Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సతి గమనం – ఎంత కఠినం

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన శ్రీమతి ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి గారి ‘సతి గమనం – ఎంత కఠినం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“ఏమండీ. గుండెలో నొప్పిగా ఉందండి” తట్టిలేపింది సావిత్రి. నిలబడి ఉంది మంచం దగ్గర. ఉలిక్కిపడి లేచాడు రామయ్య.

“ఎందుకని?” అని అడిగి “ఎప్పటి నుంచి?” అన్నాడు ప్రశ్న సరి చేసుకుంటూ.

“ఇప్పుడే” అంటూనే పక్కకి పడిపోయింది.

“సావిత్రి.. సావిత్రి..” అంటూ తట్టి తట్టి కుదిపి కుదిపి లేపసాగాడు ఆత్రంగా, భయంగా. జవాబు రావటంలేదు, జావలా జారిపోతోంది. కానీ చెయ్యి మాత్రం వదలలేదు.

మెదడు బ్లాంక్‌గా అయిపోతోంది. ఏం చెయ్యాలో తోచటం లేదు. నాడి, గుండె మార్చి, మార్చి చూడసాగాడు

అతని అనుభవం, వయస్సు భయం కలిగిస్తోంది. విషయం అర్థమైపోతోంది. కానీ అనుబంధం, ప్రేమ ఆశ వదులుకోలేకపోతున్నాయి.

బలవంతంగా చెయ్యి విడదీసి, పరుపు క్రిందకి లాగి పడుకోబెట్టాడు. మొహం ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుగా ఉంది.

‘ఇదేమిటి? ఇలా జరిగింది?’ అని ఆవేదనగా, బాధగా అనుకుంటున్నాడు తనలో తను, ఎన్నోసారో మళ్లీ.

కడుపు లోంచి దుఃఖం తన్నుకొస్తోంది కానీ, ఆశ్చర్యం, కంటి నుంచి ఒక్క చుక్క నీరు కారటం లేదు.

ఇదేమిటి? రాత్రేగా చిన్నకొడుకు పెళ్లి గురించి అంతసేపు మాట్లాడింది. కోడలికి పెట్టాల్సిన నగల గురించి, చీరల గురించి మాట్లాడింది. వాడి పెళ్ళి ఆలస్యం అయినందుకు బెంగపడి ఎన్ని మొక్కులు మొక్కిందో. మగపిల్లలకి పెళ్లి కావటం లేదుట అని ఆశ్చర్యపోయి, బెంగ పడేది. ముగ్గురు మగపిల్లలు. ఒక ఆడపిల్ల, ముగ్గురు మగ పిల్లలు విదేశాల్లోనే.

తలొక దేశం. వారిని విదేశాలకు పంపినందుకు పరిహారంగా ఆడపిల్లను దేశానికి సేవ చేశే మిలటరీ లోని పిల్లవాని కిచ్చి పెళ్లి చేశాడు. కానీ ఆమె కూడా దూరంగానే. బోర్డర్‌లో ఉద్యోగం. ఎప్పుడో కానీ రాదు.

కానీ తను పిల్లలు కొందరి పిల్లల్లా కాదు. తల్లీ, తండ్రి అంటే చాల ప్రేమ. అందరి దగ్గరా ఉండవని ఎవరికి వారే అడుగుతారు. అల్లుడు కూడా. కానీ దేశంకాని దేశంలో పోవటం తమకి ఇష్టం లేదు. కూతురి వద్ద ఉండటం ఆనవాయితీ కాదు. కానీ మాతృ దేశంలోనే పోవాలని కోరిక.

అందుకే రిటైర్ అయ్యాక సొంత ఊరు వచ్చేశారు. ఊరి చివర ఎప్పుడో కొన్న స్థలంలో చిన్న పెంకుటిల్లు వేసుకొని, మొక్క మోడూ పెంచుకుని ప్రశాంతంగా జీవిస్తున్నారు. మరీ చాతకానప్పుడు, వస్తాం అని చెప్పారు పిల్లలకి .

ఊరు చివర ఇల్లు కావటంలోని కష్టం ఇప్పుడే అర్థమయింది. దగ్గరలో మరో ఇల్లు లేదు.

డాక్టరు వద్దకు తీసికెళ్ళే సదుపాయాలూ, వాహనాలూ లేవు. తెల్లారవలసిందే. కానీ చల్లబడిపోతున్న ఒళ్ళు, ఆగిపోయిన పల్స్, గుండె పరిస్థితి – డాక్టర్ దగ్గరకు వెళ్ళే అవసరం కూడా లేదని తెలియచెప్పేస్తున్నాయి.

