[శ్రీమతి ఆర్. లక్ష్మి రచించిన ‘సరిలేరు నాకెవ్వరూ – నేచర్!’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
కణం గతంలో ఎన్నడూ చూడని విధంగా లేదా ఊహించని విధంగా విశిష్టమైన స్థాయిలో సమాచారాన్ని ప్రసారం చేయగలుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన/వేగవంతమైన కంప్యూటర్కు దీటుగా పనిచేసే సమాచార ప్రాసెసింగ్ విధానాన్ని మానవ శరీరంలో శాస్త్రజ్ఞులు ఇటీవల కనుగొన్నారు. సాధారణమైన వాతావరణంలో, సాధారణమైన ఉష్ణోగ్రతలతో ఎటువంటి అదనపు వ్యవస్థలు – కేబుల్స్, స్క్రీన్స్ వంటివి అవసరం లేకుండానే శరీరంలో ఈ సమాచార ప్రసారం జరుగుతున్నట్లు స్పష్టమైన ఆధారాలు దొరికాయి.
కంప్యూటర్ పరిభాషలో ‘సూపర్ రేడియన్స్’ గా వ్యవహరించబడే ఫినామినా మానవ శరీరంలోని కణజాలంలో సాంప్రదాయ జీవ రసాయన విధానాల కంటే బిలియన్ల రెట్లు వేగంగా డేటా ప్రాసెసింగ్ జరిగేందుకు వీలు కల్పిస్తోంది.
సాంప్రదాయ సూత్రాలను అనుసరించి సమాచార సేకరణ, మదింపు, ప్రసారం వంటివన్నీ మెదడులోని నాడీ వ్యవస్థలో మిల్లీ సెకన్ల కాలప్రమాణంలో జరుగుతాయి. ఇదే సమాచార ప్రాసెసింగ్. క్వాంటమ్ విధానంలో ‘పికో సెకన్స్’ లో జరుగుతుంది. అంటే సాంప్రదాయక విధానం కంటే ఎన్నో రెట్లు వేగవంతంగా జరిగిపోతుంది. అయితే కంప్యూటర్స్ నియమిత ఉష్ణోగ్రతలు, ప్రత్యేకమైన వాతావరణాలు, స్క్రీన్స్, కేబుల్స్ వంటి వ్యవస్థల ఆధారంగా మాత్రమే పనిచేస్తాయి. ఆ కారణంగానే క్వాంటమ్ మెకానిజమ్ క్వాంటమ్ కంప్యూటర్స్కే చెందుతుందని ప్రత్యేకమైన వాతావరణంలో మాత్రమే క్వాంటమ్ టెక్నాలజీ పని చేస్తుందని భావిస్తూ ఉండటం జరిగింది.
కణజాలం నిర్మాణంలో మైక్రోట్యూట్లెట్స్లా అమరి ఉండే ట్రిప్టోఫేన్ అమినో ఏసిడ్ క్వాంటమ్ ధర్మాలను ప్రదర్శిస్తోంది. ట్రిప్టోఫేన్ ఫిలమెంట్స్ అల్ట్రా వయోలెట్ కాంతిని గ్రహించి సందర్భానుసారంగా విడుదల చేస్తూ ఉంటాయి.
శాస్త్రవేత్తలు కురియన్ (Professor Philip Kurien), చెర్గుయ్ (Professor Majed Chergui) బృందం జరిపిన పరిశోధనలలో సజీవమైన కణాలలో క్వాంటమ్ సంకేతాలు స్థిరంగా, క్రియాశీలకంగానూ కూడా వ్యవహరిస్తున్నట్లు దృవీకరించబడింది. ఈ అధ్యయన ఫలితాలు అనేక అంశాలను గురించిన అభిప్రాయాలను మార్చివేశాయి. ‘క్వాంటమ్ ఎఫెక్ట్’కు ప్రత్యేకమైన చల్లదనం, ఐసోలేషన్ అవసరం లేదు. మేధస్సుకు సంబంధించిన సమాచార ప్రసారం ‘పికో’ సెకన్లలో జరిగిపోతుంది. అంటే అదనంగా మిలియన్ రెట్ల వేగంగా అన్నమాట. ఈ మొత్తం ప్రక్రియలో ట్రిప్టోఫేన్ రసాయనం క్వాంటమ్ టెక్నాలజీలో వలె ‘ఫైబర్ ఆప్టిక్స్’లా పనిచేస్తోంది. ప్రొ. చెర్గుయ్ ఈ క్వాంటమ్ బయోలజీ సమర్థవంతమైనదే కాక జీవుల గురించి మన దృక్పథాన్ని మార్చుకునేలా చేయడమే కాక మరిన్ని సరిక్రొత్త సమాచార ప్రసార వ్యవస్థలు బయట పడగలవనే సందేహాలకూ అవకాశం ఇస్తోందని అభిప్రాయపడ్డారు.
ప్రొ. కురియన్ అంచనాల ప్రకారం – జీవులలో ఈ క్వాంటమ్ ఎఫెక్ట్ అతినీలలోహిత కిరణాల తాకిడికి పాడవకుండా తమ డి.ఎన్.ఎ.ను రక్షించుకోవటానికి చేసిన ప్రయత్నాలలో రూపొంది ఉండవచ్చు.
ఈ అధ్యయనం మరిన్ని ఆసక్తికరమైన అంచనాలకు దారి తీసింది. అవి –
– ఈ క్వాంటమ్ క్రియాశీలత/ఎఫెక్ట్ అన్ని బహుకణ జీవుల లోనూ ఉండి ఉండవచ్చు. మెదడు లేని ఆల్గే, బాక్టీరియా వంటి వాటిలోనూ ఉండి ఉండవచ్చు. అనేక జీవులు నాడీవ్యవస్థ అవసరం లేకుండానే సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించుకుంటూ మేధస్సుతో మనుగడ సాగిస్తూ ఉండవచ్చు.
సేథ్ లియ్యోడ్ (Seth Lloyd) క్వాంటమ్ కంప్యూటింగ్ నిష్ణాతుడు. ఆయనను కూడా ఈ పరిశోధన/అధ్యయన ఫలితాలు అపరిమితమైన ఆశ్చర్యానికి, సంభ్రమానికి గురిచేశాయి.
ఈ తరహా బయోకంప్యూటింగ్ స్థిరమైన, మన్నికైన, సమర్థవంతమైన పరికరాలను రూపొందించడానికి దారితీయవచ్చననీ; ప్రకృతినే స్పూర్తిగా తీసుకుని చిరకాలం మన్నే సాంకేతికతలను రూపొందించే దిశగా పరిశోధనలు సాగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏది ఏమైనా శాస్త్ర సాంకేతిక రంగాలు ఎన్ని అద్భుతాలకు తెర తీయనున్నాయో కాలమే చెప్పాలి.