Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సత్యాన్వేషణ-19

ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం.

కుండలినీ శక్తి అగ్ని బీజ ప్రధానమైనదిగా చెప్పబడింది. కుండలిని శక్తి ప్రవహించే, సుషుమ్నానాడి కూడా అగ్నితత్త్వం కలిగిందే. కుండలినీ శక్తిని వాక్కుకు సంబంధించిన మూలశక్తిగా చెబుతారు. మంత్ర శాస్త్ర సంబంధమైన సమన్వయం చేస్తూ మానవజన్మకు ముందు జీవి ఖనిజస్థితి, వృక్షస్థితి, జంతుస్థితి అను కక్ష్యలను దాటిందని ఆ విధంగా మూడు చుట్లు పూర్తయ్యాయని, మానవజన్మ ఎత్తితే సరిపోదని, మనిషి తన సాధన ద్వారా మిగిలిన సగం చుట్టును పూర్తిచేసుకోవాలనీ అపుడు నాలుగు కక్ష్యలు (చుట్లు) పూర్తయి మనిషి జీవన్ముక్తుడౌతాడని, ఈ విషయాన్ని తెలియచేయడానికే మానవ దశలో, ఈ కుండలినీ శక్తి మూడున్నర చుట్లుగా ఉన్నదని కొందరు పెద్దలు చెబుతారు.

షట్‌ చక్రాలంటే ఆరు. అవి వరుసగా మూలాధారము, స్వాధిష్ఠానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞా.

1. మూలాధారం:

దీనినే రూట్ చక్రా అని కూడా అంటారు. ఇది మానవ శరీరానికి వెన్నుపూస క్రింద భాగంలో ఉంటుంది.ఇది పృధ్వీభూత స్ధానం(భూమి). ఈ చక్రానికి అధిపతి గణపతి. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది. ఇందే కుండలినీ శక్తి యుండును. దీని బీజ మంత్రం ‘లం’. మూలాధార చక్రమున గల కమల కర్ణిక యందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమ ప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆ లింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొనియున్నదనియు, వివిధతంత్రములు వర్ణించుచున్నవి.

2. స్వాధిష్ఠానం:

దీన్ని స్పిల్న్ చక్రా అని కూడా అంటారు. ఇది మూలాధారానికి దాదాపుగా రెండు అంగుళాలపైన అనగా పొత్తి కడుపులో ఉంటుంది. ఇది జల భూత స్థానం (నీరు) ఈ చక్రానికి అధిపతి బ్రహ్మ. ఆరు దళములతో సింధూరవర్ణముతో వుంటుంది. దీని బీజ మంత్రం ‘వం’.

3. మణిపూరకం:

సోలార్ చక్రా అంటారు. ఇది మానవ శరీరానికి బొడ్డు స్థానంలో ఉంటుంది. ఇది అగ్ని భూత స్థానం(నిప్పు) దీనికి అధిపతి విష్ణువు. నాభి స్థానములో గలదు. పది దళములు గలిగి, నీల వర్ణము గల అగ్ని తత్వకమలము. దీని బీజ మంత్రం ‘రం’.

4. అనాహతం:

హార్టు చక్రా అని అంటారు. ఇది మానవ హృదయ స్థానంలో ఉంటుంది. ఇదివాయు భూత స్థానం (గాలి). దీనికి అధిపతి రుద్రుడు. పండ్రెండు దళములు గలిగి, హేమవర్ణము గల వాయుతత్వ కమలము. దీని బీజ మంత్రం ‘యం’.

5. విశుద్ధ:

త్రోటు చక్రా అంటారు. ఇది మానవ శరీరంలో గొంతు స్థానంలో ఉంటుంది. ఇది దివి భూత స్థానం(ఆకాశం). దీనికీ అధిపతి జీవుడు. పదునారు దళములు గలిగి, శ్వేత వర్ణము గల ఆకాశతత్వ కమలము. దీని బీజమంత్రం ‘హం’.

6. ఆజ్ఞా:

ఇది మానవ శరీరంలో నుదుటి స్థానంలో ఉంటుంది. ఇది జీవాత్మ స్థానం. దీనికీ అధిపతి జీవుడు. భ్రూ(కనుబొమల) మధ్య వుంటుంది. రెండు వర్ణములతో గూడిన రెండు దళములు కలిగిన కమలము. దీని బీజ మంత్రం ‘ఓం’.

