[శ్రీ ముకుంద రామారావు గారి ‘రాత్రి వీస్తున్న గాలి’ అనే కవితా సంపుటిని పరిచయం చేస్తున్నారు డా. కాళిదాసు పురుషోత్తం.]
సహృదయ కవిమిత్రులు శ్రీ ముకుంద రామారావు గారి కవితా సంకలనాలన్నీ ఇష్టంగా చదివాను. అనువాద కవితలు, స్వీయ కవితలు అన్నీ చదివాను. చాలా సీదాసాదా పదాల తోనే ఎంతో గంభీరమైన భావాల్ని కవితల్లో పలికిస్తారు. వారు ప్రకృతి ప్రేమికులు, ప్రకృతిలో ప్రతి చిన్న మార్పు వారికి కవితా వస్తువే. ఈ కవితలన్నిటి వెనక, మానవుల పట్ల, జంతువుల పట్ల, చెట్టు చేమలు పట్ల అపారమైన ప్రేమ.. ఇష్టం.
ఈ సంపుటికి ‘రాత్రి వీస్తున్న గాలి’ అనే కవిత పేరే పెట్టారు. ఎనభమ్యో పడిలో ప్రవేశించినా కవిగారు నిరంతరం ప్రకృతిని గమనిస్తూనే ఉంటారు. తనలో వయసు తెచ్చిన మార్పులు, దృక్పథంలో వచ్చిన పరిణతి ఈ కవితల్లో పొదిగారు.
~
రాత్రి వీస్తున్న గాలి..
చెట్లను కోల్పోయిన ఆకులు
తానొచ్చిన అడవికి దూరమైన బొగ్గు
……
శరీరమంతా రక్తం..
~
‘ప్రతి పదమూ చివరి పదమేనేమో!’ అన్న ఆర్తి ఈ కవితల్లో ధ్వనిస్తుంది.
120 పుటల పుస్తకంలో 51 కవితలు.
ఇక్కడ ఏ కవితను ఉదహరించను? ఎంపిక చేద్దామన్నా, ప్రతి కవిత మనోహరంగా అనిపించింది.
~
‘అనుభూతి అనుభవం’ కవితలో వర్షపు నీటి బిందువులను – “కిటికీ మీద/కన్నీరులా కారుతున్న/చినుకులు” అంటారు.
మలి సంధ్యలో విస్మృతిలోకి జారుతున్న స్మృతులను “పలక మీద/చెరిపివేయబడ్డ అక్షరాల్లా/గుర్తుకు తెచ్చుకోలేని/జ్ఞాపకాలు” అని పోల్చుతారు.
మారుతున్న జీవన సరళిని “ఏ బల్లయితే నేమి/నిలబడి తినడం కూడా/అలవాటు అయిపోయాక అందరికీ” అని వ్యాఖ్యానిస్తారు.
‘వాలిపోతున్న నీడ’ కవిత వృద్ధాప్యంలో మెదిలే అనేక ఊహలను.. “ఎన్ని సూర్యుళ్ళను చూసినా/ఇవాళ్టి సూర్యుడు/రేపు నిజంగా కనిపిస్తాడా../
అతనికీ తెలుసు/తెలిసిన చిరునామాకయినా/ఎంత దూరం వెళ్ళాలో/చేరేవరకూ ఆరాటామేనని/” అని వ్యాఖ్యానించారు.
‘నీడలన్నీ’ కవితలో “ఎంత భారంగా వాలిపోతున్నాయో ఆ నీడలు/నేరుగా గోడల మీదో/ఇతర నీడలతో కలిసిపోయేందుకు” అంటారు.
ఊహలకు అందని అనుభవాల దృశ్యాలు!
‘వర్షాభినయం’ కవితలో మెరుపులు.. “మేఘాల మధ్య ప్రేమ/అందరికీ తెలుసేలా/తళతళా మెరుపులై/ఉరుములై ప్రకటిస్తాయి/…/నిరాశ్రయ మేఘాలు/ఎక్కడో ఎప్పుడో అలసిపోయి/జలజలా కన్నీరు కారుస్తాయి” అంటారు.
‘ఆగిపోని..’ కవితలో “ఎన్నెన్ని బరువులో అందరివీ/అన్నీ ఒకే సంచీలో/మోసుకు తిరుగుతున్నారు/ఎవరి కన్నీళ్ళు వారివే అయినా/కన్నీళ్ళలో తేడా లేనట్టే/అందరినీ తాకుతున్న బాధ” అంటారు.
