[శ్రీమతి గీతాంజలి రచించిన ‘రండి ఎవరైనా..!’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]
ఎవరైనా నాతో మాట్లాడండి..
నన్ను పలకరించండి!
నన్ను దగ్గరకు తీసుకొని
మీ హృదయానికి హత్తుకొండి!
నా కన్నీళ్లు తుడవండి..
నా నుదుటిపై ముద్దు పెట్టుకోండి!
ఈ ఎడారిలోంచి తీసి
నన్ను పచ్చికలో వేసేయండి.
నన్ను సముద్రం వైపో..
తోట వైపో తీసికెళ్లి వదిలేయండి!
పోనీ వెన్నెల కురిసే
ఆకాశంలో కి ఎగరేయండి..
నా కళ్ళల్లోకి కొన్ని
నక్షత్రాల్ని పోగేయండి.
గుండెల్లోకి చంద్రుణ్ణి దింపడి..
చిన్నప్పుడు అమ్మ తినిపించినట్లు
గోరుముద్దలు తినిపించండి.
జోల పాట పాడుతూ
నన్ను కమ్మగా మీ ఒళ్లో నిద్ర పుచ్చండి.
చూడండీ.. ఒంటరిగా ఉన్నాను
నన్ను వదిలేయకండి!
రండి ఎవరైనా..
శ్రీమతి గీతాంజలి (డా. భారతి దేశ్పాండే) వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్, మారిటల్ కౌన్సిలర్. కథా, నవలా రచయిత్రి. కవయిత్రి. అనువాదకురాలు. వ్యాస రచయిత్రి. ‘ఆమె అడవిని జయించింది’, ‘పాదముద్రలు’. లక్ష్మి (నవలిక). ‘బచ్చేదాని’ (కథా సంకలనం), ‘పహెచాన్’ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ (కథలు), ‘హస్బెండ్ స్టిచ్’ (స్త్రీల విషాద లైంగిక గాథలు) ‘అరణ్య స్వప్నం’ అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఈ మోహన్రావున్నాడు చూడండీ..! (కథా సంపుటి)’ త్వరలో రానున్నది. ఫోన్: 8897791964