7. సహస్రారం:

ఇది తల పై భాగాన (నడి నెత్తిన) ఉంటుంది. ఇది చక్రం కాదు రంద్రం. దీనినే బ్రహ్మ రంద్రం అని కూడా చెపుతారు. దీనికి అధిపతి ఈశ్వరుడు.

మన హైందవ సాంప్రదాయ పెళ్ళిళ్ళలో సైతం తలపై జీలకర్ర మరియు బెల్లం మిశ్రమాన్ని తలపై పెట్టిన తరువాత వధూవరులను ఒకరికొకరిని చూసుకొమని చెబుతారు. కారణం అలా జీలకర్రా మరియు బెల్లం మిశ్రమాన్ని తలపై పెట్టగానే బ్రహ్మ రంద్రం తెరుచుకుంటుంది. అలా తెరుచుకున్న తరువాత మొదటగా చూసిన వారే జీవిత భాగస్వామిగా బ్రహ్మ స్థలిలో నిర్ణీతం అవుతుంది.

కుండలినీ శక్తిని ప్రేరేపించేవి గురువుల పర్యవేక్షణలో జరపాలని చెబుతారు. అది నిజము కూడా.

అందుకే మనకు క్రియా యోగా కూడా ఎక్కడా రాసి దొరకదు. గురువు ద్వారా మాత్రమే దీక్ష తీసుకోవాలి.

కుండలినీ శక్తి లలితాపరమభట్టారికగా చెబుతారు.

ఆ తల్లిని తలచిన హృదయమున పొంగిన కవనము:
~~
1.
మహి లోన నడిపించు శక్తి నీవు
మా మనసులో కొలువైన జనని నీవు
అగుపించు ప్రకృతివి, అగుపడని అచలజవి
జగతిని నడిపించు జగద్రాత్రి
ఆటలాడేటి జీవుని ఆత్మ నీవు
అందరిలో కొలువైన పరమాత్మా నీవు
బ్రహ్మాండాలకు గతియు నీవు!!


  1. ఆది శంకరుడు బోధించిన వాణి నీవు
    మూకశంకరుని వాక్పటిమ నీవు
    భాస్కర రాయుని భాష్యాలు నీవు
    పరమాచార్యుణ్ణి పరమ నిష్ఠ నీవు
    మా వాక్, కర్మ భావనల యందు నిలిచి
    సదా మమ్ము నడిపించావో నీశ్వరి!

  2. మూలాధారములోని మూడున్నర మూర్లు
    ముడుచుకున్న మహా శక్తి నీవు
    పరమ గురు బోధనలు పాటించు మానవుని
    పంచేంద్రియములు అర్పించు మానవుని
    మనసుల యందు తిష్ఠ వేసి
    వారల అంతర్ముఖులుగా మర్చి
    నిద్రించు శక్తిని నిద్రలేపి,
    షట్ చక్రములు దాటించి
    సహస్రారములోన సదాశివునితో కలసి
    విహరించు కుండలిని శక్తి నీవు !!

***

నేను తరువాత ఆ వీధులలో తిరుగుతూ వుంటే టూరిజం అని బోర్డు కనబడింది. గంగ వడ్డున ర్యాఫ్టింగు, కాయ్యాకింగు, జంపింగు అని చాలా స్పోర్టు పెట్టారు. మనవాళ్ళు ఎందరో వీటి కోసము వస్తారు రుషీకేష్‌కు. నాకు మాత్రము అలాంటివి నచ్చలేదు. అది పవిత్ర గంగను మలినము చెయ్యటమేనని నా వ్యక్తిగత అభిప్రాయము. కానీ అవి టూరిజమును పండిస్తాయిగా.

నేను ఒక టూరిష్టు ఆఫీసులోకెళ్ళి “నన్ను దేవప్రయాగ తీసుకుపోవటానికి కుదురుతుందా?” అని అడిగాను. ఆ రోజు కుదరదని, మర్నాడు ఉదయము వస్తే ఒకరు టూవీలరుపై తీసుకుపోతారని చెప్పారు. అతని భార్య అలా టూరిష్టులను తీసుకుపోయి పరిసర ప్రాంతాలు చూపుతుందని కూడా చెప్పాడు ఆ వోనరు. సరే బానే వుంది. పైపెచ్చు కెనటిక్ హోండా కాబట్టి నేను నడపవచ్చని ఆ ప్యాకేజుకు డబ్బు కట్టి నేను మఠానికి తిరిగి వచ్చాను.

(సశేషం)

Exit mobile version