్తాడు రాముడు. పట్టాభిషిక్తుడై రాజ్యభారం స్వీకరిస్తాడు. ఓ రోజు సభలో సభికులకు సందేహాలుంటే అడగమని చెప్పగా, ఓ యువకుడు వేసిన ప్రశ్నకి అద్భుతమైన సమాధానం చెప్తాడు శ్రీరాముడు. కల్పిత కథే అయినా, రాజనీతిని, రాజధర్మాన్ని మళ్ళీ నొక్కి చెప్తుందీ కథ.
మొదటి కథ రాముడిదైతే, రెండో కథ కృష్ణుడిది. ‘బృందావన విహారిక’ ఎదుటివారి మనోవైఖరులకు అనుగుణంగా కృష్ణుడెలా నడుచుకుంటాడో అత్యద్భుతంగా చెబుతుంది. రాధ అనే పేరుకి ఈ కథలో గొప్ప నిర్వచనాన్ని కృష్టుడి చేత చెప్పించారు రచయిత్రి. మూడవ కథ పాండవ మధ్యముడు అర్జునుడి కథ. అతని ‘కళ్యాణయాత్ర’ గొప్పగా సాగుతుంది.
చరిత్రలో కల్పన:
ఈ విభాగంలోని రెండు కథలు ప్రభాసంలో శర్వరము, మనోనేత్రం దేనికదే విశిష్టమైనది.
మొదటి కథ శీర్షికలో – ప్రభాసమంటే గొప్ప కాంతి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఉజ్జ్వల భవిష్యత్తు కాంతిమంతంగా కనబడుతుంటే, మతమౌఢ్యం వెనక్కి లాగి, దేశవిభజన పుండుపై కారం జల్లుతూ చీకటి వైపు నడుపుతుంది. శర్వరం అంటే అంధకారం. ఎవరు ఎటువైపు నడిచారో కథ చదివితే తెలుస్తుంది.
డిటెక్టివ్ కథలు:
‘పచ్చ రెక్కలు’ కథలో నేరం చేసిన వ్యక్తిని యుక్తితో కనిపెడతాడు డిటెక్టివ్ అభినీత్. రాజ్యాలుంటే (రాజసంస్థానాల వారసుల లోకంలో) ఇప్పటికీ కుట్రలు తప్పవని ఈ కథ చెబుతుంది.
‘పతంగులు’ కథలో ఒక్క చిన్న క్లూతో, కనబడకుండాపోయిన కుర్రవాడి ఆచూకీ కనిపెడతాడు డిటెక్టివ్ అభినీత్. ఆసక్తిగా చదివిస్తుందీ కథ.
~
‘సెలయేటిలో మొగ్గ సంపెంగలు’ సంపుటిలోని ఈ కథలు పాఠకులని కథావనంలో విహరింపజేస్తాయి. వారికి చాంపేయ సుమగంధాన్ని అద్దుతాయి.
ప్రతీ పుటలోనూ భావుకత నింపి తాతగారికి తగ్గ వారసురాలనిపించుకున్నారు రచయిత్రి. కొన్ని పదాలు, కొన్ని వాక్యాలు, కొన్ని సన్నివేశాలు పాఠకులను భావుకత్వంలో ముంచి పరవశుల్ని చేస్తాయి. ముఖ్యంగా పౌరాణిక కథలలో భావుకత, ఆధాత్యికత పెనవేసుకుపోయి ఓ ప్రవాహంలా చదువరుల మానసాలలోని వచ్చి చేరుతాయి. ఆయా కథల్లోని పాత్రలకి పెట్టిన పేర్లు కూడా ఎంతో విభిన్నంగా ఉన్నాయి.
ఈ కథలు చదివినవారికి మధురమైన పఠనానుభూతి కలుగుతుందనడంలో సందేహం లేదు.
***
రచన: లలిత రామ్
ప్రచురణ: వంశీ ఆర్ట్ థియేటర్స్, హైదరాబాద్
పేజీలు: 150
వెల: ₹ 300
ప్రతులకు:
శ్రీ వంశీరామరాజు:
9849023852
అచ్చంగా తెలుగు బుక్స్:
8558899478 (వాట్సప్)
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా,
హైదరాబాద్. ఫోన్: 040-24652387
~
శ్రీమతి లలిత రామ్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mrs-lalitha-ram/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.