[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘సమర్పణ భావం’ అనే రచనని అందిస్తున్నాము.]
భగవద్గీత 3వ అధ్యాయం, 9వ శ్లోకం
యజ్ఞార్థాత్కర్మణో న్యత్ర లోకోథ్యం కర్మబంధనః।
తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచార॥
ఓ అర్జునా, మనం చేసే ప్రతీ భౌతిక మానసిక కార్యాన్ని భాగవంతునికి సమర్పించే యజ్ఞంగా చేయాలి, లేకుంటే, ఆ పని లేదా కర్మ ఈ భౌతిక ప్రపంచంలో బంధనానికి కారణమవుతుంది. కాబట్టి భగవంతుని సంతృప్తి కోసం, ఫలితాల పట్ల మక్కువ లేకుండా, పవిత్రమైన చిత్తశుద్ధితో, ప్రసాద భావంతో నీకు నిర్దేశించిన విధులను నిర్వర్తించు అని పై శ్లోకం భావం.
భగవంతుడు అర్జునుడిని నిమిత్తమాత్రంగా చేసుకొని మన జీవన యాత్రలో కర్మలను ఎలా చేయాలో పై శ్లోకం ద్వారా చక్కగా వివరించాడు.
దేహపోషణ కోసం చేసే సాధారణమైన కర్మలైనా, యాగ కర్మలైనా భగవంతునికి సమర్పణ భావంతోనే చేయాలి. యజ్ఞో వై విష్ణుః అన్నది శృతి వాక్యం. అంటే మానవులు తమకు విధింపబడిన కర్మలను చిత్తశుద్ధితో మరియు అచంచల భక్తి విశ్వాసాలతో చేస్తే జగద్ధోధారకుడైన విష్ణువును ప్రత్యక్షంగా ఆరాధించినట్లే అని అర్థం. అటువంటి కర్మలు చేసేటప్పుడు మానవుడు ముక్తస్ధితి యందే నిలిచి వుంటాడు. అయితే ఇట్టి స్థితి యందు నిలిచివుండడానికి ఒక సద్గురువు మార్గదర్శనం అవసరం ఎంతో వుంది.
ఏ పని కూడా ఇంద్రియ ప్ప్రీత్యర్ధం చేయకూడదని పతంజలి యోగసూత్రాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి పై శ్లోకాన్ని అనుసరించి అందరూ అన్ని కర్మలను భగవంతుని ప్రీతి కోసమే చేయాలి. శుభాశుభ కర్మలన్నీ ఫలాలను కలిగి వుంటే అవి కర్తను బంధించి వేస్తాయి. ఈ కర్మ బంధనాలే జనన మరణ చక్రభ్రమణానికి కారణభూతులై వున్నాయి. నిర్మల చిత్తుడైన అనంతమైన పరబ్రహ్మను కొలవడానికి మనము ధనవంతులు, రాజాధిరాజులు, మహా పండితులు కానక్కర్లేదు. మనకు ఆర్థిక శక్తి లేనందున పెద్ద పెద్ద నైవేద్యములను భగవంతునికి సమర్పించుకోలేకపోయామని ఎవరు దిగులు పడవలసిన అవసరం లేదు. భక్తితో సమర్పించినప్పుడు సామాన్యమైన వస్తువు కూడా అద్భుతమైన నైవేద్యం అవుతుంది. భగవంతుని ఆకర్షించేది శుద్ధమైన భక్తి, నిర్మలమైన హృదయం. భక్తితో ఆకు కాని, పువ్వుకాని, పండు కాని, ఆఖరికి జలమును కాని సమర్పించినప్పుడు కరుణామయులైన భగవానులు ఆనందంతో స్వీకరించగలరు అని మరొక శ్లోకంలో స్వయంగా భగవానుడే స్పష్టం చేసాడు. కాబట్టి భగవంతుని చేరుకునేందుకు సులభమైన మార్గం సమర్పణ భావం మాత్రమే.
అర్జునుడు తనకు కృష్ణుడు కలిగించిన జ్ఞానంతో అతనికి పూర్ణంగా ఆత్మనివేదన చేసుకున్నాడు. కనుక, కృష్ణుడు వెంట ఉండి భక్తునికి తాను సారథ్యం వహించి, అతనిని ఉత్తమునిగా తీర్చిదిద్దాడు. భగవంతుడే సారథ్యం వహించి, భక్తుని కర్మను పరిపక్వం చేసి తనలోకి చేర్చుకున్నాడు. మనం కూడా ప్రతీ క్షణం మనలను నడుపుతున్నవాడు భగవంతుడనే భావనతో నిరంతర జపం, సాధనతో మమేకం కాగలిగితే, చేసే ప్రతీ కర్మ సమర్పణ భావంతో చేయగలిగితే మనకూ ఆనందామృతాన్ని తప్పక ఇస్తాడు.