[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘సద్గుణ సంపన్నత’ అనే రచనని అందిస్తున్నాము.]
భగవద్గీత 16వ అధ్యాయం (దైవాసుర సంపద్విభాగ యోగము) 1- 3 శ్లోకాలు ఈ విధంగా వున్నాయి.
శ్రీభగవానువాచ:
అభయం సత్వసంశుద్ధిర్జ్ఞానయోగవ్యవస్థిః ।
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం ॥
అహింసా సత్యమక్రోధస్త్యాగః శాంతిరపైశునమ్।
దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం ॥
తేజః క్షమా ధృతిః శౌచమద్రోహోనాతిమానిత ।
భవంతి సంపద దైవీమభిజాతస్య భారతత ॥
ఓ అర్జునా, దివ్య స్వభావం కలిగిన వారిలో ఉండే సధుణాలు ఈ విధంగా వున్నాయి:
నిర్భయత, మనస్సు స్వచ్ఛత, ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరత, దానం, ఇంద్రియ నిగ్రహం, త్యాగభావన, పవిత్ర గ్రంథాల అధ్యయనం, తపస్సు మరియు నిజాయితీ.
అహింస, సత్యవచనం, కోప రాహిత్యం, శాంతస్వభావం, తప్పులను వెతకకుండా నిగ్రహం, సమస్త జీవులపై కరుణ, అసూయా రాహిత్యం, సౌమ్యత, వినయం, చంచలత్వం లేమి, తేజస్సు, క్షమాశీలత, ధైర్యం, పరిశుభ్రత, ద్వేషభావన లేకపోవడం, అహంకార రాహిత్యం. ఎవరికైతే ఈ సద్గునాలలో కొన్ని లేదా అధికం వున్నవారిని భగవంతుడు అనుక్షణం ప్రేమిస్తూ, వారి వెన్నంటే వుండి వారిని ఎల్లవేళలా రక్షిస్తుంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ గుణాలు వ్యక్తికి మానసిక శాంతిని, సమాజంలో గౌరవాన్ని తీసుకువస్తాయి. సద్గుణాలు ఉన్నవారు మాత్రమే నిస్వార్థంగా ఆచరిస్తారు, ఇతరుల శ్రేయస్సు కోరుతారు. పిల్లలలో చిన్ననాటే వీటిని అలవరచడం అవసరం. సద్గుణాల ద్వారా జీవితం సార్థకంగా మారుతుంది. ఇవి వృద్ధి చెందడానికి దైవభక్తి, మంచి సాహచర్యం, ఆత్మపరిశీలన అవసరం. నిజమైన విజయం గుణవంతుడైన జీవనంలోనే ఉంటుంది.
రామాయణంలోని ప్రతి కీలక ఘట్టంలో శ్రీరాముని మర్యాద గుణం స్పష్టంగా కనబడుతుంది. పడవ దాటించిన గుహుని అభిమానంతో, ఎంగిలిపళ్లను సమర్పించిన శబరిని ఆదరించి, ప్రాణత్యాగం చేసిన జటాయువును గౌరవించి, చిన్న ఉడుత సహాయాన్ని కూడా విలువైనదిగా చూసి, శరణు కోరిన విభీషణునిని రక్షించి, మొదటి రోజు యుద్ధంలో నిరాయుధుడైన రావణున్ని వదిలేయడం ఇవన్నీ శ్రీరాముని ఉన్నత గుణస్వభావానికి నిదర్శనాలు. అలాంటి ఉదాత్తమైన వైఖరితో ఆయన సమస్త జీవులకు ఆదర్శంగా నిలిచాడు. అందుకే ఆయన చరిత్ర యుగయుగాలకూ ప్రేరణగా నిలిచింది.
ఈ సమాజం సదా సుభిక్షంగా, ఆనందోత్సాహాలతో వెల్లివెరియాలంటే ప్రతి వ్యక్తి సద్గుణ సంపన్నుడిగా మారడం అత్యవసరం. అహింస, సత్యం, వినయం, దయ, క్షమ, సహనం వంటి గుణాలు వ్యక్తిత్వాన్ని వికాసింపజేస్తాయి. సమాజంలో పరస్పర గౌరవం, సహకారం పెరగాలంటే ఇవి నిత్యం ప్రవర్తనలో ఉండాలి. ఈ సద్గుణాలు వ్యక్తిలో తలెత్తాలంటే చిన్ననాటి నుంచే పిల్లలకు వాటి విలువను నేర్పాలి. మంచి చదువు కన్నా మంచితనాన్ని నేర్పడం ముఖ్యం. చిన్నపిల్లల మానసిక వికాసంలో కుటుంబం, గురువులు కీలక పాత్ర పోషించాలి. మంచి ఆదర్శాలు చూపుతూ, జీవితంలో సదాచారాన్ని ప్రతిష్ఠించడమే సమాజాన్ని శాంతియుతంగా తీర్చిదిద్దే మార్గం.