ఉప్పెనలా వచ్చింది దుఃఖం. వెక్కి వెక్కి బిగ్గరగా ఏడ్చేశాడు. కొద్దిసేపు అయ్యాకా, చీమల్ని చూసి కర్పూరం తెచ్చి చుట్టూ చల్లాడు. మోకాళ్ళు సవరించుకుంటూ మెల్లిగా వెల్ళి, తులసి దగ్గర ఉన్న ప్రమిద తెచ్చి తల వద్ద పెట్టాడు దీపం.

గుండె దిటవు చేసుకుని ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. పెద్ద కొడుకుకి చేశాడు. ఫోన్ రింగవుతోంది. మళ్ళీ ఆలోచించాడు. దేశం కాని దేశం, కోడళ్ళు, పిల్లలు గాభరా పడతారు. తన కొడుకు సరేసరి. అందుకే గుండె దిటవు చేసుకుని గొంతులో బాధను నొక్కి పట్టుకున్నాడు.

కొడుకు ఫోన్ ఎత్తాడు. “బాబూ, అమ్మ మిమ్మల్ని అందరినీ చూడాలని అంటోంది. ఒంట్లో బాగుండలేదు. వెంటనే బయల్దేరి రండి. తమ్ముళ్ళనీ రమ్మని చెప్పు. నేను కూడా చెబుతాను” అని పెట్టేశాడు.

ఎక్కువ మాట్లాడితే, గొంతు పసిగట్టేస్తాడని భయం. మితగా పిల్లలకీ అలాగే చెప్పాడు.

తెల్లవారాక, అసలు విషయం, డాక్టరు కూడా చెప్పాక చెప్పాలి అనుకున్నాడు. ఈలోపల వాళ్ళు మానసికంగా కూడా కొంత సిద్ధపడతారు అనుకున్నాడు. మళ్లీ సావిత్రి దగ్గరకు వచ్చి కూలబడ్డాడు. ఆమెకి ఐదేళ్ళప్పుడు, తనకి పదిహేనేళ్ళప్పుడు పెళ్ళయింది. పెళ్లయి యాభై ఏళ్ళు నిండుతాయి మరో మూడు నెలల్లో. గోల్డెన్ జుబిలీ చేస్తామని అడ్డు చెప్పవద్దని ముందే చెప్పారు పిల్లలు. మూడో కొడుకుకి పెళ్లి కాలేదని దిగులుతో షష్టిపూర్తి ఒప్పుకోలేదు. ఇప్పుడు ఏ బాధా లేదు. అందుకని ఒప్పుకోవటమే కాదు, ఆందరికీ చెప్పి మురిసిపోతోంది కూడా. కొద్ది రోజులు ఉంటే కనీసం ఆ రెండు ముచ్చటలు అయినా తీరేవి. సంసార బాధ్యతల తోటి, ఆర్థిక సమస్యల తోటి ఎక్కువ ముచ్చటలేమీ తీరలేదు వయస్సులో ఉన్నప్పుడు.

ఆమె సన్నని పెదవుల మీద రామయ్య నిలిచింది. ఎవ్వరినీ ఎప్పుడూ పల్లెత్తు మాట అనని పెదవులు. మృదు స్వభావి. మితభాషిణి. తన ఆవేశానికి, ఆమె నెమ్మదితనానికి సరిపోయిందనేవారు బంధువులు.

‘నేనెలా బ్రతకను సావిత్రీ నువ్వు లేకుండా?’ కన్నీళ్లు కారుతున్నాయి ధారగా.

అల్లుడికి చెప్పాలి. ఆఖరుది కావటం వల్ల ముగ్గురు మగపిల్లల తరువాత పుట్టటం వల్ల ఎంతో గారాభంగా పెరిగింది. అమ్మకూచి. అల్లుడికి చెప్పి జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పాడు. అలాగే పెద్ద కొడుక్కి చెప్పి, మిగతావారితో రమ్మనాడు.

అంతలో గుర్తు వచ్చింది. పెద్ద కొడుకు – తమ్ముళ్లు మరదళ్ళు, పిల్లలు అందరూ బయలుదేరామని మెసెజ్ ఇచ్చాడు. తన పిల్లలు అందరిలాంటి వారి కారు, మరోసారి అనుకున్నాడు. చెప్పగానే అందరూ బయల్దేరారు. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు దూరాభారం. రాగానే  పిల్లలు ఆకలికి ఏడుస్తారేమో అనుకుంటూ పాల చెంబు తీసికుని దొడ్లోకి వెళ్తాడు. రోజూ సావిత్రి పిండుతుంది. మొరాయించబోయిన ఆను వెన్ను నిమిరాడు. “సరిపెట్టుకోవాలమ్మా. సావిత్రే కావాలి అంటే ఎలా? నేను సరిపెట్టుకోవటం లేదా?” పిచ్చివాడిలా గొణుక్కుంటూ లోనికొచ్చాడు.

