[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసపరంపర..]
అధ్యాయం1 సంగీత మహత్మ్యము
శ్రీ శారదాంబ తన విపంచీ వీణచే పార్వతిని అలరించి యుండుట విదితమే. నారద గురుస్వామి తన ‘మహతి’ అను వీణను వాయించుట విదితము. తుంబురుడు తన గానము చేత దేవతలను అలరించుట లోకవిదితము. పరమశివుడైన నటరాజు నాట్యమొనర్చుట ప్రసిద్ధమే. విష్ణుని వీణ (సారంగి), రుద్రుని వీణ – రుద్రవీణ గంధర్వుల గానమున ప్రసిద్ధులు.
శ్లో.
శిశుర్వేత్తి పశుర్వేత్తి। వేత్తి గానరసం ఫణిః॥
శిశువైన కుమారస్వామి, పశువైన నందీశ్వరుడు, పరమేశ్వరుని కంఠమున భూషణములైన సర్పములు పరమేశ్వరుని గానమున రమించుచున్నవి.
ఉయ్యాల యందు గల బాలబాలికలు, సంగీతమునకు ఆనందించుచున్నారు. కిరాతుని సంగీతమునకు అలరి పశుపక్ష్యాదులు మైమరిచి కిరాతుని వలలో చిక్కుకొని ప్రాణములను త్యజించుటకై సిద్ధమగుచున్నవి. సంగీతము మనశ్శాంతిని కల్గించును. యుద్ధ సమయమునందు సైనికులు సంగీతమునకు ధైర్య శౌర్యవంతులగుచున్నారు.
సంగీతము, భాష, ప్రాంతము, దేశము మొదలగు పరిమితులు లేక సకల జన ప్రియమైనది. సంగీతము మాటలు అక్కరలేని ప్రపంచ భాష.
సకల సాహిత్య భావార్థములకు అతీతమై ఆధ్యాత్మికమైనది సంగీతము.
మహాభక్తులు, మహా వాగ్గేయకారులైన పురంధర దాసు, భద్రాచల రామదాసు, తులసీదాసు, సూరదాసు, భక్త మీరాబాయి, తుకారాం, త్యాగరాజు, నారాయణ తీర్థులు, సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి, జయదేవుడు, దీక్షితార్, శ్యామశాస్త్రి మొదలగు మహా భక్త వాగ్గేయకారులు తమ భక్తి జ్ఞాన వైరాగ్య పూరిత గానముతో భగవంతుని ప్రసన్నుని చేసుకొని తరించి చరితార్థులగుట జగత్ప్రసిద్ధమే.
సంగీతం వలన ఆనందముతో గోవులు అధికంగా క్షీరములను ప్రసాదించుట, పంట చేలు అధికంగా దిగుబడి వచ్చుట శాస్త్రజ్ఞులు కనుగొని ఆచరణయందు ప్రయోగించుకున్నారు.
మానవుల మానసిక ఒత్తిడిని సంగీతము వలన సరిచేయ వచ్చునన్న విషయము ప్రయోగం వలన ధ్రువపడినది. తోడి రాగము కలవరపడుతున్న మనస్సుకు శాంతిని ప్రసాదించును. కల్యాణి రాగము మనోస్తబ్ధతను పోగొట్టి ఉత్సాహమును, చురుకుతనమును కల్గించును. శమన రాగము, సావేరి, దయా స్వభావము పెంపొందించును. మోహన, హంస ధ్వని ధైర్యమును, శౌర్యమును ఒసగును.
(ఇంకా ఉంది)
డా. సి. ఉమా ప్రసాద్ గారు పుట్టింది, పెరిగింది రాజమండ్రి. వారి స్థిర నివాసం హైదరాబాద్. తల్లి తండ్రులు – కీ.శే: M.V. రంగా చార్యులు, M. ప్రమీలా దేవి. అత్తామామలు: కీ. శే.డా. సి. ఆనందా రామం, శ్రీ రామా చార్యులు.
భర్త: సి. బదరీ ప్రసాద్(రిటైర్డ్ సీనియర్ మేనేజర్ ఆంధ్రా బ్యాంక్). ఉమా ప్రసాద్ ఉపాధ్యాయురాలిగా (M A ఎకనామిక్స్ ఆంధ్రా యూనివర్సిటీ) పని చేశారు. వారి ప్రవృత్తి సంగీతాభిలాష (పిహెచ్డి ఇన్ మ్యూజిక్ పద్మావతి మహిళా యూనివర్సిటీ).
భావ కవితలు, స్వీయ సంగీత రచన, రాగల కూర్పు, పుస్తక పఠనం వారి అలవాట్లు. వివిధ సంగీత పత్రికలలో- సంగీత రచన వ్యాసాలు మరియు కవిత్వ ప్రచురణాలు, లక్ష గళార్చన ప్రశంసా పత్రం, తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో కవిత్వ ప్రచురణ పురస్కారాలు.
గురువులు: విజయవాడ సంగీత కళాశాలలోని అధ్యాపకులైన అందరి గురువులు, శ్రీమతి రేవతి రత్న స్వామి గారు మొట్టమొదటి గురువు- తదనంతరం పెమ్మరాజు సూర్యారావు గారు, MV రమణ మూర్తిగారు, కిట్టప్పగారు, అన్నవరపు రామస్వామి గారు, డా. నూకల చిన సత్యనారాయణ గారు. తదితరుల ఆశీస్సులతో సంగీతంలో ఓనమాలు దిద్దుకొని సంగీతంలో పిహెచ్డి పట్టా పొందారు. “మహా సముద్రంలో ఒక నీటి బిందువు నా సంగీత -కృషి” అంటారు.
మధుర గీతికలు (రెండు భాగాలు), రస గాన లహరి, స్వర అమృతవాహిని, హనుమ కీర్తనల సమాహరం, చైతన్య భావ కవితామాలికలు, రాగరంజని (రెండు భాగాలు), భావ-రాగ-లహరి (రెండు భాగాలు), కవితామృతఝరి అక్షర తరంగిణి, అపురూప-అపూర్వ-రాగలహరి వంటి పుస్తకాలను వెలువరించారు.