[శ్రీమతి ఏ. అన్నపూర్ణ రచించిన ‘సరోవరాలు మనకు నేస్తాలు!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
సరోవరాల హొయలు
కనులకు విందులు
మనసుకి సంతోషాల వెల్లువలు
ఎటో వెళ్ళిపోతూ
మలుపులు తిరుగుతూ
సాగే నీటి గలగలలు
మదిలో మోగే నాదాలు
తుషార శీతల సరోవరాలు
ప్రకృతి ప్రేమికులకు ప్రియ నేస్తాలు
అందమైన దృశ్యాలు
లిఖించిన ప్రకృతి ప్రతి క్షణం
కుంచెకు ప్రాణం పోస్తుంది
విడిచి రాలేని అనుబంధాలతో
మనలను బంధించివేస్తాయి
తీరం వెంబడి నిలిచిన చెట్లు
ఆకుల కదలికలతో ఊసులెన్నో చెబుతాయి
వయ్యారాల కొమ్మలు
నీటిలోకి ఒరిగి
ప్రతిబింబాన్ని చూసుకుంటూ మురిశాయి
పూలను రాల్చి అల్లరి చేస్తాయి
నీటిలో తేలుతూ
దూరతీరాలకు చేరుతాయి
స్వచ్ఛమైన నీటిఅడుగున
గులకరాళ్లు గతచరిత్రకు
ఆనవాళ్లుగా పేరుకుంటాయి
అలుపులేని నీటి బాతులు
మీనాలను వేటాడుతూ
ఈదులాడుతుంటాయి
అప్పుడప్పుడు నీరెండలో
రెక్కలార్చుకుంటూ
పచ్చికలో తిరుగాడుతుంటాయి
మంచుకురిసే వేళలో
దూరతీరాలకు
మజిలీలుగా తరలిపోతాయి
రుతువులు మారగానే
వచ్చి చేరుతాయి
నేస్తాలై మనతో కలిసిపోతాయి
ఆకాశంలో పయనించే
మేఘమాల అరుణకాంతి సోకగా
పసిడివర్ణంతో మెరిసింది
ప్రకృతిని చూడగానే
పరవశించి పాడింది
నా మనసు మధుర గీతాలు ఎన్నో
రోజూచూసే అందాలు ఐనా
కొత్తరూపు సంతరించుకుని
ముచ్చట గొలుపుతాయి
పూచేపూలు ఎగిరేపక్షులు
వివిధవర్ణాల సీతాకోకచిలుకలు
మనలను అలరిస్తాయి
మంచు కురిసిన నేల తడిసి
ఆకు పచ్చని తివాసీలు పరిచి
స్వాగతం చెబుతుంది
స్వచ్ఛమైన గాలితో ఆరోగ్యం
మనసుకి ఉల్లాసం
అలసిన మేనుకు విశ్రాంతి కలిగిస్తుంది
వీలు వున్నప్పుడు
విహారాలు చేయడం
వినువీధిలో
చందమామను తిలకించడం
అవధులులేని ఆనందంతో
ప్రకృతిలో లీనమవడం
మనకు మనమే సేదతీరడం
[అమెరికాలోని మినిసోటా రాష్ట్రం సరోవరాలకు నెలవు. ప్రకృతికి పచ్చని చీర కట్టినట్టు వుండే అందాలు ఆ రాష్ట్రవాసులకు నేస్తాలు. చూసేవారికి మత్తుమందు చల్లినంత మైకాలు. మంత్రముగ్ధులను చేసే ఈ పరిసరాలను విడిచి రావడం చాలా కష్టం. స్విమ్మింగ్ (జలక్రీడలకు), బోట్ రైడ్స్ (నౌకా విహారం) చేసేవారికి అంతులేని ఆనందాలు. రచయితలకు, చిత్రకారులకు తనివితీరని విందులు చేస్తాయి. అలా వాటిని చూసినపుడు వచ్చే ఆలోచనలకు రూపమిది.]
నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.