అసలు ఇది నిజమేనా? క్రిందటి సంవత్సరం ఇలానే ప్రాణం మీదికొచ్చింది. కానీ మళ్లీ బ్రతికి బట్టకట్టింది.

ఆ ఆలోచన రాగానే గబగబా ముందు గదిలోకి వెళ్లాడు. మళ్లీ ఊపిరి వచ్చిందేమో! లేచి కూర్చుందేమో. చుట్టూ కర్పూరం, దీపం చూసి ఏమనుకుంటుంది? అప్పుడే తనంత తొందర పడ్డాడని అనుకోదూ! లేదా భయపడదూ! తనని తాను తిట్టుకుంటూ ముందు గదిలోకి వెళ్ళాడు.

చలనం తిని రాయిలా ఆలా పడుకునే ఉంది. ఇదివరకు నొప్పి వచ్చినప్పుడు అలాగే మౌనంగా భరించేది. తగ్గిన తరువాత మామూలుగా పనులు చేసికునేది. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మాటల్లో చెప్పేది. అప్పుడే చెప్పనందుకు అరిచేవాడు, కోప్పడేవాడు. ఈ మూల నుంచి పగలు డాక్టరు దగ్గరకు వెళ్లటమే కష్టం. ఇక రాత్రిళ్ళు చెప్పాలా? కాదంటే సిటీలో ఉండాలి లేదా పిల్లల వద్దకు వెళ్లాలి. ఆ రెండూ తనకిష్టం లేదని తెలుసు. అందుకే చెప్పేది కాదు.

మళ్లీ నిరాశగా వంటింట్లోకి వెళ్లి పాలు కాచాడు. డికాక్షన్ వేశాడు. తెల్లారే వరకు రాయిలా గత స్మృతులతో సావిత్రి పక్కన గడిపాడు.

పెళ్లయిన కొత్తలో కట్నం దగ్గర అత్తింటి వారికి తన తల్లికి గొడవలొచ్చాయి. సావిత్రిని కాపురానికి తేలేదు. అప్పుడు, తనకి, తనూ చిన్నవాడేగా, స్వతంత్రం లేదు. ఉద్యోగమూ లేదు. బాధ్యతా తెలియదు. ఊరివారి సూటిపోటి మాటలు పడలేక, తల్లి బాధ చూడలేక సావిత్రి తనకి కాలేజీకి ఉత్తరం రాసింది. తనను తీసుకుపొమ్మని బ్రతిమాలుతూ రాసింది. ఆ రోజుల్లో మొగుడికి ఉతరం రాయటం అందునా రెండిళ్ల మధ్య గొడవలు ఉన్నప్పుడు చాల సాహసమే. తెగించి రాసింది అంటే ఆమె పరిస్థితి తను అర్థం చేసుకుని, చదువు మానేసి చిన్న ఉద్యోగంలో చేరి ఆమెను తీసికొచ్చేసాడు. ప్రైవేటుగా కట్టి, పెద్ద చదువు చదివి తన తల్లి కోరిక తీర్చాడు. ఉద్యోగ హామీ చూపించి, అత్తగారికి డబ్బు సర్దుబాటు చేసి గొడవలు చల్లార్చాడు.

తమ పెళ్లి త్యాగంలో, ప్రేమలో ప్రేమ వివాహలకంటే ఎంతో ఎక్కువని నిరూపించారు. ఆదర్శంగా కాపురం చేశారు.

“అమ్మా” పనిమనిషి గౌరి పిలుపు వినిపించింది. తన బాధ పంచుకునే మొదటి మనిషి.

“ఇంకెక్కడి అమ్మగారే. మీ అమ్మగారు మనందరినీ ఆన్యాయం చేసి వెళ్లిపోయింది” అంటూ గొల్లుమన్నాడు. అవాక్కయ్యింది గౌరి. తను దుఃఖించింది. ఇద్దరూ కలిసి జరగాల్సిన పనులు మొదలెట్టారు. బ్రాహ్మడికి, కట్టెల వాళ్లకి, దహనానికి, వంటవారికి, అన్నిటికి పిల్లలు కష్టపడతారని, దుఃఖం దిగమింగుతూ ఏర్పాట్లు చేశాడు.