ఆదివాసీల జీవన తత్వాన్ని ‘ఆదివాసీలు’ కవితలో ఎంత బాగా నిర్వచించారో చదవండి: “ఆకాశ నక్షత్రాల నిశబ్దం/ఏకాంత పర్వతాల గాఢ నిద్ర/వాగులూ వంకలూ/అడవులూ పక్షులే కదా/ఆదివాసీల చదువులు.”
జ్ఞాపకాలను ముకుంద రామారావు గారు కొండతో పోల్చి, “లోపల జ్ఞాపకాల కొండ/పెరుగుతూ తరుగుతూ/నా దారినే కొనసాగుతోంది/ఎప్పటినుండో ఏమో” అంటారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, వృద్ధులకు వీపు మీద కళ్లుంటాయన్న మాటలు ఈ చరణాలు చదువుతున్నాప్పుడు గుర్తొస్తాయి.
‘కలల వ్యాకరణం’ కవితలో, “ఎన్ని భాషలొచ్చినా/కలల భాష వేరుగా లేదు/ఎప్పుడూ ఒకటే భాష/మనుషులు వేరు వేరైనా కనే స్వప్నాలన్నీ ఒకటే” అంటారు.
‘ఆశ చావదు’ కవితలో, “కూకటి వేళ్ళతో/పెకలించబడుతున్నా/కొంత కాలమయినా/బతికున్న చెట్లు/మనుషులు” అంటారు. కొట్టిపడేసిన చెట్ల మానులు చిగురించే దృశ్యం ఈ చరణాలు చదువుతున్నపుడు నా మనసులో తోచింది.
“చీకటి భయమే లేని విత్తనం/అన్ని చీకట్లనూ చీల్చుకొని/తల పైకెత్తి/ఆకాశాన్ని అందుకోవాలని/చూస్తూనే ఉంటుంది/నిశ్శబ్దంగా/../మొలకెత్తే విత్తనం/ఏమడిగినా ప్రశ్నలానే ఉంటుంది” అంటారు. ఎంత నిశితమైన చూపో!
‘రైలు’ కవితలో, రైలు ప్రయాణంలోకిటికీ నుంచి దృశ్యాలు చూస్తూ, “వెలుగు చీకట్ల మధ్య పయనిస్తూ/ బయట ఆకాశాన్ని, పొలాల్ని, వాగుల్ని,/నన్నూ, సముద్రాల్ని/ఇళ్లను, భవనాల్ని,/గుళ్ళను గోపురాల్ని,/బయట ఉన్న సమస్తాన్నీ/తెరచి ఉంచిన కిటికీ చూపిస్తూనే ఉంది” అంటారు.
నా వరకూ, ఎక్కడో సుదూర ప్రదేశానికి రైలు ప్రయాణం చేస్తూ, సంజెవేళ ఇళ్ళల్లో వెలిగించిన దీపాలు, పిల్లలు, స్త్రీలు పంచల్లో కూర్చుని ఉండడం వంటి దృశ్యాలు చూడగానే చాలా దిగులు.. ఎందుకీ ప్రయాణం? వెనక్కి వెళ్ళిపోతే అని క్షణకాలం అనిపించేది.
‘శాండియాగో’ కవితలో “రోజూ సూర్యుడు ఎక్కడికి పోతుంటాడని/అడుగుతాడు మనుమడు/నీకూ నాకూ తాతలకు తాతే అతను/చూసుకుందుకు మనకు ఒక ఇల్లే/అతనికి ఎన్ని ఇళ్ళో/నువ్వు లేచేసరికి వచ్చేస్తాడు కదా/ అని సర్ది చెబుతాను” అంటూ బాల్యంలోని అమాయకత్వాన్ని రూపు కట్టిస్తారు.
‘జాలరి’ కవితలో “ఇంటిలో మగవారిని/యుద్ధానికి పంపుతున్నట్లు/ సన్నద్ధం చేసి పంపుతుంది/” అంటారు. ఆ తల్లి మనసును ఎంత సున్నితంగా చిత్రించారో ఈ కవితలో!
~
ఇట్లా రాస్తూ పోతే ‘రాత్రి వీస్తున్న గాలి’ సంపుటిలోని ప్రతి కవితనూ పరిచయం చేయలనే లౌల్యం నన్ను ఆవహిస్తుంది!
లేదు, ఇంత గొప్ప కవిత్వాన్ని ఎవరికి వారే చదువుకొని పలవరించాలి.