సాయంత్రం అయ్యింది. కార్లు ఆగాయి. బంధువులు, బిలబిలమంటూ కొడుకులూ, కోడళ్లూ, మనవలు, కూతురూ, అల్లుడు రమారమి అందరూ ఒకేసారి దిగారు. ఒకళ్లని ఒకళ్ళు కావలించుకుని ఏడ్చారు. ఒకరిని, ఒకరు ఓదార్చుకున్నారు.

హడావిడి అంతా తగ్గాక గుర్తుకొచ్చాడు.

‘తండ్రి ఏడి?’ అనుకున్నారు అందరూ. అదే హాలులో ఒక మూలగా ఒదిగి, ఒక్కరోజులోనే పదేళ్లు వయసు పైబడిన వాడిలా ఉన్న తండ్రి కనిపించాడు.

“నాన్నా” అందరూ దగ్గర చేరారు.

“తమ్ముడి పెళ్ళి వరకు అయినా ఉంటే ఎంతో బాగుండేది” అన్నాడు పెద్ద కొడుకు.

“నిన్న కూడ మాట్లాడిందిగా” అన్నాడు మూడోవాడు కళ్లు తుడుచుకుంటూ.

“ఎన్ని అనుకున్నాము. పెళ్ళీ, తరువాత స్వర్ణోత్సవం..” అని ముక్కు చీదింది కూతురు.

“ప్రాప్తం లేదు. అంతే. ఋణం తీరిపోయింది. తనొచ్చిన పని ఆయిపోయింది అనుకుంది” అన్నాడు నిర్లిపంగా.

తండ్రిని ఎలా ఓదార్చాలా అని భయపడిన పిల్లలు ‘అమ్మయ్య’ అని నిట్టూర్చారు, తనకి నచ్చినట్లు కొత్త కోడలు రాబోతోందని తమ బాధ్యతలు తీరినట్లేనని పొంగిపోయింది. రాబోతున్న కళ్ల నీళ్లని ఆపుకున్నాడు. అసలే పిల్లలు అకస్మాత్తుగా జరిగిన సావిత్రి చావుకి బెంబేలెత్తుతున్నారు.

అప్పుడే రాబోయే కోడలి జాతకం గురించి ఆరాలు తీస్తున్నారు కొందరు బంధువులు. వింటూ కుళ్ళి కుళ్లి ఏడుస్తున్న చిన్నకొడుకును దగ్గరకు తీసుకున్నాడు ఓదారుస్తున్నట్లు.

అంతిమ యాత్రకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. “వీడి సంగతి చూడు” అని చిన్నకొడుకుని కూతురుకి అప్పచెప్పి బయటకొచ్చాడు, పెద్దకొడుకు చేత కార్యక్రమం చేయించాలి అనుకున్నా విదేశాల్లో కష్టమని అనటం తోటి, అల్లుడు ముందుకొచ్చాడు.

“కోడలిని పసుపు రాయమనండి” అన్నాడు బ్రాహ్మడు.

ఈ పసుపుకుంకాలతో పోవడం కోసం ఎన్ని నోములు చేసేది. “మీ ఇంట్లో ఈ అదృష్టం ఉన్నవాళ్లు తక్కువండీ, అదే నా బాధ” అని సుమంగళిగా పోవటానికి ఎవరిది చెబితే అది చేసేది.

స్వార్థపరురాలు. తను ముందుగా పోవాలని అనుకుంది కానీ తను లేకపోతే భర్త ఏమయిపోతాడని ఆలోచించలేదు. భర్త కంటే, భర్త వల్ల వచ్చే పసుపుకుంకాలు ఎక్కువ ఈ ఆడవాళ్లకి అనుకున్నాడు కోపంగా. సావిత్రి బ్రతికుంటే వాదన వేసుకునేవాడు పూర్వంలా.

మళ్లీ దొడ్డి వైపు వెళ్ళాడు అవన్నీ చూడలేక, తట్టుకోలేక. “వంట ఎంత వరకు వచ్చింది?” అడిగాడు ఏదో మాట్లాడాలి అని వంట వాళ్లని.

“కళ్లంట చుక్కనీరు లేదు చూడు. ఇప్పుడు ఏంటా అర్జెంటు” అంటోంది చిన్న కోడలు, తల్లితో,

అమాయకులు. ఉన్న కన్నీళ్ళు అన్నీ ఇప్పుడే కార్చేస్తే, జీవితాంతం తోడుండదని, దాచుకుంటున్నాడని వాళ్లకేం తెలుసు.

తన కంట ఎన్నడూ చూడని కన్నీరు చూస్తే ఆమె ఆత్మ వెళ్లలేదని తన ఆవేదన. ఏడుస్తున్నాడని తెలియదు. నవ్వుకున్నాడు.

“ప్రదక్షిణాలు చెయ్యండి” అన్నాడు బ్రాహ్మడు. ఎప్పుడూ తనకి చేసేది నమస్కారం. ఇప్పుడు తను నమస్కరిస్తున్నాడు. నవ్వు వచ్చింది. వింతగా చూసింది కూతురు.

“ఏడవకపోయినా కనీసం గంభీరంగా ఉన్నా బాగుంటుంది కదా” అన్నాడు అల్లుడు చిన్నకొడుకుతో.

తాము వచ్చేటప్పటికే కాఫీ, టిఫిన్లు, వంటలు ఏర్పాటు చెయ్యటం, కంటి వెంట నీరు రాకపోవటం, పైనుంచి మొహంలో చిరునవ్వు – కొద్దిపాటి కోపాన్ని తెప్పిస్తున్నాయి అందరికీ. బంధువుల్లో చిన్నతనంగా కూడా అనిపిస్తోంది.

“మగాళ్లు అంతే. ఎన్నాళ్ళు ఎంత సేవలు చేసినా, ఈ రోజు చేస్తే మర్నాటికి మర్చిపోతారు” ఎవరో కామెంట్ మెల్లిగా చేస్తున్నా రామయ్యకి వినబడుతూనే ఉంది. మళ్లీ నవ్వు వచ్చింది. అసలు గుర్తుకొచ్చేదే మర్నాటి నుంచి. అందరూ వెళ్ళిపోయాక వచ్చేదే శూన్యం, జ్ఞాపకాలు. కానీ మనుషులలో విచిత్రం. అది తెలిసినా అజ్ఞానమే కనిపిస్తుంది. పోయినప్పడు ఏడిస్తేనే ప్రేమ అనుకుంటారు. తరువాత మర్చిపోయినా పట్టించుకోరు.

“ఇంక లేపండి” అన్నారు. అప్పుడైనా ఏడుస్తాడేమోనని కొందరు ఆసక్తిగా చూశారు. వారి ఆశ తీరలేదు.

“నాన్నా పద శ్మశానానికి” అన్నాడు రెండో కొడుకు. అడ్డంగా తలూపాడు. కొద్దిపాటి హేళన చూపుతో కొడుకులు, అల్లుడు కదిలారు. అక్కడ తను తట్టుకోలేక ఏడిస్తే, సావిత్రి ఆత్మ ఘోషించదా!

ధైర్యంగా ఉండమని చెబుతూ చెయ్యూపుతున్న సావిత్రి కనిపించింది. తనూ చెయ్యూపాడు. ఏదో ఊరెళ్తున్నట్లు చెయ్యూపుతున్న రామయ్యని వింతగా చూస్తూ అందరూ వెళ్ళిపోయారు.

***

“నాన్నా నీకు దేశం కాని దేశంలో నచ్చదు, కానీ ఏం చేస్తావు, తప్పదు కదా. మాతో బయల్దేరు” అన్నారు తప్పనిసరిగా ఆహ్వానిస్తూ కొడుకులు.

“అవును, నాన్నకి కూతురి వద్ద ఉండటం నచ్చదు” అంది కూతురు.

నవ్వుకున్నాడు. వారి పిలుపులో మార్పు అర్థమవుతోంది. తల్లి ఉంటే చాకిరీ చేస్తుంది. తన వల్ల ఏం లాభం?

“వద్దురా. రోజూ కబుర్లు చెప్పుకోవాలి, జ్ఞాపకాలు నెమరువేసుకోవాలి. నా మిగిలిన గమనాన్ని పూర్తి చేయ్యాలి అంటే ఇక్కడే ఉండాలి” అన్నాడు. “సహగమనం చేసుకోవాలి.”

“ఎవరితో” అన్నారు అనుమానంగా. ‘కొంపదీసి మళ్లీ పెళ్లి చేసుకుంటాడా?’ అనుకున్నారు.

రామయ్య మాట్లాడలేదు. గోడ వంక చూశాడు.. అక్కడ చిరునవ్వుతో ఉన్న దండ వేసిన సావిత్రి ఫోటో ఉంది. పిల్లలు, బంధువుల ప్రవర్తన వల్ల కలిగిన బాధను చెప్పుకోవాలి. ఆమె ఓదార్పుతో సేద తీరాలి. ఆమె జ్ఞాపకాలతో మిగిలిన గమనం పూర్తి చేయాలి.

అందరూ త్వరగా వెళ్ళిపోతే సావిత్రి ముందర బోరున ఏడవాలి. ‘వీళ్ళు త్వరగా వెళ్లిపోతే బాగుండు’ అనుకున్నాడు.

Exit mobile version