***
రచన: వై. ముకుంద రామారావు
ప్రచురణ: బోధి ప్రచురణలు, హైదరాబాద్.
పేజీలు: 118
వెల: ₹ 150/-
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, హైదరాబాదు.
ఫోన్: 92474 71362
ఆన్లైన్లో:
https://www.amazon.in/Raatri-Veestunna-Gaali-Mukunda-Rama/dp/B0DNSSCRJC
డా. కాళిదాసు పురుషోత్తం గారిది ప్రకాశం జిల్లా తూమాడు అగ్రహారం. వీరి తండ్రిగారు గొప్ప సంస్కృత పండితులు. నెల్లూరులో స్థిరపడ్డారు. జననం 1942 మే. ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య. పెద్దక్క, రచయిత మిగిలారు. పెద్దక్క 97వ ఏట ఏడాది క్రితం స్వర్గస్తులయ్యారు.
రచయిత బాల్యంలో నాయనగారి వద్ద సంస్కృతం కొద్దిగా చదువుకున్నారు. నెల్లూరు వి.ఆర్.హైస్కూలు, కాలజీలో విద్యాభ్యాసం, యం.ఏ. తెలుగు ఉస్మానియాలో ఫస్ట్ క్లాసులో, యూనివర్సిటీ ఫస్ట్ గానిలిచి, గురజాడ అప్పారావు స్వర్ణ పురస్కారం ఆందుకున్నారు. హైదరాబాద్, స్టేట్ ఆర్కైవ్సు వారి జాతీస్థాయి స్కాలర్షిప్ అందుకొని వెంకటగిరి సంస్థాన సాహిత్యం మీద పరిశోధించి 1971 సెప్టెంబర్లో డాక్టరేట్ అందుకున్నారు. 1972లో నెల్లూరులో శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాలలో చేరి, ఆ కళాశాల ప్రిన్సిపల్గా రిటైరై నెల్లూరులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఫొటోగ్రఫీ, సినిమాలు, పర్యటనలు ఇష్టం. 15 సంవత్సరాలు మిత్రులతో కలిసి కెమెరా క్లబ్, ఫిల్మ్ సొసైటీ ఉద్యమం, దాదాపు పుష్కరకాలం నడిపారు. సాహిత్యం, సినిమా, యాత్రానుభవాలు వ్యాసాలు భారతినుంచి అన్ని పత్రికలలో అచ్చయ్యాయి.
2007లో దంపూరు నరసయ్య – ఇంగ్లీషు లో తొలి తెలుగు వాడిమీద పరిశోధించి పుస్తకం. 1988లో గోపినాథుని వెంకయ్య శాస్త్రి జీవితం, సాహిత్యం టిటిడి వారి సహకారంతో. డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్ గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాచ్య పరిశోధన శాఖ వారికోసం పూండ్ల రమకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి సంపుటాలనుంచి మూడువందల పుటల “అలనాటి సాహిత్యం” గ్రంథానికి సంపాదకత్వం, 2011లో కనకపుష్యరాగం పొణకా కనకమ్మ స్వీయచరిత్ర ప్రచురణ. మనసు ఫౌండేషన్ సహకారంతో AP Sate Archives లో భద్రపరచిన గురజాడ వారి రికార్డు పరిశీలించి స్వర్గీయ పెన్నేపల్లి గోపాలకృష్ణ, మనసు రాయుడు గారితో కలిసి “గురజాడ లభ్య సమగ్ర రచనలసంకలనం” వెలువరించారు. మనసు ఫౌండేషన్ వారి జాషువ సమగ్ర రచనల సంకలనంకోసం పనిచేశారు. 2014లో “వెంటగిరి సంస్థాన చరిత్ర సాహిత్యం” గ్రంథ ప్రచురణ.
2021లో పెన్నేపల్లి గోపాలకృష్ణతో కలిసి అనువదించిన”letters from Madras During the years 1836-39″ గ్రంథం ‘ఆమె లేఖలు’ పేరుతో అనువాదం. (ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్-ఎమెస్కో సంయుక్త ప్రచురణ).
పూండ్ల రామకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి ఆనాటి సాహిత్య దృక్పథాలు మీద మాచవోలు శివరామప్రసాద్, అల్లం రాజయ్య నవలలు, కథలు మీద కుమారి ఉభయ భారతి పిహెచ్.డి పరిశోధనలకు పర్యవేక్షణ. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సంస్థాపక సభ్యులు, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సభ్యత్వం.